న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు విఘాతం కలుగుతున్న వేళ భారత్కు భారీ ఊరట లభించింది. యూఏఈ (యూఏఈ) నుంచి సుమారు 80,800 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో బయలుదేరిన భారతీయ నౌక ‘జగ్ లాడ్కీ’ (Jag Laadki) బుధవారం గుజరాత్లోని ముంద్రా పోర్టుకు క్షేమంగా చేరుకుంది.
దాడి జరిగిన చోటే లోడింగ్
ఈ నౌక ప్రయాణం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. మార్చి 14, 2026న యూఏఈలోని ఫుజైరా ఆయిల్ టెర్మినల్పై దాడి జరిగిన సమయంలో ‘జగ్ లాడ్కీ’ సరిగ్గా అక్కడే చమురును నింపుకుంటోంది. ఆ టెర్మినల్పై దాడి జరిగి కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, భారత నౌక మాత్రం ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఆదివారం ఉదయం సురక్షితంగా బయలుదేరింది. ‘ముర్బన్ క్రూడ్’తో నిండిన ఈ నౌక మూడు రోజుల ప్రయాణం తర్వాత భారత్ తీరానికి చేరింది.
వరుస విజయాలు.. ఊపిరి పీల్చుకున్న ఇంధన రంగం
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్కు చేరిన మూడవ ప్రధాన నౌక ఇది. దీనికంటే ముందు 'శివాలిక్', 'నందా దేవి' అనే రెండు ఎల్పీజీ నౌకలు కూడా విజయవంతంగా భారత్ చేరుకున్నాయి. నందా దేవి.. 46,500 మెట్రిక్ టన్నుల గ్యాస్తో మంగళవారం వాడినార్ పోర్టుకు చేరింది. ఇక్కడి నుంచి ఈ గ్యాస్ను తమిళనాడులోని ఎన్నోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా పోర్టులకు తరలించనున్నారు. శివాలిక్.. సోమవారమే ముంద్రా పోర్టుకు చేరుకుంది.


