అన్నమయ్య జిల్లా: రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.
‘ బడ్జెట్ కేటాయింపుల్లో మహిళలకు, నిరుద్యోగులకు కేటాయింపులు లేవు. 50 ఏళ్లు దాటిన వారికి ఒక్కరికీ పింఛన్ ఇవ్వడం లేదు. ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా అప్పులు మాత్రం చేస్తూ పోతున్నాడు. ప్రశ్నించేవారిపై దౌర్జన్యాలు చేస్తూ అరాచకపు పరిపాలన చేస్తున్నారు. దేవుడిపై కూడా రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు.
ఏడు కొండలు, లడ్డూ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి దిగజారిపోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో గురు శిష్యులిద్దరూ దొరికారు. శిష్యుడికి తెలంగాణలో మేలుచేయడం కోసం చంద్రబాబు రాయలసీమను తాకట్టుపెట్టారు. మార్చి 1 వ తేదీన రాయలసీమ సన్నాహక సమావేశం ఉంటుంది. చంద్రబాబు అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం’ అని స్పష్టం చేశారు.


