breaking news
NEET
-
నీట్, జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో, ఇకపై అడ్మిషన్ల మెరిట్ జాబితాలో క్లాస్ 12 బోర్డు పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ కల్పించాలని కేంద్ర విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవలి కాలంలో పరీక్షల నిర్వహణలో ఎదురైన పేపర్ లీకేజీలు, మూల్యాంకన లోపాలు వంటి తీవ్రమైన వివాదాల నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం ఎంట్రన్స్ పరీక్షల మార్కులే కాకుండా, బోర్డు పరీక్షల మార్కులకు కూడా సమాన ప్రాధాన్యత లభిస్తుంది. ఎంట్రన్స్ పరీక్షల సిలబస్ను పాఠశాల పాఠ్యప్రణాళికకు అనుగుణంగా మార్చడం ద్వారా విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పేపర్ లీకేజీల రిస్క్ను పూర్తిగా తగ్గించడానికి, క్రమంగా అడాప్టివ్ ఆన్ డిమాండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లనున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తిగా నీట్, జేఈఈ ఎంట్రన్స్ స్కోర్లపైనే ఆధారపడి జరుగుతోంది. బోర్డు పరీక్షలు కేవలం అర్హత సాధించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి,అనధికారిక విద్యాసంస్థల వ్యాప్తిని, కోచింగ్ సంస్కృతిని అరికట్టడానికి విద్యాశాఖ నియమించిన తొమ్మిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఈ కీలక సిఫార్సులను సిద్ధం చేసింది. ఈ కమిటీ తన తుది నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. -
ఆగస్టు 30న నీట్ పీజీ
సాక్షి, అమరావతి: దేశంలో మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పీజీ – 2026 పరీక్షను ఆగస్టు 30న నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష కేంద్రాల సమాచారం ఆగస్టు 11న ప్రకటిస్తారు. సెప్టెంబర్ 30న ఫలితాలు వెల్లడించనున్నారు. -
ఢిల్లీలో వాంగ్చుక్ నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ముందుగా ప్రకటించిన విధంగానే ఆదివారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్రమే బాధ్యత వహించాలని, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వాంగ్చుక్ దీక్షకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ కూడా 20వ తేదీ నుంచి ఇదే వేదికపై నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన కొనసాగిస్తుండటం తెల్సిందే. దీక్ష ప్రారంభించడానికి ముందుగా వాంగ్చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలిసి రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం జంతర్మంతర్లో నిరసన స్థలిలో అంతా కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. వందల సంఖ్యలో హాజరైన విద్యార్థులు, యువకులు తరలివచ్చి వాంగ్చుక్ దీక్షకు మద్దతు ప్రకటించారు. -
‘ధర్మేంద్ర ప్రధాన్జీ హ్యాపీ బర్త్డే’ : సీజేపీ అభిజీత్ దీప్కే
సాక్షి,న్యూఢిల్లీ: ‘నీట్’ సహా పలు ఇతర పరీక్షల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేస్తున్న నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్ పుట్టిన రోజు కావడంతో ఆయన రాజీనామా చేయాలంటూ సీజేజీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.పుట్టిన రోజు శుభాకాంక్షలు ధర్మేంద్ర ప్రధాన్.. మీరు వెంటనే రాజీనామా చేయాలని వాల్పోస్టర్పై రాసి తన నిరసన వ్యక్తం చేశారు. ఆ సందేశం రాసిన తర్వాత ‘ధర్మేంద్ర ప్రధాన్ జీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకో చిన్న సహాయం చేయండి. రాజీనామా చేయండి. పుట్టినరోజు కానుకగా మేమే మీకు రాజీనామా పత్రాన్ని పంపిస్తాం. మీరు దానిపై కేవలం మీ వేలిముద్ర వేస్తే సరిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Happy Birthday @dpradhanbjp, please resign! pic.twitter.com/djLcewkQch— Abhijeet Dipke (@abhijeet_dipke) June 25, 2026 -
28 నుంచి జంతర్మంతర్లో నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని పక్షంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతానని ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఈ నెల 27వ తేదీ వరకు ఎదురుచూస్తానన్నారు. విద్యారంగంలో జవాబుదారీతనం, తన సొంత లద్దాఖ్ పర్యావరణం, సంస్కృతి, అక్కడి ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయాలలో జవాబుదారీతనం అనే రెండు కీలక అంశాలపైనే తన దృష్టి ఉందన్నారు. విద్యను ప్రభావితం చేసే నిర్ణయాల్లో పౌరులకు స్థానం ఉండాలని, అలాగే పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునే విషయాల్లో లద్దాఖ్ ప్రజల అభిప్రాయాలకు విలువివ్వాలని వాంగ్చుక్ స్పష్టం చేశారు. శనివారం కల్లా ఈ రెండింటిపై స్పందన రాకపోతే, సీజేపీ నాయకులతో కలిసి నిరాహార దీక్షకు కూర్చుంటానన్నారు. -
నీట్ నిర్వహణ భేష్.. ప్రధాని ప్రశంస
ఢిల్లీ: నీట్ పునఃపరీక్ష విజయవంతంగా నిర్వహించారని ప్రధాని మోదీ విద్యాశాఖను కొనియాడారు. బుధవారం నిర్వహించిన కేబినేట్ సమావేశంలో వారికి అభినందనలు తెలిపారు. నీట్ ప్రక్రియ 'హోల్-గవర్నమెంట్' విధానాన్ని ప్రదర్శించిందని, మంత్రులు మరియు అధికారుల సమిష్టి కృషిని ఆయన ప్రశంసించారు.కేబినేట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ "పరీక్ష సజావుగా, చిత్తశుద్ధితో" నిర్వహించబడింది. ప్రణాళిక అమలులో తమ మంత్రులు తమ బాధ్యతలు నిర్వహించారు. భవిష్యత్తులో సైతం ఇదే విధంగా సమన్వయ విధానాన్ని అనుసరించాలి". అని ఆయన అన్నారు. అంతా కలిసి పనిచేస్తే ఏలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని నీట్ మరోసారి రుజువుచేసిందన్నారు.ప్రధాని అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీట్ పునఃపరీక్ష నిర్వహించిన విధానాన్ని వివరించారు. పలు మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు,విభాగాలు సమన్వయంతో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.కాగా నీట్ పునఃపరీక్ష జూన్ 21న దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలలో,విదేశాల్లోని 14 కేంద్రాలలో నిర్వహించారు. ఈ పరీక్షకు 20 లక్షలకు పైగా అభ్యర్థుల హాజరయ్యారు.కాగా గత నెల మే 3న నిర్వహించిన నీట్ యూజీ (NEET UG) పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్రం రద్దు చేసింది. "గెస్ పేపర్" పేరుతో లక్షల రూపాయలకు ప్రశ్నపత్రాలు అమ్ముడయ్యాయని, లీకేజీ నెట్వర్క్ సోషల్ మీడియా ద్వారా విస్తరించిందని దర్యాప్తులో తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
డైపర్ల విరాళాల ఉద్యమం చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ
న్యూఢిల్లీ: ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, పేపర్ లీకేజీలపై తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఆందోళనకారులు ‘డైపర్ ఏ డే కీప్స్ లీక్స్ అవే’ (రోజుకో డైపర్ లీకేజీలను అడ్డుకుంటుంది) అనే నినాదంతో ఒక వినూత్నమైన ‘డైపర్ల విరాళాల ఉద్యమాన్ని’ ప్రారంభించారు. జంతర్ మంతర్ వద్దకు వచ్చే వారు ఒక డైపర్ను తీసుకొచ్చి, దానిపై మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ను రాసి ఇవ్వాలని, వాటిని విద్యాశాఖ మంత్రికి అందజేస్తామని నిరసనకారులు ప్రకటించారు.ఉధృతమవుతున్న ఆందోళనలు గత శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ధర్నా కార్యక్రమం రేయింబవళ్లు కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ, విద్యార్థులు, మద్దతుదారులు రాత్రి వేళల్లో కూడా నిరసన స్థలంలోనే బస చేస్తున్నారు. సోమవారం రాత్రి, నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మారకార్థం జంతర్ మంతర్ వద్ద కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత పోలీసులు ఈ కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతించలేదని, ఆ తర్వాత అనుమతి లభించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు.పరీక్షా కేంద్రాలకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను రీ-టెస్ట్ రాయడానికి అనుమతించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించారని, కానీ ఇంత పెద్ద పేపర్ లీకేజీకి కారణమైన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అభిజీత్ దిప్కే తీవ్రంగా విమర్శించారు. తప్పు చేసిన వారిని వదిలేసి, అమాయక విద్యార్థులను అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం జరిగిన రీ-టెస్ట్కు హాజరైన పలువురు నీట్ అభ్యర్థులు కూడా ఈ నిరసనల్లో పాల్గొని తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థుల బాధలను ఆలకించాలని వారు విజ్ఞప్తి చేశారు.తనిఖీల వివాదం – పోలీసుల వివరణఈ నిరసనల్లో ఎస్ఎఫ్ఐ, ఐసా, ఏఐఎస్ఎఫ్ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి. విద్యార్థుల కోసం నిరసన స్థలంలోనే ఒక ఉచిత గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా, ధర్నాలో పాల్గొనకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు వారి ఆధార్ కార్డులను, చిరునామా వివరాలను సేకరిస్తున్నారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఖండించారు. తాము జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఆధార్ తనిఖీలు చేపట్టలేదని, అటువంటి వివరాలేవీ సేకరించలేదని, ఆ ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. -
టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం
సాక్షి, ఢిల్లీ: దేశంలో టెలిగ్రామ్ సేవలు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. జూన్ 21న జరిగిన నీట్ రీఎగ్జామ్ రీత్యా భద్రతా కారణాలతో టెలిగ్రామ్ సేవలను జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. ఎగ్జామ్ ముగియడంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగింపు కొనసాగనుంది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.జూన్ 21న నీట్ ఎగ్జామ్ ప్రశాతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక గణాంకాల ప్రకారం పునఃపరీక్షకు దేశవ్యాప్తంగా 20 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు హజరైనట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నీట్ పరీక్షను దాదాపు 3.65 లక్షల మంది విద్యార్థులు రాశారు. కొన్ని ప్రాంతాలలో విద్యార్థులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించలేదు. దీంతో వారు పరీక్షకు అనుమతించాలని తీవ్రంగా విలపించారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మినహా ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది -
NEET ఎగ్జామ్ మిస్.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీడియా ఎదుట వాపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆదివారం జరిగిన ఈ సంఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. నిన్న దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రీ-టెస్ట్ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. విద్యార్థులు 1.30 గంటలకు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. కానీ ట్రాఫిక్ పెరగడంతో తల్లిదండ్రులు బైక్లను ఫుట్పాత్లపై నడిపే పరిస్థితి వచ్చింది. చివరికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా చేరుకోవడంతో పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. వారు గేటు ఎక్కి లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా, నిర్వాహకులు గేట్లను మూసివేశారు.అయితే తల్లిదండ్రులు కాంగ్రెస్ ర్యాలీని తప్పుబట్టారు. 7 కిలోమీటర్ల దూరం సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ ర్యాలీ కారణంగా 35 నిమిషాలకుపైగా పట్టింది. పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీలు నగర బయట జరగాలి అని ఓ తండ్రి అసహంన వ్యక్తం చేశారు. మరొకరు రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం కోటాకు వెళ్లారు. కానీ ఆయన పార్టీ ర్యాలీ వల్ల నలుగురు విద్యార్థులు పరీక్ష మిస్సయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.ఈ ఘటనపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ‘కాంగ్రెస్ అధికార దాహం కోసం ఎంత వరకు దిగజారుతుంది?’ అంటూ వీడియోను షేర్ చేశారు. దీనికి కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత దశాబ్దంలో 89 పేపర్ లీకులు జరిగాయి’ అని ప్రతిస్పందించారు.కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ‘కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాను. వారికి కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ బీజేపీ పాలనలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి వారు క్షమాపణ చెప్పారా?’అని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి ఈ ఘటనను ప్రభుత్వానికి అవమానకరమైన పరిణామంగా అభివర్ణించారు.Bengaluru, Karnataka: A parent of one of the students says, "Rahul Gandhi, D.K. Shivakumar, and even the Commissioner of Police, Bengaluru, do not seem to be concerned. Rahul Gandhi went to Kota for the cause of students, right? But because of his party's function today, four… https://t.co/1ixZBqPcRc pic.twitter.com/No3W5edKEb— IANS (@ians_india) June 21, 2026 -
కోడింగ్ టు ప్రిస్క్రిప్షన్: సత్తా చాటిన ‘ఆకృతి @ 32’
కలలు కనడానికి వయసుతో నిమిత్తం లేదని, సంకల్పం బలంగా ఉంటే ఎంతటి కఠినమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించారు ముంబైకి ఆకృతి గోయల్. ఇంజనీరింగ్ పూర్తి చేసి, మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. డాక్టర్ కావాలనే చిన్నప్పటి కల ఆమెను నిద్రపోనివ్వలేదు. 32 ఏళ్ల వయసులో ఇంకా పెళ్లి కాలేదనే హేళనలను, ‘ఈ వయసులో ‘నీట్’ రాస్తారా?’ అనే మాటలను లెక్కచేయకుండా, కేవలం 10 నెలల కఠోర ప్రిపరేషన్తో నీట్ (NEET UG) పరీక్షను క్రాక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు ఆకృతి గోయల్.బిట్స్ పిలానీ నుండి ఎంబీబీఎస్ వైపు అడుగులుఆకృతికి చిన్నతనం నుంచే మెడిసిన్ వైపు మక్కువ ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితుల వల్ల ఇంజనీరింగ్ దిశగా వెళ్లాల్సి వచ్చింది. ఆమె ప్రతిష్టాత్మక ‘బిట్స్ పిలానీ’లో ఎంఎస్సీ ఎకనామిక్స్, బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లకు వెళ్లకుండా, స్వయంగా ఇంటర్వ్యూల ద్వారా స్టార్టప్లలో ఉద్యోగాలు సంపాదించారు. ఆ తర్వాత ‘హీలోఫీ’ అనే స్టార్టప్లో లీడర్షిప్ పాత్రను పోషిస్తూ, నేరుగా సీఈఓతో కలిసి మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను విజయవంతంగా హ్యాండిల్ చేశారు.ఉద్యోగానికి గుడ్ బై.. సమాజం నుండి అవహేళనలువరుసగా లేట్ నైట్ షిఫ్టులు, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా 2020 జనవరిలో ఆకృతి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసి, మళ్లీ డాక్టర్ కావాలనే తన చిన్ననాటి కల వైపు అడుగులు వేశారు. అయితే, 30 ఏళ్లు దాటిన ఆకృతి ఉద్యోగం వదిలేసి పరీక్షలకు సిద్ధమవడాన్ని చుట్టుపక్కల వారు తప్పుపట్టారు. ‘ఈ వయసులో పెళ్లి చేసుకోకుండా నీట్ ప్రిపరేషన్ ఏంటి?’ అంటూ ఎగతాళి చేశారు. కానీ ఆ విమర్శలనే ఆమె తన విజయానికి ఇంధనంగా మార్చుకున్నారు.10 నెలల కఠోర దీక్ష.. 676 మార్కులతో..దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాలు పట్టడం ఆకృతికి అంత సులువు కాలేదు. తొలుత ఆన్లైన్లో ఉచిత బయాలజీ క్లాసులు వింటూ, రోజుకు 10 గంటల చొప్పున చదవడం ప్రారంభించారు. కేవలం 10 నెలల ప్రిపరేషన్ కాలంలో ఆమె 100 కి పైగా మాక్ టెస్టులు రాశారు. 2021లో నీట్ ఫలితాలు విడుదలైనప్పుడు, ఆమె 676 స్కోరుతో, ఆల్ ఇండియా లెవెల్లో 1,118వ ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమె హిందూ రావు మెడికల్ కాలేజీ(ఢిల్లీ)లో ఎంబీబీఎస్ చదువుతూ, సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. -
పరీక్షకు కొద్ది గంటల ముందు ‘నీట్’ అభ్యర్థి ఆత్మహత్య
ఘజియాబాద్: దేశవ్యాప్తంగా నేడు (ఆదివారం) నీట్ యూజీ పరీక్ష జరుగుతోంది. ఈ పరీక్షకు కొద్ది గంటలముందు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ‘నీట్’కు సిద్ధం అవుతున్న 22 ఏళ్ల ఒక యువకుడు తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. మరణానికి కొద్ది నిమిషాల ముందు సదరు విద్యార్థి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.మొబైల్ వీడియోలో సంచలన నిజాలుఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా విజయ్ నగర్ నివాసి అయిన జతిన్ కుమార్ అనే యువకుడు నీట్-యూజీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే, అతడు తన గదిలో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో భాగంగా జతిన్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో ఒక వీడియో క్లిప్ లభ్యమైంది. తాను చనిపోవడానికి కొద్దిసేపటి ముందే జతిన్ దానిని రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలో.. ఆదివారం జరగబోయే నీట్ పునఃపరీక్ష గురించి తనకు ఎలాంటి ఒత్తిడి లేదని ఆ యువకుడు స్పష్టం చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ వాస్తవికతను, డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.అర్ధరాత్రి వరకు చదువుకుని.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటే వరకు జతిన్ తన గదిలో చదువుకుంటూనే ఉన్నాడు. తీరా శుక్రవారం ఉదయం నిద్ర లేపేందుకు వెళ్లిన బంధువులకు అతడు అపస్మారక స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోత్వాలి నగర్ పోలీసులు, గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఒక ఉరితాడు వేలాడుతూ ఉండటాన్ని, జతిన్ మృతదేహం కింద పడి ఉండటాన్ని గమనించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉపాసన పాండే ఈ కేసుపై స్పందిస్తూ.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, అన్ని కోణాల్లోనూ లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.యూపీలో వరుస విషాదాలుమే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ పరీక్షను రద్దు చేసి సీబీఐ విచారణకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ గందరగోళ పరిస్థితులు విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం ఘాజియాబాద్లోనే కాకుండా, లక్నోలో కూడా 17 ఏళ్ల ఒక విద్యార్థిని మంగళవారం తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. మే 3 పరీక్షలో మంచి మార్కులు సాధించి, సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్న ఆ విద్యార్థిని పరీక్ష రద్దు కావడంతో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
ముగిసిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్
నీట్ యూజీ అప్డేట్స్ముగిసిన రీ-ఎగ్జామ్నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష ముగిసింది మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరిగిందికొనసాగుతున్న పరీక్షకొనసాగుతున్న నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్షపెన్ అండ్ పేపర్ విధానంలో నీట్ యూజీనీట్ యూజీ ప్రారంభం దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష నేటి (జూన్ 21, ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల ప్రారంభమైంది. అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ప్రశ్నపత్రాలను స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాల పహారా మధ్య పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా తరలించారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాలలో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు నేషనల్... టెస్టింగ్ ఏజెన్సీ భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాల్లోని 95,000 కంటే ఎక్కువ గదుల్లో 1.38 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వీటిని జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్ రూమ్ల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.మాల్ప్రాక్టీస్కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణ, పరీక్షా కేంద్రాల్లో 51,000 కంటే ఎక్కువ జామర్లు, బయోమెట్రిక్ తనిఖీలు మరియు ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు) ప్రక్రియలను అమలు చేస్తున్నారు. హై-సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్ల ద్వారా అభ్యర్థులకు క్షుణ్ణంగా తనిఖీలు (ఫ్రిస్కింగ్) చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ కార్డ్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తీసుకురావాలని ఎన్టీఏ ముందే సూచించింది. -
నీట్ రీ-ఎగ్జామ్: నాగ్పూర్, అహిల్యానగర్, లాతూర్లలో టైట్ సెక్యూరిటీ
ముంబై: గత దఫాలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీ ప్రకంపనల నేపథ్యంలో, నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్-యూజీ పునఃపరీక్షకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీటీ యూజీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నాగ్పూర్, అహిల్యానగర్, లాతూర్ తదితర ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు, సీసీటీవీ కెమెరాలతో కూడిన గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షకు హాజరుకావాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు.నాగ్పూర్లో ఉచిత ప్రయాణం నాగ్పూర్లోని 30 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 12,512 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు ముమ్మరం చేయడంతో అక్కడ దాదాపు ‘పోలీస్ క్యాంప్’ వాతావరణం తలపిస్తోంది. అభ్యర్థుల గుర్తింపును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు, విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకుండా నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ తమ ‘ఆప్లీ బస్’ సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. అడ్మిట్ కార్డ్ చూపించి విద్యార్థులు ఈ ఏసీ బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు.అహిల్యానగర్లో సీఆర్పీఎఫ్ పహారాఅహిల్యానగర్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 5,385 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రశ్నపత్రాల రవాణాలో ఎలాంటి లోపాలు జరగకుండా స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచారు.లాతూర్లో తగ్గిన కేంద్రాలు గత వివాదాల దృష్ట్యా లాతూర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం కోసం పరీక్షా కేంద్రాల సంఖ్యను గతేడాది ఉన్న 34 నుండి ఈసారి 24కి తగ్గించింది. ఇక్కడ సుమారు 14,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతను సమీక్షించారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించడానికి డ్యూటీ మేజిస్ట్రేట్లు, రాష్ట్ర అబ్జర్వర్లను ప్రత్యేకంగా నియమించారు. -
ఈ రోజే నీట్ రీఎగ్జామ్.. కట్టుదిట్టమైన భద్రత
ఈ రోజు జరగనున్న నీట్ రీఎగ్జామ్కు ఎన్టీఏ దేశ వ్యాప్తంగా అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని పేర్కొంది. పరీక్షలు ఎటువంటి అక్రమాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు మానటరింగ్ చేయనున్నట్లు పేర్కొంది.అదేవిధంగా ఏఐ ఆధారిత సీసీటీవీలు, 51,311 జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాల నియంత్రణ చేపట్టనుంది. మరోవైపు తెలుగురాష్ట్రాల్లో నీట్ రీఎగ్జామ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 2.95 లక్షల మంది నీట్ పరీక్ష రాయనున్నారు.వీరికోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఏపీలో 65,790 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు.కాగా దేశవ్యాప్తంగా ఆదివారం జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రీ-ఎగ్జామ్ కేవలం 22 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. కాగా మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ కావడం, ఆ తర్వాత పరీక్షను రద్దు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి, నిరసనలకు దారితీసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే, ఈ ఘటనపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తూనే... తాము పారదర్శకతకే ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేసిందిదీంతో ఈ పరీక్ష వైద్య విద్యార్థులకే కాకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది. మే నెలలో జరిగిన మొదటి విడత పరీక్షలో పేపర్ లీకేజీ వివాదం చెలరేగడంతో, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి కేంద్రం ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతోంది.పరీక్ష సమయాలు పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది.దివ్యాంగులకు మినహాయింపు: అదనపు సమయానికి అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు సమయం కేటాయించారు.రిపోర్టింగ్ సమయం: విద్యార్థులు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని NTA స్పష్టం చేసింది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ)–2026 పునఃపరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. ఈ గడువుకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా, మే 3న నిర్వహించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పునఃపరీక్ష నిర్వహణ పట్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారైనా పరీక్షను సక్రమంగా నిర్వహిస్తారా? లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు పెన్ను, పేపర్(ఆఫ్లైన్) విధానంలో దేశవ్యాప్తంగా 551, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ పునఃపరీక్షను నిర్వహిస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. జాతీయ స్థాయిలో 22.79 లక్షల మంది విద్యార్థులు నీట్ రాయనున్నారు. మన రాష్ట్రంలోని 27 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన 185 కేంద్రాల్లో 65,790 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 1,500 మంది కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం ఈ కేంద్రాలన్నింటిలో నీట్ మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఆదివారం ప్రశ్నాపత్రాలను పోలీస్ భద్రతతో కేంద్రాలకు తరలించనున్నారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషే«ధాజ్ఙలు అమలు చేయనున్నారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. దివ్యాంగ విద్యార్థులకే అదనపు సమయం అదనపు సమయం దివ్యాంగ విద్యార్థులకేనని శనివారం ఎన్టీఏ ప్రకటించింది. దివ్యాంగ విద్యార్థులు సాయంత్రం 6.20 గంటల వరకూ పరీక్ష రాసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. అయితే ఈ అదనపు సమయం కేటాయింపుపై విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని, ఆ విషయంపై ఎన్టీఏ మరోమారు స్పష్టతనిచ్చింది. కొందరు సాధారణ విద్యార్థుల అడ్మిట్ కార్డుల్లో అదనపు సమయం కాలమ్ దగ్గర ‘వై’ అని ముద్రించి ఉండటంతో గందరగోళం నెలకొందని, ఆ కాలమ్ దగ్గర ‘వైఈఎస్’ అని ముద్రించిన దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే అదనపు సమయం కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. శనివారం రాత్రి ఏడు గంటల వరకూ కూడా కొందరు అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోలేదని, వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా వాట్సాప్కు అడ్మిట్ కార్డులు పంపామని ఎన్టీఏ తెలిపింది.‘నీట్’కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయండి: సీఎస్రాష్ట్రంలో ఆదివారం నిర్వహించనున్న నీట్ యూజీ–2026 రీ ఎగ్జామ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశించారు. సీఎస్ తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నీట్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పర్యవేక్షించాలని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఉంటుందని, ఈ విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఫొటోస్టాట్ షాపులు, సైబర్ కేఫ్లు, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని, నిషేధ ఆజ్ఞలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో పేపర్ లీకేజీ వంటి వదంతులు సృష్టించేవారిపై నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు.నిబంధనలు ఇవే..డ్రెస్ కోడ్: విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరలించాలి. పూర్తి చేతులు(ఫుల్ స్లీవ్స్) చొక్కాలు, ఉన్ని దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీల కోసం పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికన్నా ముందే చేరుకోవాలి. సంప్రదాయ, మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన వస్తువులను ధరించేవారు క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి వీలుగా కేంద్రంలో చాలా ముందుగానే రిపోర్ట్ చేయాలి. కేవలం స్లిప్పర్స్, ఎత్తు తక్కువ ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి. పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి: అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, వంటి ధ్రువీకరణపత్రాలు), ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. నిషేధిత వస్తువులు: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎల్రక్టానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, ఇతర కాగితాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. -
ఒత్తిడితో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
మియాపూర్ (హైదరాబాద్): నీట్ రీ ఎగ్జామ్కు సిద్ధమవుతున్న విద్యార్థిని చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మియాపూర్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ వివరాలు తెలిపారు. వైఎస్ఆర్కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్సనా నీట్ ఎగ్జామ్కు సిద్ధం అవుతోంది. తండ్రి ఉద్యోగ రీత్యా కువైట్లో ఉంటుండగా, పది రోజుల కిందట షేక్ సనా తల్లి అబ్బునిసా సొంతూరికి వెళ్లింది. దీంతో సనా తన ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లో ఉంది.శనివారం చదువుకునేందుకు షేక్ సనా తన గదిలోకి వెళ్లి సాయంత్రం అయినా బయటకు రాకపోయేసరికి ఆమె చెల్లెళ్లు గది తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది.‘తల్లిదండ్రులను మెప్పించలేకపోతున్నా.. భయం, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం కోల్పో యి బాధపడుతున్నాను. చదువులో కుటుంబ అంచనాలను అందుకోలేకపోతున్నా. గత పరీక్షల్లో వైఫల్యం కారణంగా బాధపడుతున్నా. నా బాధను ఎవరితో పంచుకోవాలో తెలియదు’అని సూసైడ్ నోట్లో పేర్కొంది. -
నేడే నీట్ రీఎగ్జామ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్ను నిర్ణయించే నీట్–యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ లీక్తో రద్దు... ఎన్టీఏపై విమర్శల వెల్లువ గత నెల 3న జరిగిన నీట్కు ముందు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జీవశాస్త్రం, రసాయన శాస్త్రానికి చెందిన అనేక ప్రశ్నలు ముందుగానే సోషల్మీడియాలో చక్కర్లు కొట్టినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదని ఎన్టీఏ నిర్ధారించింది. దీంతో పరీక్షను పూర్తిగా రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఎన్టీఏ పరీక్షల నిర్వహణ విధానంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఈసారి ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొనే నిపుణులను రహస్య ప్రదేశాలకు తరలించి డిజిటల్ కమ్యూనికేషన్పై పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రశ్నల బ్యాంకును విస్తరించడం, ప్రశ్నపత్ర రూపకల్పనలో ఎక్కువ మంది నిపుణులను భాగస్వామ్యం చేయడం, గోప్యతా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం : ఎన్టీఏ నీట్ రీఎగ్జామ్ అత్యంత పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది. 95,000లకు పైగా పరీక్ష గదుల్లో మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. లైవ్ ఫీడ్లను జాతీయ, ఆయా రాష్ట్ర స్థాయిలో వర్చువల్గా పర్యవేక్షిస్తారు. ఎల్రక్టానిక్ అక్రమాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష గదికి ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారు. అభ్యర్థుల తనిఖీకి 38,795 మంది సిబ్బందిని, బయోమెట్రిక్ వెరిఫికేషన్కు 48,448 మందిని రంగంలోకి దించారు. ఈసారి బయోమెట్రిక్ సిబ్బందిని రెట్టింపు చేయడమే కాకుండా ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. సాంకేతిక సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి కేంద్రంలో ఒక సెంటర్ సిస్టమ్స్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. పరీక్షా కేంద్రాల్లో సుమారు 6,700 మంది అబ్జర్వర్లు విధుల్లో ఉండగా, 100 మందికి పైగా వర్చువల్ అబ్జర్వర్లు కేంద్ర కార్యాలయం నుంచి నిరంతరం లైవ్ సీసీటీవీ ఫుటేజీని పర్యవేక్షిస్తారు. ఈ ఫుటేజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్తో విశ్లేíÙంచి, ఎక్కడైనా తేడాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్ బ్యాకప్, వైద్య సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ రీ ఎగ్జామ్కు ముందు శనివారం దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించారు. రాష్ట్రంలో కూడా ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా వ్యవస్థలు, ప్రశ్నపత్రాల రవాణా, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను పరీక్షించారు. ప్రశ్నపత్రాల భద్రత కోసం జిల్లా యంత్రాంగాలు, పోలీసు బలగాలు, ఎస్కార్ట్ బృందాలు కలిపి రెండు లక్షల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించారు. పేపర్ లీకేజీలకు సోషల్ మీడియా వేదికలు ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎన్టీఏ ఖండిస్తూ, విద్యార్థులు వదంతులను నమ్మొద్దని సూచించింది. అనుమానాస్పద సమాచారం, నకిలీ పేపర్లపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నీట్ రీ ఎగ్జామ్ ఎన్టీఏ విశ్వసనీయత, దేశంలోని అత్యంత కీలక ప్రవేశ పరీక్షల పారదర్శకతకు అగ్నిపరీక్షగా మారింది. -
‘ఎన్టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్ నిప్పులు!
న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET) నిర్వహణ తీరుపై మరోసారి తీవ్ర దుమారం రేగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చేసిన ఒక పొరపాటు ఒక విద్యార్థి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాగ్పూర్కు చెందిన ఒక విద్యార్థికి రీ-ఎగ్జామ్ సెంటర్ ఏకంగా విదేశాల్లో (అబుదాబి) కేటాయించడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం కేంద్ర ప్రభుత్వంపై, ఎన్టీఏపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగ్పూర్కు చెందిన ఒక విద్యార్థి నెల రోజులుగా ఎంతో కష్టపడి నీట్ రీ-ఎగ్జామ్ కోసం సన్నద్ధమయ్యాడు. అయితే పరీక్షకు సరిగ్గా ఒక్కరోజు ముందు అతను తన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగా, అందులోని పరీక్షా కేంద్రం చూసి షాక్కు గురయ్యాడు. ఆ విద్యార్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ‘అబుదాబి’లో సెంటర్ కేటాయించారు. ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ ఎక్స్ ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎన్టీఏ పనితీరును తప్పుపట్టారు. అసలు ఇలాంటి ఘోరమైన తప్పు ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ‘విద్యార్థి ఉన్న నగరంలోనే ఒక పరీక్షా కేంద్రాన్ని సరిగ్గా కేటాయించలేని విద్యా వ్యవస్థకు, ఇలాంటి అత్యున్నత స్థాయి పరీక్షలను నిర్వహించే హక్కు ఎక్కడిది?’ అని ప్రశ్నించారు.విద్యార్థుల, వారి తల్లిదండ్రుల సహనాన్ని ఎన్టీఏ పరీక్షిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల తాను కోటాలో విద్యార్థులను కలిసి వారి బాధలను పంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత విద్యా వ్యవస్థ యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని విమర్శిస్తూ.. ‘ఇది నిజమైన విద్యా వ్యవస్థ కాదు, ఇది ఒక తరానికి చెందిన డబ్బును, సమయాన్ని, మానసిక ప్రశాంతతను నిలువునా దోపిడీ చేసిందన్నారు. పిల్లల భవిష్యత్తుతో జూదం ఆడటం ఇకనైనా ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలోని విద్యార్థులకు బాధ్యతాయుతమైన, సమాధానం చెప్పే విద్యా వ్యవస్థ, పరీక్షా యంత్రాంగం అవసరమని ఇందుకోసం తాము పోరాడి తీరుతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్! -
‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్!
భువనేశ్వర్: నీట్-యూజీ (NEET-UG) రీటెస్ట్ రాయబోతున్న ఒక ఒడిశా విద్యార్థినికి ఊహించని షాక్ తగిలింది. జూన్ 21న పరీక్ష జరగనుండగా, కేవలం ఒక్క రోజు ముందు ఆమెకు దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాఖండ్కు చెందిన డెహ్రాడూన్లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. మొదట భువనేశ్వర్లో సెంటర్ ఇచ్చిన అధికారులు, ఇప్పుడు రీటెస్ట్ అడ్మిట్ కార్డ్లో డెహ్రాడూన్ అని మార్చడంతో ఆ విద్యార్థిని, ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ గందరగోళం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో, విద్యార్థిని భవిష్యత్తును కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.భువనేశ్వర్ టు డెహ్రాడూన్ఈ తప్పిదాన్ని ‘వెటరన్స్ క్లబ్ ఒడిశా’ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు విద్యార్థిని మొదట రాసిన నీట్ పరీక్షకు భువనేశ్వరే కేంద్రంగా ఉంది. కానీ, రీటెస్ట్ కోసం జారీ చేసిన కొత్త అడ్మిట్ కార్డ్ను చూసి ఆ కుటుంబం నిర్ఘాంతపోయింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో అంత దూరం ప్రయాణించడం ఆర్థికంగా, ప్రాక్టికల్గా అసాధ్యమని, దీనివల్ల విద్యార్థిని పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.న్యాయం కోసం మాజీ సైనికుడి పోరాటంబాధిత విద్యార్థిని తండ్రి, మాజీ సైనికుడు సంజయ్ బిస్వాల్ ఈ తప్పిదంపై ఇండియన్ ఎక్స్-సర్వీసెస్ లీగ్ ఒడిశా విభాగంతో పాటు ఇతర ఉన్నతాధికారులకు అత్యవసర అప్పీళ్లు సమర్పించారు. తన కుమార్తెకు స్వరాష్ట్రంలోనే లేదా ఇంటికి దగ్గరగా ఎక్కడైనా పరీక్షా కేంద్రాన్ని మార్చాలని ఆయన అభ్యర్థించారు. పరీక్ష సమయం ముంచుకొస్తున్న తరుణంలో, ఈ ఆకస్మిక మార్పు విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది.ఒకవైపు ఉచిత రవాణా.. మరోవైపు అందని స్పందనమరోవైపు, ఒడిశా ప్రభుత్వం నీట్ రీటెస్ట్ రాసే అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రవాణా సౌకర్యాలను ప్రకటించింది. ఖుర్దా జిల్లాలోనే 26 కేంద్రాలకు గానూ 108 బస్సులను ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా సాయం అందిస్తున్నా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన ఈ పొరపాటు కారణంగా ఒక విద్యార్థిని ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ఈ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. -
‘ఒక్క ఎగ్జామ్తో అయిపోలేదు’.. యాక్టర్ ఎమోషనల్ మెసేజ్!
ముంబై: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ ఆదివారం(జూన్ 21) జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఉపేంద్ర చౌహాన్ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపేందుకు ‘టైమ్స్ నౌ డిజిటల్’ ద్వారా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పరీక్షలో విజయం సాధిస్తే మంచిదేనని, ఒకవేళ విఫలమైనా అది జీవితాంతం కాదని చెబుతూ, మానసిక ఒత్తిడిలో ఉన్న అభ్యర్థులకు ఆయన ధైర్యాన్ని నూరిపోశారు.‘జీవితంలోనూ లెక్కలేనన్ని అపజయాలు’తాను కూడా కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులను, లెక్కలేనన్ని తిరస్కరణలను ఎదుర్కొన్నానని ఉపేంద్ర చౌహాన్ గుర్తుచేసుకున్నారు. ఒకానొక సమయంలో తన కలలు చేజారిపోతున్నాయని, జీవితంలో ఇంకేమీ మిగల్లేదని తీవ్ర నిరాశకు గురైన క్షణాలను ఆయన పంచుకున్నారు. అయితే ఆ కష్ట కాలమే తనను ఈ రోజు ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దిందని, జీవితాన్ని చూసే సరైన మార్గాన్ని నేర్పిందని వివరించారు. జీవితం అనే పెద్ద ప్రయాణంలో ఇలాంటి కఠినమైన పరీక్షలు చాలా చిన్నవని, అపజయాలే మనిషి ఎదుగుదలకు, పరిమితులను దాటి ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన తెలిపారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు యాక్టర్తన సొంత జీవిత ప్రయాణాన్ని ఉదాహరణగా చూపుతూ ఉపేంద్ర విద్యార్థులకు కీలక విషయాలను వివరించారు. తాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, మొదట సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ, ఆ తర్వాత అనుకోకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఏడేళ్లపాటు విజయవంతంగా బిజినెస్ రన్ చేశానని చెప్పారు. ఆ సమయంలో తనకు నటుడిని అవుతానని అస్సలు తెలియదని, జీవితంలో తన అసలైన లక్ష్యం చాలా ఆలస్యంగా గుర్తించానని అన్నారు. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ జీవితానికి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.‘పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే.. జీవితాన్ని దాని దారిన సాగనివ్వండి. జీవితం చాలా అందమైనది, దానిని ప్రేమించండి’ అంటూ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.ఇది కూడా చదవండి: అగ్రహీరో బ్యానర్లో ద్రౌపది ముర్ము బయోపిక్ -
ఢిల్లీలో సీజేపీ నిరసనలు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహించాలని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసనల్లో పాల్గొంటూ, కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీక్, సీబీఎస్సీ మూల్యాంకన వివాదాలు, నియామక పరీక్షల్లో అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ నిరసనల సందర్భంగా భారీ ఎత్తున నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు. 20 जून को कॉकरोचो के सरदार ने जंतर मंतर के रंगारंग कार्यक्रम के लिए चम्मच और थाली लाने के लिए कहा है ताकि आते जाते राहगीर अपने घर का बासी खाना इनके थाली में डाल जाए और यह चम्मच चाट कर खाएं pic.twitter.com/GFTHnG1xVo— Kikki Singh (@singh_kikki) June 19, 2026ఇదిలా ఉండగా.. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందిన కాక్రోచ్ జనతా పార్టీ, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా మారింది. జూన్ 6న ఢిల్లీలో నిర్వహించిన తొలి భారీ నిరసనకు వందలాది మంది విద్యార్థులు, యువత హాజరయ్యారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. సీజేపీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసి, పరీక్షల అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న విద్య, ఉద్యోగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకున్న సీజేపీ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
టెలిగ్రామ్పై నిషేధం సబబే
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ రీ–ఎగ్జామ్ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పేపర్ లీకేజీలను నివారించేందుకు జూన్ 22 వరకు యాప్ను బ్యాన్ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ తేజస్ కరియా సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. టెలిగ్రామ్ యాప్లోని సాంకేతిక ఫీచర్ల ద్వారా ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను సష్టించి, ఒకేసారి పెద్ద ఎత్తున సమాచారాన్ని బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ఒక బాట్ను బ్లాక్ చేస్తే, దానంతటదే మరో బాట్కు సమాచారం బదిలీ అయ్యే (మిర్రర్ ఛానల్) వ్యవస్థ ఇందులో ఉందని వివరించారు. 21న జరిగే నీట్ రీ–ఎగ్జామినేషన్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), కేంద్ర ఉన్నత విద్యా శాఖ సిఫార్సుల మేరకే తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు వివరించారు. అయితే, నీట్కు సంబంధించి చట్టవిరుద్ధంగా ఉన్న 900 పైగా లింకులను ఏఐ సాంకేతికత ద్వారా ఇప్పటికే తొలగించామని టెలిగ్రామ్ వాదించింది. కొందరు చేసిన తప్పులకు 15 కోట్లకు పైగా ఉన్న సాధారణ యూజర్లను శిక్షించడం వారి హక్కులను హరించడమేనని పేర్కొంది. కేవలం ఒక వర్గానికి చెందిన అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారనే కారణంతో, ఏ సంబంధం లేని 15 కోట్ల మంది సాధారణ యూజర్ల యాప్ వినియోగాన్ని ఎలా నిరోధిస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రాన్ని మౌఖికంగా ప్రశ్నించింది. వాదనల అనంతరం టెలిగ్రామ్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ తేజస్ కరియా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఒక సామాజిక మాధ్యమ వేదికను బ్లాక్ చేసే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. జరగబోయే నష్టాన్ని నివారించేందుకు కేంద్రం అనుసరించిన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే నీట్ (NEET) రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపించి, తమ ఇళ్ల నుండి పరీక్షా కేంద్రాల వరకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఉచితంగా రాకపోకలు సాగించవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ఉచిత ప్రయాణ సదుపాయం సంస్థకు చెందిన ఏసీ సర్వీసులు మినహాయించి అన్ని బస్సులలో అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.ఈ పరీక్షకు దాదాపు 73 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాలలో తగినన్ని బస్సులను నడిపేందుకు ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 21వ తేదీ మొదటి సర్వీసు నుంచి అర్ధరాత్రి వరకు ఈ సదుపాయాన్ని అభ్యర్థులు వినియోగించుకోవచ్చని, ఏదైనా ఆటంకాలు ఎదురైనట్లయితే, టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-2345 0033, 6815 3333లలో సంప్రదించవచ్చంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు సకాలంలో చేరుకోవడానికి అభ్యర్ధులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. -
నీట్ రీ-ఎగ్జామ్ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్
-
హాల్ టికెట్ పొందడమే ఓ ప్రహసనం
సాక్షి, అమరావతి: నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) యూజీ–2026 పరీక్ష అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడం ఓ ప్రహసనంగా మారిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పేపర్ లీక్ కావడంతో గత నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేసి ఈ నెల 21న(ఆదివారం) తిరిగి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రీ–ఎగ్జామినేషన్కు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 14న ఎన్టీఏ విడుదల చేసింది. ఎన్టీఏ వెబ్సైట్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నాలుగు రోజులైనా అభ్యర్థులందరూ హాల్టికెట్లు పొందలేని దుస్థితి నెలకొంది. దాదాపు 23 లక్షల మంది నీట్ రాయాల్సి ఉండగా, బుధవారం రాత్రికి 16 లక్షల మంది మాత్రమే హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని ఎన్టీఏ ప్రకటించింది. రోజుల తరబడి కుస్తీ వాస్తవానికి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం అనేది కొన్ని నిమిషాల్లో ముగిసే ప్రక్రియ. అలాంటి ప్రక్రియకు ఏకంగా రోజుల తరబడి పడుతోందని విద్యార్థు లు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నీట్ పరీక్ష రద్దయిన నేపథ్యంలో విద్యార్థులు చెల్లించిన దరఖాస్తు రుసుమును రిఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయాలని తొలుత ఎన్టీఏ నిబంధన పెట్టింది.ఒక్కసారిగా సర్వర్లపై లోడ్ పెరగడంతో చాలామందికి అకౌంట్ వివరాలు సబ్మిట్ కాకపోగా, హాల్టికెట్లు హోల్డ్లో పడిపోయి విద్యార్థులు అవస్థలుపడ్డారు. ఈ క్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బ్యాంక్ వివరాలు తర్వాత సమర్పించేలా ఎన్టీఏ ప్రత్యామ్నాయ ఆప్షన్లు ఇచ్చింది. అయినప్పటికీ గురువారం కూడా కొందరు అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. షెడ్యూల్ ప్రకారమే నీట్ నీట్ యూజీ పునఃపరీక్ష వాయిదా పడిందని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై గురువారం ఎన్టీఏ స్పందించింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 21న పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. వదంతులు, సోషల్ మీడియా ప్రచారాలను అభ్యర్థులు నమ్మవద్దంటూ ‘ఎక్స్’లో ఎన్టీఏ పోస్ట్ చేసింది. తేలికపాటి దుస్తులు ధరించాలి ఈ నెల 21న నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరించడంతోపాటు ట్రాన్సపరెంట్ వాటర్ బాటిళ్లనే తెచ్చుకోవాలని ఎన్టీఏ సూచించింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు భద్రతా తనిఖీలు సజావుగా సాగాలంటే అభ్యర్థులు రిపోర్టింగ్ సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. » సాంకేతిక, ఇతర కారణాలతో నీట్ రాసే విద్యార్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తికాకపోయినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి » ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో హాల్ టికెట్లు తడిసిపోకుండా ఉండేందుకు పారదర్శక ప్లాస్టిక్ పౌచ్లకు అనుమతి. » విద్యార్థులు మతపరమైన నమ్మకాలకు సంబంధించిన వస్తువులు ధరించడానికి అనుమతి ఉంది. అయితే, పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి వీలుగా విద్యార్థులు ముందుగానే చేరుకోవాలి. » స్లిప్పర్స్, లో–హీల్స్ పాదరక్షలు ధరించాలి. హై–హీల్స్ ధరిస్తే తనిఖీలు ఎదుర్కోవాలి. వీటిపై నిషేధం » మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ డివైజ్లు, ఇయర్ ఫోన్లు వంటి ఇతరæ కమ్యూనికేషన్ పరికరాలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదు. » లోహపు వస్తువులు, పెద్ద బకిల్స్ ఉన్న బెల్టులు, భారీ ఆభరణాలు, ఇతర మెటల్ యాక్సెసరీస్ను అనుమతించరు. -
నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
కోయంబత్తూర్: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల పరీక్ష ‘నీట్’ చుట్టూ ముసురుకున్న వివాదాలు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్లో 19 ఏళ్ల నీట్ అభ్యర్థిని అనుకీర్తన బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవలి నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, ఆపై తిరిగి పరీక్ష రాయాల్సి వస్తుందనే తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వైఖరిపై దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసింది.ప్రశ్నపత్రం లీక్తో..పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. మృతురాలు అనుకీర్తన ఇప్పటికే రెండుసార్లు నీట్ పరీక్ష రాసింది. మెడిసిన్ సీటు సాధించాలనే పట్టుదలతో మూడో ప్రయత్నం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ దుమారం రేగడం, బాధితులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారనే వార్తలు రావడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ పరీక్షల గందరగోళం తన భవిష్యత్తును ఎటు తీసుకెళ్తుందోనన్న ఆందోళనతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు డెహ్రాడూన్లోనూ ఇటీవలే ఇద్దరు విద్యార్థులు ఇదేవిధంగా పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం.రగులుతున్న కోయంబత్తూర్..అనుకీర్తన మృతి వార్త తెలియగానే కోయంబత్తూర్లోని ఈఎస్ఐ (ఈఎస్ఐ) ఆస్పత్రి ప్రాంగణంలో సీపీఐ(ఎం) నాయకులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు అధికార పక్షం డీఎంకే తీవ్రంగా స్పందించింది. నీట్ పరీక్ష నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలనే సుదీర్ఘ డిమాండ్ను మరింత ఉధృతం చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.‘నీట్’ వర్సెస్ తమిళనాడుమొదటి నుంచి తమిళనాడు ప్రభుత్వం నీట్ పరీక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష కేవలం ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లగలిగే ఆర్థిక పటిష్టత ఉన్న విద్యార్థులకే లాభం చేకూరుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్లస్-టూ లో మంచి మార్కులు సాధించినప్పటికీ వైద్య విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు ఇచ్చేవారని, ఆ విధానమే పేదలకు న్యాయం చేసిందని పేర్కొంది. ఇది కూడా చదవండి: New York: భారతీయుడి ప్రాణాలు తీసిన గుర్రపు బగ్గీ -
నీట్ ‘రీ–ఎగ్జామ్’ విచారణ జూలైకి వాయిదా!
సాక్షి , న్యూఢిల్లీ: నీట్ యూజీ–2026 పరీక్షను రద్దు చేసి దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష (రీ–ఎగ్జామ్) నిర్వహించాలన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై నెలకు వాయిదా వేసింది. జూన్ 21న జరగాల్సిన రీ–ఎగ్జామ్ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్ను విచారణకు చేపట్టింది.అయితే, ఈ వ్యవహారంపై ధర్మా సనం ఎలాంటి లోతైన వ్యాఖ్యలు చేయకుండా, కేసును బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నీట్ వివాదానికి సంబంధించిన ఇతర కేసులను ఇప్పటికే విచారిస్తున్న జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాస నానికే ఈ పిటిషన్ను బదిలీచేస్తున్నట్లు సీజేఐ సారథ్యంలోని ధర్మా సనం వివరించింది. వేసవి సెలవుల అనంతరం జూలై 13 నుంచి సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో జస్టిస్ నరసింహ ధర్మాసనం అప్పుడు ఈ కేసును విచారించనుందని స్పష్టం చేసింది.ఏ తప్పూ చేయని విద్యార్థులను బలిచేస్తారా?ఈ కేసులో పిటిషనర్ తన వాదనలు విన్పించారు. మే 3న జరిగిన నీట్–2026 పరీక్షలో పేపర్ లీకేజీ, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఏకంగా 22 లక్షల మంది విద్యార్థుల కు మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న ఎన్టీఏ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆరోగ్య సేవల విభాగం మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగళా కోహ్లీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.కొందరు వ్యక్తులు, నిర్దిష్ట పరీక్షా కేంద్రాల్లో జరిగిన అవకతవకలకు ఏ తప్పూ చేయని లక్షలాది మంది విద్యార్థులను బలిచేయడం అన్యాయమని పిటిషనర్ వాదించారు. ‘‘పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలే కానీ, సంస్థాగత వైఫల్యాలకు విద్యార్థుల రాజ్యాంగ హక్కులను కాలరాయడం సరికాదు. మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(జీ), 21లకు విరుద్ధం, ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయం’’ అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తమ వాదనలు వినిపించారు.ఎన్టీఏ ప్రక్షాళనకు నిపుణుల కమిటీ వేయాలిజాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణలో సమూల ప్రక్షాళన, సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని పిటి షనర్ కోర్టును కోరారు. ‘ఎన్క్రిప్టెడ్ డిజిటల్ క్వశ్చన్ డెలివరీ’, బయోమెట్రిక్ అథెంటికేషన్, ఏఐ మాని టరింగ్ లాంటి పటిష్టమైన సాంకేతికతతో కూడిన కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఎన్టీఏలో ఉన్న లోపాలను అధ్యయనం చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. -
రీ-నీట్ రగడలో మరో రాజకీయ తుపాన్.. రాహుల్ పోరాట పిలుపు
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధించడంపై ఆయన అభ్యంతరాలు తెలిపారు. ‘టెలిగ్రామ్ బ్యాన్’ అనేది ప్రశ్నపత్రాల లీకేజీలను ఆపేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వ కొత్త ఎత్తుగడ. అంటే, దొంగను పట్టుకోవడానికి బదులు, బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడం. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా టెలిగ్రామ్లో చదువుతున్నారు. నోట్స్, పరీక్షల సిరీస్లు, చర్చలు, సన్నద్ధత టెలిగ్రామ్ ద్వారానే జరుగుతోంది. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎలా పరిష్కారం అవుతుంది?ఇది పూర్తి భద్రత ఇచ్చే మార్గం కాదు. దేశంలోని ప్రతి విద్యార్థికీ ఇది తెలుసు, ప్రశ్నపత్రాల లీకేజీ మాఫియాకూ తెలుసు. మరి తర్వాతి నిషేధం ఎవరిపై ఉంటుంది? వాట్సాప్పైనా? పరీక్ష రోజు విద్యార్థులను తనిఖీ చేస్తారు. జేబులను కత్తెరలతో కత్తిరిస్తారు. ప్రశ్నపత్రాలను వైమానిక దళం ద్వారా పంపిస్తారు. హడావుడికి మాత్రం కొదవ ఉండదు. కానీ సమస్య మూలాలపై ఒక్క చర్య కూడా ఉండదు. ఎందుకంటే ప్రశ్నపత్రాల లీకేజీ మాఫియా ఇదే ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతోంది. యువతను రక్తకన్నీరు పెట్టిస్తోంది. మోదీజీ ఈ హడావుడి ఆపండి. విద్యార్థులపై కాదు, మాఫియాపై దెబ్బ కొట్టండి. ‘విద్యార్థుల ప్రతిధ్వని’ వినండి. లేకపోతే దేశ యువతకు తమ హక్కులు ఎలా సాధించుకోవాలో తెలుసు’’ అని తెలిపారు.పోరాటాన్ని ప్రారంభించబోతున్నాం..నీట్ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఉమేశ్, రియా గురించి రాహుల్ గాంధీ మరో ట్వీట్లో స్పందించారు. ‘‘నేను కోటాకు బయలుదేరాను. కానీ, నా మనసులో రెండు పేర్లు మార్మోగుతున్నాయి.. ఉమేశ్, రియా. నిన్న, సీకర్లో ఉమేశ్, డెహ్రాడూన్లో రియా.. ఇద్దరూ రీ-నీట్ ఒత్తిడిని తట్టుకోలేక తమ జీవితాలను ముగించుకున్నారు. 22, 23 ఏళ్ల వాళ్లే.. కలల ఆకాశంలో ఎగరాల్సిన వారు.. ఈ అన్యాయ వ్యవస్థ ముందు ఓడిపోయారు.ఈ మరణాలు అవినీతితో నిండిన వ్యవస్థ ఫలితం. దీనికి బాధ్యులు మోదీ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థులను కాపాడాల్సిన చోట, ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, యువత భవిష్యత్తుతో వ్యాపారం చేసే వారికి పదేపదే అండగా నిలిచారని ఆరోపణలు ఉన్నాయి.ఈ రోజు కోటా నుంచి మేము ఒక పోరాటాన్ని ప్రారంభించబోతున్నాం. ఒక్కటే లక్ష్యం.. ఏ చిన్నారి కలలు ఇలా ఛిన్నాభిన్నం కాకూడదు, ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డను ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ప్రతి కుటుంబం అనుభవిస్తున్న ఈ వేదన ఇప్పుడు ‘విద్యార్థుల ప్రతిధ్వని’గా మారి దేశమంతా మార్మోగుతుంది’’ అని తెలిపారు. कोटा के लिए निकल चुका हूँ पर दिल में दो नाम गूंज रहे हैं: उमेश और रिया।कल, सीकर में उमेश और देहरादून में रिया - दोनों ने Re-NEET के दबाव में अपनी ज़िंदगी ख़त्म कर ली।22 और 23 साल के बच्चे - जिन्हें सपनों के खुले आसमान में उड़ना था वो इस अन्यायी व्यवस्था से हार गए।ये मौतें…— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2026 -
మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!
NEET UG Re-Exam 2026 ప్రతిష్టాత్మక నీట్ యూజీ రీ ఎగ్జామ్కు సంబంధించి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె 23 ఏళ్ల రియా కుమారి థాపా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇంటర్లో 97 శాతం, విషాదంజూన్ 21న జరగబోయే నీట్ పునఃపరీక్ష (re-examination) కోసం రియా సిద్ధపడుతోంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం రాసే NEET-UG పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయితే ఈ సారి ఫలితం ఎలా ఉంటుందో అనే ఒత్తిడి మధ్య ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో హిందీలో "ఐ లవ్ యూ, మమ్మీ, పాపా. ఇందులో ఎవరి తప్పూ లేదు" అని పేర్కొనడంతో తల్లిదండ్రుల శోకాన్ని ఆపడం ఎవరి తరమూ కావడంలేదు. రియా గతంలో 12వ తరగతిలో 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్గా నిలవడం గమనార్హం. ఇదీ చదవండి: షాకింగ్ : ఐఏఎఫ్ ఆఫీసర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..! రాత్రంతా చదువుకుని ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం రియాకు అలవాటు. మంగళవారం మధ్యాహ్నం భోజనానికి పిలవడానికి తల్లి ఆమె గది తలుపు తట్టింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో, తండ్రి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా రియా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అయితే, చదువుల్లో ఆశించిన విజయం సాధించలేకపోతున్నాననే తీవ్ర నిరాశ, తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడమే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రాథమిక కారణాలని సీనియర్ పోలీస్ అధికారి అంకిత్ కండారీ తెలిపారు.ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్నోట్ : చదువుల ఒత్తిడి, పరీక్షల భయం వల్ల ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు నిపుణుల లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం ఎంతో అవసరం. ఇదీ చదవండి: ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి -
నీట్ రీటెస్ట్పై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
చెన్నై: జూన్ 21న జరగబోయే ‘నీట్’ రీ టెస్ట్ కోసం కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన అసాధారణ భద్రతా చర్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఐఏఎఫ్ ఎయిర్లిఫ్ట్, సీఆర్పీఎఫ్ ఎస్కార్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా వంటి కఠిన నిబంధనలపై మాజీ బీజేపీ నేత కె అన్నామలై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ నేత వినోజ్ పి సెల్వం తిప్పికొట్టారు. ఈ భేదాభిప్రాయాలు చర్చనీయాంశంగా మారాయి.మిలిటరీ స్థాయి భద్రత.. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడినీట్ రీటెస్ట్ కోసం కేంద్రం ప్రకటించిన నిబంధనలు మిలిటరీ తరహాలో ఉన్నాయని అన్నామలై విమర్శించారు. ఎయిర్ఫోర్స్ విమానాల ద్వారా ప్రశ్నపత్రాల రవాణా, ఏఐ నిఘా, 4 లేయర్ల సీసీటీవీలు, పీఎంవో ప్రత్యక్ష పర్యవేక్షణ వంటి చర్యలు రక్షణ సాఫ్ట్వేర్ కొనుగోలును తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీలను అరికట్టే ప్రయత్నాలను స్వాగతిస్తున్నప్పటికీ, గంటల తరబడి తనిఖీలు చేయడం, పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జాతీయ విద్యా విధానం ఆశయాలకు విరుద్ధమని అన్నారు.చైనా పరీక్షతో పోలిక: బీజేపీ నేత స్ట్రాంగ్ కౌంటర్అన్నామలై విమర్శలపై తమిళనాడు బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ప్రతి ఏటా చైనాలో 1.3 కోట్ల మంది విద్యార్థులు రాసే ‘గావోకావో’ ప్రవేశ పరీక్షను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ మధ్య చైనా ఈ పరీక్షను నిర్వహిస్తుందని, దాన్ని ఎవరూ 'మిలిటరైజేషన్' అనరని, కేవలం ప్రతిభను రక్షించే చర్యగా భావిస్తారని కౌంటర్ ఇచ్చారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీ నిఘా అనేవి ఇంత పెద్ద పరీక్షకు సాధారణ రక్షణ చర్యలని ఆయన పేర్కొన్నారు.వ్యవస్థపై నమ్మకం ముఖ్యంభారతదేశం ప్రపంచ అగ్రరాజ్యాలతో పోటీపడుతూ దూసుకుపోతున్న తరుణంలో, పరీక్షల్లో విశ్వసనీయత, పారదర్శకత అత్యంత కీలకమని సెల్వం పేర్కొన్నారు. నిబంధనలను కఠినతరం చేసిన ప్రతిసారీ రాజకీయ భయాందోళనలు సృష్టించడం సరికాదన్నారు. మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో రద్దు కాగా, లక్షలాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జూన్ 21న ఈ రీటెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సమస్యలు వంటివి కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయని అన్నామలై హెచ్చరించారు. -
యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం
లక్నో: నీట్ రీఎగ్జామ్పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న నీట్ రాసే విద్యార్థులకు బస్సు టికెట్లలో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు అడ్మిట్ కార్డు చూపించి ఈ సేవలు పొందవచ్చని తెలిపింది. విద్యార్థులు మరోసారి నీట్ ఎగ్జామ్ రాస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.జూన్ 21న నీట్ రీఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు (బుధవారం) అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. నీట్ పునఃపరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) బస్సు ఛార్జీలలో 50 శాతం రాయితీని యోగి ప్రకటించారు. ఎన్టీఏ ఇచ్చిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సదుపాయాలతో పాటు పరీక్ష కేంద్రాలకు సరైన సమాయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను నిశితంగా పర్యవేక్షించాలని, పరీక్షకు సంబంధించిన వదంతులు, తప్పుడు సమాచారం లేదా తప్పుదారి పట్టించే కంటెంట్పై తక్షణ చర్యలు తీసుకోవాలి. నీట్ పునఃపరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు, పోలీసు అధికారులు, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్లో దాదాపుగా దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయం నేపథ్యంలో వారందరికీ మేలు చేకూరనుంది.టెలిగ్రామ్ బ్యాన్ కాగా నీట్ పరీక్ష కోసం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేదం విధించింది. జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ నిషేదించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నీట్ రీటెస్ట్కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్లెట్లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది.పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో పరీక్షలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కీలక చర్యలు తీసుకుంటుంది. కాగా ఇటీవల ప్రశ్నాపత్రాల తరలింపుకు విమానాలను వాడింది. ఒక పరీక్ష పత్రాలకోసం విమాన సేవలను వినియోగించుకోవడం దేశంలోనే ఇది తొలిసారి. -
టెలిగ్రామ్ బ్యాన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
నీట్ రీ-ఎగ్జామ్కు ముందు కేంద్రం విధించిన టెలిగ్రామ్పై టెంపరరీ బ్యాన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించగా.. కోర్టు అందుకు అంగీకరించింది. దీంతో న్యాయస్థానంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.నీట్ యూజీ 2026 రీ-టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ, టెలిగ్రామ్ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ తేజస్ కారియా విచారించేందుకు అంగీకరించారు. ఇవాళే ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.#BREAKING Telegram moves Delhi High Court against Centre's ban on the platform https://t.co/9ncovLLlaY— Live Law (@LiveLawIndia) June 17, 2026కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. NEET రీ-ఎగ్జామ్ (జూన్ 21) దాకా కొన్ని రోజులు పాటు టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధించబడింది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పేపర్ లీక్ రాకెట్లు, ఫేక్ మెసేజ్లు, మోసపూరిత ఛానల్స్ను అడ్డుకోవడమే ఈ చర్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమాచార సాంకేతిక చట్టం(IT Act) సెక్షన్ 69A కింద ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఎన్టీఏ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. అయితే ఇది లక్షలాది సాధారణ వినియోగదారులను ప్రభావితం చేస్తోందని టెలిగ్రామ్ తన పిటిషన్లో పేర్కొంది.టెలిగ్రామ్ను అడ్డుకున్నంత మాత్రాన మిగతా యాప్లతో పేపర్ లీక్లు జరగడం లేదా? అని పిటిషన్లో కేంద్రానికి టెలిగ్రామ్ సూటి ప్రశ్న వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదానికి కారణమైన ప్రధాన అంశం నీట్ పరీక్షల చుట్టూ పెరిగిన ఫేక్ పేపర్ లీక్ నెట్వర్క్. “PAPER LEAKED NEET”, “Re-NEET 2026” వంటి పేర్లతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్స్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నాయని ఎన్టీఏ గుర్తించింది. కొందరు ఛానల్స్ కొన్ని వేల నుండి లక్షల రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిట్ ఫీచర్ను కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. పరీక్ష తర్వాత ఫేక్ పేపర్ లీక్ సాక్ష్యాలు సృష్టించడానికి ఈ ఫీచర్ను దుర్వినియోగం చేస్తున్నారని ఎన్టీఏ ఆరోపించింది. అయితే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ తీవ్రంగా స్పందించారు. భారత్లో 15 కోట్లకు పైగా వినియోగదారులను ప్రభావితం చేసే ఈ చర్య తప్పుడు నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఇటు డిజిటల్ హక్కుల సంస్థలు కూడా దీనిని “ఓవర్ బ్రాడ్ రెస్పాన్స్”గా అభివర్ణించాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ చర్యను తాత్కాలిక భద్రతా చర్యగా పేర్కొంటోంది. పరీక్ష సజావుగా, మోసాలు లేకుండా నిర్వహించడమే లక్ష్యమని ఇటు ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కడం గమనార్హం. -
టెలిగ్రామ్ బ్యాన్తో లీకులు ఆగుతాయా?
నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్పై భారత ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నిర్ణయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తీవ్రంగా తప్పుబట్టారు. "లీకులు ఆగలేదు.. కేవలం వేరే యాప్లకు మారిపోయాయి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. అసలు పేపర్ లీక్లకు టెలిగ్రామ్ కారణమా? అంటే.. లీకుల బెడద ఇంకా మిగిలే ఉందా?? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.భారత్లో 15 కోట్లకుపైగా టెలిగ్రామ్ వినియోగదారులు ఉన్నారని, కొందరు దుర్వినియోగం చేశారనే కారణంతో మొత్తం ప్లాట్ఫామ్ను బ్లాక్ చేయడం సామాన్య వినియోగదారులకు శిక్ష విధించినట్టేనని దురోవ్ వ్యాఖ్యానించారు. పరీక్షా పత్రాల లీక్లు, మోసాలు టెలిగ్రామ్తో ఆగిపోవని, అవి ఇతర యాప్లకు మారిపోతాయని పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో లీక్లు, స్కామ్లకు సంబంధించిన వందలాది ఛానెళ్లను తొలగించామని కూడా చెప్పారు.నీట్ రీ-ఎగ్జామ్కు ముందు "PAPER LEAKED NEET", "RE-NEET 2026", "PRIVATE MAFIA" వంటి పేర్లతో నడుస్తున్న టెలిగ్రామ్ ఛానెళ్లు విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఎన్టీఏ గుర్తించింది. ప్రశ్నాపత్రాలు ఉన్నాయని చెప్పి వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ముఠాలు టెలిగ్రామ్ను విస్తృతంగా వినియోగిస్తున్నాయని ఆరోపించింది.అలాగే టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ కూడా అధికారుల ఆందోళనకు కారణమైంది. పరీక్షకు ముందు సాధారణ పోస్టులు పెట్టి, పరీక్ష తర్వాత వాటిని ఎడిట్ చేసి అసలు ప్రశ్నాపత్రాలను జతచేసి "ముందే లీక్ చేశాం" అంటూ స్క్రీన్షాట్లు వైరల్ చేస్తున్నారని ఎన్టీఏ పేర్కొంది. అందుకే జూన్ 30 వరకు ఆ ఫీచర్పై కూడా పరిమితులు విధించినట్లు సమాచారం.వేరే యాప్లకు మారతాయా?సాంకేతికంగా చూస్తే అవును అనే నిపుణులు అంటున్నారు. ఒకసారి ప్రశ్నాపత్రం లేదా సున్నిత సమాచారం బయటకు వస్తే అది టెలిగ్రామ్, వాట్సాప్, సిగ్నల్, డిస్కార్డ్, ఇ-మెయిల్, క్లౌడ్ డ్రైవ్లు లేదంటే ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా క్షణాల్లో వ్యాపించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దురోవ్(pavel durov) కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.అయితే టెలిగ్రామ్లో లక్షల మంది సభ్యులతో పబ్లిక్ గ్రూపులు, భారీ ఫైల్ షేరింగ్, సెర్చ్ ద్వారా ఎవరైనా సులభంగా ఛానెళ్లను కనుగొనే సౌకర్యం ఉండటంతో మోసగాళ్లకు అది మరింత అనుకూలంగా మారిందని అధికారులు చెబుతున్నారు.టెలిగ్రామ్ను ఆపడం సాధ్యమేనా?సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టెలిగ్రామ్ను పూర్తిగా అడ్డుకోవడం అంత సులభం కాదు. వీపీఎన్లు, ప్రాక్సీ సర్వర్లు, ప్రత్యేక ఎన్క్రిప్షన్ టెక్నాలజీల కారణంగా వినియోగదారులు పలు మార్గాల్లో యాప్ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ చర్య ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన తర్వాత అది ఏ యాప్లో షేర్ అయ్యిందన్నది తర్వాతి విషయం. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రశ్నాపత్రం పరీక్షా వ్యవస్థ నుంచి బయటకు ఎలా వచ్చింది? అనేది. ప్రింటింగ్, రవాణా, భద్రతా వ్యవస్థలు, అంతర్గత ఉద్యోగుల పాత్ర, పరీక్ష నిర్వహణలో లోపాలు వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకోవడం పూర్తి పరిష్కారం కాదని వారు చెబుతున్నారు.జూన్ 22 తర్వాత..ప్రభుత్వం ఈ చర్యను శాశ్వత నిషేధంగా కాకుండా తాత్కాలిక అత్యవసర చర్యగా పేర్కొంది. జూన్ 21న రీ-ఎగ్జామ్ పూర్తయ్యాక, జూన్ 22 నుంచి టెలిగ్రామ్ సేవలను పునరుద్ధరించే అవకాశముందని సమాచారం. అయితే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్పై ఉన్న పరిమితులు మరికొన్ని రోజులు కొనసాగవచ్చని చెబుతున్నారు. అయితే.. అయితే.. ఇదే అంశంపై డిజిటల్ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు పరీక్షల సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేతలు కనిపించేవి. కానీ దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్ట ప్లాట్ఫామ్పై నిషేధం విధించడం కొత్త పరిణామమని చెబుతున్నారు. భవిష్యత్లో ఇతర సందర్భాల్లోనూ ఇలాంటి చర్యలకు ఇది నిదర్శనంగా మారుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.మరోవైపు, టెలిగ్రామ్పై వేటు వేయడం వల్ల కొంతకాలం మోసపూరిత ప్రచారానికి బ్రేక్ పడొచ్చు. కానీ దాంతో పేపర్ లీక్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అసలు ప్రశ్న టెలిగ్రామ్లో ఏమి షేర్ అయ్యిందన్నది కాదు... ప్రశ్నాపత్రం మొదట పరీక్షా వ్యవస్థ నుంచి బయటకు ఎలా వచ్చింది? అన్నదే. ఆ లీకేజీ మూలాలను గుర్తించి మూసేయకపోతే, వేదికలు మారినా సమస్య మాత్రం అలాగే కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నీట్ వివాదంలోనూ ఇదే కేంద్ర ప్రశ్నగా మారింది. -
మేం ఎన్నికల్లో పోటీ చేయం
నాగ్పూర్: ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో మంగళవారం నాగ్పూర్లో తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన దీప్కే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడతారా అని ప్రశ్నించగా, ‘మేం ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి. నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం ఎన్నికల్లో పోటీకి దిగడం సబబా?’అని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థులను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా బలవన్మరణాలకు పాల్పడిన ఐదారుగురు విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని దీప్కే డిమాండ్ చేశారు. ‘మోదీజీ ప్రపంచంలోనే ఏం జరిగినా ట్వీట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మాత్రం పట్టించుకోరు. కనీసం సంతాప సందేశం కూడా ట్వీట్ చేయరు. మన్కీ బాత్, పరీక్షా పే చర్చ ఇంకా ఎన్ని రోజులు..? కనీసం విద్యార్థుల మన్కీబాత్ వినిపించుకోండి’అంటూ దీప్కే తీవ్రంగా స్పందించారు. సోమవారం జైపూర్లో నిరసన సందర్భంగా తనపై జరిగిన దాడిపై దీప్కే స్పందిస్తూ.. ‘ఈ ఘటన వెనుక ఆర్ఎస్ఎస్ నేతల హస్తముందని’ దిప్కే పేర్కొన్నారు. -
నీట్ రీ ఎగ్జామ్ ఎఫెక్ట్.. ! టెలిగ్రామ్ యాప్ నిషేధం..
-
నీట్ ఎగ్జామ్.. భారత్లో టెలిగ్రామ్పై బ్యాన్!
ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న నీట్ రీఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేదం విధించింది. జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ నిషేదించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ పరీక్ష కోసం ఇదివరకే నీట్ కీలక వెసులుబాట్లు కల్పించింది. నీట్ రీటెస్ట్కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్లెట్లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది. పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రశ్నాపత్రాల తరలింపుకు విమానాలను వాడింది. ఒక పరీక్ష పత్రాలకోసం విమాన సేవలను వినియోగించుకోవడం దేశంలోనే ఇది తొలిసారి.ఎగ్జామ్ రద్దునీట్ ఎగ్జామ్ మే 3న జరగాల్సి ఉండగా, అంతకంటే ముందే పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.ఈ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో, మే 12న ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.పేపర్ లీక్ బయటపడిందిలారాజస్తాన్లోని జామ్వా రామ్గఢ్కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ పేపర్ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్లో నీట్కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్గఢ్ నుంచే పేపర్ సికార్లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్కు చేరింది.అతడు ఈ పేపర్ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యార్థికి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్లో హాస్టల్ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్ కుమార్ ఈ పేపర్ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
నీట్ పోర్టల్లో మరో కలకలం
న్యూఢిల్లీ: నీట్ (NEET-UG) పరీక్ష నిర్వహణలో ఇప్పటికే ప్రశ్నపత్రం లీకేజీ వివాదంతో విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో మరోసారి కలకలం రేగింది. నీట్ అధికారిక పోర్టల్లోకి అక్రమంగా చొరబడిన 19 ఏళ్ల యువకుడు నవీన్ యాదవ్ 150 మంది అభ్యర్థులకు చెల్లించాల్సిన రీఫండ్ మొత్తాలను తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడు. అహ్మదాబాద్ పోలీసులు నిందితుణ్ని బిహార్లో అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రీ-ఎగ్జామ్ కోసం అభ్యర్థుల నుంచి అదనపు ఫీజు వసూలు చేయకుండా, ఇప్పటికే చెల్లించిన ఫీజులో భాగంగా రీఫండ్ అందించేందుకు ఎన్టీఏ ప్రత్యేక రీఫండ్ మాడ్యూల్ను ప్రారంభించింది.ఈ ప్రక్రియలో అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇదే ప్రక్రియను లక్ష్యంగా చేసుకున్న నవీన్ యాదవ్, పోర్టల్లోని భద్రతా లోపాలు,బలహీనమైన పాస్వర్డ్లను ఉపయోగించి విద్యార్థుల ఖాతాల్లోకి చొరబడ్డాడని పోలీసులు వెల్లడించారు.పోలీసుల దర్యాప్తులో బిహార్ గయా జిల్లాకు చెందిన నవీన్ యాదవ్ సుమారు 350 మంది అభ్యర్థుల ఖాతాలను లక్ష్యంగా చేసుకుని, వారిలో 150 మందికిపైగా ఖాతాల్లోకి విజయవంతంగా ప్రవేశించాడు. ఇందుకోసం బ్రూట్ ఫోర్స్ అటాక్ పద్ధతిని ఉపయోగించాడు. అంటే పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్ను ఊహిస్తూ అన్ని సాధ్యమైన కాంబినేషన్లను వరుసగా ప్రయత్నించడం. అలా పాస్వర్డ్లను గుర్తించిన అనంతరం నిందితుడు విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాల స్థానంలో తన ఖాతా వివరాలను నమోదు చేశాడు. దీంతో ఒక్కో అభ్యర్థికి చెల్లించాల్సిన రూ.1,700 రీఫండ్ మొత్తం అతని ఖాతాలో జమైంది.ఎన్టీఏ పోర్టల్లో నగదు లావాదేవీల్లో అవకతవకలు జరగడంతో అధికారులు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రీఫండ్ లావాదేవీల్లో అసాధారణ మార్పులు గుర్తించారు. అనంతరం ఎన్టీఏ నుంచి బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించి డబ్బు బదిలీలను ట్రాక్ చేసి నిందితుడిని బీహార్లో అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) శరద్ సింఘల్ మాట్లాడుతూ.. పోర్టల్లోని భద్రతా లోపాలను నిందితుడు సద్వినియోగం చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం అతను ఇతర సైబర్ నేరాల్లో కూడా పాల్గొన్నాడా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు.నీట్ అభ్యర్థులకు చుక్కలు ఇదిలా ఉండగా, జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్కు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ ఆన్లైన్లో విడుదల చేసింది. అయితే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ లింక్ సరిగా పనిచేయకపోవడంతో దేశవ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, అడ్మిట్ కార్డుల విడుదల ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం ఉదయం నాటికి కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే వాటిని డౌన్లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. సాంకేతిక సమస్యలు, సర్వర్పై అధిక భారం కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొంది.ఈ సమస్యల పరిష్కారానికి తమ సాంకేతిక బృందం నిరంతరం పనిచేస్తోందని, అతి త్వరలో అన్ని అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఏ తన అధికారిక ఎక్స్ ద్వారా వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది -
నీట్ రీ ఎగ్జామ్కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్
ముజఫర్పూర్: నీట్ యూజీ రీ ఎగ్జామ్కు కౌంట్డౌన్ ప్రారంభమైన వేళ బీహార్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష వివాదం సర్దుమణగక ముందే, అభ్యర్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు గుంజాలని చూసిన నలుగురు నిందితులను ముజఫర్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మాకు డబ్బులు అందాయి, నీట్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ పంపుతున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను బురిడీ కొట్టించిన ఈ గ్యాంగ్ నెట్వర్క్ను పోలీసులు చేధించారు.సోషల్ మీడియా వేదికగా ఫేక్ పేపర్ల దందాబీహార్లోని ముజఫర్పూర్లో పట్టుబడిన ఈ ముఠా.. ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా నీట్ అభ్యర్థులను ట్రాప్ చేసినట్లు ఎస్ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా వెల్లడించారు. వివిధ పోటీ పరీక్షల నకిలీ ప్రశ్నపత్రాలను చూపిస్తూ, అవే అసలైన పేపర్లు అని నమ్మించి నిందితులు ఆన్లైన్ ద్వారా భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయించుకుని ఆపై చేతులెత్తేయడం ఈ ముఠా ప్రధాన వ్యూహం.మనీష్ ఇచ్చిన సమాచారంతో గ్యాంగ్ అరెస్ట్ఈ నెల జూన్ 2వ తేదీన సికింద్పూర్ పోలీసులు మనీష్ అనే వ్యక్తిని నకిలీ పేపర్లు విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, ఈ నీట్ ఫేక్ పేపర్ల స్కామ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటపడ్డాయి. మనీష్ ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ముజఫర్పూర్ పోలీసులు.. హర్ష్, అమన్ కుమార్, కన్హయ్య కుమార్, హర్ష్ కనేడియా అనే మరో నలుగురు నిందితులను వేటాడి పట్టుకున్నారు.జూన్ 21న కట్టుదిట్టంగా నీట్ రీ-ఎగ్జామ్మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా రద్దయిన ఈ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), విద్యా మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్ష పారదర్శకత కోసం అధికారులు ‘పరీక్ష కర్మయోగి’ అనే ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. -
కాక్రోచ్ పార్టీ ధర్నాలో ప్రకాష్ రాజ్ సంచలన ఎంట్రీ
బెంగళూరు: నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా రగులుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు న్యాయం జరగాలంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ఆందోళనకు ప్రముఖ బహుభాషా నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ మద్దతు తెలపడమే కాకుండా స్వయంగా హాజరుకావడం సంచలనంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.‘ఎక్స్’ వేదికగా ప్రకాష్ రాజ్ పిలుపుగతంలో ఢిల్లీలో జరిగిన నిరసనకు కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన నటుడు ప్రకాష్ రాజ్, ఈసారి బెంగళూరు ధర్నాలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వం తన వైఫల్యాలకు బాధ్యత వహించేలా మనమంతా గొంతు ఎత్తాలని, ఈ శాంతియుత నిరసనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ విధానాలను నిరంతరం విమర్శించే ప్రకాష్ రాజ్ ఈ ఉద్యమంలో చేరడంతో జెన్ జెడ్ నేతృత్వంలోని ఈ విద్యార్థి ఉద్యమానికి మరింత బలం చేకూరినట్లయింది.దేశవ్యాప్తంగా ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలుగత వారం రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోని పలు నగరాల్లో వరుస ఆందోళనలతో హోరెత్తిస్తోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శనతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఆ తర్వాత పుణె, లక్నో, అమృత్సర్ నగరాలకు పాకింది. ఆదివారం ఉదయం హైదరాబాద్లో జరిగే నిరసనలో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కూడా ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థ కుప్పకూలిందని, కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుతోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జూన్ 20న 'ఢిల్లీ చలో'.. ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపబోమని, జూన్ 20న దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు అక్కడే తిష్ట వేస్తామని సీజేపీ ప్రతినిధి దిప్కే స్పష్టం చేశారు. పుణె నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీకి దేశంలోని ఒక కోటి మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా, లేక ఒక అసమర్థ మంత్రి ముఖ్యమా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కాక్రోచ్ ముసుగులు ధరించి, చేతుల్లో పూలు పట్టుకుని వినూత్న రీతిలో చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. ప్రొఫెసర్ నాగేశ్వర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత కొన్ని నెలలుగా పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం నడుస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యత వహించి రాజీనామా చేయమని కోరితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయట్లేదన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గతంలో రైల్ యాక్సిడెంట్ అయితే రైల్వేశాఖ మంత్రైన లాల్ బహుదూర్ శాస్త్రి రాజీనామా చేశారని మరి అలాంటప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారం నడుస్తున్నప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుంది. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ స్పోక్ పర్సన్ విజేత దాయ్ అతిథిగా హాజరయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్లో ఆందోళనకు పిలుపునిచ్చింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఇటీవలే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ మాస్కులు ధరించి, చేతుల్లో పుస్తకాలు, జాతీయ జెండాలతో యువత భారీ ఎత్తున నిరసన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పుణేలోని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ క్యాంపస్లో వేలాది మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మద్దతుతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది. -
నీట్ పరీక్షా సమయం పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరిగే నీట్ రీటెస్ట్కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలకమైన వెసులుబాట్లు కల్పీంచింది. పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్లెట్లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది. పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇన్విజిలేషన్ ప్రక్రియలో భాగంగా హాజరు పట్టికలో సంతకాలు తీసుకోవడం లాంటివాటితో విద్యార్థులు పరీక్ష సమయాన్ని కోల్పోకుండా ఉండేందుకే అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తున్నట్లు ఎన్టీఏ వివరించింది. సమయం పెంపుతో పాటే రఫ్ వర్క్ కోసం ఇచ్చే పేజీల సంఖ్యను సైతం ఎన్టీఏ రెట్టింపు చేసింది. గతంలో ప్రశ్నాపత్రం బుక్లెట్ చివరన కేవలం రెండు పేజీలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు వాటి సంఖ్యను నాలుగుకు పెంచారు. భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం విభాగాల్లో గణాంకాలు, రేఖాచిత్రాల కోసం అభ్యర్థులకు మరింత స్థలం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఎడమ చేతివాటం ఉన్న అభ్యర్థులకు బుక్లెట్ చివరన ఉన్న పేజీల్లో రఫ్ వర్క్ చేసుకోవడం ఇబ్బందిగా మారుతోందన్న ఫీడ్బ్యాక్ ఆధారంగా బుక్లెట్ లేఅవుట్ను మార్చారు. ఇన్స్ట్రక్షన్స్ పేజీ తర్వాత ముందు భాగంలో రెండు పేజీలు, బుక్లెట్ చివరన మరో రెండు పేజీలను రఫ్ వర్క్ కోసం కేటాయించారు. ఈ కొత్త ఫార్మాట్ ఇంగ్లిష్, ఇతర అన్ని ప్రాంతీయ భాషల ప్రశ్నపత్రాలకు వర్తిస్తుంది. నీట్ రాసేవారిలో 10 శాతం మంది ఎడమచేతి వాటం వారు ఉన్నారని ఎన్టీఏ తెలిపింది. పరీక్షా విధానంలో తీసుకువచ్చిన ఈ చిన్న మార్పులు విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపుతాయని ఎన్టీఏ పేర్కొంది. పారదర్శకత, భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే పరీక్షను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుల్లో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదువుకుని పరీక్షా కేంద్ర సిబ్బందికి సహకరించాలని కోరింది. -
నీట్ రీటెస్ట్ :‘లాక్డౌన్’లో ప్రశ్నపత్రాల రూపకర్తలు
న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ రీటెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో, ఈసారి ఎలాంటి లీకులకు తావులేకుండా ఉండేందుకు పరీక్షల నిర్వహణ యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా ఒక అసాధారణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. జూన్ 21న జరగబోయే ఈ రీటెస్ట్ పూర్తి పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు సర్వసన్నద్ధమయ్యారు.రహస్య ప్రాంతాల్లో కఠిన నిర్బంధంనీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రాలను రూపొందించే ఎగ్జామినర్లతో పాటు, వాటిని వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ట్రాన్స్లేటర్లను కేంద్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన ‘లాక్డౌన్’ తరహా నిర్బంధంలో ఉంచింది. వీరందరినీ ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు తరలించారు. జూన్ 21న పరీక్ష ముగిసేంత వరకు వీరు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి వీల్లేదు. బయటి వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు.గ్యాడ్జెట్లపై నిషేధం.. డేగ కన్నుఈ భద్రతా కేంద్రాల్లో ఉన్నవారెవరూ మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, స్మార్ట్వాచ్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఉపయోగించడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నెట్ సదుపాయాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ వాడాల్సి వచ్చినా, అది పూర్తి నిఘా నీడలోనే సాగుతుంది. ప్రత్యేక అనుమతులు ఉన్న సిబ్బందిని మాత్రమే ఈ రహస్య ప్రాంతాల్లోకి అనుమతిస్తున్నారు.రంగంలోకి భారత వాయుసేనప్రశ్నపత్రాల రూపకల్పనలోనే కాకుండా, వాటి రవాణా విషయంలోనూ ప్రభుత్వం అత్యంత కఠినమైన భద్రతా చర్యలను చేపడుతోంది. ఎలాంటి లీకేజీలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఈసారి భారత వాయుసేన యుద్ధ విమానాల ద్వారా ప్రశ్నపత్రాలను వివిధ రాష్ట్రాలకు సురక్షితంగా తరలించి, పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ భద్రతా వ్యూహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
నీట్ పరీక్ష భద్రత కోసం ఎన్టీఏ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల జూన్ 21న జరగనున్న నీట్ యూజీ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఏటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తరలించేందుకు భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించుతోంది. ఈ వివరాలను NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. దీంతో ఒక పరీక్ష కోసం విమానాల్ని వాడిన ఎగ్జామ్గా నీట్ రికార్డు సృష్టించనుంది.నీట్పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె. రామకృష్ణారావు నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో అభిషేక్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షల పారదర్శకతను, భద్రతను కాపాడటానికి ఈసారి మునుపెన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్స్ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అభిషేక్ సింగ్ మాట్లాడుతూ "పరీక్షా ప్రక్రియ సమగ్రతను, భద్రతను కాపాడటానికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రశ్నపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళాన్ని ఉపయోగిస్తున్నాము" అని అన్నారు.కాగా వైమానిక దళ అంశంపై ఇటీవలే మాట్లాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ జూన్ నెలలో ఉండే వాతావరణ పరిస్థితులు, రవాణా ఇబ్బందులు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రశ్నపత్రాలను సురక్షితంగా, సకాలంలో చేరవేసేందుకు వైమానిక దళ సహాయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే కేవలం ప్రశ్నాపత్రాల కోసం మాత్రమే వైమానిక దళం సహాయం తీసుకుంటామని భద్రత కోసం మరే సాయం తీసుకోమని స్పష్టం చేశారు.గత మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల రద్దు చేస్తున్నట్లు మే 12న ఎన్టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 21న దేశవ్యాప్తంగా తిరిగి పరీక్ష నిర్వహించనున్నారు. -
50 శాతం మార్జిన్తో ‘బొద్దింక’ వ్యాపారం!
