చెన్నై: సినీనటుడు, టీవీకే అధినేత విజయ్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళనాడు ఎన్నికల వేళ కూడా ఆయనకు పలువురి రూపంలో షాక్ తగులుతోంది. మొదట కరూర్ తొక్కిసలాట, ఆ తర్వాత భార్యతో విడాకులు, హీరోయిన్ త్రిష ఇష్యూ. ఇప్పుడు నటి రంజనా నాచియార్ కూడా టీవీకే పార్టీకి గుడ్బై చెప్పారు.
అంతేగాక, ఆ పార్టీపై రంజనా తీవ్ర ఆరోపణలు చేశారు. “విజయ్ పార్టీలో మహిళలకు ఎల్లప్పుడూ అవమానం జరుగుతూనే ఉంటుంది” అని తెలిపారు. ఇవాళ రంజనా నాచియార్ టీవీకే నుంచి డీఎంకేలో చేరారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆమె డీఎంకే కండువా కప్పుకున్నారు.
“టీవీకే అగ్ర నాయకులను ఎవరూ కలవలేకపోతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల బాధను పట్టించుకోరు. పార్టీలో మహిళలకు నిరంతరం అవమానం జరుగుతోంది’’ అని రంజనా అన్నారు. డీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆమె గతంలో బీజేపీలో సుమారు ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో ఆ పార్టీని ఆమె వీడారు. ఆ తర్వాత టీవీకేలో చేరారు. ఇప్పుడు టీవీకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.
మరోవైపు, నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “డీఎంకే కమల్ హాసన్ పార్టీని, చిన్న మిత్ర పార్టీలన్నింటిని మింగేసింది... అవన్నీ తమ గుర్తులను వదిలి డీఎంకే గుర్తుపై పోటీ చేస్తున్నాయి. ఇటువంటివి బీజేపీలో జరగవు...” అని అన్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనెల 23న జరగనున్నాయి.


