జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల విషయంలో అధికార పార్టీలో కొనసాగుతున్న రగడ.. హైవోల్టే పొలిటికల్ థ్రిల్లర్ను తలపించింది. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సంజయ్ వర్గానికే అధిక సీట్లు కేటాయించింది. దీంతో.. సీనియర్ నేత జీవన్రెడ్డి అలకబూనారు.
అధిష్టానం వద్ద జరిపిన లాబీయింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సక్సెస్ అయ్యారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో 62 మంది అభ్యర్థుల ఖరారు చేసింది. ఇందులో సంజయ్ వర్గానికి 36 (జగిత్యాలలో 30, రాయికల్లో 6), జీవన్రెడ్డి వర్గానికి 26 సీట్లు (జగిత్యాలలో 20, రాయికల్లో 6) కేటాయించింది. ఫ్లాష్ సర్వే, ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న సీఎం రేవంత్ మాటకే కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో.. ఎమ్మెల్యే సంజయ్ను బహిరంగంగానే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దూషిస్తున్నారు. తమకు బీఫామ్లు రాకుండా అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ నివాసం, ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో జగిత్యాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
అధిష్టానం వద్ద జరిపిన లాబీయింగ్లో సంజయ్ సక్సెస్ అయ్యారు. అయితే అధిష్టానం ఫార్ములాను జీవన్రెడ్డి రిజెక్ట్ చేస్తున్నారు. పంపకాల ప్రసక్తే లేదు.. కార్యకర్తలకే ప్రాధాన్యత అని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్లు వరుస ఫోన్కాల్స్తో ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
నన్ను, నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నా గొంతు కోశారు. నా కోసం కార్యకర్తలను పార్టీ బలి చేస్తోంది. నాకు వర్గమంటూ ఏదీ లేదు. పార్టీ జెండా మోసిన వారే నా వర్గం. క్రమశిక్షణ పేరుతో కట్టడి చస్తే చూస్తూ ఊరుకోవాలా? అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేన్నారాయన.
జగిత్యాల హస్తం పార్టీలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జీవన్రెడ్డి నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఆయన తదుపరి అడుగులపై ఏంటనే చర్చ నడుస్తోంది. ఈ అలకను అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి.


