సూపరింటెండెంట్ కార్యాలయం సమీపంలో వెలుగులోకి..
దుర్వాసనతో అప్రమత్తమైన సిబ్బంది
మహారాణిపేట (విశాఖ): నగరంలోని కేజీహెచ్లో శనివారం నవజాత శిశువు మృతదేహం గోనె సంచిలో లభ్యమైంది. సూపరింటెండెంట్ కార్యాలయం సమీపంలోని లిఫ్ట్ పక్కన, భవనాల వెనుక భాగంలో ఈ మృతదేహం కనిపించడంతో ఆస్పత్రి వర్గాల్లో కలకలం రేగింది. కొద్దిరోజులుగా అక్కడి నుంచి దుర్వాసన వస్తుండటంతో సిబ్బంది పరిశీలించగా, గోనె సంచిలో కుళ్లిన స్థితిలో శిశువు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలోని పిల్లల విభాగం, ప్రసూతి వార్డుల్లో ఈనెల 12 నుంచి జన్మించిన శిశువుల వివరాలు, మరణాల వివరాలను సేకరిస్తున్నారు. ఈనెల 12 తరువాత వివిధ అనారోగ్య కారణాలతో మృతిచెందిన ఎనిమిది మంది శిశువుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, లభ్యమైన ఈ శిశువు మృతదేహం ఎప్పటినుంచి అక్కడ ఉందనే విషయంపై వైద్య సిబ్బంది, పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వన్టౌన్ పోలీస్స్టేషన్ సీఐ పూడి వరప్రసాద్ తెలిపారు. ఆస్పత్రిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.


