విద్యార్థుల దాడి.. చూపు కోల్పోయిన బాలుడు | Class 5 student loses vision after being assaulted by peers | Sakshi
Sakshi News home page

విద్యార్థుల దాడి.. చూపు కోల్పోయిన బాలుడు

Feb 2 2026 10:20 AM | Updated on Feb 2 2026 10:25 AM

Class 5 student loses vision after being assaulted by peers

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక  ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. జనవరి 21వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పాఠశాల మైదానంలో ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుని తల్లి కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది.

పాఠశాలలోని ఐదో తరగతికి విద్యార్థి, మూడో తరగతి చదువుతున్న మరో విద్యార్థి కలిసి తన కుమారుడిపై దాడి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులైన విద్యార్థులు బాధితుడిని కిందకు తోసివేసి,  అతని కళ్లపై, ముఖంపై బలంగా కొట్టారని బాధితుడి తల్లి ఆరోపించారు. ఈ దాడిలో ఆ బాలుని కళ్లకు తీవ్ర గాయాలై, చూపు కోల్పోయాడు. ప్రస్తుతం కమాండ్ హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించినప్పటికీ, వారు దీనిని ఏమాత్రం పట్టించుకోలేదని బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన కుమారుడికి ఈ పరిస్థితి దాపురించిందని ఆమె ఆరోపించారు.

దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన స్కూల్ స్టాఫ్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకుని, విచారణ ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో భద్రతా లోపాలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్ పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘ఏమీ కనిపించడంలేదు’.. ఢిల్లీ ప్రజల గగ్గోలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement