ఉడుపి: ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్కు కర్ణాటకలోని ఉడుపికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్పాల్ సువర్ణ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. కళాకారుల మదిలో విషబీజాలు నాటడం మానుకోవాలని, లేనిపక్షంలో అరేబియా సముద్రంలో చేపలకు ఆహారంగా మారుస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఇటీవల 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి నిరసనలో ప్రకాశ్ రాజ్ పాల్గొని, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యశ్పాల్ సువర్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్మంతర్ వద్ద జరిగిన నీట్ నిరసనలో పాల్గొన్నవారు అసలైన విద్యార్థులు కారనీ, వారి నేపథ్యాన్ని పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.
ఇలాంటి రాజకీయాలు కొనసాగితే బీజేపీ కార్యకర్తలు తగిన రీతిలో స్పందిస్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన వీ. సునీల్ కుమార్తో సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు 'ఇండియా' కూటమి నేతలైన రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ తదితరుల ముఖాలతో ఉన్న బొద్దింకల ప్లకార్డులపై క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం గమనార్హం.
ఇది కూడా చదవండి: కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్!


