జైపూర్: కాసేపట్లో వివాహ వేడుక.. ఇళ్లంతా సందడిగా కుటుంబ సభ్యులు, బంధువులతో కలకలలాడుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేయడంతో అక్కడంతా సందడి నెలకొంది. ఇంతలో పెద్దగా ఏడుస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీశారు. కట్ చేస్తూ.. వివాహం చేసుకోవాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లులు జరగాల్సిన ఇంట్లో.. ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామానికి చెందిన శోభ (25), విమ్ల (23) ఇద్దరూ అక్కాచెల్లళ్లకు కుటుంబ సభ్యులు ఒకేరోజు వివాహం చేసేలా ముహుర్తం పెట్టారు. శనివారం ఇద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి వేడుకలు, సంప్రదాయ ‘బంధోలి’ కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. అయితే, శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
అయితే, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను ఇంటికి తెచ్చి, పోలీసులకు చెప్పకుండానే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధితుల మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించడంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఈ సందర్బంగా జస్వంత్ సింగ్ మాట్లాడుతూ.. వారిద్దరిదీ ఆత్మహత్యేనని ఆరోపించారు. బాధితుల తండ్రి, సోదరులు (బాబాయిలు) ఈ పెళ్లి విషయంలో వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని అన్నారు. మొదట కుదిరిన పెళ్లి సంబంధాలను రద్దు చేసి, బాబాయిల ఒత్తిడి మేరకు పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో వారికి పెళ్లి నిశ్చయించారని, ఈ బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు.
అనంతరం, పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాథమిక దర్యాప్తులో పురుగుల మందు తాగినట్లు ఆధారాలు లభించాయి. అయితే, ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని, కుటుంబ సభ్యులందరినీ విచారిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా తెలిపారు. కాగా, వీరిద్దరూ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు.


