breaking news
Devotion
-
సీతగా అలరించనున్న సాయిపల్లవి జపమాల ఎందుకు ధరిస్తుందంటే..!
తమిళ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో సాయిపల్లవి ఒకరు. ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణం' చిత్రంలో సీతాదేవి పాత్రను పోషించనున్నారు. తెరపైనే కాకుండా, నిజ జీవితంలో కూడా ఆమె తన నిరాడంబరమైన వ్యక్తిత్వం, సంప్రదాయబద్ధమైన జీవనశైలితో అశేష అభిమానులను సొంత చేసుకుందామె. అయితే ఆమె కనిపించినప్పుడు అందర్నీ ఆకర్షించే వస్తువు 'జప మాల'. సాధారణంగా దీన్ని ఆమె కుడి చేతికి చుట్టుకుని కనిపిస్తుంటారామె. ఇది ఆమెకు అధ్యాత్మికత పట్ల ఉన్న భక్తి విశ్వాసాన్ని, ఆసక్తిని సూచిస్తోంది. ఆఖరికి ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 'రామాయణం: ప్రథమ సంకల్ప' కార్యక్రమంలో కూడా, కాంచీవరం చీర, బంగారు ఆభరణాల తోపాటు ఎడమచేతికి జపమాల ధరించి కనిపించారు. ఈ నేపథ్యంలో జపమాల ప్రాముఖ్యత, ఎందుకు ధరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఎందుకు ధరిస్తారంటే..ఈ ముద్దుగుమ్మ సాయిపల్లవి సాధారణంగా గంధపు చెక్క (చందనం)తో చేసిన జప మాలను ధరిస్తుంటుంది. ఇది కేవలం అలంకరణ మాత్రం కాదట, మనిషిని నిలకడగా, సదా స్పృహతో, దైవంతో అనుసంధానమయ్యేలా చేస్తుందట. జప మాలలో ఉండే 108 పూసలు యాదృచ్ఛికం కాదని, ఆ సంఖ్యకు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. సనాతన ధర్మంలో 108 సంఖ్య అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది సృష్టి సంపూర్ణతను, ఆధ్యాత్మిక పరిపూర్ణతను సూచిస్తుంది. సాంప్రదాయం ప్రకారం, ఒక మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఏకాగ్రత, భక్తి, అంతర్గత పరివర్తన కలుగుతాయి. అలాగే 108 సంఖ్యను 108 ఉపనిషత్తులు, దేవతల 108 నామాలు, జీవాత్మకు, పరమాత్మకు మధ్య ఉండే అనుసంధానంతో ముడిపెట్టి చూస్తారు ఆధ్యాత్మికవేత్తలు. చాలా మంది జపం చేసేటప్పుడు చేతిలో మాలను తిప్పుతూ ఉంటారు. ధరించడానికి వివిధ రకాల జపమాలలు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అత్యంత సాధారణమైన జపమాల రకాలలో తులసి, రుద్రాక్ష, గంధపు చెక్క, స్ఫటికం (క్రిస్టల్) మాలలు ఉంటాయి. ఇవేగాక తామర గింజలు, పసుపు లేక ఎరుపు గంధపు పూసలతో కూడా మాలలను తయారు చేస్తారు. అయితే ప్రతి ఒక్క మాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందట. అందరూ అన్నింటిని ధరించడం సాధ్యం కాదని అంటున్నారు. ఇక్కడ మాల అనేది కేవలం అలంకరణ కోసం ఎంచుకునే వస్తువు కాదట. ఇది ఒక దైవం, మంత్రం లేదా నిర్దిష్ట సాధనతో ముడిపడి ఉంటుందని చెబుతున్నారు. ఏవేవి ఎందుకోసం అంటే..శివ మంత్ర సాధన చేస్తుంటే, సాధారణంగా రుద్రాక్షకు ప్రాధాన్యత ఇస్తారు. విష్ణు లేదా కృష్ణ భక్తికి తులసి మాల ఎక్కువగా వాడతారు. ప్రశాంతత, స్పష్టత కోసం స్పటికమాలను ఉపయోగిస్తారట. కొన్ని మాలలు సంప్రదాయబద్ధంగా నిర్దిష్ట దేవుళ్లకు లేదా గ్రహాలకు అనుగుణంగా ఉంటాయి. అలాగే చాలామంది రుద్రక్షను ఎంచుకుంటారు. దీన్ని రక్షణ, స్థిరత్వం, క్రమశిక్షణతో కూడిన అంతర్గత జీవితాన్ని కోరుకునే వారు ఎంచుకుంటారని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు. ఎవరు ధరించవచ్చంటే..రత్నాల వలె, మాలను ఎల్లప్పుడూ ధరించరని అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. కొందరు కేవలం జపం చేసేటప్పుడు మాత్రమే ధరిస్తే, మరికొందరు అప్పుడప్పుడు ధరిస్తారు. ఉదాహరణకు, సాయి పల్లవి సినిమా సెట్లలో తప్ప, మిగతా సమయాల్లో జపమాలతోనే కనిపిస్తుంటారామె. మరికొందరు నిద్రపోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, మలవిసర్జన సమయాల్లోనూ తీసివేసి..మిగతా సమయంలో ధరిస్తుంటారు. నిరంతరం జపమాలను ధరించడం అనేది స్మరణ చుట్టూ అల్లుకున్న జీవనశైలికి అంకితం. అలాగే ఆధ్యాత్మిక చైతన్యం తమకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారని అర్థం. చివరగా ఇది ఫ్యాషన్ కోసం కాదని, భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉన్న సాంప్రదాయక అంశంగా పేర్కొన్నారు ఆధ్యాత్మిక నిపుణులు.(చదవండి: ఉద్యోగం కోల్పోవడం, మూడుసార్లు వ్యాపారంలో నష్టం..చివరికి ఏకంగా రూ. 100 కోట్లు..) -
అలంకారం శరీరానికా? వ్యక్తిత్వానికా?
అలంకారాలు అంటే కళ్ళు జిగేలుమనిపించేలా కనిపించడం కాదండోయ్ ఇక్కడ.. అలాగే తళుక్కుమనే ఆభరణాలు బంగారం, వెండి గూర్చి కూడా కాదు... మనిషికి సహజంగా ఉండవలిసిన నిజమైన అలంకారం ఆభరణాలు గూర్చి శతకాల్లో చెప్పిన బంగారు మాటలు నెమరువేసుకుందాం.ఈ మాటలవిలువ ఏ మూటలతో లెక్క కట్టలేం...భర్తృహరి రాసిన సంస్కృత శతకానికి ఎంతో దగ్గరగా స్వేచ్ఛానువాదం చేసిన ఏనుగు లక్ష్మణకవి ఒక పద్యంలో...‘అమరుజెవి శాస్త్రమున గుండలముగాదువలయమున నొప్ప, దీవి చే వెలయుబాణియురుదయాడ్యుల మేను పరోపకారకలన రాణించు గంధంబు వలనకాదు’.కుండలాలు, బంగారు కడియాలు, గంధం – ఇవన్నీ అలంకారాలు కావుట. ధర్మశాస్త్ర శ్రవణమే చెవులకు అలంకారం. నిరంతరం దానం చేసిన చేసిన చేతులకు మిలమిల మెరిసే కడియాలు ఆభరణం కాదు. దయాగుణం కలవారికి సుగంధద్రవ్యాలు /గంధపు పూత అలంకారం కాదు.ఇంకా లోతులోకి వెళ్తే సత్పురుషులకు వారి గుణాలే అలంకారాలు. బాహ్యంగా తళుకులు, మెరుపులు అక్కర్లేదు..ఇదే కవి మరో పద్యంలో‘కరమున నిత్యదానం, ముఖంబన సూనత వాణి, ఔదలంగురుచరణాభివాదన, ముకుంఠిత వీర్యం దోర్యుగంబునన్వరహదయంబునన్ విశదవర్తన, మంచిత వీనులన్సురుచిరభూషణంబు లివి శూరులకు సిరి లేనియప్పుడున్’....ఐశ్వర్యం లేనప్పుడు మహాత్ములకు సహజ అలంకారాలు ఏమి ఉండాలో చెప్తూన్నాడు, ఏనుగు లక్ష్మణ కవి. అవి ఏమిటంటేదానం, సత్యాన్ని పలకడం, గురువు గారికి నమస్కరించే గుణం, ఎదురు లేని పరాక్రమం, మంచి ప్రవర్తన శాస్త్ర శ్రవణం... ఇవన్నీ... కంకణాలు, కిరీటం, కుండాలాలు బయట తాత్కాలిక సౌందర్యన్నే కలిగిస్తాయ్. స్థిరమైన శాశ్వతమైన అంతరమైన సౌందర్యం కలగాలంటే సద్గుణాలుండాలి.‘నిజమైన ఆభరణాలు, అలంకారాలు’ గురించి శతక కవులు బంగారాన్ని కాదు, గుణాలనే ఆభరణాలు అని అన్నారు.వేమన గారు బాహ్య అలంకారాలను ఖండించి, అంతరంగ శుద్ధినే అసలైన అలంకారం అన్నారు.పసిడి కుండలములు చెవులకుపసిడి హారములు మెడకు భాసిల్లును గానిమంచి మాటలు లేకున్నపశువుతో సమానమగును పార్థివా వేమాఅర్థం: చెవులకు బంగారు కమ్మలు, మెడకు హారాలు ఉన్నా, నోట మంచి మాటలు లేకుంటే పశువుతో సమానం.మరో పద్యం చూడండిఅంగడి సరుకుల వలెనాఅలంకారములెల్ల కొనగ అందుబాటగునాసంగతి తెలిసిన వానికేసద్గుణమే అలంకారము సర్వజ్ఞా వేమాఅర్థం: అంగడిలో దొరికేవి ఆభరణాలు కావు. సద్గుణాలే నిజమైన అలంకారం.బద్దెన కవి విద్య, వినయమే నిజమైన ఆభరణాలు అన్నారు.విద్య భూషణము పురుషునకువిద్యయె కీర్తిని తెచ్చు విశ్వమందునవిద్య లేని మనుజుండుపశువు కంటెను హీనమగును పార్థివా సుమతీఅర్థం: విద్యయే మనిషికి అసలైన ఆభరణం. విద్యే కీర్తిని తెస్తుంది. విద్య లేనివాడు పశువు కంటే హీనుడు.‘సత్యము భూషణము సతికిసత్యము భూషణము నరునకు సర్వజనులకున్సత్యము లేని నరుండుమత్యువుతో సమానమగును మేదిని సుమతీ‘అర్థం: స్త్రీకైనా, పురుషుడికైనా సత్యమే అసలైన ఆభరణం. భాస్కరుడు అదే బాణిలో వెళ్ళాడు భాస్కరుడు శీలము, దానమే ఆభరణాలు అన్నారు.‘దానము శీలము సత్యముమానము విద్యయును నీతి మర్యాదయునుమేనికి భూషణములు సుమ్మీమేలైన గుణములు గలిగెనేని భాస్కరా‘అర్థం: దానం, మంచి నడవడి, సత్యం, గౌరవం, విద్య, నీతి, మర్యాద – ఇవే శరీరానికి నిజమైన ఆభరణాలు.భర్తృహరి గారు కూడా గుణాలనే ఆభరణాలు అన్నారు.రత్నములు కావు భూషణరత్నములు సద్గుణములె సుమ్మీ రత్నములురత్నములు లేకపోయినరాజిల్లును సద్గుణముల రమణీయముగన్’దీనికి అర్థం అక్కర్లేదు.వినయము విద్యకు భూషణవినయము లేని విద్య విషముతో సమము సుమ్మీవినయ విద్యలు గల్గినవనరులెల్ల వచ్చు జగతిన.బాహ్య అందం కోసం సాధన చేసినా ఫలితాలు తాత్కాలికం.. కనుమరుగు అయిపోతాయి... బదులుగా నిజమైన అలంకారాలు, ఆభరణాలు గుణాలు రూపంలో ఉంటే అవి సద్వినియోగం చేస్తే ఫలితాలు శాశ్వతం, లోక ప్రయోజనం, విశ్వ కళ్యాణం అవుతుంది.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి నిర్వహణ: డి.వి.ఆర్. -
ప్రార్థనతో బలపడే విశ్వాసం!
‘దేవుని ఇశ్రాయేలు’గా చెప్పబడే క్రీస్తు ప్రభువు సంఘ సభ్యులు అపొస్తలుల బోధకు లోబడి క్రీస్తునందు క్రీస్తును బట్టి దేవునియందు ఆనందించుటలో సిద్ధహస్తులు. యేసు దేవుని కుమారుడు అంటే దేవుని పక్షాన ఏలుబడి చేసే ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్ధం. ఆ రారాజైన క్రీస్తును బట్టే ఆత్మసంబంధ ఇజ్రేలీయులుగా క్రైస్తవులు పిలువబడుతున్నారు. క్రీస్తు సంబంధులు, క్రైౖస్తవులు అనే పదాలకు ఆత్మ సంబంధ ఇజ్రేలీయులు అనేది ఒక గొప్ప పర్యాయపదం. ఆత్మ సంబంధ హృదయ పరిపాలకుడుగా ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి ఎలా ఆనందించాలో ఎందుకు ఆనందించాలో చూద్దాం.ఇక సాహసించక తప్పదనేలా దేవుని సంకల్పం బహు బలంగా ఉంది. అంతరాయాలకు, అడ్డుకట్టలకు, అభ్యంతరాలకు ఎలాంటి తావులేదు. ఇజ్రేలీయులకు వాగ్దానం చేసిన మెస్సీయాను ఈ భూమి మీద ప్రవేశపెట్టే వేళలలో దుస్సాహసాలకు పాల్పడుతూ దేవుని సంకల్ప చిత్తానికి ఆయన సత్యానికి అడ్డొచ్చే ప్రతి ఒక్కరూ దేవుని శత్రువులుగా ముద్రవేయించుకొని దేవుని ఉగ్రతకు బలై చరిత్రలో కలిసిపోయారు. తన ప్రేమను క్రీస్తు ద్వారా వెల్లడి చేయుటకు దేవుడు ఎన్నో సాహసకార్యాలకు పూనుకొన్నాడు. అదేవిధంగా మానవాళి అనుభవానికొచ్చి అలరించుటకు క్రీస్తుప్రేమ కూడా అనేకనేక అడ్డు ఆటంకాలకు ఎదురొడ్డి నిలిచింది. ఇప్పుడైతే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపువారెవరును లేరు.- ''క్రీస్తు లేకుంటే దేవునికి సంకల్పమే లేదు. క్రీస్తు కేంద్రంగానే సర్వంలో సర్వమూ చేయబడింది అనుటకు తగిన మూలాధారం ఇదే. మొత్తం దేవుని సంకల్పంలో కేంద్రకం క్రీస్తుబలి. కారణం చూస్తే యేసును నలగగొట్టడం యెహోవా దేవునికి ఇష్టమైంది. క్రీస్తుబలి దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తన స్వకీయ సంకల్ప ప్రకారంగా ఈ బలిని రూపొందించినది ఆ దేవదేవుడే. అంతకంటె ముఖ్య కారణం, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించడం. మానవాళికి తన సొంత కుమారుని అనుగ్రహించుట ద్వారా ఇలా తన కుమారుని బలియాగం ద్వారా తన ప్రేమను వైవిధ్యంగా చేతలలో ఈ లోకానికి చాటి చెప్పాడు.''క్రీస్తునందు ఆనందిస్తూ ఎర్ర సముద్రం, ఎరికో గోడలు, వంటి ఉపద్రవాలు, శ్రమలు, బాధలకు తలవంచక కేవలం క్రీస్తును బట్టి మాత్రమే ఎదురునిలిస్తే అవి ఏవైనా వినయ వినమ్రతలతో దారి ఇచ్చుకోక తప్పదు. యేసు తన తండ్రియైన దేవదేవుని సంకల్పప్రకారంగా మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం మరణించాల్సి వచ్చింది. ఆయన అత్యంత క్రూరంగా ఘోరంగా సిలువలో బలి అయ్యాడు. నీ చిత్తమే సిద్ధించును గాక అంటూ సాహసించి మరీ మరణానికి ఎదురుగా వెళ్ళాడు.ఇందువలననే యేసు తన తండ్రి సంకల్ప చిత్తానికి విధేయంగా తలవంచాడు. మానవాళిని ప్రేమించి ప్రేమతో సాహసించి తన నిండు యవ్వన్రపాయాన్ని బలిగా పెట్టాడు. ఇట్టి యేసు సాహసోపేత ప్రేమను బట్టి ఆనందించండి అనునదే పరిశుద్ధులైన అపొస్తలుల బోధగా సంఘాలలో ఉపదేశక్రమ సత్యారాధనలలో నిత్యమూ చెప్పబడుతూ ఉంటుంది. వారపు ప్రప్రథమదినమను ఆదివారంనాడు సంఘము ఇలా క్రీస్తు సాహసాలను ప్రకటిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. సాహసించి క్రీస్తు సాహసాలను క్రీస్తు సంఘం ప్రకటిస్తూ ఉంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే యెడతెగక ్రపార్థన చేయాలి. ్రపార్ధన చేయుట ద్వారానే క్రీస్తుద్వారా దేవునితో సత్సంబంధ సహవాస బాంధవ్యాలు బలపడి దృఢపడతాయి. అప్పుడే ప్రతి ఒక్కరూ సాహసోపేత దైవిక ప్రేమను బట్టి ఎంతగానో సంతోషించే వీలుంటుంది.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్ -
నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు..
సమాజంలో మనిషి ఒంటరిగా జీవించలేడు. అనుక్షణం పరిచయాలు, సంబంధాలు, స్నేహాలతోనే అతని జీవితం ముడిపడి ఉంటుంది. అయితే, మనం ఎవరితో కలుస్తున్నాం, ఎవరితో కాలాన్ని గడుపుతున్నామనే అంశమే మన ఆలోచనలను, ప్రవర్తనను, అంతిమంగా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఇస్లామిక్ ధర్మం మంచి సాంగత్యాన్ని ఎంచుకోవడానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.పెద్దలు అంటారు ‘‘నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు’’ అని. ఇది కేవలం లౌకిక సత్యం మాత్రమే కాదు, దివ్యఖుర్ ఆన్ హదీసుల ఆత్మకూడా ఇదే!అత్తరు తావి కావాలి!చెడు ప్రభావం మనిషిపై ఒక్కసారిగా పడదు. కొవ్వొత్తి వెలుగు మాయమైనట్లు, అది నిశ్శబ్దంగా మనలోని మంచి గుణాలను హరిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు మంచి, చెడు సాంగత్యాల ప్రభావాన్ని ఎంతగానో హృదయానికి హత్తుకునేలా వివరించారు: ‘‘మంచి మిత్రుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారి (అత్తరు అమ్మే వ్యక్తి) లాంటివాడు; అత్తరు వ్యాపారి దగ్గర ఉంటే అతడు నీకు సుగంధాన్ని బహుమతిగా ఇస్తాడు, లేదా నీవు కొనుగోలు చేస్తావు... కనీసం ఆ సువాసననైనా ఆస్వాదిస్తావు.’’ (సహీహ్ అల్–బుఖారీ)చెడు అలవాట్లు, భావాలు ఉన్నవారి మధ్య గడిపితే ఎంతటి గట్టి మనస్కుడైనా ఏదో ఒక రోజు తప్పుదోవ పట్టే ముప్పు ఉంటుంది. అదే నైతిక విలువలు, దైవభీతి ఉన్నవారి సరసన ఉంటే మనలో నిశ్శబ్దంగా నైతిక పరిమళాలు వికసిస్తాయి.సత్యవంతుల సహవాసం‘‘ఓ విశ్వసించిన వారలారా! అల్లాహ్కు భయపడండి, సత్యవంతులతో (సజ్జనులతో) ఉండండి.’’ (దివ్య ఖుర్ఆన్ 9:119) మనిషి జీవన శైలి అతని మిత్రుని ప్రభావంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మనిషి తన స్నేహితుడి మార్గంలోనే ఉంటాడు. కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి‘ (అబూ దావూద్) అని హెచ్చరించారు.రేపటి పశ్చాత్తాపం వద్దు!తాత్కాలిక లౌకిక ప్రయోజనాల కోసం లేదా వ్యసనాల కోసం చేసే స్నేహాలు పరలోకంలో తీరని నష్టాన్ని మిగులుస్తాయి. ఆనాటి పశ్చాత్తాపాన్ని దివ్య ఖుర్ ఆన్ ఇలా కళ్లకు కడుతోంది: ‘‘ఆ రోజు పాపాత్ముడు తన చేతులను కొరుక్కుంటూ... ’అయ్యో! నేను ఫలానా వ్యక్తిని నా మిత్రుడిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది!’ అని వా΄ోతాడు.’’ (దివ్యఖుర్ ఆన్ 25:27–28)అందుకే స్నేహంలో కొన్ని కీలకమైన నియమాలు పాటించాలి:1. మితమైన స్నేహం: ఆత్మీయతలో సమతుల్యత ఉండాలి. రహస్యాలను, గతంలో చేసిన ΄÷రపాట్లను ఇతరుల ముందు విప్పకూడదు. తప్పులకు దేవుని సమక్షంలో పశ్చాత్తాపపడాలి (తౌబా చేయాలి) తప్ప, పబ్లిక్లో పరచడం వల్ల భవిష్యత్తులో అది బలహీనతగా మారుతుంది.2. గృహ రక్షణ: మన అంతరంగ వలయం లోకి ధర్మనిష్ఠ గలవారినే రానివ్వాలి. రకరకాల అలవాట్లు ఉన్న సాధారణ పరిచయస్తులను ఇంటి పరిధికి దూరంగా ఉంచడం వల్ల కుటుంబంలో, పిల్లలలో మంచి సంస్కారం నిలుస్తుంది.అద్దం లాంటి మిత్రుడుసచ్ఛీలుడైన మిత్రుడు ‘అద్దం’ లాంటివాడు. అద్దం ముఖంపై ఉన్న మచ్చను ఏ అసూయా లేకుండా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే నిజమైన మిత్రుడు మనలో లోపం ఉన్నప్పుడు దయతో, రహస్యంగా సరిదిద్దుతాడు. అటువంటి సద్విమర్శను అహంకారం విడిచి వినయంతో స్వీకరించడమే ఆత్మవికాసానికి తొలిమెట్టు.విశాల ప్రపంచంలో వేలాది పరిచయాలు ఉండవచ్చు. కానీ మనల్ని దైవ మార్గంలో నిలబెట్టే, మన ప్రవర్తనను సన్మార్గంలో నడిపించే కొద్దిమంది ‘సజ్జనుల’ సాంగత్యమే మన నిజమైన సంపద. మన చుట్టూ ఉన్నవారిని ఒకసారి పరిశీలించుకుందాం... వారు మనల్ని వెలుగు వైపు నడిపిస్తున్నారా, లేదా అంధకారం వైపు గుంజుతున్నారా?– ముహమ్మద్ ముజాహిద్నిర్వహణ: డి.వి.ఆర్. -
అంతర్ముఖ చిత్తం.. పరివర్తనకు మార్గం!
ప్రపంచాన్ని జయించాలనే తపనతో మానవుడు వేల సంవత్సరాలుగా నిరంతరం ముందుకు సాగుతున్నాడు. ప్రకృతిని అధ్యయనం చేశాడు. సముద్రాలను దాటాడు. ఆకాశాన్ని చేరుకున్నాడు. విజ్ఞానశాస్త్రంలో, సాంకేతిక రంగంలో, వైద్యరంగంలో అనేక అద్భుత విజయాలను సాధించాడు. అయితే ఒక ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉంది– తనను తాను నిజంగా తెలుసుకున్నాడా?ప్రకృతి పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే, జీవరాశులన్నీ తమ అవసరాలకు అనుగుణంగా బాహ్య ప్రపంచాన్ని అన్వేషిస్తూ అభివృద్ధి చెందాయి. నీటిలో జీవించిన చేపలు భూమిపై జీవించేందుకు ప్రయత్నించాయి. సర్పాలు చురుకుదనాన్ని పెంపొందించుకున్నాయి. జంతువులు పరిసరాలను బాగా ఎదుర్కొనేందుకు తమ శరీర నిర్మాణాన్ని మార్చుకున్నాయి. ఈ పరిణామమంతా బాహ్య ప్రపంచానికి అనుగుణంగా జరిగిన మార్పులే.మానవుడు కూడా ఇదే మార్గంలో నడిచాడు. ఆహారం కోసం అన్వేషించాడు. నివాసం నిర్మించుకున్నాడు. సంపదను కూడబెట్టాడు. అధికారాన్ని సంపాదించాడు. విజ్ఞానాన్ని పెంచుకున్నాడు. కానీ ఈ అన్వేషణ అంతా బాహ్య ప్రపంచం వరకే పరిమితమైంది. భౌతిక ప్రగతి ఎంత జరిగినా, అంతరంగంలో ప్రశాంతత, సంతృప్తి, ఆనందం లభించకపోతే జీవితం అసంపూర్ణంగానే మిగులుతుంది.ఇక్కడే ఆధ్యాత్మిక పరిణామం ప్రారంభమవుతుంది. మన దృష్టి బాహ్య ప్రపంచం నుండి అంతరంగం వైపు మళ్లినప్పుడే నిజమైన పరివర్తన సంభవిస్తుంది. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవడం, మన ఆలోచనలను పరిశీలించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచడం, స్వీయ అవగాహనను పెంపొందించుకోవడంఇవే ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు.ఒక అందమైన ఇంటిని నిర్మించిన తర్వాత దాని వెలుపల నిలబడి చూస్తూ ఉంటే, ఆ ఇంటి సౌకర్యాన్ని అనుభవించలేం. లోపలికి అడుగుపెట్టినప్పుడే ఆ ఇంటి అసలు విలువ తెలుస్తుంది. అలాగే, ఎంతటి బలమైన కోటను నిర్మించినా దాని లోపలికి వెళ్లకపోతే అది రక్షణను ఇవ్వదు. ఇదే సూత్రం మన జీవితానికీ వర్తిస్తుంది. బాహ్య ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించినా, మన అంతరంగంలోకి ప్రయాణించకపోతే శాశ్వతమైన ఆనందాన్ని పొందలేం.నేటి సమాజంలో సాంకేతిక సౌకర్యాలు విస్తరించిన కొద్దీ మానసిక ఒత్తిడి, ఆందోళన, అసంతృప్తి కూడా పెరుగుతున్నాయి. సమాచారం విపరీతంగా పెరిగింది కానీ జ్ఞానం తగ్గుతోంది. పరిచయాలు పెరిగాయి కానీ ఆత్మీయత తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో మనిషికి అత్యవసరమైనది అంతర్ముఖత. కొద్దిసేపైనా మనతో మనం గడపడం, మౌనాన్ని ఆస్వాదించడం, ధ్యానం ద్వారా మనస్సును పరిశుభ్రం చేసుకోవడం నేటి కాలంలో అత్యంత అవసరం.శ్రీ మాతాజీ నిర్మలాదేవి బోధించిన సహజయోగం కూడా ఇదే సందేశాన్ని అందిస్తుంది. మనలో సహజంగా ఉన్న ఆత్మచైతన్యాన్ని మేల్కొలిపి, మన చిత్తాన్ని అంతర్ముఖంగా మార్చినప్పుడే నిజమైన శాంతి, సమతుల్యత, ఆనందం లభిస్తాయని ఆమె బోధించారు. ఇది ఏ ఒక్క మతానికి పరిమితమైన మార్గం కాదు; మానవుని అంతరంగ వికాసానికి సంబంధించిన విశ్వజనీన సత్యం.ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మనలో మార్పు రావాలి. సమాజంలో శాంతి నెలకొనాలంటే ముందు మన హృదయంలో శాంతి నెలకొనాలి. బాహ్య విజయాల కంటే అంతరంగ విజయం గొప్పది. మన చిత్తం బయట ప్రపంచంలో ఎంత విహరించినా, చివరికి తన అసలు గమ్యం తనలోనే ఉందని గ్రహించినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది.అంతర్ముఖత అనేది ప్రపంచాన్ని వదిలేయడం కాదు; ప్రపంచాన్ని మరింత స్పష్టంగా, సమతుల్యంగా, ప్రేమతో చూడగల స్థితికి చేరుకోవడం. అదే మానవ పరిణామంలో అత్యున్నత దశ.– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులునిర్వహణ: డి.వి.ఆర్. -
హనుమ విగ్రహం... రాతిలో చెక్కిన భక్తి తత్వం
చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని హనుమంతుడి శిల్పం విజయనగర శిల్పకళా వైభవానికి అద్భుతమైన నిదర్శనం. ఈ శిల్పం రామాయణంలోని సుందరకాండలో చోటుచేసుకున్న అత్యంత కీలకమైన ఘట్టాన్ని రాతిలో సజీవంగా ఆవిష్కరిస్తుంది. సీతాదేవిని దర్శించి ఆమెకు శ్రీరాముని ఉంగరాన్ని అందజేసిన అనంతరం హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఈ వార్త రావణునికి చేరడంతో అతడు తన కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి పంపించాడు. దేవతలను సైతం జయించిన మహా యోధుడైన ఇంద్రజిత్తు సాధారణ ఆయుధాలతో హనుమంతుడిని జయించలేనని గ్రహించి బ్రహ్మదేవుని అనుగ్రహంతో పొందిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడికి బ్రహ్మదేవుని వరప్రభావం వల్ల బ్రహ్మాస్త్రం శాశ్వతంగా హాని చేయలేకపోయినా బ్రహ్మాస్త్ర మహిమను గౌరవిస్తూ ఆయన కొంతసమయం దానికి లొంగిపోయాడు. తరువాత రాక్షసులు జనపనార తాళ్లు, నాగపాశాలతో ఆయనను అదనంగా బంధించిన వెంటనే బ్రహ్మాస్త్ర ప్రభావం దానంతట అదే తొలగిపోయిందని సుందరకాండ వివరించింది. అందువల్ల హనుమంతుడు నిజంగా ఓడిపోలేదు. వ్యూహాత్మకంగా రావణుని సభలో ప్రవేశించి అతనికి శ్రీరాముని సందేశాన్ని నేరుగా తెలియజేయాలనే సంకల్పంతోనే బంధితుడిగా ఉన్నాడు.చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని శిల్పంలో హనుమంతుడు పాముల వంటి బంధనాలతో చుట్టబడి నిలిచిన రూపంలో కనిపిస్తాడు. తన శరీరాన్ని బంధించినప్పటికీ తన మనోధైర్యాన్ని ఎవరూ బంధించలేరనే భావాన్ని అద్భుతంగా వ్యక్తీకరించాడు శిల్పి. కండరాలలో కనిపించే ఉద్రిక్తత, ముఖంలో కనిపించే ప్రశాంతత, కళ్లలో ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం భక్తి, అపార శక్తి ఈ శిల్పానికి అసాధారణమైన జీవం పోశాయి. బాహ్యంగా బంధితుడిగా కనిపిస్తున్న హనుమంతుడు అంతర్గతంగా అజేయుడని ఈ శిల్పం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది శిల్పకళ మాత్రమే కాదు రాతిలో చెక్కిన ఒక తాత్విక సందేశం కూడా.చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని ఈ శిల్పం విజయనగర శిల్పుల అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తుంది. కఠినమైన గ్రానైట్ రాయిలో శరీర నిర్మాణం కండరాల బలం పాముల చుట్టుకొలత వస్త్రాల మడతలు ముఖ కవళికలు వంటి సూక్ష్మ అంశాలను సైతం అత్యంత సహజంగా చెక్కడం వారి కళానైపుణ్యానికి నిదర్శనం. విజయనగర శిల్పకళలో శిల్పాలు అలంకారాలు మాత్రమే కాకుండా పురాణాలను ప్రజలకు బోధించే దృశ్య గ్రంథాలుగా కూడా రూపొందించబడ్డాయి. నిరక్షరాస్యులు కూడా ఈ శిల్పాలను చూసి రామాయణం మహాభారతం, పురాణాల్లోని కథలను సులభంగా అర్థం చేసుకునే విధంగా వాటిని రూపొందించారు.ఈ హనుమంతుడి శిల్పం భక్తునికి గొప్ప జీవిత సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో కష్టాలు బంధనలు అవమానాలు ఎదురైనా ధర్మాన్ని విడువకుండా భక్తిని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా లభిస్తుందని ఇది బోధిస్తుంది. బాహ్య బంధనలు ఎంత బలంగా ఉన్నా దైవభక్తి ధైర్యం, జ్ఞానం, సంయమనం ఉన్న వ్యక్తిని ఎవ్వరూ శాశ్వతంగా బంధించలేరనే శాశ్వత సత్యాన్ని ఈ శిల్పం ప్రతిధ్వనిస్తుంది. అందుకే చింతల వెంకట రమణస్వామి ఆలయంలోని హనుమంతుడి శిల్పం కేవలం ఒక కళాఖండం మాత్రమే కాదు భారతీయ ధర్మం భక్తి తత్వం, విజయనగర శిల్పకళా వైభవం కలిసిన ఒక చిరస్మరణీయ వారసత్వ సంపదగా నేటికీ భక్తులను పరిశోధకులను, కళాభిమానులను సమానంగా ఆకర్షిస్తోంది.– జిబి విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అనంతపురంనిర్వహణ: డి.వి.ఆర్. -
యక్షిణి దేవతలు.. నిజమా? భ్రమలా?
మన పురాణాలలో, మంత్ర శాస్త్రాలలో 'యక్షిణి' అనే పేరు వినబడగానే ఒక వింతైన ఉత్సుకత, భయం మనలో కలుగుతాయి. అసలు యక్షిణులు ఎవరు? వారు దేవతలా లేక దెయ్యాలా? అత్యంత శక్తివంతమైన యక్షిణి సాధనల ద్వారా మనుషులు కోరుకున్నవన్నీ సాధించవచ్చా? నిధులు, నిక్షేపాలను కాపాడేది వీరేనా? తరతరాలుగా సమాజంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, పురాణాల వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక సత్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! -
సహజమైనదే చేయాలి!
ఒక జెన్ గురువును ఓ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది. ఆయన కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. సరిగ్గా పన్నెండు గంటలకు గురువు గారు వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భోజనం వడ్డించారు. ఎంతో శ్రద్ధతో వండిన వంటకాలను గురువుగారు బాగా ఆస్వాదిస్తూ తిన్నారు. చివరగా చేయి కడుక్కునే సమయంలో, ‘అన్నీ శాకాహారమే వండారేం? చిన్న చేప ముక్క అయినా కలిపి ఉంటే బాగుండేది కదా!’ అన్నారు.ఆహ్వానించిన వారు ఆలోచనలో పడ్డారు. ‘మీరు మాంసాహారం తినరని అనుకున్నాం’ అని నమ్రతగా చెప్పారు. గురువు తల పట్టుకున్నారు. ‘మీ ముందస్తు అంచనాల్లో నన్ను పెట్టి బంధించకండి. నాకు ఊపిరి ఆడదు’ అన్నారు. ‘మాకు అర్థం కాలేదు గురుదేవా! ఇతర మనుషులకు, జంతువులకు, చివరికి చెట్టు చేమలకు కూడా హాని చేయకూడదు అని జెన్ సిద్ధాంతం చెప్తోంది కదా?’ అని అడిగారు.‘అవును, దానికి నేను ఇప్పుడు చేప తినాలి... తినకూడదు అనుకోవడానికి సంబంధం ఏమిటి? మనం మనలాగే ఉండాలి. మనకు ఏది సహజమో అదే చేయాలి. అనవసరమైన నటనలు వద్దు. వదులుకోవాలనే ఆలోచన బలంగా ఉంటే, కాలక్రమేణా అనవసరమైన విషయాల నుండి బయట పడవచ్చు. ఇది నా అనుభవం కూడా. బలవంతంగా శాకాహారం మాత్రమే తింటూ లోపల బాధ పడటం కంటే, ఆశ కలిగినప్పుడు మాంసాహారం తినేసి, ఆ క్షణంలో జీవించడమే అసలైన జెన్. వదులు కోవాలనే సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మిగిలినది సహజంగా దానికదే జరుగుతుంది’ అన్నారు గురువుగారు.– యామిజాల జగదీశ్ -
చిద్రూపమే జగత్తు!
దీర్ఘతముడనే ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. తండ్రికి సపర్యలు చేయడం వారి దినచర్య. కాలం తీరి కొన్నాళ్ళకు దీర్ఘతముడు మరణించాడు. విధిగా నిర్వర్తించాల్సిన ఉత్తరకర్మలన్నిటినీ పెద్దకొడుకు భక్తితో నిర్వర్తించాడు. అంతా సజావుగా జరిగాక, తమ్ముడి కోసం చూడగా, అతడు ఆశ్రమంలో కనిపించలేదు. అడవిలో వెదికాడు. ఒక పెద్ద చెట్టు మొదట్లో కూర్చుని శోకిస్తూ కనిపించాడు తమ్ముడు. అన్న హృదయం ద్రవించింది. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఆప్యాయంగా తల నిమిరి ఇలా చెప్పాడు:‘పూర్వం వైరోచనుడనే ఒక రాజు ఉండేవాడు. దీర్ఘకాలం వసుధను పాలించాడు. ప్రపంచంలో లభించే అన్ని సుఖాలను తృప్తి తీరా అనుభవించాడు. ఒకనాడు రాజప్రాసాదపు మేడపై నిలబడి ఆలోచిస్తూ ‘ముల్లోకాలలో అద్భుత కారణంబును, సకల భోగాలకు ఆలవాలము అయిన ఈ భూమిలో, సౌఖ్యాలు అస్థిరములైనవే! అనుభవించే పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ అనుభవించి, దినదినమూ భ్రాంతుడనై తిరుగుతూ ఉండడమేగా ఇక్కడ ఎన్నాళ్ళైనా! రాత్రి, పగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆగేవి కావు. చెప్పిందే చెప్పడం అన్నట్లుగా కాలం చర్వితచర్వణం. ఈ సుఖాలన్నీ ప్రాజ్ఞుల దృష్టిలో అల్పాలే’ అని తలచి బాల్యంలో తన తండ్రి చెప్పిన మాటలను మననం చేసుకున్నాడు.తే. కణగి యెల్ల చోట గలది చిద్రూపంబుఅదియ నీవు నేను నఖిలములునుఇదియ నిశ్చితార్థ మిది దప్ప మఱి లేదుసర్వశాస్త్రసార సంగ్రహంబు.‘ఈ విశ్వంలోని ప్రతి అణువు చిత్తమనే చేతనతో నిండి ఉంది. చేతనతో నిండినదైన చిద్రూపమే నీవు, నేను, అది, ఇది, ఇలలో అన్నీ. అదే నిశ్చయం. అది తప్ప మరొకటి లేదు. సర్వ విజ్ఞాన, వేదాంత శాస్త్రములు బోధించేది కూడా అదే! ఆ సత్యాన్ని గ్రహించిన చిత్తానికి చింత ఉండదు. అది తెలుసు కుని నీవు కూడా స్వస్థత చెందిన అంతరంగాన్ని పొందు’ అని అన్న చెప్పిన మాటలను ఆలకించాడు తమ్ముడు. శోకోపశమనం పొందాడు.– భట్టు వెంకటరావు -
శంకరుల బాట..
ఆదిశంకరుల రచనలైన కనకధారాస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, గుర్వష్టకమ్, నిర్వాణ షట్కమ్, భజగోవిందం, సౌందర్యలహరి – దేన్ని చదివినా, వినినా మనసు ఆనందంతో నిండి పోతుంది. వాటి అర్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవిస్తే మన జీవితాలే ధన్యమవుతాయనిపిస్తుంది. శంకరులవారి అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాడుతుంటే ఆనందం, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయని పెద్దలంటారు. అందులో చివరి శ్లోకం మరీ ముఖ్యమైనది:‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః / బాంధవా శ్శివ భక్తశ్చ స్వదేశో భువనత్రయమ్!!ఇందులో ఆది శంకరులవారు జ్ఞాన, వైరాగ్యాలను కాంక్షించటమేకాక తన తల్లి పార్వతీదేవి అనీ, తండ్రి మహేశ్వరుడనీ, శివ భక్తులందరు తన బంధువులనీ, మూడు లోకాలూ తనకు స్వదేశమనీ ప్రకటిస్తారు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా ఇతరులు తీసికొని ఆచరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.మరి మనం ఆది శంకరుల అనుచరులం అని చెప్పుకొంటే సరిపోతుందా? ఆయన వలె మనమూ జ్ఞాన, వైరాగ్యాలనే కోరుకోవాలిగానీ ధన ధాన్యాలను, సంపదలను కాదు. లోకాలనన్నిటినీ, లోకులందర్నీ సృష్టించిన ప్రకృతి, పురుషులు మన తల్లి తండ్రులని, జీవులన్నీ మన బంధువులని, ముల్లోకాలూ స్వదేశమని గ్రహించి జీవిస్తే ఆధ్యాత్మిక శిఖరాన్ని ఆదిశంకరులవారు ఎలా అధిరోహించారో మనమూ అధిరోహించవచ్చు. – రాచమడుగు శ్రీనివాసులు -
'దేవశయని ఏకాదశి' ప్రాశస్త్యం..! ఆ రోజు ఏం చేయాలంటే..
శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర కాలమే చాతుర్మాసం. ప్రతి ఏడాది ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశిని దేవశయని ఏకాదశి(తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి) అంటారు. దీని అర్థం. దేవ్' అనగా దేవుడు, 'శయని' అనగా నిద్రించుట. విష్ణుమూర్తి క్షీరాసాగరంలో యోగనిద్రకు ఉపక్రమించే రోజే ఈ దేవశయని ఏకాదశి. ఈ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు గల నాలుగు నెలల కాలం చాతుర్మాసంగా పరిగణిస్తారు. అంటే ఈ నాలుగు మాసాల్లో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా, సృష్టి బాధ్యతలను పరమశివుడు చూసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాసం ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మశుద్ధికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, మొదటి పుట్టువెంట్రుకలు తీయించడం వంటి శుభకార్యాలు చేయరు. అయితే, భక్తి, దానధర్మాలతో కూడిన కొన్ని పనులు చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున విష్ణువుని ఎలా ఆరాధించాలంటే..విష్ణు అనుగ్రహం కలగాలంటే..మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే, సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని, ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. అంతేగాదు మహాసాధ్వి సతీ సక్కుభాయి, ఈ వ్రతాన్నే ఆచరించి, మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు..ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు, దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం, శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి, భోజనం చేయాలి. తినకూడనవి..ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి, పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి, సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు, సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ, పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే, తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు, మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.(చదవండి: వైభవంగా జగదాంబిక బోనాలు..అక్కడే తొలి బంగారు బోనం..!) -
మహాత్ముల చేష్టలు..
బాలోన్మత్త పిశాచవత్ సిద్ధానాం రీతిః మహాత్ములయిన సిద్ధపురుషుల పద్ధతంతా విపరీ తంగా ఉంటుంది. పిల్ల చేష్టలు చేస్తారు. పిశాచం పట్టిన వాళ్ళలాగా వింతగా ప్రవర్తిస్తారు. పిచ్చివాళ్ళలాగా సంచరిస్తారు. వాళ్ళ చూపులు, పనులు వంటివన్నీ పైకి అలాగే కనిపిస్తాయి. అలాంటి మహనీయుల గొప్పతనాన్ని మహాత్ములే గుర్తిస్తారు. సామాన్యులకు తెలియదు.గౌతమ మహర్షి మహామహితాత్ముడు. గొప్ప సిద్ధుడు. శ్రీవిద్యోపసనా దురంధరుడు. ముద్రోపాసనను, శైవ సిద్ధాంతాన్ని మనకందించిన పుణ్యమూర్తి. పెద్ద పెద్ద పండితులు, చక్రవర్తులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. నిత్యం వేదపారా యణం, ఉపాసన, యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, సంద్గ్రంథ పారాయణాలు జరిగేవి.ఒక ఉన్మత్తుడు ఆశ్రమంలోనే ఉంటూ అందరికీ తపో, ధ్యాన భంగం చేస్తూ ఉండేవాడు. గౌతముడు మాత్రం ఆ పిచ్చివాణ్ణి దగ్గరకు పిలిచి ఆదరించేవాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిచ్చివాణ్ణి తిట్టేవారు. ఇలా ఉండగా ఒక రోజున పండితులు, రాజు గౌతముని సన్మానించటానికి, పూజా సామగ్రిని, కానుకలను తీసుకొనివస్తే ఆ పిచ్చివాడు ఆ సామగ్రినంతటినీ చిందరవందర చేసి అందరిచేత తన్నులు తిన్నాడు. అందుకు గౌతముడు చాలా బాధపడ్డాడు. పాపం పిచ్చివాడిలాగా తిరిగే అవధూత మరణించాడు. ఇది చూచి గౌతముడు కూడా ప్రాణం వదిలేశాడు. అది తెలిసి శుక్రాచార్యులు కూడా ప్రాణత్యాగం చేశారు.ఆ విషాదం చూచి భరించలేక దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. శ్రీమాత వాళ్ళ ప్రార్థన విని గౌతముని బ్రతికించింది. గౌతముడు మంత్రజలం చల్లి అవధూతను బ్రతికించాడు. శుక్రాచార్యుని సైతం బ్రతికించాడు. అక్కడి వాళ్ళతో గౌతముడు ‘ఈయనను పిచ్చివాడనుకొంటున్నారు మీరు. ఇది భ్రమ తప్ప నిజం కాదు. ఈయనొక మహాయోగి. అవధూత! నా పూర్వజన్మలో నా గురుదేవుడు. ఈయన ఇంతవరకు మీ విషయంలో చేసిన వింతచేష్టలు మిమ్మల్ని అనుగ్రహించటానికే. కానీ ఈ యధార్థం మీకు తెలియదు’ అని చెప్పాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
స్వయం గురువుగా తయారు కావాలి..
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీగురవే నమః...గురు మంత్రంలో చివరి మంత్రం చెప్పేటప్పుడు‘గురుః సాక్షాత్ పరబ్రహ్మ’ అని అంటారు. అంటే పరబ్రహ్మయే. మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆ శక్తియే మీ ద్వారా ప్రవహిస్తుంది. కనుక అప్పుడు మీరు పరబ్రహ్మ సాధనంగా మారతారు. మీలో స్వయం గురుతత్వ స్థితిని పెంపొందించుకుంటారు.ఆదిగురువు అవతరమూర్తులందరూ పంచభూతాలపై ఆధిపత్యం కలిగివుంటారు. వారి ద్వారానే బ్రహ్మ వ్యక్తీకరింపడ్డాడు. ఈ ఆదిగురువు ముగ్గురి ద్వారా అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా వ్యక్తీకరింపబడ్డాడు. ఆయన నాలుగు తలలుగల బ్రహ్మలా జన్మించాడు. మనకు పైకి కనబడే ఈ ముగ్గురు కాకుండా నాల్గవ తల శ్రీ గణేశునిది. ఈ విధంగా దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గణేశ రూపంతో, శక్తులతో ఆది గురువయ్యాడు. గురువు కు వుండాల్సిన ఉత్తమ గుణాలు చాలా వున్నాయి. ఆ గుణాలన్నీ గురువులో వ్యక్తమవ్వాలి. ఈ గుణాలకు యజమాని శివుడు. శివ తత్వం అంటే గురుతత్వమే. అలా ఈ గుణాలన్నీ మీ ద్వారా ప్రస్పుటమవ్వాలి, ప్రకాశించాలి.అప్పుడు మీరు విరాటశక్తిలో ఒకరైపోతారు. ఇతరులకు ధర్మాన్ని బోధించగలుగుతారు. ఆత్మగా మారుతారు. ఆ విధంగా నిజమైన గురువుగా మారుతారు.ఒక గురువుగా మీరు మీ నిత్య జీవితంలో అనేక విషయాలకు అతీతంగా వుండగలగాలి. అదే మీరు చేరుకోవలసిన ఉన్నత స్థితి.‘‘యధా రాజా తధా ప్రజా’’ అన్నట్లుగా మీరు స్వయం గురువుగా తయారయిన్నప్పుడే ఇతరులకు గురువుగా మారి ఓ ప్రతీకగా, ఆదర్శ్ర΄ాయంగా నిలబడి నడిపించగలరు.. ఇక్కడ మన అర్థం చేసుకోవలసిన విషయమేమంటే – సమాజంలో మనం చూస్తున్న గురువులను, తమను తాము గురువులుగా చెప్పుకునే గురువులు మనకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలుగుతున్నారా అన్నది. తమలో గురు తత్వం లేని గురువు కూడా ఇతరులకు గురువు కావాలనుకుంటారు. తాను స్వయంగురువుగా వ్యక్తీకరింపబడిన వ్యక్తి ఇతరులకు గురువు కావాలని ఎన్నడూ అనుకోడు.మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మగా రూపొందండి. ఎప్పుడు మీరు ఆత్మగా రూపొందుతారో అప్పుడు మీకు మీరు గురువు కాగలగుతారు. అదే స్వయం గురుతత్వం.గురువు ప్రప్రధమంగా మనల్ని భగవంతుడినితో అనుసంధాన పరచడానికి ప్రయత్నిస్తాడు. అంటే దానర్థం ఆయన మీ కుండలినీ శక్తిని జాగృత పరిచి, సర్వవ్యాపిత శక్తితో మిమ్మల్ని అనుసంధానం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.గురువుకి మించిన తత్వం లేదుగురువును మించిన తపస్సు లేదుగురువుని మించిన జ్ఞానం లేదుఅటువంటి గురుదేవునికి నమస్కరిస్తున్నాను అని గురుగీత స్తోత్రంలోని ఒక శ్లోకంలో గురువుకి వున్న ఉన్నత స్థాయి గురించి చెప్పారు.– డాక్టర్ ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులు, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)శ్రీ మాతాజీ నిర్మలాదేవినిర్వహణ: డి.వి.ఆర్. -
దేవతలు కట్టిన కోవెల!
విష్ణుమూర్తి... సౌమ్యనాథస్వామిగా అవతరించి, చిరుమందహాసంతో, అభయహస్తంతో దర్శనమిస్తూ ..కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం నందలూరు సౌమ్యనాథాలయం. విశాలమైన ప్రాంగణంలో... నాలుగు రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయం పది ఎకరాల విస్తీర్ణంలో, పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించడం విశేషం.ఈ ఆలయంలోని 108 స్తంభాలపైనా భాగవతం చిత్రించి ఉండటం మరో విశేషం. 11 శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని దేవతలే కట్టించారని పురాణాలు చెపుతున్నాయి. స్వయంగా నారదమహర్షి సౌమ్యనాథస్వామి మూలవిరాట్టును ప్రతిష్టించారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది.స్వామి పాదాలపై సూర్యకిరణాలు...గర్భగుడికీ ఆలయ ప్రధాన ద్వారానికీ మధ్య 120 గజాల దూరం ఉన్నా.. ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాల స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు పడటమూ ఇక్కడ చూడొచ్చు.స్వామిపై అన్నమయ్య కీర్తనలు...తాళ్లపాకకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు రోజు దర్శించుకునేవాడనీ, స్వామిపైన పదహారు కీర్తనలు కూడా రాశాడనీ అంటారు. ఇక్కడ స్వామికి ప్రతిరోజు నిర్వహించే పూజలు ఒకెత్తయితే, ఆషాఢమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఏకాదశి నాడు చేసే లక్షతులసీ అర్చన మరొకెత్తు. ఇవే కాకుండా శ్రావణ, ధనుర్మాసాల్లో నిర్వహించే ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన భక్తులకు ఎక్కువగా చూస్తారు.వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవాలు...ఈనెల 21, మంగళవారం అంకుర్పారణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. బుధవారం ధ్వజారోహణం జరిగింది. 26న గరుడసేవ, 28న కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 30న చక్రస్నానం, 31న పుష్పయాగం నిర్వహించనున్నారు. స్వామివారు రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఐదవరోజున గరుడోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను స్వయంగా టీటీడీ దేవస్థానం వారే నిర్వహించడం సంప్రదాయం.– రామమోహన్ మోడపోతుల, సాక్షి, రాజంపేట, వైఎస్సార్ కడప జిల్లానిర్వహణ: డి.వి.ఆర్. -
క్రీస్తునందున్న యాత్రికులు, పరదేశులు
క్రీస్తు సిలువ మరణాన్ని బట్టి కొట్టివేయబడిన ధర్మశాస్త్రమను పాతనిబంధన దృష్టిలో నుండి చూస్తే, ఇశ్రాయేలు జనాంగం పూర్తి రక్షణ కొరకు మెస్సీయా రానేవచ్చాడు. క్రొత్తనిబంధన దృష్టికోణంలో నుండి చూస్తే పాపులను రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు అనగా యావత్తూ అన్య జనాంగాన్ని రక్షించుటకు క్రీస్తు ప్రత్యేకంగా రావడం జరిగింది.గురి కలిగిన క్రైస్తవుల గూర్చి ఎప్పుడూ ఘనంగానే చెప్పవచ్చు. ప్రభువైన క్రీస్తు ద్వారా అంది వచ్చిన క్రొత్త నిబంధన చట్టప్రకారం చూసినా, నేడు అమలులో ఉన్న అపొస్తలుల బోధను అనుసరించి చూసినా, ఈ భూమి మీద ఉన్న క్రైౖస్తవులు అనబడే క్రీస్తు సంబంధులు పరదేశులు, యాత్రికులుగా చెప్పబడుతున్నారు.‘నశించిన ఇశ్రాయేలు ఇంటివారైన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను’ అన్న యాత్ర జీవితం మెస్సీయాది.గొఱ్ఱెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకే వచ్చానని నిశ్చయముగా చెప్పుకున్న ఆయన, ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తోడుకొని రావాలి అన్నది కూడా మొత్తానికి ఆయన స్పష్టం చేయడం అంతా విదితమే. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనను రోజు రోజూకు భక్షిస్తూ ఆయన్ను స్థిరంగా ఒక్కచోట నిలబడనివ్వని కారణం చేత ఉన్నతమైన ఉరుకులు పరుగుల జీవితం ఆయనది. తాను పుట్టినవేళ సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పడుకొన్న శిశువైన యేసుగా పెరిగి పెద్దవాడై తనను తాను రిక్తుడిగా చేసుకొనినందున ఆయనకు ఇల్లు వాకిలి లేకున్నా రోజూ నిలువ నీడలేని సంకట పరిస్థితి. రాత్రివేళ ఎక్కడో ఒకచోట తలదాచుకొని పగలు ఉన్నంత వరకు అవిశ్రాంతంగా దేవుని పనిచేయడం ఒక్క క్రీస్తుకే చెల్లింది.దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను చాటుతూ ఆ రాజ్యం ఇప్పుడు మీ చేరువలోకే వచ్చిందంటూ యేసు సామాన్యుల చెంత సామాన్యుడుగా కలిసిపోతూ సత్యాన్ని వివరాణాత్మకంగా మనస్సుకు హత్తుకొనేలా బోధించాడు. ఇశ్రాయేలు దేశపు ప్రతి ఇంటి గడపను, ప్రతి బాధితుడను దాటిపోని క్షేత్రస్థాయి విస్తృత పర్యటనలు చేస్తూ యేసు తనదైన దైవిక ప్రేమను బట్టి మానవాళిని తన దివ్య వాక్కులతో బోధలతో అలరించడం విశేషం. ధనికులు, పండితులు వద్దకే కాకుండా అట్టడుగు వర్గాలను ఆకట్టుకొనేలా కూడా యేసు ప్రభువు నేరుగా వారి ఇళ్ళవద్దకు వెళ్ళి పరామర్శలు చేస్తూ వాగ్దాన సంబంధ దేవుడు సత్యవంతుడని స్థాపిస్తూ ఆయన ఎంతో నమ్మదగినవాడని ప్రచారం చేసాడు.దేవుని ఉనికి, స్పృహ లేకుండా పోతున్న రోజుల్లో సత్యవంతుడైన వానిని మనం ఎరుగవలెనని మనకు వివేకం అనుగ్రహించాడు కూడా. ఇట్టి విధానంలో ఈ క్రమంలో ఆయన యాత్రజీవితం విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? నేను పరదేశినైన పరసంబంధుడను, ఈ భూమిమీద యాత్రికుడను అన్నది యేసు ఉన్నత జీవితపాఠం గొప్పగా చాటుతుండడం విశేషమనే చెప్పాలి.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్. -
కోపాన్ని వదలండి..
రెండు పదాల ఈ చిన్న సలహా పాటించకపోతే జీవితం ఎన్నో మలుపులతో కలచి వేస్తుంది, సంతోషాన్ని కబళిస్తుంది.. తాత్కాలికం, క్షణికం అయినా కోపం శాశ్వతంగా బంధాల్ని తెంపివేస్తుంది..స్నేహన్ని చెడగొడుతుంది, చుట్టరికాలు చెడిపోతాయ్.. మనుషుల్ని దూరం చేస్తుంది. మమతల్ని చంపివేస్తుంది. ఆరోగ్యం మటు మాయం అయిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కోపం వలన వచ్చే కష్టనష్టాలు బేరీజు వేసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే కోపం గూర్చి ఎన్నో శతకాల్లో నిక్కచ్చిగా, స్పష్టంగా చెప్పారు... కోప్పడకుండా చదవండి.‘తన కోపమే తన శత్రువుతన శాంతియె తనకు రక్ష దయ చుట్టంబౌదన సంతోషమే స్వర్గముతన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’ఎన్నో సందర్భాలలో ఈ పద్యం వింటాం.. వేరే వివరణ అవసరం లేదు. కోపమే శత్రువు, శాంతమే రక్ష.. సంతోషం స్వర్గం బాధే నరకం... అన్నీ మనలోనే ఉన్నాయి ఈ పద్యంలోనే దయా గుణాన్ని అంటే ఇబ్బంది ఉంటే ఆదుకునే వాడే చుట్టం అని చె΄్తాడు. అందుకునే కాబోలు ‘అక్కరకు రాని చుట్టము... గ్రక్కున విడువంగ వలయు ‘ అని సలహా ఇస్తాడు బద్దెన కవి.వేమన కోపం గురించి అత్యధికంగా చెప్పాడుకోపము దుఃఖమునకు మూలము కోపము శత్రుభయంకరము కోపము కీర్తి నశింపజేయురా కోపము వదలిన సుఖియైతివిరా వేమా!అర్థం: కోపమే దుఃఖానికి మూలం. కోపం వల్ల శత్రువులు పెరుగుతారు. కీర్తి నాశనమవుతుంది. కోపం వదిలితేనే సుఖపడతావు.మరో పద్యం..కోపము వచ్చినప్పుడు కుయుక్తుల వచ్చురా కోపము వచ్చినప్పుడు కూటమి చెడురా కోపము వచ్చినప్పుడు కులమెల్ల చెడురా కోపము వదలరా వేమా!సుమతి శాంతంగా ఉండమని చెప్పాడుకోపము పాపమునకు మూలము కోపము దుఃఖమునకు మూలము కోపము అధోగతికి మూలము కోపము వదలి సుఖముండుము సుమతీ!అర్థం: కోపమే అన్ని పాపాలకు, దుఃఖాలకు, అధోగతికి కారణం. అందుకే కోపం వదిలి సుఖంగా ఉండు. భర్తృహరి సుభాషిత శతకం – ఏనుగు లక్ష్మణకవి చేసిన అనువాదంపద్యంక్షమయా భూషితః పురుషః క్రోధేన భూషితో నరః నీచోపచారైః నరకం వ్రజేత్ ఉత్తమో నరకాత్ పరమ్తెలుగు అనువాదంఓర్పుతో భూషితుడైన నరుడు ఉత్తముడు కోపముతో నుండు నరుడు నీచుడునీచుడు నరకమునకు పోవును ఉత్తముడు స్వర్గమునకు పోవునుకోపము కామము లోభము మదము మాత్సర్యము ఈ పంచ మహాపాములు దహించును వీనిని జయించినవాడే మానవుడు శ్రీరామ నీ దాసుడైతిని దాశరథీ!నీతి శతకంలో పద్యంకోపాత్ భవతి మూర్ఖత్వం మూర్ఖత్వాద్ వినశ్యతి వినాశాత్ నరకం యాతి తస్మాత్ కోపం వివర్జయేత్అంటే...కోపం వల్ల మూర్ఖత్వం వస్తుంది. మూర్ఖత్వం వల్ల నాశనం. నాశనం వల్ల నరకం. అందుకే కోపాన్ని వదలిపెట్టాలి. శతక రచయితలు భావ యుక్తంగా చెప్తే, త్యాగరాజుల వారు రాగయుక్తంగా ‘శాంతము లేక సౌఖ్యము లేద’న్నారు. చివరిగా చెప్పినంత సులువుగా కోపాన్ని వదులుకోగలమా..మాటకు మాట తూటాలాగా వదిలితే శాంతి ఎక్కడ.. శాంతం లేనిదే శాంతి.. సహనం, శాంతం ఉంటే కోపాన్ని దూరం చేసుకోవచ్చు... డాక్టర్లు కూడా ఆరోగ్యం బాగుండాలంటే కోపం వద్దు.. ఈ దిçశలో బయలు దేరితే మన ఆరోగ్యదశ బాగుంటుంది.. ఆ ప్రయత్నంలో అడుగులేద్దాం.– డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. -
వర్షాల కోసం ‘ఇస్తిస్ఖా’... నమాజు
వర్షాలు పడక పొలాలు ఎండిపోతే, చెరువులు తడారిపోతే రైతు గుండె గొంతుకలోకి వస్తుంది. వాన చుక్క కోసం ఊరంతా ఆకాశం వైపు దీనంగా చూస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మహమ్మద్ ప్రవక్త (స) కాలంలో ఏం చేసేవారో తెలుసా?ఊరి ప్రజలందరినీ ఒక చోటికి తీసుకెళ్లి వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయించేవారు. దాన్నే ‘నమాజ్–ఎ–ఇస్తిస్ఖా’ అంటారు. తప్పులు పెరిగితే తడారిపోయే నేల! మనిషి చేసే పనులకి, ప్రకృతి మారే తీరుకి దగ్గర సంబంధం ఉంటుంది. వ్యాపారంలో మోసాలు ఎక్కువైనప్పుడు, సమాజంలో పేదలకు ఇవ్వాల్సిన దానధర్మాలు (జకాత్) సరిగ్గా చేయనప్పుడు వర్షాలు ఆగిపోతాయని ప్రవక్త చె΄్పారు. కరువు రావడం అనేది కేవలం వాతావరణం మారడం వల్ల మాత్రమే కాదు, మనుషుల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని చెప్పే ఒక హెచ్చరిక.‘ఒకవేళ ఈ భూమి మీద మూగజీవాలు లేకపోతే, అస్సలు వర్షాలే పడవు’ అని ప్రవక్త చెప్పిన మాటలు మన అహంకారాన్ని ఆలోచనలో పడేస్తాయి. ఆడంబరం లేదు... కేవలం వినయం మాత్రమే! వర్షం కోసం వేడుకునేందుకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆడంబరాలు ఉండేవి కావు. చాలా సాధారణ బట్టలు వేసుకుని, భయభక్తులతో, వినయంగా ఊరి బయట ఉన్న ఈద్గాహ్ మైదానానికి వెళ్లేవారు. పండుగ నమాజ్ లాగే రెండు రకాతుల నమాజ్ చదివిన తర్వాత, ప్రవక్త చేతులను చాలా ఎత్తుకి ఎత్తి అల్లాహ్ను వేడుకునేవారు.సాధారణంగా దేవుడిని కోరుకునేటప్పుడు అరచేతులు ఆకాశం వైపు ఉంచుతారు. కానీ వర్షం కోసం అడిగేటప్పుడు అరచేతులు నేల వైపు, చేతుల వెనుక భాగం ఆకాశం వైపు ఉంచేవారు. అలాగే వేసుకున్న దుప్పటిని కూడా తిరగేసేవారు. మన కష్టాల కాలం మారి, మంచి రోజులు రావాలని కోరుకోవడానికి ఇది ఒక పద్ధతి. ‘ప్రభూ! నీ దాసులకు, మూగజీవాలకు నీళ్లు ప్రసాదించు... నీ కరుణను పంచు... ఎండిపోయిన ఈ భూమికి మళ్లీ ప్రాణం పోయ్!’ఇస్తిస్ఖా ప్రార్థన సారాంశం చిన్న చీమ... గొప్ప పాఠం! ఒకసారి ఒక ప్రవక్త వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తూ, మార్గమధ్యంలో ఒక చిన్న చీమను చూశారట. ఆ చీమ తన కాళ్లను ఆకాశం వైపు ఎత్తి వర్షం కోసం వేడుకుంటోంది. అది చూసిన ప్రవక్త తన అనుచరులతో... ‘మనం వెనక్కి వెళ్లిపోదాం, ఆ చిన్న చీమ చేసిన ప్రార్థనను ఆలకించి దేవుడు మనకు వర్షం కురిపిస్తున్నాడు’ అన్నారట.దేవుడి దయ కేవలం మనుషులకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవికీ సమానంగా లభిస్తుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వాన చినుకుల్లో పరవశం! ప్రార్థన ముగియగానే ఆకాశంలో దట్టమైన మేఘాలు పట్టి, ఉరుములు మెరుపులతో వర్షం పడేది. వాన పడటం ప్రారంభం కాగానే ప్రవక్త తన చొక్కాను కాస్త పక్కకి జరిపి, ఆ మొదటి వాన చుక్కలు తన ఒంటిమీద పడేలా నిలబడేవారు. ‘ఇది దేవుడి దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్న కొత్త వర్షం’ అని సంతోషపడేవారు. నిజమైన పశ్చాత్తాపంతో, వినయంతో ప్రార్థిస్తే ఎండిపోయిన భూములైనా, మనుషుల మనస్సులైనా మళ్లీ చిగురిస్తాయనడానికి ఇస్తిస్ఖా ప్రార్థనే నిదర్శనం.– డా. అబ్దుర్రహీం బిన్ ముహమ్మద్ బిన్ మౌలానానిర్వహణ: డి.వి.ఆర్. -
తొలి పర్వం..
సంవత్సరంలో సాధారణంగా 24 ఏకాదశులు వస్తాయి (అధిక మాసం వస్తే 26). అయితే ఆషాఢ శుక్ల ఏకాదశికి ‘తొలి ఏకాదశి‘ అనే విశిష్ట నామం వచ్చింది. దక్షిణాయనం ప్రారంభం అయ్యాక వచ్చే మొదటి ఏకాదశి కనుక మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి అంటే ప్రారంభ ఏకాదశి అని చెప్పవచ్చు.ఈ ఏకాదశిని ఇంకా... దేవశయన ఏకాదశి, హరిశయనీ ఏకాదశి, పద్మ ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశి .. అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు మేల్కొంటారని ఆగమాలు, పురాణాలు వివరిస్తాయి.ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి నాడు విధిగా పారణ చేసినవాడు సర్వపాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతాడని పద్మ పురాణం తెలియజేస్తుంది. గాయత్రీ మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు. తల్లి కంటే గొప్ప దైవం లేదు. కాశీ కంటే గొప్ప తీర్థం లేదు. ఏకాదశి వ్రతం కంటే గొప్ప వ్రతం లేదు అని స్కందపురాణం చెబుతోంది. భవిష్య పురాణం ప్రకారం చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది.ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.తొలి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం అత్యంత శ్రేయస్కరమని సంప్రదాయం.భీష్ముడు యుధిష్ఠిరునికి ఏకాదశి మహిమను వివరిస్తూ, ఉపవాసం, దానం, విష్ణుభక్తి ప్రాముఖ్యతను బోధించాడు. అతని ఉపదేశాలే తరువాత అనేక ధర్మగ్రంథాలకు ఆధారమయ్యాయి. గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభువు ప్రతి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ రామానుజులు ఏకాదశి ఆచరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మధుమేహం, గర్భధారణ, దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు.. ‘ఓం నమో నారాయణాయ’భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి అనగా తొలి ఏకాదశిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని, ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.తొలి ఏకాదశి రోజున చేయవలసినవి- బ్రహ్మముహూర్తంలో లేవాలి.- స్నానం చేసి విష్ణుపూజ చేయాలి.- ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రాన్ని జపించాలి.- విష్ణు సహస్రనామం చదవాలి.- భగవద్గీత పారాయణం చేయాలి.- తులసి దళాలతో శ్రీమహావిష్ణువును అర్చించాలి.- ద్వాదశి రోజున అన్నదానం చేయాలి. విధిగా పారణ చేయాలి.చేయకూడనివి- కోపం, అసత్యం, పరనింద, మద్యపానం, మాంసాహారం, వ్యర్థ వాదనలు, అధిక నిద్రను త్యజించాలని శాస్త్రాలు చెబుతాయి.తొలి ఏకాదశి చెప్పే సందేశంతొలి ఏకాదశి మనకు కేవలం ఆహారాన్ని తగ్గించడం మాత్రమే కాదు, అహంకారం, కోపం, లోభం, అసూయ వంటి అంతరంగ దోషాలను తగ్గించుకోవాలని బోధిస్తుంది. భగవంతునికి దగ్గర కావడానికి ముందు మన మనస్సును పవిత్రం చేసుకోవాలనే సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుంది. తొలి ఏకాదశి అనేది ఒక పండుగ మాత్రమే కాదు; అది భక్తి, నియమం, ఆత్మపరిశీలన, ధర్మాచరణ, ప్రకృతితో సమన్వయ జీవన విధానానికి శ్రీకారం చుట్టే మహోన్నత దినం. పద్మ పురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణం వంటి శాస్త్రాలు దీనిని అత్యున్నత వ్రతాలలో ఒకటిగా కొనియాడాయి.– మద్దికుంట శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రంనిర్వహణ: డి.వి.ఆర్. -
అశాశ్వతత్వం..
ఒక పల్లెటూరి శివారులో ఒక వృద్ధుడు నివసించేవాడు. కొన్ని నెలల క్రితం అతడి భార్య చని పోయింది. భార్య చనిపోయి నెలలు గడిచినా, ఆమె జ్ఞాపకాలు అతడి హృదయాన్ని విడిచిపెట్టేవి కాదు. ఒకరోజు, భారమైన మనసుతో దేవాలయానికి వెళ్లాడు. పూజారి ‘ప్రాణులన్నీ అశాశ్వతములే.ఈ ధర్మాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే దుఃఖం తగ్గుతుంది. మనసు ఉపశమిస్తుంది!’ అన్నాడు. ఆ మాటలు అతని హృదయంలో ఆలోచనను రేకెత్తించాయి. ఇంటికి తిరిగి వచ్చి, భార్య ఇష్టపడే తోటలో కూర్చున్నాడు. అక్కడ ఒక వాడిపోయిన పువ్వు అతడి కనుల ముందే రాలి నేలపై పడింది. అతడు దాన్ని చేతిలోకి తీసుకుని మృదువుగా పలికాడు: ‘నువ్వు వచ్చావు, వెళ్లిపోయావు. కానీ నీ సువాసన మాత్రం మిగిలింది.’ఆ తరువాత అతడు ప్రతిరోజూ అశాశ్వత ధర్మం గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని హృదయం తేలికైంది. భార్యను కోల్పోయిన బాధ తగ్గలేదు కానీ ఆమెను ప్రేమించిన శాంతి పెరిగింది. ‘అశాశ్వతత్వాన్ని అంగీకరించడం అంటే విడిచిపెట్టడం కాదు, మనసును విముక్తి చేయడం! అనుకున్నాడు. మహా భారతం, శాంతిపర్వంలోని ఈ పద్యం అతడికి జ్ఞాపకానికి వచ్చింది.'కం. భూతము లనిత్యములు, నీవీ తెరువెప్పుడును విం దహీన ధృతిన్ నీచేతోగతి నలవఱపుముభూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్'‘ప్రాణులన్నీ అశాశ్వతములే. ఈ ధర్మాన్ని గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నావు. కనుక, ధైర్యం నిండిన మనస్సుతో, ప్రాణములు అశాశ్వతాలనే ధర్మాన్ని అభ్యసించడం మొదలుపెట్టు.ఆ జ్ఞానమే అన్ని దుఃఖాలను పోగొట్టి మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది!’ అని తనవంటి వారి గురించే చెప్పినట్లున్న పై పద్యం భావాన్ని స్ఫురణకు తెచ్చుకున్నపుడు అతడిలోని దుఃఖం పూర్తిగా ఉపశమించి, మనసుశాంతిని పొందింది.– భట్టు వెంకటరావు -
గోవర్ధన తీర్థం: ఒకానొకప్పుడు జాబాలి అనే..
ఒకానొకప్పుడు జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు ఉండేవాడు. వ్యవసాయంలో పొలం దున్నడానికి నాగలికి జోడెద్దులను కట్టేవాడు. అతడు ఎడ్లను సరిగా చూసుకునేవాడు కాదు సరికదా, నీరసించిన ఆ ఎడ్లు వడి వడిగా పొలం దున్నలేకపోతే, చీటికి మాటికి వాటిని మునికోలతో కొడుతూ, పొడుస్తూ హింసించేవాడు. పాపం! నోరులేని ఆ మూగజీవాలు అతడు పెట్టే బాధలకు భరిస్తూ, లోలోన దుఃఖిస్తూనే పనిచేస్తుండేవి.ఒకనాడు గోమాత అయిన కామధేనువు ఆ ఎద్దుల బాధను చూసింది. వాటి బాధలకు కలత చెందింది. ఆమె నందీశ్వరుడి వద్దకు వెళ్లి, ఆ ఎద్దులు పడే బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కామధేనువు ద్వారా అంతా విన్న నందీశ్వరుడు ఆ వృషభాలపై జాలి చెందాడు. తన ప్రభువైన పరమశివుని వద్దకు వెళ్లి, జాబాలి వద్దనున్న ఎద్దులు పడే బాధలు చెప్పాడు. ‘నందీ! నువ్వేమీ దిగులు చెందకు. ఈ విషయంలో నువ్వు తలచినది జరిగేలా వరమిస్తున్నాను. నీకు ఇష్టమైన రీతిలో నీ కోరిక నెరవేర్చుకో’ అన్నాడు పరమశివుడు.నందీశ్వరుడు వెంటనే ముల్లోకాలలో ఉన్న గోజాతిని సమావేశపరచాడు. ‘మీరెవ్వరూ ఇక్కడి నుంచి మరెక్కడికీ పోవద్దు. మీరు ఎవ్వరికీ కనిపించవద్దు’ అని ఆదేశించాడు.రోజులు గడుస్తున్నా, గోజాతి కనిపించకపోవడంతో ముల్లోకాలలోనూ గగ్గోలు మొదలైంది. దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, మొరపెట్టుకున్నారు.‘బ్రహ్మదేవా! ఏమైందో ఏమో గోజాతి అంతా ఒక్కసారిగా మాయమైంది. ముల్లోకాలలోనూ ఒక గోవూ కనిపించడం లేదు. గోవులు లేకుండా ముల్లోకాలలో జనులు జీవించడమెలా?’ అని వాపోయారు.‘దేవతలారా! ఇందులో నేను చేయగలిగినదేమీ లేదు. మీరంతా పశుపతి అయిన పరమశివుని వద్దకు వెళ్లి ప్రార్థించండి. అతడే తరుణోపాయం చెప్పగలడు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలంతా కైలాసానికి చేరుకున్నారు. పరమశివుని స్తుతించి, ముల్లోకాలలోనూ గోగణాలు కనిపించకుండా పోయిన సంగతిని విన్నవించుకున్నారు.‘గోగణాల సంగతి నాకేం తెలుసు? నా వాహనం నందీశ్వరుడిని అడగండి’ అని చిద్విలాసంగా చెప్పాడు పరమశివుడు.దేవతలు నందీశ్వరుడి వద్దకు వెళ్లారు.‘నందీశ్వరా! పరోపకారీ! దయచూపి, మాకు గోప్రదానం చేసి, లోకాలను రక్షించు’ అని వేడుకున్నారు.‘దేవతలారా! గోసంతతికి చెందిన వృషభాలను జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు బాధలు పెడుతున్నాడు. అందుకు ప్రతిగానే నేను గోగణాలను నా ఆశ్రయంలో ఉంచాను. మీరందరూ గోమతీ తీరానికి వెళ్లి, అక్కడ గోసవన యాగం చేయండి. గోహింసను పాపంగా ప్రకటించండి. అక్కడకు ముల్లోకాలకు చెందిన గోవులన్నీ వచ్చి, మిమ్మల్ని సంతుష్టులను చేస్తాయి’ అని పలికాడు.నందీశ్వరుడు చెప్పినట్లే దేవతలు గోమతీ తీరంలో గోసవన యాగం ప్రారంభించారు. యాగం మొదలైన కొద్దిసేపటిలోనే ముల్లోకాల గోగణాలన్నీ లెక్కకు మిక్కిలిగా అక్కడకు చేరుకున్నాయి. నేల ఈనినట్లు గోమతీ తీరమంతా ఎటు చూసినా గోగణాలతో కళకళలాడింది. దేవతలు, మానవులు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. గోవులు తిరిగి కనిపించడంతో వారంతా పరమానందం చెందారు.దేవతలు చేపట్టిన గోసవన యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. నాటి నుంచి ముల్లోకాలలోను గోవులకు పూజ్యత హెచ్చింది. దేవతలు గోసవన యాగం చేపట్టిన ప్రదేశం గోవర్ధన తీర్థంగా ప్రసిద్ధి పొందింది.పురావిశేషం..ఈశాన్య రాష్ట్రాల్లోని అరుదైన పురాతన దేవాలయాల్లో మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని మహాబలి ఆలయం ఒకటి. దీనిని క్రీస్తుశకం 1725లో నాటి రాజు గరీబ్ నివాజ్ నిర్మించాడు. అతడిని స్థానికంగా ‘మహారాజా పామ్హీబా’ అని పిలుస్తారు. అప్పట్లో మణిపూర్లోని సన్యాసి శాంతిదాస్ గోసాయి బోధనలకు ఆకర్షితుడైన గరీబ్ నివాజ్, ఆయన వద్ద రాముడిని ఆరాధించే ‘రామానంది’ మతాన్ని స్వీకరించాడు. రామదూత హనుమంతుడు మూలవిరాట్టుగా ‘మహాబలి’ ఆలయాన్ని ఇంఫాల్ నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం బెంగాలీ ‘దో–చాలా’ శైలిలో ఉంటుంది. ఆలయ గర్భగుడిలోని హనుమంతుడి విగ్రహం నృత్యభంగిమలో ఉండటం విశేషం. గరీబ్ నివాజ్ మరణానంతరం మణిపూర్లో రామానంది మతం కనుమరుగై, గౌడీయ వైష్ణవం ప్రాబల్యం పుంజుకుంది. ఈ ఆలయంలో ఏటా హనుమజ్జయంతి, దీపావళి, హోలీ వేడుకలు విశేషంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి. -
మానవీయతే ఇస్లాం హృదయం
ఇస్లాం ధర్మం కేవలం కొన్ని ఆరాధనల సమాహారం కాదు; అది పరస్పర ప్రేమ, కరుణ, మాన వీయ విలువలతో కూడిన సంపూర్ణ జీవన విధానం. ‘భూమిపై ఉన్నవారి పట్ల మీరు దయ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు (సృష్టికర్త) మీ పట్ల దయ చూపుతాడు’ అనే ప్రవక్త (స) వారి బోధన ఇస్లామీయ మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది.ఒకరి కష్టాన్ని చూసి చలించి పోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథలను ఆదరించడం, తోటి మనిషిని చిరునవ్వుతో పలకరించడం కూడా ఇస్లాంలో పుణ్యకార్యం (సదఖా)గా పరిగణించబడుతుంది. నిజమైన విశ్వాసం అనేది తోటి మనుషులకు మేలు చేయడంలోనే దాగి ఉందనేది ఇస్లాం అంతరార్థం. తన పొరుగువాడు ఆకలితో అలమటిస్తుంటే, తాను మాత్రం తృప్తిగా భుజించేవాడు నిజమైన విశ్వాసి కాదనే హెచ్చరిక సమాజం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుంది.హృదయాలను ముక్కలు చేయడం కాదు, గాయపడిన హృద యాలను ఆప్యాయతతో కలపడమే ఇస్లాం నేర్పిన జీవన విధానం. మనుషుల మధ్య ద్వేషాన్ని తుడిచేసి, క్షమా గుణాన్ని, సహనాన్ని అలవర్చుకున్నప్పుడే ఒక మనిషి సృష్టికర్తకు అత్యంత ప్రియమైనవాడిగా మారతాడు. సృష్టిలోని ప్రాణులన్నిటినీ ప్రేమిస్తేనే దైవాన్ని ప్రేమించినవారమవుతామనే ఉదాత్త సందేశం ఇస్లామీయ జీవన విధానంలో ప్రతిధ్వనిస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
ప్రత్యామ్నాయంలేని ప్రేమ యాత్రలు
దేవుని వరమైన మెస్సీయాను, ఆ మెస్సీయ అనబడే క్రీస్తుకు ప్రత్యామ్నాయంగా ఎవరిని ఊహించనైనా ఊహించలేము. ప్రేమకు ప్రతిరూపం అయినా ఆయన ప్రేమయాత్రలకు కూడా ప్రత్యామ్నాయాలు కనుగొనలేము. యేసు జీవితాన్ని ఆయన ప్రేమ సంబంధ పాదయాత్రలను వేరు చేసి ఎన్నడూ చూడలేము. తల్లిదండ్రులకు లోబడుతూ పెద్దలైన మనుష్యులు దయయందును, దేవుని దయయందును వర్ధిల్లిన బాల్యజీవితం యేసుది.బాలయేసు కార్టూన్ చిత్రాలలో ఆయన పాత్ర తీరుతెన్నులు ఆకాశంలో విహరించక పిల్లలను నైతిక విలువలతో అలరించడమే కాక పెద్దల పర్యవేక్షణలో సత్ప్రవర్తనతో మెలిగేలా ్రపోత్సహించడం విశేషం. అన్ని భాషల్లోని నవలా నాయకులు లేదా సినిమా, టీవీ కథానాయకుల (ప్రోటోగనిస్ట్స్) పాత్రల సృష్టిలో, ఈనాటి నేటి ఏఐ ఆధారిత వీడియోల ముఖ్య ప్రధాన పాత్రలలో వాటి ఉన్నతమైన వైవిధ్య విధాన రూపకల్పనలలో, మరి ముఖ్యంగా ‘హీరోహోదా’ కోసం యేసు జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన బోధలు, మాటలను పోరాటపటిమ స్ఫూర్తిని వాడుతూ డబ్బు చేసుకుంటున్న నిర్మాతలకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి కొదువలేదు.వ్యక్తి పూజకు చోటిచ్చేలా సంతోషానందాలు ఇవే అనుకొనే భ్రమలలోనే అమాయక యువత చిక్కుకొని తమ విలువైన సమయం వెచ్చిస్తూ వినోదం కొనుక్కొనే వేళలలోనే ఇట్టి నయా ప్రేక్షకులను తెరనాయకులు థియేటర్లలో ఆకస్మికంగా వారిని దర్శించడం కంటె కూడా... బాధితులను, రోగులను, బీదలను, వృద్ధులను, నిరుపేద విద్యార్థులను ఆదుకొనేలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరామర్శించటం ఆదరించడం నిజమైన నాయకుల సహజ స్వాభావిక దైవిక లక్షణంగా అది ఎంచదగ్గదే. మేలైన రీతులలో వారిని గుర్తించదగ్గదే. ఎక్కడో మారుమూల పల్లెలతో పాటుగానే, నిలువనీడ లేనివారై ΄÷ట్ట చేతపట్టుకొని వచ్చి నగరాలను నిర్మించే వలస కార్మిక శ్రమజీవులు ఎక్కడున్నా వారి గుడారాల చెంతనే వారిని పరామర్శిస్తూ వారికి న్యాయసంబంధ సేవలందించడం క్షేత్రస్థాయి పర్యటనే.నిజానికి బీదలు, రోగులు, ఖైదీలను దైవిక ప్రేమతో పరామర్శించి వారికి ధైర్యం నూరిపోస్తే ఇలా క్రియరూపాన ఆ గొప్పదైన ప్రేమను అంతటా కనబరిస్తే మీరు నన్నే ప్రేమించినట్టు అని యేసే స్వయంగా చెప్పడం విశేషం. గొప్ప గొప్ప నాయకులకే చెల్లును పాదయాత్రలు అంటూ అవి వారికే పరిమితం చేయక ఇలా ఎవరికి వారు అనుకోక వ్యక్తుల మేలు కోరి వ్యక్తిగతంగా దూర భారాలను లెక్కచేయక యేసును బట్టి యేసు ప్రేమతో యేసు మెప్పు పొందేలా ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చు.భవిష్యద్దర్శనం వాస్తవంలోనే నిలబెట్టి గెలిపిస్తుంది. కలల్లో ఊహల్లో సంచరిస్తూ గాల్లోతేలియాడడం కాక నేలమీదనే హుందాగా నిలబడడం నాయకత్వం. నడక నాయకత్వ లక్షణం కూడానూ. సకాలంలో స్పందించేలా నేరుగా వచ్చి అతి దగ్గరగా సమస్యలను వాటి ప్రభావ విపత్తులను చూసేలా వాటి పరిష్కారం కొరకు అవిశ్రాంతంగా కృషి చేసేలా ఇలా సామాన్య జనంబాట పడుతూ దీనజనుల పరామర్శకు, బాధితుల ఓదార్పుకు నాయకుడనేవాడు తన పాదాలను నమ్ముకోవడం ఎప్పుడూ ఉత్తమమే. ఇలాంటి వీరే యేసువలె విజయ సృష్టికర్తలుగా, తిరుగులేని నాయకులుగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకోగలుగుతారు.– జేతమ్ -
ప్రకృతి గుండె చప్పుడు విందాం
మన్హా.. పదేళ్ల పసిపాప. ఆమెకు అడవి అంటే కేవలం చెట్లు కాదు, అది ఆమె ప్రాణ స్నేహితురాలు. తన చిన్నారి చేతులతో అల్లిన వెదురు బుట్టలో సేకరించిన విత్తనాలను తీసుకుని ఆమె అరణ్యంలోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ ఆమె రాకను గమనించిన పక్షులు, ఒకదానికొకటి వార్తను పంచుకుంటూ ఆమె చుట్టూ వందలాదిగా చేరేవి. అవి ఆమె భుజాల మీద, తల మీద వాలుతూ ఒక అపురూపమైన ఆత్మీయతను పంచేవి. మన్హా విత్తనాలను నేలపై చల్లుతుంటే, అవి ముత్యాలను ఏరుకున్నట్లు గింజలను ఏరుకుంటూ చేసే ఆ ‘కిలకిలలు’ ఆమె ప్రపంచానికి సంగీతం.కానీ ఆ రోజు, ఆమె అడుగుల చప్పుడు తప్ప అడవిలో మరే శబ్దమూ లేదు. ఆకాశం నీలి రంగును కోల్పోయి, ఏదో తెల్లని పొగమంచులాంటి దుమ్ముతో నిండిపోయింది. ఆమె పరుగు పరుగున తన అభిమాన రావి చెట్టు దగ్గరకు వెళ్లింది. వందలాది ఏళ్ల చరిత్ర కలిగిన ఆ వృక్షం, ఇప్పుడు ఒక అస్థిపంజరంలా కనిపిస్తోంది. దాని ఆకులన్నీ రాలిపోయి, ఆ కొమ్మలు ఆకాశం వైపు చూస్తూ, ‘నన్ను కాపాడండి’ అని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. ‘నా స్నేహితులు ఏమయ్యారు? ఆ చిన్న పిచ్చుకమ్మ ఏది? నీలి రంగు రెక్కల పిట్ట ఏమైంది?’ అని మన్హా ఆ చెట్టును తాకుతూ వెక్కి వెక్కి ఏడ్చింది.అక్కడే ఒక బండరాయిపై కూర్చున్న వృద్ధ కాపరి, తన చిరిగిన కంబళిని సరిచేసుకుంటూ కన్నీరు నిండిన కళ్లతో అన్నాడు.. ‘అమ్మాయి.. అవి ఇక రావు. ఈ గాలిలో విషం ఉంది. మనం చేస్తున్న గనుల తవ్వకాలు, ఆ యంత్రాల కర్కశపు శబ్దాలు, పర్వతాలను పగులగొడుతున్న బాంబుల మోతలు.. ఆ సున్నితమైన జీవాలు భరించ లేకపోయాయి. చెట్టుప్రాణం పోయింది, పిట్ట రెక్క విరిగిపోయింది. మనిషి తన కడుపు నింపుకోవడానికి ఈ అడవి తల్లి కడుపును కోసేస్తున్నాడు’.మన్హాకు ఆ మాటలు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె చేతిలోని విత్తనాలు నేలపై జారిపోయాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడే అడవి, ఇప్పుడు ఒక ఎండిన ఎడారిలా ఆమె కళ్ల ముందు కనిపిస్తోంది.ఈ చిత్రం కేవలం ఒక ఊరుకో, ఒక అడవికో పరిమితం కాదు. భూమికి ఒక వైపున, మంచు ఖండాలు కన్నీరులా కరిగి సముద్రంలో కలిసిపోతున్నాయి. బంగారం, బొగ్గు, చమురు.. ఇవి మనిషికి సంపద కావచ్చు, కానీ ప్రకృతికి అవిప్రాణాధారాలు. మనిషి తన స్వార్థంతో ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుంటే, భూమి ఇప్పుడు అల్లాడిపోతోంది. ఊపిరి అందని నగరాలు, పంటల్లేని పొలాలు, అకాల వరదలు, అంతుచిక్కని వ్యాధులు.. ఇవన్నీ భూమి తల్లి పెడుతున్న కేకలు! కానీ.. ఈ విషాదంలోనూ ఒక చిన్న ఆశ మిగిలి ఉంది.మరుసటి రోజు కూడా మన్హా నిరాశ చెందలేదు. తన కళ్లను తుడుచుకుని, మళ్లీ బుట్ట నిండా విత్తనాలు నింపుకుని అడవికి వెళ్ళింది. పక్షులు లేవని ఆమెకు తెలుసు, కానీ అవి వస్తాయన్న నమ్మకం ఆమెది. అకస్మాత్తుగా, ఎండిపోయిన ఒక కొమ్మ చివర నుండి ఒక సన్నని గొంతు వినిపించింది. అది ఆమెకు బాగా తెలిసిన ఆ చిన్న పిచ్చుక! అది నీరసంగా ఉన్నా, మన్హా వైపు చూస్తూ రెక్కలు ఆడిస్తోంది.ఆ ఒక్క పక్షి మన్హాకు ఒక గొప్ప సత్యాన్ని బోధించింది: ‘నువ్వు ఒక్క అడుగు ముందుకేసి ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టు, నేను మళ్లీప్రాణం పోసుకుంటాను.‘ మన్హా నాటుతున్న ఆ చిన్న విత్తనం రేపు ఒక మహావృక్షం కావాలి. మనందరిలోనూ ఆ మన్హా మేల్కొనాలి. లేదంటే, ప్రకృతి లేని ప్రపంచంలో మనిషి కూడా ఒక శిలాజంలా మిగిలి పోవాల్సి వస్తుంది.– ముహమ్మద్ ముజాహిద్ -
వారాహి గుప్త నవరాత్రులంటే ఏమిటి?
నేటి ఆధునిక సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబ కలహాలు, అనారోగ్యం. వాటితోపాటు న్యాయపరమైన, ఆర్థిక పరమైన ఇబ్బందులు, శత్రు బాధలు సర్వసాధారణం అయిపోయాయి. ఇటువంటి సమస్యలు వారాహి దేవి ఆరాధనతో తొలగిపోతాయని, ముఖ్యంగా వారాహి దేవిని ఆరాధిస్తే శత్రు బాధలు తొలగిపోతాయని, మన ససమ్యలన్నింటికీ అమ్మ అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందనీ నమ్మకం. శక్తి దేవతల ఆరాధనకు ప్రసిద్ధి చెందిన విశిష్టమైన కాలం ఆషాఢ నవరాత్రులు. ఈ ఏడాది వారాహి గుప్త నవరాత్రులు బుధవారంప్రారంభం అయ్యాయి. ఈ నవరాత్రుల్లో ఆచరించాల్సిన విధివిధానాలేమిటో తెలుసుకుందాం.తెలుగు పంచాంగం ప్రకారం వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి, నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది జూలై 15, బుధవారం ప్రారంభమయ్యాయి. 23, గురువారం వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ పవిత్ర దినాలలో శ్రీ వారాహి అమ్మని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మ అనుగ్రహంతో కష్టాలనుంచి, చిక్కుల నుంచి బయట పడవచ్చునని శక్తి ఉపాసకులు చెబుతారు.గుప్త నవరాత్రులంటే ఏమిటి? ’గుప్త’ అంటే రహస్యం. ఈ నవరాత్రులలో అమ్మవారిని రహస్యంగా, నిష్టతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే వారాహి నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రులని కూడా అంటారు.వారాహి దేవి ఎవరు?లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని అభివర్ణిస్తారు. సప్త మాతృకలలో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు అత్యంత శక్తిమంతమైన రూపం. ఈమె పరమేశ్వరుడి అనుగ్రహంతో అంధకాసుర సంహారం కోసం అవతరించినట్లు దేవీ పురాణం చెబుతోంది.పూజా విధానంవారాహి గుప్త నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. ప్రతిరోజు సూర్యాస్తమయం తరువాత రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య వారాహి దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని దేవి పురాణం చెబుతోంది. సూర్యాస్తమయం తరువాత శుచిగా స్నానం ఆచరించి అమ్మవారి రూపాన్ని ప్రతిష్టించి మనసులో సంకల్పం చెప్పుకుని 9 రోజుల దీక్ష తీసుకోవాలి. వారాహి అమ్మ వారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్టించాలి.నైవేద్యాలు... దాన ధర్మాలుప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేయాలి. అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనస్సుతో వారాహి మూల మంత్రాలు జపించాలి. వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి. చివర్లో ధూప దీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతారు.పూజాఫలం ఏమిటి? భక్తిశ్రద్ధలతో వారాహి గుప్త నవరాత్రుల వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు, వారాహి దేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనుల్లో అభివద్ధి కలిగి, సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయ కేతనం ఎగుర వేయాలంటే వారాహి దేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు చెబుతున్నారు.రూపం ఉగ్రం... మానసం శాంతంవారాహి దేవి ఉగ్రంగా కనబడినప్పటికి తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ఈ ఆషాఢంలో వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, దృష్టి దోషాలు తొలగిపోతాయని, శత్రు పీడలు ఉండవని భక్తుల విశ్వాసం.క్షేత్ర పాలికగా వారాహీ దేవిసాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్ర పాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో అమ్మవారు నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే ఆరు చేతులు శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవియే క్షేత్రపాలిక. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవీ ఉపాసకులు అంటారు.ఈ వారాహి నవరాత్రులలో మనం కూడా వారాహి దేవిని 9 రోజులపాటు పూజించి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు పొందుదాం.– ఎం. శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం -
జగన్నాయకుడి జనయాత్ర
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, పూజనీయమైన హిందూ పండుగలలో ఒకటి జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఆలయంలో కొలువై ఉన్న మూలమూర్తులు ముగ్గురూ ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులను కలుసుకోవడానికి వెళతారు. ఈ రథయాత్రలో పాల్గొనడం, దానిని వీక్షించడం అనంతమైన పుణ్యఫలాలను చేకూరుస్తుందని ఆ గ్రంథాలు నొక్కి చెబుతున్నాయి.జగన్నాథ రథయాత్ర కేవలం పూరీకే పరిమితం కాదు. నేడు ఇది ఒక ప్రపంచవ్యాప్త వేడుకగా మారింది. పూరీ ప్రధాన కేంద్రం అయినప్పటికీ, ఈ ఉత్సవం ఇప్పుడు భారతదేశంలోని అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, లండన్, న్యూయార్క్, టొరంటో, సిడ్నీ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇతర నగరాలలో కూడా జరుపుకుంటారు.రథయాత్ర రోజు తెల్లవారుజాము నుండి పూరీ నగరం మొత్తం భక్తిజనంతో నిండి΄ోతుంది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ముందుగా దేవతా విగ్రహాలను పహండి అనే ఆచారంతో గుడి నుండి బయటకు తీసుకువచ్చి రథాలపై అధిష్టింపజేస్తారు. అప్పుడు శంఖారావాలు, మేళాలు, జయజయ ధ్వానాలతో ఆప్రాంతమంతా మారుమోగుతుంది.ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన రథం ఉంటుంది. జగన్నాథుని రథం పేరు నందిఘోష. ఇది ఎరుపు, పసుపు రంగులలో ఉంటుంది. దీనికి 16 పెద్ద చక్రాలు ఉంటాయి. బలభద్రుని రథం పేరు తాళధ్వజ. ఇది ఆకుపచ్చ, ఎరుపు రంగుల లో ఉంటుంది. దీనికి 14 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు దర్పదలన లేదా దేవదలన. ఇది నలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి 12 చక్రాలు ఉంటాయి. ఈ రథాలు చూడటానికి ఎంతో వైభవంగా ఉంటాయి.జగన్నాథ రథయాత్ర మనకు నేర్పే గొప్ప పాఠం సమానత్వం, కరుణ, భక్తి. జగన్నాథుడు భక్తులను కలుసుకోవడానికి స్వయంగా గుడి నుండి బయటకు వస్తారు. రాజు కూడా బంగారు చీపురుతో సేవ చేస్తారు. అందరూ కలిసి ఒకే తాడు లాగుతారు. ఇక్కడ చిన్న పెద్ద, పేద గొప్ప అనే తేడా ఉండదు. అందరూ ‘జై జగన్నాథ్’ అనే ఒక్క నామంతో ఒక్కటవుతారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత సమ్మిళితమైన హిందూ ఉత్సవం. రథాలను లాగడంప్రారంభించే ముందు ఒక అత్యంత ముఖ్యమైన ఆచారం జరుగుతుంది. దానిపేరు ఛేరా పహారా. జగన్నాథుని ముఖ్యసేవకుడిగా భావించే పూరీ గజపతిరాజు ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. రాజు బంగారు చీపురును చేతిలో పట్టుకుని చం దనం నీటిని చల్లుతూ మూడు రథాల వేదికలను స్వయంగా ఊడుస్తారు. తర్వాత రథాల చుట్టూ ప్రదక్షిణ చేసి దీపం వెలిగిస్తారు. ఛేరా పహారా తర్వాత ప్రధాన పండా ‘జై జగన్నాథ్’ అని గట్టిగా నినాదం ఇస్తారు. వెంటనే వేలాదిమంది భక్తులు తాళ్లను పట్టుకుని రథాలను లాగడం మొదలుపెడతారు. మొదట బలభద్రుని రథం, తర్వాత సుభద్రాదేవి రథం, చివరగా జగన్నాథుని నందిఘోష రథం కదులుతుంది.ఈ రథాలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వెళతాయి. ఇది జగన్నాథుని మేనత్తగారి ఇల్లని నమ్ముతారు. అక్కడ తొమ్మిది రోజుల పాటు దేవతలు విడిది చేస్తారు. ఈ తొమ్మిది రోజులు భక్తులు స్వామిని అక్కడే దర్శించుకుంటారు. గుండిచా ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు.తొమ్మిది రోజుల తర్వాత దేవతలు తిరిగి తమ ప్రధాన ఆలయానికి వస్తారు. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అంటారు. బహుదా యాత్ర తర్వాత 11వ రోజు సునావేశం అనే వేడుక జరుగుతుంది. ఈ రోజు దేవతలను బంగారు ఆభరణాలు, బంగారు కిరీటాలు, బంగారు చేతులు, బంగారు కాళ్ళతో అలంకరిస్తారు. చివరగా 12వ రోజు నీలాద్రి విజయం అనే ఆచారంతో దేవతలు తిరిగి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. దానితో రథయాత్ర ముగుస్తుంది. – కుందా శ్రీ కృష్ణ శాస్త్రి -
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా..
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా మంచి ప్రవర్తనతో, దైవచింతనతో జీవితం గడపాలనుకొనేవారు శుద్ధమైన ఆహారమే తీసుకోవాలి. ప్రేమ, దయ, దాక్షిణ్యం, కోపం లేకుండటం, ఉపకార బుద్ధి, ఇతరుల సుఖదుఃఖాలను తనవిగా భావించే గుణం వంటి గుణాలన్నీ సాత్త్విక గుణాలు. ఇవి శుద్ధమైన ఆహారం తీసుకోవటం వల్లనే కలుగుతాయి. దేశ కాల ప్రాంతాలకు అనుకూలంగా భోజనం చేయాలని శాస్త్ర వచనం.భీష్మాచార్యులవారు అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యమీద పడుకొన్నాడు. వైకుంఠ గమనానికి వేచి ఉన్నాడు. ఆయన చేసిన బోధలను పాండవులందరూ శ్రద్ధగా విన్నారు. ఆ సమయంలో దూరం నుండి వింటున్న ద్రౌపదీ దేవి నవ్వింది. తన మాటలు విని నవ్వినందుకు భీష్ముని మనస్సు బాధపడింది. కారణం తెలియగోరాడు. ద్రౌపది వినయంగా విన్నవించింది. ‘అయ్యా! మీరు మాకెప్పడూ ధర్మ ప్రబోధం చేయవలసినవారే. ఇప్పుడు నా నవ్వుకు కారణం మాత్రం వేరే ఉంది. మరేమీ లేదు. ఆనాడు నిండు కౌరవసభలో అందరూ చూస్తుండగా దుశ్శాసనుడు నాకు వస్త్రాపహరణం చేశాడు. అప్పుడా సభలో మీరు కూడా ఉన్నారు. కాని ఇది అకృత్యమని మీరెవరికీ బుద్ధి చెప్పలేదు. పోనీ ఆ దుష్కృత్యాన్ని చూడలేక అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళనూ లేదు. అదీ కాకపోతే రెండు కళ్ళు మూసుకొనవచ్చు కదా! అదీ చేయలేదు మీరు. అలాంటి మీకిప్పుడు ఈ ధర్మప్రబోధం చేయాలనే బుద్ధి యెలా పొడమింది? అని సందేహం కలిగి నవ్వాను’.‘అమ్మా! ద్రౌపదీదేవీ! నీకు సందేహం రావలసినదే తల్లీ! నిన్న మొన్నటివరకు నేను కౌరవుల పక్షంలోనే ఉన్నాను కదా! వారి ఉప్పు తిన్నవాడనయ్యాను. వారి ఆహార ప్రభావం వల్ల వాళ్ళ మాటలే చెవికెక్కాయి. నేను గాంగేయుడను. తిరిగి నా తల్లి గంగతోనే పవిత్రుడను కావాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు తన బాణంతో పాతాళం నుంచి పరమ పవిత్రమైన గంగాజలాన్ని పైకి తెప్పించాడు. దాని ప్రభావంతో లోగడ కోల్పోయిన సాత్త్విక భావన తిరిగి వచ్చింది తల్లీ!’ అని చెప్పాడు. ‘ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః సత్త్వ శుద్ధౌ ధ్రువామతిః’- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
రేపటి నుంచే 'వారాహి గుప్త నవరాత్రులు'.. పూర్తి పూజా విధానం ఇదిగో
సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు రేపటి నుంచి (జూలై 15, బుధవారం) వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటి నుంచి ప్రారంభమై జూలై 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా సాగనున్నాయి.లలితా త్రిపురసుందరి దేవి మహా సైన్యాధిపతి అయిన వారాహి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు నిష్ఠతో, గుప్తంగా ఆరాధిస్తే సమస్త నరఘోషలు, శత్రుపీడలు, అప్పుల బాధలు తొలగిపోతాయని దేవీ భాగవతం చెబుతోంది. భక్తులు ఈ పవిత్ర దినాలలో ప్రతిరోజూ పూజ గదిని శుభ్రం చేసుకుని, ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి, అమ్మవారి మూల మంత్రాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన బెల్లం పానకం, శనగలు, పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
వారాహి దేవి పూజలో ఈ రహస్య నియమాలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహం ఖాయం
-
అనుగ్రహం అవసరం!
సురాసురులు కలిసి కష్టించి, ఎన్నెన్నో మహత్తరమైన అవరోధాలనూ, విఘ్నాలనూ అధిగమించి, ఎట్టకేలకు అమృతం సాధించారు. ధన్వంతరి అందించిన అమృత కలశాన్ని తటాలున అందుకొని, అసురులు అన్యాయంగా స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికప్పుడు శ్రీహరి మోహినీ అవతారాన్ని ఎత్తి, వాళ్ళను కామ మోహితులను చేశాడు. ఆ మోహంతో వాళ్ళు అందరికీ అమృతం పంచే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె దాన్ని ఎలా పంచినా, తాము అడ్డుపడమని ఒప్పందం చేసుకొన్నారు.మోహిని అమృతాన్ని మొదట దేవతల పంక్తికి పంచటం పూర్తయేసరికి, పాత్ర ఖాళీ అయిపోయింది. ఆమె అంతర్ధానమై పోయింది. రాక్షసులకు ఏమీ మిగలలేదు. రాహువు అనే రాక్షసుడు మాత్రం, మారువేషంలో దేవతల పంక్తిలో చేరి, అమృతం పుచ్చుకొన్నాడు. సూర్యచంద్రులు ఇది గమనించి చెప్పగానే, సుదర్శన చక్రం రివ్వున వచ్చి, పుచ్చుకొన్న అమృతం నాలుక దాటకుండానే, రాహువు తలను నరికి వేసింది. అమృత ప్రభావం వల్ల అతడి తల సజీవంగా మిగిలిపోయింది. అమృత స్పర్శ లేని మొండెం పతనమై నశించింది. (అప్పటి నుంచి ‘రాహువు తల’ అనేది ప్రత్యేకంగా లేదు. రాహువు అంటేనే రాహువు తల. కాబట్టి ‘రాహు మస్తకం’ అని చెప్పనక్కర్లేదు. చెప్తే అది, ‘సీతా ఫలం పండు’, ‘పేపరు కాగితం’ అన్నట్టు పునరుక్తి అవుతుంది!)దేవాసురులు ఒకే పరిస్థితులలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, ఒకే సాధన సామగ్రితో, ఒకే విధమైన శ్రమను, ఒకే సంకల్పంతో చేశారు. కానీ వాళ్ళకు లభించిన ఫలంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏవం సురాసుర గణాః సమ దేశ, కాల,/ హేతు–అర్థ, కర్మ, మతయః–అపి, ఫలే వికల్పాః. ఎలాంటి తేడాలు? తత్ర అమృతం సురగణాః ఫలం–అంజనా–ఆపుః, నదైత్యాః – అక్కడ సురగణాలు అమృతం అనే ఫలాన్ని సులభంగా పొందారు, దైత్యులు పొందలేదు. కారణమేమిటి? పాద పంకజ రజ–ఆశ్రయాత్– శ్రీహరి పదకమలాల ధూళిని (దేవతలు) ఆశ్ర యించి, సేవించటం వల్ల. హరి విముఖులు కనక అసురుల శ్రమ నిష్ఫలమైంది. శ్రమకు దైవానుగ్రహం తోడయి తేనే ఫల ప్రాప్తి ఉంటుంది, అంటుంది భాగవతం.– ఎం.మారుతి శాస్త్రి -
మార్గదర్శకమైన యాత్ర
ఒకడు మంచిగా ప్రవర్తించాలంటే, ఈ సమాజానికి ఉన్నత విధానాలలో మేలు చేయాలంటే, ఏదో ఒకచోట ఎక్కడో ఒక సందర్భంలో యేసును అనుకరించి అనుసరించక తప్పదు అనేంతగా యేసు జీవితాన్ని అసాధారణరీతిలో స్ఫూర్తివంతంగా సర్వమానవాళి ముందుపెట్టాడు ఆ మహాదేవుడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే, నిరంతరం అనుక్షణం తండ్రియైన దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా ఆమోదయోగ్యంగా జీవించినందు వల్లే యేసు జీవితం యావత్తూ అంగీకరించబడి మానవాళికి గొప్ప మార్గదర్శకంగా ఉందన టంలో ఎలాంటి సందేహం లేదు.యేసు ఒక్క ఆధ్యాత్మికరంగానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు. అన్ని రంగాల వారికి యేసు ఒక గొప్ప అరుదైన స్ఫూర్తిదాయకం. ప్రజాసేవకు అంకితమై సమర్పణ జీవితంతో నిరంతరం ప్రజల గూర్చే ఆలోచిస్తూ ప్రజలకు మేలు చేయాలనే తెగింపుగల నాయకులకు, పోరాట యోధులకు యేసే గొప్ప దిక్సూచి. అబద్దపు వాగ్దానాలు చేయక, ఊసరవెల్లి వేషాలు వేయక, అసత్య ప్రచారాల జోలికిపోక నమ్మకమైన నీతివంతమైన రాజకీయాలు చేసే వారికి కూడా యేసే ఆదర్శం. రాజకీయ నాయకులు లేదా పార్టీలు ఎన్నికల ప్రచారం ద్వారా ప్రజలను ఆకట్టుకుని విజయం సాధించితీరాలనే తపనతో అట్టి గురి కలిగి చేసే పాదయాత్రలను పర్యటనలను కూడా జైత్రయాత్రగా అభివర్ణిస్తారు.ఆధ్యాత్మిక నాయకులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, ఆరోగ్య పరిరక్షకులు, న్యాయవాదులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, దర్శకులు, జవానులు, కిసానులు, వ్యాపారవేత్తలు, భవిష్యద్దర్శకులు (విజనరీస్), వ్యక్తిత్వవికాస నిపుణులు, మార్గదర్శకులు, పరిశోధకులు, బోధకులు, జ్ఞానులు, వద్ధులు, చివరకు శత్రువులు ఇట్టి వారు ఎవరైనా ఎంతటి వారైనా యేసును, ఆయన జీవిత స్ఫూర్తిని ప్రత్యక్షంగా వెంటాడక తప్పదు. లేకుంటే వారికి మేలైన సారవంతమైన జీవితమే లేదు. వారి ఉనికే ప్రశ్నార్ధకం కూడా? తమకు తెలియకుండానే యేసును పరోక్షంగా అనుసరించేవారు ఎందరెందరో ఉన్నారనేది లెక్కేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదే గొప్పదైన యేసు జైత్రయాత్ర సంబంధిత జయ జీవితం.– జేతమ్ -
అత్యంత విశిష్టమైన ఏకాదశి
హిందూ సంప్రదాయంలో ఏకాదశిది ఎంతో విశిష్ట స్థానం. వాటిలో జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుతోపాటు మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఉపవాసం, పూజలు, జపం, దానం వంటి ధార్మిక కార్యాలను ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు పేర్కొంటాయి.ఈ వ్రతం వేలాదిమందికి అన్నదానం చేసినంత ఫలాన్నిస్తుందని ప్రతీతి. తులసిని‘హరిప్రియ’గా పిలుస్తారు. అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మొక్క. అందుకే తులసి లేకుండా విష్ణుపూజ అసంపూర్ణమని సంప్రదాయం చెబుతోంది. యోగిని ఏకాదశి రోజున తులసిని భక్తితో పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, సానుకూల వాతావరణం పెరుగుతాయని విశ్వాసం. -
యద్భావం తద్భవతి: మనసులో మంచి భావనలు ఉంటే అంతా..
‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’ ప్రాపంచిక బంధాలలో చిక్కుకోవడానికిగానీ, వాటినుండి విడుదల పొందడానికి కానీ; మన సు ఖానికిగానీ, దుఃఖానికి కానీ; అభ్యున్నతికిగానీ, పతనానికి కానీ – ఇలా దేనికైనా మన మనసు, అందులో ఎగిసిపడే ఆలోచనలే కారణాలని చెబుతూ శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరోజు తమ శిష్యులకు మనిషి మనసులోని కోరికలు, ఆశలు అతనిని ఎలా పతనం చేస్తాయో వివరించడానికి ఈ కథను చెప్పారు.ఒక వర్తకుడు వ్యా΄ార నిమిత్తం తన గ్రామం నుండి పట్టణానికి నడిచి వెడుతున్నాడు. ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పటిలాగా రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు కాబట్టి తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం దాకా నడిచేసరికి బాగా అలసిపోయాడు. మరొక నాలుగైదు గంటలు నడిస్తే కానీ గమ్యం చేరలేడు. కనుక ఎక్కడైనా తగిన చోటు దొరికితే కాసేపు ఆగి బడలిక తీర్చుకొందామనుకొన్నాడు. అతని అదృష్టం కొద్దీ ఒక పెద్ద చెట్టు, దాని చుట్టూ అరుగు కనిపించాయి. పరమానందంగా ఆ చెట్టు నీడన ఆ అరుగుపై కాళ్ళు చాచి పడుకొన్నాడు.చల్లగా వీస్తున్న గాలి అతని మార్గాయాసాన్ని కాస్త ఉపశమింపజేసింది. అప్పుడతనికి తన దాహం తెలిసింది. ‘తాగడానికి నీరు లభిస్తే ఎంత బాగుంటుందో’ అనుకొన్నాడు. వెంటనే అతని పక్కన ఒక ΄ాత్రలో చల్లని నీరు ప్రత్యక్షమైంది. ఆశ్చర్యపోతూ అమృత తుల్యంగా ఉన్న ఆ నీటిని తాగి దాహం తీర్చుకొన్నాడు. దాహం తీరగానే అతని మనసు భోజనం పైకి మళ్ళింది. ‘బాగా ఆకలి వేస్తోంది. తినడానికి మంచి భోజనం లభిస్తే బాగుండు’ అని అనుకుంటూండగానే అతని ఎదుట పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించబడిన విందు భోజనం అరిటాకులో సిద్ధంగా కన్పించింది.ఎంతో సంబరంగా కడుపునిండా భోంచేశాడు. కాసేపు కునుకు తీస్తేగానీ భుక్తాయాసం తీరి నడక ముందుకు సాగదు. ఈ అరుగు పైన మెత్తటి పరుపు, తలగడ అమరితే బాగుండు అని మనసులో అనుకొన్నాడో లేదో తక్షణం అతని ఎదుట హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. దానిపై పడుకొని ‘ఇప్పుడెవరైనా నా కాళ్ళు పడితే బ్రహ్మాండంగా నిద్ర పోవచ్చు’ అని అనుకొన్న మరుక్షణం ఇద్దరు అపురూపమైన అందగత్తెలు అతని కాళ్ళు పట్టడం మొదలు పెట్టారు. తాను ఏ చెట్టు నీడన కూర్చున్నాడో అది కల్పవృక్షమనీ, అతడు మనసులో ఏది కోరుకొన్నా దానిని వెంటనే ప్రసాదిస్తుందనీ అతనికి తెలియదు.ఇప్పుడు అతనికి ఒక అనుమానం మొదలైంది. ‘ఈ అడవిలో నేను గనుక గాఢంగా నిద్రపోతే, ఒంటరిగా, నిరాయుధుడుగా ఉన్న నన్ను ఏ పెద్దపులో వచ్చి చూసిందంటే నా గతి ఏమౌతుందో’ అనుకొంటూండగానే ఎక్కణ్ణుంచో గాండ్రుమంటూ ఒక పెద్దపులి వచ్చి, అతనిపై భీకరంగా దాడిచేసి చంపేసింది. అంతటితో ఆతని కోరికలన్నీ అంతమైపోయాయి. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు మన మనసులో మంచి భావనలు ఉంటే మనకు మంచే జరుగుతుంది. లేకపోతే మన గతి అథోగతే అన్నది శ్రీ రామకృష్ణులు ఈ కథ ద్వారా మనకు అందించిన సందేశం.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రినిర్వహణ : డి.వి.ఆర్ -
ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి..
మనం మాట్లాడే మాటల శబ్దాలు మనపైన, ప్రకృతిపైన ప్రభావం చూపుతాయి. అవే శబ్దాలు వేద మంత్రాలకు సంబంధించినవైతే మరింత గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి. అశుద్ధమైన మాటలు వినడం, చెడు దృశ్యాలు చూడటం వంటివి మనసుపై చెడు ప్రభావం చూపుతాయి. ప్రియమైన మాటలు మాట్లాడితే సకల ప్రాణులూ ఆనందిస్తాయి. ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి. వినయ పూర్వక సత్య వచనాలు పలకడం ద్వారానే బంధువులు, స్నేహితులు దగ్గర అవుతారు. అలా మాట్లాడ గలిగే వారు సంఘంలో రాణిస్తారు.తైత్తిరీయారణ్యకం ‘మనో వాక్కాయ కర్మాణి శుధ్యన్తామ్’ అని చెప్పింది. అంటే మనస్సు, మాట, పనులను (త్రికరణములు) పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇతరుల మనసులు గాయపరుస్తూ, బాధించేలా మాట్లాడకూడదు. అలా చేయడం కూడా హింసే అన్నారు గాంధీజీ. మాట్లాడగలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి. ‘మధుర భాషణమున మర్యాదప్రాప్తించు’ అన్నారు పెద్దలు. మంచి మాట ఆభరణమే కాదు, దివ్యశక్తి కూడా! దానిని మనం మితంగా, జాగ్రత్తగా వినియోగించాలి. రఘువంశపు రాజులందరూ ‘సత్యాయ మిత భాషిణాం’ అని కాళిదాస మహాకవి అన్నారు. అంటే సత్య సంరక్షణార్థం ఆ రాజులు మిత భాషిత్వాన్ని పాటించారని అర్థం.మనిషికి నాలుక ముందు పుట్టి తర్వాత దంతాలు ఏర్పడుతాయి. కానీ నాలుక కంటే వెనుక పుట్టిన దంతాలే ముందుగా ఎందుకు ఊడిపోతాయి అనే ప్రశ్నకు శ్రీ రామకృష్ణ పరమహంస చక్కని వివరణ ఇచ్చారు. ‘దంతాలు కఠినంగా ఉంటాయి. వాటికి వినయంతో కూడిన మెత్తదనం లేదు. నాలుక మృదువుగా అణకువతో ఉండి త్వరగా బయటకు కనపడదు. అందుకే రెండు పలు వరుసల మధ్య అది సురక్షితంగా ఉంటుంది’ అన్నారాయన. వినయంతో మిత భాషులైనవారు సురక్షితంగా ఉంటారు. కఠినాత్ములు, పరుష వాక్కు గల వారు త్వరగా రాలిపోతారని అర్థం చేసుకోవాలి.మన మాటల వలన జనించే శబ్దం చాలా శక్తిమంతమైనది. అవి వినేవారి మనస్సు పైన, దేహం పైనా అపరిమిత ప్రభావాన్ని చూపుతుంది. దుఃఖిస్తున్న వారి పట్ల దయతో సాంత్వన వచనాలు పలికితే వారి శోకం ఉపశమిస్తుంది. ఎవరి పట్లనైనా పరుష పదాలతో కఠినంగా మాట్లాడితే అవతలి వారు కోపోద్రిక్తులై పరిస్థితి విషమిస్తుంది. అందువల్ల వీలైనంత మేరకు మధురంగా... హితంగా.. మితంగా మాట్లాడటమే మంచిదని పెద్దలు చెప్పారు.మాట్లాడ గలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి.– డాక్టర్ పాణ్యం వసుంధరనిర్వహణ డి.వి.ఆర్ -
ఆలయంలో దాగిన మహానిధి.. తాకితే సర్వనాశనమేనా?
నిధి.. అనంతమైన సంపద.. కొన్ని శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న రహస్యం! భారతదేశంలో నిధులు అనగానే మనకు కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడ నాగబంధం ఉన్న ఓ గది తలుపులను ఇప్పటికీ తెరవలేదు. అయితే.. అంతకంటే మర్మంగా ఉన్న ఓ ఆలయం మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉందనే విషయం మీకు తెలుసా? కర్ణాటకలో.. దట్టమైన పశ్చిమ కనుమల నడుమ.. ఉడుపి జిల్లా కొల్లూరులో కొలువుదీరిన మూకాంబిక అమ్మవారి ఆలయ గర్భంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధులు ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. అయితే.. టెక్నాలజీతో ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకున్న ఈ రోజుల్లో కూడా.. సైన్స్ సమాధానం చెప్పలేకపోతున్న ఓ మిస్టరీ ఆ ఆలయం..! మూకాంబికా ఆలయంలో నిధుల గురించి చూద్దాం..ఎన్ని శతాబ్దాలు గడిచినా.. ఎంతగా అధునాతన టెక్నాలజీ వచ్చినా.. కొల్లూరు మూకాంబిక ఆలయ సర్ప ముద్ర వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ వీడలేదు. ఆ పాము ఆకారం కింద నిజంగానే వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధి ఉందా? దాన్ని ఇప్పటికీ ఆ దైవిక సర్పం కాపాడుతోందా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.. -
ఆ విధంగా నా త్రివిధ సాధన..
కృష్ణాబాయికి స్వామి రామదాసు ‘ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అనే మంత్రాన్ని ఉపదేశించారు. రామనామం సుధామధురం. ఎందరెందరినో మహనీయులుగా తీర్చిదిద్దిన మంత్రం అది. కృష్ణాబాయి కూడా ఎంతో శ్రద్ధగా ఆ మహత్తర నామాన్ని జపించటం ప్రారంభించింది. కానీ ‘చంచలం హి మనః కృష్ణా!’ అని అర్జునుడు చెప్పాడు కదా, కృష్ణాబాయి మనసు ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. సమస్యను గుర్తించిన కృష్ణాబాయి స్వామి రామదాసున్న ఆశ్రమానికి పరుగెత్తింది.అప్పుడాయన ఆమెతో, ‘ఇందులో విచారించవలసినది ఏముంది? పరిభ్రమించుటే మనసు పని. దానికిష్ట మొచ్చినచోట దాన్ని పోనిమ్ము. అదంతా స్వయంగా రాముడే అని భావించు. రాముడు అనంతుడు. సమస్తమైన ప్రాణులూ, వస్తువులూ రాముని నుండి వచ్చి, రామునిలో చరించి, రామునిలో లీనమవుతాయి. అందువల్ల మనస్సు ఎక్కడికి పోయినా, సర్వమూ రాముడే అని భావించు. నీవు ఎవ్వరికి సేవ చేసినా అది రాముని సేవయనీ, రాముని పూజయనీ భావించు. ఈ అభ్యాసం విశ్వరూపుడయిన రామునితో నీ ఏకత్వాన్ని అనుభవించటానికి తేలికగా వీలు కలుగచేస్తుంది’ అని బోధించారు.గురువుగారి సలహాను కృష్ణాబాయి ఆ క్షణం నుండే పాటించింది. దాని వల్ల సాధారణ మనిషియైన కృష్ణా బాయి విశ్వమాత కృష్ణాబాయిగా ఎదిగింది. ఆమె తన అనుభవాన్ని ఇలా చెప్పింది: ‘ఆ విధంగా నా త్రివిధ సాధన – నోటితో రామమంత్రాన్ని ఉచ్చరించటం; ప్రతి ప్రాణినీ, ప్రతి వస్తువునూ సాక్షాత్ రామునిగానే భావించటం; చేతులతో చేసిన పని అంతా రాముని పనిగానూ, రాముని సేవగానూ భావించటం – ఏక కాలంలో మొదలైంది. నా దృష్టిలో పప్పా (రామదాసు), రాముడు అభిన్నం. ఈ అభ్యాసంతో నా మనస్సు నిశ్చలమైనాకు తెలియకుండగనే నా హృదయం ప్రశాంత మయమైంది’ (పుటలు 10–11; విశ్వమాత కృష్ణాబాయి, ఆనందా శ్రమము, కేరళ). – రాచమడుగు శ్రీనివాసులు -
సంశయాత్ములు
జ్ఞానం, శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడని భగవద్గీత చెబుతుంది. సంశయాలతో సతమతమయ్యేవారు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. అదేపనిగా అనేక సందేహాలతో మనసు నింపుకున్నవారు మనోదౌర్బల్యం కలిగి కర్తవ్య హీనులవుతారు.భయం, నిరాశ, నిష్క్రి యత్వం, ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జీవితానందం సన్నగిల్లుతుంది. ఇటువంటి వారు ఎప్పుడూ ఏదో అపజయం, ఉపద్రవం జరగబోతోందేమోనన్న చెడు భావనలతో భయపడిపోతుంటారు. రేపు ఏం జరుగుతుందోనని నేటి ఆనంద క్షణాలను అనుభవించలేరు.ఏ పనైనా పూర్తి చేయలేమేమోననే సందేహంతోనే వీరు మొదలుపెడతారు. విద్యార్థులుగానీ, ఉద్యోగా ర్థులుగానీ తమ మీద తమకు స్థిర నమ్మకం లేకపోతే గెలుపు సాధించలేరు. ఏదైనా చేయగలము అనే విశ్వాసం ఉంటే సగం విజయం సాధించినట్లే! యుద్ధానికి వెళుతున్న సైన్యం విజయం తమదే అనే నమ్మకంతో వెళితే విజయం వరిస్తుంది.భగవద్గీత మానవులకు జీవన సమరంలో ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసి ఆనందంగా జీవించటానికి మార్గం చూపిస్తుంది. హృదయ దౌర్బల్యం ప్రతివారికీ ఏదో ఒక సందర్భంలో కలుగక మానదు. శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయుడు, అర్జునుడు ఏదో ఒక సందర్భంలో హృదయ దౌర్బల్యం అనుభవించినవారే. కానీ, దానినుండి బైట పడి ఘనులైన విధం మనకు పాఠం లాంటిది. – డా. చెంగల్వ రామలక్ష్మి -
విచిత్రమైన ఆలయం.. ఎలుకలే దేవుడికి అతిథులు!
ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ఆలయం ఇదే. కొన్ని ప్రదేశాల గురించి వినగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతాం కదా... కర్ణీ మాతా ర్యాట్ టెంపుల్ అలాంటి డెస్టినేషనే. తొలిసారి విజిట్ చేసే వాళ్లకి ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. వేలాది ఎలుకల మధ్య కూడా ఈ ఆలయ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. భక్తి, విశ్వాసం, ఆచారం అన్నీ కలిసి ఒక వినూత్నమైన అనుభూతిని ఇస్తుంది.ఆలయం బయటి నుంచి సింపుల్గా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లగానే బ్యూటిఫుల్ మార్బుల్ ఫ్లోర్స్, సిల్వర్ డోర్లు, ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఎలుకలు వాటికి నచ్చినట్టు తిరుగుతూ ఉన్నా కూడా భక్తులు ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు.సందర్శనీయ ప్రదేశాలుఆలయ సందర్శన ట్రిప్లో కర్ణీ మాతా ఆలయం అనేది ప్రధాన ఆకర్షణ. అయితే దగ్గర్లోనే బికనేర్ కోట గురించి కథలు వింటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్లిపోతాం. లాల్గర్ ప్యాలెస్ కు వెళ్తే రాజుల కాలం నాటి వైభవం ఏంటో తెలుసుకోవచ్చు. గజ్నేర్ సరస్సు, దగ్గర సాయంత్రం సమయంలో ప్రశాంతంగా ఉంటుంది.ఏం తినాలి?వరల్డ్ ఫేమస్ బికనేరీ భూజియా స్పైసీ, క్రిస్పీ, టేస్టీగా అందరికీ నచ్చేలా ఉంటుంది. దాల్ భాటి చూర్మా, ఆథెంటిక్ రాజస్థాని ఫ్లేవర్ని అందిస్తుంది. ఘేవర్ స్వీట్, సాఫ్ట్ టెక్చర్తో మీల్ కంప్లీట్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. లోకల్ చాయ్ తాగితే జర్నీ ఇంకా మెమొరబుల్గా ఉంటుంది.ఎప్పుడు వెళ్లాలి?అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సీజన్ లో ప్రయాణం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్థానికులు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతారు. ఆలయం ఆచారాల గురించి తెలుసుకుంటూ స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తే ఈ ప్రయాణం అద్భుతమైన జర్నీగా మిగిలిపోతుంది. ఇక్కడ ప్రతీ మూమెంట్ ఒక కొత్త మెమొరీని క్రియేట్ చేస్తుంది.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి జైపూర్కు ఫ్లైట్ జర్నీకి సుమారు 3 గంటలు పడుతుంది. అక్కడి నుంచి బికనేర్కి ట్రైన్ లేదా రోడ్ జర్నీకి సుమారు 5–6 గంటలు పడుతుంది. డైరెక్ట్ ట్రైన్స్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రోడ్ జర్నీలో ఎడారి అందాలు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఈ ట్రిప్ పూర్తి అయ్యాక జ్ఞాపకాలు మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. డిఫరెంట్ ట్రెడిషన్స్ని దగ్గరగా చూడటానికి ఇది మంచి అవకాశం అని భావించవచ్చు. జర్నీ అయిపోయిన తరువాత కూడా ఈ పీస్ఫుల్ ఫీలింగ్ మనసులో చాలా రోజులు ఉంటుంది. -
గోధుమ రంగు గుట్ట కాదు.. బంగారు గుట్ట అని పిలుస్తాం!
తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే దారిలో ఒక గుట్టపైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పాదం ఉంది. స్వామివారు నారాయణవనంలో పద్మావతిని పెళ్ళాడి స్థిర నివాసం కోసం బయలుదేరాడు. దారిలో పుత్తూరు పట్టణం పక్కనున్న గుట్టమీద కాలు పెట్టాడని, అది స్వామిని మోయలేక కదిలిందని చెబుతారు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు స్వామి. మరికొన్ని చోట్ల కూడా పాదం మోపి చివరిగా శేషాచలం కొండలపైన కొలువైనాడని భక్తుల నమ్మకం.ఆ గుట్ట మీదున్న స్వామిపాదాన్ని చూద్దామని తమిళనాడుకు చెందిన కొందరు యువతీ యువకులు జట్టుగా బయలుదేరారు. ఆ బృందానికి ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు. గుట్టపైకి వెళ్ళే దారి చూపడానికి ఒక స్థానికుడిని మాట్లాడుకున్నారు. నామం పెట్టుకుని, చేతిలో కర్ర, తలకి టోపీ, చలువ కళ్ళద్దాలు తొడిగి చెప్పులు లేకుండా ఆ బృందం బయలుదేరింది. గుట్ట ఎక్కుతున్న వారిని చూసి అక్కడి గ్రామాల ప్రజలు ‘ఈ పిల్లోళ్ళకి ఎంత భక్తి, ఎంత భక్తి’ అని పొగడ్తల వర్షం కురిపించారు.కొద్దిదూరం నడిచాక గుట్ట మీద ఉన్న గడ్డిని చూసి ఒక మెడికో అమ్మాయి ‘‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాము, కానీ ఇక్కడేమిటి, అంతా గోధుమ రంగులో ఉంది’’ అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె చూసింది పూరికప్పు వేసుకోవడానికి ఉపయోగించే బోద గడ్డి అది. ఎండకి బాగా ఎండి అది గోధుమ రంగులోకి మారి ఉంది.దారి చూపే స్థానికుడు ఆమె మాటలకు చిన్న నవ్వు నవ్వాడు. ‘‘మేము దీన్ని గోధుమ రంగు గుట్ట అని పిలవం, బంగారు గుట్ట అని పిలుస్తాం’’ అని చెప్పాడు. పక్కనే ఉన్న బృందనాయకుడు మనం ఈ గుట్టమీదున్న గడ్డిని చూసి గోధుమ రంగు గుట్ట అనుకుంటున్నాము, దాన్నే భక్తి భావంతో, ఆశావాద దృక్పథంతో ఉన్న ఇక్కడి వారు బంగారు గుట్టగా భావిస్తున్నారు. మన దృక్పథాన్ని పునః పరిశీలించుకోవాల్సి ఉందని వివరించాడు.మాటల్లోనే గుట్ట మీదకు చేరుకున్నారు. అక్కడున్న ఏనుగు పాదాలు, గుర్రపు పాదాల అడుగులు చూసి ఆశ్చర్యపోయారు. స్వామి పాదం పక్కనే ఉన్న దొనలో కాళ్ళు చేతులు కడుక్కుని పూజలు చేసి గోవిందలు పలుకుతూ వెనుదిరిగారు.దిగుతూ ఉంటే భక్తి పారవశ్యంతో ఉన్న ఆ మెడికో అమ్మాయికి గుట్ట మీదున్న గడ్డి అందంగా, బంగారు రంగులో కనిపించింది. ఏదైనా చూసే మనసును బట్టి ఉంటుంది ఈ ప్రపంచం అని తెలుసుకుంది ఆ అమ్మాయి. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
అమర్నాథ్ యాత్రకు.. ఇలా వెళ్లాలి..!
ప్రకృతి నడిబొడ్డున, హిమాలయాల గుండెల్లో వెలిసిన ఆ పరమశివుని సాక్షాత్కారం.. అమర్నాథ్ యాత్రకు సమయం ఆసన్నమైంది!. మంచు లింగ రూపంలో దర్శనమిచ్చే ఆ జ్యోతిర్లింగాన్ని కళ్లారా చూడాలని, జన్మ ధన్యం చేసుకోవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది యాత్ర జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమై.. ఆగస్టు 28వ తేదీ వరకు, అంటే మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డు ప్రకటన ప్రకారం.. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ.. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తున, మైనస్ డిగ్రీల చలిలో, ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని కొండదారుల్లో సాగే ఈ ప్రయాణం.. భక్తితో పాటు ఒక పెద్ద సాహసమే..! ముఖ్యంగా మొదటిసారి వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అమర్నాథ్ యాత్రకు ఉన్న రెండు మార్గాల రహస్యం ఏంటి? వంటి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.పర్మిట్ లేకపోతే నో ఎంట్రీ! అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి సూత్రం.. రిజిస్ట్రేషన్ అండ్ పర్మిట్. చెల్లుబాటు అయ్యే యాత్రా పర్మిట్ లేకుండా.. Shrine బోర్డు ఎవరినీ కూడా ఒక్క అడుగు ముందుకు వేయనివ్వదు. ఆఖరి నిమిషం వరకు ఆగకుండా, కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే మీ స్లాట్లను బుక్ చేసుకోవాలి. మీ పర్మిట్ పత్రాలను ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.ఆరోగ్య పరీక్షఈ యాత్రలో అత్యంత కీలకమైంది ఆరోగ్య పరీక్ష. ఈ యాత్ర సముద్ర మట్టానికి 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో సాగుతుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆథరైజ్డ్ డాక్టర్ల నుంచి కంపల్సరీగా హెల్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, బీపీ ఉన్నవారు వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాతే యాత్రకు సిద్ధమవ్వాలి. యాత్రకు రెండు వారాల ముందు నుంచే రోజుకు 40 నిమిషాలు నడక, యోగా అలవాటు చేసుకుంటే కొండల్లో నడవడం చాలా సులభం అవుతుంది.పహల్గాం, బాల్టాల్ మార్గాలు..అమర్నాథ్ గుహను చేరుకోవడానికి భక్తులకు రెండు ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది.. పహల్గాం మార్గం. ఇది కొంచెం దూరంగా ఉన్నప్పటికీ.. ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. ఈ మార్గంలో ఎత్తు అనేది క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి, మన శరీరం అక్కడి వాతావరణానికి, ఆక్సిజన్ స్థాయిలకి దశలవారీగా అలవాటు పడుతుంది. అందుకే మొదటిసారి యాత్రకు వెళ్లేవారికి ఈ మార్గమే బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక రెండోది.. బాల్టాల్ మార్గం. తక్కువ సమయంలో, కేవలం ఒకే రోజులో దర్శనం పూర్తి చేసుకొని తిరిగి రావాలనుకునేవారికి ఇది అనుకూలమైనది. కానీ.. ఈ మార్గంలో కొండలు చాలా నిటారుగా, ప్రమాదకరంగా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా వంద శాతం ఫిట్నెస్ ఉన్నవారు మాత్రమే బాల్టాల్ రూట్ను తట్టుకోగలరు.హిమాలయాల వెదర్ హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు మంచు తుఫాన్ వస్తుందో ఊహించడం అసాధ్యం. అందుకే వాతావరణాన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దు. మీ బ్యాగ్లో థర్మల్ ఇన్సల్స్, వెచ్చని జాకెట్, వాటర్ప్రూఫ్ రెయిన్కోట్, ఉన్ని టోపీ, గ్లవుజులు, గట్టి గ్రిప్ ఉండే ట్రెక్కింగ్ షూస్ తప్పనిసరిగా ఉండాలి. ఇక మీ ట్రావెల్ బ్యాగ్ని ఎంత వీలైతే అంత లైట్ వెయిట్గా ఉంచుకోవడం మంచిది. అత్యవసర వస్తువులైన.. ఆధార్ కార్డ్, యాత్రా పర్మిట్, పవర్ బ్యాంక్, టార్చ్ లైట్, వాటర్ బాటిల్, ఇన్స్టంట్ ఎనర్జీని అందజేసే డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, రోజువారీ మందులు, హ్యాండ్ శానిటైజర్ మాత్రమే వెంట తీసుకెళ్లాలి.తొందరపాటు వద్దు.. ప్రాణమే ముఖ్యం!అమర్నాథ్ దారిలో వేగంగా వెళ్లాలనే తొందరపాటు అస్సలు పనికిరాదు. శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అనిపించినా, తల తిరిగినా, తలనొప్పి వచ్చినా.. ఏమాత్రం మొహమాటపడకుండా దారి పొడవునా ఉండే మెడికల్ క్యాంపుల వద్దకు వెళ్లి వైద్య బృందాన్ని సంప్రదించాలి. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలతో వచ్చేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. నడవలేని భక్తుల కోసం అక్కడ నిర్ణీత రుసుముతో పోనీ, డోలీ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే సమయం లేనివారి కోసం హెలికాప్టర్ సర్వీసులు కూడా ఉన్నాయి. యాత్ర పొడవునా నున్వాన్, బాల్టాల్, శేషనాగ్, పంచతరణి బేస్ క్యాంపుల వద్ద తాత్కాలిక టెంట్లు, లంగర్లలో ఉచిత భోజనం, తాగునీటి సౌకర్యం లభిస్తుంది. మన ఇండియన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలు అడుగడుగునా భక్తులకు రక్షణగా పహారా కాస్తూనే ఉంటాయి.అవును.. అమర్నాథ్ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు.. అది ఒక ఆధ్యాత్మిక సాధన. Shrine Board చెప్పిన నిబంధనలు పాటిస్తూ.. సరైన ప్రణాళిక, ఆరోగ్య జాగ్రత్తలతో ముందడుగు వేస్తే.. ఆ భోలానాథుడి పవిత్ర దర్శనం యాత్రికుల జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోవడం ఖాయం. (చదవండి: 'వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు..! రథయాత్ర ఎప్పుడంటే..) -
'వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు..! ఎప్పుడంటే..
