సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు సుప్రీంకోర్టు మీద కూడా నమ్మకం లేదని.. అందుకే ఒన్మెన్ కమిటీ వేసి, తనకు కావాల్సినట్టు రిపోర్టు తెచ్చుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లడ్డూపై విష ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలిలో చర్చకు టీడీపీ బ్యాచ్ భయపడుతోందని.. ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా జనానికి వాస్తవాలు తెలిసి పోయాయన్నారు
‘‘ప్రపంచ హిందూ భక్తుల ముందు చంద్రబాబు దోషిగా నిలబడ్డారు. లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. మండలిలో ఇందాపూర్ సంబంధంపై చర్చకు రమ్మంటే టీడీపీ పారిపోయింది. ఇందాపూర్ హెరిటేజ్ సంస్థది కావటం వల్లే టీడీపీ చర్చకు రాలేదు. ఈ విషయాన్ని మేము బయట పెట్టగానే దాన్ని కో-మ్యానిఫెక్చర్ కంపెనీగా మార్చారు. ఆ కంపెనీ కీలక ఉద్యోగిని ఎందుకు తొలగించారో చెప్పాలి. యావత్ ప్రపంచానికి చంద్రబాబు కుట్ర వైఖరి తెలిసిపోయింది’’ అని అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘తిరుమలలో రెండు కొండలేనంటూ వైఎస్సార్ మీద కూడా అభాండం వేశారు. చివరకు వాస్తవాలు ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సుప్రీంకోర్టు వేసిన సీబిఐ విచారణను కాదని మరో ఏకసభ్య కమిషన్ వేయటం ఏంటి?. తమకు కావాల్సిన రీతిలో సీబిఐ నివేదిక ఇవ్వలేదనే ఈ ఏకసభ్య కమిటీ వేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు ప్రభుత్వం నడుస్తోంది. ఏ వ్యవస్థ మీదా చంద్రబాబుకు నమ్మకం లేదు. హోంమంత్రి భాష అత్యంత దారుణం.
..మండలిలోని సీసీ కెమెరా విజువల్స్ ఎలా బయటకు వెళ్లాయి?. దీనిపై మేము ఛైర్మన్కు ఫిర్యాదు చేశాం. పోడియం దగ్గరకు వెళ్లేటప్పుడు మేము చెప్పులు విడిచి వెళ్లాం. కానీ మేము మా ఛైర్స్ దగ్గర ఉన్నప్పుడు వీడియో మాత్రమే ఎందుకు లీక్ చేశారు?. మొత్తం వీడియో ఎందుకు బయట పెట్టడం లేదు?’’ అంటూ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు.


