సూర్యాపేటటౌన్ : తన కుమారుడు కల్నల్ సంతోష్బాబు దేశ సేవలో ప్రాణాలర్పించాడని, కుమారుడి జ్ఞాపకాలతో ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని సూర్యాపేట మున్సిపాలిటీలో 44వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని సంతోష్బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల తెలిపారు. సోమవారం ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే..
2020లో గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో నా కుమారుడు కల్నల్ సంతోష్బాబు వీర మరణం పొందాడు. అలాంటి మహానుభావుడి తల్లినైనందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుమారుడు మృతిచెందిన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్రెడ్డి మా కుటుంబానికి ఎంతో అండగా నిలిచారు. కేసీఆర్పై ఉన్న మమకారం, ఆయన చేసిన గొప్ప అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై బీఆర్ఎస్ నుంచి 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను.
గెలుస్తాననే నమ్మకం ఉంది..
ప్రస్తుతం ప్రచారం సైతం నిర్వహిస్తున్నాను. వార్డులో నాకు మంచి స్పందన వస్తుంది. నేను తప్పకుండా గెలుస్తానని వార్డు ప్రజలు చెబుతున్నారు. నాకు బీఆర్ఎస్ నుంచి పూర్తి సహకారం ఉంది. అదేవిధంగా నా భర్త ఉపేందర్తో పాటు కుటుంబ సభ్యులు సైతం పోటీ చేసేందుకు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కౌన్సిలర్గా గెలిపిస్తే 44వ వార్డులో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తా.