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఆధ్యాత్మిక ఉత్సవం. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవీలకు అంకితమైన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఏటా ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రను శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ఈ ఆధ్యాత్మిక రథ యాత్ర ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి గుండిచా దేవి మందిరం వరకు సాగుతుంది. అలాంటి పరవమ పవిత్రమైన ఈ రథయాత్ర ఎప్పుడు జరగనుందంటే..ఆ రోజు నుంచి ప్రారంభం..ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16, గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు జూలై 24న ముగుస్తాయి. చివరి రోజున స్వామివారు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దీనినే బహుదా యాత్ర లేదా తిరుగు రథయాత్ర అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు పూరీ క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది.ఎందుకింత ప్రాముఖ్యత అంటే..రథయాత్ర దర్శనానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. "రథంపై ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే సర్వపాపాలు నశించి, మరణానంతరం మోక్షం లభిస్తుంది," అని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ జగన్నాథుడి రథాన్ని లాగే వారికి అక్షయ పుణ్యం లభిస్తుందనేది భక్తుల నమ్మకం. అలాగే ఆలయానికి రాలేని భక్తులను కలుసుకోవడానికి స్వయంగా స్వామివారే వీధుల్లోకి వస్తారనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో కుల, మత, వర్ణ భేదాలు లేకుండా లక్షలాది మంది భక్తులు పాల్గొని ఈ రథాలను లాగడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.(చదవండి: సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..) -
ఆత్మబోధ – జీవన మార్గం
భారతీయ తత్వశాస్త్రంలో అద్వైత వేదాంతం అత్యంత ప్రభావవంతమైనది. ఈ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఆది శంకరాచార్యులు. ఆయన రచనల్లో అత్యంత లోతైన తాత్విక సందేశాన్ని అందించే కతి నిర్వాణషట్కం. కేవలం ఆరు శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం మనిషి అసలు స్వరూపం, జీవిత పరమార్థం గురించి అద్భుతమైన వివరణ ఇస్తుంది.మనిషి తనను తాను శరీరంగా, మనస్సుగా భావించడం వల్లే అన్ని బాధలు కలుగుతున్నాయని శంకరాచార్యులు బోధించారు. మనం ‘నేను’ అని సంబోధించినప్పుడు పేరు, వత్తి, హోదా వంటి తాత్కాలిక గుర్తింపులనే వాడుతుంటాం. కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఈ మార్పులన్నిటినీ గమనిస్తూ ఉండే సాక్షియే ’ఆత్మ’. అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ శాశ్వతమైన చైతన్యం. నేను మనస్సు, బుద్ధి, అహంకారం కాదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ప్రస్తుత కాలంలో అందం, ఆస్తి, హోదా వంటి బాహ్య ఆకర్షణలే జీవిత లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమని నిర్వాణషట్కం గుర్తుచేస్తుంది.శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే. ఈ అవగాహన మనిషిలో వినయాన్ని పెంచి, బాహ్య ప్రపంచం పట్ల సమతుల్య దక్పథాన్ని కలిగిస్తుంది. మనిషి జీవితాన్ని ఎక్కువగా ఇష్టాయిష్టాలే ప్రభావితం చేస్తాయి. ఈ రాగద్వేషాల వల్లే అసంతృప్తి కలుగుతుంది. కానీ ఆత్మ స్వరూపం చిదానందం(చైతన్యం తో కూడిన ఆనందం). అది వీటికి అతీతమైనది. ఈ తాత్విక దృష్టి వల్ల ఇతరుల పట్ల అసూయ, ద్వేషం తగ్గి సమత్వ భావన పెరుగుతుంది. నేటి సమాజంలో పెరుగుతున్న విభేదాలను అరికట్టడానికి ఈ ఆలోచనా విధానం ఎంతో అవసరం. సాధారణంగా మనిషిని మరణభయం వేధిస్తుంటుంది. కానీ శరీరం నశించినా ఆత్మ నశించదనే సత్యం తెలిసినప్పుడు ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది.అలాగే పాపపుణ్యాలకు, కర్మల ప్రభావానికి ఆత్మ అతీతమైనదని గ్రహించడం వల్ల గతాన్ని తలచుకుని బాధపడే మనసుకు విముక్తి లభిస్తుంది. నిర్వాణషట్కం కేవలం ఒక స్తోత్రం కాదు, అది ఒక గొప్ప తాత్విక ప్రకటన. జాతి, మత, వర్గ విభజనలకు అతీతంగా అందరం ఒకే చైతన్యానికి ప్రతిరూపాలమనే సామాజిక çస్పృహను ఇది కలిగిస్తుంది. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న మనిషికి తన అంతర్గత ప్రశాంతతను వెతుక్కునేందుకు ఇది ఒక దిక్సూచి. అహంకారాన్ని వీడి తన అసలు స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మనిషికి నిజమైన విముక్తి సాధ్యమవుతుంది. – సత్యశ్రీ బాలాంత్రపు -
సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తున్నారా!
లోకమంతా గాఢనిద్రలో మునిగిపోయిన వేళ. నిశ్శబ్దం అగాధంగా ఆవరించిన ఆ అర్ధరాత్రి సమయంలో, ఎప్పుడైనా అకస్మాత్తుగా మీ కళ్ళు తెరుచుకున్నాయా? చుట్టూ శూన్యం, గుండెపై ఏదో తెలియని భారం. రేపటి జీవన పోరాటం, మోయలేని బాధ్యతలు, తీరని ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ చింతలు... ఒక్కసారిగా మదిని తొలిచేస్తూ, ఈ అనంత విశ్వం లో నేనొక్కడినే ఒంటరినైపోయానా అనే వేదన మిమ్మల్ని చుట్టుముడుతుంది.ఆ ఏకాంత క్షణంలో మీరు అస్సలు ఒంటరి కారు. ఆ నిశ్శబ్దం నిరాశ కాదు... అది విశ్వసృష్టికర్త నుండి మీకు అందిన పరమ పవిత్రమైన ఆహ్వానం! జగమంతా నిద్రిస్తున్న వేళ, ఆ రాజులకే రాజు మీకోసం అంతరంగ ఆత్మీయ సదస్సును సిద్ధం చేశాడు. మీ మనసులోని కల్లోలాన్ని తుడిచేసి, అనంతమైన ప్రశాంతతను అమృతంలా కురిపించడానికి ఆయన వేచి చూస్తున్నాడు. అయితే, దుప్పటి ముసుగులో తాత్కాలిక సుఖాన్ని పొందుతూ ఆ అమృత ఘడియలను జారవిడుచుకుంటారా, లేక ఆ పరమ ప్రభువును దర్శించుకోవడానికి మేల్కొంటారా? నిర్ణయం మీదే!శారీరక బద్ధకంపై ఆధ్యాత్మిక విజయంఎప్పుడైతే నిద్రను జయించి మీరు పరుపు వదులుతారో, అప్పుడే మీ అహంకారం నశిస్తుంది. ‘నా దేహ సుఖం కంటే, నా సృష్టికర్తను ఆరాధించడమే నా ప్రథమ కర్తవ్యం’ అని మీ అంతరాత్మ ఘోషిస్తుంది. సూర్యుడు ఇంకా ఉదయించక ముందే, ఆ చల్లని నేలపై మీ తలను వంచి, మీ అంతరంగ రహస్యాలను దేవునికి విన్నవించుకున్నప్పుడు లభించే పరమశాంతి ఈ సృష్టిలో మరెక్కడా దొరకదు.ఆరాధనలోని ఆ నిగూఢమైన ప్రేమే దాసుడిని దేవుడికి దగ్గర చేస్తుంది. రాత్రి చివరి మూడవ భాగంలో ప్రకృతిలో ఒక అద్భుతమైన దైవిక సువాసన పరిమళిస్తుంది. అది కారుణ్యపు తలుపులు తెరుచుకునే మహత్తర సమయం. ఆ అల్లాహ్ మొదటి ఆకాశానికి దిగివచ్చి... ‘నన్నుప్రార్థించే దాసులు ఎవరున్నారు, వారి మొర ఆలకించడానికి? నన్ను అడిగేవారు ఎవరున్నారు, వారి కోరికలు తీర్చడానికి? క్షమాపణ కోరేవారు ఎవరున్నారు, వారి ΄ా΄ాలను కడిగేయడానికి?’ అని మధురంగా పలికే దివ్యక్షణాలవి.ఈ సమయంలో ప్రకృతిలోని అదృశ్య శక్తులు, పుణ్య దైవదూతలు ఎంతో చైతన్యవంతంగా సంచరిస్తూ ఉంటారు. రాత్రివేళ విధుల్లో ఉండే దైవదూతలు, పగటివేళ బాధ్యతలు స్వీకరించే దైవదూతలు పరస్పరం కలుసుకునే సంధి కాలం ఈ తెల్లవారుజాము. మీరుప్రార్థనలో నిలబడినప్పుడు, ఆ దైవదూతలు మీ పేరును ధన్యుల జాబితాలో లిఖించి, ఆ వేడుకోలును నేరుగా ఆకాశాలకు తీసుకెళ్తారు. ఆ సర్వశక్తిమంతుడే మీకు రక్షణ కవచంగా మారినప్పుడు, లోకంలో ఎలాంటి తుఫానులు వచ్చినా మీ మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది.జీవితాన్ని మార్చే ‘బరకత్’ (దైవిక అనుగ్రహం)ఉదయాన్నే నిద్రలేవడం వల్ల జీవితంలోకి ‘బరకత్’ అనే దైవిక అనుగ్రహం ప్రవాహంలా వస్తుంది. ఇది మీ సమయాన్ని, శక్తినీ రెట్టింపు చేసే దైవ వరం. ప్రవక్త ముహమ్మద్ (స) తన అనుచరుల కోసం... ‘ఓ అల్లాహ్! నా జాతికి వారి తెల్లవారుజాము సమయాల్లో అమితమైన శుభాలను ప్రసాదించు’ అని మనసారాప్రార్థించారు. ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మీ కాలానికి ఒక అదృశ్యమైన దైవికహస్తం తోడవుతుంది. మీ పనులు సులువవుతాయి, హృదయం తేలికవుతుంది. ఇతరులు రోజంతా చేసే పనిని మీరు కేవలం కొన్ని గంటల్లోనే అలవోకగా పూర్తి చేయగలుగుతారు.షైతాను సంకెళ్ళను తెంచేయండిమనం నిద్రిస్తున్నప్పుడు షైతాను మన తల వెనుక మూడు బలమైన ముడులను వేస్తాడని ఆధ్యాత్మిక సత్యాలు చెప్తున్నాయి. ఆ అదృశ్య సంకెళ్ళను తెంచడానికి ఒకే ఒక్క దివ్య ఔషధం1. మీరు నిద్ర లేచి అల్లాహ్ను స్మరించుకున్న క్షణంలో మొదటి ముడి విడిపోతుంది.2. ప్రార్థన కోసం పవిత్రమైన శుద్ధి (వజూ) చేసుకున్నప్పుడు రెండవ ముడి విడిపోతుంది.3. ప్రార్థన (నమాజ్) లో దేవుని ముందు నిలబడినప్పుడు మూడవ ముడి పూర్తిగా తెగిపోతుంది.ఈ ముడులను తెంచుకున్న దాసుడు ఆ ఉదయం ఉత్సాహపు కెరటంలా, పవిత్రమైన ఆనంద నిధిలా మేల్కొంటాడు. – ముహమ్మద్ ముజాహిద్ -
స్నేహమాధుర్యం..
స్నేహం గూర్చి ఎంతో గొప్పగా చెప్తారు.. సృష్టిలో తియ్యనిదని కొందరంటే, కొందరు మధురమైనదని అన్నారు. స్నేహబంధం విడదీయరాని బంధం అన్నారు...పురాణాల్లో రామ సుగ్రీవుల మైత్రి, కృష్ణుడు కుచేలుల మైత్రి, కృష్ణార్జునల మైత్రి చెప్పుకోదగ్గవి... స్వభావరీత్యా దుష్టులైన దుర్యోధనుడు, కర్ణుల మైత్రి అయినా మంచి ఉదాహరణ కాదు. ఇలాంటి వారి విషయంలో శతకనీతి మనకు ఎంతో మంచి మార్గం చూపిస్తుంది...సజ్జన సాంగత్యం గొప్పదంటాడు భర్తృహరి... ఏనుగు లక్ష్మణ కవి తాను చేసిన అనువాదంలో... ‘సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్పుగౌరవమొసంగు, జనులకు గలుష మడచుగీర్తి బ్రకటించు, చిత్తస్ఫూర్తిజేయుసాధుసంగంబు సకలార్థ సాధనంబు’సజ్జన సహవాసం వలన ఉపయోగాలు చెప్తున్నాడు కవి. సమస్త ప్రయోజనాలు సాధించబడతాయి. అంటే కాదు సకలార్ధ సాధకం అని సెలవిచ్చాడు. ఇదే బాణీని అందరూ కొనసాగించారని అనిపిస్తుంది.. వేమన ‘నీచగుణములెల్ల నిర్మూలమై పోవు, కొదువ లేదు సుజన గోష్టి వలన’ అని సుజన గోష్టి వలన నీచ గుణాలు తొలగిపోతాయంటాడు.‘కాని వానితోడగలసి మెలంగినహాని వచ్చు నెంతవానికైనకాకి గూడి హంస గష్టంబు పొందదా’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు, వేమన. దుష్టుని స్నేహం గూర్చి వివరిస్తాడు, సుమతీ శతకంలో.‘ఉపమింప మొదట తియ్యనకపటం బెడనెడను జెఱకుకైవడినే పోనెపములు వెదకును గడపటగపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ‘ చెడు స్నేహానికి మంచి ఉదాహరణ చె΄్పారు ఇక్కడ.. చెడ్డవారితో స్నేహం మొదట్లో చెఱకు గడ తీపిలా ఉంటుంది. మధ్యలో రుచి తగ్గుతుంది, చివరికి పూర్తిగా చప్పగా ఉండి, ఏమి లేదనిపిస్తుంది. అటువంటి వాడికి తప్పులే కనిపిస్తాయి.‘ఎప్పుడు తప్పులు వెదకెడునప్పురుషుని గొల్వగూడడది’ అని అంటాడు సుమతీ శతకంలో.‘కాదు సుమీ దుస్సంగతి’ అని హెచ్చరిక చేస్తాడు ఇదే శతకంలో.మరో పద్యంలో ‘కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు’ అని అన్నారు..‘కొంచెపునరు సంగతిచేనంచితముగ గీడు వచ్చునది’ అంటూ ఒక ఉపమానం చెప్తాడు.. నల్లి కుడితే మంచానికి దెబ్బలు తగులుతాయి..‘పాలను గలసిన జలమునుపాలవిధంబునె యుండు బరికింపంగాబాల చవి జెఱచు గావునబాలసుడగువాని పొందు వలదుర సుమతీ‘ పాలు కలిసిన నీళ్లు పాల లాగే ఉంటాయి, అలాగే దుర్జనుడు సజ్జనుడు ఉంటే సజ్జనుడు లాగా ఉంటాడు... అందుకు సజ్జనుడే జాగ్రత్త వహించాలి..‘లేమి కలిమి రెండు సమముగ జూచేడి పురుషుడే మిత్రుడెన్ని పొగడారయా’ అని వేమన అంటే ‘మంచి గుణము లేని వానితో మైత్రి చేసి తుది సుఖము బడయుదురా భాస్కరా’ అంటారు భాస్కర శతకంలో.చివరగా భర్తృహరి భాషలో ‘త్యజేత్ ధనం రక్షణార్థం, ధనం త్యజేత్ ఆపది ఆత్మర్థం పృథివీం త్యజేత్, మిత్రార్థే త్యజేత్ ఆత్మనఃకాపాడుకోవడానికి సంపద, ధనం, రాజ్యం అని వదులుకోవచ్చు,కాని మిత్రుడి కోసం నువ్వు నిన్నే వదులుకోవాలి.. అంత గొప్పది స్నేహం. – డా. కందాళ సత్య నారాయణ మూర్తి -
పాదయాత్రే జైత్రయాత్రగా...
జైత్రయాత్ర అనగా గెలుపు కోసం చేసే యాత్ర. యేసు తన జీవితకాల చివరి మూడున్నర సంవత్సరాల పాదయాత్రను జైత్రయాత్రగా చూడవచ్చు. నిజానికి యేసు పాదయాత్రే జైత్రయాత్ర. రెండూ ఒక్కటే. పాదయాత్ర సాధారణ రీతిలో జరుగకపోగా అసాధారణ రీతి లో జైత్రయాత్రగా మార్చబడి గొప్ప సంచలనాలకు కేంద్రం అయ్యింది. ఇక్కడ మాత్రం పాదయాత్రకు జైత్రయాత్ర పర్యాయపదం కాక అంతకు మించినది కావడం విశేషం. ఆనాటి యేసు జైత్రయాత్ర ఇచ్చే ప్రేరణ ఇంతా అంతా కాదు.జైత్ర అంటే జయించేది అని అర్థం. అది విజయానికి సంబంధించినది అని చెప్పవచ్చు. విజయ శీలుడు, విజయశీలమైనది అనే అర్థాలు కూడా ఉన్నాయి. యాత్ర అంటే క్షేత్రస్థాయి పర్యటన. శత్రువులపై దండెత్తి విజయం సాధించడానికి వెళ్ళే యాత్రే జైత్రయాత్ర. ఆత్మ సంబంధంగా చూస్తే, దైవవాక్కుల ఖడ్గంతో దూసుకెళుతూ శత్రువైన సాతానుపై యేసు దండెత్తిన విధానం కనువిందే కాక చరిత్రలో అదొక గొప్ప వాగ్యుద్ధం. యావత్ ప్రపంచానికి దీన్ని మించిన స్ఫూర్తి మరొకటి లేదు. ఒకరు ఏదైనా ఒక రంగంలో వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగే ప్రయాణాన్ని కూడా జైత్రయాత్ర అంటారు.కుష్ఠురోగియైన సీమోను ఇల్లు, ఆ ఇంటి పరిసరాలు గొప్ప సువాసనతో నిండేలా ఒక స్త్రీ అత్యంత విలువగల బహు ఖరీదైన అచ్చ జటామాంసి అత్తరు తీసికొనివచ్చి యేసు తలమీద అదిపోసి తనదైన ప్రేమను ఉన్నతంగా వ్యక్తం చేసింది. మరియొక స్త్రీ అత్తరు బుడ్డితో యేడ్చుచు వచ్చి కన్నీటితో యేసు పాదాలను తడిపి కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదాలకు పూసింది. గొప్ప జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ యేసు అసాధారణ బోధలకు బహుగా ఆశ్చర్యపోతూ, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పింది. ‘మేము ఎవరి దగ్గరకు వెళతాం? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు’ అంటూ పేతురు యేసును గట్టిగా పట్టుకున్నాడు. ఇదంతా పరిశీలనగా చూస్తే యేసుకు జైజైలు పలుకుటే.ప్రవచనం ప్రకారంగా కట్టబడియున్న ఒక గాడిద పిల్లను శిష్యులు విడిపించి తెచ్చిన వెంటనే యేసు గాడిదపిల్ల మీద కూర్చోగానే హోసన్నా నినాదాలు హోరెత్తాయి. ఖర్జూర మట్టలతో ఆయనకు స్వాగతం పలికారు. దారి ΄÷డుగున తమ బట్టలు, ఒలీవకొమ్మలతో పాటు వివిధ చెట్లకొమ్మలు తెచ్చిపరుస్తూ తమ సంతోషానందాలు వ్యక్తం చేసారు. దావీదు కుమారునికి జయం. ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక! సర్వోన్నత స్థలములలో జయము అంటూ బహు జనసముహం మహా శబ్దంతో కేకలు వేశారు. మిన్నంటిన జయజయధ్వనులతో బేత్పగే, బేతనియ గ్రామాలు మార్మోగాయి.యెరూషలేము పట్టణపు యూదులే కాకుండా, పస్కా పండుగ చేయుటకు వివిధ దేశాల నుండి ముందుగానే వచ్చిన యూదులు కూడా మెస్సీయాను ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన్ను జేజేలతో కీర్తించారు. ఎలుగెత్తి చేస్తోన్న ఈ గొప్ప శబ్దాన్ని చూసి ఓర్వలేని వినలేని వినుటకు మనస్సులేని పరిసయ్యులు అభ్యంతరాలు చె΄్పారు. బోధకుడా, నీ శిష్యులను గద్దించు అంటూ యేసుకే ఫిర్యాదు చేశారు. వీరు ఊరకుండి మౌనంగా నిశ్శబ్దంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని యేసు పరిసయ్యులను హెచ్చరించాడు.ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అను కొండగ్రామాల మీదుగా యేసు విజయయాత్ర ్రపారంభమై కిద్రోను లోయను దాటి దేవుని ఆలయం ఉన్న పవిత్ర నగరం యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించేవరకు సాగింది. ఈయన ఎవరో అనుకుంటూ యెరూషలేము పట్టణమంతా ఒకసారిగా కలవరానికి గురైంది. యేసు జైత్రయాత్రలకు ముచ్చటపడిపోతూ ఇలా ఆరోజున ఆయనకు ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జైకొట్టినవారే. నాట్యమాడే అంతరంగాలతో క్రీస్తుకు జేజేలు పలికినవారు నాడు ఎందరెందరో. – జేతమ్ -
విశ్రాంత స్వాంతుడు..
దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై ఉంటుంది. రత్నము తన నైజగుణంగా ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచంలో ప్రకృతి సిద్ధములు, మానవ నిర్మితములు అయినట్టి వివిధ వస్తు సముదాయములు అన్నీ ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా దృష్టి గోచరములు అవుతాయో, ఆ విధముగానే కేవలం అణుమాత్రమైన పరమాత్మునిలో జగములన్నియు నిండి ఉండి సంచరిస్తూ ఉంటాయి.మనిషి అనుభవించే సుఖానికైనా, దుఃఖానికైనా ఆ మనిషి మనసులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను తగిన విధంగా కట్టడి చేసి అదుపులో పెట్టుకోకుంటే కొండంతగా ధనమున్నా, కోట్లకు పడగలెత్తిన మిత్రులు ఎంత మంది ఉన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టుకున్నా, మనశ్శాంతి మాత్రం కరవైనదిగానే మిగులుతుంది.కం. సంతోషము సుఖతరమగు, /సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్, సంతుష్టుండెందును వి / శ్రాంతస్వాంతుండు, రామ సౌజన్యనిధీ!మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాలకు మూలం. ప్రయత్నం చేసి మనసుని దుఃఖం వైపునకు మరలకుండా చేయడాన్ని సాధించాలి. అనవసరమైన దిగులుని దరిచేరనీయకుండా చూసుకుంటూ, మనసును ఆనందంగా ఉంచుకోవడం వలన సుఖశాంతులు దక్కుతాయి. విశ్రాంత స్వాంతుడు మోక్షప్రాప్తికి దగ్గరివాడౌ తాడు– అని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠ రామాయణము’, ప్రథమాశ్వాసములోని పై పద్యంలో చెప్పబడిన మాటలు వెలలేనివి. మానసిక ప్రశాంతతను కోరుకునే మనుషులకు అవి బహుదా ఆచరణీయములైనట్టివి. – భట్టు వెంకటరావు -
మహోన్నత శిఖరాలు
వారికి వారే సాటి. వారిద్దరినీ క్రీస్తు ప్రధాన శిష్యులుగా చెప్పుకోవడం పరిపాటి. ఇద్దరూ ఇద్దరే! సౌవార్తిక సేవలో మహోన్నత శిఖరాలు! క్రీస్తు తన వారసులుగా ఎన్నుకున్న ప్రధాన వ్యక్తులు. ఒకరు క్రీస్తు మొదటి శిష్యుడు పేతురు. మరొకరు క్రీస్తుకు ప్రత్యేక శిష్యుడు పౌలు! ఇద్దరూ జైలు జీవితం అనుభవించారు. సంఘానికీ, వ్యక్తులు మారడానికీ పత్రికలు రాశారు.పేతురు సముద్ర తీర వాసి, ఒక జాలరి. పౌలు రోమన్ సామ్రాజ్య ఉద్యోగి, ఒక సైనికుడు. పేతురు ‘నన్ను వెంబడించు’ అని పిలువబడి సిలువ వరకు వెళ్ళాడు. పౌలు ‘నా నామం కోసం శ్రమపడాలి’ అని పిలువబడితల ఇచ్చాడు. ఒకరు క్రీస్తుచే యాదృచ్ఛికంగా ఆహ్వానితుడైనవాడు. మరొకరు క్రీస్తుచే అదృశ్యకంగా కొట్టబడి ప్రశ్నింప బడినవాడు. ఒకరు ఇజ్రాయేలీయ దేశ స్వస్థలీయుడు. మరొకరు ఇరాన్ దేశం నుంచి వచ్చి స్థిరపడినవాడు.ఒకరు నిరక్షర కుక్షి. మరొకరు విద్యా బుద్ధులు బాగా నేర్చినవాడు. ఒకరు పన్నెండు మంది శిష్యుల్లో జ్యేష్ఠుడు. మరొకరు సువార్త అందించ పంపబడ్డ అపోస్తులుడు. ఒకరు క్రీస్తుతోపాటు సుఖ దుఃఖాల్లో కలిసి తిరిగాడు. మరొకరు క్రీస్తును చూడలేదు. ఆయన గురించి విన్నాడు. ఒకరు క్రీస్తు స్థాపించిన సంఘానికి మూల రాయిలాంటి వాడు. మరొకరు ఆ మూలరాతిని కరిగించి సారం అందించిన వాడు. పేతురు రాసిన పత్రికలు రెండు. పౌలు రాసిన పత్రికలు పదమూడు. ఇద్దరూ యేసు కోసం ప్రాణం పెట్టి, హతసాక్షులుగా రోమ్లో చనిపోయినవారే. ఇద్దరూ క్రీస్తు సువార్తా ప్రకటనకు మూలస్తంభాల్లా నిలిచినవారే! – డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 29న పునీత పేతురు – పౌల్ మహోత్సవం) -
అహంకార శిల్పం..
ఒక రాజ్యంలో ఒక మంచి శిల్పి ఉండేవాడు. ఎలాంటి శిలనైనా శిల్పంగా మార్చగల నైపుణ్యం అతడి సొంతం. ఉండేది. ‘నీ పనితనం చాలా గొప్పది, అందుకే ఎన్నో అద్భుతమైన శిల్పాలను చెక్కగలుగుతున్నావు. నీవు చెక్కుతున్న శిల్పాలలో జీవం ఉట్టిపడుతోంది’ అని అందరూ అతడిని ప్రశంసించేవారు. దాంతో ఆ శిల్పిలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. మరింత గొప్పగా శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు.ఆనోటా ఈనోటా పాకిన ఈ విషయం ఆ పెద్ద సామ్రాజ్యపు చక్రవర్తి వరకు వెళ్ళింది. ఆ చక్రవర్తి శ్రీ కృష్ణుడి భక్తుడు. ఆయన ఆ శిల్పిని పిలిపించి, ఒక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వమన్నాడు. శిల్పి రాత్రింబగళ్ళు కష్టపడి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని చూసిన చక్రవర్తి పరమానందభరితుడయ్యాడు. ఆ దివ్య సౌందర్యానికి పులకరించిపోయాడు. ప్రజల సమక్షంలో శిల్పిని ధన కనక వస్తువాహనాలతో సన్మానించాడు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అతడికి ‘మహాశిల్పి’ అని బిరుదునిచ్చాడు.శిల్పి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, అతడిలో ఉన్న ఆత్మవిశ్వాసం మెల్లగా అహంకారంగా మారింది. అతడు ఇంటికి వెళ్ళి తండ్రితో, ‘నాకు మించిన శిల్పి ఈ భూలోకంలోనే లేడు’ అని విర్రవీగాడు. కొడుకు మాటలను ఆ శిల్పి తండ్రి పట్టించుకోలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. ‘ప్రపంచమే నాకు నీరాజనాలు పడుతుంటే, తండ్రివైన నీవు నన్ను పొగడవేమిటి?’ అని శిల్పి తండ్రిని గట్టిగా నిలదీశాడు. అప్పుడు తండ్రి నవ్వి, ‘పిచ్చివాడా... ఈ సృష్టికర్త ముందర మనమెంత? ఈ కీర్తి, బిరుదులు ఇవన్నీ నీటి బుడగల్లాంటివి. ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవలసిందే’ అన్నాడు. శిల్పి కోపంగా తండ్రి వైపు చూస్తూ,‘నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు అసూయ కలిగించినట్లుంది’ అని నిష్టూరమాడాడు.దానికి జవాబుగా తండ్రి ఒక పలక, బలపాన్ని శిల్పి చేతికిచ్చాడు. సృష్టికర్త సృష్టించినట్లుగా కాకుండా, మరో భిన్నమైన రూపంలో ఒక మానవ ఆకారాన్ని గీసి చూపించమన్నాడు. ‘అదెంత పని!’ అన్నట్లుగా శిల్పి వాటిని చేతిలోకి తీసుకున్నాడు. శిల్పి మూడు రాత్రులు నిద్ర లేకుండా రకరకాలుగా ప్రయత్నించాడు.కాలు, చేయి, కన్ను, ముక్కు, చెవి... ఎలా మార్చినా మానవ శరీరం సంపూర్ణం కాలేదు సరి కదా, ఒకవేళ మరో విధంగా మార్చితే మానవ మనుగడే సాధ్యం కాదని అతడు తెలుసుకున్నాడు. ఏ అవయవాన్ని కూడా మరో రకంగా మార్చలేమని, వాటి స్థానాలను అంగుళం కూడా కదపలేమని గుర్తించాడు. చివరికి తల వెంట్రుకలను సైతం ఆ సృష్టికర్త ఎంతో నైపుణ్యంతో అమర్చాడని గ్రహించాడు. సృష్టికర్తకు మించిన మహాశిల్పి ఈ విశ్వంలోనే మరొకరు ఉండరని అతడికి స్పష్టమైంది. తన అహంకార ధోరణి తనకే అర్థం కావడంతో, ఆ శిల్పి పశ్చాత్తాపంతో తండ్రి ముందర తల దించుకున్నాడు. – ఆర్.సి. కృష్ణస్వామిరాజు -
మనమే క్షమించే ధోరణితో ఉంటే.. అదెంత గొప్ప గుణం!
మనం తప్పులు చేసి క్షమించమని దేవుణ్ణి మనసారా కోరుకుంటాం. ప్రతి మత విశ్వాసం ప్రకారం అలా కోరుకుంటే దేవుడు మనల్ని క్షమించి కరుణించుతాడని నమ్మకం... మానవ జీవితంలో మనం అలవరచుకోవలసిన గొప్ప అలవాటు.. క్షమించడం. ఆదిశంకరాచార్యులు వారు రాసిన ఎన్నో శ్లోకాల్లో పూజావిధానంలో జరిగే తప్పులను క్షమించమని అర్థిస్తాం. ఇంకా ‘కరచరణ కృతం వాక్కాయజం వా... సర్వమేతమస్వ’లో భావం అదే.. క్షమాప్రార్థనతోనే పూజ ముగుస్తుంది. ఇదంతా వేడుకోవడం.. కాని మనమే క్షమించే ధోరణితో ఉంటే, అదెంత గొప్ప గుణం! మన శతకాల్లో క్షమాగుణాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు..‘ఓర్పు లేని వాడు ఊరకే చిక్కునుక్షమయా ధరిత్రిగాదె క్షమయే భూషణము’ అంటాడు వేమన. క్షమాగుణమే ఆభరణం...సుమతీ శతకంలో క్షమాగుణం లేని వాడు పశువంటాడు, బద్దెన..‘క్షమ లేనివాడు పశువు, క్షమయే సర్వోత్తమ గుణము’భాస్కర శతకంలో ...‘క్షమ గలవాడే ధన్యుడు, క్షమ లేని వాడు దరిద్రుండు క్షమచే జయింపరానిది లేదు మూడు లోకములందు’.. మూడు లోకాల్లోను గెలవవచ్చు క్షమ అనే గుణంతో అన్నాడు.భర్తృహరి ‘క్షమా బలం అబలానాం’ అని సెలవిచ్చాడు.. దెబ్బ సహించటమే గొప్ప శక్తి...రామదాసుగా శాశ్వత కీర్తి గడించిన కంచెర్ల గోపన్న తాను రాసిన దాశర థీ శతకంలో ‘క్షమ లేని చదువు గుణహీన విద్యయు క్షమ లేని తపము వ్యర్థ తపంబు క్షమ లేని దానము కల్మష దానంబు క్షమ లేని మాన్యత కపట మాన్యత’..క్షమ లేనిదే విద్య, తపం, దానం, గౌరవం తగవని చెప్పాడు.కుమార శతకంలో ‘క్షమయే పరమధర్మము క్షమయే పరమ సుఖము క్షమయే పరమవిద్యయు క్షమయే పరమ గతి క్షమలేని యోగము, భోగము పనికిరాదు క్షమయే ముక్తికి మార్గము సుమ్ము కుమారా’ అని చెప్పారు.సారంగధర శతకంలో ఓర్పు ఉన్నవాడిదే గెలుపని, ఓర్పు ఉన్నవాడే యోగి అని అర్థం వచ్చే పద్యం ఉంది.నారాయణ శతకంలో ‘క్షమయే విష్ణురూపంబు క్షమయే పరబ్రహ్మము క్షమయే జగతికి ఆధారము క్షమయే నిజమైన భక్తి క్షమించేవాడు నరుడు మిగిలిన వారెల్ల పశువులు’...చూశారా... క్షమకి ఎంతప్రాముఖ్యత ఇచ్చేరో... మానవ సంబంధాలు బల పడాలంటే అందరం క్షమాగుణం అలవర్చుకోవాలి. – డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
432 ఏళ్లుగా ఆగని అడుగులు..
సాక్షి, హైదరాబాద్: రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. రాజులు మారారు. రోజులు మారాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ.. 1594 నుంచి ఒక్క ఏడాది కూడా ఆగకుండా భాగ్యనగర గుండెల్లో నడిచే చరిత్ర ఇది. కుతుబ్ షాహీల వారసత్వం, నిజాం పాలనకు ముగింపు పలికినా చెక్కుచెదరని సంప్రదాయం బీబీ కా అలం. వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన అలంతో ఏనుగుపై సాగే ఈ ఊరేగింపు ఈ నెల 26న మరోసారి నగర వీధుల్లో పునరావృతం కానుంది. మొహర్రం సందర్భంగా ఈ ఏడాది కేరళ నుంచి ప్రత్యేకంగా ఏనుగును తీసుకురావడం విశేషం.వజ్ర, వైఢూర్యాల వైభవం.. మహ్మద్ ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా కాలం చేసిన అనంతరం ఆమె చివరి స్నానంగా వినియోగించిన బల్లను ఆరో కుతుబ్ షాహీ రాజు మహమ్మద్ కులీ తల్లి హయత్ భక్షి బేగం కోరిక మేరకు తీసుకొచ్చి దాంతోనే తయారు చేసిన అలంను ఆమె జ్ఞాపకార్థం నగరంలో 1594లో ప్రతిíÙ్ఠంచారు. నిజాం పాలకులు బహుమతిగా ఇచి్చన వజ్రాలు, వైఢూర్యాలు, అరుదైన రత్నాలు అలం చుట్టూ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.ఏడాది పొడవునా దబీర్పురాలోని బీబీ కా అలావాలో పోలీసుల ఆర్మ్డ్ గార్డ్ రక్షణలో భద్రంగా ఉంచి, ఊరేగింపు రోజు మాత్రమే వీటిని బయటకు తీస్తారు. పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో 432 ఏళ్లుగా ఊరేగింపు కొనసాగుతోంది. ఈ నెల 26న దబీర్పురా నుంచి చార్మినార్, గుల్జార్ హౌజ్ మీదుగా చాదర్ఘాట్ వరకు సాగే ఊరేగింపునకు 2వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సంప్రదాయం హైదరాబాద్ మత సామరస్యానికి, గంగా జమునా తెహజీబ్కు నిలువెత్తు నిదర్శనం. -
పరమ తండ్రి ప్రేమ
ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచనలు చేయక తప్పదు. విలువైన మూలాల వలన మూల΄ాఠములవలన ఇట్టి క్షేత్రస్థాయి వనరుల వలన సువాసనసారం ఎది ఉన్నా అది నేరుగా బయటపడి జీవితాలకు వంటబడుతుంది. పరిశోధనాత్మక ఆత్మ సంబంధ అభ్యాస జీవితానికి అన్వయించుకునేలా క్రీస్తు సందేశాలు ఎప్పుడూ ఘనంగానే ఉండుట అనేది గమనార్హం.‘నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను’ అంటాడు అద్వితీయ సత్యదేవుడు. ఆయన మనస్సు ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తువారి ఉన్నతమైన బోధ ఏమంటే ‘ఈ భూమి మీద ఎవరికిని తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందు ఉన్నాడు’. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అనేది వేరే అంశం. ధర్మశాస్త్రాన్ని మరింత లోతుగా పరిశోధించినా, యేసు అసాధారణ బోధల ప్రకారంగా చూసినా కూడా ఒకరు ఆత్మ సంబంధంగా తండ్రి హోదాను అనుభవించడం దేవునికి కోపం తెప్పించే విషయమే కాక, ఇదొక గొప్పదైన విశేషం కూడానూ.గ్రంథప్రకారంగా దేవుని మహిమను దొంగిలించడం ఘోరతప్పిదమే అని చెప్పక తప్పదు. మేము మీకు ఆత్మీయ తల్లిదండ్రులం అంటూ సువార్తికులు, బోధకులు, సంఘ పెద్దలు పిలిపించుకోవడం లేఖన విరుద్ధం. మీరంతా సహోదరులు అనునదే క్రీస్తు బోధ. మనమంతా క్రీస్తునందున్నా సహోదరీ సహోదరులం. దేవుని పిల్లలం అనేదే లేఖన సంబంధ సర్వసత్యం. ఎప్పుడూ యేసును రబ్బునీ అని పిలుచుకొనే మగ్దలేనే మరియకే సమాధి దగ్గర మొట్టమొదటగా యేసు పునరుత్థానుడిగా దర్శనమిస్తూ చెప్పిన మాట ఆశ్చర్యకరమే. ‘నా సహోదరులవద్దకు వెళ్ళి – నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కి΄ోవుచున్నానని వారితో చెప్పుమనెను’. యేసుక్రీస్తు వారి తండ్రి, సర్వమానవాళి తండ్రి ఒక్కరే. ఆయనే యెహోవా అనబడే తండ్రియైన దేవుడు.హెబ్రీగ్రంథ లేఖికుని వివరణలో ‘నీవు నాకు ఇచ్చిన పిల్లలు’ అని ఒకచోట క్రీస్తు అన్నట్టుగా వ్రాయబడింది గానీ తండ్రి అని ఆయన పిలిపించుకొన్న దాఖలాలు ఎక్కడనూ లేవు. క్రీస్తు అపొస్తలులు కూడా ‘అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే’ అన్నది చాలా సూటిగా సుస్పష్టంగా ఉన్నతంగా వివరిస్తూ దేవున్ని ఎంతగానో హెచ్చిస్తూ గొప్ప చేసారు. సంఘ సహకారం తీసికొని సంఘసమక్షంలో సంఘంతో కలిసి గ్రంథాన్ని పఠిస్తే యేసు తన తండ్రియైన దేవునికి ఎంతగా విధేయుడై లోబడ్డాడో అనేది తేటగా అర్థమవుతుంది.ఒక తండ్రికి ఎంతటి కఠినాత్ముడైనా, అవిధేయుడైనా కుమారుడు ఉన్నప్పటికీ అతనికి యేసు విధేయతా జీవిత విధానం గూర్చి బోధిస్తే మొదట ఆలోచనలోపడి ఇక మార్పు తప్పని పరిస్థితే అతనికి ఎదురవుతుంది. కుమారునిగా యేసు జీవితం అంతటి ఉన్నతమైనది. పరమందున్న తండ్రియైన ఆ దేవదేవునికి, ఇంట్లో ఉన్న నాన్నకు లోబడి జీవించడం మనకెప్పుడూ గౌరవం తెచ్చే సత్క్రియే అనుటలో ఎలాంటి సందేహం లేదు. – జేతమ్ -
అంతా ఆచార్యుడి నిర్ణయమే..!
‘నాకు రాజ్యమూవద్దు, రాజ్యాధికారమూ వద్దు. నన్ను పట్టాభిషిక్తుని చేయనక్కర లేదు. నేను ఆచార్యుని చేతిలో కీలుబొమ్మలా వున్నాను. నాకు ఒక స్వేచ్ఛలేదు, సుఖం లేదు, స్వంత నిర్ణయం తీసుకోలేను. చివరకు నా వివాహం కూడా ఆచార్యుడి నిర్ణయమే. అందులోనూ ఆయన రాజకీయ కోణం చూస్తున్నారు .’’ అన్నాడు చంద్రగుప్తుడు వార్తాహరునితో. ఆ వార్త ఆచార్య విష్ణుగుప్తుని చేరింది. ఆచార్యులు చంద్రగుప్తుని వద్దకు వచ్చి ‘‘నేను విన్నది నిజమేనా?’’ అని అడిగారు.‘‘అవును’’ చంద్రగుప్తుని సమాధానం .‘‘ఎందుకు ?’’ ఆచార్యుని ప్రశ్న .‘‘నాకు స్వేచ్ఛ లేదు, సుఖంలేదు, ఏం, చక్రవర్తి సుఖాన్ని కోరకూడదా? నేను మీ చేతిలో జీతం తీసుకుంటున్న పెద్దనౌకరు లా వున్నాను.’’ అన్నాడు.‘‘అవును రాజు, రాజ్యంలో ప్రజాసేవచేసే పెద్దనౌకరే. చక్రవర్తికి సుఖం ఉండదు. ఉండకూడదు. ప్రజాసుఖమే చక్రవర్తి సుఖం. ప్రజాహితమే రాజుకి హితం.నేను నీకు రాజ్యాన్ని అప్పగిస్తానన్నాను గాని, సుఖాన్ని కాదు. దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితోబాధపడుతున్నా చక్రవర్తికి సుఖమెలావుంటుంది? సుఖానికి మూలం అర్థం. అర్థ, కామాలు ధర్మం మీద ఆధార పడి వుంటాయి. సంపాదన సక్రమ మార్గంలో వుండాలి. అక్రమ మార్గమైతే అర్థం, అనర్థమౌతుంది. రాజ్య సంక్షేమం, ప్రజల సుఖంకోసం అర్థం ఎంత అవసరమో, అది ఎందుకు ధర్మబద్ధం కావాలో వివరించారు ఆచార్య చాణక్యులు.చంద్రగుప్తుని చివరి రోజుల్లో దేశంలో కరువు తాండవించింది. ప్రజలు ఆకలికి అలమటించారు. అప్పుడు చంద్రగుప్తుడు కూడా ఆహారం తీసుకోలేదు. ప్రజాహితమే తమ హితంగా భావించిన ఆ ఇద్దరూ ధన్యులే. – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
కాబాను కాపాడిన పక్షుల కథ!
చాలాకాలం క్రితం.. అంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టడానికి కొద్ది రోజుల ముందు జరిగిన కథ ఇది. అప్పట్లో యెమెన్ దేశాన్ని ‘అబ్రహ’ అనే ఒక క్రూరమైన రాజు పాలిస్తుండేవాడు. మక్కా నగరంలోని పవిత్ర ‘కాబా’ మందిరానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు రావడం, అక్కడప్రార్థనలు చేయడం అబ్రహకు అస్సలు నచ్చలేదు. ప్రజలందరూ తన దేశానికే రావాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా, కోట్లు ఖర్చు పెట్టి తన రాజధానిలో ఒక పెద్ద, అందమైన చర్చిని కట్టించాడు. ‘ఇకపై ఎవరూ మక్కాకు వెళ్లకూడదు, అందరూ నా దగ్గరికే రావాలి‘ అని హుకుం జారీ చేశాడు. ఈ విషయం తెలిసి అరబ్బులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలో ఒక అరబ్ వ్యక్తి, రాత్రికి రాత్రే అబ్రహ కట్టించిన చర్చిలోకి దూరి, అపవిత్రం చేశాడు. దీంతో అబ్రహకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘నా చర్చిని అవమానిస్తారా? ఆ మక్కాలో ఉన్న కాబా మందిరాన్ని పునాదులతో సహా కూల్చేస్తా!’ అంటూ కరడుగట్టిన సైన్యంతో మక్కా వైపు బయలుదేరాడు.గజరాజుల సైన్యం.. వణికిపోయిన మక్కా!అబ్రహ సైన్యం మామూలు సైన్యం కాదు. శత్రువులను తొక్కి పారేయడానికి కొండల లాంటి భారీ ఏనుగులను ఆ సైన్యంలో చేర్చాడు. దారిలో అడ్డువచ్చిన చిన్న చిన్న తెగలను చీల్చిచెండాడుతూ అబ్రహ సైన్యం మక్కా సరిహద్దుల్లోకి చేరుకుంది. అక్కడ అమాయక ప్రజల ఆస్తులను, ఒంటెలను దోచుకుంది. అలా దోచబడిన వాటిలో మక్కా నాయకుడు, ప్రవక్త ముహమ్మద్ గారి తాతగారైన ‘అబ్దుల్ ముత్తలిబ్’కు చెందిన 200 ఒంటెలు కూడా ఉన్నాయి. యుద్ధం వద్దనుకుంటే కాబాను కూల్చడానికి అడ్డుపడొద్దని అబ్రహ సందేశం పంపాడు. దాంతో చర్చల కోసం అబ్దుల్ ముత్తలిబ్ నేరుగా అబ్రహ డేరాకు వెళ్లారు. ఆయన గంభీరమైన రూపాన్ని చూసి అబ్రహ ముచ్చటపడ్డాడు. ‘ఏం కావాలి?’ అని అడిగాడు.‘నీ సైన్యం నా 200 ఒంటెలను పట్టుకెళ్లింది, వాటిని నాకు ఇచ్చేయ్’ అన్నారు అబ్దుల్ ముత్తలిబ్ ప్రశాంతంగా. అబ్రహ ఆశ్చర్యపోయాడు, నవ్వుతూ అవహేళన చేశాడు. ‘మిమ్మల్ని చూసి గొప్పవాడనుకున్నా! నేను మీ పవిత్రమైన కాబా మందిరాన్ని కూల్చేయడానికి వస్తుంటే, దాని గురించి అడగకుండా మీ ఒంటెల గురించి అడుగుతున్నారేంటి?’ అన్నాడు.దానికి అబ్దుల్ ముత్తలిబ్ ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ఎంతో ధీమాగా.. ‘ఆ ఒంటెలకు యజమానిని నేను, అందుకే నా ఒంటెలను అడిగాను. కానీ, ఆ కాబా మందిరానికి ఒక యజమాని (అల్లాహ్) ఉన్నాడు. దానిని ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు!’ అని చెప్పారు. తిరిగి వచ్చిన అబ్దుల్ ముత్తలిబ్, ప్రజలందరినీ కాబా ఖాళీ చేసి,ప్రాణాలు కాపాడుకోవడానికి చుట్టుపక్కల ఉన్న కొండలపైకి వెళ్ళిపోవాలని ఆదేశించారు.మోకాళ్లూనిన ఏనుగు.. ఆకాశంలో అద్భుతం!మరుసటి రోజు ఉదయం.. అబ్రహ సైన్యం కాబా వైపు అడుగులు వేయడంప్రారంభించింది. ‘మహమూద్’ అనే ఒక పెద్ద ఏనుగు ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తోంది. కానీ, సరిగ్గా కాబా వైపు నడవమనేసరికి ఆ ఏనుగు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మోకాళ్లూని కూర్చుండిపోయింది! దానిని ఎంత కొట్టినా, పొడిచినా కదలలేదు. అదే విచిత్రంగా యెమెన్ వైపో, లేదా వేరే దిశల వైపో తిప్పితే మాత్రం పరిగెత్తింది. అబ్రహ సైన్యానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. సముద్రం వైపు నుండి వేలాది పక్షుల సమూహాలు మక్కా వైపు రాసాగాయి. వాటిని అరబ్బీలో ‘అబాబీల్’ అంటారు. ఆ చిన్న చిన్న పక్షుల నోట్లో ఒక రాయి, రెండు కాళ్లలో రెండు రాళ్లు ఉన్నాయి. అవి మామూలు రాళ్లు కావు.. కాల్చిన మట్టి రాళ్లు (సిజ్జీల్).తిన్న గడ్డిపరకల్లా.. సర్వనాశనం!ఆ పక్షుల సైన్యం అబ్రహ సైన్యంపైకి రాగానే, తమ కాళ్లలో, నోట్లో ఉన్న రాళ్లను పైనుంచి తుపాకీ గుళ్లలా వర్షింపజేశాయి. ఆ చిన్న రాళ్లు ఏనుగుల మీద, సైనికుల మీద పడగానే.. శరీరాన్ని చీల్చుకుంటూ అవతలికి వెళ్ళిపోయాయి. రాజు అబ్రహతో సహా సైన్యమంతా కకావికలమైపోయింది.పవిత్ర ఖురాన్ లోని ‘సూరహ్ అల్–ఫీల్’ (105:5) లో దేవుడు చెప్పినట్లుగా.. ఆ భారీ సైన్యం అంతా ‘పశువులు నమిలి పారేసిన గడ్డిపరకల్లా, పొట్టులా’ మారిపోయింది. అహంకారంతో వచ్చిన అబ్రహ ఘోర పరాజయాన్ని మూటగట్టుకునిప్రాణాలతో పారిపోతూ దారిలోనే అంతమయ్యాడు. కాబా మందిరం సురక్షితంగా నిలిచింది! – ముహమ్మద్ ముజాహిద్ -
శ్రీవారి జ్యేష్ఠాభిషేకానికి వేళాయెరా!
తిరుమలేశుడు ఉత్సవాల వేల్పు. నిత్యపూజలతోపాటు విశేష పూజలెన్నో జరుగుతుంటాయి. అలాంటి వాటిలో జ్యేష్ఠాభిషేకం ఒకటి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం రోజున ముగిసేలా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ‘అభిధ్యేయక అభిషేకం’ అని కూడా పిలుస్తారు.ఏడాది పొడవునా జరిగే వివిధ ఉత్సవాలు, ఊరేగింపుల వల్ల శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, వాటి కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఈ 26 నుంచి 28 వరకు జ్యేష్ఠాభిషేకం జరగనున్న సందర్భంగా ఆ విశేషాలు.ఏడాది పొడవునా స్వామివారి ఉత్సవమూర్తులకు ఉండే బంగారు కవచాన్ని ఈ ఉత్సవం మొదటి రోజున తొలగిస్తారు. కవచాలు లేని స్వామివారి నిజరూపాన్ని చూసే అరుదైన అవకాశం కేవలం ఈ సమయంలోనే భక్తులకు దక్కుతుంది.స్నపన తిరుమంజనం: మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి ద్రవ్యాలతో వైభవంగా ‘స్నపన తిరుమంజనం’ (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. అభిషేకం పూర్తయిన తర్వాత ప్రతి రోజూ స్వామివారికి వేర్వేరు కవచాలను సమర్పిస్తారు. శతాబ్దాల నాటి శ్రీ మలయప్ప స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ప్రతి ఏటా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ‘అభిధ్యేయక అభిషేకం‘ నిర్వహిస్తారు. – ఫొటోలు: కేతారి మోహన కృష్ణ, సాక్షి, తిరుపతిఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలుమూడు రోజుల ముఖ్య కార్యక్రమాలు (జూన్ 26 – 28)మొదటి రోజు (జూన్ 26, శుక్రవారం): స్వామివారికి ఏడాది పొడవునా ఉండే బంగారు కవచాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పిస్తారు. తిరుమంజనం అనంతరం స్వామివారికి వజ్రకవచం అలంకరించి మాడ వీధుల్లో ఊరేగిస్తారు.రెండవ రోజు (జూన్ 27, శనివారం): ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన తర్వాత అత్యంత శోభాయమానంగా ముత్యాలకవచం సమర్పిస్తారు.మూడవ రోజు (జూన్ 28, ఆదివారం): చివరి రోజు తిరుమంజన కార్యక్రమాలు పూర్తి చేసి, స్వామివారికి బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని తిరిగి వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు తీయరు. -
శతక నీతి: త్యాగం!
పిల్లల పెంపకంలో తల్లితండ్రులకు ఓపిక, సహనంతోబాటు ఎంతో త్యాగగుణం.. తాము పస్తులుండి పిల్లలను పెంచే తల్లిదండ్రుల సహజగుణం త్యాగమే.. దేశసేవలోప్రాణాలను ఫణంగా పెట్టి తెగించి త్యాగం చేసే సైనికుల త్యాగం నిస్వార్ధబుద్ధికి మరో ఉదాహరణ...వేమన త్యాగాన్ని ‘వివేకంతో కూడిన దానం’గా పరిగణిస్తాడు..‘తనకు గలదెల్ల ఇతరలకు దానమిచ్చుత్యాగియగు వాడు భువికి దైవమగును సుమ్ము’...అంటాడు.. తన దగ్గర ఉన్నదంతా దానం చేసే వ్యక్తి ‘దేవుడ’ట... దీన్ని బట్టి త్యాగం చేసే వ్యక్తి స్థాయి ఎంత ఉన్నతమో ఆలోచించండి.. దానం చేసేటప్పుడు ఎటువంటి ప్రతిఫలం, పేరు ప్రతిష్టలూ ఆశించకూడదు. అందుకే గుప్తదానం అంటారు.. తనకున్న దానిలోంచి కొంత ఇవ్వడం దానం అయితే పూర్తిగా వదులుకోవడం త్యాగం అని అనవచ్చు.. తన ఆస్తిని, సౌఖ్యాన్ని, సుఖాన్ని పరులకోసం వదులుకోవడం త్యాగం అవుతుంది.సుమతీ శతకంలో...‘కష్టకాలమందు సహాయము చేయువాడుత్యాగియని బుధులు పొగుడుదురు కదరా సుమతీ’...అటుపక్క వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తిని త్యాగి అని కొనియాడారు. పరోక్షంగా ‘విత్తము గలవాడు వితరణి చేయక, పొదుపు చేసినచో పురుగుగ పుట్టును’ అని శపించాడు, బద్దెన సుమతీ శతకంలో. వైరాగ్యకోణంలో భోగాలను, సుఖాలు, సిరిసంపదలను త్యాగం చేసి.. అంటే వదులుకుని ఆత్మజ్ఞానం పొందండని భర్తృహరి సలహా.. ‘భోగేరోగభయం కులే చ్యుతిభయం.. సర్వం వస్తుభయాన్వితం’.. అన్నీ భయమే, అందుకే వదులుకోండి అని ఉవాచ.నారాయణ శతకంలో, కుమార గిరి శతకంలో, దాశరథి శతకంలో దేవుడు కోసం త్యాగం చేయమంటారు..ధనత్యాగం, భోగత్యాగం, కక్ష, గర్వం, కోరికలు మొ... త్యాగం చేయటం చాలా గొప్ప... పురాణాల్లో కర్ణుడు, దధీచి, శిబి, బలి హరిశ్చంద్రుడు మొదలగు వారు ఉంటే కలియుగంలో ఎందరో మాతృమూర్తులు, సైనికులు, మహానుభావులు... ధనం,ప్రాణం త్యాగం చేసిన వారున్నారు.. వారికి నివాళులతో... – డా. కందాళ సత్యనారాయణమూర్తి -
అంతఃశక్తి... అంతులేని బలం
జీవితం అనేది నిరంతరాయంగా సాగిపోయే ఒక ప్రవాహం. ప్రయాణంలో ఎదురుదెబ్బలు తగలడం సహజమే అయినా, నేటి ఆధునిక కాలంలో చాలామంది చిన్నపాటి కష్టాలకే నైరాశ్యంలో మునిగిపోతున్నారు. విజయాల కోసం, బాహ్య ప్రపంచంలో ఎవరో వస్తారని ఎదురుచూడటం కన్నా.. ప్రతి మనిషి తనలోని అపారమైన అంతర్గత శక్తులను గుర్తించడమే పరమార్థం.భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించినట్లు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. కాలం కలిసిరానప్పుడు బాహ్య పరిస్థితులను నిందించడం మాని, ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా మలచుకోవాలి. మనలోని లోపాలను సరిదిద్దుకుంటూ, సృజనాత్మకతకు పదును పెట్టినప్పుడే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అవకాశాలుగా మార్చుకునే వివేకం లభిస్తుంది.ఈ అంతఃశక్తిని మేల్కొలిపి, జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మన మహర్షులు కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాలను నిర్దేశించారు. నిత్యం ధ్యానం చేయడం ద్వారా చంచలమైన మనస్సు ప్రశాంతతను ΄÷ంది, సరైన నిర్ణయాలు తీసుకునే స్పష్టత వస్తుంది. దీనితో పాటు సద్గ్రంథ పఠనం బుద్ధిని వికసింపజేసి జీవన సత్యాలను బోధిస్తే.. సత్సంగం (మంచి వ్యక్తుల సహవాసం) మనలో సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.సముద్రంలో అలలు ఎంత సహజమో, జీవితంలో కష్టాలూ అంతే సహజం. ఎడారిలో సైతం వేళ్లను లోతుగా పాతుకుని జీవాన్ని వెతుక్కునే మొక్కలా.. మనిషి తన ఆత్మబలాన్ని నమ్ముకుని, ప్రతి కొత్త రోజును ఒక అవకాశంగా భావించి విజయపథంలో ముందుకు సాగాలి. – పసుపులేటి వెంకటేశ్వరరావు -
కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?
ఒక సభలో జ్ఞాని, మేధావి అయిన వ్యక్తి భారతీయ సనాతన ధర్మం, సంస్కృతులపై అనర్గళంగా, అద్భుతంగా ప్రవచనం చెబుతున్నాడు. గంగాఝరిలా ఆయన ఉపన్యాసం సాగుతోంది. వందల మంది శ్రోతలు మైమరచి ఆయన ప్రవచనం ఆనందంగా వింటున్నారు. ఇంతలో ఒక తుంటరి యువకుడు లేచి నిలపడి, ఆయన వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ ‘మంత్రానికి శక్తి ఉన్నదా?’ అని ప్రశ్నించాడు. అయోమయానికి గురైన శ్రోతలు ఆందోళన చెందారు.ఆ ఉపన్యాసకుడు ఆ యువకుని వైపు కాసేపు నిశ్చలంగా చూసి ‘ఏం కూశావురా వెధవా!’ అని బిగ్గరగా అరిచాడు. అందరూ విస్తుపోయారు. ఇలా అందరి ముందు తనని అవమానించిన ప్రవచనకారునిపై ఆ యువకునికి విపరీతమైన క్రోధం కలిగింది. రక్త ప్రవాహ వేగం హెచ్చి ఆ యువకుని బుగ్గలలోకి ప్రవహించి అవి ఎరుపెక్కాయి. పెదవులు వణకుతున్నాయి. ఎర్రని నిప్పు క ణికల లాగా అతని కళ్ళు కెంపులయ్యాయి. అతను వెంటనే తన పొడవాటి చొక్కా చేతులు పైకి మడవ సాగాడు. పిడికిలి బిగించి భౌతిక దాడికి సిద్ధమయ్యాడు. సభలో స్తబ్ధత ఏర్పడింది. రెండు నిముషాలాగి ఆ ప్రవచనకారుడు బిగ్గరగా నవ్వాడు. తర్వాత ఇలా అన్నాడు. ‘నాయనా! అప్పటికప్పుడు, అనాలోచితంగా, ముందుగా అనుకో కుండా నేను పలికిన నాలుగు సాధారణ అక్షరాల పదమైన ’ మాట ఎంత మార్పు తెచ్చిందో గమనించావా? నీ కళ్ళు ఎర్రబడి, దేహమంతా వణుకుతూ, కోపంతో ఊగిపోతున్నావే! అనాలోచితంగా అన్న మాటకే ఇంత శక్తి ఉంటే, నేను ఏకాగ్రతతో, ధ్యాన నిమగ్నుడనై గాయత్రీ మంత్రం జపిస్తే దానికి అపరిమితమైన శక్తి ఉండదంటావా?’ అని సౌమ్యంగా, అనునయంగా అడిగాడు. సభా ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ యువకుడు మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అది శబ్దానికి, మాటకు ఉన్న శక్తి. – డా. గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
ముహర్రం నెల అల్లాహ్ మాసం..
ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ) ఆరంభం కేవలం క్యాలెండర్ మారడం కాదు; అది అంతరాత్మను రగిల్చే ఒక అద్భుత అవకాశం. నూతనత్వాన్ని వేడుకలతోనే ముగించకుండా, ఆత్మపరిశీలనతో స్వాగతించాలని ఇస్లాం బోధిస్తోంది. ఈ ప్రయాణంలో అత్యంత పవిత్రమైనవి ‘ముహర్రమ్’ నెలలోని మొదటి పది రోజులు. ప్రవక్త ముహమ్మద్ (స) ఈ నెలను ‘షహ్రుల్లాహ్’ (అల్లాహ్ మాసం) అని పిలిచారు.1. ఆషూరా మహత్తు.. ఒక దైవిక అద్భుతం.ముహర్రమ్ 10వ రోజును ‘ఆషూరా’ అంటారు. నాడు క్రూరుడైన ఫరోసైన్యం నుంచి ప్రవక్త మూసా (మోషే), అతని అనుచరులను అల్లాహ్ ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చి కాపాడిన అద్భుత ఘట్టం ఈ రోజే జరిగింది. ఈ దైవిక రక్షణకు కృతజ్ఞతగా ప్రవక్త మూసా ఉపవాసం ఉండేవారు. ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ముహర్రమ్ 9, 10 తేదీలలో ఉపవాసం ఉండటం ముస్లింలకు పుణ్యప్రదం. నిష్ఠతో ఉండే ఈ ఒక్క రోజు ఉపవాసం.. గడిచిన ఏడాది కాలపు చిన్నపాపాలన్నింటినీ తుడిచిపెడుతుందని ప్రవక్త నమ్మకాన్ని వ్యక్తపరిచారు.2. ఆచరించాల్సిన ముఖ్యమైన పుణ్యకార్యాలుఈ పది రోజులను వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఈ అలవాట్లను భాగం చేసుకోవాలి:ఉపవాసాలు: రంజాన్ తర్వాత నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలకు అత్యుత్తమమైన మాసం ఇదే.దైవస్మరణ (జిక్ర్): ‘సుబ్హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్హానల్లాహిల్ అజీమ్‘ లాంటి పదాలతో నోటిని పవిత్రంగా ఉంచుకోవడం.పశ్చాత్తాపం (తౌబా): గడిచిన ఏడాది తప్పులను ఒప్పుకుంటూ, నూతన సంవత్సరంలో సన్మార్గంలో నడవాలని సంకల్పించడం.దానధర్మాలు (సదఖా)పవిత్ర మాసంలో చేసే చిన్న సహాయానికైనా పుణ్యం రెట్టింపు అవుతుంది.ఖురాన్ పఠనం: నిత్యం దైవవాణిని చదవడం, దాని భావాన్ని అర్థం చేసుకోవడం.జీవిత పాఠంఆషూరా కథ నేటి మానవాళికి ఒక గొప్ప ధైర్యం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక వేదనల రూపంలో మన ముందు ‘ఎర్రసముద్రం’ లాంటి అగాధం ఉన్నప్పుడు.. ప్రవక్త మూసా చూపిన పరిపూర్ణ విశ్వాసమే మనకు శరణ్యం. ‘నా ప్రభువు నా వెంట ఉన్నాడు, ఆయన నాకు తప్పక మార్గం చూపుతాడు‘ అనే నమ్మకంతో ప్రార్థిస్తే, దైవం మన కష్టాల సముద్రాన్ని చీల్చి కొత్త దారి చూపిస్తాడు.త్యాగాల స్మరణ...ఆషూరా రోజున ప్రవక్త ముహమ్మద్ (స) ప్రియ మనవడు హజ్రత్ హుసైన్ , వారి అనుచరులు ‘కర్బలా’ మైదానంలో సత్యం, న్యాయం కోసం ప్రాణాలర్పించారు. వారి అమరత్వాన్ని గుండెల్లో స్మరిస్తూనే, ప్రవక్త సంప్రదాయం ప్రకారం ఉపవాసాలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడమే నిజమైన విశ్వాసి లక్షణం. జ్ఞానం ఆచరణలోకి వచ్చినప్పుడే దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఈ పది రోజులు మీ జీవితంలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు!– ముహమ్మద్ ముజాహిద్ -
మహా శివమ్: చెంగల్ శివ పార్వతి క్షేత్రం
మహేశ్వరా! మహాశివా పరమ శివా అని ఈశ్వరుని ఆరాధిస్తాం. అంటే మహాపర్వతం మీద వాసం ఉండేవాడు అని అర్ధం. అంతటి మహాశివుడికి పెద్ద మహా శివాలయాన్ని కేరళలో నిర్మించారు. నిరూపధారిగా లింగ రూపంలో మహా మహా రుద్రాలను తనలో ఆవహించుకున్న మహాదేవుడు లోక రక్షకుడు పరమ శివుడు. మన పుణ్యభూమిలో పలుచోట్ల జ్యోతిర్లింగాలు... ఆత్మలింగాలుగా కొలువుదీరాడాయన. అలాంటి మహాలింగం కేరళలో నిర్మించారు.కేరళ రాజధాని తిరువనంతపురానికి దగ్గర నెయ్యాటింకర అనేప్రాంతంలో ఉంది. నూట పదకొండు అడుగుల ఎత్తు గల శివలింగాన్ని ప్రతిష్టించారు.అక్కడ ఎనిమిది అంతస్థులలో మన దేశంలోకెల్ల పెద్ద శివ క్షేత్రం. దీని పేరు చెంగల్ శివ పార్వతి క్షేత్రం. ఈ స్థల మహాత్మ్యం చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ రెండు సార్లు అతి రుద్ర యజ్ఞం చేశారు. అలాగే మరెన్నో సార్లు అతిరుద్ర యజ్ఞం చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఒకసారి అతి రుద్ర మహా యజ్ఞం చేయడమే గొప్ప విషయం. చెంగల్ శివ పార్వతి క్షేత్రం ఉన్న ప్రదేశం ఎంతో పుణ్యభూమిగా భావిస్తారు.ఈ స్థలానికి ఉండే మహత్వాన్ని గమనించి స్వామి మహేశ్వరానంద సరస్వతి ఈ మహా శివలింగ ప్రతిష్ట కోసం పూనుకున్నారు. వీరికి కంచికామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి మంత్ర దీక్ష ఉపదేశించారు. ఈ పుణ్యస్థలం పేరు పుట్టురాకల్. ఇక్కడే శివపార్వతులు పుట్టరూపంలో వెలిశారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో దొరికిన ఆధారాల వలన దేవాలమం 5 వేల ఏళ్ళ పురాతనమైనది అని తెలిసింది. దేశం నలుమూలల నుంచి మట్టి, పవిత్ర నదీ జలాలు వనమూలికలు తెచ్చి నిర్మించారు. మూలాధారంగా వినాయకుడు సరస్వతి బ్రహ్మ రూపాలను ప్రతిష్టించారు. మొదటి అంతస్థు భూ మట్టానికి కింద నిర్మించారు.64 మహారూపాలలో శివుని విగ్రహాలను ఉంచారు. భక్తులు కూర్చుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు అలాగే ప్రతి అంతస్థులో ఓంకారనాదం వినిపిస్తుంటుంది. పంచభూతాలు తనలో ఇమిడి ఉన్నట్టుగా ప్రకృతి అందాలను చిత్రీకరించారు. ఏడవ అంతస్తులోకి వెళితే కైలాసానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది మనకి. సహస్రదళ పద్మాకృతి కింద శివ పార్వతి విగ్రహం ముందు నిలబడి ధ్యానంలోకి వెళ్లడం మనస్సుకి ప్రశాంతంగా ఉండడం గమనించవచ్చు. కింద అంతస్థులో శివలింగ ప్రతిష్ట ఉంది ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాల భావన కలిగిన శివ ప్రతిష్ట అద్భుతం. శివపార్వతుల తనయునికి ఇక్కడ చాలప్రాధాన్యత ఉంది. అందుకే 32 విఘ్నేశ్వర రూపాల ప్రతిష్ట ఉంది. బాల గణపతి నుండి యోగ గణపతి వరకు ఉన్న రూపాలకి నిత్యపూజలు జరిపే దేవాలయం ఇక్కడ మాత్రమే ఉంది.అసామాన్య శిల్పకళాచాతుర్యంమహాబలి పురం నుండి వచ్చిన శిల్పుల కళాచాతుర్యం ఇక్కడ ఉన్న విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. రుద్రుడు అంటేనే మానవ కష్టాలను హరించేవాడు అని అర్ధము. మహా రుద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతి రుద్ర మహా యజ్ఞం చేశారు ఈ యజ్ఞం చేయడం నిజంగా ఎంతో మహత్తర విషయం. పదకొండు రోజులపాటు 121 మంది వేద పండితులు 121 కలశాలతో అభిషేకం, పదకొండు సార్లు రుద్రా మంత్రం జపిస్తే ఫలప్రాప్తి కలుగుతుంది .అటువంటిది రెండుసార్లు జరగడం శివుని శక్తికి నిదర్శనం అని నమ్ముతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా భావంతో ఇక్కడకు భక్తులు వస్తుంటారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంచెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం 111.2 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివలింగం గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇంతకుముందు, కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలోని 108 అడుగుల ఎత్తైన శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైనది గా ఉండేది.10 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 లోప్రారంభమైంది, దీని నిర్మాణం పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. దాని ఎత్తు మాత్రమే కాదు, దాని విశిష్టమైన స్థూపాకార నిర్మాణం, దానిలోపల దాగి ఉన్న అద్భుతమైన ఆశ్చర్యాలు కూడా చూడటానికి ఒక అద్భుతం.కాశీ, గంగోత్రి, రిషికేశ్, రామేశ్వరం, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాసం వంటి వివిధ పుణ్యక్షేత్రాల నుండి నీరు, ఇసుక, మట్టిని కూడా నిర్మాణ సామగ్రిలో కలిపారు. అందువల్ల, చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం ఒక దైవిక నిర్మాణంగా భావిస్తారు. ఈ కట్టడంలో 8 అంతస్తులు ఉన్నాయి, వాటిలో ఆరు అంతస్తులు మానవ శరీరంలోని ఆరు చక్రాలు లేదా శక్తికేంద్రాలకుప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ అంతస్తులలో భక్తులు, యాత్రికులు, పర్యాటకులు ఆయా చక్రాలపై ధ్యానం చేయడానికి 6 ధ్యానమందిరాలు ఉన్నాయి. ఈ కట్టడం మొదటి అంతస్తులో 108 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి, ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.భక్తులు మహా శివలింగంలోకి ప్రవేశించవచ్చు. ఈ శివలింగం లోపల, శివలింగం విశ్వ ప్రభావాన్ని అనుభవించడంతో పాటు, శరీరంలోని చక్రాల శక్తిని పెంచుకోవడానికి ధ్యానం కూడా చేయవచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
పసుపు కొమ్ము అలా పుట్టింది..! అందుకే గణపతిని..
పసుపు కొమ్ము గణపతి దీన్నే హరిద్రా గణపతి అంటారు. అష్టోత్తరంలో ఓం హరిద్రా గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తుంటాం. గురు గ్రహ అనుగ్రహం కోసం హరిద్రా గణపతిని పూజించాలని పండితులు చెబుతుంటారు. గురువు అనుకూలంగా లేనివారు పసుపుకొమ్ము గణపతిని పూజించి ఉపశమనం పొందవచ్చని జ్యోతిష నిపుణులు పేర్కొంటారు. ఈ నేపథ్యంలో పసుపు కొమ్ము గణపతి ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఏంటి? పశువు కొమ్ము కాస్తా పసుపు కొమ్ముగా ఎలా మారింది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..?పూర్వం త్రిపురాసురలనే రాక్షసులుండేవారు. వారు తమను ఏకకాలంలో చంపాలనే వరాన్ని పొంది ఉన్నారు. దాంతో నందీశ్వరుడు ఆ ముగ్గురిని తన త్రిశృంగములతో అంటే మూడు కొమ్ములతో ఏకకాలంగా పైకెత్తగా శివుడు తన త్రిశూలంతో ముగ్గురిని సంహరించాడు. అయితే శివుడి త్రిశూలం ధాటికి నంది మధ్య శృంగం అంటే మధ్యలో ఉండే కొమ్ము ఊడిపోయి, కింద పడిపోయింది. దాన్ని గమనించిన పరమేశ్వరుడు పశువు కొమ్మును పసుపు కొమ్ముగా మారేలా వరమిచ్చి విఘ్నేశ్వర మూర్తి రూపంలో ఆ పసుపు కొమ్ముకు హరిద్రా గణపతిగా పూజలు అందుకునే వరాన్ని ఇచ్చారు.శుభానిక ప్రతీక..అందుకే హల్దీ..పసుపు కమ్ము గణపతి శుభానికి ప్రతీక. గురు గ్రహం పసుపు వర్ణానికి అధిపతి. శుభకార్యాల్లో కూడా పసుపు వర్ణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పెళ్లికి ముందు హల్దీ వంటి వేడుకలు.. పసుపు బట్టలతో పెళ్లి పీటలపై వధువరులను కూర్చోబెట్టడం వంటివి ఉదాహరణలు. అర్చనలు ఆధ్యాత్మిక క్రతువుల్లో కూడా పసుపునకు ప్రాధాన్యం ఉంది. ఇక జ్యోతిష్య శాస్త్రంలో గురువు జ్ఞాన కారకుడు, సంతాన కారకుడు గురువు అనుగ్రహంతో పాటు గృహ సౌఖ్యం ఆచారాలు మొదలైన వాటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు పసుపు కమ్ము గణపతిని పూజించడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. జాతకంలో గురువుస్థానం సరిగ్గా లేనప్పుడు కాలేయ సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఇక పైకి తెలియకుండా లోపల లోపలే విస్తరించే షుగర్, కేన్సర్ వంటి వ్యాధులు కూడా గురువు అనుగ్రహం లేకపోవడం వల్లనే కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఇలాంటి వారు పసుపు కమ్ము గణపతిని పూజించాలని పెద్దలు చెబుతున్నారు.గురుసేవ, గురుపారాయణం..అయితే గురు గ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు వచ్చే దుష్ఫలితాల భారి నుంచి కొంతలో కొంతైనా తప్పించుకునే మార్గాలు లేకపోలేదని పెద్దలు చెబుతున్నారు. దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి రామకృష్ణ పరమహంస వంటి గురువులను పూజించడం వల్ల బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చని దక్షిణామూర్తిని స్మరించడం వల్ల గురువును శాంతింపచేసి ఆయన ద్వారా ప్రాప్తించే వ్యతిరేక ఫలితాల నుంచి బయట పడవచ్చని పెద్దలు చెబుతున్నారు. శనగలు గురు సంబంధమైన ధాన్యంగా చెబుతారు. వాటిని దానం చేయడం వలన కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా గురు పారాయణం గురు ధ్యానం గురు స్మరణ గురుసేవ మాత్రమే గురు గ్రహం అనుగ్రహానికి కారణం అవుతాయని చెబుతుంటారు. అనేక వ్యాధుల బారి నుంచి దూరంగా ఉంచడానికి గురువు ఒక్కడే కారణమని అందుకోసం హరిద్రా గణపతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. హరిద్రా గణపతిని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న వారికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. ధన కనుక వస్తువాహనాభివృద్ధి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. పసుపు గణపతిని పూజించడం వల్ల దేహం కాంతిమంతంగా మెరుస్తుంది. అంటే చర్మరోగాలు దరిచేరవు. ఒకవేళ చర్మ వ్యాధులు ఉన్నట్లయితే అవి నయంవుతాయని చెబుతారు. వ్యాపారులు కూడా ఓల్డ్ స్టాక్ ను క్లియర్ చేయడానికి ఆయా వస్తువులను హరిద్రా గణపతితో తాకించడం మనం ఉత్తరాదిలో ఎక్కువగా చూస్తుంటాం. రుణ విముక్తికి ధన లాభానికి హరిద్రా గణపతిని పూజించడం చక్కటి మార్గంని పెద్దలు వివరిస్తున్నారు. (చదవండి: ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు? ఇంతకీ ఎవరు వాళ్లు??) -
ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు?
సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా.. గర్భాలయం వెలుపల.. ద్వారానికి అటూఇటూ ఇద్దరు ద్వారపాలకులుంటారు. ప్రాచీన ఆలయాల్లో కూడా అందమైన విగ్రహాల రూపంలో ద్వారపాలకులను ప్రతిష్టించారు. అసలు ఆలయాల్లో ద్వారపాలకులెవరు? ప్రధాన దేవతలకు ద్వారపాలకుల అవసరం ఉంటుందా? వైష్ణవ, శైవ, శక్తి ఆలయాల్లో ఎవరెవరు ద్వారపాలకుల బాధ్యతలను నెరవేరుస్తారు? ఈ వివరాలను గురించి సవివరంగా తెలుసుకుందాం..ఆలయాల్లో గర్భాలయాల వెలుపల విగ్రహాల రూపంలో ఉండే ద్వారపాలకులు కేవలం కావాలివారు అనుకోవడానికి వీళ్లేదు. ఆలయానికి వచ్చే భక్తుడి మానసిక స్థితిని దైవదర్శనానికి అనుగుణంగా మార్చే ఆధ్యాత్మిక సంకేతాలుగా ద్వారపాలకులు నిలుస్తారని పండితులు చెబుతుంటారు. సైన్స్ కూడా.. గర్భాలయం నిర్మాణ శైలి.. గాలిగోపురం వంటివి భక్తుల్లోని నెగటివ్ ఎనర్జీని లాక్కొని.. ఆకాశంలోకి కలిపేసి.. వారిలో పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేసేందుకు దోహదపడే అంశాలుగా ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ ద్వారపాలకులు కూడా సరిగ్గా అదే పని చేస్తారని తెలుస్తోంది. భక్తుల చిత్తాన్ని దేవుడిపై ఉండేలా వీరు అనుగ్రహిస్తారని పెద్దలు చెబుతుంటారు.ఆలయంలో దేవతను బట్టి..ద్వారపాలకులు..గర్భాలయంలో ఉండే దేవతలను బట్టి.. ద్వారపాలకులు ఉంటారు. విష్ణు ఆలయాల్లో జయవిజయులు ద్వారపాలకులుగా ఉంటారు. వీరిద్దరూ వైకుంఠంలో మహావిష్ణువుకు ద్వారపాలకులు అనే విషయం తెలిసిందే..! వీరిద్దరికీ కూడా విష్ణుదేవుడి మాదిరిగా నాలుగు చేతులుంటాయి. శంఖచక్రాలను ధరించి ఉంటారు. ఇక శివాలయాల్లో చూస్తే.. ద్వారపాలకులుగా దిండి, మొండి ఉంటారు. వీరిద్దరూ శివుడి ప్రధాన గణాల్లోని మహాకాలుడు, నందికి ప్రతిరూపాలుగా చెబుతారు. దిండి, మొండి.. వీరిద్దరిలో ఒకరు శూలాన్ని, ఢమరుకాన్ని ధరించి ఉంటారు. కొన్ని ఆలయాల్లో ధాత్రి, విధాత్రి అనే పేర్లతో కూడా వీరిని పిలుస్తారు. వీరిద్దరూ భక్తుల హృదయంలో ఉండే భయాన్ని, భీతిని తొలగించి, వారి చిత్తం శివుడిపైకి మళ్లేలా చూస్తారని పండితులు చెబుతున్నారు. ఇక అమ్మవారు, శక్తి ఆలయాల్లో స్త్రీ ద్వారపాలికలు ఉంటారు. మీరు గమనించవచ్చు.. గర్భాలయంలో ఉండే అమ్మవారు శాంతస్వరూపిణి అయితే.. ద్వారపాలికలు శాంతంగాను.. అమ్మవారు క్రోదం, రౌద్ర స్వరూపిణిగా ఉంటే.. ద్వారపాలికలు ఉగ్రంగా ఉంటారు. అందుకు కారణాలను మనం మరో వీడియోలో తెలుసుకుందాం. అయితే.. అమ్మవారి స్వరూపాన్ని బట్టి.. ద్వారపాలికలు మారుతుంటారు.ప్రతీ ఆలయంలో ద్వారపాలకులకు విశిష్ఠత ఉంటుంది. వీరు ఆలయ పవిత్రతను, అనంత శక్తిని కాపాడతారని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా భక్తులు గర్భాలయంలో ప్రధాన దేవతామూర్తిని దర్శించడానికి ముందు.. ద్వారపాలకులకు నమస్కరిస్తేనే ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ద్వారపాలకులు అనేది కేవలం శిల్పకళ కోసమో.. అలంకారం కోసమో కాదని, వారి అనుమతితోనే ముందుకు సాగాలని వివరిస్తున్నారు. ఆలయాలను నిర్మించిన రాజులు, రాజవంశాలు కూడా ద్వారపాలకుల శిల్పాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవి. గంగైకొండ చోళపురం వంటి చోట్ల.. భారీకాయులైన ద్వారపాలకులు కనిపిస్తారు. పల్లవుల కాలంలో సహజసిద్ధమైన మానవరూపాలకు సారూప్యంగా ఉండే ద్వారపాలకులకు ప్రాధాన్యమిచ్చారు. చాళుక్యుల కాలంలో ద్వారపాలకులకు కూడా అలంకారానికి ప్రాధాన్యతనిచ్చారు. బౌద్ధ, జైన ఆలయాల్లో యక్షుల రూపంలో లేదా ధర్మరక్షకులుగా, సౌమ్యులుగా ద్వారపాలకులు దర్శనమిస్తారు. సో.. ద్వారపాలకుల గురించి తెలిసింది కదా?? ఇకపై ఏ దేవాలయానికి వెళ్లినా.. ముందుగా ద్వారపాలకులకు నమస్కరించాకే.. ప్రధాన దేవతామూర్తిని దర్శించుకోవాలనే విషయాన్ని మర్చిపోవొద్దు. (చదవండి: హిమాలయాల నడుమ చల్లని స్వర్గం) -
సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ఆలయాన్ని ఎందరో దర్శించుకున్నారు. అంతేగాదు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ఈ ఆలయానికే తరలి వస్తుంటారు. మన టాలీవుడ్ హీరో ఎన్టీర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా వంటి దిగ్గజాలు వరకు చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అంతా ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. అలా అంతటి అతిరథమహారథులంతా తరలివస్తున్న ఈ కొల్లూరు మూకాంబిక క్షేత్రం విశిష్టత ఏంటి, ఎందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఈ అమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోంది. దీన్ని పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి.ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది.ఎంజీఆర్ టు అమ్మ జయలిలత వరకు..అంతేగాదు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వచ్చారు. అలాగే, ‘అమ్మ’ జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జులై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి, అన్నదానం కోసం రూ. 30,000లను జయలలిత సమర్పించారు. ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ కూడా ఎన్నికలకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వారి బాటలోనే ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని వెండి ఖడ్గాన్ని సమర్పించారు. ఆలయ చరిత్ర..పురాణాల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించిన కౌమాసురుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొందడానికి శివుడి కోసం తపస్సు చేశాడట. తన మనోబలంతో ఆ రాక్షసుడి కోరికను పసిగట్టిన కోల మహర్షి.. సరస్వతికి తెలియజేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో అతడ్ని అమ్మవారు మూగవాడిని చేసిందట. అప్పటి నుంచి అతడ్ని మూసాసురుడిగా పిలిచేవారు. అయినప్పటికీ అతడు గర్వం వీడకపోగా.. దేవతలను, యక్షులను హింసించేవాడట. తననే పూజించాలని హుకుం జారీచేసి.. యజ్ఞయాగాదులను కూడా అడ్డుకోవడంతో కోల మహర్షి ఆధ్వరంలో మునులు పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అమ్మవారు దైవగణాలతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆది శంకరాచార్యులు కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిందట. దీనికి శంకరాచార్యులు.. కేరళలోని తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని, తద్వారా ఆ ప్రాంతం సుభిక్షమవుతుందని, ఆలయాన్ని దర్శించుకునే వారికి ఎన్నుకున్న రంగంలో విజయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కోరారట. ఇందుకు సరేనన్న అమ్మవారు.. ముందుగా శంకరాచార్యులను నడవమని, తర్వాత వెనుకగా వస్తాని, గమ్యం చేరే వరకూ తిరిగి చూడొద్దని చెప్పిందట. అలా మూకాసురుడ్ని వధించిన ప్రాంతానికి వచ్చేసరికి దేవి ఆగిపోయిందట. అమ్మవారి గజ్జల శబ్దం వినబడకపోవడంతో శంకరాచార్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే మూకాంబికగా వెలిసిందట.దీంతో నిరాశకు గురైన శంకరాచార్యలకు అమ్మవారు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆయన అలాగే చేశారని అంటారు. అమ్మవారి మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరంపై ఉండేదని.. కానీ అక్కడకు వెళ్లడం భక్తులకు కష్టంగా ఉండటంతో శంకరాచర్య ఆలయాన్ని కొల్లూరులో తిరిగి ప్రతిష్ఠించారని చెబుతుంటారు స్థానికులు.అంతేగాదు ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం మధ్యలో ఒక 'స్వర్ణ రేఖ' ఉంటుంది. ఇది శివశక్తుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. అంటే ఒకే క్షేత్రంలో అటు పరమశివుడిని, ఇటు పరాశక్తిని కలిపి దర్శించుకునే అరుదైన భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది.ఈ అమ్మ ఆసీస్సుల కోసమే ఎందుకంటే..ఈ మూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే, తమ కెరీర్ అద్భుతంగా రాణిస్తుందని, విజయాలు వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. అందుకే ముఖ్యమైన సినిమాలు ప్రారంభించే ముందు లేదా రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది. అంతేగాదు ఈ అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిగా (లక్ష్మి, సరస్వతి, కాళీ స్వరూపిణిగా) భక్తులు విశ్వసిస్తారు. ఆ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో జయాలు సాధించిన తర్వాత, తమ పదవికి, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు, చండీ యాగం వంటివి నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో, సౌపర్ణిక నది తీరాన వెలసిన కొల్లూరు క్షేత్రం అటు ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఇటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. అందుకే సామాన్య భక్తుల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి పాద చెంతకు చేరుకుంటున్నారు.🚨 Why CM Vijay’s visit to the Kollur Mookambika Temple is a massive political statement.Tamil Nadu Chief Minister Vijay is visiting the Kollur temple in Karnataka today at 3 PM. While it looks like a standard spiritual visit, the historical context is fascinating.He is…— MacroMatrix (@MacroMatrix1) June 12, 2026 (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
వారధి: అది ఒక సరస్సు.. ఆ సరస్సుకు రెండు వైపులా..
అది ఒక సరస్సు. ఆ సరస్సుకు రెండు వైపులా రెండు గ్రామాలు. ఆ సరస్సులో ఏడాది పొడవునా నీరు అతి వేగంగా పారుతుంటుంది. ఆ నీటి ప్రవాహవేగానికి ఎదురీది ముందుకు పోవడం అనేది చాలా కష్టం. అనా ఒకరిద్దరు ఆ నీటివేగం తమనేం చేస్తుందని చెప్పి సరస్సులో దిగి ప్రమాదంలో చిక్కుకుని బతుకుజీవుడా అంటూ అతి కష్టంమీద ఒడ్డుకు చేరుకున్నారు.ఈ విషయం తెలిసినప్పటి నుంచి రెండు గ్రామాల ప్రజలెవరూ ఎదురీతకు సాహసించలేదు. అంతేకాదు, ఎవరికి వారు తామున్న గ్రామంలోనే సురక్షితంగా ఉండడానికి నిశ్చయించుకుని అలాగే ఉంటూ వచ్చారు. ఇరు గ్రామాల ప్రజల మధ్య సంబంధాలూ ఉండేవి కావు. అలాగని శత్రుత్వమూ లేదు.ఒకరోజు, సరస్సుకు కుడివైపున ఉన్న పల్లెకు ఓ గురువు వచ్చారు. ఆయన సరస్సు ఒడ్డున నిల్చుని ఎడమవైపున ఉన్న పల్లె వంక చూశారు.‘‘నేను ఆ పల్లెకు వెళ్ళాలనుకుంటున్నాను’’ అని అన్నారా గురువు.ఇంతలో ఓ పెద్దమనిషి ‘‘అది కష్టమండి’’ అని జవాబిస్తూ ‘‘నీటి ప్రవాహవేగం సామాన్యమైనది కాదు. అసలీ సరస్సులో ఈదాలనుకోవడమే చాలా కష్టం’’ అని అన్నాడు. అలాగే మరో ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు. హెచ్చరిక చేశారు. అయినా ఆ గురువు వారి మాట పట్టించుకోలేదు.‘‘నీటి ప్రవాహవేగాన్ని ఓ కారణంగా చెప్పుకుని మీ రెండు గ్రామాల మధ్య సంబంధాలు పెట్టుకోకపోవడం సరికాదు. మీరందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి దీనిపై ఓ వారధి నిర్మించుకోవచ్చు కదా?’’ అని జెన్ గురువు ఓ సలహా ఇచ్చారు.అయితే ఈసారి మరో ఇద్దరు ఒక్కసారిగా గొంతు కలిపి ఇలా చెప్పారు ‘‘బలే వారు స్వామీ, ఈ సరస్సులో ఈదడమే కష్టమనుకుంటుంటే దాని మీద వంతెన కట్టడమా...అది అసాధ్యం’’ అని అన్నారు.అయినా జెన్ గురువు ఆగలేదు. ‘‘అది సాధ్యమే’’ అని అన్నారు.‘‘నేను మీకందుకు సాయం చేస్తాను’’ అని ఆ గురువు వారికి హామీ ఇచ్చారు.ఏదో మాట చెప్పానని ఊరుకోకుండా ఆ జెన్ గురువు పల్లెలోని వంద మంది యువకులను ఎంపిక చేసారు. వంతెన నిర్మాణానికి పూనుకున్నారు.రాత్రీ పగలూ, ఎండా వానా అనేవేవీ లెక్కచేయకుండా ఆ వంద మంది యువకులతోపాటు జెన్ గురువూ శ్రమించారు. అనుకున్నట్టే ఆ సరస్సుపై ఓ వారధి ఏర్పాటైంది. ఇప్పుడు ఆ రెండు గ్రామాల ప్రజల మధ్య సత్సంబంధాలు పెరిగాయి. రాకపోకలు పెరిగాయి. అంతేకాదు, ఒకరి మధ్య ఒకరు సహకరించుకోవడం మొదలుపెట్టారు. ఈ ఊరు అబ్బాయిని ఆ ఊరు అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేశారు. ఇరు గ్రామాల ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా కాలం గడుపుతున్నారు.ఓ ఏడాది గడిచింది. ఓ రోజు ఇరు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఊరు పొలిమేరలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళి తమ ఆనందానికి కారణమైన గురువును కలిశారు. నమస్కరించారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘‘మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాం’’ అని ముక్తకంఠంతో చెప్పారు. కానీ గురువు తనకెలాంటి సన్మానమూ వద్దని సున్నితంగా తిరస్కరించారు.‘‘నాకు ఎలాంటి ఆడంబరాలూ వద్దు. పొగడ్తలూ వద్దు. ప్రచారమూ వద్దు. మీరందరూ ఇప్పటిలాగే ఎప్పుడూ కలసి మెలసి ఉంటే అదే నాకు ఆనందం’’ అని చెప్పారాయన. – జగద్రేణు -
ఇవాల్టి నుంచే యమునా నది పుష్కరాలు ప్రారంభం
దేవగురువు బృహస్పతి జూన్ 2, మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాలు జూన్ 13, శనివారం తో ముగుస్తాయి. ఈ పన్నెండు రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తారు.యమ బాధలు తీర్చే పవిత్ర స్నానం!పురాణాల ప్రకారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి యమునా దేవి కుమార్తె. యమధర్మరాజుకి స్వయాన సోదరి. అందువల్ల యమునా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే యమ బాధలు తొలుగుతాయని విశ్వాసం. సూర్యుడి సంతానంలో యముడు, యమున, శని ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. ఈ భూమ్మీద మానవుడు చేసే పాప పుణ్యాల కర్మను శని భగవానుడు అనుభవింపజేస్తాడు. జీవుడు ప్రస్తుత జన్మలో, అనేక జన్మల ద్వారా ఏర్పడిన పాప పుణ్య కర్మల ఫలితాలను మరణం తర్వాత యమధర్మరాజు చూస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యమ బాధలు, పాపాల నుంచి విముక్తి పొందేందుకు యమునా నది స్నానం ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అందువల్లే, శ్రీకృష్ణుడు స్వయంగా యమునా నది ఒడ్డున జన్మించడంతో పాటు ఈ నదితో ముడిపడి అనేక పురాణ విషయాలు ఉండటం యమున వైభవాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.భారతీయ సనాతన ధర్మం, పురాణాలలో యమునను కాళిందీ నదిగా పేర్కొన్నారు. 'యమునా నది కృష్ణ ప్రియః' అంటే యమునా నది కృష్ణుడికి ప్రియమైనదిగా చెబుతారు. యమునా నది నీటి స్పర్శ తాకితే పాపాల తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ,తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ, ఆత్మశుద్ధి వంటివి కలుగుతాయని విశ్వాసం. మరీ ముఖ్యంగా ఇక్కడ పుణ్యస్నానంతో శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందగలరని శాస్త్రవచనం. ఇంతటి విశేషం, మహత్యం కలిగిన నదికి పుష్కరాలు రావడం, పుష్కరాల్లో భక్తి శ్రద్ధలతో స్నాన విధి ఆచరిస్తే విశేష ఫలితాలు దక్కుతాయని విశ్వాసం.జ్యోతిష శాస్త్రం ప్రకారం.. దేవగురువు అయిన బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తుంటాయి (ఉదా: బృహస్పతి మేష రాశిలో ఉంటే గంగా నదికి , వృషభంలో పరాభవ నామ సంవత్సరంలో దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల జూన్ 2 నుంచి 13 వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి.ఎక్కడ స్నానమాచరించాలి ?యమునా నది ప్రవహించే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పుణ్య ఫలాలు పొందుతారు. ముఖ్యంగా పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం.ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పుష్కర స్నానం ఆచరించవచ్చు. గంగా , యమున , సరస్వతి నదులు కలిసే ఈ పవిత్ర సంగమంలో పుష్కర స్నానమాచరించడం విశేష పుణ్యఫలం లభిస్తుంది.మథుర/బృందావనం: శ్రీకృష్ణుడు స్వయంగా జన్మించి తన బాల్యాన్ని గడిపి, లీలలను ప్రదర్శించిన ప్రాంతమిది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఘాట్లలో పుష్కర స్నానం ఎంతో విశేషం.యమునోత్రి: యమునా నది జన్మస్థలం ఇది. ఇక్కడ యమునా నదిని దర్శించుకొని పుష్కర స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం.ఇంద్రప్రస్థం (ఢిల్లీ): పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజ్యంగా చేసుకొని అనేక యజ్ఞయాగాదులు చేసిన పవిత్ర ప్రదేశమిది. ఇలా ఈ పుణ్య నది పరిసర ప్రాంతాల్లో పురాణాలకు సంబంధించిన విశేషం ఉన్న ప్రాంతాల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిదిఏయే దానాలు చేస్తే మంచిది ?పుష్కరస్నానం అనంతరం దానం (అన్నదానం గోదానం , భూదానం , సువర్ణదానం , లవణదానం, పుస్తక దానం వంటివి) చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. యజ్ఞ యాగాదులు, హోమాలు వంటివి నిర్వహించడం లేదా ఆయా పవిత్ర కార్యాల్లో పాల్గొనడం వంటివి ఆచరిస్తే పుణ్యం.పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడం వల్ల వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం. పుష్కరాల్లో పురాణ పఠనం, మంత్రోచ్ఛారణ , భగవన్నామస్మరణ , జపం , తపం వంటివి ఆచరించడం ఉత్తమం.పుష్కరాలంటే సబ్బులు , శాంపూలతో స్నానమాచరించి నదులను కలుషితం చేయడం కాదు. యత్ర స్వచ్ఛః తత్ర లక్ష్మి అన్నారు పెద్దలు. పుష్కరాల్లో స్నాన విధిని అనుసరించి పురుషులు పంచె వంటివి ధరించడం , మహిళలు తమకు సౌకర్యమైన చీరవంటివి ధరించడం, దంపతులైతే భార్య , భర్త కొంగుముడి వేసుకొని భక్తి శ్రద్ధలతో మూడు మునకలతో చేసే స్నానం పుష్కర స్నానం. ఇలా స్నానమాచరించి దేవతలకు, రుషులకు, నదికి అర్ఘ్యం సమర్పించడం, పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది నదులలో చెడు పదార్థాలను విడిచిపెట్టడం పాతకం వీటిని దృష్టిలో ఉంచుకొని పుణ్యార్చన కోసం భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలని సూచన.పుష్కర స్నాన మహత్యంనదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. మనం కూడా యమునా నది పుష్కరాలలో స్నానమాచరించి మోక్షాన్ని పొందుదాం. (చదవండి: శ్రీ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక వైభవం.) -
కోటిలింగేశ్వరా.. శిరసా నమామి
కోటి లింగేశ్వర నమఃశివాయ అనే ఉచ్చారణ వింటుంటే మనకి ఒక సందేహం కలుగుతుంది... కోటి లింగాలతో శివాలయమా అని... ఔను! నిజంగానే కోటి లింగాలతో శివాలయం ఉంది అంటే ఆశ్చర్యపోతాము. దానికి తోడు 108 అడుగుల ఎత్తు కలిగిన అతి ఎత్తయిన శివలింగం... ఎదురుగా 36 అడుగుల పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంది. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్య పెద్ద త్రిశూలం స్థాపించారు. సుమారు 97 లక్షల శివలింగాల ప్రతిష్ట జరిగి ఉంటుందని లెక్క. ఇవికాక ఉపదేవతలు... దేవి పీఠాలు వెరసి భక్తితో ఓం నమఃశివాయ అనే ఉచ్చారణతో లోకమే మర్చిపోతాము. కోటి లింగాల స్థాపన అంటేనే చిన్న విషయం కాదు. ఈ దేవాలయ ప్రతిష్టతో ఆ ఊరి అసలు పేరు మారిపోయి కోటి లింగేశ్వర అని చెప్తేనే తెలుస్తోంది. మరి అంతటి ప్రశస్తి పొందింది. ఈ కోటి లింగేశ్వర దేవాలయం బెంగుళూరుకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరి పేరు కమ్మసంద్ర. ట్రైన్లో వెళ్తే బంగారుపెట్ట రైల్వేస్టేషన్లో దిగితే 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఉండడానికి అంత సౌకర్యాలు లేవు. బెంగళూరు, కమ్మసంద్ర రెండు వేరు వేరు లోకాలని చెప్పొచ్చు. బెంగళూరు యాంత్రికమైన వేగంతో కూడుకున్న జీవితం అయితే కమ్మసంద్రలో ప్రశాంతమైన పల్లె వాతావరణం... భక్తితో కోటి లింగేశ్వర లోకం అని అనిపిస్తుంది. మరి ఈ దేవాలయాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరు స్వామి సాంబశివమూర్తి. పేరులోనే శివ నామం ఉంది. అందుకేనేమో కోటి శివలింగాలను ప్రతిష్టించాలని మనసులో అనుకున్నారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే కేంద్ర సంస్థలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి శివనామస్మరణతో కోటి లింగేశ్వర దేవాలయంలో తన శేష జీవితం గడిపారు. వీరి స్వప్నమే కోటిలింగాల ప్రతిష్ట. 2018లో స్వామి సమాధి ΄పొంది శివైక్యం అయ్యారు. ఇక్కడ 17 శక్తి స్వరూపాలను ప్రతిష్టించారు. అలాగే దుర్గ, పార్వతీదేవిల ప్రతిష్ట ఉంది. ఉప దేవతలుగా అన్నపూర్ణేశ్వరి, కరుమారి అమ్మ, సుబ్రమణ్యేశ్వర స్వామి, పాండురంగస్వామి, సీతారామలక్ష్మణులు, పంచ ముఖ గణపతి, కన్యకాపరమేశ్వరి ఉపదేవతా క్షేత్రాలు ఉన్నాయి. ముందుగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను పూజించి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ చూడదగ్గది సహస్రనామ శివలింగం. ఏకశిల మీద వేయి శివలింగాలను చెక్కి ఉంటుంది. ఒకేసారి వేయి శివలింగాల దర్శనం చేసినంత పుణ్యం దక్కుతుంది. అలాగే మరో పుణ్యఫలం పంచ ముఖ శివలింగం. ఇక్కడ భక్తులకి మరో మంచి పుణ్యం శివునికి అభిషేకం స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ దేవాలయ యాజమాన్యాన్ని సంప్రదించి మనకి నచ్చిన వారి జ్ఞాపకార్ధం ఎనిమిది వేల నుండి రెండు లక్షల రూపాయలు వరకు చెల్లించి శివలింగ ప్రతిష్ట చేసుకోవచ్చు. ఆ విధంగా మనం కూడా కోటిలింగేశ్వర యజ్ఞంలో పాలుపంచుకోవచ్చు. ఎందరో ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పేర్లు కనిపిస్తాయి. గుడిలో వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షం, నాగలింగ వృక్షాలు ఉన్నాయి. ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసికొని ఈ చెట్లకు కడితే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయాల్లో నిత్యసేవ, అన్నదానం, పేదలకు వస్త్రదానం జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం, జాతర జరుగుతుంది. మంజునాథుడు పరమ శివ భక్తుడు. వీరి చరిత్రలో కూడా కోటి లింగేశ్వర ప్రసక్తి ఉందని అంటారు. స్వతహాగా మంజునాథుడు భక్తిభావం లేకుండా తిరిగేవాడు. ఒకరోజు అతనిలో శివుని మీద భక్తి కలిగింది ఎవరు నమ్మలేదు. అప్పుడు మంజునాథుడు పక్కనే ఉన్న శివాలయంలోకి వెళ్లారు. అప్పుడు దీపాలు ఆరిపోయాయి. అది చూసి బాధతో శివ నామ స్మరణ చేసి కీర్తనలు పాడారు. అప్పుడు దీపాలు తిరిగి వెలిగాయి. అప్పుడే ఆయన తన తప్పుకి ప్రాయశ్చిత్తం కోసం కోటి లింగాలను ప్రతిష్ట చేయడానికి సంకల్పం చేశారని చెబుతారు. కోటిలింగేశ్వర యాత్రా దర్శనం అద్భుతం అని చెప్పొచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
శని జయంతి ప్రాముఖ్యత..ఆయన అనుగ్రహం పొందాలంటే..!
శనీశ్వరుడి జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.శనీశ్వరుడి జయంతిదేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం. ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.చేయవలసిన పూజలుశని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి. అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి. ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.శని దేవుడి ప్రాముఖ్యతసూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.శని శాంతి మంత్ర స్తుతి..ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహారవర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయకృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయశుద్ధబుద్ధి ప్రదాయనేయ ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతినవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి , తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.శన్యారిష్టే తు సంప్రాప్తేశనిపూజాంచ కారయేత్శనిధ్యానం ప్రవక్ష్యామిప్రాణి పీడోపశాంతయేఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.వై.వెంకటసుబ్బారెడ్డి9849100044మరిన్ని వివరాలకు కింది వీడియోపై క్లిక్ చేయండి (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
కలియుగ కల్పవృక్షం 'రావిచెట్టు'
భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే ప్రథమ తాంబూలం. చెట్టును, చేమను, పుట్టను, గుట్టను, రాతిని కూడా దైవ స్వరూపంగా భావించే ఉదాత్తమైన సంప్రదాయం మనది. ఈ వృక్ష సంపదలో అగ్రతాంబూలం అందుకునేది ‘రావి చెట్టు’. ఋగ్వేదం మొదలుకొని భగవద్గీత వరకు ప్రతిచోటా కొనియాడబడిన ఈ మహావృక్షాన్ని ‘కలియుగ కల్పవృక్షం’ అని ఎందుకు అంటారు. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగానూ ప్రాణికోటిని రక్షించే ఈ అశ్వత్థ వృక్ష వైభవంపై ప్రత్యేక కథనం..సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వృక్షాలన్ని నేను రావి చెట్టును అని ప్రకటించిన ఈ వృక్షం సామాన్యమైనది కాదు.. త్రిమూర్తుల సమ్మేళనం. దీని వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో శ్రీమహావిష్ణువు, అగ్రభాగంలో పరమశివుడు కొలువై ఉంటారని పురాణోక్తి. అందుకే ఈ చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.దోషాల నుంచి విముక్తికి...జీవితంలో ఎదురయ్యే గ్రహ దోషాలకు, పితృదోషాలకు రావి చెట్టు చెంత చక్కని పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనిదేవుడు రావి చెట్టును వరమిచ్చాడని, ఎవరైతే శనివారం నాడు ఈ చెట్టును పూజించి దీపం వెలిగిస్తారో వారికి తన పీడ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారని, తద్వారా వంశాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు.శాస్త్రీయ కోణంలో .. రావి చెట్టును కల్పవృక్షం అనడానికి కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. ప్రకృతిలో 24 గంటల పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువును విడుదల చేసే ఏకైక వృక్షం రావి. దీని విశాలమైన నీడ పర్యావరణంలోని విష వాయువులను హరిస్తుంది. ఆయుర్వేదంలోనూ రావి బెరడు, ఆకులు, పండ్లను ఎన్నో మొండి వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు. అందుకే ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం.అనుగ్రహం పొందే మార్గం..ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక అశాంతితో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ‘ మంత్రాన్ని జపిస్తూ ఏడు ప్రదక్షిణలు చేయడం విశేష ఫలితాలనిస్తుంది. నమ్మకంతో చేసే ఈ చిన్న ప్రయత్నం అపారమైన మనశ్శాంతిని, కార్యసిద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ప్రకృతిని ప్రేమిద్దాం.. దైవత్వాన్ని పూజిద్దాం..! – పసుపులేటి వెంకటేశ్వరరావు (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..!
మన దక్షిణాదిన శుచీంద్రం ప్రముఖ శివ క్షేత్రాలలో ఒకటి. ఎంతో మహిమ గల శైవదేవాలయం. స్వర్గాధిపతి దేవేంద్రుడు శాపవిమోచన పొందిన స్థలం. మరి మనకి కూడా తెలిసీ తెలియక చేసిన తప్పులకి ప్రార్థనతో పొదవచ్చు. స్త్రీవ్యామోహంతో శాపం పొందిన ఇంద్రుడు ఇక్కడ పాప మోచనం పొంది శుచిత్వం పొందడంతో శుచీన్ద్రం అని పేరు వచ్చింది. ఆ కథ, శుచీంద్ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. ఒకసారి అహల్య అందాన్ని చూసి మోహ పరవశుడు అయ్యాడు దేవేంద్రుడు. అప్పుడు ఇంద్రుడు తెల్లవారక ముందే కోడికూత వేసి గౌతమ మునిని స్నానానికి పం΄ాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతమ ముని వేషంలో అనసూయ దగ్గరకి వచ్చాడు. జరిగిన మోసం గ్రహించి గౌతమ ముని తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఇంద్రుడిని, అహల్యని చూసి శపించాడు. శిలగా మారిన అహల్య శ్రీ రాముని పాదస్పర్శ తగిలి ఇక్కడే శాప విమోచనం పొందింది. ఇక్కడే అత్రి మహా ఋషికి ఆశ్రమం ఉండేది అందుకే జ్ఞానారణ్యం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక చెట్టు మొదలు నరికినప్పుడు శివలింగం కనిపించింది. గొడ్డలి దెబ్బకి శివలింగం నుండి రక్తం కారసాగింది. ఇది దేవాలయ మూలస్థానంగా చెబుతారు. సుచీన్ద్రంలో మహాశివుని ప్రతిష్ట ఉన్నప్పటికీ త్రిమూర్తి సంకల్పం కూడా ఉంది. కారణం ఇక్కడ వృక్షాలలో త్రిమూర్తులు ఉన్నారు అని చెట్లకు పూజ చేస్తారు. తప్పు చేసిన వారు పాప పరిహారంగా సుచీన్ద్రుని దర్శించుకుని భక్తులు పాప విమోచనం పొందుతారు. సుచీన్ద్రుని ముందు మరుగుతున్న నేతిలో వెండి విగ్రహాన్ని వేస్తాడు పూజారి. తప్పు చేసిన వారు ఆ విగ్రహాన్ని చేతితో తీయాలి. పూజారి ఆ చేతిని వస్త్రంతో కట్టి మూడు రోజుల తరువాత విప్పుతాడు. చేతి చర్మం రంగు మారినా వ్రణం ఏర్పడినా ఆ వ్యక్తి తప్పు చేసినట్టుగా నిర్ధారిస్తారు. బ్రిటిష్ వారు ఈ విధానానికి స్వస్తి పలికారు. మహాభిషేకం సమయంలో భక్తులు రథం లాగుతారు. ఈ కార్యక్రమానికి సుచీన్ద్రం వాసులు ఎక్కడ ఉన్నా వచ్చి పాల్గొంటారు. ఆ విధంగా తమ పాప ప్రక్షాళనం చేసుకుంటారు. ఈ దేవాలయం శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. ఇక్కడి స్తంభాలను మీటితే సప్తస్వరాల ధ్వని వినిపిస్తుంది. స్త్రీ రూపంలో చెక్కిన వినాయకుడు, రుద్రవీణ వాయిస్తున్న రావణాసురుడు, నోటిలో తిరుగుతున్న భూగోళం, రామాయణ మహాభారతాల రాతి శిల్పాలు... ఎంత చూసినా అద్భుతమే. మన దేశంలో లాటరీ విధానం ఇక్కడ నుండి ప్రారంభించారు అని అధికారిక పత్రాలు ఉన్నాయి ఇక్కడ. శుచీన్ద్రం రాజ గోపుర పునరుద్ధరణకు డబ్బు అవసరం ఏర్పడింది. అప్పటి తిరువనంతపురం రాజు గారి అనుమతితో ఒక రూపాయి లాటరీ టికెట్ అమ్మకం చేశారు. పదివేల రూపాయల బహుమతి. యాభై వేల టికెట్లు అమ్మారు. బహుమతి సొమ్ము పోను మిగిలిన డబ్బుతో ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయం మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. పచ్చని అడవితో పాలార్ నదీ ప్రవాహం, శిల్పకళా వైభవం మంచి అనుభూతినిస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నా కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ టూర్ శబరిమల యాత్రలో సుచీన్ద్రం వెళ్లడం సులువు. కన్యాకుమారి నుండి 18, నాగర్కోయిల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది సుచీన్ద్రం శివ క్షేత్రం. సుచీన్ద్రంలో అంతగా లాడ్జీలు లేవు. నాగర్కోయిల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. – ఇ.ఎస్. మాధవన్, విశాఖపట్నం(చదవండి: మైసూరు మహాదేవి చాముండేశ్వరి) -
విద్యార్థి దశలో భక్తి కూడా ప్రధానమే..!
ఈ కాలంలో పిల్లలు చదువుల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. భక్తి అనేది వారిలో ఒక రకమైన భరోసాను నింపుతుంది. ‘మనల్ని రక్షించే శక్తి ఒకటి ఉంది‘ అనే నమ్మకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన పురాణగాథల్లోని ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి కథలు వినడం ద్వారా సత్యం, ధర్మం, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ‘దైవ భీతి’ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడనే భావన పిల్లలను చెడు మార్గాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. దైవ చింతన, ఆధ్యాత్మిక పరిమళం ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలకు క్రమశిక్షణ ఉంటుంది.సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్. నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః (శంకరాచార్యుల భజగోవిందం) చిన్నతనంలోనే దైవచింతన ఉన్నవారితో కలవడం వల్ల కలిగే మార్పు. మంచి వారితో స్నేహం (సత్సంగం) వల్ల ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. భక్తి అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. బాల్యంలోనే ఈ భావం కలగడం వల్ల పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. క్రమశిక్షణ, సత్యం పలకడం, ఇతరులకు సహాయం చేయడం వంటి ఉత్తమ గుణాలను అలవరుచుకోవడం.‘కౌమారే విద్యార్థినః’విద్యతోపాటు విజ్ఞానాన్ని ఇచ్చే భక్తి కూడా అవసరం. లోకజ్ఞానాన్ని ‘విద్య’ ఇస్తే, భక్తి విచక్షణా జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రాణం పోయాక ఎంతో ప్రేమగా చూసుకునే భార్య వాకిలి వరకే వస్తుంది. బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు. కాని ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహం ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు. అటువంటి పరబ్రహ్మను వదిలేసి జీవితమంతా ప్రాపంచపు విషయాల్లో ఉంటూ జల్సాలు చేస్తే చివరికి మిగిలేది దుఃఖమే. చిన్నప్పుడే దైవ భక్తిని అలవరచుకోవడం అనేది వ్యక్తి జీవన ప్రయాణానికి బలమైన దిక్సూచిని నిర్మించుకోవడంతో సమానం. బాల్యంలో మనసు స్వచ్ఛంగా, మృదువుగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నాటిన భక్తిబీజాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
భక్తితో బాల్యంలోనే భరోసా
ఈ కాలంలో పిల్లలు చదువుల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. భక్తి అనేది వారిలో ఒక రకమైన భరోసాను నింపుతుంది. ‘మనల్ని రక్షించే శక్తి ఒకటి ఉంది‘ అనే నమ్మకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన పురాణగాథల్లోని ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి కథలు వినడం ద్వారా సత్యం, ధర్మం, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ‘దైవ భీతి’ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడనే భావన పిల్లలను చెడు మార్గాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. దైవ చింతన, ఆధ్యాత్మిక పరిమళం ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలకు క్రమశిక్షణ ఉంటుంది.సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్. నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః (శంకరాచార్యుల భజగోవిందం) చిన్నతనంలోనే దైవచింతన ఉన్నవారితో కలవడం వల్ల కలిగే మార్పు. మంచి వారితో స్నేహం (సత్సంగం) వల్ల ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. భక్తి అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. బాల్యంలోనే ఈ భావం కలగడం వల్ల పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. క్రమశిక్షణ, సత్యం పలకడం, ఇతరులకు సహాయం చేయడం వంటి ఉత్తమ గుణాలను అలవరుచుకోవడం.‘కౌమారే విద్యార్థినః’విద్యతోపాటు విజ్ఞానాన్ని ఇచ్చే భక్తి కూడా అవసరం. లోకజ్ఞానాన్ని ‘విద్య’ ఇస్తే, భక్తి విచక్షణా జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రాణం పోయాక ఎంతో ప్రేమగా చూసుకునే భార్య వాకిలి వరకే వస్తుంది. బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు. కాని ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహం ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు. అటువంటి పరబ్రహ్మను వదిలేసి జీవితమంతా ప్రాపంచపు విషయాల్లో ఉంటూ జల్సాలు చేస్తే చివరికి మిగిలేది దుఃఖమే. చిన్నప్పుడే దైవ భక్తిని అలవరచుకోవడం అనేది వ్యక్తి జీవన ప్రయాణానికి బలమైన దిక్సూచిని నిర్మించుకోవడంతో సమానం. బాల్యంలో మనసు స్వచ్ఛంగా, మృదువుగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నాటిన భక్తిబీజాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
భగవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు?
Tallapaka Annamacharya Jayanthi భగవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు? ఇది తరతరాల ప్రశ్న.. ప్రతి యుగం లోని సరి అయిన జవాబు దొరికినా మళ్ళీ అదే ప్రశ్న!.. అలవైకుంఠపురంలోని మూల సౌధంబు లోంచి బయలు దేరాడు విష్ణువు శరణు కోరిన కరిరాజుని రక్షించడానికి.. తక్కువ కులస్థుడైనా గుహుడిని అక్కున చేర్చుకున్నాడు, రామచంద్రుడు.. శబరి ఎంగిలి పళ్ళు తిన్నది ఆ రాముడే.. ఉడత చేసిన సహాయానికి ఉడతని స్పృశించినది ఆ ఉత్తమోత్తముడే.. భారతంలో విదురుణ్ణి విజ్ఞానిగా పరిగణించారు, కులంతో నిమిత్తం లేకుండా. కర్ణుడి వ్యధ ఏకలవ్యుడి కధా కులరహిత సమాజం కోసమే. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు నేను నాల్గు వర్ణాలనే సృష్టించాను అని స్పష్టంగా చె΄్పాడు. వేద వేదాంగాలు, ఉపనిషత్తులు ముక్తకంఠం తో ఘోషించాయి కులం లేదని.. ‘ఇదంతా బ్రహ్మమే’ అని...పురాణాల్లో ఉదాహరణలు తీసుకోలేదు కానీ వాటి సారాన్ని తన ‘తత్వ బోధన’ మధురంగా, మనోరంజకంగా మనకు సులువైన తెలుగు భాష లో అందించాడు అన్నమయ్య.... 600 సంవత్సరాల క్రితమే ఇప్పటి మన రాజ్యాంగంలో కుల మత ప్రసక్తి ఉండ కూడదన్న విషయానికి ఊపిరి ΄ోశాడేమో అన్నమయ్య...అన్నమయ్య కోశం నుండి జాలు వారిన ఆధ్యాత్మిక ఆణిముత్యాల సారం కులం కన్నా భక్తి మిన్న అని... సమదృష్టి సక్రమ మార్గం అని. సకల శాస్త్రాల సారాన్ని అందమైన భాషలో అనంతమైన భావాన్ని రాగవంతంగా మేళవించి వేదాంత ధోరణిలో సంఘానికి ‘సమ దృష్టి’ తో ఉండాలని సలహా ఇచ్చాడు.... ‘బ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే’ అని ఎలుగెత్తి చాటుతూ, హీనం, అధికం లేవని, ఎక్కువ తక్కువలు లేనే లేవని, జంతువులు, మనుషులు అనే భేదం లేకుండా, కుల మత భేదం లేకుండా ఉండాలని, అందరిలో ని శ్రీహరి ఉన్నాడని, శ్రీ హరే పరబ్రహ్మస్వరూపం అని చెప్పాడు.‘తందనాన ఆహి తందనాని పురె’ లో కూడా అదే భావాన్ని జోప్పించాడు.. అందరికి శ్రీ హరే అంతరాత్మ అని అంటాడు.. రాజు గారి నిద్రకి బంటు నిద్రకి తేడా లేదంటాడు.. భౌతికంగా చూడొద్దు, భేదభావాలు వద్దని చె΄్తాడు. చని΄ోయాక బ్రాహ్మణుడైన, చండాలుడైన చేరవలసింది ఒకచోటుకే అని చె΄్తాడు.. ప్రకృతికి తారతమ్యాలు లేవంటూ ఎండకు ఏనుగైనా, శునకమైనా సమానమే అని సెలవి స్తాడు..‘చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు’ అని ప్రశ్నిస్తూ సమ బుద్ధితో సంకీర్తనం చెయ్యండి. వేషభాషలతో విష్ణువుకు దగ్గర కాలేరని చెబుతాడు.వేదవట్టి యికనేమి వేదకేరు చదివేరు’ అని వెటకారం చేస్తూ వేదాలు చదివినా భగవంతుని తెలుసుకోజాలరని, భక్తి ముఖ్యమని, చదువు, కులం జ్ఞానం కన్నా భక్తి ముఖ్యమని ముక్తాయింపు చేస్తాడు.‘ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడ’ని నిజమైన భక్తి, నిక్క మైన జ్ఞానం ఉన్నవాడే గొప్పవాడని ఘోషిస్తాడు.‘వేదాలు వచ్చినా హరిభక్తి లేని సోమయాజి కన్నా విష్ణుపాదాలని వదలని కుల హీనుడే ఘనుడు’ అని ఘంటాపదంగా నొక్కి వక్కాణించాడు.‘ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు’ అంటూ తుది ఘడియల్లో హరినే స్మరిస్తే హరిని చేరుకుంటారని భక్తిమార్గం చూపిస్తున్నాడు.ఇలా ఎన్నో కీర్తనల్లో జీవరాశుల పట్ల సమదృష్టి ఉండాలని బోధించాడు... కొంగు బంగారమైన స్వామిని కొలవమన్నాడు.. అదివో అల్లదిగో, కొలువై ఉన్నాడు గోవిందరాజు, వేడుకుందామా అని శరణు వేడుకుంటున్నాడు, ఎందుకంటే ఇందరికి అభయమిచ్చు చేయి కాబట్టి...చివరగా... గాలికి కులమేది, నేలకి కులమేదని డా. సి నారాయణ రెడ్డి ప్రశ్నిస్తే, ఏ కులము నీదంటే, గోకులం నవ్విందని వాపోయారు వేటూరి సుందర రామ మూర్తి గారు. కులమతాలు వద్దంటూ వెంకటేశ్వరునిలో ఐక్యమైన అన్నమయ్య కుల మతాలతో చిచ్చువద్దని, అవి జాతి ఐక్యతని దెబ్బ తీస్తాయనీ పరోక్షంగా పలికాడు.. ఈ కీర్తనలను స్ఫూర్తిగా తీసుకుని కుల మత చిచ్చులో పడకుండా మన జాతిని మనం రక్షించు కుందాం..– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..
తిరుపతి సమీపంలోని రాయలచెరువులో ఉన్న శ్రీ శక్తి పీఠం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని ఈ శ్రీ శక్తి పీఠాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పీఠం భారతీయ సనాతన సంస్కృతి, యోగ విద్యలకు నిలయంగా అలరారుతోంది. ఈ పీఠాన్ని మాతాజీ రమ్యానందభారతీ స్వామిని (సిద్ధాశ్రమ యోగి) నిర్వాహిస్తున్నారు. ఆమె ధర్మాచరణ ప్రచారంలో భాగంగా మన భాగ్య నగరానికి విచ్చేసిన నేపథ్యంలో మన సాక్షి ఆ అమ్మతో సంభాషించి..మన పాఠకులుకు కలిగే ఎన్నో దర్మసందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. మరి అవేంటో సవివరంగా చూద్దామా.."శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అన్న రీతిలో సామాన్యులు సైతం సులభంగా ఆ భగవంతుని కృపకు ఎలా పాత్రులు కాగలరు, అలాగే శ్రీ విద్యా ఉపాసన, సులభంగా ఇంట్లోనే చేయడం, యజ్ఞ యాగ క్రతువులు ఏవిధంగా చేయొచ్చు, ఇంకా..మరకతవర్ణ కాళిదేవి విశిష్టత, క్షుద్ర పూజలు ఉన్నాయా..? తదితర ధర్మ సందేహాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!తిరుపతి శ్రీశక్తి పీఠాధిపతి మాతాజీ రమ్యానందభారతీ స్వామిని జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామివారి ప్రధాన శిష్యులలో ఒకరు. ఆమెను స్వయంగా సిద్ధేశ్వరానందభారతీ స్వామివారే "సిద్ధాశ్రమ యోగి"గా అభివర్ణించారు. మాత రమ్యానంద భారతీ స్వామి ప్రస్థానం డాక్టర్గా మొదలైన ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసిన గొప్పయోగి ఆమె. సామాన్య భక్త జనం మదిలో మెదిలో ఎన్నో సందేహాలను చిరుదరహాసంతో నివృత్తి చేసేలా అద్భుతమైన పరిష్కార మార్గాలను అందించారు. అవేంటంటే.సువాసిని పూజ ప్రధానోద్దేశ్యం? ఎందుకోసం?లలితాదేవిని "సువాసినర్చన ప్రీత" అని లలితా త్రిశతి మంత్రల్లో ఉంటుంది. అంటే దీని అర్థం సువాసినులను (భర్తతో కూడిన స్త్రీలను) పూజించడం (అర్చించడం) వల్ల సంతోషించే దేవత అని. ఇక్కడ సువాసినీ: అంటే సౌభాగ్యవతి, పసుపు కుంకుమలతో ఉన్న స్త్రీ. లలితా దేవిని సువాసినీ పూజ ద్వారా ఆరాధిస్తే, ఆమె అత్యంత ప్రసన్నురాలై భక్తుల కోరికలను నెరవేరుస్తుందని లలితా త్రిశతి తెలియజేస్తుంది. అలాగే ఎక్కడ యత్ర నార్యంతు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! అన్న ఆర్యోక్తిని చాటి చెప్పేలా ఈ పూజలను నిర్వహిస్తున్నామని చెప్పారు అమ్మ రమ్యానంద భారతీ. అదీగాక జనవరిలో తిరుపతి క్షేత్రంలో కలియుగ వేంకటేశ్వరుడు, పద్మావతి దేవి వకుళమాత ఉన్న ఆ పుణ్యక్షేత్రంలో దశసహస్ర సువాసినీ పూజ జగడమే గాక గిన్నిస్ రికార్డులకెక్కిన సంగతి కూడా తెలిసిందే. స్తీల గొప్పతనం, వారిని గౌరవించటం గురించి సమాజానికి తెలియజేయడమే ఈ పూజ ప్రదానోద్దేశ్యమని అన్నారామె.పంచాయతన పూజ..పంచాయతన సమేత/పూజ అంటే..?హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా స్మార్త సంప్రదాయంలో పంచాయతన పూజ (ఐదుగురు ప్రధాన దేవతల ఆరాధన) చాలా ముఖ్యమైనది.పంచాయతన 'పంచ' (ఐదు) + 'ఆయతన' (స్థానం/నివాసం). ఐదుగురు ప్రధాన దేవతల సమూహం.దేవతలు: శివుడు, విష్ణువు, శక్తి (దేవి), గణపతి, మరియు సూర్యుడు.ఉద్దేశ్యం: ఆది శంకరాచార్యులచే ప్రచారం చేయబడిన విధానం ఇది. వివిధ ఆరాధనా మార్గాల (శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలైనవి) మధ్య ఐక్యతను తెస్తుంది.పంచాయతన సమేతపైన పేర్కొన్న ఐదుగురు దేవతలను ఒకే సమయంలో, నిర్దిష్టమైన స్థానాల్లో ఉంచి పూజించటం. క్తుడు తన ఇష్ట దైవాన్ని (శివుడు, విష్ణువు మొదలైనవారు) మధ్యలో ఉంచి, మిగిలిన నలుగురిని నాలుగు దిక్కులలో ఉంచి పూజిస్తారు. ఉదాహరణకు, శివుడు ప్రధానమైతే, అది "శివ పంచాయతనం" అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇష్టం దైవం మధ్యలో ఉంచి మిగిలిన వారిని పరివార దేవతలుగా పూజించటం. తంత్రం అంటే..తంత్రం అంటే.. మనల్ని రక్షించేదాన్ని తంత్రం అంటారు. అవి చాలా రకాలు ఉదాహరణకు శ్రీ విద్యా తంత్రం మేరుశాస్త్ర తంత్రం అని పలు రకాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో. అదీగాక సమస్త శాస్త్రంలో తంత్ర శాస్తం ఉత్తమం అని, వేద సమ్మతమైనదని మన పురాణాలే నొక్కి చెబుతున్నాయి. దేవతకు ఎటువంటి పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, ఏవిధంగా ఆరాధించాలి వంటివే ఈ తంత్రాలు. ఏ సమయంలో పూజ చేయాలి, ఎలాంటి హోమాలు చేయాలి. వీటి గురించి వివరించేది తంత్ర శాస్త్రం.కాళి అంటే అరుణ వర్ణం, శ్యామ వర్ణం మరకతవర్ణ కాళి అంటే..?కాలంతో ప్రకాశించే దేవి కాబట్టి నలుపు అని అంతా భావించి అందరూ ఆ మాతను నల్లనిదిగా చెప్పారు. కానీ ప్రతీదేవతకు సత్వ, తామస, రాజస లక్షణాలు ఉంటాయి. తామస లక్షణం కలిగింది నల్లటి కాళి, శ్యామా కాళీ. ఇక శ్రీశక్తిపీఠంలో కొలువుదీరిన మరకతవర్ణం కాళి అంటే..అక్కడ అమ్మ మరకతవర్ణంతో ప్రకాశించాలని ఆదేశింంచిదని, అందువల్ల ఈ ఏర్పాటు చేశామని మాత రమ్యానంద భారతీ చెప్పారు. అదీగాక ప్రకృతి రూపమే మరకతవర్ణం. ఇక్కడ మరకతవర్ణం అంటే చిరునవ్వుతో ప్రేమ స్వరూపిణీగా కనిపించే కాళిమాత. త్వరగా భక్తులను గ్రహిస్తుంది. మరకతవర్ణశిలపై చెక్కిన దేవత. ఇక్కడ కొలువుదీరిన సిద్ధేశ్వరుడు సైతం మరకతవర్ణమే. అంతేగాదు ఈ మరకతవర్ణం ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని అందిస్తుంది. కోరుకున్న సంకల్పం నెరవేరడానికి మరకతవర్ణంలోని దేవతలను పూజించే ఆచారం మన పురాణాల్లో కూడా ఉంది.శ్వేత పాతాళ వారాహి అంటే..?హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోయాడు. ఆయన బ్రహ్మదేవుడి గురించి తప్పస్సు చేసినట్లు పురాణాల్లో విన్నాం, చదివాం. కానీ ఆయన వారాహి దేవి కోసం తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే. మరణం లేని వరం కావాలని కోరాడు. అందుకు అమ్మ సమ్మతించకపోవడంతో హిరణ్యాక్షుడు తెలివిగా నువ్వే సంహరించాలి..అలాగని ఆమెనే స్వయంగా సంహరించకుండా ఉండేలా వరం కోరతాడు. అమ్మ ప్రసన్న వదనంతో తథాస్తు అంటుంది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భూమిని పాతాళలోకంలో దాచే ప్రయత్నం చేస్తాడో అప్పుడు మానవులకు దేవతాలకు భూ కష్టాలను నివారించేందుకు విష్ణువు సమాయక్తమవుతాడు. అప్పుడు వారాహి దేవిలోని శ్వేత వరాహం విష్ణువులో ప్రవేశింపచేస్తుంది. దాంతో విష్ణువు వరాహరూపం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. అలా వచ్చిందే శ్వేత వరాహం. ఆమె వ్యవసాయ దేవత కూడా. అందువల్ల భూ సంబంధమైన కష్టాలు, ఆస్తి తగదాలతో సతమతమయ్యే వాళ్లు ఈ అమ్మ పూజించి ఆ సమస్యలను పోగొట్టుకుంటారని చెప్పారు. ఇంట్లోనే హోమాలు, యాగాలు చేయొచ్చా?అయితే ఇలాంటి క్రతువులు ఇంట్లోనే చేయడం అనేది సులభం కాదని అన్నారు. అలాగే మన పురాణాల్లో చూసినా కూడా ఎక్కడా కూడా.. పలాన పర్వతం, దేవాలయం, అడవుల్లో చేసినట్లే ఉంటాయి. పైగా ఓ క్షేత్రం, పీఠం అని కూడా ఉంటుంది. అంటే అక్కడ ప్రాణ ప్రతిష్ట చేసి ఎంతో నిష్టతో పూజలు కైంకర్యలు నిర్వహిస్తారు. పైగా అక్కడ అత్యంత శక్తిమంతంగా ఉంటుంది. అందుల్లో అలాంటి పీఠాలలో లేదా దేవాలయాలు, ప్రుమఖ పుణ్యక్షేత్రాల్లోనే హోమాలు, యాగాలు చేయడం శ్రేష్టమని అన్నారామె. అలాగే అంత ఖర్చు పెట్టలేని వారు, తమ శ్రీశక్తిపీఠంలో చేయించుకోవచ్చని, ఇక్కడ ఉచితంగానే నిర్వహిస్తామని, అన్ని తామే ఇస్తామని చెప్పారామె.శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా?ఎలా పూజించాలి?యంత్రంలలోకెల్లా గొప్పది శ్రీయంత్రం..విగ్రహాన్ని గానీ, యంత్రాన్ని గానీ తెచ్చి ప్రాణప్రతిష్ట చేస్తే నిత్య పూజలు, నైవేద్యం పెట్టాలి. ప్రాణ ప్రతిష్టలేకుండా విగ్రహం, యంత్రం పూజించినా ఎలాంటి దోషం లేదు. ఎప్పుడైతే ప్రాణప్రతిష్టం చేస్తామో అక్కడ అమ్మవారి వచ్చి కూర్చోంటుంది కాబట్టి అనునిత్యం పూజ చేయాలి. అయితే గృహస్థులకు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆటంకాలు వస్తాయి. అలాంటి సందర్భంలో బియ్యం డబ్బాలో ఉంచుకుంటే సరిపోతుంది. కానీ ఇంట్లో మాత్రం ప్రాణప్రతిష్ట చేయకుండా పెట్టుకుని పూజించొచ్చు. ఎలాంటి సమస్య లేదన్నారామె.క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయా? అది నిజమేనా?ప్రకృతి ఉంటే వికృతి ఉంటుంది. దైవం ఉంటే దెయ్యం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు అంత నిష్టగా క్షద్రప్రయోగాలు చేయడం లేదు గానీ మనుషులంతా కేవలం తమ నెగిటివ్ వైబ్రేషన్స్తో అవతవాళ్లపై ప్రయోగాలు చేస్తున్నారని చమత్కరించారామె. తపస్సుకి, మంత్రానికి అధిదేవతలు దేవుళ్లు. దేవతా సాధన చేసేవాళ్లు, మానసిక పరిస్థితి స్ట్రాంగ్గా ఉన్నవాళ్లపై ఇలాంటి ప్రయోగాలు అంతగా పనిచేయవన్నారు. ఆందోళనలు, బలహీన మనస్సు ఉన్నవారు సులభంగా ఆ ప్రభావానికి గురవ్వుతారని అన్నారు. ఎవ్వరూ ఎలాంటి ప్రయోగాలు చేసినా..మీరు తట్టుకునేలా స్ట్రాంగ్గా మారండి. భగవంతుడి సాధన చేయండని పిలుపునిచ్చారామె. మరి ఎవరైనా ప్రయోగాలు చేస్తే..వాటి లక్షణాలు కనిపిస్తాయా? అంటే ఈజీగా తెలుసుకోవచ్చన్నారు. కొన్నింటికి పరిష్కారమార్గం తెలుసుకునే వ్యవధి ఉండదని, కొన్నింటికి మాత్రం సమయం ఉంటుందని అన్నారు కావున సకాలంలో మంచి గురువులని ఆశ్రయించి వాటి నుంచి సులభంగా బయటపడొచ్చని అన్నారు.వామాచారం అంటే..ఏకశ్వేరోపాసనే అసలైన వామాచారం. ఒకే దేవుడిని పూజిస్తా అనేదే వామాచారం. ఇందులో సరైన గురువు దొరికితే ఫలితం రావొచ్చు. మన పురాణాల్లో నరకాసురుడి దీన్ని అనుసరించి శక్తులు ఎన్ని సంపాదించినా కామాఖ్య దేవి వెళ్లిపోయింది అన్న విషయాన్ని గుర్తుచేశారామెడాక్టర్ కమ్ ఆధ్యాత్మిక వేత్తగా మంత్రం అనారోగ్యం నుంచి రక్షించగలదా?ఆధ్యాత్మికతలోనే ఎన్నో వైద్య రహస్యాలు ఉన్నాయి. మణి మంత్ర, ఓషధులతో ఎన్నో రోగాలను నయం చేయొచ్చని అన్నారు. తాను వైద్యాన్ని మంత్ర సారాన్ని అనుసంధానిస్తు..కొన్ని పుస్తకాలను సైతం రాశానని చెప్పారు. మరింత పూర్తివివరంగా ధర్మ సందేహాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి. (చదవండి: ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!) -
ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిరోజుల ముందు తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం(ఏప్రిల్ 28, 2026) తెల్లవారుజామునే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్న ఆయన, అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు పంచె, పట్టు చొక్కా ధరించిన విజయ్, స్వామివారి ‘విశ్వరూప దర్శనం’లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి ప్రసాదంతో పాటు వెండి ‘వేల్’ను బహుకరించారు. ఇది మత విశ్వాసాలకి సంబంధించినది మాత్రమే కాదు..సర్వమత సామరస్యానికి అతీతంగా చేసిన ఒక సంజ్ఞ కూడా. ఈ నేపథ్యంలో ఆ ఆలయం ప్రత్యేకత, ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ తిరుచెదూర్ ఆలయం సముద్రపు ఒడ్డున ఉంది. సుబ్రమణ్యస్వామి పిలవబడే మురుగన్ దేవునికి చెందినదే ఈ తిరుచెందూర్ ఆలయం. మరుగన్ ఆరు నివాసాలో ఒకటిగా పేరొందిన మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఈ గుడి తమిళ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మికత వంటి అపార ప్రాముఖ్యత కలిగిన ఆలయం. చరిత్ర..ఈ ఆలయం చరిత్ర ప్రాచీన కాలం నాటిది. దీని ప్రస్తావన తమిళ సంగం సాహిత్యం కనిపిస్తుంది ఇక్కడ మురుగన్ దేవుడు రాక్షసుడైన సూరపద్మన్తో పోరాడి ఓడించాడని నమ్ముతారు. ఈ పౌరాణిక ఘట్టాన్ని సూరసంహారంగా జరుపుకుంటారు. శతాబ్దాలుగా, పాండ్య, చేర, చోళ, విజయనగర పాలకులతో సహా వివిధ తమిళ రాజవంశాలు దీని అభివృద్ధికి దోహదపడ్డారు. అలాగే, 17వ శతాబ్దంలో డచ్ వారి దండయాత్ర సమయంలో, కొన్ని విగ్రహాలను తీసుకువెళ్లారు, కానీ తరువాత వాటిని భక్తులు తిరిగి కనుగొనడం విశేషం.ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పానికి నిలయం. ఇందులో విస్తృతమైన శిల్పాలు, స్తంభాల మండపాలు, ఎత్తైన గోపురాలు ఉంటాయి. ఇక్కడ సుమారు 137 అడుగుల ఎత్తులో ఉన్న 9-అంచెల రాజగోపురం నుంచి సముద్రాన్ని వీక్షించడం ప్రధాన ఆకర్షణ. అలాగే ఇక్క ప్రధాన గర్భగుడిలో యోగ భంగిమలో ఉన్న మరుగన్ దేవుడు వల్లి, దేవసేన సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. అంతేగాదు ఇక్కడ మురుగన్ వల్లి వివాహాల గాథలతో ముడిపడి ఉన్న ఒక గుహ కూడా సమీపంలో ఉంది. అలాగే సముద్రానికి సమీపంలో ఉన్న సహజ మంచినీటి ఊట నాజికినారును కూడా భక్తలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వెనక్కి తగ్గిన సునామీ..2004 డిసెంబర్లో వచ్చిన సునామీ తమిళనాడు తీరంపైనా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సునామీ కారణంగా మిగతా ప్రాంతాల్లో సముద్ర జలాలు ముందుకు రాగా.. తిరుచెందూర్లో మాత్రం సముద్రుడు వెనక్కి తగ్గాడు. దీంతో సముద్ర తీరానికి ఆనుకొని ఉండే ఈ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. నీటి వల్ల ఈ ఆలయానికి ఎలాంటి హాని జరగదనే వరం ఉందని చెబుతారు.ఆలయ ఆచారాలు..ఆలయం సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.సాంప్రదాయబద్ధంగా రోజుకు ఆరుసార్లు మురుగన్ పూజ నిర్వహిస్తారు.దేవుడికి పాలు, చందనం, పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు.ఆలయంలో భక్తులు భక్తికి చిహ్నంగా వేల్స్ సమర్పించి, తలనీలాలు సమర్పించుకుంటారు.ఎలా చేరుకోవాలంటే..సమీప విమానాశ్రయం - తూత్తుకుడి విమానాశ్రయం (సుమారు 40 కి.మీ.), మదురై విమానాశ్రయం (సుమారు 190 కి.మీ.) ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.తిరుచెందూర్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన పట్టణాలతో అనుసంధానించబడి ఉంది.మదురై, తిరునెల్వేలి, తూత్తుకుడి నుంచి ఈ పట్టణానికి బస్సుల ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది.(చదవండి: సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..) -
విశిష్ట ఫలదాయకం... వైశాఖ పూర్ణిమ
వైశాఖ శుద్ధ పూర్ణిమ (వైశాఖ పౌర్ణమి) హిందూ, బౌద్ధ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజు. దీనిని ‘బుద్ధ పూర్ణిమ’ అని, ‘మహా వైశాఖి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును కూర్మావతారంలో పూజించడం, నదీస్నానం చేయడం, అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును ఆరాధించడం వల్ల అక్షయ పుణ్యఫలం లభిస్తుందని, చేతనైనంత దానధర్మాలు చేయడం వల్ల నరఘోష తొలగిపోతుందని శాస్త్రోక్తి.విశిష్టతలు: బుద్ధ పూర్ణిమ/జయంతి: సిద్ధార్థుడు జన్మించడం, జ్ఞానోదయం పొందడం, మహా పరినిర్వాణం చెందడం అనే మూడు ముఖ్యమైన ఘట్టాలు ఇదేరోజు జరగడంతో దీనిని ‘త్రివిధ పుణ్యదినం’గా బౌద్ధులు జరుపుకుంటారు.శ్రీ కూర్మ జయంతి: శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించిన రోజుగా కూర్మ పురాణం చెబుతోంది.ఈ రోజు కూర్మనారాయణుని ఆరాధించడం సత్ఫలితాలనిస్తుంది.సముద్ర/నదీ స్నానం: ఈ రోజున సముద్రంలో లేదా గంగానదిలో స్నానం చేయడం అత్యంత పవిత్రం. కరక్కాయను సముద్రంలో వేసి స్నానం చేస్తే నరదిష్టి, నరఘోష తొలుగుతాయని నమ్మకం.చదవండి: మంచుకొండల్లో ఓంకార నాదంరావి చెట్టు పూజ: వైశాఖ మాసంలో రావిచెట్టుపై విష్ణుమూర్తి కొలువై ఉంటాడని, ఈ పూర్ణిమ రోజు రావి చెట్టును పూజిస్తే శని, బృహస్పతుల అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు లభిస్తాయని పెద్దల మాట.అన్నమాచార్య జయంతి: సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుల వారు జన్మించిన రోజు కావడంతో దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. దానధర్మాలు: ఈ రోజున చేసే జలదానం, వస్త్రదానం, ఆహార దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని పురాణోక్తి.– డి.వి.ఆర్. -
నా దేహాన్ని మీకు భిక్షగా ఇస్తాను.. స్వీకరిస్తారా?
