కరెంటు పనికి వచ్చి.. యువతిపై కన్నేసి.. | Electrician Woman Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

కరెంటు పనికి వచ్చి.. యువతిపై కన్నేసి..

Feb 22 2026 7:13 AM | Updated on Feb 22 2026 7:13 AM

Electrician Woman Incident In Hyderabad

మభ్యపెట్టి రూ.4 లక్షలు కాజేసిన యువకుడి రిమాండ్‌  

హైదరాబాద్: కరెంటు పని కోసం వచ్చిన ఓ ఎల్రక్టీషియన్‌ ఇంటి యజమాని కూతురిని ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘటనలో బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–14లోని ఓ బస్తీలో నివసించే యువతి(24) తమ ఇంట్లో కరెంటు పనులు, విద్యుద్దీపాల అలంకరణ కోసం ఎలక్రీషియన్‌ కొమ్ము వంశీకృష్ణ(20)ని సంప్రదించింది. కరెంటు పనులు చేసిన మరునాడు వంశీకృష్ణ ఆ యువతిని ఇన్‌స్టాలో హాయ్‌ అంటూ పలకరించాడు. 

ఇద్దరి మధ్య చాటింగ్‌ మొదలైంది. తనకు డబ్బులు అవసరం ఉన్నాయంటూ వంశీకృష్ణ ప్రారంభంలో రూ.20 వేల వరకు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను విడతలవారీగా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ మరో రూ.2 లక్షలు కాజేశాడు. కొద్దిరోజుల తర్వాత మరో రూ.2 లక్షలు విడతలవారీగా తీసుకున్నాడు. పదే పదే డబ్బులు అడుగుతుండటంతో కొంతకాలంగా దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న వంశీకృష్ణ ఆమె కార్యాలయానికి వెళ్లే క్రమంలో రాకపోకలపై దృష్టిపెట్టి అడ్డగిస్తున్నాడు. 

మూడు రోజుల క్రితం బస్తీలో ఆటో కోసం ఎదురుచూస్తున్న ఆమెను అడ్డగించి కత్తితో బెదిరించగా భయంతో రూ.2 వేలు ఇచ్చింది. సదరు యువకుడితో తనకు ప్రాణహాని ఉందని, తాను బయట తిరగలేకపోతున్నానని, కార్యాలయానికి కూడా వెళ్లడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement