ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...! | Ugadi Festival 2026, Key Traditions And Rituals Followed On Ugadi The Telugu New Year, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!

Mar 18 2026 11:58 AM | Updated on Mar 18 2026 12:43 PM

Key traditions and rituals followed on Ugadi The Telugu New Year

ఉగాది.. తెలుగు ప్రజల కొత్త ఏడాదికి ప్రారంభం. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే పనులు ఏడాది మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుందని పెద్దలు, పండితులు చెప్తారు. అందుకే ఉగాది రోజు కొన్ని శుభకార్యాలు చేయడం ఆచారంగా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, సాంప్రదాయాలు చేయడం వల్ల ఆ ఏడాది మొత్తం శుభంగా ఉంటుందనేది భక్తుల నమ్మకం.

ప్రభాత వేళే మేల్కొనడం – బ్రహ్మ ముహూర్తంలో లేచి, తైలస్నానం (నువ్వుల నూనెతో స్నానం) చేయడం శ్రేయస్కరం.

కొత్త బట్టలు ధరించడం – కొత్త ఆరంభానికి సంకేతంగా, ఈ రోజు అందరూ కొత్త బట్టలు ధరించి ఉగాదిని ఆహ్వానిస్తారు.

వేప పచ్చడి సేవించడం – తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచులను కలిపి తయారుచేసిన ఉగాది పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలను సూచిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.

పంచాంగ శ్రవణం – ప్రతి ఉగాది రోజున కొత్త సంవత్సర ఫలితాలను తెలుసుకునేందుకు పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయడం ఉత్తమం. 

మినపప్పు , కందిపప్పు, శెనగపప్పుతో చేసిన పదార్ధాలు స్వీకరించాలి,  స్వయంపాకంగా దానం ఇవ్వాలి.

బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి.  

కుదిరితే అన్నదానం చేయాలి. జలదానం చేయాలి. 

తల్లిదండ్రులకు భక్తితో నమస్కరించాలి, భార్యను ప్రేమతో చూచి కుదిరితే గాజులు కొనిచ్చి /కొనిపెట్టి , కుంకుమ బొట్టు పెట్టి ఆమెను దేవతగా భావించాలి. తద్వారా పార్వతీదేవి యొక్క ఆశీస్సులు పొందగలము. 

గురువునకు ఉగాదినాడు 3 ప్రదక్షిణలు చేసినవారు, 3 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. 

లక్ష్మీదేవిని పూజించి వ్యూహలక్ష్మీ మంత్రమును జపించుకోవటం, ఈశ్వరునికి అభిషేకం చేసుకోవటం శ్రేష్ఠం. 

పంచాంగ శ్రవణం చేయండి, కుదిరితే పంచాంగం లేక మంచి పుస్తకాలు దానం చేయడం మరింత ఉత్తమం. ఆలా చేస్తే పిల్లల యొక్క విద్య వృద్ధి చెoదుతుంది. 

పసుపు కుంకుమలు దానం ఇవ్వండి. 
బూరెలతో కూడిన భోజనము చేస్తే భూరి సంపదలు ఇస్తాడు పరమాత్మ. 

కోపం వదిలి, అన్నీ మంచి పలుకులు పలుకుదాము, ఈ నూతన సంవత్సరం సకల శుభాలను పొందుదాం... 

ఇవేగాక చాలామంది ఉగాది పండుగ నాడు ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయడం వంటివి చేస్తుంటారు. ఇలా ఎందకు చేస్తారు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక రహస్యాలు ఏంటంటే.

విజయ ప్రతీకగా..
నూతన సంవత్సర ఆరంభం (విజయ ప్రతీక)... తెలుగు రాష్ట్రాలలో ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం, ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. కాషాయ రంగు త్యాగానికి, పవిత్రతకు, ధర్మానికి చిహ్నం. కొత్త సంవత్సరం అంతా ధర్మబద్ధంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఇంటిపై ధ్వజాన్ని ఎగురవేస్తారు.

చారిత్రక నేపథ్యం (విజయ సంకల్పం)... 
చారిత్రక కోణంలో చూస్తే, ఈ రోజును విజయ దినంగా కూడా భావిస్తారు. శాలివాహన చక్రవర్తి శకులను జయించి 'శాలివాహన శకం' ప్రారంభించిన శుభసందర్భం ఇది. ధ్వజం అనేది విజయానికి గుర్తు. ప్రతి ఇంటిపై ఈ జెండాను ఉంచడం ద్వారా ఆ కుటుంబం రక్షణ, ఐక్యతను చాటుతారు.

ఆధ్యాత్మిక అర్థం... కాషాయం అంటే సూర్యోదయ కిరణాల రంగు. ఇది చీకటిని (అజ్ఞానాన్ని) తొలగించి వెలుగును (జ్ఞానాన్ని) ప్రసాదించే రంగు. హిందూ సంప్రదాయంలో జెండాను 'కేతువు' అని పిలుస్తారు. ఇంటి పైన జెండా ఎగురవేయడం వల్ల దుష్టశక్తులు దరిచేరవని, దైవ రక్షణ ఉంటుందని భక్తుల నమ్మకం.

పండుగ అలంకరణలో భాగం...
సాధారణంగా ఉగాదినాడు గుమ్మాలకు మామిడి తోరణాలు, వేప రెమ్మలతో పాటు ఇంటి కప్పు పైన లేదా బాల్కనీలో కాషాయ జెండాను కడతారు. ఇది ఇంటికి ఒక పవిత్రమైన రూపాన్ని ఇస్తుంది. ధ్వజం కట్టేటప్పుడు జెండా శుభ్రంగా, చిరగకుండా ఉండాలి.

సాధారణంగా దీనిపై 'ఓం' కారము లేదా హనుమంతుడి చిహ్నం ఉంటుంది. జెండాను ఎత్తైన ప్రదేశంలో గాలికి రెపరెపలాడేలా కట్టడం శుభప్రదంగా భావిస్తారు.

(చదవండి: పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement