అతిలోక సుందరి శ్రీదేవి కెరీర్లో చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నప్పటికీ 1982లో వచ్చిన 'వసంత కోకిల' టాప్లో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ చిత్రం ఓటీటీలో లేకపోవడంతో పలువురు అభిమానులు నిరాశకు గురయ్యారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ రీ-మాస్టర్ చేసి ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ ఎందులోకి వచ్చిందంటే?
బాలూ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన దృశ్యకావ్యం 'మూండ్రం పిరై' (తెలుగులో 'వసంత కోకిల'). 1982లో థియేటర్లలో రిలీజై ఓ క్లాసిక్గా నిలిచిపోయింది. శ్రీదేవి, కమల్ హాసన్ నటనకు ప్రేక్షకులు ముగ్దులైపోయారు. ఇందులో నటనకుగానూ కమల్కి, సినిమాటోగ్రఫీ విభాగంలో బాలూ మహేంద్రకు జాతీయ అవార్డులు కూడా రావడం విశేషం.
అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు సినీ ప్రేమికుల కోసం రీమాస్టర్ చేసి ఫుల్ హెచ్డీ ప్రింట్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు ఆడియో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. యూట్యూబ్లో ఈ మూవీ ఉంది గానీ క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంది.
'మూండ్రం పిరై' విషయానికొస్తే.. ఓ ప్రమాదం కారణంగా శ్రీదేవి తన జ్ఞాపకశక్తిని కోల్పోయి చిన్న పిల్లలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అనాథగా మారిన ఆమెని ఓ వేశ్యాగృహం నుంచి కమల్ హాసన్ (సోమనాథన్) రక్షించి, తన ఇంట్లోనే చేరదీసి ఆప్యాయంగా చూసుకుంటాడు. ఆమెకు చికిత్స చేయిస్తూ, తనను తాను మరచి ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని అర్థం చేసుకుంటుంది, ప్రేమిస్తుంది. చివరకు ఆమెకు జ్ఞాపకశక్తి తిరిగి వస్తుంది కానీ జరిగిన సర్జరీ వల్ల కమల్తో గడిపిన ఆ కొంతకాలం జ్ఞాపకాలు (కమల్ను) మర్చిపోతుంది. తనను ఎంతో ప్రేమించిన కమల్ని గుర్తుపట్టకుండానే తన పాత జీవితంలోకి ఆమె వెళ్ళిపోతుంది. కమల్ ప్రేమ, త్యాగం చివరకు విషాదంగా ముగుస్తుంది.


