రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న కేఐఐటీ (KIIT) విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్) హ్యుమానిటేరియన్ అవార్డు 2025తో నీతా అంబానీని సత్కరించారు. ఈ సందర్భానికి అనుగుణంగా ఆమె అద్భుతమైన లుక్లో ఈ కార్యక్రమానికి హాజరయ్యారామె.
ఈ ప్రత్యేక సందర్భం కోసం, నీతా అంబానీ ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకుని తనచీరను ఎంచుకోవడం విశేషం. సాధారణ ముదురు మెరూన్ చీరకు కాంట్రాస్ట్గా ఆకుపచ్చ రంగు అంచుతో కూడిన చీరను ఎంచుకున్నారు. ఇది ఆమెకు మరింత అందాన్ని ఇచ్చింది. ముందు భాగంలో కుచ్చులు పెట్టి, కొంగును తన భుజం నుండి నేల వరకు సింగిల్ పైటతో జారవిడిచారు.

ఆ చీరకు మ్యాచింగ్ మెరూన్ కలర్ విత్ ఆకుపచ్చ అంచు ఉన్న బ్లౌజ్ని ఎంచుకున్నారు. అంతేగాదు అమూల్యమైన ఆభరణాలకు బదులుగా పూల డిజైన్లో ఉన్న ఒక జత రూబీ, డైమండ్ చెవిపోగులు, ఒక స్టేమెంట్ ఉంగరం, ఆకుపచ్చ గాజులు, బంగారు పూసల నెక్లెస్ ధరించారు. జుట్టుని కూడా పెద్ద తరహాలో హుందాగా పాపిడి తీసి పువ్వులతో అలకరించిన జడకొప్పులా వేసుకున్నారు. చక్కగా సాధారణ స్త్రీలా కళ్లకు కాటుక, గుండ్రటి బొట్టుతో సరికొత్తగా కనిపించారామె.
కిస్ ఫౌండేషన్ ప్రకారం, 'మానవతా సేవ. సమాజ సాధికారత పట్ల ఆమెకున్న అసాధారణ నిబద్ధత'కు గాను నీతా అంబానీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడిస్తూ.. ఆమె దూరదృష్టి గల నాయకత్వం, పరోపకార కార్యక్రమాల ద్వారా, విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, గ్రామీణాభివృద్ధిపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపారు. భారతదేశం అంతటా లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేశారు అని పేర్కొంది.
(చదవండి: వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు రొమ్ము కేన్సర్..తొలిదశలో సురక్షితమేనా..?)


