సాక్షి, వికారాబాద్: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి? అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమర్జెన్పీ రోజులు ప్రారంభమయ్యాయని.. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధకావాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకోండి. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం దుర్మార్గం. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషం. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే. ఆత్మ రక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గు చేటు.
..బాన్సువాడలో 70 మందిని అరెస్ట్ చేయడం అక్రమం. రాళ్ల దాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్యలేవి?. బాన్సువాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయం. ఎంఐఎంను కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’’ అంటూ బండి సంజయ్ ఆరోపించారు.


