సాక్షి, అనంతపురం: ఏపీలో ఎన్నికల రోజున అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయని ప్రశ్నించారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రాష్ట్రవ్యాప్తంగా 30వేల టోకెన్లు మాత్రమే జారీ చేస్తే.. అర్ధరాత్రి ఆత్మలు, దెయ్యాలు వచ్చి ఓట్లు వేశాయా? అని ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు.
మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా పోల్ అవుతాయి?. వారంలో వీవీ పాట్లు కాల్చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వలేదు. అన్ని అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలి. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. 68 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తొలుత ప్రకటించారు. అర్ధరాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా వేల ఓట్లు నమోదు అయ్యాయి.
పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత ఏపీ లో 81.86 శాతం నమోదు అయినట్లు ప్రకటించారు. టీడీపీ కూటమి నేతలు అద్భుత విజయం అంటున్నారు. ఇది మోసపూరిత విజయం అని స్పష్టం అవుతోంది. అర్ధరాత్రి అన్ని ఓట్లు ఎవరు వేశారు?. గత సార్వత్రిక ఎన్నికల్లో దెయ్యాలు, ఆత్మలు ఓట్లు వేశాయా?. పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి ఎన్నికల అధికారులు టోకెన్లు జారీ చేస్తారు. ఏపీ వ్యాప్తంగా 30వేల టోకెన్లు మాత్రమే జారీ అయ్యాయి. మరి 50 లక్షల ఓట్లు ఎవరు వేశారో సమాధానం చెప్పాలి అని’ డిమాండ్ చేశారు.


