
భాగవతంలోని ప్రతి చిన్న సంఘటన మనకు ఎన్నో మంచి విష యాలను నేర్పుతుంది. పరీక్షిన్మహారాజు వేటకు వెళ్ళాడు. దాహం వేసి... ఏకాగ్రచిత్తుడై బ్రహానుసంధానం చేసి ఉన్న శమీక మహర్షిని మంచినీళ్లు ఇమ్మని అడిగాడు. కానీ ఆ మహర్షికి అది వినిపించక మిన్నకుండి పోయాడు. దీనితో శమీకుని మెడలో ఒక చచ్చిన పామును వేశాడు. ఇది తెలిసిన మహర్షి కుమారుడైనశృంగి కోపోద్రిక్తుడై... ‘రాజు హరకేశవు లొడ్డిననైన; జచ్చుపో యేడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిన్’ అని శాపం పెట్టాడు.
రాజు దాన్ని విని గంగా తీరాన ప్రాయో పవేశాన్ని ప్రారంభించాడు. ఎందరో మహ ర్షులు వచ్చారు. ఆ రాజు వారికి నమస్కరించి, ‘దయామయుడైన పరమేశ్వరుడు బ్రాహ్మణ రూపమున నాకు శాపమునిచ్చి నాలో వివేక వైరాగ్యాలను మేల్కొలిపాడు. తక్షకుడు నాకు కాటు వేయువరకు శ్రీ మహావిష్ణువు యొక్క గాథలను వినుపించుడు. నేను ఎన్ని జన్మలు ధరించవలసి వచ్చినా అనంతుని యెడల భక్తి ప్రేమలు కలిగి, మహాత్ములతోటి సాంగత్యం, సర్వప్రాణుల యందు ప్రేమ కలుగునట్లు దీవింపుడు’ అని వేడుకొన్నాడు. (పుట 69–ప్రథమ స్కంధము, భాగవత సుధ, శ్రీరామకృష్ణ మఠము, చెన్నై). తనకు శాపమిచ్చిన వానిపై రాజు ప్రతీకారం తీర్చు కోదలచలేదు. పైగా శాపాన్ని వరంగా మార్చుకోగలిగాడు. అది ఆయనలో వివేక, వైరాగ్యాల్ని– ఏవైతే ఏ వ్యక్తి ఆధ్యాత్మికాభివృద్ధికైనా ఆవశ్యకాలో – వాటిని రగిల్చినట్టు భావించాడు. దైవ గాథలను చివరి వరకు విని ప్రాణం వదలదలిచాడు. సాధుసాంగత్యాన్ని కోరాడు. మరీ ముఖ్యంగా ప్రాణులన్నిటి పట్ల ప్రేమ కలిగే విధంగా దీవించమన్నాడు. ఆ సుగుణాలన్నీ ఉన్న వ్యక్తికి సద్గతులు కలుగవా?
– రాచమడుగు శ్రీనివాసులు