ఆమ్రపాలి క్రీ.పూ. 500 సంవత్సర ప్రాంతానికి చెందినది. గౌతమ బుద్ధుని సమకాలికురాలు. ఆమ్రపాలి అంటే ‘మామిడి చిగురు’ అని అర్థం. ఆమ్రపాలికి అంబపాలిక, అంబపాలి, ఆమ్ర అనే నామాంతరాలూ ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులెవరో తెలియదు. వైశాలి నగరంలో మామిడి తోటలో ఒక చెట్టు కింద పసిపిల్లగా ఏడుస్తూ పడి ఉంటే సోమదత్తుడు అనే ఆయన ఇంటికి తెచ్చుకొని ఆ పాపను పెంచి పెద్ద చేశాడు. కౌమార దశలోనే ఆమ్రపాలి అపురూప సౌందర్యవతిగా, అద్భుత నాట్య కళాకారిణిగా ఖ్యాతి గడించింది.లిచ్ఛవి జాతికి చెందిన రాజులకు వైశాలి నగరం రాజధానిగా ఉండేది. ఆ కాలంలో అందమైన స్త్రీలు పెండ్లిచేసుకొని కేవలం ఒక వ్యక్తితో జీవించడం కాక, తమకు నచ్చిన పురుషునితో రోజుకు ఒకరితో గడిపే ఆచారం వైశాలిలో ఉండేది. ఆమ్రపాలి తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అయిన పుష్ప కుమారుని వివాహం చేసుకోవాలనుకొంది. కానీ వైశాలి రాజు మనుదేవుని కన్ను ఆమ్రపాలిపై పడింది. ఆమె పెండ్లి రోజునే పుష్పకుమారుని హత్యచేసి మనుదేవుడు ఆమ్రపాలిని వైశాలి ‘నగర వధు’ (వేశ్య)గా అధికారికంగా ప్రకటించాడు.ఆమ్రపాలి రాజనర్తకిగా నియమింప బడింది. ఆమె జగన్మోహన సౌందర్యం, అసమాన నాట్య కౌశలం ఎంతోమంది రాజులను, ధనవంతులను ఆకర్షించింది. ఆమె నాట్యం చూడటానికి, ఆమెతో గడపటానికి యాభై ‘కార్షపణములు’ వెలగా నిర్ణయింపబడింది. స్వల్పకాలంలోనే ఆమ్రపాలి సంపద ఏ రాజు కోశాగారంలో లేనంతగా పెరిగి పోయింది. అలా రాజనర్తకి, సౌందర్యరాశి అయిన ఆమ్రపాలి రాజాధిరాజుల, ధనవంతుల ప్రాపకంలో అత్యంత ధనవంతురాలై, సుఖంగా జీవించ సాగింది. గౌతమ బుద్ధుడు వైశాలి నగరానికి వచ్చాడు. ఆయన గొప్పదనం గూర్చి చెలికత్తెల ద్వారా విని, ఆయన తన వద్దకు ఎందుకు రాలేదా అని ఆశ్చర్య పడింది ఆమ్రపాలి.ఒకరోజు బుద్ధుడు వచ్చి, ఆమె భవనం ముందు నిలబడి భిక్ష కోరాడు. సమస్త ఆభరణాలూ ధరించి, ద్విగుణీకృత అలంకారాలతో ఆమ్రపాలి బయటకు వచ్చి, తన సౌందర్యవంతమైన రూపలావణ్యాలను ప్రదర్శిస్తూ బుద్ధుని ముందు నిలబడి, ‘‘నా ఈ దేహాన్ని మీకు భిక్షగా ఇస్తాను. స్వీకరిస్తారా’’ అని వగలొలికిస్తూ అడిగింది. ఆమె మాటలు విని కొంతసేపు కండ్లు మూసుకొని, తర్వాత కండ్లను తెరిచి, బుద్ధుడు ఆమ్రపాలితో ‘అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీ భిక్షను తప్పక స్వీకరిస్తాను. అందాకా సెలవు‘ అని చెప్పి వెళ్ళిపోయాడు.కొంతకాలానికి ఆమ్రపాలి శరీర పటుత్వం తగ్గింది. వేశ్యావృత్తి వలన ఆమె శరీరాన్ని అనేక రోగాలు చుట్టుముట్టాయి. క్రమంగా ఆమె కుష్ఠురోగి అయ్యింది. కురూపి అయ్యింది. విటులతోబాటు దాసదాసీ జనమంతా దూరమయ్యారు. సంపద నశించి పోయింది. ఆమె వికార రూపం అందరితో అసహ్యించుకోబడింది. సమాజంచే బహిష్కరింపబడిన ఆమ్రపాలి ఊరి బయట ఒక చిన్న కుటీరంలో దుఃఖభూయిష్ట జీవితం గడపసాగింది. ఒకరోజు వర్షం పడుతూండగా సాయంత్రంవేళ, చిరుచీకట్లు అలుముకొంటున్న సమయంలో, తన కుటీర ఆవరణలో కూర్చొని ఉన్న ఆమ్రపాలికి ’అమ్మా’ అన్న పిలుపు వినబడింది. ఒక ఆజానుబాహువు తన దగ్గరకు వస్తూండడం చూసి, బుద్ధుడు అని గ్రహించి, ‘అక్కడే ఆగు. సమీపానికి రావద్దు. నేనొక కుష్ఠు రోగిని’ అనింది ఆమ్రపాలి.‘అమ్మా, మరిచావా నన్ను. ఒకరోజు భిక్షకోరి మీ ఇంటికి వస్తే మీ శరీరాన్నే భిక్షగా ఇస్తానన్నారు. అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు తప్పక స్వీకరిస్తానని అన్నాను. ఇప్పుడు ఆ భిక్షను ఇవ్వమ్మా’ అని ఆర్ద్రంగా పలికాడు బుద్ధుడు. ‘ఆ రోజు నేను నీకు ఇస్తానన్నది అందం, ఆరోగ్యం, యవ్వనంతో కూడిన శరీరాన్ని. ఈ రోజు ఆ దేహం వ్యాధిగ్రస్తమయ్యింది’ అంటూ దూరం జరిగింది ఆమ్రపాలి. చదవండి: సంకల్పం ముందు వైకల్యం ఎంత!దయామయుడైన బుద్ధుడు ‘అమ్మా, అందచందాలతో మాకు అవసరంలేదు. భయంకరమైన రోగంతో దేహం శిథిలమైనా పరివర్తన చెందిన మనసు మీది’ అంటూ మరింత దగ్గరగా రాసాగాడు. ఆయన నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళే ప్రయత్నంలో కిందపడిపోయిన ఆమ్రపాలిని తన రెండు చేతులతో ఎత్తుకొని ‘నా కన్నతల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. ఆమెకు సేవ చేసే భాగ్యం నాకు లేక పోయింది. నీలో నా కన్నతల్లిని చూసుకుంటూ సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ’ అంటూ ఆమెను మెల్లగా కుటీరంలోకి చేర్చి, ఆమె తుది శ్వాస విడిచే వరకూ సేవలు చేశాడు కరుణామూర్తి బుద్ధ భగవానుడు.బుద్ధం శరణం గచ్ఛామి– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
మంచుకొండల్లో ఓంకార నాదం
హిమగిరి గుండెల్లో వెలిగిన జ్యోతిర్లింగం విశ్వనాథుడి కైలాస ధామం కేదార్నాథ్ ఈ యాత్ర అంటేనే మదిలోని గుబుళ్లన్నీ వదిలేసి పరమశివుని పాదాల దగ్గర మౌనంగా కూర్చోవడంలాంటిది. గాలిలో వినిపించే ‘ఓం నమఃశివాయ‘ మంత్రం, గంటల నాదం, ఆలయ ప్రాంగణంలో ఉండే అద్మాత్మిక దివ్య శక్తి మనకు తెలియకుండానే మనల్ని ఒక భక్తి లోకానికి తీసుకుని వెళ్తుంది.కేదార్నాథ్ కేవలం ఒక టూరిజం స్పాట్ మాత్రమే కాదు. ఇది ప్రతి భక్తుడి జన్మ ధన్యం అయ్యే ఒక పవిత్ర క్షేత్రం. హిమవంతుడి ఒడిలో, పర్వతాల మధ్య కొలువుతీరిన ఆ మహాదేవుని చూసే ప్రతి కన్ను ధన్యమే అని భక్తుడికి అనిపిస్తుంది. మహాదేవుడి దివ్య సన్నిధిలోకేదార్నాథ్ ఆలయం దగ్గర నిల్చుని ఆకాశంలో చూస్తే ఆ ధవళ వర్ణపు మంచు కొండలు, శివ భగవానుడి జటాజూటంలా కనిపిస్తాయి. ఆయలం లోపల ఉండే స్వయంభూ లింగం ముందు తలవంచితే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఆ చల్లటి గాలిలో కూడా భక్తుల గుండెల్లో ఉన్న భక్తి వేడిని నింపుతుంది.సందర్శనీయ ప్రదేశాలు ఆలయం వెనక ఉన్న భైరవనాథ్ క్షేత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే మొత్తం కేదార్ లోయ మహాదేవుడి పాదాల దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. అది చూస్తేనే భక్తి పరవశం కలుగుతుంది.కొంచెం దూరంలో ఉండే వాసుకి తల్ సరస్సు నిత్య ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుంది. అది చూస్తే ప్రకృతి మొత్తం ఆ శివుడి రూపమే అని అర్థం అవుతుంది.తెలియాల్సినవి..దర్శన సమయం: ఆలయ ద్వారాలు అక్షయ తృతీయ నుంచి కార్తీక పౌర్ణమి వరకు భక్తుల కోసం తెరిచి ఉంటాయి.ప్యాకేజీలు: కేదార్నాథ్ వెళ్లాలనుకునే భక్తుల కోసం 5 రోజుల నుంచి 10 రోజుల వరకు బడ్జెట్ను బట్టి అనేక ప్యాకేజీలు లభిస్తాయి.రిజిస్ట్రేషన్: యాత్రకు వెళ్లే ముందు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ పోర్టల్లో బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. క్యూఆర్ కోడ్ పాస్ జాగ్రత్తగా కాపాడుకోవాలి.ప్రయాణం: ఉత్తరాఖండ్లోని రిషికేష్ నుండి రుద్రప్రయాగ్ మీదుగా గౌరీకుండ్ చేరుకోవాలి. అక్కడి నుండి 16 కి.మీ ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది.వసతి సదుపాయాలు: కేదార్నాథ్ టాప్ దగ్గర కాటేజీలు, రూమ్లు ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మంచిది.ఏం చూడాలి? ఏం తినాలి?కేదార్నాథ్ వెళ్తే సాయంత్రం జరిగే హారతి తప్పక చూడాలి. ఆ హారతి వెలుగులో ఆలయం బంగారు వర్ణంలో మెరిసి΄ోతుంది. కేదార్నాథ్లో భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఖర్చు మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక్కడ లభించే ‘పహాడి మ్యాగీ’ ఒక క్విక్ స్నాక్లా ఎంజాయ్ చేయవచ్చు.ఎలా వెళ్లాలంటే.. హరిద్వార్లో గంగా స్నానం చేసి రిషికేష్ నుంచి కేదార్ యాత్ర మొదలు పెట్టడం ఒక సంప్రదాయం. అక్కడి నుంచి రిషికేష్ సోన్ ప్రయాగ్ మార్గంలో నుండి గౌరీకుండ్ చేరుకోవాలి. అక్కడి నుంచి కాలినడకన యాత్రనున కొనసాగించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ యాత్రను ట్రెక్కింగ్ అని పిలుస్తుంటారు. కానీ మనం మాత్రం దీనిని ఒక తపస్సులా భావించి అంతే పవిత్రంగా అడుగులు ముందుకేయాలి. ప్రతి అడుగులో ‘శంభో శంకర’ అంటూ భక్తులు పైకి వెళ్తుంటే ఆ పర్వతాలే స్పందిస్తున్నట్టుగా అనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?కేదార్నాథ్ లోయలో ఉండటం అంటే మహాదేవుడి ఒడిలో నిద్రించడం లాంటిదే. చిన్న చిన్న కాటేజీల్లో కూర్చుని బయట చూస్తే గుడి దగ్గర వెలిగే దీపాలు ఆకాశంలోని నక్షత్రాల్లా కనిపిస్తాయి. ఏం చేయాలి? ఆలయ ప్రాంగణంలో మౌనంగా కూర్చుని ధ్యానం చేయవచ్చు. ఫోన్లలో ఫొటోలు తీయడానికి బదులు కళ్లతో చూస్తూ మనసులో శివుడిని కొలుస్తూ గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి. వీలు చూసుకొని మందాకిని నది తీరంలో కూర్చొని ఆ ప్రవాహాన్ని ఫీల్ అవ్వాలి. నది ప్రవాహంలో మన మదిలోని ఆలోచనలను కొట్టుకు పోతున్నట్టుగా భావించి, కడిగిన ముత్యంలాంటి మనసుతో ఇంటికి తిరిగి చేరుకోవచ్చు. సూర్యోదయం సమయంలో ఆలయం బంగారు వర్ణంలో మారడం చూడటాన్ని అస్సలు వదులుకోకూడదు.యాత్ర – బడ్జెట్ వివరాలుకేదార్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తున్నప్పుడు ప్యాకేజీ అంటే కేవలం టికెట్ మాత్రమే కాదు. అది మన ప్రయాణం, భోజనం, వుండే చోటు అన్నీ కలిసిన ఒక పూర్తి ప్రణాళిక. ఈ యేడాది కేదార్నాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తెరుచుకున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే మీ యాత్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. పర్యటను ఎలా ఎంచుకుంటున్నారు అనేదానిని బట్టి, మొత్తం ఖర్చు మారుతుంది.బడ్జెట్ అంచనాసాధారణంగా 5 రోజుల నుంచి 10 రోజుల వరకు యాత్రకు అయ్యే ఖర్చు బడ్జెట్లో రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుంది.కాస్త కంఫర్ట్గా వెళ్లాలి అనుకుంటే రూ.45,000 నుంచి రూ.65,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇక లగ్జరీగా, సౌకర్యవంతంగా యాత్ర చేయాలి అనుకుంటే మాత్రం రూ.1.4 లక్ష నుంచి రూ.2.3 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.రవాణా ఖర్చులుట్రావెల్ విషయానికి వస్తే.. రైలులో సుమారు రూ.5,000 వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు అప్ అండ్ డౌన్ రూ.17,000 నుంచి రూ.33,000 వరకు, లేదా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు రూ.13,000 నుంచి రూ.17,000 వరకు ఖర్చు అవుతుంది. చాలా మంది ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి హరిద్వార్ లేదా రిషికేష్కు బస్ లేదా ట్రైన్లో వెళ్లి యాత్రను కొనసాగిస్తారు.వసతి సదుపాయాలుగౌరీకుండ్, సోన్ ప్రయాగ్ ప్రాంతాల్లో బడ్జెట్ గెస్ట్ హౌజ్లు రూ.1,000 లోపు దొరుకుతాయి. స్టాండర్డ్ హోటల్స్ సుమారు రూ.3,000 వరకు ఉంటాయి. కేదార్నాథ్ టాప్ దగ్గర పీక్ సీజన్లో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. జీఎంవీఎన్ టెంట్స్ లేదా రూమ్స్ రూ.1,000 నుంచి ప్రారంభమవుతాయి కానీ ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి.ఫుడ్ ఖర్చుఫుడ్ విషయానికి వస్తే సింపుల్ థాలీ లేదా స్నాక్స్ కోసం రోజుకు ఒక వ్యక్తికి సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అవుతుంది. మొత్తంగా ఫుడ్, స్టే కలిపి రోజుకు రూ.1,200 నుంచి రూ.4,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.ప్యాకేజీలు, హెలికాప్టర్ఐఆర్సీటీసీ ఫ్లైట్ ప్యాకేజీలు ఎంచుకుంటే హైదరాబాద్ నుంచి సుమారు రూ.74,000లో సకల సౌకర్యాలతో ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు. అదే కొన్ని బడ్జెట్ ప్యాకేజీలు రూ.27,000 నుంచే లభిస్తాయి. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కు హెలికాప్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి రూ.7,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ సర్వీస్ను ఐఆర్సీటీసీ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.లోకల్ ట్రాన్స్పోర్ట్లోకల్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కు గవర్నమెంట్ షటిల్ ట్యాక్సీ ఫేర్ కేవలం రూ.50 మాత్రమే ఉంటుంది, అయితే ప్రైవేట్ ట్యాక్సీలు ఎక్కువగా చార్జ్ చేసే అవకాశం ఉంది.ముఖ్య సూచనలుమే, జూన్ నెలల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాస్త ప్రశాంతంగా యాత్ర చేయాలనుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలోనూ న్ చేసుకోవచ్చు. వెళ్లే ముందు వాతావరణ అప్డేట్స్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. స్థానిక అధికారుల సూచనలు టించడం చాలా ముఖ్యం. ఈ బడ్జెట్ వివరాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే, ప్లాన్, సీజన్ ఆధారంగా ఖర్చులు మారవచ్చు. – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు -
దౌర్జన్యానికి దైవశిక్ష తప్పదు!
మానవ సంబంధాలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది ’సహోదరత్వం’. అయితే నేటి సమాజంలో స్వార్థం, అహంకారం పెరిగిపోయి ఇతరుల హక్కులను కాలరాయడం, బలహీనులపై దౌర్జన్యం చేయడం సర్వసాధారణమైపోయింది. కానీ, ఇస్లామీయ బోధనల ప్రకారం దౌర్జన్యం (జులుమ్) అనేది అల్లాహ్ దృష్టిలో క్షమించరాని మహాపరాధం.దౌర్జన్యం అంటే ఏమిటి?అరబీలో ’మజాలిమ్’ అంటే అకారణంగా ప్రజలను వేధించడం, ఒకరి ఆస్తిని అక్రమంగా కబళించడం మరియు ఒకరి హక్కులను బలవంతంగా లాక్కోవడం. వివేకవంతులైన విశ్వాసులు అల్లాహ్ హెచ్చరికను గుర్తుంచుకోవాలి: ‘దుర్మార్గులు చేస్తున్న దానిని అల్లాహ్ పట్టించుకోవడం లేదని భావించకండి. ఆయన వారిని శిక్షించే రోజును వాయిదా వేస్తున్నాడు మాత్రమే.‘ ఆనాడు ఏ అధికార బలగం, ఏ సంఖ్యా బలం వారిని రక్షించలేదు.పరలోకంలో శిక్షా రూపంప్రవక్త ముహమ్మద్ (సఅసం) హెచ్చరించినట్లుగా, ఈ లోకంలో ఇతరులపై చేసే దౌర్జన్యం ప్రళయదినాన దట్టమైన చీకటిగా మారుతుంది. పీడితుని ఆక్రందనకూ, అల్లాహ్ కీ మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. ఒక వ్యక్తి వేరొకరి జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమిస్తే, ప్రళయదినాన ఏడు భూభాగాల గుదిబండను అతని మెడలో వేయడం జరుగుతుంది. ఇది కేవలం భూమికే కాదు, ఇతరుల మాన మర్యాదలను మంటగలిపేవారికి కూడా వర్తిస్తుంది.అసలైన సహాయం: బాధితునికీ, దౌర్జన్యపరునికీ!మత సామరస్యం, సామాజిక న్యాయం వెల్లివిరియాలంటే ముస్లింలు తమ తోటి సోదరులకు అండగా ఉండాలి. ప్రవక్త (సఅసం) ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు: ‘మీ సోదరునికి అతను దౌర్జన్యపరుడైనా, బాధితుడైనా తోడ్పడండి. బాధితునికి సహాయం చేయడం అంటే అతనికి న్యాయం జరిగేలా చూడటం. మరి దౌర్జన్యపరునికి సహాయం చేయడం అంటే ఏమిటి? అతను అన్యాయం చేయకుండా అతని చేతిని పట్టుకోవడం, అతన్ని తప్పు నుండి మళ్ళించడం.క్షమ – ప్రాయశ్చిత్తంఒక వ్యక్తి చేసిన పాపాలను అల్లాహ్ క్షమిస్తాడేమో కానీ, తోటి మనిషికి చేసిన అన్యాయాన్ని ఆ బాధితుడు క్షమించే వరకు అల్లాహ్ కూడా క్షమించడు. అందుకే పారలౌకిక విచారణ రాకముందే, ఈ లోకంలోనే బాధితుని వద్ద క్షమాపణ పొంది, వారి హక్కులను తిరిగి చెల్లించాలి. లేదంటే, పుణ్యాలన్నీ బాధితుని ఖాతాలోకి వెళ్లిపోయి పాపాలే మిగిలే ప్రమాదం ఉంది.ఆక్రందనలు అరణ్య రోదనలు కావులోకంలో పీడితుల ఆక్రందనలు అరణ్య రోదనలు కావు. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తప్పక జరుగుతుంది. ఒక విశ్వాసి మరో విశ్వాసికి భవనంలోని ఇటుకల వలె ఒకరికొకరు బలం చేకూర్చుకోవాలి. అప్పుడే సమాజంలో శాంతి, అల్లాహ్ కారుణ్యం లభిస్తాయి. క్షమించడం, సర్దుకుపోవడం అనేది కేవలం బలహీనత కాదు, అది ఒక గొప్ప సాహసం, దృఢ సంకల్పం.– ముహమ్మద్ ముజాహిద్ -
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు : ముస్తాబైన మఠం
భారతదేశం ఎందరో గురుదేవుళ్ల పుణ్యధామం. వారు సమాజంలో జ్ఞాన దీప్తులు వెలిగించారు. అలాంటి వారిలో సుప్రసిద్ధులు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బ్రహ్మంగారి మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో స్వామి చరిత్ర, ఉత్సవ విశేషాలపై ప్రత్యేక కథనం. శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి గొప్ప కాలజ్ఞానిగా భూ మండలంపై కీర్తి గడించారు. అంతేకాక ఆయన రాజయోగి, హేతువాది, తత్త్వవేత్తగా ప్రసిద్ధి చెందారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. రాబోయే కాలంలో జరిగే విపత్తులపై కాలజ్ఞానం ద్వారా వివరించి.. మానవాళికి ఎన్నో సూచనలు, హెచ్చరికలు చేశారు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి. కావున మిగతావి కూడా జరుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే.. సన్మార్గంలో నడవాలని బోధించారు. ఎన్నో మహిమలు చూపి మహిమాన్వితుడిగా విరాజిల్లారు. కులమతాలను రూపుమాపేందుకు కృషి చేసి సంఘ సంస్కర్తగా పేరు పొందారు. కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసి జగద్గురువుగా ప్రఖ్యాతి గాంచారు. చివరికి దైవ స్వరూపులుగా వినుతి కెక్కారు. సజీవసమాధి నిష్ట పొంది భక్తులను అనుగ్రహిస్తు న్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో నేటి నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.సన్మార్గంలో నడిపించడం కోసం...మానవులకు జ్ఞాన బోధ చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. తెలుగు నేల నలుచెరగులా సంచరించి బోధనలు చేసి 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. (ఆ ్ర΄ాంతంలోనే ప్రస్తుతం శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి క్షేత్రం ఉంది.) నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది.ఏటా వేడుకలుస్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సాతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలిరానున్నారు. స్వామి మాల ధరించిన భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. వారితో కందిమల్లాయపల్లె కళకళలాడుతోంది. ఆరాధనోత్సవానికి ఇంకా పెద్ద ఎత్తున రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు.. మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు.ఉత్సవాలు ఇలా..శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్యబృందం, భక్తులు.. ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఉత్సవాలు 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిషేకం, సహస్ర నామార్చన కార్య్రçకమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 23న శేషవాహనోత్సవం, 24న గజవాహనోత్సవం, 25న నరనంది ఉత్సవం, 26న నంది ఉత్సవం, 27న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 26న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామి వారు దీక్షాబంధన అలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 28న మహాప్రసాదం నివేదనతో ఉత్సవాలు ముగుస్తాయి.– వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, వైఎస్ఆర్ కడప జిల్లాఘనంగా ఏర్పాట్లుశ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల ఆరాధనోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. వసతి, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను.– శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వాముల వారు, మఠాధిపతులు, బ్రహ్మంగారిమఠం -
51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ముస్తాబు
కేదార్నాథ్: మంచు కొండల నడుమ నెలకొన్న మహా శివుని క్షేత్రం కేదార్నాథ్ అపూర్వ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శీతాకాలపు సుదీర్ఘ నిశ్శబ్దాన్ని వీడి, భక్తులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా అత్యంత ఘనంగా జరిగే చార్ధామ్ యాత్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు (ఏప్రిల్ 22న) కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో ఆ పుణ్యక్షేత్రమంతా శివనామస్మరణతో, భక్తి పారవశ్యంతో మారుమోగుతోంది.పూల వనంలా పరమశివుని సన్నిధిదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 51 క్వింటాళ్ల తాజా పూలతో కేదార్నాథ్ ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ పూల అలంకరణతో రాతి కట్టడమైన ఆ పవిత్ర మందిరం భక్తిభావానికి సజీవ సాక్ష్యంగా, కన్నుల పండువగా మారింది. అధికారులతో పాటు స్థానికులు సైతం అహర్నిశలు శ్రమిస్తూ, అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా చేరుకున్న భక్తులు కూడా అధికారులకు సహకరిస్తూ వివిధ పనుల్లో స్వచ్ఛందంగా సేవలు అందిస్తుండటం విశేషం.భద్రత కట్టుదిట్టంభారీ సంఖ్యలో రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. మంచుతో కప్పుకుపోయిన నడక మార్గాలను పూర్తిగా క్లియర్ చేశారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, క్రౌడ్ మేనేజ్మెంట్ పద్ధతులను అమల్లోకి తెచ్చారు. యాత్రికుల భద్రత కోసం ప్రత్యేక బృందాలు అనునిత్యం పర్యవేక్షిస్తున్నాయి.ఉత్సాహంగా చార్ధామ్ యాత్రఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాల ప్రారంభంతో ఉత్తరాఖండ్ పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది భక్తులు హిమాలయాలకు చేరుకున్నారు. రేపు (ఏప్రిల్ 22న) కేదార్నాథ్ ఆలయం తెరుచుకోనుండగా, ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలను సైతం భక్తుల దర్శనార్థం తెరవనున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’ -
సనాతన సారథి ఆదిశంకరులు
‘దేవుడనే వాడున్నాడా ‘అని వితండవాద నాస్తికవాదులకు ఎదురుగా అగుపడే వ్యక్తి దేవుడే అయితే అంత కన్నా సరి అయిన ఋజువు, సమర్థన మరేం కావాలి? కథల్లో, పురాణాల్లో భగవంతుడు వచ్చాడని, రక్షించాడని విన్నాం, నమ్మాం.. నిజంగా నిలబడి నడిచొస్తూ నాస్తికత్వాన్ని ఖండించి అద్వైత తత్త్వాన్ని సుస్థిరం చేసి అద్వైత వాదిగా అరుదెంచి హిందూమతాన్ని రక్షించి జాతిని నడిపించే దేవుడే శంకర భగవత్పాదులు.. పరమాచార్య శంకరాచార్యులు...శివుడే శంకరులుగా...హిందూమతం క్షీణదశలో ఉన్నప్పుడు ఆ మత పరిరక్షణకై పుణ్యదంపతులు శివగురు, ఆర్యాంబలు చేసిన తపః ఫలంగా కాలాడి అగ్రహారంలో సాక్షాత్తు ఈశ్వరుడే శంకరులుగా జన్మించాడు.. ఆవేళ ప్రకృతి పరవశించింది. ప్రపంచంలో పరమశాంతి పరిమళించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ బాలుడిలో చంద్రవంక, మూడవ నేత్రం, శూలం ఉన్నాయి. తెల్లని కాంతి.. లక్షణాల్లో సూర్యుడు.. మేరు పర్వతం.. సరస్వతీదేవి పోలిక.. ఈశ్వర వర ప్రసాదుడు. తోటి బాలురు తప్పటడుగులు వేస్తుంటే శంకరాచార్యులు సర్వ భాషలందు ప్రావీణ్యం, ప్రజ్ఞ సాధించి అసాధారణ బుద్ధితో వేద, వేదాంగాల్లో బ్రహ్మని, బృహస్పతిని మించి΄ోయాడు. శివ రహస్యంలోనూ, కూర్మ పురాణం లోనూ ఈ అవతార ప్రస్తావన ఉంది.అద్వైత తత్వ స్థాపన –జైత్రయాత్రశంకరాచార్యుల తన ప్రజ్ఞాపాటవాలతో, వాగ్ధాటితో నాస్తిక మతాన్ని మట్టుపెట్టటానికి విద్వాంసులతో వాద ప్రతి వాదనలకు దిగి అందరినీ ఓడించారు. ఒకసారి వేయిమంది పండితులను అవలీలగా జయించారు. విష్ణు సముడైన వ్యాసభగవానుడినే తన వాదనతో మెప్పించారు. దేశంలో నలు మూలల్లో పీఠాలు స్థాపించి సనాతన మత పునరుద్ధరణలో భాగంగా తత్వ, వేదాంత పూజాది నియమాలు, సంప్రదాయాలు నెలకొల్పి జ్ఞాన జ్యోతులను వెలిగించారు.ఎన్నెన్నో రచనలు – నిత్య సాధనలుబ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గిత, విష్ణు సహస్ర నామం, గాయత్రి మంత్రానికి భాష్యాలు రచించారు. వీటివల్ల మనకి దైవ సన్నిధి, పెన్నిధి ఏర్పడ్డాయి. పలు ప్రకరణ గ్రంథాలు రచించారు. మనం రోజు చదివే స్తోత్రాలలో ఎక్కువ వారు రాసినవే. వివేక చూడామణి, నిర్గుణ మానస పూజ, శివానంద లహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, కనకధార స్తోత్రం.. ఇలా ఎన్నెన్నో. తాను నడుస్తూ మన అందరిని మంచి ద్రోవలో నడిపిస్తున్న ఆ దేవుడికి జేజేలు. ఇదీ చదవండి: Ramanuja Jayanthi 2026 ఈ ఆసక్తికకర విషయాలు తెలుసా? – డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...
కృష్ణా... గురువాయురప్పా..! ఈ ఒక్క మాట మనకి బాగా పరిచయం ఉన్న కేరళంలో ఎక్కువ వినిపిస్తుంటుంది. కేరళం పేరు వింటే మనకి గుర్తుకు వచ్చే దేవాలయం గురువాయూర్. శ్రీ కృష్ణ దేవాలయాలలో కేరళలో ఉన్న గురువాయురప్పన్ దేవాలయం ఎంతో విశిష్టమైనది.ఆయనను బాలగోపాలుడిగా భక్తితో కొలుస్తారు. ఆర్ద్రతతో కృష్ణా... గురువాయురప్పా అనిపిలిస్తే పలుకుతాడని కేరళవాసుల నమ్మకం. ఎంతో మంది కృష్ణ భక్తులు భక్తితో పలవరిస్తుంటారు. బాలగోపాలుడు ఇక్కడ అల్లరి చేస్తూ తిరుగుతాడు అని చూసిన వాళ్ళు చెప్తుంటారు. కురూరమ్మ బిల్వమంగళుడు వీరి ఇంట్లో అల్లరి కన్నయ్య తిరుగాడేవాడని ఇక్కడివారి నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తామే కురూరమ్మ బిల్వమంగళుడిగా భావిస్తుంటారు. మన తెలుగు వారు అయ్యప్ప మాల వేసుకుని దర్శనం తరువాత లేదా ముందు ఇక్కడ అల్లరి కన్నాయని గురువాయూర్ లో దర్శనం తప్పనిసరిగా దర్శనం చేసుకుంటారు. తాము రాధాకృష్ణులమని భావించి తులసి మాలలు వేసుకుని గురువాయూర్లో వివాహం చేసుకోవడం గొప్ప అనుభూతి. అలాగే అల్లరి కన్నయ్యకి నృత్యం, ఆటపాటలు అంటే ఇష్టం. అందుకే ప్రతిరోజు అరంగేట్రం సంగీత కచేరీలు జరుగుతుంటాయి. కన్నయ్యకి పాలు, బియ్యం పంచదార వేసి పాయసం చేసి నైవేద్యం పెడతారు. పసిపిల్లలను తులాభారం చేయిస్తారు. అలాగే మొక్కు తీర్చడానికి ఏనుగులు సమర్పించేవారు. ఆ విధంగా సుమారు 38 ఏనుగులతో పునాథూర్ కోటలో చూడవచ్చు. విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఏనుగులతో పరుగు పందాలు, ఏనుగులకు విందు కార్యక్రమాలు ఉంటాయి మరి కృష్ణష్టామి రోజు విశేషమైన పూజలు జరుపుతారు. కేరళ వాళ్ళ కొత్త సంవత్సరాది రోజు ఉదయం ఈ కన్నయ్యని ముందుగా చూస్తారు. దానిని విషు కని అంటారు. గురువు, వాయువు కలిసి నదిలో దొరికిన విగ్రహం ఇక్కడ బాల గోపాలుడి దర్శనం. ఈ ఆలయం త్రిచూర్ రైల్వే స్టేషన్కి 20 కిలోమీటర్లు లేదా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఉంది. – ఈఎస్. మాధవన్ (చదవండి: శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..?) -
ఉగాది రోజునే పంచాంగ శ్రవణం ఎందుకంటే..?
తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. ఆ రోజు ప్రముఖంగా ఆచరించేది పంచాంగ శ్రవణం. ఈ రోజునే ఎందుకంటే..తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఆ పర్వదినంతోనే కాబట్టి. ఉగాది రోజున ఆలయంలోగానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మరి అంత విశిష్టత గల పంచాంగ శ్రవణం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదోక దిక్సూచిలా ఉండేది. శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగమును వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్లీ ఏడాది వచ్చే ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.పంచాంగకర్తలు తమ పంచాంగాల్లో ఈ క్రింద శ్లోకంతో పంచాంగ రచన కుపక్రమిస్తారు.తిధిః వారంచ నక్షత్రం యోగః కరణమేవ చపంచాంగమితి విఖ్యాతం కాల్కోయం కర్మసాధకతిధి వారము, నక్షత్రము, యోగము, కరణము అనునవి ఐదు అంగములు కలది కనుక ‘పంచాంగం’ అన్నారు. మానవుల జీవితాలు కాలంపైన, కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టినది మొదలు గిట్టేవరకు వాని భవిష్యత్తు గ్రహ సంచారంమీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రములను బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరణలన్నిటికీ పంచాంగమే ప్రమాణము. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది. పంచాంగం ఏఏ ఫలాలనిస్తుందో జ్యోతిష శాస్తజ్ఞ్రులు ఇలా చెప్పారు.తిధేశ్చ శ్రీయమాప్నోది వారాదాయుష్మవర్ధనీమ్నక్షత్రాద్హరతే పాపమ్ యోగాద్రోహ నివారణమ్కర్ణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం దశమే ఫలమ్కాల విత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్సంపదల కోరేవారు తిథియందు, దీర్ఘాయువు కోరేవారు వారం యందు, పాప విముక్తిని పొందగోరేవారు నక్షత్రమునందు, ఆరోగ్యము అభిలషించేవారు యోగమునందు, కార్యసిద్ధిని కాంక్షించేవారు కరణముయందు శ్రద్ధ వహించాలని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శాస్త్రం పంచాంగం గురించి ఇంకా ఏమి చెప్పుచున్నదంటే.‘‘ శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదో షారుహంగంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాంఆయుర్వర్థన ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రాదంనానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం’’.ఇది శుభాన్ని, మంగళాన్ని ఇచ్చేది, శత్రువులను హరించేది, దుస్స్వప్నాలను దోషాలను తొలగించేది; గంగాస్నాన ఫలం ఇచ్చేది, గోదాన ఫలం ఇచ్చేది, సత్సంతానాన్ని ప్రాప్తింపజేసేది అంటూ అందరూ పంచాంగం ప్రయోజనాన్ని పొందాలని ఆకాంక్షించింది.పంచాంగశ్రవణం చేసిన వారికి సూర్యభగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, గురుడు-సంపదను, కుజుడు- శుభాన్ని, బుధుడు-బుద్ధిని, కుజుడు- సుఖాన్ని, శని- ఐశ్వర్యాన్ని, రాహువు- బాహు బలాన్ని, కేతువు-కులాధిక్యాన్ని కలిగిస్తారు.ప్రతి ఒక్కరు సాయంత్రం దేవాలయాలలో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని స్పష్టపరిచింది శాస్త్రం. జ్యోతిషశాస్త్ర రీత్యా తెలియజేసే ఫలితాలను తెలుసుకుని, ఆసంవత్సరంలో తాము తీసుకోబోయే లేదా ఆచరించవలసిన కార్యక్రమాలకు తగు విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!) -
'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగను..
భాషాపరంగా యుగాది సరైన పదం. ఉగాది అనే పదం వికృతిపదం. అయితే రెండూ ఒకే అర్థాన్ని బోధించే పదాలే. నిజానికి “యుగాది” అనే పదమే కాలాంతరంలో 'ఉగాది'గా మారింది. సోమకాసురుని నుండి వేదాలను విష్ణువు రక్షించిన రోజు ఉగాది. నూతన కల్పంలో జగత్తు సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజు. ఆరు రుచుల కలయికతో అనారోగ్యాలను అంతం చేసేది ఉగాది. హిందువుల పండుగల సంప్రదాయానికి మొదలు ఉగాది. వరాహమిహిరుడు ఈ ఉగాది నాడే పంచాంగాన్ని పరిచయం చేశాడని అంటారు. శ్రీరా ముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు మొదలైన వారు ఉగాదినాడే పట్టాభిషిక్తులైనారని ఆర్యులు చెబుతారు. సంవత్సరాది నాడు ప్రజలు తెల్లవారక ముందే నిద్ర లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవానికి పూజలు చేసి, షడ్రుచుల పచ్చడిని ఆరగించాలి. నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం చేయాలి.తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ,పంచాగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్.తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగ శ్రవణం వల్ల గంగా స్నానంతో సమానంగా పుణ్యం, పురు షార్థం లభిస్తుందని పై శ్లోకం చెబుతున్న భావం. కొత్త సంవత్సరంలో గ్రహ, రాశిఫలాల్లో, నామ నక్షత్రాల్లో తేడా వస్తే దోషనివారణ కోసం శాంతి హోమాలు, వ్రతాలు, పూజలు చేసి సుఖశాంతులతో ప్రజలు జీవించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. నవగ్రహాల్లో సూర్యుడు తేజస్సును, చంద్రుడు భోగభాగ్యాలను, కుజుడు శుభాలను, బుధుడు బుద్ధి వికాసాన్ని, గురుడు జ్ఞాన విత్తాన్ని, శుక్రుడు కార్యసిద్ధిని, శనీశ్వరుడు దుఖ వినాశాన్ని, రాహువు సంతోషకరమైన రాణింపును, కేతువు చెప్పుకోదగి నంత గొప్పదనాన్ని కలిగిస్తారని విద్వాంసులు చెబుతారు.ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని కలిగించేది ఉగాది పచ్చడి. శాస్త్రవచనాల్లో దానికి నింబకుసుమ భక్షణం, అశోకకళికా ప్రాశనం అనే పేర్లు కూడా ఉన్నాయి. తీపి, ఉప్పు, చేదు, వగరు, పులుపు, కారం సమపాళ్లలో కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తారు. తీపికి బెల్లం, ఉప్పునకు ఉప్పు, చేదుకు వేపపూత, వగరుకు మామిడి ముక్కలు, పులుపునకు చింత పండు, కారమునకు మిరియాలు ఉగాది పచ్చడిలో వాడు తారు. వీటికి తోడు తమతమ ఇష్టాలను బట్టి జీలకర్ర, అరటిపండ్లు, ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటివి కూడా కలిపి గొప్ప ఔషధంగా ఆరగిస్తారు. ఈ పచ్చడిని చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు ఒక పక్షం రోజులు సేవిస్తే వాత, పిత్త, కఫములకు చెందిన రోగాలన్నీ పటాపంచలవుతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. భారతదేశంలో ఆంధ్ర రాష్టేతరులు సైతం సంవత్సరాది ఉత్సవాలను జరుపుకుంటారు. తమిళులు, మళయాళీలు, మరాఠీలు, సిక్కులు ఈ పండుగను జరుపుకోవడం విశేషం.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!) -
ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!
ఉగాది.. తెలుగు ప్రజల కొత్త ఏడాదికి ప్రారంభం. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే పనులు ఏడాది మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుందని పెద్దలు, పండితులు చెప్తారు. అందుకే ఉగాది రోజు కొన్ని శుభకార్యాలు చేయడం ఆచారంగా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, సాంప్రదాయాలు చేయడం వల్ల ఆ ఏడాది మొత్తం శుభంగా ఉంటుందనేది భక్తుల నమ్మకం.ప్రభాత వేళే మేల్కొనడం – బ్రహ్మ ముహూర్తంలో లేచి, తైలస్నానం (నువ్వుల నూనెతో స్నానం) చేయడం శ్రేయస్కరం.కొత్త బట్టలు ధరించడం – కొత్త ఆరంభానికి సంకేతంగా, ఈ రోజు అందరూ కొత్త బట్టలు ధరించి ఉగాదిని ఆహ్వానిస్తారు.వేప పచ్చడి సేవించడం – తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచులను కలిపి తయారుచేసిన ఉగాది పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలను సూచిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.పంచాంగ శ్రవణం – ప్రతి ఉగాది రోజున కొత్త సంవత్సర ఫలితాలను తెలుసుకునేందుకు పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయడం ఉత్తమం. మినపప్పు , కందిపప్పు, శెనగపప్పుతో చేసిన పదార్ధాలు స్వీకరించాలి, స్వయంపాకంగా దానం ఇవ్వాలి.బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. కుదిరితే అన్నదానం చేయాలి. జలదానం చేయాలి. తల్లిదండ్రులకు భక్తితో నమస్కరించాలి, భార్యను ప్రేమతో చూచి కుదిరితే గాజులు కొనిచ్చి /కొనిపెట్టి , కుంకుమ బొట్టు పెట్టి ఆమెను దేవతగా భావించాలి. తద్వారా పార్వతీదేవి యొక్క ఆశీస్సులు పొందగలము. గురువునకు ఉగాదినాడు 3 ప్రదక్షిణలు చేసినవారు, 3 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. లక్ష్మీదేవిని పూజించి వ్యూహలక్ష్మీ మంత్రమును జపించుకోవటం, ఈశ్వరునికి అభిషేకం చేసుకోవటం శ్రేష్ఠం. పంచాంగ శ్రవణం చేయండి, కుదిరితే పంచాంగం లేక మంచి పుస్తకాలు దానం చేయడం మరింత ఉత్తమం. ఆలా చేస్తే పిల్లల యొక్క విద్య వృద్ధి చెoదుతుంది. పసుపు కుంకుమలు దానం ఇవ్వండి. బూరెలతో కూడిన భోజనము చేస్తే భూరి సంపదలు ఇస్తాడు పరమాత్మ. కోపం వదిలి, అన్నీ మంచి పలుకులు పలుకుదాము, ఈ నూతన సంవత్సరం సకల శుభాలను పొందుదాం... ఇవేగాక చాలామంది ఉగాది పండుగ నాడు ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయడం వంటివి చేస్తుంటారు. ఇలా ఎందకు చేస్తారు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక రహస్యాలు ఏంటంటే.విజయ ప్రతీకగా..నూతన సంవత్సర ఆరంభం (విజయ ప్రతీక)... తెలుగు రాష్ట్రాలలో ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం, ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. కాషాయ రంగు త్యాగానికి, పవిత్రతకు, ధర్మానికి చిహ్నం. కొత్త సంవత్సరం అంతా ధర్మబద్ధంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఇంటిపై ధ్వజాన్ని ఎగురవేస్తారు.చారిత్రక నేపథ్యం (విజయ సంకల్పం)... చారిత్రక కోణంలో చూస్తే, ఈ రోజును విజయ దినంగా కూడా భావిస్తారు. శాలివాహన చక్రవర్తి శకులను జయించి 'శాలివాహన శకం' ప్రారంభించిన శుభసందర్భం ఇది. ధ్వజం అనేది విజయానికి గుర్తు. ప్రతి ఇంటిపై ఈ జెండాను ఉంచడం ద్వారా ఆ కుటుంబం రక్షణ, ఐక్యతను చాటుతారు.ఆధ్యాత్మిక అర్థం... కాషాయం అంటే సూర్యోదయ కిరణాల రంగు. ఇది చీకటిని (అజ్ఞానాన్ని) తొలగించి వెలుగును (జ్ఞానాన్ని) ప్రసాదించే రంగు. హిందూ సంప్రదాయంలో జెండాను 'కేతువు' అని పిలుస్తారు. ఇంటి పైన జెండా ఎగురవేయడం వల్ల దుష్టశక్తులు దరిచేరవని, దైవ రక్షణ ఉంటుందని భక్తుల నమ్మకం.పండుగ అలంకరణలో భాగం...సాధారణంగా ఉగాదినాడు గుమ్మాలకు మామిడి తోరణాలు, వేప రెమ్మలతో పాటు ఇంటి కప్పు పైన లేదా బాల్కనీలో కాషాయ జెండాను కడతారు. ఇది ఇంటికి ఒక పవిత్రమైన రూపాన్ని ఇస్తుంది. ధ్వజం కట్టేటప్పుడు జెండా శుభ్రంగా, చిరగకుండా ఉండాలి.సాధారణంగా దీనిపై 'ఓం' కారము లేదా హనుమంతుడి చిహ్నం ఉంటుంది. జెండాను ఎత్తైన ప్రదేశంలో గాలికి రెపరెపలాడేలా కట్టడం శుభప్రదంగా భావిస్తారు.(చదవండి: పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!) -
గ్రహణంలోనూ తెరిచే ఉండే ఆలయాలు
గ్రహణంలోనూతెరిచే ఉండే ఆలయాలుసాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలను మూసివేసి, గ్రహణం తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణతో శుద్ధి చేసి భక్తుల సందర్శనార్థం అనుమతించడం అనేది ఆచారం. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో సూతక కాలంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి. ఆ ఆలయాలేమిటో తెలుసుకుందాం...గ్రహణసమయంలో కూడా తెరిచే ఉండే ఆలయాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం, పెదకాకానిలోని కోటేశ్వర స్వామి ఆలయం ముఖ్యమైనవి. తమిళనాట గల అరుణాచల క్షేత్రం సరేసరి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభువులు కావడం, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడమే ఇందుకు కారణంగా పండితులు చెబుతారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని విశ్వాసం. మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వరుడు సూర్యచంద్రులు, అగ్నిభట్టారడితో పాటు నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ క్షేత్రానికి రాహు, కేతువుల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకం.గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీజ్ఞాన ప్రసునాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం కూడా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామి వారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహు కేతు, సర్ప దోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తారు.మహా కాళేశ్వర్ ఆలయం... ఉజ్జయిని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభూ మహాకాళ రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండనందువల్ల గ్రహణ సమయంలో కూడా ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. ఏ ఢిల్లీలోని కల్కాజీ ఆలయం: ఈ ఆలయం కూడా గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న కల్కా దేవి కాలచక్రానికి అధిపతి అని నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం కల్కా దేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ప్రత్యేక పూజల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి వస్తారు.ఏ కల్పేశ్వర్ ఆలయం – ఉత్తరాఖండ్ : గ్రహణ సమయంలో కూడా ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెబుతారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిథిగా దర్శనాలు కొనసాగుతాయి. ఏ తిరువరప్పు శ్రీ కృష్ణ ఆలయం – కొట్టాయం ఏ కేరళ రాష్ట్రం కొట్టాయంలోని తిరువరప్పులో శ్రీ కృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీ కృష్ణుడికి రోజుకు పదిసార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ స్వామి వారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామి వారి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామి వారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు. ఏ విష్ణుపాద ఆలయం – గయ: ఈ ఆలయంలో గ్రహణం సమయంలో పిండ ప్రధానం చేయడం మంచిదని విశ్వసిస్తారు. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుందట.ఏ లక్ష్మీనాథ్ ఆలయం – బికనీర్, ఏ రాజస్థాన్ రాష్ట్రం బికనీర్లోని లక్ష్మీనాథ్ ఆలయం. దీన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరు. ఎందుకంటే ఓసారి గ్రహణ సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఓ కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది.(మార్చి 3 బుధవారం సంపూర్ణ చంద్ర గ్రహణం) -
సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?
స అష్ట అంగ నమస్కారం... దీనినే సాష్టాంగ నమస్కారం అంటారు. అంటే మన శరీరంలోని అన్ని అంగాలూ నేలకు తగిలేలా బోర్లా పడుకుని చేసే నమస్కారం అన్నమాట.. బాగా గౌరవించే వాళ్ల దగ్గర కాస్త ముందుకు వంగి నమస్కారం చేస్తాం. మరి సృష్టికి మూలమైన భగవంతుడికి నమస్కారం చేయాలంటే... ఎంత వంగినా ఇంకా వంగవచ్చునా అనిపిస్తుంది. అందుకే ఇక నన్ను నేను ఇంతకన్నా వంచలేను అనిపించే స్థితిలో నేలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాం.భగవంతుడికి పూర్తిస్థాయిలో మోకరిల్లడం ఇందులోని పరమార్థం. అయితే సాష్టాంగనమస్కారం (Sashtanga Namaskaram) పురుషులకు మాత్రమే. స్త్రీలకు వర్తించదు. మనిషి జననానికీ, జీవనానికీ కారణమైన పొట్ట, వక్షభాగాన్ని నేలకు తగిలించకూడదనీ, అందుకే వాళ్లు మోకాళ్ల మీద ముందుకు వంగి నమస్కారం చేస్తే సరిపోతుందనీ శాస్త్రం చెబుతోంది.చదవండి: మంత్రపుష్పం పరమార్థం ఏమిటి? -
Mahashivratri 2026: శివపూజకు దినుసులు
ఆయన సామాన్యుడా! ఆయనను విశ్వేశ్వరుడనీ, మహాదేవుడనీ, త్య్రంబకుడనీ, త్రిపురాంతకు డనీ, నీలకంఠుడనీ, మృత్యుంజయుడనీ, సదాశివుడనీ వేదం వేనోళ్ళ స్తుతించింది. మహాదేవుడి మహత్త్వాన్ని సంపూర్ణంగా చెప్పేందుకు మాటలు చాలవని మహాకవులైన వారే మనవి చేసుకొన్నారు. ఆయన గొప్పతనం ఆసాంతం చెప్పాలంటే, అది సాక్షాత్తూ చదువుల తల్లికయితే సాధ్యం కావచ్చు నన్నారు. నిజానికి, విశ్వేశ్వరుడి విశిష్టతలన్నీ వివరంగా చెప్పాలంటే సరస్వతీ దేవికి కూడా ఎన్నో సన్నాహాలు అవసరమవు తాయట. ముందు కల్పవృక్షం కొమ్మ విరిచి, దాన్ని అరిగిపోని కలం పుల్లగా అమర్చుకోవాలి. సముద్ర మంత జలపాత్ర సంపాదించాలి. ఆ నీటిలో కాటుక కొండను కరిగించి, సిరాను సిద్ధం చేయాలి. ఆ పైన విరామం లేకుండా అహర్నిశలూ రాస్తూనే వెళ్ళాలి. లేకపోతే, కైలాసనాథుడి ఘనతల జాబితాను సమగ్రంగా సమ కూర్చటం ఆమెకయినా అసంభవమే అంటుంది ‘శివ మహిమ్నస్త్రోత్రం’.అయితే, భక్తుల అదృష్టం వల్ల, మహాదేవుడు ఎంతటి మహిమాన్వితుడో అంతటి కరుణామయుడు. ఎంత సర్వ సమర్థుడో, అంత ఆడంబర విరహితుడు. అల్ప సంతోషి. ఆయన అనుగ్రహం పొందేందుకు పాండిత్య పాటవాలతో, పటాటోపాలతో పనిలేదు. విస్తృతమైన పూజావిధులూ, విలువైన సామగ్రీ అక్కర్లేదు. కావలసినవేమిటో ‘కాళహస్తీశ్వర శతకం’లో ధూర్జటి కవి చెప్పాడు: సలిలమ్ముల్ చులుక ప్రమాణ(ము), ఒక పుష్పమ్మున్ భవన్మౌళి, ని/ శ్చల భక్తి ప్రతిపత్తి చే నరుడు పూజల్ సేయగా ధన్యుడౌ,/... తుదిన్ కాంచు నీ/ చెలువంబంతయు, నీ మహత్త్వ మిదిగా, శ్రీ కాళహస్తీశ్వరా! శివపూజకు మూడు దినుసులు చాలు. పుడిసెడు (‘చులుక ప్రమాణము’) నీళ్ళు, ఒక్క పుష్పం, నిశ్చలమైన భక్తి భావం– ఈ మూడింటితో పూజ చేసిన భక్తుడు ధన్యుడై చివరకు శివ సాక్షాత్కారం ప్రాప్తింపజేసుకొంటాడు. భోలా శంకరుడే గదా, చేరెడు నీళ్ళతో అభిషేకించి, చిన్న మారేడు దళం అప్పగిస్తే చాలు, పొంగి పోయి బోలెడు వరాలిచ్చేస్తాడు అని గడసరి భక్తులు అనే మాట అర్ధ సత్యమే. నిశ్చల భక్తి అనే నిప్పు లేకుండా, భక్తుడి పప్పు ఉడకదు అనే షరతు వర్తిస్తుంది! - ఎం. మారుతి శాస్త్రి (ఫిబ్రవరి 15న శివరాత్రి) -
మంత్రపుష్పం పరమార్థం ఏమిటి?
పూజలో పూలు వాడతాం. మరి మంత్రపుష్పం ప్రత్యేకత ఏమిటీ అంటే – భగవంతుడికి మనం చేయగలిగిన ఉపచారాలన్నీ చేశాక, పెట్టగలిగిన పదార్థాలన్నీ నైవేద్యం పెట్టాక... మనల్ని మనం ఆ దేవదేవుడికి సమర్పించుకోవడమే మంత్రపుష్పంలోని పరమార్థం. కిందివైపు ముడుచుకుని ఉన్న కమలంలా నాభికి పైనా, గొంతుకు కిందా 12 అంగుళాల పరిమాణంలో ఉన్న భాగం (హృదయం), మనం తిన్న అన్నాన్ని శరీరభాగాలన్నింటికీ సమానంగా పంచుతుందట.దానిపై భాగంలో విచ్చుకున్నట్టు ఉండే సూక్ష్మపద్మంలాంటి చోట నివ్వరిధాన్యపు ముల్లంత (వడ్లగింజ కొస) పరిమాణంలో పసుపురంగు కాంతితో మనలోని పరమాత్మ ఉంటాడంటూ సవివరంగా మన జ్యోతి స్థానాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకాన్ని మంత్రపుష్పంతో (Mantrapushpam) జతచేసి చదువుతాం. అంటే నాలోని ప్రాణం నీవు, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను స్వామీ... అని చెప్పుకోవడం మంత్రపుష్పంలోని పరమార్థం.చదవండి: శఠగోపం ఆకారం ఎందుకలా? -
శఠగోపం ఆకారం ఎందుకలా?
శఠగోపం ఆకారమే చాలా ప్రత్యేకం. ఆలయ గోపురాలు దాదాపు ఇదే ఆకారంలో ఉంటాయి. అలాగే చదరంగా ఉండే తలాలకన్నా వంపుగా అర్ధవృత్తాకారంలో (డోమ్ తరహా) నిర్మాణాలూ పిరమిడ్ తరహాలోనే పనిచేస్తాయి. రాజమందిరాల పై భాగాలు ఇలా ఉండటాన్ని మనం గమనించొచ్చు. అందువల్ల శఠగోపం కూడా అచ్చంగా ఇదే విధంగా పనిచేస్తుంది.ఆత్మజ్ఞానానికి ప్రతీకైన సహస్రార చక్రం మన తలకు పై భాగంలో కాస్త ఎత్తులో ఉంటుంది. అదే జ్ఞానులూ, యోగులకు దాదాపు జానెడు ఎత్తులో ఉంటుంది. అలాంటి సహస్రార చక్రం పైన ఈ శఠగోపాన్ని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఇన్ని రకాలుగా శక్తిని పొందుతాం కాబట్టి, దాన్ని స్థిరపరచుకోవడానికి కాసేపు అక్కడే కూర్చోమని చెబుతారు. చదవండి: స్వర్ణగిరికి బ్రహ్మోత్సవ సిరి -
మండల పూజ సీజన్లో శబరిమల కొత్త ఆదాయ రికార్డు
శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయం ఈ ఏడాది మండల-మకరవిళక్కు సీజన్ కోసం నవంబర్ 16 సాయంత్రం తలుపులు తెరిచింది. 41 రోజుల మండల పూజ కాలం పూర్తయినందున నవంబర్ 16 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. డిసెంబర్ 27 సాయంత్రం ఆలయం మూసివేయబడింది. తిరిగి డిసెంబర్ 30న మకర ఉత్సవాల కోసం తెరిచింది దేవస్వం బోర్డు. రికార్డ్ బ్రేకింగ్ రెవెన్యూదేవస్వం బోర్డు గత రికార్డులన్నింటినీ అధిగమించి ఆలయ ఆదాయంలో చారిత్రాత్మక పెరుగుదలను ప్రకటించింది. తాజా గణాంక నివేదిక ప్రకారం:మొత్తం ఆదాయం: గత 41 రోజుల్లోనే, ఆలయం రూ. 332.77 కోట్లు వసూలు చేసింది.అరవణ పాయసం అమ్మకాలు రూ. 142 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ. 12 కోట్లు వచ్చాయి.హుండీ (ఉడియల్) మొత్తం రూ. 83.17 కోట్లు.గతేడాది మండల పూజ ఆదాయం రూ. 297.06 కోట్లతో పోలిస్తే, ఈ సీజన్లో ఆలయం రూ. 35.70 కోట్ల ఆకట్టుకునే పెరుగుదలను చూసింది.రికార్డు స్థాయి దర్శనాలు..ఆన్లైన్ బుకింగ్ ద్వారా 30,91,183 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.స్పాట్ బుకింగ్ ద్వారా 4,12,075 మంది వచ్చారు.పుల్మేడు అటవీ మార్గం ద్వారా 1,29,933 మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు.గతేడాది మండల సీజన్లో 32,49,756 మంది భక్తులు సందర్శించగా, ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 3,83,435 మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం విశేషం.(చదవండి: శబరిమల యోగా దండం, జప మాల మరమ్మత్తు పనుల కేసుపై సిట్ దర్యాప్తు ముమ్మరం) -
నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?
ధనుర్మాసం మొదలవ్వగానే అందరూ నెలగంట కడతారు అని అంటుంటారు. పైగా అప్పటి నుంచి ముంగిళ్ల అన్ని రంగవల్లులతో శోభాయమానంగా ఉంటాయి. అసలేంటి ఈ నెలగంట..అందులోని ఆంతర్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!నెలగంట కట్టడం అంటే, సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాసం (Dhanurmasam) ప్రారంభాన్ని సూచించే ఒక సంప్రదాయం. అందులో భాగంగా ఇళ్లలో ముగ్గులు వేసి, గుడిలో గంటలు మోగిస్తూ, పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడుఆలయంలో మోగే గంటల శబ్దమే "నెలగంట". ఇవాళ (డిసెంబర్ 16 వ తేదీన) మధ్యాహ్నం (1. 23)ప్రాంతంలో ధనుస్సులో ప్రవేశిస్తాడు. దానినే మనం ధనుస్సంక్రమణం అంటాం! అలా ధనూరాశిలో ప్రవేశించిన సూర్యుడు - నెలంతా ఆ రాశిలోనే ఉంటాడు. ఇలా సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించగానే నెలగంట కట్టడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ తరువాత మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణం!.ఈ నెలగంట కట్టినది మొదలుకొని పెద్ద పండుగ అయ్యేంతవరకు ఊళ్ళో ఎవరూ ఏ శుభకార్యం చేయరు. అంటే ఈ నెలంతా ఈ దీక్షలోనే ఉంటారు. ఈ నెలగంట కట్టడంతో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి..తిరుప్పావై పాశురాలు - వేకువజాము పూజలు నిర్వహిస్తారు. అంతేగాదు అలాగే ఈ నెలలోనే విష్ణుమూర్తిని మధుసూదనుడుగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత 15 రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అలా భోగి పండుగ నాడు ఈ మార్గళి వ్రతం లేదా తిరుప్పావై పూర్తవుతుంది. ఒకరకంగా ఈ నెలగంట మన సంక్రాంతి పండుగ రాకను సూచిస్తుందని చెప్పొచ్చు.ఈ సమయంలో ఏం చేస్తారంటే..పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణుకి తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర, సహస్రనామాలతో ఆరాధించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావై పఠించడం చాలా మంచిది. నెలరోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు.(చదవండి: ఈశ్వరీ..జగదీశ్వరీ..) -
హనుక్కా పండుగ అంటే..? అందుకే యూదులు అంతలా..
ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు. హనుక్కా అంటే.."హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.అద్భుతం జరిగిన రోజు..క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు?మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.విందు..ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్కేక్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ్ డోనట్స్ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్స్లను గిఫ్ట్గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.(చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..) -
కార్తికేయుని అనుగ్రహంతోనే యోగప్రాప్తి
సాధారణంగా కొన్ని దేవాలయాలలో రెండు సర్పాలు ఒక దానితో మరొకటి మెలికలు తిరుగుతూ ఉన్న శిల్పం మనకు కనిపిస్తుంది. ఆ శిల్పంలో ఉండే రెండు సర్పాలు మన సూక్ష్మ శరీరంలో ఏ విధంగా ఇడా, పింగళా నాడులు ఒక దానితో ఒకటి మెలికలు తిరిగి ఆరు శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను ఏర్పరుస్తాయో సూచిస్తాయి. వీటినే చంద్ర నాడి, సూర్య నాడి అని కూడా పిలుస్తారు. మన వెన్నెముక అడుగు భాగాన త్రికోణాకార ఎముకలో ఉండే కుండలినీ శక్తి ఈ రెండు నాడుల మధ్య ఉండే సుషుమ్నానాడి ద్వారా పైకి వచ్చి మన మాడు పై భాగంలో ఉండే బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించి, మన చుట్టూ ఉండే సర్వ వ్యాపితమైన భగవంతుని పరమ చైతన్య శక్తితో ఐక్యం చెందుతుంది. అప్పుడే ఒక సాధకునికి యోగ్ర ప్రాప్తి జరుగుతుంది. ధ్యానంలో కుండలినీ శక్తి జాగృతిని, దాని ఊర్థ్వ గమనాన్ని అనుభూతి చెందితే, సాధకుడు నిరానంద అనుభూతిని పొంద గలుగుతాడు.మన కుడివైపు మూలాధార చక్రం శుభ్రమయ్యే కొద్దీ మన లోపల అనవసరమైన ఆలోచనలు తగ్గిపోయి అంతర్గత ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ విధంగా కుడి వైపు మూలాధార చక్రం మన లోపల సమతుల్యత ఏర్పడడానికి, నిర్విచార స్థితి నెలకొనడానికి సహాయ పడుతుంది.మితిమీరిన క్రియాశీలత, ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం, అవసరానికి మించి పని చేయడం, అతిగా ప్రణాళికలు వేయడం, నిద్ర లేమి, మొండితనం, మూర్ఖత్వం, చిరాకు, కోపం, అతిగా మాట్లాడడం, అతిగా ఆటలు ఆడటం, క్రూరత్వం, కాఠిన్యం ఇటువంటివన్నీ మన కుడివైపు పింగళానాడిని బలహీన పరుస్తాయి. ఆ సమయంలో శ్రీ కార్తికేయుని ధ్యానం ద్వారా మనం మన లోపల గల అసమతుల్యత లను తొలగించు కోవచ్చును. శ్రీ కార్తికేయుని ధ్యానం వలన మన చిత్తం నిర్మలంగా మారి మనకు నిర్విచార స్థితి లభిస్తుంది.ఒక గురువుకు తన మీద తనకు ఆత్మనిగ్రహం ఉంటుంది. అంటే తనను తాను నియంత్రించుకో గలుగుతాడు. కానీ శ్రీ కార్తికేయుని ఆశీస్సులు ఉన్న వ్యక్తి ఇతరులను శాసించ గలుగుతాడు. ఆ విధంగా శాసించగల శక్తి పురుషులకు వారి మాటల ద్వారా, చురుకుదనం ద్వారా, వ్యక్తిగత విజయాల ద్వారా లభిస్తే, స్త్రీలకు వారి ప్రేమించే గుణం, సహనం, హుందాతనం, క్షమా గుణం, కరుణల ద్వారా లభిస్తుంది.శ్రీ కార్తికేయుని శక్తి మన లోపల పసితనం లాంటి అమాయకత్వాన్ని పరిరక్షిస్తుంది. ఈ అమాయకత్వం వలనే మానవులు ఆనందంగా ఉండగలుగుతారు. మనలో కుండలినీ శక్తి వెన్నెముక అడుగున ఉన్న త్రికోణాకార ఎముక నుండి బయలు దేరి, షట్చక్రాలనూ దాటుకుంటూ వెళ్ళి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించడానికి మార్గ మధ్యంలో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగించడానికి కుడి మూలాధార చక్రం సహకరిస్తుంది. శ్రీ కార్తికేయుని శక్తి పరిపూర్ణంగా స్వచ్ఛమైన క్రియాశీలక శక్తి. అందులో ఎటువంటి అనవసరమైన, పనికిమాలిన ఆలోచనలకు తావు లేదు. అది చక్కటి ఫలితాలను ఇస్తుంది.– డా. పి. రాకేశ్(మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాలు, ప్రసంగాల ఆధారంగా) -
శబరిమల అయ్యప్పకు అర్పించే నైవేద్యాలివే..!
శబరిమల అయ్యప్పస్వామి అనగానే నోరూరించే అరవణ ప్రసాదమే గుర్తొస్తుంటుంది. ఆ ప్రసాదం ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఒక్క ప్రసాదమే కాదు నాలుగు రకాల పాయసాలను ఆ హరిహరసుతుడికి నివేదిస్తారు. అవన్నీ ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలు కలిగినవి. తక్షణ శక్తిని ఇచ్చేవి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అరవణ పాయసంతోపాటు సమర్పించే ఇతర నైవేద్యాల వివరాలు, వాటి ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందాం.⇒ ఉషః కాలంలో ఉదయం 7.30 గంటల సమయంలో కొబ్బరి పిండితో చేసిన పాయసాన్ని నివేదిస్తారు. దీని పేరుకు తగ్గట్టుగా ఈ పాయసం కొబ్బరికాయను చూర్ణం చేసి.. ఆ పిండికి, రెండు గ్లాసుల కొబ్బరి పాలకు బెల్లం జోడించి తయారు చేస్తారు. ⇒ మధ్యాహ్నం 12 గంటల పూజ కోసం అరవణ పాయసాన్ని నివేదిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఇది రైస్, ఎండు కొబ్బరి ముక్కలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, తాటిబెల్లం, శొంఠిపొడి, యాలకుల పొడి, పచ్చ కర్పూరంతో తయారవుతుంది. ⇒ ఇక మిగతా పూజాసమయాల్లో తెల్ల నైవేద్యాన్ని నివేదిస్తారు. రాత్రి 9.15 గంటలకు సాయంత్రం పూజ కోసం నువ్వుల పాయసం నివేదిస్తారు. ఈ మేరకు శబరిమల తంత్రి కంఠరార్ మహేష్ మోహనార్ మాట్లాడుతూ.. ‘‘నువ్వుల పాయసం నిజానికి పాయసం రూపంలో ఉండదు.. నువ్వులే’’ అని చెప్పుకొచ్చారు. సాయంత్రం పూజ కోసం అయ్యప్పకు పానకం, అప్పం, అడ అనే పానీయం నివేదిస్తారు. ఇక్కడ పానకం అనేది జీలకర్ర, బెల్లం, పసుపు, నల్ల మిరియాలు కలిపిన ఔషధ మిశ్రమం.అత్యంత స్పెషల్ పంచామృతం..తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడు అభిషేకానికి ఈ పంచామృతాన్ని వినియోగిస్తారు. స్పటికబెల్లం, బెల్లం, అరటి పండు, ఎండు ద్రాక్ష(కిస్మిస్), నెయ్యి, తేనె, యాలకుల పొడి, లవంగాల పొడి, తదితర ఎనిమిది పొడులను కలిపి పంచామృతం తయారు చేస్తారు. పాయసాలలో అరవణ తర్వాత పంచామృతం అత్యంత రుచికరమైన ప్రసాదంగా భక్తులు చెబుతుంటారు. అంతేాకాదు శబరిమలలో ఈ అరవణ ప్రసాదంతోపాటు అచ్చం అరవణ టన్ మాదిరి సగం సీసాలో ఈ పంచామృతాన్ని విక్రయిస్తారు. దీని ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ.125లు పలుకుతుంది. అయ్యప్ప స్వామి పూజా విధానాలే కాదు నివేదించే నైవేద్యాలు కూడా అత్యంత ప్రత్యేకమే కదా..!.(చదవండి: దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్పై ఫిర్యాదులు..!) -
భగవద్గీత బోధించే ప్రశాంత జీవన రహస్యం ఇదే..!
భగవద్గీత, యుద్ధభూమిలో శ్రీకృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ. అయితే, దాని అసలైన సందేశం కేవలం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి ఉంది. ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, మీ శక్తిమేరకు కృషి చేయడం. గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన పరమహంస యోగానంద, కోరికలు లేకుండా కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు. గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత (God Talks With Arjuna: The Bhagavad Gita) అనే తన మహత్తర గీతాభాష్యంలో, శ్రీకృష్ణుని సందేశం ఒక అర్థంకాని తత్వశాస్త్రం కాదని, గృహస్థునకైనా, ఒక సంస్థకు అధిపతికైనా, లేక ఒక దైవాన్వేషకునికైనా ఇది ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు. భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించారు. “కర్మలు చేయుటయందు మాత్రమే నీకు అధికారము కలదు, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.” దీని అర్థం ఏమిటంటే: అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉండకండి. “నాకేమి లభిస్తుంది” అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి. 48వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చారు:“ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించుము. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయములయందు సమభావము గలవాడవై ఉండుము. ఈ మానసిక సమత్వమే యోగం అని చెప్పబడుతుంది.” జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తారు. ఈ సమభావమే నిజమైన యోగం—ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం. 3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీకృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశారు. “సమస్త కర్మలను నాకు అర్పించుము! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండుము.”సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు, అశాంతికారకమైన కోరికలు లేకుండా, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైక మార్గం. 5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించారు:“నీటిచే అంటబడని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి (భగవంతునికి) సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.”బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. ఈ సనాతనమైన బోధనల వ్యాప్తికి యోగానంద పశ్చిమ దేశాలలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (SRF)ను, మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను భారతదేశంలోను స్థాపించారు. ఆయన విశిష్ట గ్రంథం, ఒక యోగి ఆత్మకథ (autobiography of a yogi), లక్షలాది మందికి యోగమును, ధ్యానాన్ని— ముఖ్యంగా భగవద్గీతలో కూడా ప్రస్తావించబడిన క్రియాయోగమనే సనాతన ప్రక్రియను,— దైవానుభవం కలిగించే ఒక తిన్నని రాజమార్గంగా పరిచయం చేసింది.నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా— కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను — పనిచేయడం, కానీ ఫలితాల కోసం ప్రాకులాడకుండా ఉండటం. యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది—వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు.(చదవండి: ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!) -
సజ్జన సాంగత్య ఫలం... బలం
ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తున్నాడు. ఒకరోజు బ్రహ్మ దేవునికి దీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి విశ్వామిత్రుడు వచ్చి ఆదిశేషుడిని తనతో రమ్మన్నాడు. ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో ‘‘ఓ మహర్షీ! ఈ సమస్త భూమండలం నా శిరస్సుపైనే వుంది. దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం. నేను ఈ కార్యాన్ని విస్మరిస్తే, ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తథ్యం. అప్పుడు కోటానుకోట్ల జీవరాశులు నా మూలంగా నాశనమైపోతాయి’’ అన్నాడు. ఆ మాటలకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి ‘‘అటువంటిదే గనక జరిగితేనేను నా అమోఘమైన తపశ్శక్తితో దానిని ఆపుతాను’’ అన్నాడు.ఆదిశేషుడు అందుకు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చ జెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని మొండిపట్టు పట్టాడు. ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. కమండలం ఎత్తి శపించబోయాడు. ఆదిశేషుడు భయపడి చేసేదిలేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు.అంతలోనే ఘోరమైన విపత్తు సంభవించింది. ఆదిశేషుని వేయిపడగలపై భద్రంగా వున్న భూగోళం వెంటనే తాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. దానిపై నివాసముంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి.జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఃఖంతో ఆదిశేషుడు మ్రాన్పడిపోగా, తపశ్శక్తి సంపన్నుడనన్న గర్వంతో విశ్వామిత్రుడు తన కమండలంలోని నీరు ధారపోసి ‘ఆగు’ అంటూ భూమిని ఆజ్ఞాపించాడు. భూగోళ పతనం ఆగకపోగా, మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. విశ్వామిత్ర మహర్షి పట్టరాని ఆగ్రహంతో ‘‘నా తపశ్శక్తి అంతా ధారపోస్తున్నాను, వెంటనే ఆగు’’ అంటూ ఆజ్ఞాపించాడు. అయినా ఫలితం లేకపోయింది.దాంతో విశ్వామిత్రునికి అహంకార మైకం తొలగిపోయింది. భూమిని ఆపడానికి తన తపశ్శక్తి చాలదని తెలుసుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిన దానిని తెలుసుకొని ‘‘నీవు ఎప్పుడైనా సజ్జన సాంగత్యం చేసి ఉంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపోయి. భూపతనం ఆగి΄ోతుంది’’ అని చెప్పాడు. విశ్వామిత్రుడు ఆలోచనలో పడ్డాడు. తాను అందరితో తగవులు పెట్టుకోవడమేకాని సజ్జన సాంగత్యం చేసింది లేదు. సాటి ముని పుంగవులతోనూ తగవులే. సత్సంగం చేసింది లేదు. అయినా తాను వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధార΄ోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది. ఆదిశేషుడు యధావిధిగా తిరిగి భూమండలాన్ని తలకు ఎత్తుకున్నాడు.ఇందులోని నీతి ఏమిటంటే... మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి. సమయం సందర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది. దుర్జనులతో సాంగత్యం చేస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులను చేస్తాం. అదే సజ్జన సాంగత్యం చేసినట్లయితే మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది. అందుకే సజ్జన సాంగత్యం ఎంతో బలం..ఫలం.– భాస్కర్ -
మూలధార చక్రం..కార్తికేయ స్థానం..!
మన సూక్ష్మ శరీరంలో శ్రీ కార్తికేయుని స్థానం కుడివైపు మూలాధార చక్రంలో ఉంటుంది. మన లోపల కుండలినీ శక్తి కుడివైపు మూలాధార చక్రాన్ని దాటి పైకి రావాలంటే, మనలో శ్రీ కార్తికేయుని గుణగణాలు ఉండాలి. ఆ గుణగణాలు ఏమిటో, కుడివైపు మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ శ్రీ కార్తికేయుని ఆశీస్సులను పొందడమెలానో శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల నుంచి తెలుసుకుందాం.శ్రీ గణేశుడు గణాలన్నింటికీ రాజు అయితే శ్రీ కార్తికేయుడు సర్వ సైన్యాధ్యక్షుడు. అతను మన కుడివైపు ఉండే పింగళా నాడిని ప్రభావితం చేసే శక్తికి ప్రతీకగా ఉంటాడు. ఈ శక్తి మన ప్రాణ శక్తితో అనుసంధానింపబడి ఉంటుంది. శ్రీ కార్తికేయుని అనుగ్రహం దడం వలన మానవులకు పసిపిల్లల అమాయకత్వంతో కూడిన తేజస్సు, చక్కటి క్రియాశీలత, చెడును అంతమొందించ గల అంతర్గత దైవ శక్తి లభిస్తాయి. భగవంతుని పట్ల వినయ విధేయతలు, నాయకత్వ లక్షణాలు, అందరికీ మార్గ దర్శకత్వం చేయగల శక్తి, దైవికమైన జ్ఞానం, వివేకం లభిస్తాయి.శ్రీ కార్తికేయుని నివాసం కుడివైపు మూలాధార చక్రమే అయినా కుడివైపు నాడి అయిన పింగళా నాడి మొత్తంపై అతని ప్రభావం ఉంటుంది. అందువలనే అతనికి ‘సుపింగళా’ అనే నామం ఏర్పడింది. మన కుడివైపు మూలాధార చక్రం శుభ్రమైనప్పుడు, కుడివైపు ఉండే పింగళా నాడి మొత్తం శుభ్రమవుతుంది. మన లోపల మూలాధార చక్రం, ఆజ్ఞా చక్రం ఒకదానితో మరొకటి పరిపూర్ణ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే కుడివైపు మూలాధార చక్రం శుభ్రమైనప్పుడు కుడివైపు ఆజ్ఞా చక్రం కూడా శుభ్రపడి మనలో అహంకారాన్ని నియంత్రించే శక్తిని మెరుగుపరుస్తుంది. ‘అహం కరోతి ఇతి అహంకారః’ అన్నారు మన పెద్దలు. అంటే ‘నేను చేస్తున్నాను అనుకుంటే అది అహంకారం‘. నిజానికి మన ద్వారా జరిగే ప్రతీ పనినీ మన లోపల ఉండే భగవంతుని శక్తి జరిపిస్తుంది. ఆ నిజాన్ని విస్మరించి మన ద్వారా ఏదైనా గొప్ప పని జరిగినప్పుడు అది మనమే చేశామనుకొని భ్రమ పడితే, అప్పుడు అది మన సూక్ష్మ శరీరంలో అహంకారమనే బుడగను ఏర్పరుస్తుంది. ఈ అహంకారమనే బుడగ మన ఆజ్ఞా చక్రం ఎడమవైపు అవరోధంగా నిలిచి మన కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రమును దాటకుండా అడ్డుకుంటుంది. శ్రీ కార్తికేయుని ధ్యానము వలన అహంకారము తగ్గి మన లోపల శ్రద్ధ నెలకొంటుంది. మన మెదడులో దైవికమైన విచక్షణా శక్తి ఏర్పడి జ్ఞానంతో ప్రకాశిస్తుంది. భగవంతుని సంహారక శక్తి శ్రీ కార్తికేయుడు నరకలోక ద్వారాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. శ్రీ భైరవనాథుడు మన ఎడమ వైపు ఉండే ఇడా నాడి మొత్తం సంచరిస్తూ, అక్కడ ఏమైనా దుష్ట శక్తులు ఉంటే వాటిని నరకానికి తరిమేస్తారు. అవి తిరిగి మన మీద దాడి చేయకుండా ఉండడానికి శ్రీ కార్తికేయుడు నరకలోక ద్వారాన్ని మూసివేస్తాడు. కావున కుడివైపు మూలాధార చక్రం ఎవరిలో అయితే బలంగా ఉంటుందో, వారు ఎడమవైపు దుష్ట శక్తుల బారిన పడకుండా ఉంటారు. ఆ విధంగా శ్రీ కార్తికేయుని ప్రభావం ఎడమవైపు ఇడా నాడి మీద కూడా ఉంటుంది. మానవులలో ఉండే మొండితనం, మూర్ఖత్వం, క్రూరత్వం, రాక్షసత్వం వంటి గుణాలు కుడివైపు మూలాధార చక్రాన్ని బలహీన పరుస్తాయి. మనలోని రాక్షస గుణాలు అంతం కావాలంటే మన అంతర్గత సూక్ష్మ శరీరంలో కార్తికేయుని స్థానమైన కుడి మూలాధార చక్రం బలంగా ఉండాలి. – డా. పి. రాకేశ్(పరమపూజ్య మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాలు, ప్రవచనాల ఆధారంగా...) (చదవండి: ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!) -
ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!
హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం...’ ఎటు చూసినా‘నమస్తేస్తు మహామాయే...’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందం చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే! ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది మహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రతవిధానం...లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం.ఐదువారాల అద్భుత వ్రతం...మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. ఒకవేళ ఏ కారణం వల్లనైనా మొదటి గురువారం లేదా మధ్యలో మరేదైనా గురువారం నాడు ఈ వ్రతం చేయలేనివారు కూడా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.వ్రతవిధానంముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనాన్ని శ్రద్ధతో సమర్పించాలి. ‘ ‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ ‘అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా క్షమాప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవవారం అట్లు, తిమ్మనంమూడోవారం అప్పాలు, పరమాన్నమునాలుగోవారం చిత్రాన్నం, గారెలు నివేదించాలి. ఐదోవారం నాడు అమ్మవారిని ఈ వ్రతానికి పూర్ణ ఫలాన్నిమ్మని ప్రార్థిస్తూ పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని ΄ాటించాలనేది పండితుల ఉవాచ.నియమనిష్ఠలు కీలకంగురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదుర΄ోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి ప్రీతికరమైన పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళ ద్రవ్యాలను సమర్పించడం ఆమె అనుగ్రహాన్ని ΄÷ందే మార్గాలలో ఒకటైన సులభ మార్గం. – డి.వి.ఆర్. (చదవండి: సర్వం పర్వదినాలే..! మార్గాన్ని చూపేది కాబట్టి..) -
Margasira Masam 2025: సర్వం పర్వదినాలే..
పరమ పవిత్రమైన కార్తిక మాసం నేటితో ముగుస్తోంది. రేపటినుంచి విష్ణుప్రీతికరమైన మార్గశిర మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ సందర్భంగా మార్గశిర మాస విశిష్టతను తెలుసుకుందాం.మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ దేవికి చేసే పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయన్నది పెద్దల మాట. మార్గశిర మాసం మాసాలలోకెల్లా ’శీర్షం’ అంటే’ శిరసు’ వంటిదని అర్ధం. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రం మృగశిర కాబట్టి ఈ మాసానికే మార్గశిరమని పేరు.రోజుకో పర్వం...మార్గశిర మాసంలో ప్రతిరోజూ ఒక పర్వదినమే. అసలు ఈ నెలలోని మొదటిరోజైన శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా జరుపుకోవడంతో ఈ మాసంంలోని పర్వదినాల పరంపర ప్రారంభం కానుంది. ఈ రోజు గంగాస్నానం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి, మిత్ర సప్తమి, గీతా జయంతి, దత్త జయంతి వంటి విశేష పర్వదినాలు వచ్చేది ఈ మాసంలోనే.మార్గశిర గురువార వ్రతంకేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. ఐదువారాల అద్భుత వ్రతంగా పేరు పొందిన మార్గశిర గురువార లక్ష్మీవ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు.మార్గశిర గురువారం వ్రతంసాధారణంగా గురువారంను లక్ష్మీవారమని కూడా అంటారు. మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలోనూ, పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడూ ఈ పూజను ఆచరించడం సర్వ శ్రేష్టం. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద. ఆరోగ్య భాగ్యం చేకూరతాయని విశ్వాసం.ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసం. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళాలతో పూజించడం పుణ్యప్రదం.ద్వాదశినాడు పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించడం విశిష్ట ఫలప్రదం. శ్రీ విష్ణుతోపాటు సూర్యుని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయ నమః, ఓ నమో నారాయణాయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం. ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని వృత్తికతో, తులసి ఆకులను తీసికొని ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించడం వల్ల సర్వ విపత్తులూ తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పెద్దలు చెబుతారు. – డి.వి.ఆర్. -
శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!
శబరిమల దేవాలయాన్ని సన్నిధానం అని కూడా అంటారు. సన్నిధానం అనేది దివ్య స్థలం లేదా దేవుడు నివసించే ప్రదేశం. శబరిమల ఆలయం భూమి మట్టం నుంచి 40 అడుగుల ఎత్తులో పీఠభూమిపై ఉంది. దీనిలో బంగారు పూతతో కూడిన పైకప్పుతో ప్రధాన ఆలయం (గర్భగుడి), దాని పైన నాలుగు గోపురాలు, రెండు మండపాలు (గాజెబో లాంటి నిర్మాణాలు), బలిపీఠం (యజ్ఞ శిలా పీఠాలు), బలికల్పుర (పూజా నైవేద్యాలు చేయడానికి రాతి నిర్మాణం) బంగారం తాపడం చేసిన ధ్వజస్తంభం తదితరాలు ఉంటాయి. అలాగే ఈ సన్నిధానానికి దారితీసే పతినెట్టాంపడి లేదా పద్దెనిమిది మెట్లు బంగారంతో తాపడం చేసి ఉంటాయి. పద్దెనిమిది మెట్ల అడుగు భాగంలో ఇద్దరు ద్వారపాలకులు - వలియ కడుత స్వామి, కరుప్ప స్వామి ఉంటారు. వావర్ నడ కూడా దీనికి సమీపంలోనే ఉంది. అలాంటి పవిత్ర ప్రదేశాన్ని దర్శంన చేసుకునేందుకు పెద్దసంఖ్య మాలధారులు ప్రతి ఏటా పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్నవారి సంఖ్య అధికంగా ఉంటుందనేది అధికారిక వర్గాల సమాచారం. మరి ఈ నేపథ్యంలో శబరిమల సన్నిధానంలో యాత్రికుల పూజ, వసతి నిమిత్తమై ఎలాంటి వసతి సౌకర్యాలు ఉంటాయి వంటి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!. శబరిమల సన్నిధానం వద్ద వసతి సౌకర్యాలు ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవచ్చు, అలాగే దేవస్వం బోర్డు గుర్తింపు పొందిన కేంద్రాలలో స్పాట్ బుకింగ్ కూడా అందుబాటులో ఉంది. భక్తులు ఆన్లైన్లో దర్శనం స్లాట్లు, పూజలు, వసతిని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. సమీపంలో అనేక హోటళ్ళు, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి కూడా.శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాలుసన్నిధానంలో యాత్రికుల బస కోసం వివిధ భవనాల్లో 540 గదులు ఉన్నాయి.శబరి గెస్ట్ హౌస్లో మాత్రమే 56 గదులు ఉన్నాయి, వీటితో పాటు 5 కాటేజీలు, 12 విడిషెడ్లు ఉన్నాయి.వివిధ విభాగాల అధికారులకు మొత్తం 146 గదులు కేటాయించగా, పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక బ్యారక్ నిర్మించారు.ఎలా బుక్ చేసుకోవాలంటే..www.onlinetdb.com ద్వారా ఆన్లైన్లో గదులు, ప్రసాదాలను (వాళిపాడు) బుక్ చేసుకోవచ్చు.దాంతోపాటు పూజకు సంబంధించి.. ఇలాంటి ఆఫర్లను కూడా బుక్ చేసుకోవచ్చు. అవేంటంటే..ఉదయాస్తమాన పూజపడి పూజసహస్రకలసంకలశాభిషేకంఉష పూజఉచ్ఛ పూజఅథాళ పూజనెయ్యాభిషేకంవీటిని వర్చువల్ క్యూ టికెట్ తోపాటు బుక్ చేసుకోవచ్చు.ముఖ్య గమనిక: 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బుకింగ్ అవసరం లేదు.దర్శన సమయాలుదర్శనం కోసం ఆలయం తెల్లవారుజామున 3:00 గంటలకు తెరుచుకుంటుంది.ఉచ్ఛ పూజ తర్వాత మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడుతుంది.మధ్యాహ్నం 3:00 గంటలకు తిరిగి తెరుచుకుంటుంది.రాత్రి 11:00 గంటలకు హరివరాసనం పారాయణంతో చివరి ముగింపు.ఈ ఆలయం రోజుకు 18 గంటలు దర్శనం కోసం తెరిచి ఉంటుంది.మధ్యాహ్నం 1 గంటలకు ఆలయం మూసివేసినప్పుడూ.. అలాగే రాత్రి మూసివేత తర్వాత కూడా..అప్పటికే క్యూలో ఉన్న యాత్రికులు 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. తర్వాత ఆలయం దర్శనం కోసం తిరిగి తెరిచినప్పుడు వారు ఉత్తర ద్వారం గుండా వెళ్ళవచ్చు. ఇది భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేశారు.యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన పథకాలు..గుండెపోటు ఉపశమన పథకంతీర్థయాత్ర సమయంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా మరణించే యాత్రికుల కుటుంబాలకు దాదాపు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వర్చువల్ క్యూ బుకింగ్లో రూ.5 రుసుము అదనంగా జోడించారు. అయితే ఈ చెల్లింపు తప్పనిసరి కాదు.కేరళ అంతటా బీమా కవరేజ్వర్చువల్ క్యూ ద్వారా బుక్ చేసుకునే యాత్రికులందరికీ ఎటువంటి ప్రీమియం లేకుండా రూ. 5 లక్షల ప్రమాద మరణ బీమా కవరేజ్ లభిస్తుంది.ఒక యాత్రికుడు మరణిస్తే :కేరళలో అంబులెన్స్ ఖర్చులు: రూ. 30,000 వరకుఇతర రాష్ట్రాలకు అంబులెన్స్ ఖర్చులు: రూ. 1,00,000 వరకు ఈ ఖర్చులను దేవస్వం బోర్డు భరిస్తుంది.నీలక్కల్ వద్ద పార్కింగ్ పంప నుంచి 23 కి.మీ దూరంలో ఉన్న నీలక్కల్ శబరిమల యాత్రికులకు ప్రధాన పార్కింగ్ హబ్. ఇక్కడ సుమారు 8,500 వాహనాలకు స్థలం ఉంది.పంపా వద్ద , హిల్స్ స్టాప్, చక్కుపాలెం వద్ద పరిమిత పార్కింగ్ అందుబాటులో ఉంది.ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపు వ్యవస్థనిలక్కల్ , చక్కుపాలెం, హిల్టాప్ వద్ద పార్కింగ్ ఫీజులను ఫాస్టాట్యాగ్ ద్వారా చెల్లించవచ్చు:బస్సులు: రూ. 100మినీ బస్సులు: రూ. 7514 సీట్ల వరకు వాహనాలు: రూ. 504 సీట్లు రూ. 30ఆటో - రిక్షాలు: రూ.15చివరగా శబరిమలలో వసతి రూ.80 నుంచి అదుబాటులో ఉంది. గది స్థాయిని బట్టి రూ.2,200 వరకు ఫీజు వసూలు చేస్తారు.గదులు బుక్ చేసుకోవాలను కునే యాత్రికులకు ఆన్లైన్ సేవల కోసం నమోదు చేసుకోవడానికి మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా అవసరం.గదిని ఆన్లైన్ బుకింగ్ సమయంలో మీరు అందించిన అదే ఫొటో సహా IDని తీసుకెళ్లాలి. అలాగే ఒక రోజులో గరిష్టంగా 20వేల మంది భక్తులకు రియల్ టైమ్ బుకింగ్ ద్వారా దర్శనం అవకాశం కల్పిస్తోంది ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఒకే సమయంలో ఎక్కువమంది వెబ్సైట్లో లాగిన్ అవ్వడం వల్ల ఒక్కోసారి సర్వర్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని, దీన్ని భక్తులందరు గమనించగలరు అంటూ..ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు విన్నవించింది. (చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..) -
లక్ష్మీదేవికి కమలం ఎందుకు ప్రీతికరం?
సిరిసంపదలకు అధిదేవత అయిన అమ్మవారిని వర్ణించే ప్రతి చిత్రంలోనూ లేదా విగ్రహంలోనూ కమలం తప్పక ఉంటుంది. ఆమె కమలంపై కూర్చుని ఉండటం చేతిలో కమలం ధరించి ఉండటం మనం చూస్తాం. దీని వెనుక పురాణ గాథలు, ఆధ్యాత్మిక కారణాలు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవి సముద్ర మథనం సమయంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించింది. ఆ సమయంలో ఆమె చేతిలో కమలంతో వచ్చింది. అందుకే ఆమెను ‘క్షీర సాగర కన్య’ అని, అలాగే కమలంతో ముడిపడి ఉంది కాబట్టి ‘పద్మ’ ‘కమల’ ‘పద్మప్రియ’ వంటి పేర్లతో పిలుస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే కమలం అనేది పరిశుభ్రతకు. వైరాగ్యానికి గొప్ప చిహ్నం. కమలం ఎల్లప్పుడూ బురద నీటిలో లేదా మురికి కొలనులో పెరుగుతుంది. కానీ ఆ బురదలోని ఒక్క అణువు కూడా కమలాన్ని అంటకుండా అది అత్యంత స్వచ్ఛంగా నిర్మలంగా వికసిస్తుంది. ఈ లక్షణమే కమలాన్ని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మార్చింది.ఇక్కడ దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే. సంపద, ధనం అనేది ‘బురద’ వంటి ఈ లోక వ్యవహారాల మధ్యే ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించే భక్తులు సంపదను పొందినప్పటికీ, ఆ ధనమదం లేదా లోక కష్టాల ప్రభావం తమపై పడకూడదు. కమలంలాగే, ఈ ప్రపంచంలో ఉన్నా, దానికి అంటకుండా పరిశుద్ధంగా, నిర్లిప్తంగా జీవించాలి. ధనాన్ని కేవలం జీవితానికి ఒక సాధనంగా మాత్రమే చూడాలి, దానిలో మునిగిపోకూడదు. కమలంపై కూర్చునే లక్ష్మీదేవి ‘‘నీ సంపదను ధర్మ మార్గంలో ఉంచు, దానిపై వ్యామోహం పెంచుకోకు’’ అని పరోక్షంగా చెబుతుంది. అందుకే ఆధ్యాత్మిక సంపద మరియు భౌతిక సంపద రెండింటికి చిహ్నంగా కమలం ఆమెతో నిరంతరం ఉంటుంది. (చదవండి: Kalabhairava Swamy Temple: నమోస్తు కాలభైరవా!) -
ఆత్మీయత.. అనురాగమే ఔషధంగా...వనభోజనాలు
అనుకూలమైన వనంలో బంధు మిత్రుల కలయిక... అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరో వైపు ఆహ్లాదకరమైన సామూహిక ఆనందం – కార్తీక మాసంలో వన సమారాధనలంటే మనకు గుర్తుకొచ్చేవి ఇవే. అయితే ఈ వన భోజనాల వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక కోణం దాగి ఉంది. బయటకు చాలా సరదాగా కనిపిస్తునే, లోపల చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందించే ఈ పిక్నిక్ యొక్క పరమార్థమేమిటో శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల నుంచి తెలుసుకోవచ్చును.మన ప్రాచీన భారత దేశంలో ఋషులు, మునులు ఏర్పాటు చేసిన సంప్రదాయాలు అన్నీ మన సూక్ష్మ శరీరంలో కుండలినీ శక్తి జాగృతి కోసం, చక్ర నాడుల శుద్ధి కోసం ఉద్దేశించి చేసినవే. నైమిశారణ్యంలో సూత మహాముని తన తోటి మునులందరితో కలిసి ఉసిరి చెట్టు క్రింద వన భోజనాలు చేసినట్లుగా పురాణాలలో ఉంది.అంతే కాకుండా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు కూడా గోపాలురతో కలిసి వనభోజనాలు చేసినట్లుగా మన పురాణాలలో ఉంది. దేవతల ఆరాధన కన్నా మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆనందిస్తూ, గౌరవిస్తూ ఆరాధించడం ముఖ్యమని చె΄్పారు. గోవర్ధన గిరిని పైకి ఎత్తి ఈ ప్రకృతి మనకు ఏ విధంగా గొడుగులా రక్షణగా నిలుస్తుందో చూపించారు. ఈ గోవర్ధన పూజ పర్వదినం కూడా కార్తీక మాసంలోనే శుక్ల పక్ష పాడ్యమి నాడు వస్తుంది. మన చుట్టూ ఉండే ప్రకృతిని, గోవులను శ్రీ కృష్ణ భక్తులందరూ గౌరవించి, పూజలు చేస్తారు. అదే గౌరవ భావాన్ని మన దైనందిన జీవితంలో ప్రతి నిత్యం ప్రకృతి పట్ల మనం కలిగి ఉండాలి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారు. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవని వంటిది. ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా కాస్తాయి. ’సి’ విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరిని రోజూ ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇది మన జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది. ఉసిరిలో ఆరు రుచులలో ఒక్క లవణం (ఉప్పు) తప్ప మిగలిన ఐదు రుచులూ ఉంటాయి. అంటే మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కషాయం(వగరు), కటువు(కారం), తిక్తం(చేదు) ఈ ఐదు రుచుల సంగమం. ముఖ్యంగా ఉసిరిలో ఆమ్ల గుణం అంటే పులుపు ఎక్కువగా కనిపిస్తుంది.. కనుక దీనిని ఆమ్లా లేదా ఆమలకము అని పిలుస్తారు కూడా. కార్తీక మాసంలోనే ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆరోగ్య రహస్యం దాగి ఉందని తెలుస్తోంది. ఈ నెల నుంచి శీతాకాలం మొదలు అవుతుంది. దీంతో రుతు సంబంధ వ్యాధుల తోపాటు దగ్గు, జలుబు వంటివి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ నెలలో ఉసిరిని తినడం.. లేదా ఉసిరి చెట్టు నీడన ఉండడం వలన ఈ దోషాలు నివారింపబడతాయి. సకల మానవాళిని రక్షిస్తుందని.. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చరక సంహిత పేర్కొంది. మానవ శరీరం పంచ భూతాలైన భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని అనే ఐదు మూలకాలతో తయారవుతుంది. ఈ పంచ భూతాల తత్త్వాల తోనే మన సూక్ష్మ శరీరంలో ఆరు చక్రాలు రూపొందాయి. ఉదాహరణకు మన సూక్ష్మ శరీరంలో మొదటి శక్తి కేంద్రమైన మూలాధార చక్రం భూతత్త్వంతో ఏర్పడుతుంది. ఈ శక్తి కేంద్రంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, మనం భూమి మీద కూర్చొని, రెండు చేతులూ భూమి మీద పెట్టి సహజ యోగ పద్ధతిలో ధ్యానం చేస్తే, ఆ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఆ విధంగా పంచ భూతాత్మకమైన ఈ ప్రకృతి మానవుల సూక్ష్మ శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలను చైతన్య పరిచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. వన భోజనాల ద్వారా సమకూరే మరో ప్రయోజనం సహజ యోగులలో సామూహిక జీవనం మరింతగా బలపడుతుంది.మానవుడు సంఘజీవి. సామూహికంగా అందరూ కలిసి జరుపుకునే పిక్నిక్ ల వలన సహజ యోగుల మధ్య అభి్ర΄ాయ భేదాలు, మనస్పర్థలు ఏమైనా ఉంటే తొలగిపోయి, సామరస్యం ఏర్పడుతుంది. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరూ కలిసి సహకరించుకోవడం వలన మనుష్యుల మధ్య ప్రేమ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అహంకార, ప్రత్యహంకారాలు కరిగి΄ోయి హృదయం విశాలమవుతుంది. అటువంటి వాతావరణం పెరుగుతున్న పిల్లల మీద సానుకూల ప్రభావాన్ని చూపించి, వారిలో సానుకూల దృక్పథం ఏర్పడేటట్లు చేస్తుంది. మన విశుద్ధి చక్రం ఆకాశ తత్త్వాన్ని కలిగి ఉంటుంది. వన భోజనాల వంటి సామూహిక కార్యక్రమాలలో ΄ాలుపంచుకొన్నప్పుడు, మన విశుద్ధి చక్రం అభివృద్ధి చెంది చక్కటి సంభాషణా చాతుర్యం అలవడి అందరితో సత్సంబంధాలను పెంపొందించుకొనగలుగుతాం. మన లోపల గల షట్చక్రాలు సహజమైన ప్రకృతిలో లభించే పంచ భూతాల తత్త్వాలతో చాలా వేగంగా స్పందిస్తాయి. కాబట్టి కనీసం ఏడాదికి ఒకసారి ఇలా కార్తీక మాసంలో వన భోజనాల ద్వారా అయినా ప్రకృతి ఒడిలో అందరూ మమేకమై, ధ్యానంతో, భజనలతో ఆట పాటలతో హాయిగా సేద తీరితే, సహజకుటుంబాల సామూహికత మరింత బలోపేతం అవుతుందని ఆశిద్దాం. – డా. పి. రాకేశ్(మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాలు, ప్రవచనాల ఆధారంగా) (చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..) -
ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్
మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం రాత్రి ఈ నియామకం ఖరారయ్యింది. కేరళలోని సీపీఎం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో తుది రౌండ్లో ఐదు పేర్టను షార్ట్లిస్ట్ చేశారు. వారిలో జయకుమార్కు అగ్రప్రాధ్యానత్య లభించింది. దేవస్వం మంత్రి విఎన్ వాసనవన్ పతనం తిట్ట నుంచి సతీషన్ను సిఫార్సు చేయగా, పార్టీ ముఖ్యమంత్రి ఎంపికనే ఫైనల్ చేయాలని నిర్ణయించింది. దాంతో మాజీ ఐఏఎస్ అధికారి నియామకానికి మార్గం సుగమం అయ్యింది. ఇలా టీడీపీ చీఫ్ సెక్రటరీగా, వైస్ ఛాన్సలర్గా, ప్రత్యేక కమిషనర్గా, అలాగే శబరిమల మాస్టర్ ప్లాన్ చైర్మన్గా పనిచేసిన ఒక పరిపాలనాధికారి(ఐఏఎస్ అధికారి) ఇలా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకి అధ్యుకుడిగా బాధ్యతలు స్వీకరించడం టీడీబీ చరిత్రలోనే తొలిసారి. ఈ మేరకు మాజీ ఐఏఎస్ అధికారి జయకుమార్ మాట్లాడుతూ..శబరిమలలో తనకున్న పూర్వ అనుభవాన్ని చెబుతూ..శబరిమల పనితీరు తనకు బాగా తెలుసని చెప్పారు. భక్తులు సంతృప్తికరంగా ఆలయాన్ని సందర్మించేలా చూస్తానని అన్నారు. అలాగే రాజకీయ జోక్యం లేకుండా దేవస్వం బోర్డు వ్వవస్థ మొత్తాన్ని పునరవ్యవస్థీకరించి శబరిమల, టీడీపీపై ప్రతి అయ్యప్ప భక్తుడికి నమ్మకం, విశ్వాసం కలిగేలా గట్టి చర్యలు తీసుకుంటానని నమ్మకంగా చెప్పారు.(చదవండి: Pulmedu Sabarimala forest path: శబరిమలకు వెళ్లే.. ఈ రూటు ఎన్నో విశిష్టతలకు ఆలవాలం..!) -
‘వందేమాతరం’ ఒక మంత్రం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ‘వందేమాతరం’ గీతం 150 ఏళ్ల స్మారకోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శుక్రవారం) న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఒక స్మారక స్టాంపు, నాణేన్ని విడుదల చేశారు. అలాగే దేశ పౌరులు జాతీయ గీతాన్ని ఆలపించి, సంబంధిత వీడియోలను అప్లోడ్ చేసి సర్టిఫికెట్ పొందే అవకాశాన్ని కూడా ప్రకటించారు. వీటితో పాటు ‘vandemataram150.in’ అనే పోర్టల్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వందేమాతరం ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం అని అన్నారు. దీనిని భారతమాతకు నివేదించే భక్తి, ఆరాధనగా పేర్కొన్నారు.తన ప్రసంగంలో ప్రధాని మోదీ వందేమాతర గీతం గొప్పదనాన్ని వివరిస్తూ.. ఇది మనకు ఘన చరిత్రను గుర్తు చేస్తుందని, వర్తమానాన్ని ఆత్మవిశ్వాసంతో నింపుతుందని, బంగారు భవిష్యత్తు కోసం ధైర్యాన్ని అందిస్తుందని అన్నారు. వందేమాతరం సామూహికంగా పాడటం అనేది భావ వ్యక్తీకరణకు మించిన అనుభూతి అని, ఇది హృదయాన్ని కదిలిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ ఈ పాట ద్వారా స్వతంత్ర, ఐక్య, సంపన్న భారతదేశం కోసం స్పష్టమైన పిలుపునిచ్చారని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పర్వతమే పరమేశ్వరుడు..!
కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం... ఈ అయిదు లింగాలను పంచ భూత మహాలింగాలు అని అంటారు. ఈ అయిదు క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవటం మంచిదని చాలా మంది అలా దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోనే ఈ ఆలయాలు ఉండటం గమనించదగిన విషయం. వరుసక్రమంలోనే కాకుండా దూరం రీత్యా కూడా అరుణాచలం మధ్యలో నిలుస్తుంది.పంచభూత మహాలింగాల్లో మూడవది అరుణాచలం క్షేత్రం. దీనినే తమిళనాడులో తిరువణ్ణామలై క్షేత్రంగా కూడా పిలుస్తారు. స్వామి వారు అరుణాచలేశ్వరుడు కాగా అమ్మవారు అపిత కుచలాంబా దేవి. సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని స్వామివారే చె΄్పారట. అద్భుత శిల్పకళతో అలరారే ఈ ఆలయాన్ని సాక్షాత్తూ దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజులు పల్లవులు, విజయనగర సార్వభౌములు ఇక్కడ ఆలయాలను ఎంతగానో అభివృద్ధి పరిచారు. ఇరవై అయిదు ఎకరాల్లో నిర్మిత మైన ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది. నాలుగు దిక్కుల్లో ఎత్తయిన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం పదకొండు అంతస్తుల్లో అలరారుతుంది. ఆరు ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో, విశాలమైన ప్రాంగణంతో ఉండే ఈ ఆలయానికి నిత్యం దేశమంతటి నుంచి భక్తులు వస్తూ ఉంటారు.ఇక్కడి వెయ్యి స్తంభాల మండపానికి సమీపంలో శివ గంగ తీర్థం ఉంది. అక్కడే రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. అరుణాచలం క్షేత్రం అంటే రమణ మహర్షిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఆయన్ని సుబ్రహ్మణ్యస్వామి మరో అవతారంగా భక్తులు చెబుతారు. ఇక్కడ దేవాలయానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అరుణగిరి (పర్వతం) కు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది. ’అ–రుణాచలం’ అనే పదానికి ఐహిక బంధాలను తొలగించే పర్వతం అని అర్థం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపమైన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జీవితం పరిపూర్ణమవుతుందని నమ్మకం. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్ని లింగమని, అందుకే ఆలయంలో వేడిగా వుంటుందని అంటారు.ఆలయ విశేషాలుతిరువణ్ణామలైలోని అణ్ణామలయ్యార్ (శివుడు) ఆలయం 24 ఎకరాల స్ధలంలో విస్తరించి వుంది. నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాలపరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు వున్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి.ఈ గోపురాలలో తూర్పువైపున వున్నదానిని రాజ గోపురమంటారు. ఇదే ప్రధాన ద్వారం. నేలమట్టంమీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి, దీర్ఘచతురస్రాకారంలో వున్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఇక్కడ తంజావూరు బహదీశ్వరాలయానికన్నా ఎత్తయిన గోపురం నిర్మించాలని, దానికన్నా ఒక అడుగు ఎత్తుగా, అంటే 217 అడుగుల ఎత్తయిన గోపురాన్ని నిర్మించారు. బయటి ప్రాకారానికి వున్న మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో వున్నాయి. 70 అడుగుల ఎత్తులో వున్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు వున్నాయి.ఎలా వెళ్ళాలంటే..?కాట్పాడి, చెన్నై మొదలగు తమిళనాడులోని అనేక ప్రదేశాలనుంచేగాక చిత్తూరు, తిరుపతి నుంచికూడా బస్సులున్నాయి. చెన్నై నుంచి 185 కి.మి. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై లోని కోయంబేడు (సి.యమ్.బి.టి.) బస్సు స్టాండ్ నుంచి అరుణాచలం చేరటానికి 4–5 గంటల సమయం పడుతుంది.గిరి ప్రదక్షిణఇక్కడ గిరి ప్రదక్షిణ విశేషం. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని, దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అణ్ణామలై వగైరా అనేక ఆలయాలేగాక, సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటివార్ల ఆశ్రమాలుకూడా దర్శనీయాలు. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు. రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు. ఇప్పటికీ అనేకమంది సిద్ధపురుషులూ, యోగి పుంగవులూ అదృశ్యరూపం లో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, రోడ్డుకి కుడివైపు వెళ్తే వారికడ్డవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలుగల ఈ ఆలయాన్ని దర్శించినవారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. ఇంత అద్భుతమైన ఈ ఆలయం విల్లుపురం – కాట్పాడి రైలు మార్గంలో, చెన్నైకి సుమారు 180 కి.మీ.ల దూరంలో వుంది. (చదవండి: Kashi Manikarnika Ghat Mystery: కాశీలో అంత్యక్రియల సమయంలో బూడిదపై 94 ఎందుకు రాస్తారు..? దాగున్న ఆధ్యాత్మిక రహస్యం) -
దేవుడు ఎలా ఉంటాడో తెలుసా..?
ఒకసారి బాగ్దాదు నగరంలో గొప్ప ధార్మిక సభ జరుగుతోంది. వేలాది మంది ప్రజలు ఆ సభలో పాల్గొన్నారు. అనేకమంది పండితులు ప్రజలను ఉద్దేశించి ప్రవచనం చేస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి సభలోకి ప్రవేశించి, పండితులకు ఒక సవాలు విసిరాడు. ‘మీరు చెబుతున్న ప్రకారం, ఈ సృష్టి మొత్తానికి ఒక కర్త ఉన్నాడు. అయన అల్లాహ్, అంటే సృష్టికర్త. మరి ఆయనే సమస్తాన్ని సృష్టించినప్పుడు ‘ఆయన్ని’ ఎవరు సృష్టించారు? ఆయనకు ముందు ఎవరున్నారు?’అని ప్రశ్నించాడు.సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పండితులు అతని ప్రశ్నకు సమాధానం చె΄్పారు. కాని అతను సంతృప్తి చెందలేదు. పండితులు తల పట్టుకున్నారు. అతనికి అర్ధమయ్యేలా సంతృప్తికరమైన సమాధానం ఎలా చె΄్పాలో వారికి అర్థం కాలేదు. ఆ వ్యక్తి గర్వంగా సభికుల వైపు చూశాడు. అంతలో సభికుల్లోంచి ఓ పదకొండేళ్ళ బాలుడు సమాధానం చెబుతానని ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి బాలుణ్ణి చూసి,‘నువ్వు సమాధానం చెబుతావా?’ అంటూ వెటకారంగా నవ్వాడు.ఆ బాలుడు ఏమాత్రం తొణక్కుండా, ‘అవును నేనే.. మీప్రశ్న మరోసారి వినిపించండి’ అన్నాడు. ‘అన్నిటికీ అల్లాయే అంటున్నారు గదా.. మరి అల్లా‹ß కు ముందు ఎవరున్నారు? ’ అని ప్రశ్నించాడు. అప్పుడా బాలుడు, ‘మీకు ఒకటి, రెండు ఒంట్లు వచ్చుగదా..? ఒకటి నుండి పది వరకు లెక్కించండి’. అన్నాడు.‘ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇదేమి పిచ్చి ప్రశ్న’ అంటూనే ఒకటి నుండి పది వరకు లెక్కించాడు. ‘పది తరువాత..?’ అన్నాడా బాలుడు. ‘పదకొండు..పన్నెండు..’ఇలా ఎంతవరకైనా వెళ్ళవచ్చు.’ అన్నాడా వ్యక్తి. ‘అవును కదా..! అలాగే పది నుండి వెనక్కి లెక్కించండి. ’అన్నాడా బాలుడు. ‘పది..తొమ్మిది..ఎనిమిది..ఇలా .. ఒకటి వరకు వచ్చి ఆగి ΄పొయ్యాడు.‘తరువాత..? లెక్కించండి..’ అన్నాడు బాలుడు. ‘తరువాత ఇంకేముంటుంది. ఏమీలేదు.. సున్నా.. శూన్యం.’ అన్నాడా వ్యక్తి. ‘..కదా..? అల్లాహ్కు ముందు కూడా ఏమీ లేదు.. అంతా శూన్యం. అన్నిటికీ కర్త ఆయనే..’అన్నాడు బాలుడు. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రశ్నించిన వ్యక్తి ముఖం వాడిపోయింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఘనంగా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట
కోకాపేటలోని ఏఎస్బీఎల్ స్పైర్లో శ్రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన కుంభాభిషేకం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక అక్టోబర్ 31, 2025 శుక్రవారం ఉదయం 10:26 గంటలకు పూర్తి భక్తి శ్రద్దలతో, ఆగమ శాస్త్ర నియమాలు, తెన్నాచార్య సంప్రదాయానికి అనుగుణంగా జరిగాయి.ASBL స్పైర్ లోపల కొత్తగా నిర్మించిన ఆలయం భక్తి, సాంస్కృతిక కొనసాగింపుకు చిహ్నంగా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. సాంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిలో రూపొందించిన ఈ ఆలయ గర్భగుడి దైవిక కృప, ప్రశాంతతను వెదజల్లుతుంది.ఈ సందర్భంగా ASBL గ్రూప్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ, “ ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు భక్తులందర్నీ దగ్గర చేస్తాయని, ఆధునిక జీవనానికి అర్థాన్ని జోడిస్తాయని మేము విశ్వసిస్తున్నాం. మా భవిష్యత్ ప్రాజెక్టులన్నింటిలో ఈ తరహా పవిత్ర స్థలాలను సృష్టించాలని, విశ్వాసం, శాంతి, సామరస్యాన్ని సమిష్టి వేడుకగా జరుపుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము”అని అన్నారు.ఈ వేడుకకు అనేక మంది భక్తులు, నివాసితులు, ASBL కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యాగాలు, హోమాలను నిర్వహించారు. గోవింద, హరే కృష్ణ మంత్రాలతో ప్రాంగణం మొత్తం ప్రతిధ్వనించింది.(చదవండి: యాత్రికులు, నివాసితుల సౌకర్యార్థం రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి) -
భీష్మ పంచుక నాలుగురోజులే : అపురూప దర్శనం
భువనేశ్వర్: మహా పవిత్ర కార్తిక మాసం(karthika Masam 2025) చిట్ట చివరి 5 రోజులను మహా కార్తిక పంచుకగా వ్యవహరిస్తారు. కార్తిక మాసం నెల పొడవునా ఉపవాసం, ప్రత్యేక పూజలతో ప్రాప్తించే పుణ్యం కంటే పంచుక ఉపవాసం ప్రాప్తించే పుణ్య ఫలం అత్యంత మోక్షదాయకమని విశ్వసిస్తారు. దీన్ని భీష్మ పంచుక అని కూడా అంటారు. ఒడిశాలోని పూరీలోని జగన్నాథ స్వామి దేవాలయంలో ఈసారి పంచుక 5 రోజులకు బదులు 4 రోజులకు పరిమితం అయింది. పంచాంగం గణాంకాల ప్రకారం కార్తిక శుక్ల ద్వాదశి క్షీణతతో ఈ పరిస్థితి నెలకొంది. పంచుక సందర్భంగా శ్రీ మందిరం రత్న వేదికపై సోదర సోదరీ సమేత శ్రీ జగన్నాథ స్వామి రోజుకో అలంకరణలో శోభిల్లుతాడు. ఈ అలంకారాల్లో మూల విరాటులను దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. శ్రీ మందిరం పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. రద్దీ నియంత్రణ కోసం దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహా లఘు దర్శనం భక్తులకు వెలుపలి గడప (బహారొ కఠొ) నుండి రత్న వేదికపై మూల విరాట్ల దర్శనం ఏర్పాటు చేశారు. కార్తిక పూర్ణిమ రోజున ప్రథమ భోగ మండప సేవ ముగిసే వరకు ఈ కట్టడి నిరవధికంగా కొనసాగుతుంది. ఆ తర్వాత లోపలి గోడలపై నుంచి దర్శనం కల్పిస్తారు. సింహ ద్వారం గుండా ప్రవేశం భక్తులు సింహ ద్వారం గుండా ప్రవేశించి మిగిలిన మూడు ద్వారాల గుండా బయటకు రావాల్సి ఉంది. సేవకులు అన్ని ద్వారాల గుండా రాకపోకలు చేస్తారు. యాత్రికులతో ఆలయం లోనికి ప్రవేశించే యాత్రీ పండాలను మాత్రం అనుమతించరు. శ్రీ మందిరం లోపలి ప్రాంగణంలో మరియు బగేడియా ధర్మశాల సమీపంలో రాత్రింబవళ్లు సేవలు అందించే ఆరోగ్య కేంద్రం తెరిచారు. ఆలయం సమీపంలో రాత్రింబవళ్లు 2 అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి. వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు రద్దీ నియంత్రణ కార్యకలాపాల కోసం 32 ప్లాటూన్ల బలగాలను మోహరించినట్లు డీఐజీ డాక్టర్ సత్యజిత్ నాయక్ తెలిపారు. పంచుక ముగిసేంత వరకు ఈ నెల 5వ తేదీ వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. పంచుక తొలి రోజు పురస్కరించుకుని ఆది వారం భద్రతా ఏర్పాట్లుని ప్రత్యక్షంగా సందర్శించి సమీక్షించారు. ఇదీ చదవండి: నో ఫోటో షూట్, నో హగ్స్ : వరుడి10 డిమాండ్లు, నెట్టింట చర్చ -
ధ్రువ చరిత్ర
నిబద్ధత వ్యక్తి జీవితాన్ని విజయపథంలో నడిపిస్తుందనడానికి మహాభాగవతంలోని ధ్రువ చరిత్ర మంచి ఉదాహరణ. ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు (Dhruvudu) ఒకరోజు తన తండ్రి ఒడిలో కూర్చొని వుండగా, సవతి తల్లి సురుచి అతన్ని వారించి, నీకా అర్హత లేదు. నువ్వు విష్ణుభగవానుని ప్రసన్నం చేసుకోగలిగితే, అప్పుడు మాత్రమే నీతండ్రి ఒడిలో కూర్చోవడానికి అర్హుడవౌతావు అని అనడంతో ధ్రువుడు అవమానంగా భావించి, యీ మాటలను సవాలుగా స్వీకరించాడు. అప్పుడు ధ్రువుని వయసు ఐదు సంవత్సరాలే. కాని సవతి తల్లి మాటలు ధ్రువునికి తీవ్ర మనస్తాపాన్ని కలుగజేసాయి. విష్ణుని ప్రసన్నం చేసుకోవాలనే బలమైన కోరిక ధ్రువుని మనసులో స్థిరపడింది. ధ్రువుడు రాజ్యాన్ని వదలి అడవికి పోయాడు. నారదుడు ధ్రువుని ఇంటికి రప్పించే ప్రయత్నం చేశాడు గాని ‘నేను విష్ణువుని దర్శించే వరకు యింటికి రాను’ అన్న ధ్రువుని సమాధానంతో నారదుడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మంత్రాన్ని ధ్రువునికి ఉపదేశించాడు.ధ్రువుడు అనేక సంవత్సరాలు ఆహారం, నిద్ర, చలనం లేకుండా ఘోర తపస్సు చేశాడు. కనీసం శ్వాస కూడా తీసుకోకుండా తపస్సు చేశాడు. అతని తపశ్శక్తి ముందు విశ్వశక్తి బలహీనపడింది. దేవతలంతా విష్ణువుని దర్శించి,‘స్వామీ జగద్రక్షకా ఆ బాలుని తపోశక్తి ముందు విశ్వమే తలవంచవలసి వస్తుంది. కనుక అతనికి మీ దర్శనభాగ్యం కలిగించమని మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ధ్రువునికి తన దర్శన భాగ్యం కలిగించాడు. ధ్రువుడు అమితానంద భరితుడై విష్ణువుని కీర్తించాలనుకున్నాడు కాని నోట మాటరాలేదు. అపుడు విష్ణుమూర్తి తన శంఖంతో ధ్రువుని నుదురు స్పృశించగానే దైవశక్తి దవునిలో ప్రవేశించింది. అప్పుడు దవుడు విష్ణుమూర్తిని కీర్తించగా, విష్ణుమూర్తి ‘‘ధ్రువా! నీవు ఈ భూమండలాన్ని వేల సంవత్సరాలు పాలిస్తావు. అంతేగాకుండా నువ్వు అమరుడవై ధ్రువనక్షత్రంగా వెలుగుతావు, అందరికీ మార్గదర్శక మౌతావు’’ అని ఆశీర్వదించాడు.ధ్రువుడు సత్యాన్వేషణ లో బాధని అవకాశంగా మార్చుకోవడం వల్ల, కోరిక భవిష్యత్ దర్శినిగా మారింది. కష్టాలకోర్చి అడవిలో చేసిన తపస్సు, విజయానికి అంతః క్రమశిక్షణ అవసరమని నిరూపించింది. ధ్రువుడు లౌకిక విజయం (తండ్రి ఒడిలో కూర్చోవడం) కోసం ప్రయత్నిస్తే దైవానుగ్రహంతో అమరత్వాన్ని పొందాడు. గురువు (నారదుడు) చూపిన మార్గాన్ని విడిచిపెట్టకపోవడం విపత్తునెదుర్కొనే శక్తినిచ్చింది. విజయం నిబద్ధత తో కూడిన స్థిర చిత్తం నుంచి పుడుతుందని ధ్రువ చరిత్ర మానవాళికి సందేశం మిస్తుంది.– డా. విశ్వేశ్వర వర్మ భూపతిరాజు -
స్వర్గం, నరకం అంతా మన లోపలే!
ఒకానొకసారి, ఓ బలవంతుడైన వస్తాదు జ్ఞానం, ప్రశాంతతకు పేరుగాంచిన బౌద్ధ గురువు వద్దకు వచ్చాడు. ఆ వస్తాదు అంటే అందరికీ భయమే. అతని హృదయం కోపంతో గందరగోళంగా ఉండేది. చేస్తున్న పనుల పట్ల చిరాకూ పరాకూ పడుతుంటేవాడు. అతను సన్యాసి వద్దకు వచ్చీ రావడంతోనే తలవంచి నప్పటికీ అహంకారంతో అడిగాడు: ‘గురువుగారూ! నాకు స్వర్గం, నరకం గురించి బోధించాలి’. సన్యాసి అతని వైపు చూసి చిన్నగా నవ్వి, ‘నీకు వాటి గురించి చెప్పాలా? నీ మాటలో గర్వం కనిపిస్తోంది. నేను విడమరిచి చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు’ అన్నారు. ఆ మాటతో వస్తాదు కోపంతో ఊగిపోతూ, తన దగ్గరున్న కత్తిని తీసి ‘మీరన్న మాట నన్ను అవమానపరిచింది. నేను ఇప్పుడే మిమ్మల్ని చంపగలను’ అని అరిచాడు. సన్యాసి ఏమాత్రం కంగారు పడలేదు. అతని కళ్ళలోకి చూసి ప్రశాంతంగా చూస్తూ, ‘ఇదిగో ఈ నీ చర్యే నరకం’ అని చెప్పారు. వస్తాదు స్తంభించిపోయాడు. అతని కోపం కరిగిపోయింది. సిగ్గుపడ్డాడు. తన కత్తిని పక్కనపెట్టి సన్యాసి ముందు మోకరిల్లి, ‘క్షమించండి... నాకు వాస్తవాన్ని చిన్న మాటతో నేర్పించినందుకు ధన్యవాదాలు’ అని మృదువుగా అన్నాడు. సన్యాసి సున్నితంగా నవ్వి, ‘ఇదిగో ఇదే నువ్వడిగిన స్వర్గం’ అన్నారు. ఈ చిరుఘటన ధ్యానం సారాంశాన్ని చెబుతోంది. ధ్యానం జీవితం నుండి తప్పించుకోవడం గురించినది కాదు, అది మన అంతర్గత ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడం గురించి చెప్పేది. ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు, భావోద్వేగాలు సముద్రంలో అలల వలె పైకి ఎగరడం, కింద పడటం అనుభవంలోకి రావడం గమనిస్తాం. అప్పుడు ఆందోళనపడటం మానేసి, దాని కింద ఉన్న ప్రశాంతతను చూస్తాం. అందుకే బుద్ధుడంటాడు: ‘శాంతి లోపలినుండి వస్తుంది. బయట దానిని వెతక్కండి’ అని! -యామిజాల జగదీశ్ -
ప్రమథ గణాలు, వారిలో ముఖ్యులు ఎవరంటే..?
ప్రమథ గణాలంటే శివపరివారం లేదా శివుని సేన. ప్రమథ అంటే బాగా మథించగలిగే వారని అర్థం. వీరు దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులు. ప్రమధ గణాలు కోట్లకొలది ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్రగణాలుగా ఉండి పోతారని ప్రతీతి. అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులువీరభద్రుడు: సాక్షాత్ శివస్వరుపం. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.ఆది వృషభం: ధర్మదేవత. శివున్ని మోయ గలిగే వరం పొంది, అతని సమీపం లో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. నందీశ్వరుడు: శివునికి ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితేనే శివదర్శనం! భృంగి: శివుని పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని ఖ్యాతిగాంచాడు. స్కందుడు: కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. క΄ాల హస్తుడు. కాశీ పురాధీశుడు.రిటి: ఉద్దాలకుని పుత్రుడు. శివకప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.బాణుడు: శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన శ్రీ కృష్ణునితో యుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.చండీశుడు: ఒక గోప బాలుడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు. ఇలా శివగణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. -
అవరోధాలనే అవకాశాలుగా..!
మానవ జీవిత గమనంలో గమ్యం చేరుకునే దారిలో అవరోధాలు ఏర్పడటం సహజం. సష్టిలో ఏ ఇద్దరికీ జీవనప్రయాణం ఒకేలా సాగదు. ఏకోదరులకు కూడా ఒకేరకంగా జీవనప్రయాణం ఉండదు. భౌతిక ప్రపంచంలో కష్టాలు మనుషుల్ని బలహీన పరుస్తాయి. కానీ, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ప్రతి అవరోధమూ మన సహనం, విశ్వాసం, అంతర్గతశక్తిని పరీక్షించడానికి దైవం కల్పించిన గొప్ప అవకాశం. పురాణ ఇతిహాసాలు ఈ సత్యాన్ని నిరూపించాయి. రామాయణంలో అయోధ్యకాండను పరిశీలిస్తే పట్టాభిషేకానికి సిద్ధమైన శ్రీరాముడు, కైకేయికి తండ్రి దశరథమహారాజు ఇచ్చిన వరాల కారణంగా అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. పదునాలుగేండ్లు వనవాసం చేయాల్సి వచ్చింది. అది శ్రీరాముని జీవితంలో పెద్ద అవరోధం. కానీ స్థితప్రజ్ఞత కలిగిన రాముడు దీనినొక అవకాశంగా చేసుకున్నాడు. ధర్మాన్ని కాపాడటం తన కర్తవ్యంగా భావించాడు. పితృవాక్య పరి΄ాలకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అరణ్యంలోనూ రాముని జీవనం సజావుగా సాగలేదు. సీతాపహరణం తీవ్ర అవరోధంగా పరిణమించింది. అయితే ఈ అవరోధమే కోదండరామునికి కొత్త సహచరులను పరిచయం చేసింది. వానర, సుగ్రీవ, హనుమ వంటి వీరులతో మైత్రి ఏర్పరిచింది. రావణసంహారం గావించాడు. అసుర చెరనుండి అయోనిజ ని విడిపించాడు. పురుషోత్తమ రాముడయ్యాడు.సుందరకాండను పరిశీలిస్తే సీతమ్మ జాడకై వెళ్లిన పవనసుతునికి లంకలో అవమానం ఎదురైంది. అసురులు తన తోకకు నిప్పంటించారు. ఈ అవరోధాన్ని ఆంజనేయుడు అవకాశంగా మార్చుకున్నాడు. శత్రుశక్తిని ఆయుధంగా మలిచాడు. మండుతున్న తోకతో మొత్తం లంకానగరాన్ని దహనం చేసాడు. అటు మహాభారతంలో ద్యూతక్రీడలో కౌరవులపై ఓటమి చెందిన పాండవులు అరణ్యవాసం, ఆపై అజ్ఞాతవాసం అనుభవించాల్సి వచ్చింది. ఈ అవరోధనా కాలాన్ని, పాండవులు అవకాశంగా మరల్చుకున్నారు. వారు నేర్చుకున్న విద్యలనూ, అభ్యసించిన శాస్త్రాలనూ, ఆయుధవిద్యలో ప్రావీణ్యం సంపాదించుకునే దిశలో వినియోగించుకున్నారు. తమ వీరత్వాన్ని చాటారు.భాగవతంలో ప్రహ్లాదుడు ఎదుర్కొన్న అవరోధం అసాధారణం. తండ్రి హిరణ్యకశిపుడే శత్రువుగా మారాడు. నిప్పులో వేయించడం, ఏనుగులతో తొక్కించడం, కొండపైనుండి తోయించడం వంటివి అవరోధాలు. కానీ ప్రహ్లాదుడు ఈ అవరోధాలన్నింటినీ తన భక్తిని మరింత దృఢం చేసుకునే అవకాశంగా మార్చుకున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా అతని మనస్సు ఆ పరమాత్మ స్మరణ నుండి తొలగలేదు. అంతిమంగా ఆ పీడనమే నృసింహ అవతార రూపంలో భగవంతుని సాక్షాత్కారానికి దారితీసింది. ఇక్కడ అవరోధం ప్రహ్లాదునికి మోక్ష సాధన మార్గమైంది.ధ్రువుడు చిన్న వయసులోనే సవతి తల్లి చేతిలో తీవ్ర అవమానాన్ని చవి చూశాడు. ఈ చేదు అనుభవం అతనికి అవరోధం. ఈ అవరోధమే అతణ్ణి మహా భక్తునిగా మార్చింది. నారద మహర్షి మార్గ దర్శకత్వంలో ధ్రువుడు కఠిన తపస్సు చేశాడు. చివరికి మహా విష్ణువు ప్రత్యక్షమై ధ్రువుని అచంచల భక్తిని సదా జ్వలించే ధ్రువ నక్షత్రంగా స్థాపించాడు. అవమానం అనే అవరోధం విశ్వనక్షత్రమనే అవకాశం గా మారింది.పురాణాలన్నీ బోధించేది ఒక్కటే. జీవితంలో ఎదురయ్యే ప్రతీ అవరోధమూ మన ఆత్మశక్తిని, భగవంతునిపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి దొరికిన అవకాశం. కష్టాలు, సవాళ్లు అనేవి మనల్ని దిగజార్చడానికి కాక మన అంతరంగం లో నిగూఢమై ఉన్న దైవత్వాన్ని వెలికితీయడానికి, మనల్ని ఉన్నత ఆధ్యాత్మికస్థితికి చేర్చడానికి తోడ్పడతాయి. కాబట్టి అవరోధాలను చూసి భయపడకుండా దానిని ఒక ఆశీర్వాదంగా భావించి ధైర్యంతో, విశ్వాసంతో ముందడుగు వేయడమే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక వికాసం ఉన్నచోట ఆటంకం కూడా అవకాశంగా కొత్తరూపు ఏర్పడుతుంది. అదే విజయానికి పునాది అవుతుంది.ఓటమి విజయానికి గెలుపు అనుకుంటే అవరోధమేమే అవకాశానికి తలుపు అవుతుంది.ఆధ్యాత్మిక సాధనతోనే ఇది సాధ్యమవుతుంది. – కె.వి.లక్ష్మణరావు (చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై.) -
కార్తీక దీపానికి భక్తకోటి కాంతులు
అవి ప్రతి యేటా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు... సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులూ కాదు తరతరాలుగా చేసుకునే పండుగలో పర్వదినాలో కాదు అలాగని అది మునుపెన్నడూ చేయని క్రతువు కాదు. వేదాలు.. పురాణేతిహాసాలు అందించిన ఒక చిన్న వెలుగుకు కోటికాంతులు అద్దిన ఉత్సవం. కార్తికమాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన అద్భుతం. సుమారు పుష్కరకాలం క్రితం కార్తికమాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభం. అదే భక్తిటీవీ కోటి దీపోత్సవం. కార్తికమాసం వస్తోందనగానే ఆస్తికులందరికీ గుర్తుకువచ్చే అపురూప సంరంభం. భక్తిటీవీ కోటిదీపోత్సవం. చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా భక్తిటీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటిదీపోత్సవం. 2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై... పుష్కరకాలానికి పైగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామాగ్రి ఇలా ప్రతీది ఉచితంగా సిద్ధం చేస్తారు.సుమారు పుష్కరకాలం క్రితం... పదమూడేళ్లక్రితం శృంగేరీ దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు విజయ యాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేశారు. ఈ సందర్భాన్ని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులకు ఓ సంకల్పం కలిగింది. భక్తులందరి సమక్షంలో వారికి గురువందనం చేయాలని భావించారు. దానితోపాటు కార్తికమాసంలో శివస్వరూపమైన జగద్గురువులు స్వయంగా విచ్చేశారు గనుక.. వారి సమక్షంలో కార్తికదీపోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. ఆ చిన్న సంకల్పానికి ప్రతిరూపమే 2012లో జరిగిన లక్షదీపోత్సవం. భక్తిటీవీ చేపట్టిన దీపయజ్ఞానికి నాంది అది. ఎన్టీఆర్స్టేడియం వేదికగా కైలాసాన్ని తలపించే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై శృంగేరి జగద్గురువులు దీపారాధన చేసి భక్తులను ఆశీర్వదించారు.ముక్కోటి దేవతలు ఒక్కటైనారు...కార్తికమాసంలో శంకరనారాయణులనే కాదు.. సమస్త దేవతలను కోటిదీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కల్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్టధామాల నుంచి కోటిదీ΄ోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తూ ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. ఉజ్జయిని, అరుణాచలం, వేములవాడ, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలు.. యాదాద్రి, శ్రీరంగం, కొండగట్టు తదితర వైష్ణవ క్షేత్రాలు... అలంపురం, కంచి, వారణాసి వంటి శక్తిపీఠాలు. ఇలా ఒకటేమిటి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ దేవతామూర్తులు కోటిదీ΄ోత్సవ వేదికపై కొలువుదీరతారు. కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. ఎన్నో పూజలు – పరిణయోత్సవ వైభవ సమాహారం.గురుర్దేవో మహేశ్వరఃప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలి వస్తుంటారు. శివైక్యం చెందిన కంచికామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యానృసింహ భారతిస్వామి, ఉడిపి పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామి, ఆర్షవిద్యాగురుకులం శ్రీదయానందసరస్వతి వంటి మహామహులు కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించడం వీక్షకుల అదృష్టం. శృంగేరి శంకరాచార్య భారతీ తీర్థమహాస్వామి, పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి, జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానందస్వామి, ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గివాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ, సమతామూర్తి స్థాపకులు త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీవిద్యాశంకరభారతిస్వామి, ధర్మస్థల క్షేత్రాధికారి వీరేంద్రహెగ్డే, అక్షయ΄ాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమధుపండితదాస, ఇస్కాన్ అంతర్జాతీయ అధ్యక్షులు జయపతాకస్వామి, పతంజలి యోగ బాబారామ్ దేవ్, కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతిస్వామి, రుషికేశ్ పరమార్థ్నకేతన్ చిదానంద సరస్వతి, కాశీ – శ్రీశైల జగద్గురువులతో పాటు ఎందరెందరో యోగీశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మాతాజీలు భక్తిటీవీ కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించారు. గురుదేవులే మహేశ్వరులై భక్తకోటిని అనుగ్రహించారు. ఈ ఏడాది సైతం శృంగేరి జగద్గురు విధుశేఖరభారతిస్వామివారు.. కంచి జగద్గురు విజయేంద్రసరస్వతి స్వామివారు విచ్చేయడం కోటిదీపోత్సవానికి సూర్యచంద్రుల ఆగమనం లాంటి శుభతరుణం. సువర్ణాక్షరాల ఘట్టాలు కోటిదీపోత్సవ చరిత్రలోనే కాదు... భక్తిటీవీ ప్రస్థానంలో సైతం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టాలు. కోటిదీపోత్సవం – 2023. కోటిదీపోత్సవం – 2024. రెండేళ్ల క్రితం మహాదేవునికి కోటిదీపాల నీరాజనం అర్పించేందుకు తుమ్మల నరేంద్రచౌదరి – రమాదేవి దంపతుల ఆహ్వానం మేరకు.. సాక్షాత్తూ దేశప్రధానమంత్రి నరేంద్రమోది విచ్చేయడం... దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి.. తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న భావన కలుగుతోందని ప్రశంసించడం ఓ అపూర్వ జ్ఞాపకం. గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయడం మరో మరపురాని ఘట్టం. దేశ ప్రథమ ΄ పౌరురాలి చేతులమీదుగా కార్తికదీపం వెలిగింది. భక్తుల ఆనందం కోటిదీపాల కాంతులై మెరిసింది. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టమని ద్రౌపది ముర్ము పేర్కొనడం అద్వితీయం. సప్తహారతులు... మహానీరాజనాలు ఈ అపూర్వ వేడుకలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు.లక్ష కాదు.. కోటి 2013లో... మళ్లీ కార్తికమాసం రానే వస్తోంది. 2012లో జరిగిన వైభవం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. లక్షదీపోత్సవం కంటే మించినది ఏదైనా చేయాలని తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి – వారి కుమార్తె రచనా చౌదరిల సంకల్పం. ఆ సంకల్పానికి ప్రతిరూపమే అంతవరకూ ఎవరూ చేయని మహోత్సవం. నూతన ఆధ్యాత్మిక యుగానికి పునాదులు వేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం. ఆనాడు వెలిగిన దీపజ్యోతి ఇంతింతై అన్నట్లుగా... పుష్కరకాలంగా కొనసాగుతోంది. అఖండదీపమై ప్రకాశిస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త హంగులతో వెలుగొందుతోంది. కోటిదీ΄ోత్సవానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్లే అనే భావన ప్రతీ భక్తుడికీ కలిగేలా కార్యక్రమ రూపకల్పన జరిగింది. నటరాజుకు కళాంజలి: జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, కైకుట్టి, మోహినిఆట్టం, ఒడిస్సీ, మణిపురి, లావణి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీ΄ోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. ఇందుకోసం ప్రసిద్ధ కళాకారులు సైతం తరలివస్తారు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈశా ఫౌండేషన్ తరఫున బ్రహ్మచారులు చేసే అగ్నినృత్యం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు ప్రతిఏటా చోటుచేసుకుంటాయి.ఆ అపూర్వ యజ్ఞంమరోమారు...కార్తికమాసాన్ని పురస్కరించుకునినవంబరు1 నుంచి 13 వరకుహైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో... -
పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయం
కృష్ణానదిలో స్నానం... అమరేశ్వరుని దర్శనం’ మోక్షదాయకం అన్నారు పెద్దలు. తెలుగునేల మీద ఉన్న పంచారామాలలో ప్రథమమైనదిగా భావించే అమరేశ్వర స్వామి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్నది. ఇక్కడ వెలసిన బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామిని దర్శించి తరించటానికి భక్తజనం నిత్యం అమరావతిని సందర్శిస్తుంటారు. శ్రీశైలానికి ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, ఋషులు సేవించిన మహిమ గల క్షేత్రంగా భక్తులు భావిస్తారు.దేవాలయంలో గల వివిధ శాసనాలు ద్వారా అమరేశ్వరుణ్ణి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి వివిధ రాజవంశీయులు సేవించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పల్లవ, రెడ్డి, కోటకేతు రాజులు అమరేశ్వరుని సేవించినట్లు చరిత్ర చెపుతోంది.శ్రీ కృష్ణదేవరాయలు అమరేశ్వరుని దర్శించి తులాభారం తూగినట్లు, బ్రాహ్మణులకు దానాలిచ్చినట్లు ఆధారాలున్నాయి. అలాగే 18వ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకుని దక్షిణాంధ్రదేశాన్ని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయాన్ని పునరుద్ధరించి, మూడు ప్రాకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశీక ధర్మకర్తలుగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అమరావతి క్షేత్రం హరిహర క్షేత్రంగా కూడా పిలవబడుతుంది.ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగో΄ాల స్వామి క్షేత్ర΄ాలకునిగా విరాజిల్లుతూ శివ కేశవులకు భేదం లేదని చాటుతున్నాడు.ఏకశిలా రూపంగా దాదాపు 15 అడుగుల ఎత్తున, మూడు అడుగుల కైవారం కలిగిన ఈ లింగం జగద్విఖ్యాతం. ఓంకారానికి ప్రతిరూపంగా స్వామి వారి నుదుట మూడు చిన్న గుంటలు నేటికి దర్శనమిస్తాయి.శుక్రాచార్యుడి సందేహంఅసుర గురువు శుక్రాచార్యుడు తన గణాలతో వచ్చి భవిష్యత్తులో సహ్యాద్రి పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు మునిగిపోవచ్చునేమో అనే సందేహం వెలిబుచ్చాడు. అందుకు బృహస్పతి సమాధాన మిస్తూ, అమరేశ్వరుడు వెలసిన దీన్ని క్రౌంచగిరి అంటారనీ, దీని అడుగు పాతాళం దాకా ఉందనీ, దానివల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుందనీ, కృష్ణమ్మ ఈ గిరి పక్క నుంచి వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీనిని ముంచెత్తదనీ బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంది.అమరలింగేశ్వరాలయ ప్రాముఖ్యత...ద్వాపర యుగం చివరిలో 5053 సంవత్సరాల క్రితం మరియూ కలియుగ ప్రారంభంలో సౌనకాది మహర్షి నారదుడిని మోక్షానికి ఉత్తమమైన మార్గాన్ని కోరినట్లు స్కాంద పురాణం పేర్కొంది. నారదుడు శౌనకాది మహర్షిని కృష్ణానదిలో రోజూ స్నానం చేసి, కృష్ణుడు సృష్టించిన నది ఒడ్డున, అమరేశ్వరుణ్ణి దర్శిస్తూ నివసించమని సలహా యిచ్చాడు.నారద మహర్షి సౌనకాది అమరేశ్వర ఆలయ కథను చెప్పాడు, తన భక్తులకు కోరికలు తీర్చడానికి శివుడు ఇక్కడ లింగం రూపంలో వెలిశాడని చెప్పాడు. అలాగే కష్ణానదిలో స్నానం చేసి ఇక్కడి ఆలయంలోని అమరేశ్వరుడిని పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయని చెప్పారు. ఈ ప్రదేశంలో మూడు రోజులపాటు ఉండి భక్తిశ్రద్ధలతో శివపూజ చేసిన భక్తులు శివలోకాన్ని పొందుతారన్నారు. ఇక్కడ ఏ భక్తుడు మరణించినా శివుడు గ్రహిస్తాడు.అమరలింగేశ్వర ఆలయ ఉత్సవాలు...ఈ ఆలయంలో కార్తీక మాసం, మహా బహుళ దశమి, నవరాత్రి, మహా శివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయ సమయాలు...మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. ప్రస్తుత కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సా. 4 గంటల నుండి రాత్రి 8.30 వరకు గుడిని తెరచి ఉంచుతారు.కార్తీకమాసం పౌర్ణమి, సోమవారాలలో ఉ.3 నుండి రాత్రి 10 వరకు, ఆదివారాలలో ఉ. 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. -
జీవులన్నీ దేవుడే!
ప్రాణికోటిలో మనిషితో పాటు ఎన్నో జంతువులున్నా, భారతీయ గ్రామీణ జీవితంలో అతి పురాతన కాలం నుంచి, గోమాతగా పూజించబడే ఆవుకూ, నాగదేవతగా ఆరాధించబడే పాముకూ ప్రత్యేక స్థానం ఉంటూ వచ్చింది. భౌతికంగా చూస్తే, పాము ‘రైతు నేస్తం’. సిద్ధమైన పంటలను గుటకాయ స్వాహా చేసి అపార నష్టాన్ని కలిగించే ఎలుకలు మొదలైన ప్రాణులను తమకు ఆహారంగా చేసుకొనే పాములే లేకపోతే, పండిన పంటలో సగం కూడా చేతికి చిక్కదు. పాముది, మనిషిలాగే, వైరుద్ధ్యాల జీవితం. వాటిని క్రూర జీవులనటం అపార్థం వల్లే! వాటికి మనిషితో శత్రుత్వం లేదు. మనిషి అలికిడి తెలియగానే, అతడికి వీలయినంత దూరంగా వెళ్ళటానికే అవి ప్రయ త్నిస్తాయి. పాము మనిషిని కాటు వేస్తే, అది కాకతాళీయమైన విధి విలాసమే తప్ప, ‘క్రూరత్వం’ కాదు. పాము విషం ప్రాణాంతకమే. కానీ సరిగా వాడితే, అది దివ్యౌషధంగా పని చేస్తుంది అంటుంది వైద్య శాస్త్రం.పాములకు ఇతర జంతువులకు లేని స్థాయిలో శ్రవణ శక్తీ, ఘ్రాణ శక్తీ, గ్రహణ శక్తీ ఉంటాయన్న నమ్మకం గ్రామీణులలో కనిపిస్తుంది. ముఖ్యంగా భౌతికాతీతమైన, లోకాతీతమైన శక్తి, దివ్య సంపత్తి ఎక్కడ ఉన్నా, అది పాములను ఆకర్షిస్తుంది అని ప్రతీతి. యోగులూ, మునులూ పాములతో సఖ్యం చేసిన సందర్భాల గురించి ఎన్నో విశేషాలు వింటూ ఉంటాం. భగవాన్ రమణ మహర్షితో పాములు ముఖాముఖి నిలిచి, సుదీర్ఘమైన మౌన భాషణలు చేసేవనీ, పాములు కాళ్ళకు చుట్టుకొని పాదాభివందనం చేసినా ఆయనకు చక్కలిగింత తప్ప మరో భావన కలిగేది కాదనీ ఆయన మాటలలోనే విన్నాం.ఇదీ చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?పాములలో ఒక దివ్యత్వం ఉన్నదని భారతీయ గ్రామీణులు అనాదిగా విశ్వసిస్తూ వచ్చారు. చనిపోయిన పాము త్రోవలో ఎదురైతే, దానికి సాదరంగా, సభక్తికంగా అంతిమ సంస్కారం చేసే ఆనవాయితీ మన గ్రామాలలో ఉండేది. సమస్త జీవరాశిలో భగవంతుణ్ణి చూడడమే భారతీయ ఆదర్శం.– ఎం. మారుతి శాస్త్రి -
ప్రజల ఆకలి తీర్చడానికి...
భూమండలాన్ని పృథు చక్రవర్తి పాలిస్తున్న రోజులలో ఒకప్పుడు ధర్మనష్టం జరిగి వర్షాలు పడక, పంటలు పండక, ప్రజలు కందమూలాలు తిని ఆకలి తీర్చుకోవాల్సి వచ్చింది. కరవును భరించలేని జనం పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి ఆ భయంకర క్షామం నుండి కాపాడమని వేడుకున్నారు. అది చూసి తట్టుకోలేని పృథు చక్రవర్తి, సస్యనాశనం కావించి జనులకు ఆహారాన్ని దూరం చేసిన భూదేవిని శిక్షించడానికి పూను కున్నాడు. భయపడిన విశ్వంభర గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు చేరింది. ఎక్కడికి వెళ్ళినా వెంబడించి పట్టుకుని శిక్షిస్తానని, తాను కూడా వెళ్ళాడు పృథు. ‘అంతగా కోపం తెచ్చుకోవడానికి నేను చేసిన తప్పేమిటి?’ అని అడిగింది భూదేవి. ‘క్షామ పరిస్థితులు సృష్టించి ప్రజలు ఆకలితో అలమటించేలా చేసిన దుష్టచారిణివి నీవు. నిన్ను శిక్షిస్తే ప్రజలు సుఖపడతారు’ అన్నాడు పృథు. ‘కరవుకు అసలు కారణం గ్రహించకుండా నీవు నన్ను శిక్షించే ఆలోచన చేస్తున్నావు. నీ ప్రజలను కాపాడుకునే ఉపాయం నేను చెబుతాను. సస్యరాశి సమస్తం, ఔషధాలు నాలో జీర్ణమై ఉన్నాయి. గోరూపంలో ఉన్న నాకు సంతానం కలిగితే, పాల రూపంలో అవన్నీ మళ్ళీ భూమిపై ప్రవహించి, బీజములు మొలకెత్తి, పంటలు సమృద్ధిగా పండుతాయి. కనుక అలా చెయ్యి’ అని సలహా ఇచ్చింది. ఆలోచించిన పృథు చక్రవర్తి, పర్వత శ్రేణులతో ఎత్తుపల్లాలుగా ఉన్న భూమిని చదును చేశాడు. గ్రామాలు, పట్టణాలు నిర్మింపజేశాడు. కాయకష్టం చేయడానికి జీవనోపకరణాలను తయారు చేయించి అందరికీ సమ కూర్చాడు. అలా అంతటినీ వ్యవస్థీకృతం చేసి భూదేవి సలహా ప్రకారంగా చేయడానికి ఇలా పూనుకున్నాడని వెన్నెలకంటి సూరన ‘శ్రీవిష్ణుపురాణం’, ప్రథమాశ్వాసంలో చెప్పాడు. కం. పాయక భూధేనువునకు / స్వాయంభువు గ్రేపుగాగ సమకట్టి మహీ నాయకుడు పిదికె దుగ్ధ/ ప్రాయంబై జగములెల్ల బరిపూర్ణముగాన్. గోరూపంలో ఉన్న భూదేవికి స్వాయంభువ మనువును దూడగా చేసి పృథు చక్రవర్తి పాలు పితికి భూమండలం మొత్తం తడిసేలా చేశాడని పై పద్యంభావం. ఆ చర్యతో భూమి మళ్ళీ సారవంతమై పంటలు పండి ప్రజలు సుఖించారని ‘శ్రీవిష్ణుపురాణం’లోని పృథు చక్రవర్తి కథ చెబుతోంది.– భట్టు వెంకటరావు -
హనుమంతుని గీతా భాష్యం గురించి తెలుసా?
ప్రాచీన కాలంలో గురుముఖ విద్యకే ప్రాధాన్యం. విద్య అనేది గురు శుశ్రూష వలన, తమ దగ్గర ఉన్న ఒక విద్యనిచ్చి వారి నుండి మరొక విద్య గ్రహించటం అనే పద్ధతులలో ఉండేది. గురువు లేకుండా విద్యనార్జించటం అసాధ్యం. గురువు స్వయంగా చెబితేనే విద్య గ్రహించాలి. ఇతరులకు చెబుతున్నపుడు, అనుమతి లేకుండా విద్య గ్రహించటం కూడా తప్పే! అదీ నాటి పరిస్థితి.ద్వాపర యుగంలో కురు పాండవ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం పట్ల విముఖుడైన అర్జునునికికృష్ణుడు భగవద్గీత రూపంలో తత్వార్థాన్ని బోధించాడు. బోధించాక, ‘నీకు బాగా అర్థమైందా?’ అనడుగుతాడు. అర్జునుడు, ‘అర్థమయ్యింది కానీ మళ్ళీ వినాలనుకుంటున్నాను, సంక్షిప్తంగా చెప్పమ’ ని అంటాడు. అప్పుడు అర్జునుని ధ్వజంపై ఉన్న హనుమ ‘నేను ఈ బ్రహ్మ విద్యను సమస్తం గ్రహించాను. నా హృదయంలో అది స్థిరంగా ఉంది. నేను నీకు తర్వాత చెపుతాను. ఇది యుద్ధ సమయం. వృథా ఆలోచనలు మాని యుద్ధం చేయి’ అంటాడు.ఇదీ చదవండి: ధర్మాన్ని నిలిపే త్రిశక్తుల గురించి తెలుసా?అపుడు కృష్ణుడు హనుమంతునితో, ‘నా అనుమతి లేకుండా నువ్వు బ్రహ్మ విద్య నెలా గ్రహించావు? గురువాజ్ఞ లేకుండా విద్య గ్రహించిన వానికి పిశాచత్వం కలుగుతుంది. నువ్వు విద్వాంసుడవై కూడా ఇలా ఎందుకు చేసావు?’ అన్నాడు. హనుమ ధ్వజాగ్రం నుండి దిగి వచ్చి, వినయంగా, ‘నాకు బ్రహ్మ విద్య ఎలా సఫల మౌతుంది? పిశా చత్వం ఎలా పోతుంది?’ అని ప్రార్థించగా, కృష్ణుడు కౌరవుల యుద్ధం ముగిసిన వెంటనే ‘నీ పిశాచత్వం తొలగి పోతుంది. సేతువు వద్ద స్నానం చేసి రామేశ్వరుని ఆర్చించు. తర్వాత నువ్వు ఈ గీతా శాస్త్రానికి భాష్యం రాయి. ఈ భాష్య రచనకు నీ కన్నా సమర్థులు లేరు. నీ ద్వారా ఈ శాస్త్రం విఖ్యాత మౌతుంది’ అన్నాడు. హనుమంతుడు గీతకు అద్భుతమైన భాష్యం రాశాడు. ఈ భాష్యం వలన భగవద్గీతలోని విశేషార్థాలు, సామా న్యార్థాలు అవగతమవుతాయని ‘పరాశర సంహిత’ తెలుపుతోంది. చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?– డా.చెంగల్వ రామలక్ష్మి -
ధర్మాన్ని నిలిపే త్రిశక్తుల గురించి తెలుసా?
పాప భీతి, దెవప్రీతి, సంఘనీతి త్రయం. ఈ మూడే మన అంతరాత్మను వెలిగించే త్రివేణి సంగమం. అంతఃకరణసాక్షిత్వమే మనిషికి నిత్యమైన ధర్మం. ఈ ధర్మాన్ని నిలిపే త్రిశక్తులు: పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి. ఈ మూల విలువలు లోపించినప్పుడే వ్యక్తిగత జీవితంలో శాంతి నశించి, ప్రపంచం అపనమ్మకంతో నిండిపోతుంది. మనిషిని ధర్మబద్ధంగా నడిపించేవి ఈ మూడు: పాప భీతి (తప్పు పర్యవసానానికి భయం), దైవ ప్రీతి (విశ్వం పట్ల ప్రేమ), సంఘ నీతి (సామాజిక బాధ్యత). ఈ అంతర్గత విలువలు లోపించినప్పుడే, చట్టం చూడకపోయినా, ఎవరూ గమనించకపోయినా, మనిషి అవినీతికి, అన్యాయానికి పాల్పడతాడు. దీని పర్యవసానంగా, అంతఃకరణ శాంతి నశించి, ప్రపంచంలో నమ్మకం కొరవడుతుంది. పాప భీతి లేని ఒక వ్యాపారి, తక్షణ లాభం కోసం అక్రమాలకు, పన్ను ఎగవేతకుపాల్పడతాడు. చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే ధైర్యంతో, ధర్మాన్ని పక్కన పెడతాడు. ఈ స్వార్థపూరిత చర్యలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి.ఒక ఆటో డ్రైవర్, ప్రయాణికుడు మరచిపోయిన డబ్బు సంచిని తిరిగి అప్పగిస్తాడు. ఈపాప భీతితో కూడిన నిజాయితీ వల్ల, అతను తిరిగి ఇచ్చిన డబ్బు కంటే, ఎక్కువ గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించుకుని, తన కుటుంబానికి గొప్ప కీర్తిని అందిస్తాడు. ఈ మూడు విలువల కారణంగానే ఒక ఇంజనీర్ ్ర΄ాజెక్టును అత్యంత నాణ్యతతో నిర్మిస్తాడు. ఇది కేవలం పని మాత్రమే కాదు, ప్రజల జీవితాలకు భద్రత కల్పించే తన ధర్మం అని నమ్ముతాడు. ఈ నిజాయితీ అతనికి శాశ్వత కీర్తిని, క్లయింట్లలో అపారమైన నమ్మకాన్ని ఇస్తుంది. దీనికి విరుద్ధంగా, అదే ఇంజనీర్ నాణ్యత తగ్గించి డబ్బు సం΄ాదిస్తే, తాత్కాలికంగా ధనం వచ్చినా, ఆ ప ప్రాజెక్టు పతనం అయినప్పుడు ఆ వ్యక్తి ఆత్మశాంతిని పూర్తిగా కోల్పోతాడు. ఈ విలువల వల్ల మీ జీవితంలో/వృత్తిలో మీకు శాశ్వత కీర్తి, తిరుగులేని నమ్మకం లభిస్తాయి. ఒత్తిడి ఎదురైనా, దైవ ప్రీతి వల్ల మనసుకు మానసిక స్థైర్యం లభిస్తుంది. ఈ విలువలు లేక΄ోతే, మీరు ఎంత డబ్బు సంపాదించినా అంతరాత్మ ప్రశాంతత నశించి, అభద్రతా భావం పెరుగుతుంది.చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?కుటుంబంలోనూ ఈ ప్రభావం మరీ లోతుగా ఉంటుంది. మీ నిజాయితీ మీ పిల్లలకు గొప్ప ఆస్తి. మీరు విలువలు నిర్లక్ష్యం చేస్తే, ఇంట్లో అశాంతి, అపనమ్మకం పెరుగుతాయి. పిల్లలు మాటలకంటే ఎక్కువగా, చేతలనే చూస్తారు; తల్లిదండ్రులకు పాప భీతి లోపిస్తే, పిల్లలూ నిజాయితీని కోల్పోతారు. పాప భీతి మనల్ని తప్పుల నుండి కాపాడే కఠినమైన గురువుగా రక్షిస్తుంది. దైవ ప్రీతి మనల్ని ప్రేమతో నడిపించే తల్లిగా ప్రేరణనిస్తుంది. సంఘ నీతి మనల్ని బాధ్యతాయుత పౌరులుగా మార్చే బంధం. పాప భీతిని ఆచరించండి, దైవ ప్రీతిని పెంచుకోండి, సంఘనీతిని పాటించండి. ఈ మూడింటిని హృదయపూర్వకంగా ధరించినప్పుడే, మన వ్యక్తిగత ప్రశాంతత పెరుగుతుంది, ప్రపంచం నమ్మకం, మానవత్వంతో నిండిపోతుంది.ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందనే నమ్మకం లేనప్పుడు, మనిషిలో కరుణ, సహానుభూతి తగ్గిపోతాయి. ఫలితంగా, అతను కేవలం తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించి, ఇతరుల బాధను, కష్టాన్ని విస్మరిస్తాడు. దైవ ప్రీతి లోపం ఉన్న ఓ పరిశ్రమ యజమాని, తక్షణ లాభం కోసం, నదుల్లో కాలుష్యాన్ని విచ్చలవిడిగా వదిలి వేస్తాడు. ఈ కలుషిత నీటిని తాగే జంతువులు, ఆధారపడిన ప్రజారోగ్యంపై పడే భయంకరమైన ప్రభావాన్ని అతను పట్టించుకోడు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఉండాలనే కనీస బాధ్యతను విస్మరించి, ప్రకృతి విధ్వంసానికి పాల్పడతాడు. ఈ లోపం అతన్ని సమాజానికి, ప్రకృతికి హాని కలిగించేలా నిర్దయగా మారుస్తుంది. సంఘ నీతి లోపించిన ఒక వ్యాపారి, లాభం కోసం ఆహారంలో కల్తీ చేసి, తక్షణ లాభం పొందుతాడు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం, బాధ్యత లేని స్వార్థం వల్ల సమాజం రోగాల పాలయ్యే అవకాశం ఉంది. – కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు)ఇదీ చదవండి: ఆధ్యాత్మికత...ఆత్మదర్శనం అంటే ఏమిటి? -
ఆధ్యాత్మికత...ఆత్మదర్శనం అంటే ఏమిటి?
ఆత్మదర్శనం ఒక్కటే నిన్ను దైవాన్ని చేర్చే ఏకైక సాధనం. సమాజంలో జరుగుతున్న ప్రతి తప్పు ఆత్మను మరచిపోయిన స్థితిలో జరుగుతున్నవే. సామాజికమైన సమస్యలన్నీ కూడా కాలం– స్థలం అన్న పరిమితిలో జరుగుతున్నవే. మోసం, ద్వేషం, హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు మొదలైనవన్నీ యాంత్రికమైన స్థితిలో జరుగుతున్నవే. శరీరం–మనస్సు, కోరికలు, కాలం–స్థలం అనే పరిధిలోనే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. సమాజాన్నిమార్చాలి అంటే మొదట నీవు ఆత్మతత్వాన్ని చేరుకోవాలి. నీ ప్రయాణం అంతర్ముఖమై ’నేను ఆత్మను’ అని అనుభవంతో తెలుసుకునే వరకు తప్పులు జరుగుతూనే ఉంటాయి. నీ గమనిక బహిర్ముఖమైనప్పుడు కలిగే స్థితే యాంత్రిక స్థితి, ఆత్మ పట్ల ఎరుకలేని స్థితి. నీ గమనిక అంతర్ముఖమైనప్పుడు ఆత్మ చైతన్యస్థితిలో ఉంటావు. నీ మూలాన్ని చేరుకుంటావు. ఆ స్థితిలో శరీరం–మనస్సులు చేస్తున్న పనులన్నింటినీ ఒక సాక్షిగా గమనిస్తూ ఉంటావు. నడవటం, మాట్లాడటం, స్పర్శించటం, రుచి చూడటం వంటి పనులు చేస్తున్న శరీరం–మనస్సులను అంటకుండా దూరంనుండి చూస్తూ ఉంటావు. వచ్చే ఆలోచనలను, కోరికలను కూడా సమభావనతో గమనిస్తూ ఉన్నప్పుడు అవి నిన్ను ఏమీ చేయలేవు. వాటి ఫలితాలు కూడా నిన్ను బాధించలేవు. సుఖమైనా, దుఃఖమైనా సమభావనతో సాక్షిగా ఉండిపోతావు. ఆలోచనలను గమనిస్తున్నప్పుడు ఆలోచనల కదలిక ఆగి పోతుంది. అలోచనల్లో ఉన్న శక్తి తిరిగి గమనికలోకి వచ్చి చేరి ఆలోచనలు శక్తిహీనమై మనస్సు సహజంగానే నశించి΄ోతుంది. నీవు బలవంతంగా అణిచి పెట్టవలసిన అవసరమే లేదు. నీవు ఈ నిద్రనుండి లేచే వరకు ప్రపంచం మారదు. నీ నమ్మకాలు, దైవం పట్ల ఉన్న నీ అభిప్రాయాలు, బాహ్యమైన ఆరాధనలు, అర్చనలు మొదలైనవన్నీ భ్రమలేనని తెలుసుకుంటావు. నీవు ఏది ఊహించుకున్నా చివరికి అది దైవం గూర్చిన ఉహలే ఐనా, అవి కేవలం నీ కల్పితమైన మనస్సు ప్రతిబింబాలే గానీ సత్యాలు కావు. మనస్సుతో ఊహించినదేదీ సత్యం కాదు. సత్యం మనస్సుకు అతీతమైనది. మనస్సు మాయమైనపుడు ఉన్న శుద్ధ చైతన్యస్థితే సత్యం. అది కేవలం అనుభవంతోనే తెలుసుకోగలవు. నీవు నీవు కావడమే ఆధ్యాత్మికత. మనసుతో తెలుసు కున్నవి, ఊహించినవి అన్నీ అసత్యాలే. ఆ చైతన్య స్థితిని తెలుసుకోవాలి. అదే బుద్ధుడు, కృష్ణుడు, లావోట్సు మొదలైన యోగులు చేరుకున్న స్థితి. వారంతా బోధించినది చైతన్యస్థితి గురించే. మనస్సు భ్రమలనుండి బయటపడమని బోధిస్తే మనమేమో ఆ భ్రమలను పెంచుకుంటూ అవే నిజాలని నమ్ముతున్నాము. మనస్సు మలినాన్ని కడిగేదే ధ్యానం. ధ్యానంతోనే దైవాన్ని చేరగలవు. అదే ఏకైక మార్గం. నమ్మకాలను, భ్రమలను తీసివేసేదే ధ్యానం. నీ నిజతత్వాన్ని అనుభవింపజేసేదే ధ్యానం.అసలు మనస్సు అనేదే ఆగిపోయినప్పుడు దేన్ని కోరగలవు. అప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. నమ్మకాలు, భ్రమలు అన్నీ మాయమైపోతాయి. అల సముద్రంతో తిరిగి కలిసిపోతుంది. మనస్సు దాని మూలమైన ఆత్మతో తిరిగి ఏకమైపోతుంది. ఏకత్వం అనుభవమై ఔతుంది. ప్రకృతి పురుష ఏకమౌతుంది. చూసేవాడు, చూడబడేది అనే రెండూ శుద్ధ చైతన్యంలో లీనమౌతాయి. కేవలం శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది. – స్వామి మైత్రేయ ఆధ్యాత్మిక బోధకులు∙ -
అపమృత్యుదోషాలను దూరం చేసే యమ విదియ
సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రక్షాబంధనం పండుగ తర్వాత చెప్పుకోదగినది యమ విదియ లేదా భగినీ హస్తభోజనం.. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. తమ తోబుట్టువుల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటారు. కొందరు సోదరులకు పెట్టరు కానీ, సోదరులే తమ అక్కచెల్లెళ్లకు చీర, సారె పెడతారు. ఈ సంప్రదాయం మొదలవడానికి కారణం యమధర్మరాజు, ఆయన చెల్లెలు యమి (యమున). దీనికి సంబంధించిన ఒక ఇతిహాస గాథ ఉంది. అదేమిటో చూద్దాం.రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష (రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. ‘భయ్యా ధూజీ’ లేదా ‘భాయి ధూజ్’ అనే పేరుతో ఉత్తరదేశంలో ప్రాచుర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది. దీనికి యమ విదియ అని, భగినీ హస్త భోజనమనీ పేరు. కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ. దీనికి సంబంధించిన కథ ఇలా చెప్పుకుంటారు.యముడు, యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమున లో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! అందువల్ల సోదర సోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చునని శాస్త్రం చెబుతోంది. (చదవండి: సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే) -
బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!
దీపావళి వేడుక అంటే..మోద మోగిపోవాల్సిందే.. ఆ పండుగ సంబంరం అలా ఇలా ఉండదు. టపాసులు, బాణసంచా వెలుగులు విరజిమ్ముతూ..అదిరిపడే శబ్దాలతో ఆనంద హేళిలా సాగిపోతుంది. అలాంటి వేడుకలో కాల్చే బాణసంచా కాల్చడం తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇదెలా వాడుకలోకి వచ్చింది, ఎలా మొదలైంది అంటే..ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన బాణసంచా మ్యూజియం. ఈ మ్యూజియం జపాన్ రాజధాని టోక్యో పరిధిలోని ర్యోగోకు జిల్లాలో ఉంది. ‘ర్యోగోకు హనాబి’ పేరుతో సుమిదా నది ఒడ్డున ఈ మ్యూజియం 1733 సంవత్సరంలో ఏర్పాటైంది. జపాన్లో పదహారో శతాబ్ది నుంచి బాణసంచా వాడుక మొదలైంది. పలు వేడుకల్లో జపాన్ ప్రజలు బాణసంచా కాలుస్తుంటారు. (చదవండి: ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..!) -
పుణ్యభారతాన ఆదివైద్యుడి ఆలయాల గురించి తెలుసా?
శ్రీ మహావిష్ణువు అవతారంగా, దేవతలకు వైద్యుడుగా, ఆయుర్వేద వైద్యానికి ఆది వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన ధన్వంతరి క్షీర సాగర మథన సమయాన ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు ఆవిర్భవించాడు. చతుర్భుజుడైన ధన్వంతరి నాలుగు చేతులలో శంఖం, చక్రం, జలౌకం (జలగ) అమృత తుల్యమైన పునరుజ్జీవన తేనె భాండం దర్శనమిస్తాయి.ధన్వంతరిని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా పూజిస్తున్నప్పటికీ, ధన్వంతరికి అంకితం చేయబడిన దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువ. ఆ ఉన్న కొద్ది ఆలయాలు కూడా దక్షిణ భారతదేశంలోనే దర్శనమిస్తాయి ఉత్తర భారతాన న్యూఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఒక విగ్రహం, హరిద్వార్లోని ఒక ఆశ్రమంలో మరొక విగ్రహం తప్ప ఉత్తర భారతాన ధన్వంతరికి ఆలయాలంటూ అసలేం లేవనే చెప్పాల్సి ఉంటుంది.రంగనాథస్వామి ఆలయం వద్ద ధన్వంతరి ఆలయంతమిళనాడులో శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దానికి చెందిన పురాతన మందిరం ఉంది. ఇక్కడ స్వామికి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ఆరోగ్యాభిలాషులైన భక్తులకు ‘ప్రసాదం’గా మూలికలను అందిస్తారు.కోయంబత్తూరు శ్రీ ధన్వంతరి ఆలయంకోయంబత్తూరులోని శ్రీ ధన్వంతరి ఆలయం తమిళనాడులోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. కోయంబత్తూరు నగర నడిబొడ్డున ఆర్య వైద్య చికిత్సాలయం, పరిశోధనా సంస్థలో ఉన్న శ్రీ ధన్వంతరి మందిరం, జీవానికి, వైద్యానికి దేవుడు, ధన్వంతరిని ప్రధాన దేవతగా ప్రతిష్టించింది.నెల్లువాయ భగవాన్ ధన్వంతరి ఆలయంగురువాయూర్, త్రిసూర్ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న నెల్లువాయ వద్ద ఉన్న లార్డ్ ధన్వంతరి ఆలయం కేరళలోని ముఖ్యమైన ధన్వంతరి ఆలయాలలో ఒకటి. ఆయుర్వేద వైద్యులు వైద్యం ్ర΄ారంభించే ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదంగా భావిస్తారు.మలప్పురంలో రుద్ర ధన్వంతరి ఆలయంమలప్పురంలోని పులమంథోల్ మధ్యలో ఉన్న శ్రీ రుద్ర ధన్వంతరి ఆలయం కేరళలోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయం ప్రసిద్ధ అష్టవైద్య పులమంథోల్ మూస్ కుటుంబానికి చెందినది, అయితే అన్ని వర్ణాలకు చెందిన హిందువులు ఆలయంలో పూజలు చేసుకోవడానికి అనుమతి ఉంది.శ్రీ ధన్వంతరి ఆలయం, పెరింగవుకేరళలోని త్రిస్సూర్ పట్టణ శివార్లలో ఉన్న మరొక పురాతన ధన్వంతరి ఆలయం పెరింగావులోని శ్రీ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయ గర్భగుడి రెండు అంతస్తులతో గుండ్రని ఆకారంలో నిర్మించబడింది, ఇది ఇతర కేరళ శైలి నిర్మాణ శైలికి భిన్నంగా అరుదైన డిజైన్. గణపతి, లక్ష్మీదేవి, అయ్యప్పన్ ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన ఇతర దేవతలు.వడక్కంచెరి ధన్వంతరి ఆలయంవడక్కంచెరి ఆయుర్వేద ప్రభువుకు అంకితం చేయబడిన మరొక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం కేరళలోని త్రిస్సూర్కు ఉత్తరాన 18 కి.మీ దూరంలో వడక్కంచెరి నుండి 8 కి.మీ దూరంలో కున్నంకుళం – వడక్కంచెరి రహదారిపై ఉంది. (అక్టోబర్ 18, శనివారం ధన్వంతరి జయంతి) -
పెద్దమ్మ గుడిలో ఈ–హుండీ..
ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది.. బస్ టికెట్ కొనాలన్నా.. వాటర్ బాటిల్ కొనాలన్నా.. అన్నింటికీ యుపిఐ పేమెంట్సే.. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్లో చిల్లర కొరత ఏర్పడుతోంది.. ప్రతి కొనుగోలుకీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అలవాటైపోయింది. నూటికి 60 శాతం పైగా పేమెంట్స్ ఈ తరహాలోనే నడుస్తున్నాయి. దీంతో అత్యవసరమైన చోట ఖర్చు చేసేందుకు కూడా జేబులో రూ.10 ఉండని పరిస్థితి. ఈ ప్రభావం దేవాలయాలపై భారీగా కనిపిస్తోంది. దీంతో ఈ సమస్యకు ప్రత్యామ్నాంగా దేవాలయాల్లోనూ ఇటీవల కాలంలో హుండీ ఆదాయం గణనీయంగా పడిపోతోందని దేవాదాయ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనిని అధిగమించేందుకు నగరంలోని జూబ్లీహిల్స్లోని శ్రీ పెద్దమ్మ దేవాలయంతో పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, మహంకాళి దేవాలయం, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు పలు ప్రధాన ఆలయాల్లో ఈ–హుండీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా నగరంలోనే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ ఆలయంలో ఈ–హుండీ ఏర్పాటైంది. సోమవారం నుంచి భక్తులకు ఈ–హుండీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తులు ఇక్కడ స్కాన్ చేసి కానుకలను నేరుగా ఆలయ అకౌంట్లోకి పంపించవచ్చు. మొదటి రోజు ఈ విధానానికి భారీ స్పందన లభించింది. మిగతా ఆలయాల్లోనూ ఈ–హుండీలను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారుల నుంచి ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఆయా ఆలయాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. (చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు) -
మనిషి లక్షణాలు
ఆచారః కుల మాఖ్యాతిదేశ మాఖ్యాతి భాషణంసంభ్రమః స్నేహ మాఖ్యాతివపురాఖ్యాతి భోజనం’’ నడవడిక కులాన్ని (శీలాన్ని), మాటతీరు ప్రాంతాన్ని, సంభ్రమం (మర్యాదచూపే తీరు) ప్రేమను, శరీరం ఆహారపు అలవాట్లను తెలుపుతాయి. సంభ్రమం అంటే మర్యాద చేయటానికి పడే హడావుడి, కంగారు. ఈ సంభ్రమం ఎంతప్రేమ ఉన్నదో తెలియచేస్తుంది. ఇష్టమైనవాళ్ళు వస్తున్నారంటే కాళ్ళుచేతులు ఆడవు. వాళ్ళకి నచ్చినట్టు చేయాలనే తాపత్రయంలో ఒకదానికి ఒకటి చెయ్యటం కూడా కద్దు. ఆ విధంగా ΄÷రబడటం అవకతవకగా చెయ్యటం ప్రేమకి చిహ్నమే కాని, చేతకానితనం కాదు. కృష్ణుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంలో విదురుడు అరటిపండ్లు ఒలిచి ప్రేమగా పెడదామనుకుని, తొక్కలు కృష్ణుడి చేతిలో పెట్టి, పండు బయట పడేశాడుట! కృష్ణుడు ఆప్యాయంగా ఆ తొక్కలని తిన్నాడు ఆ సంభ్రమం వెనక ఉన్న ప్రేమని గుర్తించాడు కనుక. అదే ఇష్టంలేని వాళ్ళు వస్తే ఉన్నచోటు నుండి కదలబుద్ధి అవదు. తప్పనిసరి అయి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వవలసి వస్తే చేయవలసిన మర్యాదలన్నీ ఎక్కువగానే చేసినా మనసుపెట్టి చేసినట్టుగా ఉండదు. యాంత్రికంగా అనిపిస్తుంది.ఒక వ్యక్తి గురించి తెలియటానికి వారి గురించిన పరిచయ పత్రమో, నివేదికో చదివిన దానికన్న, వారిని ప్రత్యక్షంగా చూస్తే బాగా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అన్నదాన్ని చాణక్యుడు చక్కగా తెలియ చేశాడు. ఆచారం కులాన్ని తెలియచేస్తుంది అన్నాడు. ‘‘కుల’’మంటే ఈనాడు మనమనుకునేది కాదు. ఒక వృత్తిని అవలంబించే వారి సముదాయం లేక సంఘం. ఆచారమంటే తరతరాలుగా వస్తున్న అలవాట్లు, పద్ధతులు, సంప్రదాయాలు మొదలైనవి. ఇవి ఒక కుటుంబానికి మరొక కుటుంబానికే మారి΄ోతూ ఉంటాయి. అటువంటిది వృత్తులని బట్టి మారటం సహజమే కదా! ఉదాహరణకి ఉ΄ాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి సమయ΄ాలన, క్రమశిక్షణ తప్పులు లేకుండా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా మాట్లాడటం మొదలైనవి అలవాటవుతాయి.అందుకే ఎవరైనా తాను నిక్కచ్చిగా ఉండి, ఎదుటివారిని కూడా అట్లా ఉండమంటే ‘‘మరీ క్లాసు టీచర్ లాగా వెంట పడుతున్నాడు’’ అనటం వింటూ ఉంటాం. పనిచేసే తీరుని బట్టి కూడా ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవాళ్లని చెప్పవచ్చు. అన్ని వృత్తులు కూడా అంతే! కుల శబ్దానికి శీలమనే అర్థం కూడా చెప్పారు. శీలమైనా వ్యక్తమయ్యేది అలవాట్లలోను, పని చేసే తీరులోనే కదా! మాట తీరు ఆవ్యక్తి ఏ్ర ప్రాంతానికి చెందినవాడో తెలియచేస్తుంది. తెలుగు మాట్లాడేవాళ్ళే అయినా వాళ్ళు మాట్లాడే తెలుగు స్వస్థలం ఏదో చెప్పకనే చెపుతుంది. ‘‘ఈ సోరగాడు’’ అనగానే ఎక్కడివారో చెప్పనక్కర లేదు. ‘‘ఈ పిలగాడు’’ అని ఎవరంటారో అందరికి తెలుసు. ‘‘ఈ గుంటడు’’ అంటే ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వారని చెప్పనవసరం లేదు. మాటలే కాదు మాటాడే తీరు, అంటే యాస వాళ్లెక్కడి వాళ్ళో పట్టిస్తుంది. ఇదీ చదవండి: పాపాయితోనే మాస్టర్స్..కానీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్కి డబ్బుల్లేక అలా చేశా!అందుకే పండితులైన వాళ్ళు శిష్టవ్యవహారికం రాయటమే కాదు, మాట లో కూడా ప్రాంతీయత తొంగిచూడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే యాసలో మాట్లాడటం తప్పో తక్కువో అని కాదు. సమతని పాటించటం కోసం అంతే! అదే పరాయిభాష అయితే మరీ తేలికగా తెలిసి ΄ోతుంది. ఉత్తరదేశీయుల ఇంగ్లీషుకి, తెలుగువారి ఇంగ్లీషుకి, తమిళుల ఇంగ్లీషుకి, బెంగాలీల ఇంగ్లీషుకి తేడా స్పష్టంగానే కనిపిస్తుంది. విదేశీయులది సరే సరి. మాట వినగానే ఎక్కడివాళ్ళో వెంటనే తెలిసి΄ోతుంది. ఇక శరీరం తిన్న ఆహారాన్ని ప్రకటిస్తుంది. ఎటువంటి ఆహారం ఎంత తింటారు అన్నది ఆకారాన్ని చూసి చెప్పవచ్చు. మితాహారుల శరీరం చూడ ముచ్చటగా ఉంటుంది. అన్నీ నోటితో చెప్పనక్కర లేదు. చూడగానే తెలిసి΄ోతాయి. మన గురించి మంచి అభి్ర΄ాయం ఎదుటి వారికి కలగాలంటే ప్రవర్తనని, భాషని, ఆహారపుటలవాట్లని సరిచేసుకుంటే సరి. చదవండి: Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!– డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
చూసే దృష్టిని బట్టే మంచైనా..చెడైనా..!
తమిళనాడు రాష్టం తిరుచ్చిలోని ఒక ఆడిటర్కి ఇద్దరు మగపిల్లలు. కవలలైన వారిద్దరూ ఫిజియో థెరపీ కోర్సు చేశారు. స్వంతంగా క్లినిక్ ప్రారంభించాలని అనుకున్నారు. లక్షలు ఖర్చుపెట్టి భవనాన్ని నిర్మించారు.క్లీనిక్ ప్రారంభించేముందు తిరుమలకెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామని తిరుమల బయలుదేరారు. కొండమీద ఇసుక రాలనంత జనం ఉంది. వరాహస్వామి దర్శనం చేసుకుని ఓపికగా క్యూలో నిలబడ్డారు. వైకుంఠం కాంప్లెక్స్లో దేవస్థానం వారు అందించిన వేడివేడి పాలు తాగారు. చిన్న చిన్నగా క్యూ కదిలింది.‘కష్టపడి చదివాము, భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళనగా ఉంది’ అని కొడుకులిద్దరూ తండ్రితో చె΄్పారు. ‘‘ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ధైర్యంగా ఉండండి’’ అని బదులిచ్చాడు తండ్రి.ఇంతలో జనం తోసుకోవడం ప్రారంభమయ్యింది. మహాద్వారం వరకు ఒక్కటిగా వచ్చిన ముగ్గురూ వేరయ్యారు. విడివిడిగా దర్శనానికి వెళ్ళారు.ఆరోజు గురువారం కావడంతో మూలవిరాట్టు పైన నగలేమీ లేవు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చకర్పూరపు నామాన్ని అర్చకులు బాగా తగ్గించి ఉన్నారు. అందువల్ల భక్తులకు శ్రీవారి నేత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేత్ర దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించి ఉచిత ప్రసాదం ఇచ్చే చోట ముగ్గురూ కలిశారు. చిన్న లడ్డులు అందుకున్నారు.‘‘ఎలా జరిగింది దర్శనం?’’ అని తండ్రి ఇద్దరినీ అడిగాడు. పెద్దబ్బాయి ముఖం నల్లగా పెట్టి ‘‘దర్శనమైతే అయ్యింది కానీ, జనం నన్ను తొక్కేశారు. ఒళ్లంతా హూనమయ్యింది’’ అని బదులిచ్చాడు. చిన్నబ్బాయి మెరుపు ముఖంతో ‘‘స్వామి దర్శనంతోపాటు ఒళ్ళంతా ఫిజియో థెరపీ చేసుకున్నట్లయ్యింది. ఇప్పుడు నా శరీరం తేలికగా ఉంది’’ అన్నాడు. వెంటనే తండ్రి ‘‘గులాబీ తోటలోకి వెళ్ళిన కొందరు అందమైన గులాబీ పూలను చూస్తారు. మరికొందరు గులాబీ ముళ్ళను చూస్తారు. అలాగే మన జీవితాన్నీ, వృత్తినీ మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే, చెడ్డగా ఆలోచిస్తే అంతా చెడ్డే’’ అన్నాడు. నాన్న చెప్పిన మాటల్లోని అంతరార్థం తెలుసుకున్న కొడుకులిద్దరూ లడ్డు తింటూ మనసులోనే గోవింద నామస్మరణలు చేస్తూ చిన్నగా గుడి బయటికి వచ్చారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..) -
భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..
ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజుని దక్షిణ భారతదేశంలో అట్లతద్దిగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి తర్వాత నాల్గవ రోజు.. చవితి తిధి నాడు కర్వాచౌత్ పండుగ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలు, వివాహితులకు, కన్నెపిల్లలకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆ రోజు కన్నెపిల్లలు మంచి వరడు కోసం, పెళ్లైన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంంటారు. సాయంత్రం చంద్ర దర్శన అనంతరం విరమిస్తారు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రంలో చంద్ర దర్శనాన్ని భర్త సమక్షంలో సందర్శించి ఉపవాసాన్ని విరమించడం విశేషం. అయితే ఈ పండుగ భారతీయ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా ప్రజలు విభిన్న రకాలుగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..ఈ ఆచారాన్ని ఓ విదేశీయుడి ఆచారించిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. బ్రిటిష్ కంటెంట్ క్రియేటర్ నిక్ బుకర్ తన భార్య కోసం ఉపవాసం ఉండటం సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు హాట్టాపిక్గా మారింది. భారతచరిత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సదా షేర్ చేసుకునే నిక్ బుకర్ "మై డెస్పరేట్ కర్వా చౌత్ సెర్చ్ ఫర్ ది మూన్" అనే వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో నిక్ తన భార్యతో కలిసి ఈ పండుగను జరుపుకున్నానని, ఉపవాసం కూడా ఉన్నట్లు వెల్లడించాడు. ఆయన ముంబైలోని జుహూ బీచ్ సమీపంలో తన నివాసంలో ఈ పండుగను నిర్వహించి ఉపవాసం ఉన్నారు. అయితే త్వరితిగతిన చంద్రుడిని సందర్శించేందుకు ముంబై నుంచి ఢిల్లీ వచ్చి..అక్కడ లోధి హోటల్ నుంచి చంద్రుడిని చాలా త్వరితగతిన సందర్శించి తన భార్యతో కలిసి ఉపవాసం విరమించినట్లు తెలిపాడు. అంతేగాదు కర్వా చౌత్ను ఎందుకు జరుపుకుంటారు చాలా చక్కగా వివరించి భారతీయులందరి మనసులను గెలుచుకున్నాడు. చివరగా ఆ వీడియోలో ఈ రోజు ఉపవాసం ఉన్నవారందరికీ శుభాకాంక్షలు అని చెప్పాడు. అయితే నెటిజన్లంతా మా భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించినందుకు ధన్యవాదాలు, అలాగే మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నిక్ని ఆశీర్వదిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by IndoGenius | Nick Booker (@indogenius) (చదవండి: 'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!) -
అసలైన అనుసరణ అంటే ఏంటి?
బుద్ధుడు అనారోగ్యం పాలయ్యాక ‘ఇక నేను ఎక్కువకాలం జీవించలేను’ అని ప్రకటించాడు. దాంతో ధర్మంలో పరిపూర్ణత సాధించలేక పోయినవారు ఆవేదన చెందారు. ‘అంత గొప్ప మానవీయ ధర్మాన్ని ప్రబోధించిన బుద్ధుడు ఇక మనకు ఆట్టే కాలం కనిపించడా?’ అని కలవరపడ్డారు. ఇక తాము చేయాల్సిన విధులన్నీ దాదాపుగా మాని ఆయన వెంటే పడి తిరుగుతూ ఉండేవారు. ఆయనకు సేవ చేయడానికి పోటీపడేవారు. ఆ మహనీయుని సేవలో గడపడం గొప్ప కార్యంగా భావించేవారు. వారిలో అత్తదత్తుడు అనే వాడు మాత్రం బుద్ధుని చూడ్డానికీ, సేవకూ ఎప్పుడూ రాలేదు. బుద్ధుని విషయం తెలిసినప్పటినుంచి బుద్ధుని దగ్గరకు రావడమే మానుకున్నాడు. నిరంతరం ధ్యాన సాధనలో లీనమై పోయి ఉండేవాడు. ఒకరోజున భిక్షువులందరూ అతని మీద నింద మోపి బుద్ధుని ముందుకు తీసుకొచ్చి– ‘భగవాన్! చూశారా! మేమందరం మీ చెంతే ఉంటున్నాం. ఈ అత్తదత్తుడు మాత్రం ఈ ఛాయలకే రావడం లేదు’’ అని చె΄్పారు. ‘‘భిక్షూ! వీరి ఆరోపణ నిజమేనా? నీవు ఏం చేస్తున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు చిరునవ్వుతో. ‘‘నిజమే భగవాన్! నేను ధ్యానంలో పరిపూర్ణత సాధించలేదు. అర్హంతుడను కాలేదు. మీరు జీవించి ఉండగానే నేను అర్హంతుడను కావాలని నిశ్చయించుకున్నాను. అందుకే నిరంతరం ఆ మార్గంలోనే ఉంటున్నాను’’ అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘భిక్షువులారా! అత్తదత్తుడు చెప్పిందే సత్యం. మీరు ధర్మాన్ని అనుసరించడమ అంటే నన్ను అనుసరించడం కాదు. నా మార్గాన్ని అనుసరించడం. అర్హంతులు కావడం ఇకనైనా మీరు అర్హంత సాధనకు మళ్లండి’’ అని ప్రబోధించాడు. మిగిలిన భిక్షువులు అత్తదత్తుణ్ణి అనుసరించారు. వ్యక్తి మీద గౌరవం చూపడం కంటే ఆ వ్యక్తి నిర్దేశించిన మార్గంలో పయనించడమే అసలౌన ఆదర్శం అని తెలియజెప్పే ఈ కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినది, అనుసరించవలసిందీనూ. చదవండి: చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే! (అర్హతుడు –అర్హుడు, అర్హంత– అర్హత)– డా. బొర్రా గోవర్ధన్ -
పైడితల్లికి ప్రణమిల్లి..!
