రుచికా సింగ్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. క్రిమినల్ కేసుపై CJP సంచలన వ్యాఖ్యలు | Focus on MPs who have criminal cases, not a 25-year-old: CJP slams Zero FIR | Sakshi
Sakshi News home page

రుచికా సింగ్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. క్రిమినల్ కేసుపై CJP సంచలన వ్యాఖ్యలు

Jul 31 2026 9:41 PM | Updated on Jul 31 2026 9:44 PM

Focus on MPs who have criminal cases, not a 25-year-old: CJP slams Zero FIR

సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యువతి రుచికా సింగ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్రంగా తప్పుబట్టారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సమర్థించలేమని స్పష్టం చేసిన ఆయన, అలాంటి సందర్భాల్లో క్రిమినల్ చర్యలకు బదులుగా పరువు నష్టం దావా వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించాలని సూచించారు.

జూలై 23న జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న రుచికా సింగ్ ప్రధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆమెపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఈ పరిణామంపై స్పందించిన సౌరవ్ దాస్, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే విధంగా క్రిమినల్ చట్టాలను వినియోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.

‘రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యలు తప్పు కావచ్చు. అవి చాలామందికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. కానీ కేవలం అలాంటి భాష వాడినందుకు ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం సమంజసం కాదు. అలాంటి సందర్భాల్లో పరువు నష్టం దావా వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. క్రిమినల్ విచారణ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది యువతకు ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన అన్నారు.

అయితే యువ నిరసనకారులు తమ అసమ్మతిని వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని, ఉపయోగించే పదాల విషయంలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని కూడా దాస్ సూచించారు. ప్రజాప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పోలీసులు రాజకీయ ప్రయోజనాల కోసం తమ అధికారాలను దుర్వినియోగం చేయరాదని ఆయన హెచ్చరించారు. ‘క్రిమినల్ న్యాయ వ్యవస్థను ఇలాంటి సందర్భాల్లో వినియోగించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. పోలీసులు శాంతంగా వ్యవహరించాలి. యువతపై వేధింపులు ఆగాలి’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఘజియాబాద్‌కు చెందిన స్మృతి సింగ్ ఫిర్యాదు మేరకు జూలై 29న గౌతమ్ బుద్ధ నగర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో రుచికా సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రధానమంత్రి రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశాయని, ద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేశారు.

జీరో ఎఫ్‌ఐఆర్ విధానం ప్రకారం, నేరం ఎక్కడ జరిగినా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం సంబంధిత అధికార పరిధి ఉన్న పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేస్తారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకుంది. 36 రోజుల పాటు కొనసాగిన నిరసనలు కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రధాన డిమాండ్లను అంగీకరించిన అనంతరం జూలై 25న ముగిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement