కాంగ్రెస్‌ ‘నగ్న’ రాజకీయాలు చేయాల్సిన పనేంటి? ప్రధాని మోదీ | PM Modi Slams Congress Shirtless Protest At India Ai Impact Summit In New Delhi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ‘నగ్న’ రాజకీయాలు చేయాల్సిన పనేంటి? ప్రధాని మోదీ

Feb 22 2026 4:01 PM | Updated on Feb 22 2026 4:52 PM

PM Modi Slams Congress Shirtless Protest At India Ai Impact Summit In New Delhi

లక్నో: ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ నగ్న రాజకీయాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ఇప్పటికే నగ్నంగా ఉందనే విషయం​ దేశ ప్రజలకు తెలుసు. మరీ దుస్తులు తీసివేయాల్సిన అవసరం ఏముంది?అని ప్రశ్నించారు.

ఆదివారం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో 82 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మేట్రో సేవల్ని ప్రారంభించారు. అనంతరం, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ జరిగింది. ఆ సమ్మిట్‌లో భారత్‌-ఆమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ భారత యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు (ఐవైసీ) చొక్కాలు విప్పి ఆందోళన చేపట్టారు. 

వారి ఆందోళనపై మీరట్‌ సభలో మోదీ ప్రస్తావించారు. ‘ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ మురికి, నగ్న రాజకీయాలు చేసింది. సైద్ధాంతికంగా దివాలా తీసిన పార్టీ కాంగ్రెస్‌. దేశంలోని పురాతన పార్టీ సైద్ధాంతికంగా ఎంత దివాలా తీసిందో ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ నాయకులు చేసిన పనే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ తన సొంత దేశాన్ని కించపరచడంలో బిజీగా ఉంది. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు దేశం విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్‌ దేశంలో జరగడం మనం ఇప్పుడే చూశాము. కానీ కాంగ్రెస్ ఏం చేసింది. దేశం కోసం నిర్వహించిన ప్రపంచ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన మురికి, నగ్న రాజకీయాలకు వేదికగా మార్చింది. 

కాంగ్రెస్ నాయకులు నన్ను ద్వేషిస్తారు. నా తల్లిని అవమానించడానికి కూడా వెనుకాడరు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ బీజేపీ కార్యక్రమం కాదు. ఆ కార్యక్రమం జరిగే సమయంలో బీజేపీ నాయకులు ఎవరూ అక్కడ లేరని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ఇది దేశం నిర్వహిస్తున్న కార్యక్రమం. కానీ ఆ రోజు కాంగ్రెస్ మర్యాదను ఉల్లంఘించింది. కాంగ్రెస్ అవినీతి విధానాన్ని దేశం మొత్తం ఖండిస్తోంది’అని వ్యాఖ్యానించారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement