విజయవాడ: బెజవాడ రోడ్లను వీపీపీకి ఇచ్చేందుకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్(వీఎంసీ) నిరాకరించింది. విజయవాడ నగర పరిధిలోని రోడ్లను తామే అభివృద్ధి చేయాలని వీఎంసీ నిర్ణయించింది. ఈరోజు(శనివారం, ఫిబ్రవరి 21వ తేదీ) జరిగిన వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి వీఎంసీ షాకిచ్చినట్లయ్యింది.
దీనిలో భాగంగా విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘ 165 అంశాల పై చర్చించాం. విజయవాడలో 19 రోడ్లను పీపీపీకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కౌన్సిల్లో తిరస్కరించాం. వీఎంసీ పరిధిలో చాలా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. పీపీపీ మోడల్లో రోడ్లను ఒకే కాంట్రాక్టర్కు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా చేయడం వల్ల వీఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ నిర్వీర్యం అవుతుంది.
విజయవాడ అభివృద్ధి వీఎంసీ పరిధిలో జరగాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం వీఎంసీకి మెమో ఇవ్వడం దారుణం. వీఎంసీకి కొన్ని అధికారాలున్నాయ్. ప్రభుత్వం వీఎంసీకి ఇచ్చిన మెమోను కౌన్సిల్లో తిరస్కరించాం. నాడు నేడు స్కూల్స్కు ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ హయాంలో అనేక స్కూల్స్ బాగుచేశారు’ అని తెలిపారు.