విజయనగరం రైల్వేస్టేషన్కి సమీపం లో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. వనం అంటే అడవి కనుక దీన్ని వనంగుడి అన్నారు. దీన్ని అమ్మపుట్టినిల్లుగా భావిస్తారు. ఊరి మధ్యలో ఉన్న చదురుగుడిని అమ్మవారి మెట్టినిల్లుగా పిలుస్తున్నారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలు (బిందెలు, కుండలు) ఉంటాయి. వీటిలో నీటిని అమ్మవారి తీర్ధంగా భక్తులు పుచ్చుకుంటారు. ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దాని కిందనే అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటున్నాడు.అమ్మే దారి చూపిస్తుంది...ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి కీలకమైన సిరిమాను చెట్టును పూజారికి పైడిమాంబ కలలో కనిపించి చూపిస్తుందని ఒక నమ్మకం. ఇది తప్పనిసరిగా చింతచెట్టు అయి ఉంటుంది. అమ్మ చూపిన దిక్కుగా వెతుక్కుంటూ వెళ్లిన పూజారి చెట్టును గుర్తించి భక్తులు, అధికారుల సమక్షంలో సేకరిస్తారు. ఈ ఏడాది సిరిమాను చెట్టు గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో పైడితల్లి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావుకు సాక్షాత్కరించింది. అదే గ్రామంలో ఇరుసుమానును గుర్తించారు. అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ చెట్లకు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి విజయనగరం పట్టణంలోని హుకుంపేటకు తరలించారు. అక్కడ చెక్కి, నునుపైన మానుగా తీర్చిదిద్ది ఉత్సవానికి సిద్దం చేస్తున్నారు. ఆలయం నుంచి కోట వరకూ సిరిమాను మూడుసార్లు తిరుగుతుంది. అనేక జానపద వేష ధారణలు సిరిమాను ముందు నడువగా, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటాయి.సందడంతా తొలేళ్ల సంబరానిదే...సిరిమానోత్సవం ముందురోజు రాత్రి చదురుగుడి వద్ద నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలతో కోటలోనికి తీసుకువెళతారు. కోటలో ఉన్న రౌండ్ మహల్ వద్దకు వెళ్లిన తర్వాత పూజారికి బోనాలు వాళ్లు అమ్మవారి చరిత్రను స్తుతిస్తూ రాగయుక్తంగా గానం చేస్తారు. అక్కడ పూజల అనంతరం ఘటాలు చదురుగుడి వద్దకు తరలిస్తారు. ఆ గుడి ఎదురుగా ఒక బడ్డీని ఏర్పాటుచేసి అక్కడ ఘటాలను ఉంచుతారు. తెలంగాణా ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల ఉత్సవంలో వినిపించే భవిష్యవాణì మాదిరిగానే ఇక్కడ కూడా పైడిమాంబ మాటగా పూజారి భవిష్యవాణిని వినిపిస్తారు. అప్పటికే పూజారిపై ఆవహించిన పైడిమాంబ తన మాటగా భక్తులకు భవిష్యవాణి వివరిస్తుంది.రాబోయే ఏడాదికాలంలో జరిగే మంచి ,చెడులను అమ్మపలుకుతుంది. పంటల విషయంలోనూ, పాడి సంపదల్లోనూ ఈ ప్రాంతం అభివృద్ది ఎలా ఉంటుందనేది కళ్లకు కట్టినట్లు అమ్మ పలికిస్తుంది. ఉపద్రవాలు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచిస్తుంది. అందరికీ ఉపయోగపడే ఆ భవిష్యత్ వాణిని వినేందుకు రైతులు అక్కడకుచేరుకుంటారు. ఆ తర్వాత పూజారి ధాన్యపు గింజలను రైతులకు అందజేస్తారు. వాటిని తమ పొలాల్లో తొలివేరుగా విత్తుకుంటే ఆ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయనేది రైతుల నమ్మకం. తొలేళ్ల ఉత్సవం సందర్భంగా వివిధ వేషధారణలతో పట్టణం కళకళలాడుతుంది. ఈ రాత్రంతా భక్తులు జాగారం మాదిరిగా పట్టణంలో కలియదిరుగుతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చిరు వ్యాపారులు వందలాది దుకాణాలు ఏర్పాటు చేస్తారు. రంగుల రాట్నం దగ్గర్నుంచి అనేక ఆట΄ాటలను అందుబాటులోకి తెస్తారు.ఏటా విజయదశమి తర్వాతే సిరిమానోత్సవం...పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకున్న పైడిమాంబను విగ్రహరూపంలో చెరువు నుంచి బయటకు తీసి గుడిలో ప్రతిష్టించినది విజయదశమి తర్వాత వచ్చిన మంగళవారం రోజున అని ప్రతీతి. అందుకే ప్రతీ ఏటా విజయదశమి వెళ్లిన తర్వాత వచ్చే తొలి మంగళవారం రోజున అమ్మవారికి సిరిమానోత్సవం నిర్వహిస్తారు. ఇలాంటి ఉత్సవం దేశంలో మరెక్కడా ఉండదు. దాదాపు 40 నుంచి 60 అడుగుల పొడవుండే సిరిమాను (చింతమాను)కు ఆసనం అమర్చి ఆ ఆసనంలో పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా కూర్చోబెట్టి చదురుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు. సిరిమాను ఊరేగింపు సాగినంత మేర భక్తులు పారవశ్యంతో అరటిపండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతూ అమ్మదీవెనలు అందుకుంటారు. ఈ ఉత్సవానికి పూసపాటి వంశస్తులు తరలివచ్చి తమ ఇంటి ఆడపడుచుకు లాంఛనాలు సమర్పించుకుంటారు.అద్భుతాలెన్నో....సిరిమాను బయలుదేరుతుందనగా సిరిమానుకు ముందు అమ్మ విగ్రహాన్ని వెలికి తీసిన వలకు గుర్తుగా బెస్తవారి వలను నడిపిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు పలువురు ఈటెలను ధరించి పాలధారగా అమ్మ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి డప్పు వాయిద్యాలతో మహారాజ కోట పశ్చిమ భాగంవైపు వెళ్లి, కోటశక్తికి నమస్కరిస్తారు. వీరంతా సైనికులుగా ఆ సమయంలో పనిచేస్తారు. సిరిమాను జాతరలో అంజలి రథానిది ఓ విలక్షణమైన స్థానం. సిరిమాను కు అంజలి ఘటిస్తూ ముందుకు సాగే రథంపై ఐదుగురు పురుషులు స్త్రీల వేషాలను వేసుకుని కూర్చొంటారు. వీరంతా ఆరుమూరల నారచీరను, చేతికి వెండి ఆభరణాలను ధరించి సంబరంలో పాల్గొంటారు. స్త్రీ వేషధారణలో ఉన్న వీరంతా అమ్మవారి పరిచారకులకు ప్రతీకలుగా వ్యవహరిస్తారు. వీరంతా అక్షింతలు పట్టుకుని సంబరం జరుగుతున్నంతసేపూ భక్తులపై విసురుతూ ఉంటారు. దానికి ప్రతిగా భక్తులు భక్తిభావంతో అరటిపళ్లను వారిపై విసురుతూ ఉంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో ΄ాటు సిరిమానోత్సవానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, కొలిచిన భక్తుల కొంగుబంగారమై ఉత్తరాంధ్ర ప్రజలను చల్లగా కాపాడుతోంది శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారు. విజయనగరంలో వెలిసిన ఆ తల్లి ఖ్యాతి రాష్ట్రాలు, ఖండాలు దాటి వ్యాపించింది. ఏటా నెలరోజుల పాటు నిర్వహించే పైడితల్లి అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేక పండగగా ప్రసిద్థి చెందింది. పండగే ఓ ప్రత్యేకతైతే ఆ పండుగలో సిరిమానోత్సవం నభూతో నభవిష్యత్ అనిపించేలా జరుగుతుంది. విజయనగరంలో అమ్మవారు వెలిసిన నాటి నుంచి ఇక్కడి ప్రజలు కష్టాలే ఎరుగలేదన్న విశ్వాసం గట్టిగా ఉంది. ఏ ఊరిని తుఫాను ముంచెత్తినా, ఏ ఊళ్లో కల్లోలాలు జరిగినా విజయనగరం మాత్రం ప్రశాంతంగా ఉండటాన్ని అమ్మవారి అ΄ార కరుణకు నిదర్శనంగా ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు.సిరిమానుకు దారిలాపైడితల్లి అ్మమవారి కృపాకటాక్షాలు దక్కించుకోవడానికి హైదరాబాద్ నుంచి విజయనగరానికి నేరుగా రైళ్ల ద్వారా చేరుకోవచ్చు. దేశ, విదేశాల నుంచి విమానయానం ద్వారా రావాలనుకున్న వారు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి కేవలం గంటన్నర వ్యవధిలోనే విజయనగరం చేరుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు ప్రైవేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక పక్కనే ఉన్న ఒడిశా నుంచి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వీరంతా వాహనాలు, రైళ్లు ద్వారా నేరుగా విజయనగరం చేరుకోవచ్చు. ఒడిశా ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. విజయనగరం రైల్వేస్టేషన్లో అడుగు పెట్టగానే ఎదురుగా పైడితల్లి అమ్మవారు వెలిసిన వనంగుడి భక్తులకు కనబడుతుంది. అమ్మవారిని దర్శించిన భక్తులు అక్కడ నుంచి ఆటో, కారు, ఇతర వాహనాల ద్వారా కేవలం 10 నిమషాల వ్యవధిలోనే కిలోమీటరున్నర దూరంలో ఉన్న కోట ప్రాంతానికి చేరుకోవచ్చు. కోట సమీపంలోని మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడిలో పైడితల్లిని దర్శించుకుని తరించి అమ్మవారి కృప పొందవచ్చు.ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబరు 12న పందిరిరాటతో శ్రీకారం చుట్టారు. ఆ రోజు చదురగుడి, వనం గుడి వద్ద పందిరి రాట వేశారు. అదేరోజు అమ్మవారి మండల దీక్షలను చదురగుడి వద్ద ప్రారంభించారు. అక్టోబరు 2న అర్ధమండల దీక్ష మొదలుపెట్టారు. అక్టోబర్ 6, సోమవారం తొలేళ్ల ఉత్సవం, 7, మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుంది. పెద్ద చెరువులో 14న తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీ ఆదివారం వనం గుడి నుంచి కలశజ్యోతి ఊరేగింపు, 21వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం, 22న చండీహోమం, పూర్ణాహుతితో పైడిమాంబ ఉత్సవాలు ముగుస్తాయి. – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, అమరావతి, ఫొటోలు: డి. సత్యనారాయణ మూర్తి -
ఆకాశంలో... ఆదిదంపతులు
పూర్వం ఒకప్పుడు గ్రీష్మ ఋతువు ఆగమనాన్నిగమనించిన పార్వతి, శివుడిని ‘స్వామీ! గ్రీష్మ ఋతువు వచ్చేసింది. వేడి వాతావరణం అంతటా నిండిపోయింది. తలదాచుకుందుకు ఇల్లు లేకుండా వేసవిలో రోజులు ఎలా గడపగలం?’ అని అడిగింది. దాక్షాయణి మాటలను విన్న శివుడు ‘దేవీ! మొదటి నుండీ మనది వనవాసమే కదా! ఇప్పుడు కొత్తగా ఈ కంగారేమిటి?’ అన్నాడు. శంకరుడు అలా మాట్లాడేసరికి సతీదేవి మరేమీ ఎదురు చెప్పలేకపోయింది. గ్రీష్మ ఋతువు ఎలాగో గడిచిపోయింది. వర్ష ఋతువు వచ్చింది. అన్ని దిక్కులా నల్లని మేఘాలు ఆవరించి అంధకారం అలుముకుంది. పార్వతి పతిని సమీపించి ‘మేఘాలు గర్జిస్తున్నాయి. కనులు మిరుమిట్లు గొలుపుతూ మెరుపులు మెరుస్తున్నాయి. ఆకాశం నుండి కురుస్తున్న వర్షధారలు నేలను తాకి శబ్దం చేస్తున్నాయి. నీటితో నిండుతున్న జలాశయాలపై కొంగలు పంక్తులుగా ఎగురుతున్నాయి. రివ్వున వీస్తున్న గాలుల తాకిడికి కదంబ, కేతకి, అర్జున వృక్షాలు పుష్పాలను రాలుస్తున్నాయి. మేఘాల గర్జనకు భీతిల్లిన హంసలు జలాశయాలను వదిలి పోతున్నాయి. ఇటువంటి దుస్సహమైన వాతావరణంలో స్వామివారు కరుణించి ఈ మహత్తరమైన మందరగిరిపై ఒక ఇంటిని నిర్మిస్తే నా దిగులు తీరుతుంది!’ అంది. పార్వతి మాటలు విన్న ఫాలలోచనుడు ‘పార్వతీ! ఇల్లు నిర్మించుకుంటే బాగానే ఉంటుంది. కాని నా దగ్గర దానికి కావలసినంత ధనం లేదు. వ్యాఘ్రచర్మంతో శరీరాన్ని కప్పుకుని తిరిగేవాడిని నేను. సర్పములే నాకు భూషణములు కదా!’ అన్నాడు. ‘వేసవికాలంలో చెట్లనీడలలో కాలం గడిచి పోయింది. కానీ ఇప్పుడు, ఈ వర్షాకాలంలో అలా సాధ్యం కాదు కదా మహా దేవా!’ అని విన్నవించుకుంది పార్వతి. ‘మేఘమండలం పైకి చేరుకుంటే వర్షపు నీరు మీద పడి శరీరం తడిసే సమస్య ఉండదుగా దేవీ!’ అన్నాడు శంక రుడు పార్వతి విన్నపానికి సమాధానంగా! తతో హరస్తద్ఘనఖణ్డమున్నత మారూహ్య తస్థౌ సహ దక్షకన్యయాతతో భవన్నామ మహేశ్వరస్య జీమూతకేతుస్త్వితి విశ్రుతం దివి‘‘అలా చెప్పిన శంకరుడు పార్వతి తోడుగా ఆకాశంలో మేఘమండలాల స్థాయిని దాటి పైకి వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. అప్పటి నుండి దేవలోకంలో శంకరుడు ‘జీమూతకేతు’ అనే పేరుతో విశ్రుతుడై నిలిచాడని ‘వామన పురాణం’లోని పై శ్లోకం చెప్పింది.– భట్టు వెంకటరావు -
ఆవగింజంత విశ్వాసం.. అద్భుత విజయాలు
కండబలంతోనే బతికేటట్లయితే, దేవుడు సృష్టించిన ఈ విశాల విశ్వంలో ఈగలు, దోమల్లాంటి అల్ప జీవులకు అసలు తావుండేది కాదు. ఏలా లోయలో ఫిలిష్తీయులతో భీకర యుద్ధం జరుగుతుంటే, ఇశ్రాయేలీయుల సైనికులైన తన ముగ్గురు అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దావీదు యుద్ధభూమికి వెళ్ళాడు. అక్కడ ఫిలిస్తీయుడైన గొల్యాతు అనే మహాబలుడు ప్రతిరోజూ తన కండలు ప్రదర్శిస్తూ, ధైర్యముంటే ఒక్కొక్కరుగా వచ్చి తనతో తలపడమంటూ తొడలు కొట్టి సవాలు చెయ్యడం, ఇశ్రాయేలీయులంతా అతనికి జడిసి గుడారాల్లో దాక్కోవడం దావీదు చూశాడు. గొల్యాతు అనేవాడి రూపంలో ‘భయం’ రాజ్యమేలుతున్న యుద్ధభూమిలో, యుద్ధం జరగకుండానే విజేతలెవరో నిర్ణయమైంది. విశ్వాసులుగా నిర్భయంగా జీవించాల్సిన, రోషంతో యుద్ధం గెలవాల్సిన ఇశ్రాయేలీయులు తమ విజయం పైన, ప్రాణాలపైన ఆశలొదిలేశారు, దేవుణ్ణి కూడా వదిలేశారు, వాళ్ళ రాజైన సౌలయితే, అంతా వదిలేసి గడగడలాడుతూ కూర్చున్నాడు. ఆ స్థితిలో దావీదు యుద్ధరంగ ప్రవేశం చేసి, గొల్యాతుతో తాను యుద్ధం చేస్తానన్నాడు. బక్కగా, పీలగా, ఇంకా లేత ప్రాయంలో ఉన్న దావీదు ఏ విధంగానూ గొల్యాతుకు సమ ఉజ్జీ కాదనుకున్నారంతా. అయితే తనతో దేవుడున్నాడన్న కొండంత విశ్వాసంతో, దావీదు అందరి అంచనాలను ముఖ్యంగా శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ, వడిశెల రాయితో గొల్యాతు ను మట్టికరిపించి అతని కత్తితోనే అతని శిరచ్ఛేదనం చేశాడు, దేవుని ప్రజలకు అలా గొప్ప విజయాన్ని అనూహ్యంగా సాధించి పెట్టాడు.దేవుడెంత శక్తిమంతుడో, గొప్పవాడో ఇశ్రాయేలీయులందరికీ తమ పూర్వీకులు చెప్పిన విషయాల ద్వారా సైద్ధాంతికంగా తెలిసినా, దేవుని బాహుబలం తమను కూడా నాటి యుద్ధంలో గెలిపిస్తుందన్న ‘ఆచరణాత్మక విశ్వాసం’ లోకి వారు ఎదగ లేకపోయారు. అయితే దేవుడు తనతో ఉండగా శత్రువుల కండలు, మారణాయుధాలు, పెడబొబ్బలు వీటన్నింటికీ అతీతమైన విజయం తన సొంతమని నమ్మిన ‘ఆచరణాత్మక సజీవ విశ్వాసం’తో దావీదు యుద్ధాన్ని గెలిపించాడు. కేవలం ఆవగింజంత విశ్వాసంతో అత్యద్భుత కార్యాలు చెయ్యొచ్చని యేసుప్రభువు బోధించాడు. ఆవగింజ నలుసంతే ఉండొచ్చు కాని అది ఒక విత్తనం కనుక అందులో జీవం ఉంటుంది. నేలలో పడ్డ నలుసులో వెయ్యేళ్ళయినా మార్పు రాదు కాని నేలలో పడ్డ ఒక ‘ఆవగింజ’ అతి చిన్నదే అయినా, కొన్నిరోజుల్లోనే మట్టిపెళ్ళల్ని, రాతికుప్పల్ని పెకిలించుకొని పైకొచ్చి మొక్కగా ఎదుగుతుంది. ఆవగింజలో, ఆ మాటకొస్తే ప్రతి విశ్వాసిలో దేవుడు నిక్షిప్తం చేసిన కార్యసాధక మహాశక్తి ఇది. ఆవగింజలోని ఈ శక్తి దేవుడిచ్చే తేమ, సూర్యరశ్మితో అంకురించినట్టే, దేవుని సహవాసం, ప్రేమ, సాయం తోడైన విశ్వాసంతో మహాద్భుతాలు జరుగుతాయన్నది బైబిల్ చెప్పే గొప్పసత్యం.చదవండి: Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్ భయం నీడలాంటిది. సూర్యుడు వెనకుంటే నీడ మన ముందుండి భయపెడుతుంది. దేవుడు మన ముందుంటే భయం అనే మన నీడ మన వెనక్కి పారిపోతుంది. కండబలంతో కాక, దేవుని పట్ల విశ్వాసమనే ఆయుధంతోనే వాటిపై విజయం సాధించగల మన్నది ఈ దావీదు ఉదంతం తెలిపే వెలలేని ఆత్మీయ పాఠం.– సందేశ్ అలెగ్జాండర్ -
గయ మహిమ : ఆయన శరీరమే క్షేత్రంగా
‘త్రిమూర్తుల్లో భేదం లేదు, ముగ్గురూ ఒకటే’ అనటానికి గయ క్షేత్రం నిదర్శనం. చనిపోయిన ఆత్మీయ బంధు మిత్రుల పేర ఈ చోట కర్మకాండలా చరిస్తే మరణించిన వారికి ఉత్తమ గతులు కల్గుతాయి. ఈ కర్మనే ‘గయా శ్రాద్ధ’ మంటారు. మన ఇంటిలో పితృకార్యం జరిగినప్పుడు కూడా ‘గయా శ్రాద్ధ ఫలితమస్తు’ అని మంత్రం చదువుతారు. పిండ ప్రదానం చేస్తూ ‘గయా పిండ సదృశా భవంతు’ అని అంటారు. మన దేశంలో గయ, కాశీ, ప్రయాగ... ఈ మూడు ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన క్షేత్రాలు, తీర్థాలున్నూ! వీటినే క్షేత్ర త్రయమంటారు. ఈ గయా క్షేత్రానికి పెద్ద చరిత్ర ఉంది. వేల సంవత్సరాలకు పూర్వం గయుడనే రాక్షసుడుండేవాడు. విష్ణువును గురించి ఘోరంగా తపస్సు చేసి, వందల మైళ్ళ దీర్ఘమైన భారీ శరీరం కావాలని వరం కోరుకున్నాడు. క్షణంలో అంత పెద్ద భయంకర శరీరం గయునికి వచ్చింది. గర్వం నెత్తికెక్కినప్పుడు ఎవరికైనా తిక్క మాటలు వస్తాయి. ఏకంగా బ్రహ్మదేవుడినే ఉద్దేశించి, ‘నీకేమైనా వరం కావాలంటే కోరుకో’ అన్నాడు. ఎంత కండకావరమో చూడండి! ‘అయితే గయుడా! ఈ శరీర భాగాల్లో ఒక చోట నాకు యజ్ఞం చేయాలని ఉంది’ అంటాడు బ్రహ్మ. ‘అలాగే యజ్ఞం చేయి కానీ, ఒక షరతు! అప్పుడు నా శరీరం కదలటానికి వీలులేనంత బరువు నాపై పెట్టాలి’ అన్నాడు. బ్రహ్మ ముందు శివ పార్వతులను ప్రార్థించాడు. ‘శివ శిల’ అనే పెద్ద రాయిని గయుడి మీద పెట్టారు. వెంటనే రాక్షసుని రొమ్ము మీద నిలబడ్డాడు విష్ణువు. ఎంత గింజుకున్నా గయుడింక కదలలేడు. బ్రహ్మ సంకల్పం కదా! శివుని శిల, విష్ణు పాదం... ఈ ముగ్గురి స్పర్శాదుల వల్ల వాడిలో మార్పు వచ్చింది. ‘త్రిమూర్తులు నా వల్ల జగత్తుకు ఏ మాత్రం బాధ కలగకూడదని సంకల్పించి యుక్తిగా నా లోని చెడును ఈ విధంగా తొక్కిపెట్టారు’ అని తప్పు తెలుసుకున్నాడు. ‘నా చివరి కోరిక ఒక్కటే. ఈ ప్రాంతానికి నా పేరు పెట్టాలి. నా మీద పడిన పవిత్ర పాదముద్రలకు అభిషేకం చేసినా, పితృశ్రాద్ధం చేసినా, నివేదనం పెట్టినా భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థించాడు.తమాషా ఏమిటంటే ఇంతవరకూ బ్రహ్మ గయుని దేహం మీద యజ్ఞం చేయలేదు. గయుని పైకి లెమ్మని కూడా అనలేదు. గయుని శరీరమే గయా క్షేత్రంగా ఉండిపోయింది. త్రిమూర్తుల సమష్టి కృషి ఫలితంగా లోక కల్యాణం కలుగుతున్నది.శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటం ఏదంటే..
శ్రీరామ పట్టాభిషేకం మూర్తి ప్రతి ఇంటిలోనూ ఉండాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు. కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం. పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు – సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ. రాముడు అకారానికి ప్రతినిధి,యో వేదాదౌ స్వరప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!.అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ. ’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ. అకార ఉకార మకార నాద స్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది. ఆయనకి పూజ చేయడానికి వాళ్ళు చేయవచ్చా? వీళ్ళు చేయవచ్చా? అని అభ్యంతరం ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది. (చదవండి: కొలిచిన వారికి 'బంగారు తల్లి'! పులి రూపంలో తిరుగుతూ..) -
తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?
ఈ సందేహం దాదాపు అందరికీ కలుగుతుంది. ఎందుకంటే, మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం...ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలని చెబుతోంది శాస్త్రం... పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృ యఙ్ఞాన్ని నిర్వహిస్తాడు... పుత్రులు లేనివారి సంగతి ఏమిటి మరి? వారి గతి అథోగతేనా? అంటే..కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు...లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు...అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. ఎలా పెట్టాలంటే..?సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరం) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. మహాలయం పెట్టలేని పక్షంలో కనీసం గతించిన పెద్దలను తలచుకుని వారి పేరు మీదుగా శక్తిమేరకు శుచిగా వంట చేసి భోజనాలు పెట్టాలి. ఇలాంటి క్రతువులపై విశ్వాసం లేనివారు కూడా పేదలకు అన్నదానం చేయడం ఆవులకు పచ్చగడ్డి తినిపించడం, శునకాలకు, కాకులకు ఆహారం పెట్టడం మంచిది. మహాలయ పక్షాలలో శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రవచనం. (సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు మహాలయ పక్షాలు) (చదవండి: మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం) -
విశుద్ధి చక్ర నిలయా..!
475వ నామం వద్ద అమ్మవారిని ‘విశుద్ధి చక్ర నిలయా‘ అనగా విశుద్ధి చక్రంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన సూక్ష్మ శరీరంలో కంఠం వద్ద ఉంటుంది. కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటునప్పుడు మనిషికి సంఘ జీవనం అలవడి, సాక్షీభూత స్థితిలో దైవికమైన చాతుర్యంతో మాట్లాడగల వాక్ శక్తి లభిస్తుంది.103వ నామం వద్ద అమ్మవారిని ‘ఆజ్ఞా చక్రాంత రాళస్థా‘అనగా ఆజ్ఞాచక్రం మధ్యలో ఉండునది అంటూ వర్ణిస్తారు. ఈ ఆజ్ఞాచక్రం మనం నుదురు మీద బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఉంటుంది, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటినప్పుడు మనిషి లోపల క్షమాగుణం నెలకొని పరిపూర్ణ నిర్విచార స్థితి అనగా ఆలోచనలు లేని స్థితిని పొందుతాడు. సాధారణం గా మనిషికి ఆలోచనలు లేకుండా ఉండడం నిద్రలో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఈ స్థితిని చేరుకున్న మనిషి మెలకువగా ఉన్నప్పుడు కూడా ఆలోచనలు లేని స్థితిని పొందగలుగుతాడు. 105వ నామం వద్ద ‘సహస్రారాంబుజారూఢా‘ అనగా సహస్ర దళ పద్మంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన తల మీద మాడు ప్రాంతం లేదా బ్రహ్మ రంధ్రం వద్ద ఉంటుందని, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని ఛేదించుకొని పైకి వచ్చినప్పుడు మనిషికి యోగం లభిస్తుందని వివరిస్తారు. మానవ చేతన తన చుట్టూ ఉండే భగవంతుని పరమ చైతన్య శక్తితో అనుసంధానాన్ని పొందుతుందని, మానవ మెదడును లోపల నుండి గమనిస్తే, 1000 నరాలు కలిసి, 1000 దళాలు గల పద్మంలా కన్పిస్తుందని, అందుకే ‘సహస్రారం’ అని పిలుస్తారని చెబుతారు. 106వ నామం వద్ద ‘సుధాసారాభి వర్షిణి’ అనగా అమృతధారలు కురిపించునది అని వర్ణిస్తారు. కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని దాటిన తరువాత చైతన్య తరంగాల అనుభూతి మొదలవుతుంది. అమృత ధారల వంటి ఈ చైతన్య తరంగాలను అనుభూతి చెందడం కుండలినీ జాగృతి వల్లే సాధ్యమవుతుంది. ఆ సమయంలో సాధకులు బ్రహ్మానందానుభూతిలో లీనమవుతారు.– డా. పి. రాకేష్పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా (చదవండి: మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం) -
మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం
పూర్వం తన తల్లి దాస్య విముక్తికోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకుపోతూండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండేచోటున పడిందట. దాని ఫలితంగా అప్పట్లో ఆ మడుగులో స్నానం చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగానూ, యవ్వనవంతులుగానూ మారిపోవడంతోపాటు అమరత్వం కూడా పొందేవారట. దాని మహిమను ప్రత్యక్షంగా చూసిన నారదుడు బ్రహ్మదేవుడికి నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు అనిపించింది. వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి, ‘‘హనూ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి‘ అన్నాడు. చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూ వుంది.ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలు΄ోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలో వుండే విష్ణుమూర్తి వద్దకు ΄పోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి విన్నవించారు. విష్ణుమూర్తి అంతా విని, ‘‘నాకూ, శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!‘ అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపివేశాడు. తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూ వున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు. అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకు΄ోయింది.అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది– పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతాన్ని తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి ‘పుష్పగిరి’ అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై వెలుగొందుతోంది. ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు పక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ’మధ్య కైలాసం’ అనీ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.హరిహరాదుల క్షేత్రంశివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.జనమేజయుడు చేసిన సర్పయాగ పాపరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్రపాదం, విష్ణుపాదం ఈ కొండ మీదే ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవస్వామికి పూజలు జరుగుతాయి. పాతాళగణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.(చదవండి: లాల్బాగ్చా నిమజ్జనంలో ఏం జరిగింది..? మండిపడుతున్న భక్తులు..) -
చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది? సూతక కాలం అంటే..
భాద్రపద పౌర్ణమి, ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం(Chandra Grahan) ఏర్పడనుంది. గతంలో ఒకటి రెండు గ్రహణాలు వచ్చినా అవి మన దేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం మన దేశంలో లేదు. ఈ ఆదివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది. గ్రహణ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలనే దానిపై పండితులు చెప్పిన వాటిలో ముఖ్యాంశాలు. ఆదివారం,7న రాత్రి 9:58 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది. దీని మొత్తం వ్యవధి దాదాపు మూడున్నర గంటలు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం.సూతక కాలం అంటే ఏమిటి? ఆ సమయంలో ఏం చేయాలి?హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడటానికి ముందు కొంత సమయం నుంచి, గ్రహణ సమయంతో పాటు, గ్రహణం తరువాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే ఆదివారం మధ్యాహ్నం 12.57 నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు, పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తరువాత తలుపులు తెరిచి యథావిధిగా పూజలు చేస్తారు. రాహుకేతు పూజలు జరిగే ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటాయిపాటించాల్సిన నియమాలు ఏంటంటే...గ్రహణం రోజున సూతక కాలం ఆరంభం అయినప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు. ఆరోగ్యం సరిగా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేక΄ోతే ΄ాలు, పండ్ల రసం వంటివి తీసుకుంటారు. అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం.గ్రహణం సమయంలో శుభకార్యాలు, పూజలు, దేవాలయ దర్శనాలు చేయరు. వీలైనంత వరకు భగవన్నామ స్మరణ, ధ్యానం మంచిది. .దానాలు శ్రేష్టంచంద్ర గ్రహణం ముగిసిన తర్వాత సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహణ సమయంలోనూ, ఆ తర్వాతా చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శక్తిమేరకు బట్టలు, ఆహారం, ధాన్యం, డబ్బు దానం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నమ్మకం. అలాగే గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం, బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. ఈ ఆదివారం రానున్న చంద్ర గ్రహణం రోజు మనం కూడా పెద్దలు, శాస్త్రాలు చెప్పిన పరిహారాలు పాటించడం శ్రేయస్కరం. దైవారాధన ఎలా?గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని నిత్యపూజ చేసుకోవాలి. (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు) -
విష్ణు సేనాపతి విష్వక్సేనుడు
శైవ సంప్రదాయంలో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులు తొలిగా విష్వక్సేనుని స్మరిస్తారు, పూజిస్తారు. ఈయన విష్ణుగణాలకు అధిపతి. వైకుంఠసేనాని. సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ఉంటాడు.వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు. బంగారు వర్ణంతో విశాలమైన కనులతో పుట్టుకతోనే దేహంపై శంఖం, ఖడ్గం, ధనస్సు చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుడతాడు. ఈయనను కశ్యపమహర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాలను నేర్పిస్తాడు. తరువాత వృషభాద్రిపై 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహంతో సేనాపతిగా అవతరిస్తాడు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య భాగంలో విష్వక్సేనుల వారి సన్నిధి ఉందనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్వామివారి ఆలయానికి చుట్టూ ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో ఈ సన్నిధి కనిపిస్తుంది. అయితే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ముక్కోటి ప్రదక్షిణ ్ర΄ాంతాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది. అప్పుడు కూడా భక్తుల రద్దీ వలన ఈ సన్నిధి దగ్గరికి వెళ్లడానికి అందరికీ అవకాశం ఉండదు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ముందుగా సేనాపతి ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈయన నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు వాహనంపై వేంచేస్తారు.విష్వక్సేనుడు జ్ఞాన ప్రదాయకుడు. ఈయన నాలుగు చేతులతో పద్మపీఠంపై ఆసీనుడై నిజ హస్తాలతో కుడిచేత అభయ ముద్ర లేక సూచి హస్తం లేక పుష్పాన్ని ధరించి ఉంటాడు.విష్ణు స్వరూ΄ానికి ఈయనకు ఒకటే తేడా. మహావిష్ణువుకు శ్రీవత్సం బ్రహ్మసూత్రం ఉంటాయి. విష్వక్సేనుడికి అవి ఉండవు. ఈ స్వామి ముక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని పరాశర సంహిత చెప్పింది.– కె.వి.ఎస్. బ్రహ్మాచార్య, ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
కేరళ సంస్కృతికి దర్పణం ఈ పండుగ..!
కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మలయాళీలు ఘనంగా జరుపుకునే పర్వదినాలలో ఇది ఒకటి. వితరణ శీలి, ప్రజానురంజక పాలకుడైన బలిచక్రవర్తి ఈరోజు భూమి మీదకు తిరిగి వస్తాడని మలయాళీలు నమ్ముతారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. ఇది 12 రోజులపాటు జరుపుకునే పండుగ. ఇది ఎంతో చరిత్ర, సంంస్కృతి, మతపరమైన ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ సంవత్సరం ఓనం పండుగను సెప్టెంబరు 5, శుక్రవారం జరుపుకోనున్నారు. తిరువోణం అని పిలువబడే రోజునే బలి వస్తాడంటారు. ఆ రోజే ప్రధానవేడుకను చేసుకుంటారు. కేరళ సంస్కృతికి అద్దం పట్టే పండుగ ఓనం. బలి చక్రవర్తి ఆగమనాన్ని పురస్కరించుకుని మలయాళీలు ఈరోజున తమ ఇళ్లను పువ్వులు, తోరణాలు, రంగోలీలతో ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ఖీర్, పులిస్సేరి వంటి రుచికరమైన వంటకాలను కూడా తయారు చేస్తారు. ప్రతి కుటుంబం ఓనం సద్యను తయారు చేస్తాయి. ఈ శాకాహార భోజనంలో 20కిపైగా వంటకాలు ఉంటాయి.ఈ పండుగను పురస్కరించుకుని కథాకళి నృత్యం, వల్లం కలి(బోట్ రేస్) వంటివి ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు కైకొట్టికలి, తుంబి తుల్లాల్ సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈరోజున మగవారు చొక్కా, ముండు అని పిలువబడే లుంగీ ధరిస్తారు. స్త్రీలు ముండు, నరియతు అనబడే ఒక బంగారు పై ఆచ్చాదనను ధరిస్తారు. ఓనం కేరళలో వ్యవసాయ పండుగ. కుమ్మట్టికలి, పులికలి వంటి జానపద ప్రదర్శనలు కూడా ఇస్తారు.పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య) వంటి ఆటల్లో పాల్గొంటారు.ఓనం పండుగ ముఖ్య తేదీలుసెప్టెంబర్ 4, 2025 – ఉత్రాదం రోజు, మొదటి ఓనం (ఉత్రడప్పచ్చిల్)సెప్టెంబర్ 5, 2025 – తిరువోణం రోజు, రెండవ ఓణం (ప్రధాన వేడుక)సెప్టెంబర్ 6, 2025 – అవిట్టం రోజు, మూడవ ఓనం, త్రిస్సూర్ పులికలిసెప్టెంబర్ 7, 2025 – చాతాయం రోజు, నాల్గవ ఓనం (చదవండి: గణేశ నిమజ్జనం ఆంతర్యం..!) -
విశాఖలో భక్తి ముసుగులో మరో మోసం
సాక్షి, విశాఖపట్నం: పాత గాజువాక లంకా మైదానంలో ఎస్వీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం వద్ద నిర్వాహకులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. సుందర వస్త్ర మహాగణపతి దర్శనానికి విచ్చేసిన భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు విగ్రహం వద్దకు వచ్చి దర్శనాలను కొద్దిసేపు నిలిపివేశారు.ఆంక్షలకు తూట్లు పొడుస్తూ ఉత్సవ నిర్వాహకులు దర్శనానికి వచ్చేవారి నుంచి టికెట్ల పేరుతో వసూళ్లకు పాల్పడటంతో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. భారీ వినాయకుడి మండపం వద్ద అర్చనలు, అన్న సమారాధన, వాహనాల పార్కింగ్, చెప్పులు భద్రపరచడం వంటి పేర్లతో వ్యాపారానికి తెరలేపడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వినాయక మండపాల వద్ద కమర్షియల్ టికెట్లు ఉండకూడదని పెట్టిన నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని గాజువాక సీఐ పార్థసారథి హెచ్చరించారు. -
గిన్నిస్లో గణపయ్య..!
గిన్నిస్లో గణపయ్యవినాయకుడు దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం. పురాతన కాలం నుంచి వినాయకుడి ఆలయాలు పలు దేశాల్లో ఉన్నాయి. గుజ్జు రూపంలో ఉండే బొజ్జ గణపయ్యను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. విలక్షణంగా కనిపించే వినాయకుని విగ్రహాలు జనాలను అమితంగా ఆకట్టుకుంటాయి. వీథుల్లో వెలిసే మండపాల్లో కనిపించేవిగ్రహాల సంగతి సరే సరి, ‘గిన్నిస్’కెక్కిన వినాయకుడి విగ్రహాల గురించి తెలుసుకుందాం.అత్యధిక వినాయక విగ్రహాల సేకరణఅత్యధిక సంఖ్యలో వినాయక విగ్రహాలను సేకరించిన ముంబై మహిళ రమా షా గిన్నిస్ రికార్డు సాధించారు. ముంబైలోని సాయన్ భగినీ సమాజ్ భవనంలో 2014 నవంబర్14న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె తాను సేకరించిన 18,181 వినాయక విగ్రహాలను ప్రదర్శించారు. వీటిలో రకరకాల పరిణామాలకు చెందినవి ఉన్నాయి. రకరకాల ముడిపదార్థాలతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ ప్రదర్శనను సందర్శించి, ఆమెకు సర్టిఫికెట్ను బహూకరించారు. ఆ తర్వాత రెండేళ్లకు 2016 ఆగస్టు 23న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె ఏకంగా 1.50 లక్షల వినాయక విగ్రహాలను ప్రదర్శించి, తన రికార్డును తానే బద్దలు కొట్టారు. గిన్నిస్బుక్ ఈ రికార్డును కూడా గుర్తించి, రమా షాకు సర్టిఫికెట్ ఇచ్చింది. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ రికార్డును నమోదు చేసుకుంది. పదకొండేళ్ల వ్యవధిలో ఆమె ఈ విగ్రహాలను సేకరించారు. కళ్లకు గంతలు కట్టుకుని...చిన్ననాటి నుంచి కళలపై మక్కువ ఉన్న రమా షా చిత్ర, శిల్ప కళలలో సాధన చేశారు. తన పదిహేడేళ్ల వయసు నుంచి ఆమె మట్టితో వినాయకుడి విగ్రహాలను స్వయంగా తయారు చేయడం మొదలుపెట్టారు. మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేయడంలో ఆమె సాధన ఎంతటిదంటే, కళ్లు మూసుకుని కూడా సునాయాసంగా విగ్రహాలను తయారు చేయగలరు. కళ్లకు గంతలు కట్టుకుని మరీ వినాయక విగ్రహాల తయారీని ప్రదర్శించి, ముంబై జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పటి వరకు ఆమె 3.78 లక్షల వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేశారు. ఆమె పేరిట ఇప్పటికి ఆరు ప్రపంచ రికార్డులు, పదహారు జాతీయ రికార్డులు ఉన్నాయి.(చదవండి: ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!) -
శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..
దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును చాలామంది సమర్థించగా పలు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ధర్మాసనం పునః పరిశీలించి.. తుది తీర్పును తాజాగా వెల్లడించింది. వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లలో ఉంచరాదని.. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లో ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే విధంగా.. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు హెచ్చరించింది. దేశ రాజధానిలో శునకాల పరిస్థితి ఇలా ఉంటే.. కొన్ని చోట్ల కుక్కలు దాడి చేయడం గానీ, కుక్క గాటుకి గురైన దాఖలు లేని ప్రదేశాలు ఉన్నాయంటే నమ్ముతారా..!. అంతేగాదు అక్కడ శునకాన్ని ఆరాధ్య దైవంగా పూజలు చేస్తారట. ఆ శునక దేవుడిని భక్తులు కొలిచే విధానం నుంచి సమర్పించే నైవేద్యం వరకు ప్రతీది అత్యంత ప్రత్యేకమే. మరి ఆ విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ఆ ప్రదేశమే కేరళలోని పరస్సిని మడప్పుర ఆలయం. కేరళలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ప్రకృతి సహజ సౌందర్యానికి ఆలవాలమైన ఈ కేరళలోని పరస్సిన మడప్పురలో కొలువైన శ్రీ మతుత్తప్పన్ ఆలయం కుక్కలకు స్వాగతం పలుకుతుంది. అక్కడ వాటిని దైవంగా పూజిస్తారు భక్తులు. విశ్వాసానికి పేరుగాంచిన శునకమే దైవం, పైగా కోరికలు తీర్చే కల్పవల్లిగా అక్కడ ప్రజలు కొలుస్తుండటం మరింత విశేషం. ఆ శునకాన్ని విష్ణు, శివుడి అంశంగా భావించి కొలుస్తారట కేరళ వాసులు. ఇది కేరళలోని కన్నూర్ నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం ఉంది. పురాణ కథనం ప్రకారం..ముత్తప్పన్ అనే పిల్లవాడు నిబంధనలు ధిక్కరించి స్వేచ్ఛయుతంగా జీవించే మనస్తత్వం కలవాడు. అతనికి వేటాడటం, కల్లు తాగడం, పేదలకు సహాయం చేయడం వంటి మంచి సద్గుణాలు కూడా ఉన్నాయి. ఎవ్వరికి తలవంచిన ఆ ముత్తప్పన్ వ్యక్తిత్వం కారణంగా అతని కుటుంబం బహిష్కరణకు గురైంది. దాంతో అతడు ఉన్నటుండి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత గ్రామాస్తులు అతడు దైవాంశ సంభూతడని భావించి..అతని గౌరవార్థం ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉండే కాంస్య కుక్క విగ్రహాలు తమ ఊరికి రక్షగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఆ ఆలయంలో అత్యంత ఆసక్తి రేకెత్తించే అంశం నివేదించే ప్రసాదం.నాయూట్టు ఆచారం..కుక్కలకు పెట్టే ఆహారాన్ని కేరళలో నాయూట్టు ఆచారం అంటారు. ఆ ఆలయంలో కుక్కే దైవం కాబట్టి..ఆ స్వామికి ఎండు చేపలు, ఉడికించిన నల్లబీన్స్, టీ నేవేద్యంగా సమర్పిస్తారట. ఆ తర్వాత ఆ ఆలయంలో స్వేచ్ఛగా తిరిగే శునకానికి ఆ ప్రసాదం పెట్టాక..భక్తులకు వితరణ చేస్తారట. ఆలయంలో సుందరి అనే శునకం, దాని పిల్లలను ఆలయ సిబ్బంది ఎంతో ప్రేమగా చూసుకుంటారట.ఆశ్చర్యకరమైన విషయం..ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఇక్కడ కుక్క కాటు లేదా దాడి చేయడం వంటి ఘటనలు జరిగిన దాఖలాలు కూడా లేవట. ఇది అక్కడ భక్తుల నమ్మకానికి నిదర్శనంగా ఉంటుంది.రెండు రకాల తెయ్యంలు..తెయ్యం (Theyyam) అనేది కేరళ రాష్ట్రంలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక ప్రాచీన జానపద నృత్యం. ఇది దైవాన్ని ప్రసన్నం చేసుకునే నృత్యం. ఇక్కడ “తెయ్యం” అంటే దైవం అని అర్థం. వన్నన్ తెగ సభ్యులు దీన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ముత్తప్పన్లా వేషాధారణ వేసుకున్న వ్యక్తి కల్లు తాగడం అనే ఆచారం ఉంటుంది. దీని ఉద్దేశ్యం ఆ వ్యక్తిగత స్ప్రుహను మరిచిపోయేలా చేసి, ఆ వ్యక్తిని దైవంలా ప్రవర్తించేలా చేస్తుందట. ఈ తెయ్యంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనవచ్చు..ఆ తంతును వీక్షించి ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందచ్చు.ఆలయ నిర్మాణం ఆలయం మూడు అంతస్తుల తెల్లటి నిర్మాణం. సాంప్రదాయ కేరళ ఆలయ రూపకల్పనకు నిలువెత్తు నిదర్శనం. ఫోటోగ్రఫీకి కూడా అనుమతిస్తారు. అయితే కొన్ని ఆచారాలను చిత్రించడం నిషిద్ధం.ఆలయ వేళలు: ప్రతిరోజూ ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రత్యేక పూజలు కూడా జరిపించుకోవచ్చు.చేరుకునే మార్గం..రోడ్డు మార్గంకన్నూర్, తాలిపరంభ, సమీప పట్టణాల నుంచి సాధారణ బస్సులు మరియు టాక్సీలు ద్వారా చేరుకోవచ్చు.రైలు ద్వారాసమీప రైల్వే స్టేషన్లు కన్నూర్, పయ్యనూర్. రెండు స్టేషన్ల నుంచి, స్థానిక బస్సులు, ఆటో-రిక్షాలు అందుబాటులో ఉంటాయి. అయితే మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. కన్నూర్ స్టేషన్ నుంచి దాదాపు 45 నిమిషాలు పడుతుంది.విమాన మార్గంకన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిగిన తర్వాత టాక్సీ లేదా బస్సు సాయంతో చేరుకోవచ్చు. చివరగా ఎలాగో కేరళ వస్తున్నారు కాబట్టి ఈ ఆలమం సమీపంలో ఉండే ప్రసిద్ధ పరస్సినికాడవు తాలిపరంబాలోని రాజరాజేశ్వర ఆలయం, పయ్యనూర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సందర్శించేలా టూర్ ప్లాన్ చేసుకుంటే కేరళ సహజ అందాలను వీక్షించే అవకాశం దక్కుతుందట.(చదవండి: మేఘాలయ టూర్..! అంబరాన్నంటే అద్భుతం!) -
పెళ్లి థీమ్..పార్టీ జూమ్..
మిరుమిట్లు గొలిపే లైట్లు, మెరిసే డిజైనర్ దుస్తులు, చెవుల్లో హోరెత్తించే మ్యూజిక్, నోరూరించే ఆహారం.. ఉత్సాహభరిత వాతావరణం.. ప్రతిదీ విలాసమే, విశేషమే.. వేదికను చూడగానే చెప్పేయవచ్చు అది ఖరీదైన వివాహ వేడుక అని. అవును నిజమే.. అక్కడ పెళ్లి జరుగుతున్న ఆనవాళ్లన్నీ ఉన్నాయి కానీ.. అగ్నిగుండాలు, వధూవరులు మాత్రం లేరు. బంధువులు లేరు, కన్నీటి వీడ్కోలు లేవు. అదేమిటి? అంటే అదే ఫేక్ వెడ్డింగ్ థీమ్. ఇప్పుడు హైదరాబాద్ సిటీ పార్టీలను సరికొత్తగా మారుస్తున్న ట్రెండ్. హోటళ్లు, క్లబ్బులు ఈవెంట్ కంపెనీలు వరుసగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఈ ఈవెంట్లు పూర్తిగా వినోదం కోసం రూపుదిద్దుతున్నారు. ఎటువంటి ఒత్తిడి, ఆచారాలు లేదా బాధ్యతలు లేకుండా వివాహ విందుకు సంబంధించిన పూర్తి అనుభవాన్ని అందిస్తాయివి. సింపుల్గా చెప్పాలంటే, ఇది వివాహ నేపథ్య నైట్ పార్టీ. వెస్ట్రన్ నుంచి వెల్కమ్.. కొన్ని నెలలుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మోడల్ పెళ్లిళ్లు సందడి చేస్తున్నాయి. నగరంలో మాత్రం ఇటీవలే ప్రవేశించాయి. ఈ పార్టీలకు స్నేహితులతో కలిసి హాజరైన వారు, సంప్రదాయ భారతీయ వివాహ వేడుకల్లోని అనేక భాగాలను నాటకీయతతో మేళవించి విందు వినోదం ఆస్వాదిస్తారు. ‘సిటీలో ఫేక్ వెడ్డింగ్లో భాగంగా ఒక ఖరీదైన క్లబ్లో సంగీత్ నిర్వహించారు. అక్కడ వాతావరణం ఉల్లాసంగా ఉంది. సీక్విన్డ్ చీరలు లెహంగాలు (పొడవాటి స్కర్టులు బ్లౌజులు) ధరించిన మహిళలు, టైలర్డ్ కుర్తాలు జాకెట్లలో పురుషులు కనిపించారు. ఒక సంప్రదాయ ధోల్ డ్రమ్మర్ జనాన్ని డ్యాన్స్ ఫ్లోర్కు నడిపించాడు..’ అంటూ ఈ కార్యక్రమానికి హాజరైన శివాంగి దీనిని ఓ ఆసక్తికర పార్టీగా అభివర్ణించారు. ‘సంప్రదాయ వివాహాలలో ఒత్తిడి ఉంటుంది. దుస్తులు ధరించడం చుట్టూ నియమాలు, బంధువుల ఆక్షేపణలు, కానీ ఇక్కడ అవేవీ ఉండవు.. సో సరదాగా ఉంటుంది.’ అని ఆమె చెప్పారు.రూ.1500తో పెళ్లిలోకి ఎంట్రీ.. ఈ పార్టీ టిక్కెట్ ధరలు సాధారణంగా దాదాపు రూ.1,500 నుంచి ప్రారంభమవుతాయి. సౌకర్యాలను బట్టి రూ.15 వేలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. శివాంగి ఆమె స్నేహితులు హాజరు కావడానికి ప్రతి జంటకు రూ.10 వేలు చెల్లించారు. ‘నెలకు ఒకసారి ఆ మాత్రం ఖర్చు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే.. ఈ అనుభవం అంతకు మించి విలువైనది.‘ అంటున్నారామె. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రెస్టారెంట్ యజమాని శరద్ మాట్లాడుతూ.. కొత్త కొత్త అనుభవాలను అతిథులకు అందివ్వడం ఆతిథ్య రంగంలో కీలకమన్నారు. విదేశాల్లో మనోళ్లే.. క్లాప్ కొట్టారుగత నెలలో బెంగళూరులో 2,000 మంది హాజరైన ఫేక్ వివాహ విందుకు ఆతిథ్యం ఇచ్చిన 8 క్లబ్ ఈవెంట్స్ సహ వ్యవస్థాపకుడు కౌశల్ చనాని, నకిలీ వివాహ వేడుకలకు ప్రేరణ విదేశాలలో నివసిస్తున్న యువ భారతీయుల నుంచి వచ్చిందని చెప్పారు. వారు అక్కడ ఉండి మన పెళ్లిళ్లు మిస్ అవుతున్నారు. అదే వీటిని డిజైన్ చేయించింది అన్నారాయన. ‘అన్ని పారీ్టల్లాగే ఇక్కడా జన సమూహం ఉంటుంది. వారంతా బాలీవుడ్ సంగీతానికి నృత్యం చేస్తారు.. సంప్రదాయ దుస్తులు ధరిస్తారు.. సరికొత్త సాయంత్రాన్ని ఆనందిస్తారు’అని ఆయన అన్నారు. ట్రెండీగా మారింది.. ఫేక్ వెడ్డింగ్ పార్టీస్ ఇప్పుడు సిటీలో ఫ్రెష్గా ట్రెండీగా మారాయి. కార్పొరేట్ ఉద్యోగులు, స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పబ్స్, క్లబ్స్లో కూడా ఈ తరహా పార్టీస్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో భాగమైన సంగీత్ను పార్టీ పీపుల్ బాగా కోరుకుంటున్నారు. ఒక డీజెగా ఇది నాకు కూడా భిన్నమైన ఎంజాయ్మెంట్ను అందిస్తోంది. – డీజె పీయూష్ పెళ్లి సందడిని రుచి చూపిస్తున్నాం..ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ద్వారా ఆఫ్లైన్ ఈవెంట్స్ డిజైన్ చేసే సంస్థగా అండర్ గ్రౌండ్ ఫెరారి, పూల్ పారీ్ట.. వంటివి నిర్వహిస్తున్నాం. ఈ ఫేక్ వెడ్డింగ్ పారీ్టలు పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తరచూ పెళ్లి వేడుకల్ని మిస్ అవుతున్నవారి కోసం వీటిని డిజైన్ చేశారు. ప్రస్తుతం మన దేశంలో కూడా కార్పొరేట్ వర్క్ కల్చర్ వల్ల దగ్గరి బంధువులు, సొంత ఊర్లో పెళ్లిళ్లకు కూడా హాజరు కాలేకపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫేక్ షాదీ కాన్సెప్ట్ను మేం తొలుత బెంగళూర్కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలకు తీసుకెళ్లాం. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది సంప్రదిస్తున్నారు. త్వరలోనే నగరంలో కూడా నిర్వహించే అవకాశం ఉంది. – మాథుర్, సహ వ్యవస్థాపకులు, 8 క్లబ్ ఈవెంట్, బెంగళూర్ (చదవండి: 'పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..) -
సమయం ఆసన్నమైతే...
‘కమలజ ఘటనా సమయంబైన, నసంభావ్యములైనను సంభవించు’ నన్నాడు ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యకర్త కొఱవి గోపరాజు. ఆదిదేవుడైన శ్రీహరి నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ దేవుడి తలపుల నుంచి ఉద్భవించినవే స్థావర జంగమాత్మకమైనట్టి ఈ సృష్టిలోని సకల చరాచర వస్తు సంచయమంతా! బ్రహ్మదేవుడు అనుకోవాలేగాని, ఇదెలా సాధ్యం అనిపించేవి కూడా జరుగుతాయి. ప్రహ్లాదుడు హరిభక్తుడు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు హరిద్వేషి. హిరణ్యకశిపుడంటే ముల్లోకాల జనులకు భయమే. దేవతలచే, దేవతల సంతతిచే, దైత్యులచే, గ్రహములచే, తారకలచే, మునుల చేత, అగ్ని, వాయువు, యముడు, నరులు, గిరులు, తరులు, పశు పక్ష్య మృగ కీటకాదుల చేతిలో, ఏరకమైన ఆయుధముల వలన, అవని పైన, అంతరిక్షంలోను, పగటియందు, రాత్రియందు తనకు మరణం కలగకుండా బ్రహ్మ దేవుడి నుండి పొందిన వరంతో హిరణ్యకశిపుడి ఆగడాలకు అంతం లేకుండాపోయింది. అందరూ సుఖంగా ఉండాలంటే హిరణ్యకశిపుడి మరణం ఒక్కటే మార్గం కాగా, ఆ మరణం ఇలా సంభవమైందని ఈ కింది పద్యంలో చెప్పాడు కొఱవి గోపరాజు. కం. ఇది మానిసి యిది సింగం / బిది దేవత యను వివేక మెడలగ బలసంపద నుక్కుగంబమున హరి / యుదయింపడె దైత్యవరుని నుక్కడగింపన్.‘ఇది మనిషి, ఇది సింహము, ఇది దేవత అని గుర్తించి, విడదీసి చెప్పడానికి వీలు లేని విధంగా... అటు భూమి మీద గాని, ఇటు ఆకాశం గాని కాకుండా, మహోగ్ర రూపంలో ఉక్కు స్తంభం నుండి నృసింహావతారంలో హిరణ్య కశ్యపుడిని పరిమార్చడానికి ఉదయించాడు కదా శ్రీహరి’ అని పై పద్యం భావం. కనుక బ్రహ్మదేవుడి వినూత్న సృష్టికి సమయం ఆసన్నమైతే సంభవం కాదనుకున్నది కూడా సంభవమై కనపడుతుంది.ఇదీ చదవండి : బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు– భట్టు వెంకటరావు -
జగాలన్నీ ఒకెత్తు, కృష్ణుడు ఒక్కడూ ఒక ఎత్తు
పాండవుల బలం గురించి మాటిమాటికీ అడుగుతూ ఉండే ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పిన కృష్ణతత్వం అనంతం. ‘జగాలన్నీ ఒక ఎత్తు, కృష్ణుడు ఒక్కడూ ఒక ఎత్తు. అతని ముందు ఎన్నున్నా ఏవున్నా దుర్బలాలు. అతని సంకల్పాన్ని బట్టి సృష్టి, పుష్టి, నష్టి కలుగుతూ ఉంటాయి. సత్యమూ, ధర్మమూ స్థిరంగా ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. అక్కడే జయమూ ఉంటుంది. అన్ని లోకాలూ తానే అయి అన్ని జీవులలో ఆత్మగా ఉంటూ విహరిస్తూ ఉంటాడు. మాయను స్వీకరించి ఈ లోకంలో ఏదో రూపాన పుట్టి దుష్టశిక్ష, శిష్ట రక్ష చేస్తూ ఉంటాడు. పాండవుల కష్టాలు పోగొట్టాలనే నెపంతో ధర్మబాహ్యులైన నీ కొడుకులను నిగ్రహించడానికే ఆయన వచ్చా’డంటాడు సంజయుడు. ‘ఆ దేవుని తత్వం ఏ మాత్రం తెలిసిన వారైనా సరే ఆయన్ని ఆశ్రయిస్తారు. హాయిగా బతుకుతారు. విద్య, అవిద్య అని రెండున్నాయి. అవిద్యకు లొంగినవాడు తామసుడై విష్ణువును తెలుసుకోలేడు. విద్వావంతుడే తెలుసుకోగలడు. విద్య అంటే ఎలాంటిదంటే, సత్వ రజ స్తమో గుణాల వికారాలకు లొంగక ధర్మాన్ని అనుష్ఠిస్తూ భావశుద్ధి కలిగి ఉండటమే. విష్ణువును తెలుసుకోవడానికి ఎవరికైనా ఇదే దారి. విద్యా లక్షణాలకి విరుద్ధమైన పద్ధతి అవిద్య’ అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడిని ‘ధర్మపరుడవై కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే నువ్వూ నీ తమ్ములూ సుఖంగా బతకొచ్చు’ అంటాడు. కానీ దుర్యోధనుడికి ఆ మాటలు రుచించవు. గాంధారితోనూ చెప్పిస్తాడు ధృతరాష్ట్రుడు. కానీ వింటేగా దుర్యోధనుడు! అన్నిటిలో తాను ఉంటూ అన్నిటినీ తనయందు ఉంచుకుంటాడు... ఇదే ‘వాసుదేవ’ నామానికి అర్థం. దీనిని సరిగ్గా తెలుసుకున్నవారు శుభ ఫలితం పొందుతారు. – యామిజాల జగదీశ్ -
‘సంసార కటు వృక్షం’ అంటే ఏంటి?
జీవితంలో సారవంతమైన సమయాల కంటే, నీరసంగా గడిచే ఘట్టాలే ఎక్కువ. అందుకే జీవితాన్ని ‘సంసార కటు వృక్షం’ అన్నారు. ఇదొక చేదు ఫలాల చెట్టు. ఎక్కువ ఫలాలు చేదు. కొన్ని మాత్రమే మధురం. జీవితంలో చేదు తగ్గించుకోవాలంటే, క్రోధం, ఈర్ష్య, నిస్సం తోషం, అసంతృప్తి, క్రూరత్వం లాంటి భావనలూ, భావోద్రేకాల రూపంలో ఉండే చేదు ఫలాలను వీలయినంతవరకూ ఏరి పారేసి, దూరంగా ఉంచాలి. లేకపోతే జీవితమంతా చేదవుతుంది. వీలయినంతవరకూ రుచికరమైన మధుర ఫలాలను కోసుకొని, భద్రపరచుకొని తనివారా ఆస్వాదించాలి.ఈ సంసార విషవృక్షంలో శ్రమపడి వెతికితే అందరికీ అమృతతుల్య మైన మధుర ఫలాలు రెండు లభిస్తాయట. ఒకటి – సుభాషిత రసాస్వాదం, రెండు – సజ్జనులతో సాంగత్యం. మంచి మాటల తీయని రుచి చవిచూడ గలగటం, మనసుకు ప్రశాంతిని చేకూర్చగల మంచి మనుషుల సాహచర్యం చేయటం. పెద్దలు అనుభవంతో, మన మేలు కోరి చెప్పే సత్యాలూ, నీతులూ, మార్గదర్శకమైనమంచి మాటలూ విన్నప్పుడు ఆనందాన్నిస్తాయి. మననం చేసుకొంటే మదిని చల్లబరుస్తాయి. పట్టుదలతో, పూనికతో పాటించి చూస్తే, జీవితాన్ని చక్కదిద్ది సుఖమయం చేస్తాయి. అలాగే, జీవితంలో మంచి మనుషుల సాహచర్యం, సాంగత్యం లభిస్తే, అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. సజ్జనుల సాంగత్యంలో, వాళ్ళ స్వభావమూ, నడతా, భావ జాలమూ సాటివారిని ప్రభావితం చేసి, చక్కని వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తాయి.‘కాపీ’ పుస్తకంలో కుదురుగా ఉన్న దస్తూరీని అనుకరించటం అభ్యాసం చేస్తే, అభ్యాసం చేసిన వాళ్ళ చేతిరాత మెరుగయినట్టు, సజ్జనుల సాంగత్యంలో, వారి నీడలో నడిచే వారి నడత తిన్ననవుతుంది. అందుకే ’నీ స్నేహితులెవరో నాకు చెప్పు, నువ్వెలాంటి వాడివో నేను చెప్తాను’ అన్న పాత సామెత ఎంతో అర్థవంతమైంది. – ఎం. మారుతి శాస్త్రి -
మనిషి దుఃఖం నుండి బయటపడలేకపోవడానికి కారణం ఇదే!
ఆత్మ చాలా బలమైనది. ఆత్మ సహకారంతో ఉన్నప్పుడు నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు. వ్యక్తి అనే ముసుగు నుండి, అహంకారపూరితమైన మనస్సు నుండి అతీతంగా ఎదగడం సులభమవుతుంది. అప్పుడు నీవు నీ ఆలోచనలతో, నమ్మకాలతో విడిపడతావు. నీ స్వస్థలమైన ఆత్మను చేరుకుంటావు. ఒక చేపలమ్ముకునే అమె పూలమ్ముకునే వాళ్ళ ఇంట్లో బస చేయాల్సివస్తుంది. ఆమె చేపలవాసనకు అలవాటుపడి ఉండటం వల్ల ఆ ఇంట్లోని పూలవాసనకు నిద్ర పట్టదు. అప్పుడామె తాను అమ్ముకోవడానికి తెచ్చుకున్న ఎండుచేపల మీద నీరు చల్లి, అప్పుడు వచ్చిన వాసనను పీల్చుకుంటూ నిద్రపోతుంది. అంటే మనం అలవాటుకు బానిసలం కావడం వల్ల అది తప్పు అని తెలిసినా మానుకోము. అందులోనే కూరుకునిపోతాం. అందువల్లే మనిషి దుఃఖం నుండి బయటపడలేక పోతున్నాడు. ఆత్మ వెదజల్లే పరిమళాన్ని కాదని మనస్సుకు బందీయై జీవితమంతా గడిపేస్తున్నాడు.గత జ్ఞాపకాలను అన్నింటినీ అధిగమించేయాలి. అది ధ్యానం ద్వారానే సులభమవుతుంది. భవిష్యత్తు లేదు, ఊహలు లేవు, లక్ష్యాలు లేవు, సమస్యలు లేవు.... కేవలం ఈ క్షణంలో ఉంటావు. ఆ ప్రస్తుత క్షణానికి ఏ రూపమూ లేదు. అందరికీ ఒకలాగే ఉంటుంది. ఆత్మానుభవం జరుగుతుంది. అదే నీ నిజతత్వం. అక్కడ వ్యక్తిగా ఉండవు. కొన్ని లక్షల, కోట్ల జన్మలక్రితం ఆత్మ ఎలా ఉండిందో ఇప్పుడూ అలాగే ఉంది. ఇంకో కోటి జన్మల తర్వాత కూడా అలాగే ఉంటుంది. సష్టి కూడా అలాగే ఉంటుంది. అది కాలానికి అతీతమన్నమాట. అది–అంతం లేవు. ఆ ఆత్మ తత్వంలో నీవు ఉన్నప్పుడు పుస్తక జ్ఞానమే అవసరం లేదు. నీవు చెప్పిందే జ్ఞానమవుతుంది.– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
నమ్మినోల్లకు నమ్మినంత
అదొక పల్లెటూరు. ఊరి వెనుక ఒక పెద్ద గుట్ట ఉంది. ఊర్లోని ఒక భక్తుడికి ఆ గుట్టపైన గుడి కట్టాలనిపించింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గుడి నిర్మాణం పూర్తి చేశాడు.గుడి పక్కనే ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకుని తల్లితో పాటు అక్కడే నివాసం ఉండే వాడు. గుడి, ఊరికి దూరంగా ఉండటంతోను, కష్టపడి గుట్ట ఎక్కాల్సి రావడంతోనూ గ్రామస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు.ఆ భక్తుడిలో బాధ, భయం మొదలయ్యాయి. కొండంత భారం మోయలేకపోతున్నానని తల్లితో చెప్పుకుని ఏడ్చాడు. అతడి బాధ చూసి ఆమె ‘కష్టాలు కలకాలం కాపురముండవు. మనకూ మంచి రోజులు వస్తాయి. నమ్మినవాళ్ళని భగవంతుడు ఎన్నటికీ విడిచి పెట్టడు’ అని ధైర్యం చెప్పేది.పైకి గంభీరంగా ఉన్నా ఆమెలో కూడా బాధ లేకపోలేదు. హారతిపళ్ళెంలో పడే పైసలు చమురు ఖర్చులకే రావడం లేదని లోలోపలే ఆందోళన చెందేది. ‘అయినా ఇది దైవసేవ. దేవుడే మనకు దారి చూపుతాడు’ అని గట్టిగా నమ్మేది.ఒకరోజు ఆమె గుడిపూజ సామానులు శుభ్రంగా కడిగి ఎత్తి పెడుతున్న సమయంలో హారతి పళ్ళెం గుట్ట బండరాయి మీద పడింది. పళ్ళెం పడిన చోట ఒక వీనుల విందైన రాగం ఆమెకు వినిపించింది. ‘ఇంతలో అయ్యో... పళ్ళెం సొట్టబోయిందే..’ అని బాధపడుతూ వచ్చాడు కొడుకు. కానీ ఆమె అలాగే బండరాయి మీద కూర్చుని చిన్న రాయి తీసుకుని కొట్టసాగింది. ఉన్న పళ్ళెం సొట్టపోయిందని బాధపడుతూ ఉంటే నువ్వేమి చేస్తున్నావని అడిగాడు. ఆమె చిన్నగా నవ్వింది. గుడి చుట్టూ ఉన్న బండరాళ్ళను రాతితో కొట్టి చూడసాగింది. తల్లి చేష్టలను వింతగా చూడసాగాడు కొడుకు. ఆమె గట్టిగా ‘‘మన కష్టాలు తీరిపోయాయి. గుడి పోషణ ఇక సులభం’’ అని చెప్పింది. ఆశ్చర్యపోతూ ఆమె దగ్గరికి వెళ్ళి ‘ఎలా?’’ అని అడిగాడు. ‘‘ఈ బండ రాళ్ళను కొట్టి చూస్తే, సరిగమపదనిసలు పలుకుతున్నాయి. వెంటనే శిల్పకళ గురువు స్థపతిని పిలిపించు. సప్తస్వరాల్లోని ఒక్కో రాగం పలికే బండను ఎంపిక చేసి వరుసగా పెట్టించాలి. ఆ రాగాలను పలికించడానికి ఒక రాయిని అందుబాటులో ఉంచాలి. వచ్చిన భక్తులు ఆసక్తిగా వీటిని కొట్టి సంతోష పడతారు’’ అని చెప్పింది. మారుమాట్లాడకుండా తల్లి చెప్పినట్లే చేశాడు.ఆ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టూ ఉన్న గ్రామాలకు చేరింది. మొదట పిల్లలు, ఆ తర్వాత యువకులు, చిన్నగా ఊరిజనం, చుట్టుపక్కల గ్రామస్తులూ గుట్ట ఎక్కడం ప్రారంభించారు. దైవ దర్శనం చేసుకుని సరిగమలు పలికిస్తూ సంతోషపడసాగారు. గుడి ఆదాయం చిన్నచిన్నగా పెరగసాగింది. తల్లీకొడుకు దేవుడికి నమస్కరిస్తూ ‘నమ్మినోల్లకు నమ్మినంత’ అనుకున్నారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
Varalakshmi Vratam 2025 : వరమహాలక్ష్మి వ్రతం, ముహూర్తం, పూజ
-
ఔషధవనంలో అపురూప ఆలయం
వనపర్తి జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని చిట్టడవిలో.. ఎత్తయిన కొండ శిఖరంపై భూదేవి, శ్రీదేవి సమేతుడై కొలువుదీరిన తిరుమలనాథస్వామి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సుమారు 300 ఏళ్ల క్రితం ఈ కొండపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ప్రాంత ప్రజలు ఏటా శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా.. పశువుల కాపరులు, అడవి తల్లిని నమ్ముకున్న ముదిరాజ్లు దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే సంప్రదాయాన్ని ప్రారంభించారు. వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు వెళ్లే ప్రధాన రహదారిలో.. 5 కిలోమీటర్ల దూరంలో స్వామివారి ఆలయ ముఖద్వారం ఉంటుంది. అక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు.ఆలయ చరిత్ర శతాబ్దాల క్రితం వనపర్తి సంస్థానాధీశులు వేటకు వెళ్లినప్పుడు ఎత్తయిన కొండ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం, వేల అడుగుల ఎత్తులో విశాలమైన రాతిచాప, అక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు (నీటి కొలను) ఉండటం చూశారు. శిఖరాగ్రాన స్వామివారిని ప్రతిష్టించాలని నిర్ణయించుకుని.. ఏకశిలపై స్వామి, అమ్మవార్ల విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేసినట్లు చరిత్ర కథనం. ఏటా శ్రావణ మాసంలోని శనివారాల్లో అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు. వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కొందరిని ఆలయ ధర్మకర్తలుగా, పెద్దగూడెంలోని ఓ ముదిరాజు కుటుంబాన్ని పూజలు చేసేందుకు నియమించారు. నాటి నుంచి నేటివరకు ఆయా కుటుంబాల వారే స్వామివారిని సేవించుకుంటూ.. ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.తాటిచెట్టు మెట్ల నుంచి.. మొదట్లో గుట్టపై నుంచి స్వామివారు కొలువుదీరిన శిఖరాగ్రానికి చేరుకునేందుకు సంస్థానాధీశులు తాటిచెట్ల కాండంతో మెట్లను ఏర్పాటు చేసినట్లు భక్తులు చెబుతారు. 1993 ప్రాంతంలో దాతల సహాయంతో ఇనుప మెట్లను, ఇటీవల కాంక్రీట్ మెట్లను ఏర్పాటు చేశారు. శ్రీరంగాపురం రంగనాయకస్వామి, పెద్దగూడెంలోని కోదండరామస్వామి ఆలయాలతోపాటు తిరుమలనాథస్వామి ఆలయాల్లో సంస్థానాధీశులు విగ్రహ ప్రతిష్ట చేయించి పూజలు చేసేవారని స్థానికులు పేర్కొంటారు. ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హయాంలో తారురోడ్డును నిర్మించారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది.ఔషధ మొక్కలకు పుట్టినిల్లు.. తిరుమలనాథస్వామి కొలువుదీరిన కొండపై ఎన్నో ఔషధ మొక్కలు (Medicinal Plants) ఉన్నట్లు గుర్తించారు. ఏటా శ్రావణ మాసంలో పచ్చని చెట్లు, ఎన్నో రకాల ఔషధ మొక్కలతో పాటు.. చేతికి అందేంత ఎత్తులో వెళ్తున్న మేఘాలు.. చల్లని జల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణం మంతమ్రుగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని, జాతరను తిలకించి.. ప్రకృతిని ఆస్వాదిస్తారు.సుదూర ప్రాంతాల నుంచి.. వనపర్తికి 5 కిలోమీటర్ల దూరంలో వెలిసిన తిరుమలనాథస్వామిని దర్శించుకొని.. మొక్కులు తీర్చుకునేందుకు జిల్లాతోపాటు గద్వాల, మహబూబ్నగర్, కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కర్ణాటక ప్రాంతవాసులు.. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం చేస్తారు.తొలి శనివారం.. శ్రావణ మాసంలో వచ్చే తొలి శనివారం తిరుమలనాథస్వామి గుట్టపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు కల్యాణ మహోత్సవం జరిపిస్తారు. సామాన్యుల నుంచి కోటీశ్వరులు సైతం ఒకేచోట నేలపై కూర్చొని స్వామి, అమ్మవార్లకు కల్యాణం చేయిస్తారు. భక్తులతోనే కల్యాణ మహోత్సవం నిర్వహించడం ఇక్కడి విశేషం.చదవండి: ఈ జలపాతాలకు చూసేందుకు రెండు కళ్లు చాలవు -
‘మేరోరపి సారతరా భక్తిః : నిజమైన భక్తి
‘మేరోరపి సారతరా భక్తిః.’ అంటే భక్తి మేరు పర్వతం కంటే కూడా మిక్కిలి శక్తి కలదీ, ఉన్నతమైనదీ అని అర్థం. సర్వము భగవద్విలసితంగా భావించి, ఆ భావనతో ఆత్మార్పణ చేసుకొనే పరిశుద్ధ స్థితి భక్తికి పరాకాష్ఠ. ఇదే నిజమైన భక్తి! గురుభక్తి కూడా ఇంతే! గురువునే దైవ భావంతో ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ జీవితాన్ని కైంకర్యం చేసుకోవటం నిర్దుష్టమైన భక్తికి సరిహద్దు. భగవదనుభూతికి అనేక మార్గాలు న్నాయి. కానీ అందరికీ అందుబాటులో అనుసరణీయమైన మార్గం మాత్రం భక్తి మార్గమే. విభిన్న రుచులు గల మానవుల మనస్సుకు నచ్చిన విధంగా స్వీకరించదగిన విధానాలు భక్తిమార్గంలో ఉన్నాయి. అవే నవవిధ భక్తి మార్గాలు: ‘శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనం అర్చనంవందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్’ అని శ్రవణ కీర్తనాదులు చెప్పబడినాయి. ఆ యా భక్తుల రుచులను అనుసరించి ఈ నవవిధాలు అనుసరింపబడతాయి. భక్తి అనేది శ్రవణంతో ప్రారంభమై బలపడుతూ, చివరిదైన ఆత్మనివేదనంతో పరిపూర్ణం అవుతుంది. అత్మనివేదనం గల భక్తులకూ భగవంతునికీ భేదమే కనబడదు. ఈ విషయంలో గోపికల భక్తి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇదీ చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్.. రూ.7500కే వీసా : ఎవరికి? ఎలా? ఎక్కడ?‘ఓ అర్జునా! నా సేవ కోసమే గోపికలు తమ శరీరాన్ని రక్షించు కొంటున్నారు. అందువల్లనే నిగూఢమైన నా ప్రేమకు వారు పాత్రు లయ్యారు’ అని కృష్ణ పరమాత్మ అర్జునునితో అంటాడు. అలాగే దాన ధర్మాలు చేసినా... భక్తి భావంతో ప్రతిగ్రహీతను విష్ణువుగా భావించి దానమిస్తే దానికి విలువ ఉంటుంది. ఒక రోజు ఓ రాజసభలో ఉన్న సాధువుతో ‘నేను తల్చుకుంటే మిమ్మల్ని గొప్ప సంపన్నుణ్ణి చేయగలను’ అన్నాడు రాజు. సాధువు ఆ మాటకే మాత్రం పొంగిపోకుండా: ‘రాజా! దయవుంచి ఒక కాటా తెప్పించండి. అందులో ఒక వైపు నాకీయదలచిన సంపద ఉంచండి’ అని అన్నాడు. దానికి రాజు సరే అని వెంటనే ఆ యేర్పాటు చేశాడు. నగలు, నాణాలు, బంగారం, వజ్రాలు వంటి వెన్నో ఒక వైపు ఉంచాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతో ఒక చిన్న ఆకును తెచ్చి ఆ రెండవ తక్కెటలో వేశాడు. అంతే కాటాలో వేసిన రాజుగారి సంపదకంతా ఈ ఆకు సమానంగా తూగింది. కాస్త మొగ్గు కూడా ఉంది. రాజుకు గర్వ భంగం అయింది. నిజమైన భక్తునికి ప్రతి జీవిలోనూ అంతర్యామిగా భగవంతుడే కనబడతాడు. నిజమైన భక్తుల్లో చివరికి ఆత్మజ్ఞానం సుసంపన్నమైన వాళ్లు మోక్షా ర్హులవుతారు అని స్వామీజీ అనుక్షణం ప్రబోధిస్తుంటారు.జయ గురు దత్త!-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి


