ఎన్నికల్లో పారదర్శకతకు పాతర! | Parakala Prabhakar comments on EVM Voting | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో పారదర్శకతకు పాతర!

Feb 22 2026 4:49 AM | Updated on Feb 22 2026 4:49 AM

Parakala Prabhakar comments on EVM Voting

ఏపీలో అర్ధరాత్రి నుంచి నిమిషానికి మూడు ఓట్లు

ఓట్లు ఎవరికి పడ్డాయో తెలీడంలేదు

హిందూయేతరుల పౌరసత్వాన్ని చంపడమే ఎస్‌ఐఆర్‌

ప్రజలు మేల్కోకపోతే ముప్పు తప్పదు

రాజకీయ, సామాజిక, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్‌

సాక్షి ప్రతినిధి కడప: ఎన్నికల్లో పారదర్శకతకు పాతర వేశారని రాజకీయ, సామాజిక, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్‌ ఆరోపించారు. 2024 సార్వ­త్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి 11.45 గంటల నుంచి నిమిషానికి మూడుచొప్పున ఓట్లు పడ్డాయని, అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్‌ కొనసాగిందన్నారు. ప్రజలు తాము వేద్దామను­కున్న వారికే తమ ఓట్లు పడ్డాయో లేదో తెలీడంలేదన్నారు. ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఎన్ని పడ్డా­యో, ఓట్ల లెక్కింపు ఎలా జరిగిందో ఏవీ తెలీడంలేదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. విజేత­లను ప్రకటించిన రెండ్రోజుల తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయో ప్రకటించడాన్ని బట్టి చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెమ్మ­దిగా కూలుస్తు­న్నా­రన్న విషయం అర్ధమవుతోందన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు ప్రశ్నించి నిలదీయాలని పరకాల కోరారు.

‘కూలిపోతున్న ప్రజాస్వామ్యం–చెదిరిపోతున్న స్వప్నం’ అనే అంశంపై కడప సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన మాటా­మంతీ కార్యక్రమంలో పరకాల ప్రభాకర్‌ ప్రసంగించారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను ప్రమాదపూరిత చర్యగా అభివర్ణించారు. హిందూ­యేతరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకే ఆ ప్రక్రియను చేపడుతున్నారని విమర్శించారు. పౌరుడిని చంపకుండా పౌరసత్వాన్ని చంపడమే ఎస్‌ఐఆర్‌ అన్నారు. దేశాన్ని 600 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లేందుకే రాజ్యాంగాన్ని మార్చడం, ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల తొలగింపు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని పరకాల విమ­ర్శించారు. ప్రస్తుతం ప్రతీ విషయానికి మతాన్ని జోడిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరొచ్చుగానీ వచ్చే ఏడాది అనుమానమేనన్నారు. రానున్న రోజుల్లో జనగణమన ఉండదన్నారు. 

ఉచితంగా ఆహార ధాన్యాలు ఎందుకిస్తున్నారు?
దేశంలో ఉన్న యువ, మహిళ, శ్రామిక శక్తిని సద్వినియోగం చేసుకుంటేనే దేశం సర్వతో­ముఖా­భివృద్ధి చెందుతుందని పరకాల అభిప్రాయ­పడ్డారు. విశ్వగురు చెబుతున్నట్లు ఇంగ్లండ్, జపాన్‌లను దాటుకుని ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తే, దేశంలో 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఉచితంగా ఎందుకు పంపిణీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక అసమానతలు అత్యంత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటన్నారు. దేశంలో పది శాతం మంది చేతుల్లో 58 శాతం సంపద ఉండగా, 90 శాతం జనాభా చేతుల్లో కేవలం 42 శాతమే ఉందని వివరించారు. జి.గోపాల్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రాజా వెంగళరెడ్డి, íపిళ్లా కుమారస్వామిరెడ్డి మాట్లాడారు. సభికులు అడిగిన పలు ప్రశ్నలకు పరకాల ప్రభాకర్‌ సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement