లండన్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన బ్రిటన్ వార్తా సంస్థ ‘బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్’ (బీబీసీ) సంస్థలోని ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా వచ్చే వారం నుండి వందలాది ఉద్యోగాలను తొలగించనుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తు నిధుల కేటాయింపులపై సంస్థలో చర్చలు చివరి దశకు చేరిన తరుణంలో ఈ సంచలన నిర్ణయం వెలువడింది.
వార్తా విభాగానికి భారీ దెబ్బ
సంస్థలో దాదాపు 10 శాతం మేర ఖర్చులను తగ్గించుకోవాలని బీబీసీ అంతర్గత బృందాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఏకంగా 2,000 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అయితే ఈ లేఆఫ్స్ ప్రభావం మొదటగా బీబీసీ ప్రధాన వార్తా విభాగంపైనే పడనుంది. మొత్తం 20,000 మందికి పైగా సిబ్బంది ఉన్న ఈ సంస్థలో, కేవలం వార్తా విభాగంలోనే పావువంతు మంది పనిచేస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం బడ్జెట్ జీతాలకే కేటాయిస్తుండటంతో, వచ్చే వారం ప్రకటించబోయే తొలి విడత తొలగింపుల్లో న్యూస్ టీమ్ నుండే వందలాది మంది సిబ్బందిని తొలగించనున్నట్లు సమాచారం.
పొదుపు చర్యలు.. డిజిటల్ వైపు అడుగులు
కంటెంట్ విభాగాల్లో సిబ్బందిని తొలగించకుండా ఇతర మార్గాల్లో ఖర్చులు తగ్గించుకునే వీలున్నప్పటికీ, న్యూస్ టీమ్లో మాత్రం ఉద్యోగాల కోత తప్పడం లేదు. అయితే ఈ మార్పుల వల్ల కొన్ని రేడియో కార్యక్రమాలు, ఇతర సేవల్లో వీక్షకులు మార్పులను గమనించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే సంస్థవ్యాప్తంగా కొత్త నియామకాలు, ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు కాన్ఫరెన్స్లు, అవార్డు వేడుకల ఖర్చులను కూడా తగ్గించారు. ప్రస్తుత నిర్వహణ ఖర్చులను తగ్గిస్తూనే, భవిష్యత్తు ప్రాజెక్టులైన ‘ఐప్లేయర్’ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్, యూట్యూబ్ లలో డిజిటల్ ఉనికిని బలోపేతం చేయడం కోసం ఈ పొదుపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ మీడియాలో లేఆఫ్స్ ట్రెండ్
ప్రస్తుతం బ్రిటన్లో లైవ్ టీవీ లేదా బీబీసీ ఐప్లేయర్ చూడాలంటే లైసెన్స్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. కానీ నెట్ఫ్లిక్స్ వంటి ప్రైవేట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లకు ఇది వర్తించదు. దీంతో ప్రభుత్వం ఈ లైసెన్స్ ఫీజు నమూనాను సవరించే యోచనలో ఉంది. ఇదిలావుండగా మీడియా రంగంలో ఉద్యోగాల కోత ఒక్క బీబీసీకే పరిమితం కాలేదు. ఇటీవలే అమెరికాకు చెందిన ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ (ఏపీ) విజువల్ రిపోర్టింగ్పై దృష్టి పెడుతూ, 20 మంది జర్నలిస్టులను తొలగించింది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ప్రముఖ పత్రిక ‘ది వాషింగ్టన్ పోస్ట్’ సైతం తన సిబ్బందిలో ఏకంగా మూడో వంతు మేర తగ్గించుకోవడం గమనార్హం.


