నల్గొండ జిల్లా : మండలంలోని కేతేపల్లి గ్రామంలో జరిగిన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో మృతిచెందిన మమత, ఆమె చిన్ని కుమారుడు అద్విక్ అంత్యక్రియలు ఎట్టకేలకు సోమవారం రార్రి పూర్తయ్యాయి. ఈ కేసులో నిందితురాలైన సుజాత సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన కుందేలు నగేష్తో అదే గ్రామానికి చెందిన సుజాత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. నగేష్ భార్య మమతకు ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పెద్దమనుషుల సమక్షంలో నగేష్, సుజాతను పిలిపించి పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. అప్పటి నుంచి నగేష్ సుజాతతో మాట్లాడటం మానేశాడు.
దీంతో ఎలాగైనా నగేస్ భార్య మమతను చంపాలని సూజాత నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సుజాత జనవరి 31న గ్రామంలోని కిరాణ దుకాణంలో ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకొని ఇంటి వద్దకు వెళ్లింది. పెట్రోల్తో పాటు ఒక సంచిలో కత్తి, కారంపొడి తీసుకొని నగేష్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటి ముందు చిన్న కుమారుడు అద్విక్ పాలు పడుతున్న మమతపై సుజాత పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో మమత, ఆమె చిన్న కుమారుడు అద్విక్ మృతిచెందారు. నిందితురాలు సుజాత సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి చేసిన నేరం అంగీకరించి లొంగిపోగా.. ఆమెను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన..
మమత తరఫు బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మమత వివాహ సమయంలో కట్నం కింద ఇచ్చిన రూ.8లక్షల నగదు, 10 తులాల బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరారు.
భూమి రిజిస్ట్రేషన్..
నగేష్ తల్లిదండ్రుల వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిని మృతురాలు మమత పెద్ద కుమారుడు సాత్విక్ పేరిట ఆమె తరఫు బంధులు దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించారు. గార్డియన్గా మమత తండ్రి, తల్లిని పెట్టారు. అదేవిధంగా కట్నం కింద ఇచ్చిన రూ.8లక్షల నగదు, 10 తులాల బంగారంను మమత పెద్ద కుమారుడి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదరడంతో సోమవారం రాత్రి మమత, ఆమె చిన్న కుమారు అద్విక్ మృతదేహాలను బంధువులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కేతేపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.


