కేరళలోనిఒక దేవాలయంలో ఏనుగు ఉన్నట్టుండి హింసాత్మకంగా మారిపోయింది.అంగమాలిలో ఉన్న కిడంగూర్ మహావిష్ణు ఆలయంలోకి తీసుకొచ్చిన ఏనుగు అకస్మాత్తుగా దాడిచేయడంతో విషాద సంఘటన చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ఏనుగు ఆగ్రహం కొనసాగడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు లోనయ్యారు.
శుక్రవారం (మే 1) ఉదయం సుమారు 9:45 గంటల సమయంలో, 'మయ్యానాడ్ పార్థసారథి' అనే ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తిపై దాడిచేసి, వాహనాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించగా, మావటి ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కొల్లాంకు చెందిన లారీ డ్రైవర్ విష్ణు (40)గా గుర్తించారు. కొల్లంనుంచి లారీలో ఈ గజరాజును ఈయనే తరలించినట్టు సమాచారం.
https://t.co/U4Fc8bGCAp https://t.co/PSIgJrW4fP
— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) May 2, 2026
పోలీసుల కథనం ప్రకారం, భక్తులు,స్థానికులలో భయాందోళనలు వ్యాపించడంతో, ఆ ఏనుగు ప్రజలపై దాడి చేసి, ఆలయ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలను ధ్వంసం చేసింది. కార్లను పల్టీ కొట్టించింది. ద్విచక్ర వాహనాలను నుజ్జునుజ్జు చేసింది, అలాగే ఆలయ ప్రాకార కుడ్యాన్ని ధ్వంసం చేసింది. దాదాపు రెండు గంటల తర్వాత, అటవీ అధికారులు పోలీసులు మత్తు మందు (tranquilizers) ఉపయోగించి దానిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఆలయ కార్యక్రమానికి ముందు స్నానం చేయిస్తున్నప్పుడు కర్రతో కొట్టడం వల్లే ఏనుగు దూకుడుగా ప్రవర్తించిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇదీ చదవండి : Yoga సైనస్తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్