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా శనివారం జరిగిన సీజేపీ నిరసనల్లో ఒక ఆసక్తిక ఘట్టం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వ్యంగ్యాత్మక ఉద్యమం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) తన మొట్టమొదటి ఆఫ్లైన్ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ‘నీట్’ పరీక్షల ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అభిజీత్ దిప్కే నేతృత్వంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శన ఒక వ్యాపార కేంద్రంగానూ కనిపించింది. ఈ ఉద్యమానికి సంబంధించిన లోగోలు, గుర్తులను క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులు నిరసన స్థలంలోనే దుకాణాలు తెరిచారు. బొద్దింకల థీమ్తో డిజైన్ చేసిన మాస్కులు, జెండాలు, టీ-షర్టులను విక్రయిస్తూ సందడి చేశారు.లాభాల మార్జిన్పై నెటిజన్ల ట్రోల్స్ఈ విక్రయాలకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఒక రిపోర్టర్ మాస్కులు అమ్ముతున్న వ్యక్తిని ‘ఈ మాస్కు ప్రింటింగ్ ఖరీదు ఎంత?’ అని అడగగా, అతడు ‘15 రూపాయలు’ అని సమాధానమిచ్చాడు. ‘మరి దీన్ని ఉచితంగా పంచుతున్నారా?’ అని ప్రశ్నిస్తే.. ‘లేదు, 30 రూపాయలకు అమ్ముతున్నా’ అంటూ బదులిచ్చాడు. రూ.250 రూపాయలకు టీ-షర్టులు విక్రయించారు. మొత్తంగా చూస్తే 50 శాతం లాభంతో ఈ వ్యాపారం సాగింది.ఇది కూడా చదవండి: అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత? -
కాక్రోచ్ పార్టీ నినాదాలతో దద్దరిల్లిన జంతర్ మంతర్
-
సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన?
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అనుమతి తరువాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ధర్నా విజయవంతంగా కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో ఆవిర్భవించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దిప్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యా విధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు సీజేపీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థుల పేర్లను అభిజీత్ దిప్కే చదివి వినిపించారు. సామాజికకార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.ఈ నిరసనలో వినిపించిన డిమాండ్ మరిత విశేషంగా నిలిచింది. సోనమ్ తమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరారు, అయితే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని న స్పష్టం చేశారు. యువత బాధ్యత తీసుకోవాలని అభిలషించారు. రాజకీయ నాయకులు మరియు ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోనమ్ వాంగ్చుక్ కోరారు. తనకు నిరసనలు చేయడం ఇష్టం ఉందనీ, కానీ న్యాయం కోసం ఇలాంటి తప్పవని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు రావాలని కూడా ఆయన పేర్కొన్నారు. Sonam Wangchuk arrives at Jantar Mantar to join the protest.There are more press reporters then cockroachs 🪳#cjp_पार्टी pic.twitter.com/nbYShqORbD— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) June 6, 2026కాగా ఈ నిరసనకు నాయకత్వం వహించేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం ఉదయం అమెరికా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని విమానాశ్రయం నుండి బయటకు రావడం ఆయన అభిమానులను మరింత ఉత్సాహపర్చింది. -
ఆకాంక్షది మోదీ మార్కు వ్యవస్థీకృత హత్య
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అభ్యర్థిని బలవన్మరణంపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేపదే జరుగుతున్న ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతాలతో విద్యార్థుల భవిష్యత్ కలలు చెదిరిపోతున్నాయని రాహుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు లీకేజీలు, నీట్ పరీక్ష నిర్వహణలో అసమర్థ వార్తలతో తీవ్రంగా కలతచెంది మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష చతుర్వేది అనే అభ్యరి్థని నాగ్పుర్లో బలవన్మరణానికి పాల్పడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య ఘటనపై రాహుల్ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఆకాంక్ష వైద్యవిద్య పూర్తిచేసి డాక్టర్గా రాణించి, సమాజానికి సేవ చేయాలని ఎంతో ఆశపడింది. ఆమె తండ్రి ఓ సాధారణ రైతు. కుమార్తె కలను నిజం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3,00,000 అప్పు తీసుకున్నారు. నాగ్పుర్లో ఆమె కోచింగ్ క్లాస్లకు వెళ్లడానికి వీలుగా తండ్రి వంటమనిషిగా ఉద్యోగం చేశారు. ఓ తండ్రిగా ఆయన చేయగలిగినదంతా చేశారు, కానీ నీట్ పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దయింది. దానిని తట్టుకోలేక ఆకాంక్ష బలవన్మరణానికి పాల్పడింది. ఆకాంక్ష మరణం కేవలం బలవన్మరణం కాదు. అది ప్రధాని మోదీ హయాంలో అవినీతి, చిన్నాభిన్నమైన విద్యావ్యవస్థ ఇచ్చిన బహుమతి. ఇక ధర్మేంద్ర ప్రధాన్. ఆయన ఇప్పటికీ అదే కురీ్చలో ఉన్నారు. అవే పాత కమిటీలు, బదిలీలు, విచారణలు. సంస్కరణలు లేవు. న్యాయమూ లేదు. మోదీజీ.. అధికార పీఠం శాశ్వతం కాదు. అది వస్తుంటుంది, పోతుంటుంది’’అని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. -
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
బెంగళూరు: నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ సాగర్ ఖాండ్రే తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ఇటువంటి కీలక అంశాలపై ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తితే వారిని వెంటనే దేశద్రోహులు లేదా ఎవరికో ఏజెంట్లుగా ముద్ర వేస్తున్నారని వాపోయారు. బుధవారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులను చేస్తూ సంబంధిత శాఖ కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసినప్పటికీ అది సరిపోదని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి, తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ సాగర్ ఖాండ్రే డిమాండ్ చేశారు.అధిష్ఠానానికి కృతజ్ఞతలుడీకే శివకుమార్ కేబినెట్లో తన తండ్రి ఈశ్వర్ ఖాండ్రేకు చోటు దక్కడంపై ఆయన సంతోషం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఈశ్వర్ ఖాండ్రే సమర్థవంతంగా పనిచేశారని, ఆయన పనితీరు, పార్టీ పట్ల అంకితభావాన్ని గుర్తించి కేబినెట్లో చోటు కల్పించారని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తమ కుటుంబంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు మరింత కట్టుబడి పనిచేస్తామని సాగర్ ఖాండ్రే (Sagar Khandre) స్పష్టం చేశారు.రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతమే లక్ష్యం: ఈశ్వర్ ఖాండ్రేడీకే శివకుమార్ మంత్రివర్గంలోనూ తనకు చోటు దక్కడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఈశ్వర్ ఖాండ్రే (Eshwar Khandre) హర్షం ప్రకటించారు. ఈరోజు సాయంత్రం కర్ణాటక కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. కర్ణాటక అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.“నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన మా నాయకత్వానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. గతంలో కూడా నేను నా బాధ్యతలను నిజాయితీగా, చిత్తశుద్ధితో, అంకితభావంతో, కష్టపడి నిర్వర్తించాను. ఈసారి కూడా అదే నిబద్ధతతో పని చేస్తాను” అని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు పార్టీని గ్రామీణ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. అభిజీత్ డిప్కే ప్రత్యక ఉద్యమం
-
‘నీట్’ టెన్షన్: ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూనే..
కోడెర్మా: దేశంలో ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల ఒత్తిడి విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన చర్చనీయాంశంగా మారింది. ‘నీట్’ కోసం సిద్ధమవుతున్న 16 ఏళ్ల ఒక ప్రతిభావంతురాలైన విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పరీక్షల ప్రక్రియలో నెలకొన్న అనిశ్చితి, తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఆమె బలైపోయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ రాస్తూనే ఆ బాలిక గదిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.ఆన్లైన్ పరీక్ష రాస్తూ..తమ అమ్మాయి చదువులో ఎంతో చురుకైనదని, ‘నీట్’లో విజయం కోసం పట్టుదలతో చదువుతోందని బంధువులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన ఆమె, అనంతరం ఇంటికి తిరిగి వచ్చి సొంతంగా ప్రిపరేషన్ కొనసాగిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలు రాయాలనే పట్టుదలతో ఉన్న ఆమె, నీట్ పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకంతో ఉంది. అయితే ఇంట్లోనే ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ రాస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఎంతసేపటికీ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.కేసు నమోదు.. ముమ్మర దర్యాప్తుఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తి చేసి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఉదంతంపై స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఎవరిపైనా ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థిని నీట్ పరీక్షకు హాజరైన విషయం నిజమే అయినప్పటికీ, కుటుంబ సభ్యులు ప్రాథమికంగా ఇచ్చిన దరఖాస్తులో పరీక్ష ఒత్తిడికి సంబంధించిన అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించలేదని పోలీసులు వివరించారు.ప్రాణాంతకంగా మారుతున్న పరీక్షల టెన్షన్ఈ విషాద ఉదంతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న విపరీతమైన అకడమిక్ ఒత్తిడిని మరోసారి తెరపైకి తెచ్చింది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు పోటీపడే నీట్ వంటి కఠినమైన ప్రవేశ పరీక్షలు, వారిపై తీవ్ర మానసిక భారాన్ని మోపుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఒత్తిడి, పరీక్షల నిర్వహణలో అస్థిరత తదితర కారణాలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో విద్యార్థులకు సరైన కౌన్సెలింగ్ సపోర్ట్ సిస్టమ్స్ అందుబాటులో ఉంచాలని, ఒత్తిడిని తగ్గించే ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘చికెన్స్ నెక్’పై భారత్ పట్టు.. చైనా, ‘బంగ్లా’ కుట్రలకు చెక్! -
ఇప్పుడు క్యూట్ వంతు
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్– యూజీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ, సీబీఎస్ఈ పునర్మూల్యాంకనంలో లోపాలు, పరీక్షఫీజు చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలో పరువు పోగొట్టుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరోసారి తన అసమర్థతను బయటపెట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్ధేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్(క్యూట్–యూజీ) పరీక్ష రాసేందుకు శనివారం సిద్ధమైన వేలాది మంది విద్యార్థులు అవస్థలుపడ్డారు. సాంకేతిక సమస్యతో పరీక్ష రాయలేక చివరకు వెనుతిరిగారు. మధ్యాహ్నం సెషన్లో 2.30 గంటలకు పరీక్షహాల్లోకి అనుమతించారు. మూడు గంటలకు పరీక్ష మొదలుకావాల్సి ఉండగా గంటపాటు అభ్యర్థులు లాగిన్కాలేకపోయారు. 4 గంటలకు పరీక్ష మొదలుపెట్టారు. సాంకేతిక సమస్యతో దేశవ్యాప్తంగా 3,765 మంది అభ్యర్థులు పరీక్షరాయలేక చివరకు వెనుతిరిగారు. ఉదయం సెషన్లోనూ ఇలాంటి సమస్య తలెత్తగా ఆలస్యంగా పరీక్ష మొదలైంది. వాళ్లకు మాత్రం కోల్పోయిన కాలం మేరకు అదనపు సమయాన్ని కేటాయించారు. మ«ధ్యాహ్నం సెషన్లో మాత్రం వేలాది మంది పరీక్షరాయలేకపోయారని వాళ్లకు మాత్రం వేరేరోజు ఎగ్జామ్ నిర్వహిస్తామని ఎన్టీఏ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూట్–యూజీ పరీక్షకు టెక్నికల్ సరీ్వస్ ప్రొవైడర్గా ఉన్న ‘టీసీఎస్ ఐఆన్’సంస్థ నుంచి వివరణ కోరామని ఎన్టీఏ తన ‘ఎక్స్’ఖాతాలో వెల్లడించింది. అభ్యర్థుల్లో పరీక్షపై ఏమైనా సందేహాలు ఉంటే +91–11–40759000 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్చేసి లేదా cuet-ug@nta. ac.in ఈమెయిల్ ఐడీకి మెయిల్చేసి సందేహాలు నివృత్తిచేసుకోవచ్చని ఎన్టీఏ స్పష్టంచేసింది. సాంకేతిక సమస్య కారణంగా ఉదయం సెషన్ రెండు గంటలు ఆలస్యంగా చేపట్టామని టీఎస్ఎస్ సంస్థ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు.వెల్లువెత్తిన విమర్శలు పరీక్ష కోసం లోపలికి వెళ్లిన అభ్యర్థులు ఎంతకీ బయటకురాకపోవడంతో మండుటెండలో వేచిచూసిన విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘‘మూడు, నాలుగు గంటలు బయట ఎండలో వేచిచూసి అలసిపోయాం. తీరా బయటికొచ్చి పరీక్ష రాయలేదు అని వాళ్లు చెప్పడంతో ఒళ్లు మండింది. జాతీయస్థాయి పరీక్షలను ఇలాగేనా నిర్వహించేది? వాళ్లు లోపల పరీక్ష రాయట్లేదనే విషయం బయట ఉన్న మాలో ఒక్కరికీ చెప్పలేదు’’అని ఒక పరీక్షార్థి తల్లి ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘సుదూరం నుంచి ఉదయం ఆరు గంటలకే పరీక్ష కేంద్రానికి వచ్చాం. తీరాచూస్తే 11 గంటలకైనా ఎగ్జామ్ మొదలెట్టలేదు. మా వాళ్లు ఎదురుచూసి అలసిపోయి వెనుతిరిగారు’’ అని మరో నెటిజన్ ‘ఎక్స్’ వేదికగా అసహనం వ్యక్తంచేశారు.ఇది ప్రధాన్ మంత్రి–మంత్రి ప్రధాన్ జుగల్బందీ: కాంగ్రెస్ క్యూట్–యూజీ ఉదయం సెషన్ ఆలస్యం, వేలాది మంది మధ్యాహ్నం పరీక్ష రాయలేకపోవడంపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్టీఏ వైఫల్యాలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బాధ్యుడిని చేయకుండా ఆయనను ప్రధాని మోదీ వెనకేసుకొస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తాజా క్యూట్–యూజీ ఘటనను ‘ప్రధాన్ మంత్రి–మంత్రి ప్రధాన్ జుగల్బందీ’గా అభివరి్ణంచింది.‘విశ్వగురువు’ ఒక్క పరీక్షా సవ్యంగా నిర్వహించట్లేరు: రాహుల్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలోని సంస్థ క్యూట్–యూజీ పరీక్ష సవ్యంగా నిర్వహించలేకపోవడంతో లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ మరోసారి మోదీ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘భారత్ విశ్వగురువే. కానీ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మాత్రం అది సాధ్యపడట్లేదు. కనీసం ఒక్క పరీక్షను సవ్యంగా, సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. మొన్న నీట్, నిన్న సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ, నేడు క్యూట్’’ అంటూ విమర్శించారు. -
అరాచకమే విధానం
మన విద్యావిధానానికేమైంది? ‘నీట్’ పోటీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్తో మొదలై ఇప్పుడు సీబీఎస్ఈ జవాబుపత్రాల తప్పుడు మూల్యాంకనం బయటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, పోస్టుల్ని అమ్ముకున్నారనీ, అనర్హులకు దొంగ ర్యాంకులు పంచారనీ వెల్లడై ప్రభుత్వం అభాసుపాలవుతుండగానే, అక్కడ ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం పరమ అధ్వాన్నంగా సాగిందని బట్ట బయలైంది. ‘నీట్’కు ఈసారి 22.79 లక్షలమంది పోటీపడ్డారు.వీరంతా అర్ధాకలితో మాడుతూ నెలల తరబడి పట్టణాల్లో, నగరాల్లో ఉండి కోచింగ్ సంస్థలకు వేలాది రూపాయలు అర్పించి చదువుకున్నవారు. కానీ ప్రశ్నపత్రాలు లీకై అదంతా వ్యర్థమైంది. పరీక్ష రద్దయ్యాక పలుచోట్ల నిరాశా నిస్పృహలతో అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత పన్నెండేళ్లలో 15 రాష్ట్రాల్లో 70 ప్రధాన లీక్లు చోటుచేసుకున్నాయని ఒక కథనం చెబుతోంది. అదే నిజమైతే ప్రశ్నపత్రాల వెల్లడి యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీనివెనక పెద్ద మాఫియానే ఉండొచ్చు. బట్టబయలైనప్పుడే సమస్య అందరికీ తెలుస్తోంది. నీట్ వివాదం సద్దుమణగకముందే సీబీఎస్ఈ వంతు వచ్చింది. ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు 18 లక్షలమంది రాశారు. నిద్రాహారాలు మాని చదువుకున్న ఈ పిల్లల జవాబు పత్రాలు దిద్దటానికి ‘హైటెక్’ ఆలోచన చేసింది సంస్థ. ఆ పత్రాలను స్కాన్ చేసి వాటి డిజిటల్ ఫైళ్లను అప్లోడ్ చేసి మూల్యాంకనం చేసే విధానాన్ని అనుసరించింది. ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) అనే ఈ విధానం గురించి తొలి పరీక్షకు పదిరోజుల ముందు పాఠశాలలకు చెప్పిందంటున్నారు. ఇలాంటి కొత్త విధానంపై పాఠశాల ప్రిన్సిపాళ్లకూ, విద్యార్థులకూ అవగాహన కల్పించాలనీ, అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రత్యామ్నాయం ఆలోచించాలనీ దానికి లేకపోయింది.తీరా ఈ నెల 13న ఫలితాలు వెలువడినప్పుడు లక్షలాదిమంది విద్యార్థులు నిర్ఘాంతపోయారు. 90 శాతం వరకూ మార్కులొస్తాయని నమ్మినవారి స్కోర్ అడ్డంగా పడిపోయింది. అప్పటికే హార్వర్డ్, బ్రౌన్, యేల్, కార్నెల్ వంటి ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించినవారు బావురుమన్నారు. ఈ అరకొర మార్కులతో కనీసం ఆ విశ్వవిద్యాలయాల గేట్లు తాకే అర్హత కూడా ఉండదు మరి! సీబీఎస్ఈలో నిరుడు ఉత్తీర్ణత శాతం 88.39 అయితే, ఈసారి 85.29 శాతానికి పడిపోయింది. 90 శాతంపైగా మార్కులొచ్చినవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల హయాంలో 1921లో అత్యున్నత విద్యాప్రమాణాల కోసం స్థాపించిన ఒక సంస్థ కాలక్రమంలో... అంటే 1962లో ఇప్పుడున్న రూపానికి మారింది. అక్కడ ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికెట్ తెచ్చుకుంటే ప్రపంచంలో అత్యున్నత శ్రేణి విశ్వ విద్యాలయాలు రెడ్ కార్పెట్ పరిచేంత ప్రతిష్ఠను సీబీఎస్ఈ సంపాదించుకుంది.ఆ సంస్థ ఇప్పుడెంతగా భ్రష్టుపట్టిందంటే... పాఠశాలలు మొదలై మూణ్ణెల్లు గడిచి, ఒక యూనిట్ టెస్ట్ కూడా అయినాక, మెడమీద కత్తిపెట్టి త్రిభాషా సూత్రం పేరిట హిందీ లేదా సంస్కృతం నేర్చుకుతీరాలని శాసిస్తోంది. అందుకోసం పాఠ్యపుస్తకం కూడా లేదంటే... ఆరో తరగతి పుస్తకం చదవాలంటోంది. పైగా ఆ మార్కుల్ని పట్టించుకోబోనని అభయమిస్తోంది. ఇంతకన్నా అరాచకం ఉంటుందా అని అందరూ అనుకునేలోగానే ఈ ముదనష్టపు మూల్యాంకనం వెల్లడైంది. డీఎస్సీ నిర్వాకం బయటపడ్డాక, అంతా సవ్యంగానే ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దబాయిస్తున్న తరుణంలోనే తాజాగా టెన్త్ మూల్యాంకనం అడ్డదిడ్డంగా సాగిన వైనం బయటపడింది. విద్యార్థులు రాసిన కొన్ని జవాబుల్ని పట్టించుకోకపోవటం, దిద్దినా ఆ మార్కుల్ని పరిగణించకపోవటం వంటి చిత్రాలు చోటుచేసు కున్నాయి. తెలివైన విద్యార్థులు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తులు చేశాక ఇదంతా బయటికొచ్చింది.పాలన గాలికొదిలిన చోట ఇలాంటి అరాచకాలు జరగటంలో ఆశ్చర్యమేమీ లేదుగానీ...‘నీట్’ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఏమైంది? సీబీఎస్ఈ ఎలా ధ్వంసమైంది? పాలకులు జవాబుదారీ తనంతో వ్యవహరించటం, జరిగే తప్పులకు నైతిక బాధ్యత తీసుకోవటం తప్పనిసర య్యేలా ప్రజలు ఒత్తిళ్లు తెస్తేనే ఈ దుఃస్థితి మారుతుంది. అప్పుడే ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. లేకుంటే అవి కూడా చోద్యం చూస్తుంటాయి. -
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ
-
నీట్ లీక్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం, కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: 2026 నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీక్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీక్పై ఆరు వారాల్లోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. పర్యవేక్షణ యంత్రాంగాలు, పర్యవేక్షక కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందంటూ ఆందోళన వ్యక్తంచేసింది. పర్యవేక్షణ ఉన్నప్పటికీ పేపర్ లీక్ జరిగిందంటే ప్రక్రియలో లోపాలు ఉన్నట్టే అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పై ఆగ్రహం చేసింది.పరీక్షలనిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని సూచించింది. పేపర్ లీక్తోవిద్యార్థులుతీవ్ర మనోవేదనకు గురయ్యారని వ్యాఖ్యానించింది. నీట్ కేసులో బాధ్యులైన వారిని వెంటనే గుర్తించాలని తగిన చర్యలు చేపట్టాలంటూ ఆయాశాఖలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న నీట్ 2026 పేపర్ లీక్ వివాదానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) భారత సుప్రీంకోర్టులో ఒక ముఖ్యమైన అఫిడవిట్ను దాఖలు చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, జూన్ 21న జరగబోయే నీట్ 2026 పునఃపరీక్షలో విశ్వాసం, పారదర్శకత, నిష్పక్షపాతాన్ని పునరుద్ధరించడానికి తాము కట్టుబడి ఉన్నామని NTA సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ విచారణకు ఎన్టీఏ, మాజీ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. -
నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!
ఇవాళ భారతదేశంలో కాంపీటీటివ్ ఎగ్జామ్స్ సంస్కృతి ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులు, యువతకు అదే జీవిత పరమావధి అన్నంతగా మారిపోయాయి పరిస్థితులు. ఒకవేళ అది ఫెయిలైతే జీవితం అయిపోయినట్లుగా లేదా ముగిసిపోయినట్లుగా భావిస్తారు. మరికొందరు ఎన్నటికీ విజయాన్ని అందుకోలేని పరాజితులుగా ముద్ర వేసుకుంటారు. ఇంకో రంగంలో లేదా మరేదైన అభిరుచినో ఎంచుకుని గమ్యం చేరుకునే యత్నం చేయరు. కానీ ఈ కంటెంట్ క్రియేటర్ తన సక్సెస్ స్టోరీతో ఆ ఆలోచన విధానమే తప్పు అని నొక్కి చెప్పింది. ఆ ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మన జీవితాన్ని, సక్సెస్ని నిర్ణయించదని తన గెలుపుతో నిరూపించింది ఈ భారత సంతతి మహిళ. ఎవరంటే ఆమె..? అమెరికాలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రజ్ఞాగుప్తా. దాదాపు దశాబ్దం క్రితం నీట్ పరీక్షల్లో విఫలమవ్వడం ఆమెను ఊహించని విధంగా ఐవీ లీగ్ విద్యవైపు అడుగులు వేసి ఎలా బయోటెక్నాలజీ పరిశ్రమలో కెరీర్ నిర్మించుకునేలా చేసిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఆమె కథ నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా భారతదేశంలో పోటీ ప్రవేశ పరీక్షల చుట్టూ ఉన్న తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆమె కథ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. నిజానికి ప్రజ్ఞ 2016లో 17 ఏళ్ల వయసులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసింది, కానీ మెడికల్ లేదా డెంటల్ కళాశాలలో ప్రవేశం పొందడంలో విఫలమైంది. భారతదేశంలోని అత్యంత పోటీతత్వ విద్యా వాతావరణంలో పెరిగిన ప్రజ్ఞ కూడా చాలా మంది విద్యార్థుల మాదిరిగానే, ఈ ఎదురుదెబ్బ బయాలజీ, హెల్త్కేర్ రంగాలలో తన కెరీర్ ఆశయాలను ముగించిందని చాలా బాధపడింది. ఆమె ఓటమి తన కుటుంబాన్ని సైతం తీవ్రగా ప్రభావితం చేసింది. సైన్స్ చదివే విద్యార్థులు నీట్ పరీక్షని అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షగా భావిస్తారు. అయితే ప్రజ్ఞ ఆ పరీక్షను మరోసారి ప్రయత్నించి చూడటం వంటి వాటికి బదులుగా జీవశాస్త్రంపై ఉన్న ఆసక్తికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. ఆ క్రమంలోనే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యంతో అమెరికాకు పయనమైంది. అక్కడ ప్రముఖ ఐవీ లీగ్ సంస్థలలో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది.ప్రస్తుతం ఆమె అమెరికాలోని కార్పొరేట్ బయోటెక్నాలజీ పరిశ్రమలో నిపుణురాలిగా పనిచేస్తోంది. అందరిలానే పాఠశాల విద్య తర్వాత డాక్టర్ అయ్యే సంప్రదాయ నీట్ ప్రవేశపరీక్ష వైపుకు వెళ్లింది..కానీ అనుకోని ఓటమి ఆ దారిని క్లోజ్ చేసింది. ఆ ఎదురుదెబ్బ తన జీవితాన్ని గొప్ప యూటర్న్ తిప్పే ప్రత్యామ్నాయం వైపు ఫోకస్ పెట్టింది. అలాగే తాను కోరుకున్నట్లుగానే ఆరోగ్య సంరక్షణ రంగంలోనే కెరీర్ని నిర్మించుకుంది. ఒక విద్యా పరీక్షలో వైఫల్యం ఒక వ్యక్తి భవిష్యత్తు విజయాన్ని లేదా ఆనందాన్ని నిర్ణయించదనే వాస్తవాన్ని తన గెలుపుతో చాటిచెప్పిందామె. కాగా, అత్యంత పోటీతత్వ, ప్రతిష్టాత్మకమైన ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం వల్ల కలిగిన మానసిక వేదన..దాన్నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి డ్రీమ్ కెరీర్ని చేరుకోవడం వరకు సాగిన ఆమె కెరీర్ జర్నీ విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఉందంటూ నెటిజన్లు ప్రజ్ఞను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతేగాదు సైన్స్, హెల్త్కేర్, బయోటెక్నాలజీ రంగాలలో కెరీర్లు కేవలం నీట్ ద్వారా డాక్టర్ అవ్వడం వరకే పరిమితం కావు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. View this post on Instagram A post shared by Pragya Gupta (@pragya.gupta) (చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ) -
‘‘అప్పటివరకు ‘నీట్’పై నిరసనలు జరుగుతూనే ఉంటాయి’’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో ఉండగా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.ఆదివారం ఎక్స్లో ఈ మేరకు రాహుల్ గాంధీ ఎన్ఎస్యూఐ నిరసన తెలిపిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. “లక్షలాది మంది యువత రోడ్లపై ఉన్నారు.. 22 లక్షల పిల్లల భవిష్యత్ ఏంటో తెలియట్లేదు. అయినా ప్రధాని మౌనంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పడంపై కాదు, బాధ్యత నుంచి తప్పించుకోవడంపైనే దృష్టి పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, నీట్ లాంటి ప్రశ్నపత్ర లీకులు ఆగేలా పూర్తిస్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసే వరకు మేము ఆగము” అని రాహుల్ గాంధీ అన్నారు.నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్ను కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని, “ప్రశ్నపత్ర లీక్ మాఫియా” పెరగడానికి అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.ఎక్స్లో కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ.. “నీట్ ప్రశ్నపత్ర లీక్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను చీకటిలోకి నెట్టింది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నపత్ర లీక్ మాఫియా విస్తరిస్తోంది. బాధ్యులు మాత్రం మౌనంగా చూస్తున్నారు. హైదరాబాద్లో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వినోద్ జాఖర్ నాయకత్వంలో కార్యకర్తలు పాదయాత్ర చేపట్టి, యువత వ్యతిరేక మోదీ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తో చేసే ఈ చెలగాటాన్ని ఏ మాత్రం సహించం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని కాంగ్రెస్ పేర్కొంది.అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రశ్నపత్ర లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.ఇదిలా ఉండగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆదివారం హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నీట్ ప్రశ్నపత్ర లీక్ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.నిరసనకారులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ అక్రమాల్లో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.जब लाखों युवा सड़क पर हों, 22 लाख बच्चों का भविष्य दांव पर हो और PM चुप हो - तो सरकार जवाब देने नहीं, बचने में लगी है।जब तक धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता और NEET जैसे पेपर लीक रोकने के लिए foolproof सिस्टम नहीं बनता - हम रुकेंगे नहीं।pic.twitter.com/6KrhfUqDkL— Rahul Gandhi (@RahulGandhi) May 24, 2026 -
ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
న్యూఢిల్లీ: నీట్(యూజీ)–2026 పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పారీ్ట(సీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియాలో పోరాటం ఆరంభించింది. ఆ పార్టీ ‘ఎక్స్’ఖాతాలను ప్రభుత్వం నిలిపివేయడంతో ‘కాక్రోచెస్ నెవర్ డై’అనే ట్యాగ్లైన్తో ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరిట కొత్త ఖాతాను సృష్టించుకుంది. ఇదే ఖాతా నుంచి పోస్టులు చే స్తోంది. ఇన్స్టా్రగామ్లోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. విద్యా రంగంలో కేంద్రం దారుణంగా విఫలమైందని, పరీక్షలు సైతం సక్రమంగా నిర్వహించలేకపోతోందని సీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో పెట్టిన పిటిషన్కు మద్దతు ఇవ్వాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కోరారు. తాజాగా ఒక వీడియో సందేశం పోస్టుచేశారు. ‘‘బొద్దింకల్లారా.. ఎలా ఉన్నారు? ఇంటర్నెట్లో మీరంతా బాగా రాణిస్తున్నారని అందరూ అంటున్నారు. కానీ ఇప్పుడు నిజమైన పని చేయాల్సిన సమయం వచ్చింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఈ రోజు ఆన్లైన్లో ఒక పిటిషన్ను ప్రారంభిస్తున్నాం. దీనికి అందరూ మద్దతివ్వాలి’’అనికోరారు. విద్యా వ్యవస్థలోని వైఫల్యాలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జవాబుదారీతనం ఉండాలన్నారు. అందుకు సమయం వచ్చిందన్నారు. 22 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడానికి, నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి వ్యవస్థే కారణమని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని అభిజిత్ దీప్కే తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు బెదిరింపులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు.దీప్కే భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే భద్రతపై ఆయన తల్లిదండ్రులు భగవాన్, అనితా దీప్కే ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి ప్రాణాలకు ఎవరైనా ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఆ పార్టీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎక్స్ ఖాతాను ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు అభిజిత్కు బెదిరింపులు సైతం వస్తున్నట్లు తెలుస్తోంది. తమ కుమారుడు ఇబ్బందుల్లో పడతాడేమో లేక అరెస్టును కూడా ఎదుర్కొంటాడేమోనన్న భయంతో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. అభిజిత్కు ఆమ్ ఆద్మీ పారీ్టతో సంబంధాలున్నాయి. అతడి తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో నివసిస్తున్నారు. తమ బిడ్డ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని వారు చెప్పారు. అతడి భద్రత పట్ల ఆందోళన చెందుతున్నామని, నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని వెల్లడించారు. ఇంటికి తిరిగిరావాలని అభిజిత్ను కోరారు. -
వాళ్లు మనోవేదనలో మీరు రీల్స్ మోజులో
న్యూఢిల్లీ: భవిష్యత్తును నిర్ణయించే నీట్–యూజీ పరీక్షను రాత్రింబవళ్లు కష్టపడి చదివి రాశాక అది రద్దయిందని తెలిసి లక్షలాది మంది అభ్యర్థులు వేదనలో మునిగిపోతే విదేశాల్లో ప్రధాని మోదీ ‘రీల్స్’చేస్తూ సంతోషంగా కన్పిస్తున్నారని లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాహుల్ గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో మోదీ వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘పేపర్లీక్ ఉదంతంలో న్యాయం కావాలంటూ ఓవైపు యువత వీధుల్లోకి వచ్చి పోరాడుతుంటే మోదీ ఇటలీలో మెలోడీ అంటూ రీల్స్చేస్తున్నారు. దేశంలో ఎక్కడ మంచి పని జరిగినా తన ఘనతే అని చెప్పుకుని తిరిగే మోదీ నీట్–యూజీ పేపర్ లీక్ అయితే బాధ్యత ఎందుకు తీసుకోవట్లేరు? కనీసం నీట్–యూజీ పరీక్షల నిర్వహణను కేంద్రస్థాయిలో చూసుకునే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు ఇంకా పదవి నుంచి తొలగించలేదు? ఈ విషయంపై మోదీ ఎందుకు ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు? న్యాయం కోరుతూ పలు రాష్ట్రాల్లో ఉద్యమిస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచిన ఎస్ఎస్యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు లాఠీల వర్షం కురిపిస్తున్నాయి. లాఠీలతో ప్రభుత్వం చెప్పే సమాధానం ఏరకంగానూ జవాబుదారీ అన్పించుకోదు. సమాధానం చెప్పే ధైర్యంలేక భయంతో మమ్మల్ని లాఠీలతో చావబాదుతున్నారు. అయినా మేం భయపడబోం. ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి పదవి నుంచి తొలగించేదాకా, దేశంలో పేపర్ లీకేజీలులేని పటిష్టమైన పరీక్షా విధానం అమల్లోకి వచ్చేదాకా ఉద్యమిస్తాం. లీకేజీలతో విద్యార్థుల భవితను ప్రభుత్వం దోచుకుంటోంది’’అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జైపూర్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యమిస్తున్న విద్యార్థులపైకి పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న ఫొటోను రాహుల్గాంధీ ఈ పోస్ట్కు ట్యాగ్చేశారు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు!
న్యూఢిల్లీ: నీట్ (యూజీ)–2026 ప్రశ్నపత్రం మొత్తం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ స్పష్టంచేశారు. కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయి కాబట్టి ఈ వ్యవహారాన్ని పేపర్ లీక్గా భావించవద్దని పేర్కొ న్నారు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని తేల్చిచెప్పారు. ఆయనతోపాటు ఎన్టీఏ అధికారులు గురువారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కమిటీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. గతంలో జరిగిన పేపర్ లీక్ ఉదంతాలను ప్రస్తావించారు. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో పేపర్ లీకేజీలు జరగకుండా పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగారు. అక్రమాలను అరికట్టడానికి భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నామని ఎన్టీఏ అధికారులు బదులిచ్చారు. అభిషేక్ సింగ్కు ఎన్డీయే ఎంపీల మద్దతు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణకు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషీ, ఎన్టీఏ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ తదితరులు కూడా హాజరయ్యారు. ఎన్టీఏలో సంస్కరణలపై రాధాకృష్ణన్ నివేదికలోని సిఫార్సులపై ప్రజంటేషన్ ఇచ్చారు. కొన్ని సిఫార్సులను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్కు అధికార ఎన్డీయే ఎంపీలు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. సీబీఐ దర్యాప్తు పూర్తయిన తర్వాత సంబంధిత నివేదికను స్టాండింగ్ కమిటీకి సమరి్పంచాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా, బీజేపీ ఎంపీలు అందుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని పేర్కొన్నారు. ఆ సంస్థ విధుల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. ఎన్టీఏలో ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేయాలని స్టాండింగ్ కమిటీ సభ్యులు సూచించారు. పేపర్ లీకేజీలు జరగకుండా, ఏజెన్సీ పూర్తి సామర్థ్యంతో పని చేయాలంటే సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో ఉండాలన్నారు. బయటకు వెల్లడించలేం: దిగ్విజయ్ మే 3న నీట్(యూజీ) నిర్వహించగా, పేపర్ లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నీట్(యూజీ) పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటిదాకా 10 మందిని అరెస్టు చేసింది. వివిధ రాష్ట్రాల్లో దర్యాప్తు సాగుతోంది. ఒకరి చేతి నుంచి మరొకరికి నీట్ ప్రశ్నలు అందినట్లు గుర్తించారు. అయితే, నీట్(యూజీ) పేపర్ లీకైనట్లు ఎన్టీఏ అధికారులు అంగీకరించడం లేదు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని, పేపర్ లీకేజీ జరిగినట్లు సీబీఐ అధికారికంగా ధ్రువీకరిస్తేనే తాము అంగీకరిస్తామని అంటున్నారు. విచారణ అనంతరం పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఎలాంటి చర్చలు జరిగినా వాటిని బయట చర్చించలేమని అన్నారు. గురువారం సమావేశం చాలా బాగా జరిగిందని, సభ్యులందరి నుంచి అభిప్రాయాలు అందాయని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ పై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. -
పేపర్ కొట్టేసి నీట్ లో టాపర్
-
‘గెస్ పేపర్'లో కెమిస్ట్రీ ప్రశ్నలన్నీ అవుట్.. సీబీఐకి చిక్కిన లిస్ట్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షకు ముందే బయటకు వచ్చిన ‘గెస్ పేపర్’లోని కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ప్రశ్నలు, అసలు పరీక్షా పత్రంలోని ప్రశ్నలతో 100 శాతం సరిపోలడం జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)ను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అంతర్గత విచారణ ఆధారంగా పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్లు , అనువాదకుల పాత్రపై అనుమానంతో ఎన్టీఏ ఈ కేసును కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించింది.సీబీఐ నిఘాలో 27 మంది ప్రొఫెసర్లుమే 3న జరిగిన పరీక్ష తర్వాత, మే 7న సికార్కు చెందిన ఒక విజిల్బ్లోయర్ పంపిన ఈమెయిల్, లీకైన పేపర్ పిడిఎఫ్ ఆధారంగా ఈ భారీ కుంభకోణం బయటపడింది. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కెమిస్ట్రీ పేపర్ రూపకల్పన , వివిధ భాషల్లోకి అనువాద ప్రక్రియలో పాల్గొన్న సుమారు 26 నుండి 27 మంది నిపుణుల జాబితాను ఎన్టీఏ సీబీఐకి సమర్పించింది. ఇందులో ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ సెట్టర్లతో పాటు 24 మంది అనువాదకులు ఉన్నారు. ఇటీవల పుణేకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ పివి కులకర్ణిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.నమ్మకమే కొంపముంచింది.. కొత్త సంస్కరణలుఇంతకాలం నమ్మకం ఆధారంగానే ఈ పరీక్షల వ్యవస్థ నడిచిందని, దీనిలోని వారే నమ్మకద్రోహానికి పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో థర్డ్ పార్టీ ద్వారా వీరి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలని ఎన్టీఏ యోచిస్తోంది. అంతేకాకుండా, వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు నలుగురు ఉన్నతాధికారులను నియమించడమే కాకుండా, ప్రైవేట్ రంగం నుండి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ), సీఎఫ్ఓ (సీఎఫ్ఓ)లాంటి నిపుణులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రకటన జారీ చేసింది.జూన్ 21న రీటెస్ట్.. కఠిన నిబంధనలుఈ లీకేజీ నేపథ్యంలో, రాబోయే జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ రీటెస్ట్ కోసం కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టుల పేపర్ సెట్టర్లను, ట్రాన్స్లేటర్లను ఎన్టీఏ పూర్తిగా మార్చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పునఃపరీక్ష ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, పరీక్ష అత్యంత కట్టుదిట్టంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు.ఇది కూడా చదవండి: ‘కోటా’ జోరుకు బ్రేక్.. తెరపైకి ‘సికార్’ విద్యా విప్లవం! -
‘కోటా’ జోరుకు బ్రేక్.. తెరపైకి ‘సికార్’ విద్యా విప్లవం!
రాజస్థాన్లోని కోటా నగరం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది నీట్, జేఈఈ కోచింగ్ సెంటర్లు. ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్న విద్యార్థుల విషాదాలు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. కోటాకు ప్రత్యామ్నాయంగా, మధ్యతరగతి కుటుంబాల ఆశాదీపంగా ‘సికార్’ అనే చిన్న పట్టణం సరికొత్త విద్యా విప్లవానికి కేంద్రబిందువుగా ఎదుగుతోంది. జైపూర్కు నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ‘సికార్’ ఇటీవలి ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారంలోనూ వార్తల్లోకి వచ్చి సంచలనంగా నిలిచింది.కోటాతో పోటీ పడుతున్న ‘బి-టౌన్’ సికార్కోటాతో పోలిస్తే సికార్ చాలా చిన్న నగరం. ఇక్కడ బ్రహ్మాండమైన హాస్టళ్లు లేవు. కనీసం ఒక షాపింగ్ మాల్ కూడా లేదు. నగరంలో ఒకే ఒక్క సినిమా థియేటర్ కనిపిస్తుంది. అయినప్పటికీ, ఇది దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నీట్-జేఈఈ కోచింగ్ హబ్గా మారుతోంది. డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనే మధ్యతరగతి విద్యార్థుల కలలను నిజం చేస్తూ, కోటా స్థాయి ఖర్చులను భరించలేని కుటుంబాలకు సికార్ ఒక ఆశ్రయంగా నిలుస్తోంది. ఇక్కడి విద్యాసంస్థలు కేవలం ర్యాంకులకే ప్రాధాన్యత ఇవ్వకుండా, విద్యార్థులకు సొంత ఊరి వాతావరణాన్ని అందిస్తున్నాయి.లీకేజీ గుట్టురట్టు చేసిన సికార్ లెక్చరర్ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి సికార్ నగరంతో బలమైన సంబంధం ఉంది. ఇక్కడి ఒక కోచింగ్ సెంటర్లో కెమిస్ట్రీ బోధించే శశికాంత్ సుతార్ అనే ఉపాధ్యాయుడికి, తన హాస్టల్ యజమాని ద్వారా నీట్ ప్రశ్నపత్రం అందింది. ఆ హాస్టల్ యజమాని కుమారుడు కేరళలో ఎంబీబీఎస్ చదువుతుండగా, అతని స్నేహితుడి ద్వారా ఆ పేపర్ సికార్కు చేరింది. పరీక్షకు ముందే (ఏప్రిల్ 30 నుండి మే 3 మధ్య) ఈ ‘గెస్ పేపర్’ సికార్లో సర్క్యులేట్ అయింది. అయితే సికార్ కెమిస్ట్రీ లెక్చరర్ వెంటనే అలర్ట్ అయి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి ఈమెయిల్ పంపడం ద్వారా ఈ మహా కుంభకోణాన్ని బయటపెట్టారు. ఈ ఆధారాల ద్వారానే దర్యాప్తు సంస్థలు హర్యానా, మహారాష్ట్రల్లోని ప్రధాన నిందితులను పట్టుకోగలిగాయి.ఆత్మహత్యల 'కోటా'కు భిన్నంగా..కోటా నగరం ర్యాంకులతో పాటు విద్యార్థుల ఆత్మహత్యలకు కూడా కేరాఫ్ అడ్రస్గా మారింది. గత ఏడాదిలోనే అక్కడ 13 మంది విద్యార్థులు ఒత్తిడితో తనువు చాలించగా, గత దశాబ్ద కాలంలో దాదాపు 100 ఆత్మహత్యలు నమోదయ్యాయి. కానీ, సికార్ వాతావరణం దీనికి పూర్తిగా భిన్నం. ఇక్కడ విద్యార్థుల ఆత్మహత్యల రేటు చాలా తక్కువ. 2024 జూలై 1న నీట్ పరీక్ష రాసిన తర్వాత 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మినహా, ఇక్కడ పెద్దగా విచారకరమైన సంఘటనలు లేవు. కోటాలోని ఒంటరితనం, విపరీతమైన పోటీకి భయపడుతున్న తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలను ధైర్యంగా సికార్కు పంపుతున్నారు.కన్నీరు పెట్టించే పవిత్ర చౌదరి విజయగాథసికార్లో చదువుతున్న విద్యార్థుల వెనుక ఎన్నో కన్నీటి గాథలు, అంతకుమించిన పట్టుదలలు ఉన్నాయి. శ్రీమాధోపూర్ పరిధిలోని జాంకీపురా గ్రామానికి చెందిన 17 ఏళ్ల పవిత్ర చౌదరి కథ ఇందుకు నిదర్శనం. కరోనా సమయంలో తల్లి గుండెపోటుతో చనిపోగా, నీట్ పరీక్షకు కేవలం ఆరు నెలల ముందు (గత ఏడాది డిసెంబర్ 17న) తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ‘కార్డియాలజిస్ట్ కావాలనేది నా తండ్రి కల. మొదటి ప్రయత్నంలోనే నాకు 690 మార్కులు వస్తాయని ఆశించాను. కానీ పేపర్ రద్దు అయింది. అయినా నేను పట్టుదల వీడను. తదుపరి పరీక్షలో 710 పైగా మార్కులు సాధించి మా నాన్న కలను నిజం చేస్తా’ అంటూ పవిత్ర చౌదరి స్థిర నిశ్చయంతో చెప్పాడు. ప్రస్తుత అతని పరిస్థితిని చూసిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫీజు, హాస్టల్ ఖర్చులను పూర్తిగా మినహాయించింది.భూములు అమ్మి.. నగలు తాకట్టు పెట్టి..ఉత్తరప్రదేశ్ కుషీనగర్ జిల్లాకు చెందిన అక్తర్ అన్సారీ కథ కూడా ఇలాంటిదే. అతని తండ్రి హిసాబుద్దీన్ ఒక పేద రైతు, కూలీ పనులు కూడా చేస్తాడు. తన కొడుకును డాక్టర్ చేయాలనే లక్ష్యంతో మొదట కాన్పూర్, ఆ తర్వాత కోటాకు పంపాడు. గత ఏడాది అక్తర్ సికార్కు మారాడు. ఇది అక్తర్కు 7వ ప్రయత్నం. ‘కీ ’ప్రకారం అతనికి 652 మార్కులు వస్తుండటంతో తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకు చదువు కోసం ఈ ఏడాది జనవరిలోనే తండ్రి భూమి అమ్మేశాడు. తల్లి నగలను తాకట్టు పెట్టాడు. పేపర్ రద్దు వార్త వినగానే గుండె పగిలినంత పనైందని, అయినా తన తండ్రి ధైర్యం చెప్పి, మళ్లీ జూన్ 21న జరగబోయే పరీక్షకు సిద్ధం కావాలన్నారని అక్తర్ ఆవేదనతో తెలిపాడు.సికార్ ఎందుకు చౌక? నిపుణులు ఏమంటున్నారు?సికార్లోని గురుకృప ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, విద్యా నిపుణుడు ప్రదీప్ బుడానియా ప్రకారం.. కోటాతో పోలిస్తే సికార్లో చదువుకోవడానికి అయ్యే ఖర్చు సగం మాత్రమే. కోటా నుంచి ఇక్కడికి విస్తరించిన పెద్ద పెద్ద సంస్థలు సైతం ఫీజులు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక్కడి హాస్టల్, పీజీ యజమానులు ఎక్కువగా స్థానిక గ్రామస్తులు కావడంతో విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటారు. 2021 నుండి 2025 మధ్య కాలంలో కోటాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గగా, సికార్లో విద్యార్థుల చేరికలు మూడు రెట్లు పెరగడం విశేషం.ఇది కూడా చదవండి: ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా.. -
నీట్ లీక్పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!
సాక్షి, న్యూఢిల్లీ : 2024లో నీట్ (NEET UG) పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినప్పుడు, విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తిగా మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కెమిస్ట్రీ టీచర్ శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ గుర్తింపు పొందారు. విద్యార్థులు ఆయన్ను ఆప్యాయంగా "ఎమ్ సర్" (M Sir) అని పిలుచుకునేవారు. నాడు విద్యార్థులకు "ఘోర అన్యాయం" జరిగిందంటూ వాదించిన ఆయన కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత.. 2026 నీట్ (NEET UG) పేపర్ లీక్ కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.శివరాజ్ మొతేగావ్కర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో, 2024లో ఆయన విద్యార్థుల కోసం మాట్లాడిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్గా మారింది. "నీట్ 2024లో భారీ కుంభకోణం జరిగింది. దీనివల్ల మహారాష్ట్రలో చదువు కుంటున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. సంభాజీనగర్లోని ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్లో మేము ఇప్పటికే పిల్ (PIL) దాఖలు చేశాం. విద్యార్థుల తరఫున మరో ప్రత్యేక పిటిషన్ కూడా వేశాము. ఈ రోజు మేము ముంబై వచ్చాము. బాంబే హైకోర్టులో అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము. మహారాష్ట్రలోని అన్ని న్యూస్ ఛానళ్ల ప్రతినిధులను కలిసి, దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరతాము. పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు మీడియా మద్దతు చాలా అవసరం."అని విద్యార్థుల తరపున గళమెత్తాడు. కట్ చేస్తే సరిగ్గా రెండేళ్లకు అదే విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ సీబీఐ చేతికి చిక్కాడు.'ఎమ్ సర్' అరెస్ట్ లాతూర్లోని ప్రముఖ 'రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్' (RCC) వ్యవస్థాపకుడైన శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మే 17 (ఆదివారం) నాడు అరెస్ట్ చేసింది. ఆయన నివాసాలు, కార్యాలయాలపై జరిపిన సోదాల్లో.. ఆయన మొబైల్ ఫోన్లో లీకైన నీట్ క్వశ్చన్ పేపర్ లభ్యమవ్వడంతో సీబీఐ ఈ చర్య తీసుకుంది.ఇదీ చదవండి: నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్ఎవరీ కెమిస్ట్రీ టీచర్ 'ఎమ్ సర్'?లాతూర్లోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన మొతేగావ్కర్, మొదట్లో సైకిల్పై తిరుగుతూ విద్యార్థులకు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవారు 1990ల చివర్లో ఒక చిన్న అద్దె గదిలో కేవలం 10 మంది విద్యార్థులతో ఆయన కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. చేత్తో రాసిన నోట్స్ ఇస్తూ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల కాంపిటేటివ్ పరీక్షల్లో టాపర్లను అందిస్తూ ఆయన స్వల్ప కాలంలోనే ఎంతో ప్రసిద్ధి చెందారు.ఇదీ చదవండి: నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!ప్రస్తుతం 'ఆర్సీసీ' (RCC) క్లాసెస్కు మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన బ్రాంచ్ అయిన లాతూర్తో సహా 9 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది విద్యార్థులు నీట్, జేఈఈ, సెట్ (NEET, JEE, CET) పరీక్షల కోసం ఇక్కడ చేరుతుంటారు. సోషల్ మీడియాలో (ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్) కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. నాడు విద్యార్థుల రక్షకుడిగా ఫోజులిచ్చిన ప్రముఖ విద్యావేత్తే, నేడు అదే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్కు గురిచేస్తోంది. -
నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఆర్సీసీ బ్రాంచి నిర్వాహకుడు తమ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ నుంచే నీట్లో ప్రశ్నలు వస్తాయని ధీమాగా చెప్పాడు. ఒక్కో సబ్జెక్టులో ఉండే 180 ప్రశ్నలకుగాను ఏకంగా 180 ప్రశ్నలు తామిచ్చే మెటీరియల్ నుంచే ఉంటాయంటూ గొప్పలు చెప్పుకున్నాడు. తమ కోచింగ్తో మెడికల్ సీటు గ్యారెంటీ అంటూ భరోసా ఇచ్చాడు. నీట్–2026 ముందు ఎన్డీటీవీ చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఓ అభ్యర్థి సోదరుడినంటూ ఎన్డీటీవీ ప్రతినిధి ఒకరు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని కలిశారు. కోచింగ్తో ర్యాంకు గ్యారెంటీపై ఆయన అనుమానం వ్యక్తం చేయగా అతడు చెప్పిన విషయాలన్నీ రహస్య కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దేశంలోనే ఏ ఇన్స్టిట్యూట్లోనూ తమ మాదిరి కోచింగ్ ఇవ్వరంటూ అతడు గొప్పలు చెప్పాడు. ఎయిమ్స్ సహా దేశంలోని ఏ మెడికల్ కాలేజీకి వెళ్లి చూసినా తమ కోచింగ్ తీసుకున్న కనీసం ఒక్క స్టూడెంటయినా కనిపిస్తారన్నాడు. 2025 నీట్లోనూ తామిచి్చన మెటీరియల్లోని ప్రశ్నలే వచ్చాయని తెలిపాడు. రిజల్టు పక్కా అని చెప్పగలిగేది దేశం మొత్తమ్మీద కేవలం తమ ఇన్స్టిట్యూట్ మాత్రమేనన్నాడు. ఏ ఇతర కోచింగ్లోనూ ఇప్పటి వరకు ఇలాంటి ఫలితాలు రాలేదని ధీమా వ్యక్తం చేశాడు. నీట్–2025లో వచ్చిన ప్రశ్నలు అచ్చుగుద్దినట్లుగా తమ మెటీరియల్లో ఎక్కడున్నదీ కచ్చితంగా చెప్పగలనన్నాడు. ‘పరీక్షలో అడిగిన 180 ప్రశ్నలకు గాను 180 ప్రశ్నలు ఇప్పటికే మా స్టడీ మెటీరియల్లో ఎక్కడో ఒకచోట వచ్చాయని మేం నిరూపించగలం. యాదృచ్ఛికంగానే ఈ క్వశ్చన్ బ్యాంకులోని ఏదైనా ఒక పేజీని తెరిచి మరీ ఇలాంటి ప్రశ్నలను చూపించగలను..’అంటూ బల్లగుద్ది చెప్పడం గమనార్హం. ఈ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు శివరాజ్ రఘునాథ్ మోటెగావొంకర్ను లాతూర్లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడం తెల్సిందే. -
నీట్ పేపర్ లీకేజీ కేసు.. లాతూర్లో కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కోచింగ్ సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. రేణుకాయీ కెమిస్ట్రీ క్లాసెస్(ఆర్సీసీ) పేరుతో కోచింగ్ సెంటర్ నెలకొల్పిన శివరాజ్ రఘునాథ్ మోటెగావొంకర్ ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ఫోన్లో ఈ నెల 3వ తేదీన లీకైన నీట్ ప్రశ్నపత్రం లభించింది. అంతకుముందు లాతూర్లోని శివనగర్లో ఉన్న కోచింగ్ సెంటర్తోపాటు అతడి నివాసంలోనూ సోదాలు జరిపారు. శివరాజ్ను అతడి నివాసంలోనే దాదాపు 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. పేపర్ లీకేజీ ముఠాలో శివరాజ్ కీలకంగా ఉన్నాడని, ఇతడి కోచింగ్ సెంటర్కు 9 బ్రాంచీలుండగా, లాతూర్లోనిది ప్రధాన కేంద్రమని అధికారులు వెల్లడించారు. లీకేజీ కుట్రలో భాగంగా పరీక్షకు దాదాపు 10 రోజులు ముందుగానే, ఏప్రిల్ 23వ తేదీనే ప్రశ్నపత్రం, జవాబులు ఇతడికి అందాయన్నారు. వీటిని ఇతడు చేత్తో రాసిన నోట్స్ రూపంలో ఇతరులకు అందజేశాడని, పరీక్ష అనంతరం వీటిని తగులబెట్టారన్నారు. నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)తో సంబంధాలున్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకరి్ణకి శివరాజ్ సన్నిహితుడని వివరించారు. ఇతడి ఇల్లు, కోచింగ్ సెంటర్లలో జరిపిన సోదాల్లో 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలోని ప్రశ్నలున్న కెమిస్ట్రీ క్వశ్చన్ బ్యాంక్ లభించిందని చెప్పారు. ‘గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని ఐదు చోట్ల సోదాలు చేపట్టి, కీలక పత్రాలతోపాటు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నాం. వీటిని విశ్లేషించే పని చురుగ్గా సాగుతోంది’అని సీబీఐ ప్రతినిధి తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, పుణే, లాతూర్, అహల్యానగర్లలో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఇలా ఉండగా, సోమవారం శివరాజ్ రఘునాథ్ మొటెగావొంకర్ను సీబీఐ అధికారులు ఢిల్లీలోని కోర్టులో హాజరుపర్చారు. ఇతర ఆధారాలతోపాటు నీట్ పేపర్లోని ప్రశ్నలను తన కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు వెల్లడిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను కూడా చూపారు. దీంతో, ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి అజయ్ గుప్తా అతడిని 9 రోజుల సీబీఐ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. -
కనీసం.. సారీ చెప్పాలని అనిపించలేదా?
నీట్–యూజీ అనేది ఐదో తరగతి లేదా పదో తరగతి వంటి సాధారణ పరీక్ష కానేకాదు. ఉన్నత చదువుల భవితవ్యాన్ని నిర్దేశించే అత్యంత కీలక ప్రవేశ పరీక్ష. దాని కోసం లక్షలాది మంది విద్యార్థులు నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివి సంసిద్ధమవుతారు. శాయశక్తులా కృషిచేసి పరీక్షరాశాక వారం పది రోజులకే అది రద్దయిందని ప్రకటిస్తే అన్ని రోజులు పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే. అలా పన్నీరుగా మారుతున్న పరీక్షార్థుల శ్రమ నుంచే ఆగ్రహాగ్ని పుట్టింది. నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉండిపోయిన ఈ పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నిస్తూ నీట్–యూజీ అభ్యర్థిని ఆద్రికా బాజ్పేయీ ఎన్టీఏకు ఒక లేఖ రాశారు. ఇప్పుడా లేఖ ఆన్లైన్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ లేఖ పూర్తిపాఠం ఇదీ.. ‘‘నాకు 18 ఏళ్లు. ఈఏడాది నీట్–యూజీ పరీక్షను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాశా. 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచే దీని కోసం ప్రిపరేషన్ మొదలెట్టా. సోషల్మీడియా ఖాతాల జోలికి పోలేదు. స్నేహితులతో కబుర్లు కట్టిపెట్టా. బంధువుల పార్టీలకు వెళ్లడం మానేశా. నీట్పరీక్షపైనే పూర్తిగా దృష్టిపెట్టి తోబుట్టువులతోనూ పెద్దగా మాట్లాడటం మానేశా. ఇన్ని త్యాగాలు ఎందుకు చేశానో తెలుసా. డాక్టర్ కావడం నా కల. వైద్యవృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నా. పరీక్ష దగ్గరపడుతున్న కొద్దీ నాలో ఆందోళన ఎగసింది. పరీక్షకు పది రోజుల ముందు ఎన్టీఏ ఒక హెచ్చరిక చేసింది. ఇది స్కూల్ పరీక్షవంటి ఆషామాషీ పరీక్షకాదు జాతీయస్థాయిలో అభ్యర్థులను వడబోసే భారీ క్రతువు అని ప్రకటించింది. నీట్–యూజీ అనేది స్కూల్పరీక్ష కాదు. కనీసం స్కూల్లో ప్రశ్నపత్రం లీకేజీ అనేది ఎక్కడా వినలేదు చూడలేదు. మాకు మాత్రం మీరు సుద్దులు చెబుతారు. అంకితభావంలో మేం మీకంటే 10 రెట్లు ఎక్కువ అని బీరాలు పలికారు. ఇది నిజంగా మీరు సిగ్గుపడాల్సిన విషయం. పరీక్షకేంద్రంలోకి అడుగుపెట్టేముందు మమ్మల్ని పలు రకాలుగా చెక్చేస్తారు. ఆ డ్రెస్ రకం అనుమతిలేదు ఈ షూ వేసుకోవద్దు ఈ హెయిర్బ్యాండ్, స్మార్ట్వాచ్ పెట్టుకోవద్దు అని సవాలక్ష షరతులు పెడతారు. జుట్టు ముడివేసుకుని అంతా విప్పేసి వేళ్లు దూర్చి మరీ చెక్చేశారు. టీ–షర్ట్ బటన్లనూ కత్తిరించారు, ప్యాంట్లకున్న జేబులనూ కత్తిరించారు. ఇక పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సంగతి చెప్పనక్కర్లేదు. ఎగ్జామ్హాల్లోకి కనీసం ట్రాన్స్పరెంట్గా ఉండే నీళ్లసీసాను కూడా అనుమతించలేదు. మేమేమైనా పేపర్ లీక్ చేసే ముఠా సభ్యులమా? మా కలలను సాకారం చేసుకునేందుకు మీరు పెట్టే ఇలాంటి ఎన్నో కండీషన్లనూ మేం భరించాం. అయినా ఇంతటి తనిఖీలుచూశాక ఇక పేపర్ లీక్ కాదు అనే భరోసాతో పరీక్ష హాల్లోకి వెళ్లా. ఇంతాచేసి అక్కడికెళ్లాక మేం ఎగ్జామ్లో ప్రశ్నలతో కంటే బయటి వ్యవస్థతోనే అతిపెద్ద యుద్ధం చేయాల్సి వస్తోంది. వ్యవస్థలో ఒకరిద్దరు తప్పుచేసినా మొత్తం ఎగ్జామినేషన్ వ్యవస్థ అభాసుపాలవుతోంది. ఇక్కడితో ఇది ఆగట్లేదు. ఎన్టీఏను ట్విట్టర్ ఖాతాలో లక్షలాది మంది విద్యార్థులు అడిగే సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తోంది. అయినాసరే కనీసం ఈసారి అయినా ఇలా జరగదేమోననే ఆశతో పరీక్షరాశా. మళ్లీ మా నమ్మకాన్ని ఎన్టీఏ వమ్ముచేసింది. జాగ్రత్తలో మాకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదువుకున్నామని చెప్పే ఎన్టీఏ ఇప్పుడు మమ్మల్ని నిరాశ లోయలో నెట్టేసి చేతులు దులిపేసుకుంటోంది. అయినాసరే వీటన్నింటినీ భరిస్తూ మేం మరోసారి పుస్తకాల పురుగులుగా మారేందుకు సిద్ధపడతాం. మా కలల సాకారం కోసం కష్టపడక తప్పదు. కానీ తప్పుచేసిన మీకు కనీసం సారీ అయినా చెప్పాలని అనిపించలేదా? ఇంత జరిగాక కూడా అభ్యర్థులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలనే స్పృహ మీకు ఎప్పుడొస్తుంది? జాతీయస్థాయిలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఇలాంటి పరీక్షపేపర్ లీక్ అయితే బాధ్యతాయుత స్థాయిలో ఉన్న మీ నుంచి మేం సారీ ఆశించకూడదా?. మాకెన్ని కలలున్నాయో మీరు కనీసం ఒక్కసారైనా ఊహించారా? పరీక్ష పూర్తయ్యాక తోబుట్టువులతో హాయిగా ఉండొచ్చని సంబరపడ్డాం. రెండ్రోజుల్లోనే ఆకాశం విరిగిపడినట్లు దుర్వార్త మోసుకొచ్చారు. మళ్లీ పరీక్ష పెడతారని తెల్సిన క్షణాన వరదలో ఇల్లు మొత్తం కొట్టుకుపోయినంత విషాదం మాలో అలుముకుంది. మా డాక్టర్ కలల సౌధాన్ని కూల్చేశారు. అప్పుడు 11 ఏళ్ల నా చెల్లి నాతో ఒకమాట చెప్పింది. ‘‘అక్కా అతిగా ఆశలుపెట్టుకోకు. దేశంలో మన భవిష్యత్తు గురించి ఎవరికీ పట్టదు’’అన్న మాటలు నా మనసుని మెలిపెట్టాయి. చెల్లి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు. ఇంత జరిగినా వ్యవస్థ మనతోనే ఉంది అని చెల్లికి ఎలా భరోసా ఇవ్వాలి? ఇలాంటి వ్యవస్థలో మేం బాధితులుగా మిగిలిపోవాల్సిందేనా? అభద్రతాభావం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. భారత్లో ఉన్నత విద్యనభ్యసించడం తమకు ఇష్టంలేదు అని తోబుట్టువులు చెప్పారు. ఇలాంటి తరుణంలో ‘ఈ దేశంలో ఉన్నందుకు మేమెంతో గర్విస్తున్నాం’అని ఎలా చెప్పగలను? ఒకవేళ సరిహద్దు కంచెలు లేకపోయినాసరే నేను ఈ దేశంలోనే ఉండిపోతా అని చెప్పగలనా?. చెప్పలేనేమో. ఎందుకంటే నిబంధనలు అనేవి కాగితం పులులుగా మారిపోయాయి. మీపట్ల మా నమ్మకం ప్రతిసారీ వమ్ము అవుతోంది. కష్టపడి చదివిన చదువుకు, ప్రిపరేషన్కు విలువ ఉన్న చోటే ఉండాలనుకుంటున్నాను. ఇట్లు, ఎంతో అసంతృప్తి చెందిన మీ పరీక్షార్థి’’.–సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక్కో స్టూడెంట్ నుంచి 30 లక్షలు.. NEET కేసులో దిమ్మతిరిగే నిజాలు
-
ఎన్టీఏలో మార్పులు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఉదంతం నేపథ్యంలో కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో మార్పులు చేపట్టింది. తాజాగా ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు జాయింట్ డైరెక్టర్లను నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. సంయుక్త కార్యదర్శులుగా 1998 బ్యాచ్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అధికారి అనూజా బాపట్తోపాటు 2004 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి రుచితా విజ్ను సిబ్బంది వ్యవహారాల శాఖ నియమించింది. అదేవిధంగా, జాయింట్ డైరెక్టర్లుగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఆకాశ్ జైన్ను, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి ఆదిత్య రాజేంద్ర భోజ్గాధియాను నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. వీరి పదవీ కాలం ఐదేళ్లని అందులో పేర్కొంది. -
ప్రధాన్ను బర్తరఫ్ చేయండి
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఉదంతం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని, లేదా ఈ వైఫల్యానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని ప్రదాని మోదీని శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ కుమ్మక్కై దేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయని, ఫలితంగా 22 లక్షల మంది నీట్ అభ్యర్థుల ఆకాంక్షలు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్కు రెండు రోజుల ముందుగానే వాట్సాప్లో ప్రశ్నపత్రం లీకైన విషయం దేశం యావత్తూ తెలిసిపోయింది. ఈ విషయంలో తానేమీ చేయలేనని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీల కట్టడికి పార్లమెంట్ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ కమిటీలో ఉండటమే ఇందుకు కారణం’అని రాహుల్ ఎక్స్లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ‘దేశం మూలాలపైనే మీ ప్రభుత్వం దెబ్బకొట్టింది. కేవలం డబ్బు సంపాదన కోసమే విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, ప్రొఫెసర్ల పదవుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబం«దీకులను కూర్చోబెట్టారు. ఇదో పెద్ద అక్రమ కూటమి’అని రాహుల్ ఆరోపించారు. ఈ కూటమి దేశ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందన్నారు. ‘ఓ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ అవ్వాలంటే కావాల్సింది పరిజ్ఞానం అనుభవం కాదు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తి అయి ఉంటే చాలు. ఈ విషయం దేశంలో అందరికీ తెలుసు’అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా లేని వారు వైస్ చాన్స్లర్ అయ్యే అవకాశమేలేదన్నారు. అందుకే, ఇప్పటి వరకు కనీసం 80సార్లు పరీక్ష పేర్లు లీకై, 2 కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆరోపించారు. -
నీట్ అవకతవకలపై ప్రధానికి కేతిరెడ్డి లేఖ
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన నీట్ (యూజీ) పరీక్ష అవకతవకల అంశంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్ష రద్దులు, పునఃపరీక్షల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమైన విద్యార్థులు పరీక్ష అనంతరం ఎదురైన వివాదాల వల్ల నిరాశ, ఆందోళనకు లోనవుతున్నారని తెలిపారు.దేశంలోని అనేక మంది విద్యార్థులు కోచింగ్, ప్రయాణం, వసతి కోసం భారీగా ఖర్చు పెట్టి పరీక్షలకు హాజరయ్యారని, ఇప్పుడు మళ్లీ అదే పరీక్షా ప్రక్రియను ఎదుర్కోవాల్సి రావడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించే ముందు పరీక్షా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, భద్రంగా, బాధ్యతాయుతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ ఏడాది ఏర్పడిన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కనీసం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే అయినా 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య విద్య ప్రవేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. -
‘నీట్’ మరో మాస్టర్మైండ్ మనీషా అరెస్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్–యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో మరో పెద్ద తలకాయను పోలీసులు అరెస్ట్చేశారు. జీవశాస్త్ర అధ్యాపకురాలిగా కొనసాగుతూ నీట్–యూజీకి సంబంధించిన నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్టీఏ) వారి పేపర్ సెట్టింట్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న పుణెకు చెందిన మనీషా గురునాథ్ మంధరేను సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్చేశారు. ఇప్పటికే అరెస్టయిన మరో మాస్టర్మైండ్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు పీవీ కులకర్ణిని లోతుగా ప్రశ్నించడంతో ఈమె పేరు బయటపెట్టాడని పోలీసు అధికారులు తెలిపారు. బయాలజీ పేపర్ లీకేజీకి ఈమె ప్రధాన కారకురాలు అని సీబీఐ పేర్కొంది. మనీషాను ఢిల్లీకి తీసుకొచ్చి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విచారించి, ఆమె నేరాన్ని నిర్ధారించుకున్నాక అరెస్ట్చేశారు. నీట్–యూజీ పరీక్ష ప్రక్రియలో ఈమె భాగస్వామిగా ఉన్నారు. ఈమెను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా గతంలో ఎన్టీఏ నియమించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉండటంతో ఈమె బాటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలను నేరుగా పరిశీలించే అధికారం పొందారు. ఆ అధికారాన్ని దురి్వనియోగంచేసినట్లు తేలింది. ఈ ప్రశ్నలను తనకు లక్షల రూపాయలు చెల్లించిన కొద్దిమంది నీట్–యూజీ అభ్యర్థులకు చేరవేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఎవరీ మనీషా? మహారాష్ట్రకు చెందిన మనీషా వృత్తిరీత్యా బాటనీ లెక్చరర్. పుణెలోని మోడ్రన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఐదారేళ్లుగా ఎన్టీఏలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది నీట్–యూజీ ప్రవేశపరీక్షకు సంబంధించి బాటనీ, జువాలజీ విభాగంలో రావాల్సిన ప్రశ్నల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నారు. ఆయా ప్రశ్నపత్రాల తుదిరూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఇటు జాతీయస్థాయి సంస్థలో కీలకభూమిక పోషిస్తూనే పుణె కాలేజీతో సత్సంబంధాలు కొనసాగించడం గమనార్హం. రహస్యంగా ఉంచాల్సిన క్వశ్చన్ పేపర్లను తరచిచూసే సర్వాధికారం ఉండటంతో వాటిని ఈమె తస్కరించారు. ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థుల జాబితాను వాఘ్మరే అనే మరో నిందితుని ద్వారా తెప్పించుకుని వాళ్లకు ప్రశ్నలు, వాటి ఆప్షన్లను పుణెలోని సొంతింట్లో ప్రత్యేక కోచింగ్ క్లాసులపేరిట అందజేశారు. వాఘ్మరేను నాలుగు రోజుల క్రితమే సీబీఐ అరెస్ట్చేయడం తెల్సిందే. ఈ బాటనీ, జువాలజీ ప్రశ్నలు, వాటి ఆప్షన్లు, జవాబులు అచ్చుగుద్దినట్లుగా 2026 నీట్–యూజీ ఎంట్రన్స్ బయాలజీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలాయని సీబీఐ వెల్లడించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో అంతర్గత వ్యక్తులు మొదలు మధ్యవర్తులు, అభ్యర్థుల దాకా అన్ని స్థాయిలో పకడ్బందీ నెట్వర్క్ ద్వారా ప్రశ్నపత్రాలను లీక్చేశారు. కులకర్ణి, వాఘ్మరేలను 10 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తుర్వులిచ్చింది. వేట వేగవంతం ఈ ఉదంతంలో ఇంకెంత మంది సూత్రధారులు, పాత్రధారులు దాక్కున్నారనేది కనిపెట్టి సంకెళ్లు వేసేందుకు సీబీఐ విస్తృతస్థాయిలో దర్యాప్తును వేగవంతంచేసింది. గత 24 గంటల్లో ఆరు వేర్వేరు ప్రాంతాల్లో చాలా ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లను సీజ్చేసింది. డబ్బులు ఆన్లైన్లో లావాదేవీలు జరిగిన కొన్ని బ్యాంక్ ఖాతాల వివరాలు, నేరపూరిత డాక్యుమెంట్లను సేకరించింది. వీటన్నింటీ మధ్య ఉన్న సంబంధాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. వాఘ్మరీ ద్వారానే ప్రశ్నలను కులకర్ణి ఇతర పరీక్షార్థులకు చేరవేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహల్యానగర్లలో మొత్తం 9 మందిని అరెస్ట్చేశారు. వాళ్ల జాబితా.. 1. మనీషా గురునాథ్(బాటనీ లెక్చరర్) 2. పీవీ కులకర్ణి( రసాయనశాస్త్ర అధ్యాపకుడు) 3. వాఘ్మరే(విద్యార్థులను పోగుచేసిన వ్యక్తి) 4. ధనంజయ్ లోఖండా(అహల్యానగర్వాసి) 5. శుభం ఖైర్నర్( నాసిక్ వాసి) 6. మంగీ లాల్ బివాల్( జైపూర్వాసి) 7. వికాస్ బిలాల్( జైపూర్వాసి) 8. దినేశ్ బిలాల్( జైపూర్వాసి) 9. యశ్ యాదవ్(గురుగ్రామ్వాసి) -
ఢిల్లీలో నీట్ అభ్యర్థిని బలవన్మరణం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆజాద్పూర్కు చెందిన నీట్ అభ్యర్థిని(26) ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. కొన్నేళ్లుగా నీట్ కోసం సిద్ధమవుతున్న ఆమె పరీక్ష రద్దుతో మనస్తాపంతో గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె వద్ద ఎలాంటి సూసైట్ నోట్ లభ్యం కాలేదని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గురువారం సాయంత్రం కుటుంబసభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియలు జరిపేందుకు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో, పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, పోస్టు మార్టం చేయించారు. ఉరి వేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నీట్ పేపర్ లీకేజీ కేసులో కింగ్పిన్ అరెస్ట్
న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ వెనుక మాస్టర్ మైండ్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నీట్ పేపర్ తయారీలో కీలక పాత్ర పోషించిన పూణేకి చెందిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణీని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లోనే ఇనిస్టిట్యూట్ నడుపుతున్న పీవీ కులకర్ణి .. ఎన్టీఏ ఏర్పాటు చేసిన క్వశ్చన్ పేపర్ కమిటీలో సబ్జెట్ ఎక్స్పర్ట్గా ఉన్నారు. నీట్ ఎగ్జామ్కు ముందే క్వశ్చన్ పేపర్ ఆయనకు అందింది. ఆ క్వశ్చన్ పేపర్ను తాను ఇంట్లో నడిపే ఇనిస్ట్యూట్ విద్యార్థికి లీక్ చేశాడు. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి సమాధానాలను కాపీ చేసి గుర్తుంచుకునేలా తన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఈ భారీ పేపర్ లీక్ నెట్వర్క్కు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.మరోవైపు నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుమని కేంద్రం ప్రకటించింది. పేపర్ లీకేజీ దుమారం తర్వాత ఈనెల 3వ తేదీనాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ అయ్యారు. -
నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాహుల్ రియాక్షన్
ఢిల్లీ: నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘నేను ఇకపై పోటీ పరీక్షలు రాయను అంటూ లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల హృతిక్ మిశ్రా పలికిన చివరి మాటలు ఇవి. మూడోసారి నీట్ పరీక్ష రాస్తున్న ఆ విద్యార్థి పరీక్ష రద్దు కావడంతో తీవ్రంగా కుంగిపోయాడు. గోవాలో కూడా నీట్ పరీక్ష రాసిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పిల్లలు పరీక్ష చేతిలో ఓడిపోలేదు.. అవినీతి వ్యవస్థ చేతిలో హతమయ్యారు. ఇది ఆత్మహత్య కాదు.. వ్యవస్థ చేసిన హత్య’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘2015 నుండి 2026 వరకు 148 పరీక్షల కుంభకోణాలు జరిగాయి. 87 పరీక్షలు రద్దు.. 9 కోట్ల మంది పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడింది. 148 కుంభకోణాలలో, కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే శిక్ష పడింది. సీబీఐ 17 కేసులు, ఈడీ 11 కేసులు తీసుకున్నాయి. ఎవరికీ శిక్ష పడలేదు. ఒక్క నీట్, ఏఐపీఎంటీ, ఇతర వైద్య పరీక్షలలోనే 15 కుంభకోణాలు జరిగాయి. అత్యంత సిగ్గుచేటైన విషయం ఏమిటంటే ఈ కుంభకోణాలకు బాధ్యులైన ఒక్క అధికారి గానీ, మంత్రి గానీ రాజీనామా చేయలేదు. వారిని తొలగించి, ఆ తర్వాత రహస్యంగా ఉన్నత పదవులలో తిరిగి నియమిస్తున్నారు’’ అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ నిలదీశారు.‘‘మోసానికి సహకరించేవారికి బహుమతులు లభిస్తుండగా.. పరీక్షలు రాసే పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మోదీ జీ.. మీలో జవాబుదారీతనం మేల్కొనడానికి ఇంకా ఎంతమంది హృతిక్లు కావాలి?. విద్యార్థుల బాధ నా బాధ. విద్యార్ధుల కష్టం నా కష్టం. విద్యార్ధుల భవిష్యత్తును దొంగిలించిన వారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎంత కాలం పట్టినా సరే.. ఎవరినీ వదిలిపెట్టం.. ఇది నా వాగ్దానం. ఈ యుద్ధాన్ని మనం కలిసి పోరాడదాం.. మనం గెలుస్తాం’’ అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.“अब नहीं देनी प्रतियोगी परीक्षा।”लखीमपुर खीरी के 21 साल के ऋतिक मिश्रा के ये आख़िरी शब्द थे। तीसरी बार NEET देने वाला यह बच्चा, परीक्षा रद्द होते ही टूट गया।गोवा में भी एक NEET अभ्यर्थी ने जान दे दी।ये बच्चे परीक्षा से नहीं हारे, इन्हें एक भ्रष्ट तंत्र ने मारा है।यह…— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2026 -
నీట్ పేపర్ లీకేజ్ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగీలాల్, దినేష్ బివాల్ సోదరులు గత సంవత్సరాలలో సైతం పరీక్ష పత్రాలు లీక్ చేశారని అధికారులు భావిస్తున్నారు. బివాల్ కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలకు పరీక్షకు ముందే నీట్ 2025 ప్రశ్నపత్రం అందినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాంగీలాల్ కుమారుడు వికాస్ బివాల్ ప్రస్తుతం సవాయ్ మాధోపూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. లీకైన పేపర్ను నెట్వర్క్లో ముందుకు విక్రయించడంలో ఇతని పాత్ర కూడా ఉందని సమాచారం. ఈ ప్రశ్నపత్రాన్ని ముందుగానే సేకరించి పంపిణీ చేయడానికి 65 లక్షల రూపాయలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.మహారాష్ట్రలో అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులు (ఒక మహిళతో సహా) అడ్మిషన్ కౌన్సెలర్ల ముఠాలో సభ్యులని, వీరు కూడా వైద్య నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వచ్చారని తేలింది. లీకైన పేపర్కు మూలకర్తగా గుర్తించిన శుభమ్ ఖైర్నార్ స్వయంగా మెడికల్ విద్యార్థని ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కుమారుడని అధికారులు గుర్తించారు. అయితే గతేడాది లీకైన నీట్ పేపర్ గుర్గావ్లో యష్ యాదవ్కు లీకైన పేపర్ను అందజేశాడని, అక్కడి నుండి యాదవ్ దానిని రాజస్థాన్కు చెందిన మాంగీలాల్ బివాల్కు పంపాడని సమాచారం. మాంగీలాల్ తన కుమారుడు వికాస్ బివాల్ తన మేనల్లుళ్ల కోసం ఈ పేపర్ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం రాకెట్ను కోచింగ్ మాఫియానే నడిపిస్తోందని, ఇప్పటి వరకు అరెస్టు అయిన వారు కేవలం ఒక పెద్ద నెట్వర్క్లో భాగం మాత్రమేనని దర్యాప్తు సంస్థలు నమ్ముతున్నాయి. సికార్లోని కోచింగ్ సెంటర్లు సైతం నిఘాలో ఉన్నాయి. బివాల్ కుటుంబం ఎవరి కోసం పనిచేస్తుందో ఆ ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నీట్ 2026 పేపర్ లీకేజీ కేసు ఏదో సాధారణ లీక్ కాదని, ఇది ఏళ్ల తరబడి వ్యవస్థీకృతంగా నడుస్తున్న నెట్వర్క్ అని అధికారులు భావిస్తున్నారు. పేపర్ లీక్ బయటపడిందిలారాజస్తాన్లోని జామ్వా రామ్గఢ్కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ పేపర్ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్లో నీట్కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్గఢ్ నుంచే పేపర్ సికార్లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్కు చేరింది. అతడు ఈ పేపర్ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యార్థికి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్లో హాస్టల్ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్ కుమార్ ఈ పేపర్ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
NEET పేపర్ లీక్ స్కామ్లో షాకింగ్ నిజాలు
-
నీట్ పరీక్ష..కొత్త తేదీలు ప్రకటన
పేపర్ లీక్ నిర్ధారణ కారణంగానే నీట్ పరీక్ష రద్దు చేశామని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తమకెంతో కీలకమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే రీ ఎగ్జామ్ పెట్టే నిర్ణయం తీసుకున్నాం. ప్రతిభ గల విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే పరీక్షను రద్దు చేశామని తెలిపారు.సీబీఐ ఈ అంశంపై విచారణ చేపడుతుంది త్వరలోనే లీకు మాఫియాను పట్టుకుంటుందని ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో మాల్ప్రాక్టిస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రీఎగ్జామ్కు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదన్నారు. జూన్ 14 లోపు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. గతంతో పోలిస్తే ఎగ్జామ్ సమయాన్ని 15 నిమిషాలు పెంచామన్నారు. కాగా కొద్ది సేపటి క్రితమే నీట్ ఎగ్జామ్ కొత్త తేదీలను NTA ప్రకటించింది. జూన్ 21వ తేదీన నీట్ యూజీ పరీక్ష ఉండనున్నట్లు తెలిపింది. ఈ నెల 3న జరగాల్సిన పరీక్ష పేపర్ లీక్ కారణాలతో రద్దైన నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించింది.దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షరద్దైంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జాతీయ పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను కాపాడటం, విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్షకు ముందే 410 ప్రశ్నలతో కూడిన ‘గెస్ పేపర్’కొందరు అభ్యర్థుల మధ్య సర్క్యులేట్ అయ్యిందని, అందులో 120 కెమిస్ట్రీ, 100కు పైగా బయాలజీ ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంతో యథాతథంగా సరిపోలాయన్న ప్రచారంతో ‘నీట్’ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్టీఏ పేర్కొంది. ఈ నెల 3న భారత్తోపాటు విదేశాల్లో జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షను 22.79 లక్షల మంది రాశారు. ఈ నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించింది. -
నీట్ పేపర్ లీక్పై సీఎం రేవంత్రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై సీఎం రేవంత్రెడ్డి ఎక్స్లో స్పందించారు. నీట్ పేపర్ లీక్తో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టారని.. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర ఆందోళనలొ ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. మే 3న జరిగిన నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. పేపర్ లీక్, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘కేంద్ర ప్రభుత్వం పారదర్శక దర్యాప్తు చేపట్టాలి. వ్యవస్థ వైఫల్యాలతో అమాయక విద్యార్థులు నష్టపోకూడదు. పోటీ పరీక్షలు అవకాశాలకు మార్గం కావాలి గానీ భయానికి కాదు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని రేవంత్ ట్వీట్ చేశారు. -
డౌట్ లేకుండా నీట్ ఉండదా?
జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్తో సహా మరో పది కోర్సుల్లో చేరేందుకు ప్రవేశార్హతను నిర్ణయించే నీట్ యూజీ పరీక్ష, ఈ ఏడాది ప్రశ్నపత్రం లీక్ అయిన కారణంగా రద్దు కావడం గర్హనీయం. 23 లక్షల మంది విద్యార్థులు, రెండున్నర లక్షల సీట్ల కోసం పోటీ పడిన ఈ పరీక్ష ఉన్నఫళంగా రద్దు కావడం, మళ్లీ రాయాల్సి రావడం వారికీ, వారి కుటుంబాలకూ ఆర్థికంగా, భావోద్వేగపరంగా ఎంతో భారం.దేశంలో వైద్య, ఇంజినీరింగ్ కోర్సులకు ఉన్న విపరీతమైన డిమాండ్ను సొమ్ము చేసుకునేలా ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటివల్ల విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా, వారి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పడం లేదు. ఇన్ని కష్టాల మధ్య రాసిన పరీక్ష కూడా రద్దు కావడం వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టం వర్ణనాతీతం.ఈ పరీక్షను అన్ని రాష్ట్రాలకూ ఉమ్మడిగా నిర్వహించే విధానం 2013లో మొదలైంది. ఆ తర్వాత 2019లో దీని నిర్వహణ బాధ్యతల కోసం ప్రభుత్వం ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ)ని స్థాపించింది. కానీ, ఏ సంవత్సరం కూడా ఈ పరీక్షల నిర్వహణ వివాదరహితంగా జరగలేదు. 2024లో కూడా తొలుత పరిమిత సంఖ్యలో పరీక్షను పాక్షికంగా రద్దు చేసి, మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. అయితే, ఇలా పరీక్షను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఇదే మొదటిసారి.ప్రపంచంలోనే ఒక దేశంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే అతి పెద్ద పరీక్ష ‘నీట్’. అందుకు తగ్గట్టుగా లోపరహితమైన వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. పరీక్షను పూర్తిగా ఆన్లైన్ విధానంలో కానీ లేదా హైబ్రిడ్ విధానంలో కానీ నిర్వహిస్తే కొన్ని లొసుగులను అధిగమించవచ్చని నిపుణులు సలహాలిచ్చారు. అయినా ఆ దిశగా చర్యలు లేవు. లక్షలాది విద్యార్థుల భవి ష్యత్తును, వారి కుటుంబాల ఆర్థిక స్థితిని ఒక్క పెట్టున మార్చగలిగే కీలకమైన పరీక్షను సరిగ్గా నిర్వహించలేకపోవడం దేశానికి సిగ్గుచేటు, ఒక సామాజిక నేరం. ఇప్పుడు ఈ రద్దుపై దర్యాప్తు జరగనుంది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.చదవండి: నీట్ పేపర్ లీక్.. సంచలన విషయాలువ్యవస్థలో దిద్దుబాట్లు జరిగి, లోపరహితమైన, మేలైన పరీక్షా విధానం అమలులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి. నీట్ పరీక్షా కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపడం గొప్పతనం కాదు. ఒక్క లోపమూ లేకుండా, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా పరీక్షను పక్కాగా నిర్వహించడమే అసలైన గొప్పతనం. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయాలి. నీట్ పరీక్షను ‘నీట్’గా నిర్వహించాలి, ‘డౌట్’గా కాదు.– డాక్టర్ డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ -
NEET మళ్లీ ఎప్పుడు?
-
NEET పరీక్షకు 45 గంటల ముందు కొంపముంచిన టెలిగ్రామ్.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు..
-
సీబీఐ కస్టడీకి నీట్ లీక్ సూత్రధారి
న్యూఢిల్లీ: నీట్(యూజీ)–2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జైపూర్లో మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేశ్ బివాల్ను, గురుగ్రామ్లో యశ్ యాదవ్ను, నాసిక్లో శుభమ్ ఖైర్నార్ను అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం చెప్పారు. వేర్వేరు ప్రాంతాల్లో మరికొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, వారిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. పేపర్ లీకేజీ వెనుక మాస్టర్మైండ్గా భావిస్తున్న 30 ఏళ్ల శుభమ్ ఖైర్నార్ను నాసిక్ నుంచి ఢిల్లీకి తరలించారు. అంతకుముందు నాసిక్ మేజి్రస్టేట్ కోర్టు అతడిని సీబీఐ ట్రాన్సిట్ రిమాండ్కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం శుభమ్ ఖైర్నార్ను ప్రశ్నిస్తున్నారు. రాజస్తాన్ పోలీసుల సూచన మేరకు నాసిక్ పోలీసులు మంగళవారం ఖైర్నార్ను అరెస్టు చేశారు. సోదాల్లో భాగంగా అనుమానితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు సహా పలు డిజిటల్ పరికరాలను సీబీఐ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించనున్నారు. వాటిలోని మెసేజ్ యాప్లను క్షుణ్నంగా తనికీ చేయబోతున్నారు. పేపర్ లీక్ కేసులో సమగ్రమైన, నిష్పక్షపాతమైన దర్యాప్తు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్లు అధికార వర్గాలు స్పష్టంచేశాయి. రద్దు చేసిన నీట్(యూజీ) పరీక్షకు సంబంధించిన పత్రాలను సేకరించేందుకు బుధవారం సీబీఐ అధికారులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పరీక్షల ప్రక్రియలో పాలుపంచుకున్న సిబ్బందితో మాట్లాడారు. గురుగ్రామ్ డాక్టర్ ద్వారా రాజస్తాన్ సోదరులకు.. నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్తాన్లోని జామ్వా రామ్గఢ్కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ పేపర్ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్లో నీట్కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్గఢ్ నుంచే పేపర్ సికార్లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్కు చేరింది. అతడు ఈ పేపర్ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యారి్థకి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్లో హాస్టల్ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్ కుమార్ ఈ పేపర్ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పేపర్ లీక్కు సంబంధించి రాజస్తాన్ పోలీసులు 150 మంది అభ్యర్థులను ప్రశ్నించారు. ఇందులో కోచింగ్ సెంటర్ల పాత్ర ఇప్పటిదాకా బయటపడలేదని పేర్కొన్నారు. నిందితుడు బీజేపీ సభ్యుడే: కాంగ్రెస్ రాజస్తాన్లో అనుమానితుల అరెస్టు వ్యవహారం రాజకీయంగా దుమారం సృష్టిస్తోంది. నిందితుల్లో ఒకరికి అధికార బీజేపీతో సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. అరెస్టయిన దినేశ్ బివాల్ బీజేపీ సభ్యుడేనని బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ను కూడా షేర్ చేశారు. అందులో దినేశ్ బివాల్ బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, అశోక్ గహ్లోత్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. దినేశ్ బివాల్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. -
నీట్ నిందితులతో బీజేపీ నేతల ఫొటోలు లీక్.. కలకలం..
నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితులకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. అక్రమంగా కోట్ల రూపాయల డబ్బు సంపాదించడం కోసం లక్షలాది మంది అమాయక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇండియా టుడేలో వచ్చిన ఓ క్లిప్ను ఆయన పోస్ట్ చేశారు.So, it seems that the NEET paper leak accused is closely associated to the BJP! They are playing with the lives of millions of innocent students for dirty money! pic.twitter.com/PPYhbPWmFb— Prashant Bhushan (@pbhushan1) May 13, 2026దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ‘‘నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ నిందితుడు దినేశ్ బిన్వాల్తో రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్, బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర, పలువురు బీజేపీ నాయకుల ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇది ప్రశ్నపత్రం లీక్ రాకెట్లో బీజేపీ ఎంతగా భాగస్వామ్యమైందో స్పష్టంగా చూపిస్తోంది. ప్రశ్నపత్రం లీక్ మాఫియాకు రక్షకుడిగా బీజజేపీ వ్యవహరిస్తోందని తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, కలలు, భావోద్వేగాలతో బీజేపీ ఆటలాడుతోంది. ఈ ప్రశ్నపత్రం లీక్ మోసాల వల్ల అమాయక విద్యార్థులు ఇంకా ఎంతకాలం బాధపడాలి?’’ అని నిలదీసింది.రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్తో నీట్ లీక్ నిందితుడి ఫొటోలు బయటకు వచ్చాయంటూ ఇండియా టుడేలో వచ్చిన వార్తకు సంబంధించిన క్లిప్ను కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మహేంద్రతో కూడా నిందితుడి ఫొటో కనిపించిందని క్లిప్లో ఇండియా టుడే తెలిపింది.ప్రస్తుతం దీనిపై పరిశీలన జరుగుతోంది. నీట్ లీక్ వ్యవహారంలో కీలక నిందితుల అరెస్టులు జరిగాయి. లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. వారు రూ.30 లక్షలకు లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వారిలో ఒకరి కుమారుడు నీట్ పరీక్ష రాస్తుండటంతో అతనికి ఆ ప్రశ్నపత్రం ఇచ్చారని అభియోగం ఉంది.అదే కాకుండా, ఆ లీకైన ప్రశ్నాపత్రాన్ని మరికొందరికీ అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లీక్ ఈ ఏడాదికే పరిమితం కాదని, 2025లో కూడా జరిగిందని సంచలన ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే నిందితుల కుటుంబానికి చెందిన నలుగురు 2025లో నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని వారు వెల్లడించారు. అరెస్టైన నిందితులకు రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.మంగీలాల్, దినేష్ ఫొటోలను ఇండియా టుడే సేకరించింది. వీరే నీట్ 2026 లీకైన ప్రశ్నపత్రం వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే 2025లో కూడా ప్రశ్నపత్రం ఎలా లీకైందన్న విషయంపై సంచలన వివరాలు బయటకు వచ్చాయి. గురుగ్రామ్కు చెందిన ఓ వైద్యుడి నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా 700 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రం పంపినట్టు సమాచారం. Photos of NEET Exam paper leak accused Dinesh Binwal with Rajasthan Education Minister Madan Dilawar, BJP MLA Mahendra and several BJP leaders have now surfaced publicly.This clearly shows how deeply the BJP is involved in the paper leak racket, not as a silent spectator, but… pic.twitter.com/cP9LTwGTxF— Congress (@INCIndia) May 13, 2026 -
కేంద్రానికి సీఎం విజయ్ రిక్వెస్ట్.. ఎందుకంటే?
చెన్నై: నీట్ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజ్ఞప్తి చేశారు. నీట్-యూజీ (NEET-UG) 2026 రద్దు, పరిణామాల నేపథ్యంలో ఈ పరీక్షా విధానంలోని నిర్మాణాత్మక లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు.12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవల పేపర్ లీక్ జాతీయ స్థాయి పరీక్షా విధానంలోని లోపాలను బయటపెట్టిందని.. ఇది లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఆశలను అడియాశలు చేసిందన్నారు. నీట్ పరీక్ష గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి, తమిళ మీడియం విద్యార్థులకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ (CBI) విచారిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా సిబిఐ ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పరీక్షల పారదర్శకతను పునరుద్ధరించడానికి ఎన్టీఏ స్థానంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని 'ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దర్యాప్తు ప్రకారం.. సిక్కర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి ద్వారా ఈ పేపర్ లీక్ మూలాలు కేరళ వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాలన్నీ సుమారు 22 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయి. -
నీట్ పేపర్ లీక్.. సంచలన విషయాలు
నాసిక్: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) పేపర్ లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్తాన్ పోలీసులు అందించిన వివరాలు, సోషల్ మీడియాలో లభించిన సమాచారం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.నాసిక్ పోలీసుల ప్రకారం.. నాసిక్ జిల్లాలోని నందగావ్ ప్రాంత నివాసి అయిన నిందితుడు బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ డిగ్రీ కలిగివున్నాడు. తన స్నేహితులతో కలిసి నాసిక్లో ఒక మెడికల్ అడ్మిషన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని అతడు నడుపుతున్నాడు. నిందితుడు రూ. 10 లక్షలు చెల్లించి నీట్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వివిధ రాష్ట్రాల్లోని 10 మందికి ఒక్కో సెట్ను రూ. 15 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు కనుగొన్నారు.“మంగళవారం మధ్యాహ్నం నాసిక్లోని నందగావ్, ఇందిరా నగర్లో నిందితుడిని అరెస్టు చేశాం. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు తన వేషధారణ, కేశాలంకరణ మార్చుకున్నాడు. అతను లీకైన పేపర్ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసి, ఆ తర్వాత దానిని 10 సెట్లుగా తయారుచేసి, వైద్య ప్రవేశ కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఒక్కో సెట్ను రూ.15 లక్షలకు విక్రయించాడ''ని నాసిక్ పోలీసులు వెల్లడించారు. ఈ పేపర్ లీక్ నెట్వర్క్ రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిందని వారు తెలిపారు.ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్?కాగా, నాసిక్లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే నీట్ ప్రశ్నాపత్రం లీకయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లీక్ అయిన పేపర్ తొలుత రాజస్తాన్లోని జైపూర్కు, తర్వాత సికార్ పట్టణానికి, అక్కడి నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకు సోషల్ మీడియా వేదికల ద్వారా చేసినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాసిక్ ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించిన ఓ అనుమానిత వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నీట్ పేపర్ను చైన్ నెట్వర్క్ ద్వారా ఇతరులకు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.చదవండి: నీట్ పేపర్ లీకేజీ.. ఎలా బయటపడింది?గెస్ పేపర్ లేదు: డీఎస్పీనీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో 15 మంది వరకు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్లోనూ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిల్లో తమకు ఎలాంటి ప్రశ్నపత్రం గానీ, గెస్ పేపర్ గానీ లభించలేదని రాజ్గిర్ డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. కేవలం నగదు లావాదేవీలకు సంబంధించిన చాట్లు మాత్రమే బయటపడ్డాయని వెల్లడించారు. విద్యార్థి సంఘాల ఆందోళనలునీట్-యూజీ 20026 పరీక్ష లీకేజీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బుధవారం ఆందోళన చేపట్టాయి. కేరళంలోని పాలక్కాడ్, కన్నూరుయ ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి వారిని పోలీసులు నిలువరించడంతో తోపులాట చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్టీఏ డైరెక్టర్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్టీఏ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. -
రష్యాలో ఎంబీబీఎస్: 10 వేల సీట్లు.. ఫుల్ స్కాలర్షిప్స్!
కోయంబత్తూరు: డాక్టర్ కావాలనేది మీ లక్ష్యమా? అయితే మీకు ఒక అద్భుతమైన వార్త. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం రష్యా రెడ్ కార్పెట్ పరిచింది. వేలాది సీట్లు, ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు, అత్యంత తక్కువ ఫీజులతో 2026-27 విద్యా సంవత్సరానికి ఒక భారీ అవకాశాన్ని ముందుకు తెచ్చింది.కోయంబత్తూరులో రష్యన్ ఎడ్యుకేషన్ ఫెయిర్భారతీయ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక రష్యన్ ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఏకంగా 10,000 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించారు. దీనికి సంబంధించి మే 15న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో గల హోటల్ గ్రాండ్ రీజెంట్లో ‘ఆల్-ఇండియా రష్యన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026’ జరగనుంది. చెన్నై రష్యన్ హౌస్ డైరెక్టర్, వైస్ కాన్సుల్ అలెగ్జాండర్ డోడోనోవ్ మాట్లాడుతూ.. 60 ఏళ్లుగా భారతీయ విద్యార్థులకు రష్యా అత్యుత్తమ వైద్య విద్యను అందిస్తోందని, విదేశీ మెడికల్ ఎడ్యుకేషన్కు రష్యానే ఎప్పటికీ మొదటి ఛాయిస్ అని అన్నారు.ఫీజుల మోత లేదు... విరివిగా స్కాలర్షిప్లురష్యాలో వైద్య విద్యకు ప్రభుత్వ భారీ సబ్సిడీలు అందిస్తుండటంతో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. ఏడాదికి కేవలం రూ.3.5 లక్షలతో ప్రారంభమయ్యే అత్యంత తక్కువ ఫీజులతో ఇక్కడ చదువుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ఏడాది 200 మంది భారతీయ విద్యార్థులకు రష్యా ప్రభుత్వం బ్యాచిలర్, మాస్టర్, పీజీ ప్రోగ్రామ్ల కోసం 100 శాతం స్కాలర్షిప్లను అందించనుంది. ప్రస్తుతం రష్యాలోని సుమారు 30 యూనివర్సిటీల్లో 25,000 మంది భారతీయులు చదువుతున్నారు. అక్కడ ప్రదానం చేసే ఎండీ (ఎండీ)డిగ్రీ, భారతదేశంలోని ఎంబీబీఎస్ (ఎంబీబీఎస్)తో పూర్తిగా సమానం.అర్హతలు.. స్పాట్ అడ్మిషన్లుఈ కోర్సులు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంఎస్)తాజా నిబంధనలకు అనుగుణంగా పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కనీసం 50శాతం మార్కులతో ‘నీట్’ పాసైన వారు అర్హులు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ విద్యార్థులకు 40శాతం మార్కులు సరిపోతాయి. ఐఈఎల్టీఎస్ వంటి ఇతర ఎలాంటి ఇంగ్లీష్ ఎంట్రన్స్ టెస్ట్లు అవసరం లేదు. వోల్గోగ్రాడ్, కజాన్, పీరోగోవ్ తదితర ఏడు ప్రముఖ వర్సిటీలు పాల్గొంటున్న ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. అర్హులైన విద్యార్థులకు అక్కడికక్కడే స్పాట్ అడ్మిషన్లు లభిస్తాయి. -
NEET క్యూస్షన్ పేపర్ లీక్.. పేపర్ లీక్ వ్యవహారం..!
-
నీట్ పేపర్ లీక్: సుప్రీంకోర్టులో సంచలన పిటిషన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మే 3న జరిగిన ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్ష రద్దు కావడంతో దేశం ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని పూర్తిగా పక్కనబెట్టి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మళ్లీ పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని కోరుతూ ‘ఫైమా’ అత్యున్నత న్యాయస్థానంలో ఓ సంచలన పిటిషన్ దాఖలు చేసింది.ఎన్టీఏ రద్దు.. సిస్టమ్ ఫెయిల్యూర్ఇది కేవలం ఒక చిన్న పొరపాటు కాదని, ఎన్టీఏ వ్యవస్థాగత వైఫల్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇడియా మెడికల్ అసోసియేషన్( ఫైమా) తరపు న్యాయవాది తన్వీ దూబే పిటిషన్లో పేర్కొన్నారు. ఆ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన, స్వయంప్రతిపత్తి గల కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. దాదాపు ఒకేరకమైన పరిస్థితుల్లో 2024లోనూ ఇలాంటి లీక్ జరగడం ఎన్టీఏ అసమర్థతకు అద్దం పడుతోందని ఆరోపించారు.సీబీఐ దర్యాప్తు.. 30 లక్షలకు ప్రశ్నపత్రంవాట్సాప్, టెలిగ్రామ్ వేదికగా పరీక్షకు ముందే లీకైన ఈ పేపర్ కోసం బ్రోకర్లు అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజస్థాన్లోని సికార్కు చెందిన ఓ హాస్టల్ యజమాని ఇచ్చిన సమాచారంతో ఈ బాగోతం వెలుగుచూసింది. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి మొదలైన ఈ లీక్ స్కామ్పై ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగి మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో 15 మందిని అరెస్ట్ చేసింది. నాలుగు వారాల్లోగా సీబీఐ దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో స్పష్టం చేశారు.ఆన్లైన్ పరీక్ష.. పటిష్ట పర్యవేక్షణభవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా ఉండాలంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)విధానాన్ని తీసుకురావాలని ఫైమా సూచించింది. భౌతికంగా పేపర్లు చేతులు మారకుండా ప్రశ్నపత్రాలను డిజిటల్ లాకింగ్ చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఫోరెన్సిక్ సైంటిస్ట్తో కూడిన ఓ ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలోనే పారదర్శకంగా మళ్లీ నీట్-యూజీ 2026 పరీక్షను నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. #BreakingNewsNEET UGC 2026 leak: Petition filed to replace NTA, conduct re-exam under Supreme Court supervisionRead here: https://t.co/EizLO4NZxH pic.twitter.com/eOFFE2d7g2— Bar and Bench (@barandbench) May 13, 2026 -
NEET వివాదం: చైనా మోడల్తో ఏ లీకులు ఉండవ్!
భారతదేశపు పోటీ పరీక్షల్లో తరచూ పేపర్ లీకులు, అవకతవకలు వెలుగులోకి రావడం చూస్తున్నదే. తాజాగా నీట్-యూజీ 2026 రద్దు ఈ సమస్య తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది. అయితే.. విద్యార్థుల భవిష్యత్తు, వారి మనోధైర్యం దెబ్బతింటున్న ఈ పరిస్థితుల్లో కఠిన చర్యలపై దృష్టిసారించడం అవసరమని నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. చైనా మోడల్ తెర మీదకు తెచ్చారు. భారత్లో ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడాలంటే చైనా మాదిరి కఠిన చర్యలు అవసరమని ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ చెబుతున్నారు. ఈ మోడల్లో భాగంగా.. చైనా తన జాతీయ ప్రవేశ పరీక్ష గావ్కావో కోసం విస్తృతమైన చర్యలు తీసుకుందని.. అంతకంటే ముందు విద్యా సంస్కరణల్లో డబుల్ రిడక్షన్ విధానంతో సమూల మార్పులు చేసిందని గుర్తు చేస్తున్నారాయన. చైనా 2001లో తెచ్చిన ఈ విధానం (Double Reduction Policy) ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులపై ఉన్న అధిక హోంవర్క్ భారాన్ని తగ్గించడం. అలాగే ప్రైవేట్ ట్యూషన్ల ఒత్తిడిని తగ్గించడం, కుటుంబాల ఖర్చులను ఆదా చేయడం, పాఠశాల విద్యను అందరికీ సమానంగా అందించడం. ఇందులో భాగంగా ప్రైవేట్ ట్యూషన్లపై డ్రాగన్ కంట్రీ కఠిన నియంత్రణలు విధించింది. వారాంతాలు, సెలవుల్లో కోచింగ్ క్లాసులను నిషేధించింది. అదే సమయంలో.. అవకతవకలపై జరగకుండా కఠిన చర్యలు అవలంభించింది. ప్రశ్నాపత్రాల ముద్రణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అధునాతన భద్రతా సాంకేతికతలు పాటించింది. ఈ మధ్యకాలంలో ఏఐ ఆధారిత పర్యవేక్షణ అమలు చేసింది. ఆపై.. నకిలీ సీట్లు, అవకతవకల అడ్మిషన్లను అరికట్టేందుకు కఠిన పరిశీలన చేపట్టింది. సమాన అవకాశాల పేరిట గ్రామీణ, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోటాలు కల్పించింది.ఏంటీ గావ్కావో (Gaokao)? గావ్కావో అనేది చైనాలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(National College Entrance Examination). దానర్థం “ఉన్నత పరీక్ష”. ఇది చైనాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం తప్పనిసరి. 1952లో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ మొదటిసారి నిర్వహించారు. ప్రతీ ఏడాది జూన్లో ఈ పరీక్ష జరుగుతుంటుంది. 2025లో సుమారు 1.3 కోట్ల విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.ఈ ఎంట్రెన్స్లో ఒక్క మార్కు తేడా కూడా విద్యార్థి చేరే విశ్వవిద్యాలయాన్ని నిర్ణయిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక స్థానం అన్నీ ఈ పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే చైనా సమాజంలో గావ్కావోను “జీవితాన్ని తీర్చిదిద్దే పరీక్ష”గా భావిస్తుంటుంది. అందుకే కఠోర నియంత్రణలు, భద్రతా చర్యలు, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా చైనా ఈ పరీక్ష సమగ్రతను కాపాడుకుంటోంది. అయితే..అందుకే భారత్కు అవసరం!భారతదేశంలో చైనాలోలాగా ఒకే ఎంట్రెన్స్ ఉండదు. NEET, JEE ఇలా వివిధ రకాల పోటీ పరీక్షలు ఉంటాయి. ఇవి లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ పేపర్ లీకులు, “గెస్ పేపర్లు” వంటి అవకతవకలు ప్రజల నమ్మకాన్ని.. విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాయి. అందుకే చైనా మోడల్ను భారత్ ఓ పాఠంగా నేర్వాలని ఆనంద్ కుమార్ లాంటి వాళ్లు చెబుతున్నారు. మోషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు నితిన్ విజయ్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. చైనా మోడల్ చెప్పేది ఏంటంటే.. కఠిన నియంత్రణలు, పారదర్శకత, సమాన అవకాశాలు. ఇవి ఉంటేనే పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలుస్తుంది. చైనా మాదిరిగా భారత్లోనూ కోచింగ్ పరిశ్రమపై కఠిన నియంత్రణలు అవసరమని.. ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణలో అధునాతన సాంకేతికతలు వినియోగించాలని.. అదనంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నీట్ స్కామ్ @ 2026: తనిఖీల్లో చిక్కిన ‘సాల్వర్ గ్యాంగ్’
నలంద: వైద్య వృత్తిని చేపట్టాలనే కలలు కనే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న భారీ కుంభకోణం ఒకటి తాజాగా వెలుగుచూసింది. రాజస్థాన్ నీట్ పేపర్ లీక్ కలకలం సద్దుమణగక ముందే, బీహార్లోని నలందలో ఒక ‘నీట్ సాల్వర్ గ్యాంగ్’ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. రద్దయిన నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షకు ముందు పోలీసులు అత్యంత అప్రమత్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ దిగ్భ్రాంతికర ఉదంతం వెలుగుచూసింది.రెండు అనుమానాస్పద వాహనాలలో..మే 3న జరగాల్సిన నీట్ పరీక్ష నేపథ్యంలో నలంద జిల్లా అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజ్గిర్ డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా రాత్రింబవళ్లు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సాధారణ తనిఖీల్లోనే రెండు అనుమానాస్పద వాహనాలను గుర్తించిన పోలీసులు వాటిని అడ్డుకున్నారు. అందులో ఉన్నవారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో విచారణ చేపట్టారు.నగదుతో దొరికిన ఎంబీబీఎస్ విద్యార్థిపట్టుబడిన వారిలో ఒకరు తాను ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నానని పోలీసుల ముందు అంగీకరించాడు. అనుమానంతో పోలీసులు ఆ వాహనాల్లో సోదాలు నిర్వహించగా, కట్టల కొద్దీ నగదు బయటపడింది. ఆ డబ్బు గురించి ప్రశ్నించగా, అది మొత్తం రెండు లక్షల రూపాయలు ఉంటుందని నిందితులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆ రెండు వాహనాల్లో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.ఫోన్లలో నకిలీ అడ్మిట్ కార్డుల గుట్టుమరుసటి రోజు ఉదయం అరెస్ట్ అయిన ఆ ముగ్గురి మొబైల్ ఫోన్లను పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. ఈ డిజిటల్ దర్యాప్తులో నీట్ సహా పలు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన అనేక నకిలీ అడ్మిట్ కార్డులు బయటపడటం అందరినీ షాక్కు గురిచేసింది. దీనికి తోడు, ఈ భారీ రాకెట్కు సంబంధించిన అనేక ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఇతర కీలక ఆధారాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.ఇది కూడా చదవండి: మూడు రోజులు తిండి మానేస్తే ఏమవుతుంది? -
ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్?
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మహారాష్ట్రలోని నాసిక్లో ప్రశ్నపత్రాలను ముద్రించినట్లు సమాచారం. నేరుగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్ అయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. లీక్ అయిన పేపర్ తొలుత రాజస్తాన్లోని జైపూర్కు, తర్వాత సికార్ పట్టణానికి, అక్కడి నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకు సోషల్ మీడియా వేదికల ద్వారా చేసినట్లు అంచనా వేస్తున్నారు. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించిన ఓ వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నీట్ పేపర్ను చైన్ నెట్వర్క్ ద్వారా ఇతరులకు చేరవేసినట్లు తెలుస్తోంది.హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన ఓ డాక్టర్కు ఈ పేపర్ ఇలాగే చేరింది. రాజస్తాన్లోని జైపూర్కు చెందిన ఖతీక్ అనే వ్యక్తి ఆ డాక్టర్ దగ్గర ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. తర్వాత జైపూర్ నుంచి పేపర్ సికార్లోని రాకేశ్ కుమార్కు చేరింది. అతడు సికార్లోని ఒక కోచింగ్ సెంటర్ ఎదుట ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. సికార్లో నీట్ శిక్షణ పొందుతున్న కొందరు విద్యార్థులకు పేపర్ను విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. లీకైన పేపర్ అంచెలంచెలుగా ఢిల్లీ, జమ్మూకశ్మీర్, బిహార్, కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు విస్తరించింది. డబ్బులిచ్చినవారికి సోషల్ మీడియా ద్వారా పంపించారు. ఏమిటీ గెస్ పేపర్? గెస్ పేపర్ ముసుగులో ఎవరికీ అనుమానం రాకుండా అసలైన ప్రశ్నపత్రానికి మరికొన్ని కొన్ని ప్రశ్నలు కలిపి విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. గెస్ పేపర్ అంటే విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ట్యూటర్లు రూపొందించే ప్రశ్నలు. గత ఏడాది, అంతకుముందు ఏడాది పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా ఈ గెస్ పేపర్ రూపొందిస్తుంటారు. విద్యార్థులు తమ సన్నద్ధతను పరీక్షించుకోవడానికి గెస్ పేపర్లు సాధన చేస్తుంటారు.మే 3న నీట్ పరీక్ష జరగ్గా, 15 రోజుల ముందు లీకైన పేపర్ను విక్రయించడం ప్రారంభించారు. రూ.30 వేల నుంచి రూ.30 లక్షల దాకా అభ్యర్థులు వెచ్చించినట్లు ప్రచారం సాగుతోంది. రాజస్తాన్లోని నాగౌర్కు చెందిన ఓ విద్యార్థి పరీక్షకు నాలుగు రోజుల ముందు సికార్ టౌన్కు చేరుకున్నాడు. రూ.28 లక్షలు ఖర్చు చేసి, నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశాడు. అతడిని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ‘పేపర్ సిద్ధంగా ఉంది’అంటూ తనకు ఫోన్కాల్ వచ్చిందని అతడు పేర్కొన్నాడు. ఎలా బయటపడింది? పేపర్ లీక్ మాఫియా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తుంది. ఎక్కడా తమ గుట్టు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఈసారి అదృష్టం బాగాలేక అడ్డంగా దొరికిపోయారు. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్ రూ.30,000కు ‘గెస్ పేపర్’ను తనకు తెలిసిన సికార్ విద్యార్థికి విక్రయించాడు. ఈ విద్యార్థి దాన్ని సికార్లో హాస్టల్ను నడిపించే తన తండ్రికి చేరవేశాడు. ఆ తండ్రి తన హాస్టల్లో ఉంటున్న నీట్ విద్యార్థులకు ఆ పేపర్ను అందించాడు. మే 3న పరీక్ష ముగిసిన తర్వాత గెస్ పేపర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో చెప్పాలంటూ ఓ కోచింగ్ సెంటర్ లెక్చరర్ను కోరాడు. గెస్ పేపర్లో మొత్తం 281 ప్రశ్నలు ఉండగా, అందులో బయాలజీలో 90 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంలో అచ్చుగుద్దినట్లుగా వచ్చేశాయి. అంతేకాకుండా కెమిస్ట్రీకి సంబంధించిన 45 ప్రశ్నలు గెస్ పేపర్లో ఉన్నట్లు సరిగ్గా అదే వరుస క్రమంలో ఉన్నాయి. కనీసం కామాలు, ఫుల్స్టాప్ల్లోనూ మార్పుల్లేవు. దీనిపై అనుమానం వచ్చిన హాస్టల్ నిర్వాహకుడు తొలుత సికార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు.తప్పుడు ప్రచారం చేయొద్దంటూ మందలించారు. దాంతో అతడు ఎన్టీఏ అధికారులకు సమాచారం చేరవేశాడు. అనంతరం ఎన్టీఏ సిబ్బంది ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)తోపాటు రాజస్తాన్ పోలీసులను అప్రమత్తం చేశారు. రాజస్తాన్ ఎస్ఓజీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రాకేశ్ కుమార్ సహా దాదాపు 20 మందిని అరెస్టుచేశారు. జేఈఈ–నీట్ పరీక్షల కోచింగ్కు సికార్ ప్రసిద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. పేపర్ లీక్ అంశంలో మొత్తం నెట్వర్క్ను ఛేదించే పనిలో సీబీఐ నిమగ్నమైంది. -
‘నీట్’ పరీక్ష రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య అభ్యసించి, డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తూ జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఆశయంతో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)కు హాజరైన లక్షలాది మంది అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పిడుగులాంటి వార్త వినిపించింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షను రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. నీట్ ప్రశ్నపత్నం లీక్ అయినట్లు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జాతీయ పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను కాపాడటం, విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేసింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీబీఐని కేంద్రం ఆదేశించిందని, దర్యాప్తు సంస్థకు తమ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని, అవసరమైన రికార్డులు సమకూరుస్తామని ఎన్టీఏ స్పష్టంచేసింది. పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత.. అంటే మే 7న సాయంత్రం అవకతవకలకు సంబంధించిన సమాచారం ఎన్టీఏకు అందింది. స్వతంత్ర ధ్రువీకరణతోపాటు అవసరమైన చర్యల కోసం మే 8వ తేదీ ఉదయం కేంద్ర దర్యాప్తు సంస్థలకు నివేదించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడేందుకే.. పరీక్షకు ముందే 410 ప్రశ్నలతో కూడిన ‘గెస్ పేపర్’కొందరు అభ్యర్థుల మధ్య సర్క్యులేట్ అయ్యిందని, అందులో 120 కెమిస్ట్రీ, 100కు పైగా బయాలజీ ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంతో యథాతథంగా సరిపోలాయన్న ప్రచారంతో ‘నీట్’ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్టీఏ పేర్కొంది. ఈ నెల 3న భారత్తోపాటు విదేశాల్లో జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షను 22.79 లక్షల మంది రాశారు.పేపర్ లీకేజీతో వారంతా నిరాశకు గురయ్యారు. పరీక్ష మళ్లీ నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలియజేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల అభ్యర్థులకు, తల్లిదండ్రులకు అసౌకర్యం కలిగే మాట నిజమేనని ఎన్టీఏ అంగీకరించింది. కానీ, పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడేందుకు నీట్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ‘గెస్ పేపర్’కోసం రూ.30 లక్షలు ‘గెస్ పేపర్’కోసం ఒక్కో విద్యార్థి దాదాపు రూ.30 లక్షల చొప్పున వెచ్చించినట్లు తమ విచారణలో తేలిందని రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) ఏడీజీ విశాల్ బన్సాల్ మీడియాకు తెలిపారు. ఈ గెస్ పేపర్ పరీక్షకు 15 రోజుల ముందే అభ్యర్థులకు చేరిందన్నారు. డెహ్రాడూన్ నుంచి కేరళ మీదుగా సికార్కు చేరిన ఈ పేపర్ను ఒక్కో విద్యార్థి రూ.20 వేల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడిందన్నారు.పరీక్ష ముందు రాత్రి అంటే.. మే 2వ తేదీ రూ.30 వేలకు కూడా కాపీలు అమ్మినట్లు ఆధారాలు లభించాయని ఎన్టీఏకు, కేంద్ర పభుత్వానికి నివేదించారు. ఎస్ఓజీ దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో ఇప్పటివరకు మాస్టర్మైండ్ సహా 20 మందికి పైగా అదుపులోకి అనుమానితులను తీసుకున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీకేజీకి జైపూర్కు చెందిన మనీష్ అనే వ్యక్తిని మాస్టర్ మైండ్గా గుర్తించారు. రాజస్తాన్లో సికార్ పట్టణానికి చెందిన ఒక కోచింగ్ కెరీర్ కౌన్సెలర్ను అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ నీట్ పేపర్ లీక్ అంశం దేశవ్యాప్తంగా దుమారం సృష్టించింది. పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎన్టీఏ స్పందించి పరీక్షను రద్దు చేసింది. లీకేజీ వ్యవహారంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాజస్తాన్ పోలీసుల దర్యాప్తులో లభించిన వాట్సాప్ చాటింగ్లు, స్క్రీన్షాట్లు, బ్యాంక్ లావాదేవీల వివరాలు, యూపీఐ చెల్లింపులు, క్రిప్టో చెల్లింపులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పరీక్ష జరిగిన అన్ని సెంటర్ల సీసీటీవీ ఫుటేజీ, బయోమెట్రిక్ డేటాను సేకరించారు. ఆ డేటాను, ఆధారాలను రాజస్తాన్ పోలీసులు సీబీఐకి అప్పగించారు. నీట్(యూజీ) పేపర్ లీక్ అంశంపై సీబీఐ మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముఖం చాటేసిన విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనం వహించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, తప్పించుకుని కారెక్కి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో వ్యక్తి అరెస్టు నీట్ పేపర్ లీక్ అంశానికి సంబంధించి మహారాష్ట్రలోని నాసిక్లో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్తాన్ పోలీసులు అందించిన సమాచారం మేరకు అతడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడానికి రాజస్తాన్ పోలీసుల బృందం రానున్నట్లు పేర్కొన్నారు. సందేహాలు – సమాధానాలునీట్ రద్దు కావడంతో అభ్యర్థులు, తల్లిదండ్రుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిపై నీట్ వర్గాలు కొంత స్పష్టత ఇచ్చాయి. ⇒ మళ్లీ పరీక్ష ఎప్పుడు? నీట్ తేదీని ఇంకా ప్రకటించలేదు. ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదు.⇒ మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలా? అవసరం లేదు. ఇప్పటికే చేసుకున్న రిజిస్ట్రేషన్ డేటా, అభ్యర్థిత్వాన్ని త్వరలో మళ్లీ నిర్వహించే పరీక్షకు బదిలీ చేస్తారు.⇒ ఫీజు చెల్లింపు మాటేమిటి? ఈ ఏడాది నీట్ రాసిన అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయడానికి అదనంగా ఫీజులు చెల్లించాల్సిన పనిలేదు. గతంలో చెల్లించిన రుసుమును అభ్యర్థులకు తిరిగి(రీఫండ్) చెల్లిస్తారు. ⇒ అడ్మిట్ కార్డులు కొత్తగా ఇస్తారా? అవును. కొత్త అడ్మిట్ కార్డుల జారీపై త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తారు. ⇒ పరీక్షా కేంద్రాలను మారుస్తారా? మే 3న జరిగిన పరీక్షకు ఎంచుకున్న కేంద్రాలనే తిరిగి నిర్వహించే పరీక్షకు కూడా కొనసాగిస్తారు.పది రోజుల్లోగా షెడ్యూల్: ఎన్టీఏ డైరెక్టర్నీట్ పునఃపరీక్ష షెడ్యూల్ను రాబోయే 7 నుంచి 10 రోజుల్లోగా ప్రకటిస్తామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మంగళవారం తెలిపారు. అతి త్వరలో తన బృందంతో చర్చిస్తానని, పూర్తి పరీక్షల షెడ్యూల్, తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల విద్యా క్యాలెండర్, ప్రవేశాల షెడ్యూల్కు అంతరాయం కలగకుండా వీలైనంత తక్కువ సమయంలోనే పరీక్ష నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పారు. మరో వారం, పది రోజుల్లోగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. లీకేజీ ఘటన నిజంగా బాధాకరమని, ఇలాంటివి తక్షణమే ఆగిపోవాలని అభిషేక్ సింగ్ తేల్చిచెప్పారు. పేపర్ లీకేజీలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే మొత్తం వ్యవస్థకు ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. జరిగిన దానికి తాము బాధ్యత తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. నీట్కు ముందు విద్యార్థుల మధ్య పీడీఎఫ్ ఫార్మాట్లో సర్క్యులేట్ అయిన కొన్ని ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సరిపోలడంతో పరీక్షను రద్దు చేయాలని తాము సిఫార్సు చేశామని వివరించారు. మొత్తం పేపర్ లీక్ కాలేదని చెప్పారు. -
నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 15మంది అరెస్టయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు నాసిక్లో పేపర్ను ముద్రించినట్లు గుర్తించారు. పరీక్షకు 42గంటల ముందు పేపర్ లీక్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు రాజస్థాన్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SOG) దర్యాప్తులో బయటపడింది. కోచింగ్ సమయంలో విద్యార్థులు సౌలభ్యం కోసం తయారు చేసే గెస్ పేపర్లోని 120 ప్రశ్నలు.. నీట్ పరీక్షలోని అసలు ప్రశ్నాపత్రంతో సరిపోవడంతో లీకేజీ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో నీట్ యూజీ 2026 పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పరీక్షను రద్దు చేసి, రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.పేపర్ లీకేజీ కేసులో రాజస్థాన్ ఎస్వోజీ ఇద్దరిని మాస్టర్మైండ్స్గా అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర) లీక్ నెట్వర్క్పై విచారణ కొనసాగుతోంది.22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యారు. ఎన్టీఏ తెలిపిన ప్రకారం.. కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా రీ-ఎగ్జామ్ త్వరలో నిర్వహించనుంది. ఇప్పటికే చెల్లించిన ఫీజులు రిఫండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే పేపర్ లీకేజీతో విద్యార్థుల్లో అనిశ్చితి, మానసిక ఒత్తిడి పెరిగింది. -
‘‘తల్లులు నగలు అమ్ముకున్నారు.. తండ్రులు అప్పులు..’’
ఢిల్లీ: నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయల్సి రావడం పట్ల లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. నీట్ 2026 పరీక్షను రద్దు చేసి, 22 లక్షలకు పైగా విద్యార్థుల కష్టాన్ని వృథా చేశారంటూ ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.‘‘వారి కలలను బీజేపీ ప్రభుత్వం అణచివేసింది. కొందరు తండ్రులు అప్పులు తీసుకున్నారు, కొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారు, లక్షలాది మంది పిల్లలు రాత్రంతా మేల్కొని చదువుకున్నారు. దానికి ప్రతిఫలంగా, వారికి పేపర్ లీకులతో షాక్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి నెలకొంది. ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. ఇది యువత భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరిగిన నేరం. ప్రతిసారి పేపర్ మాఫియా నిర్దాక్షిణ్యంగా తప్పించుకుంటోంది. నిజాయితీగల విద్యార్థులు శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు, లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, అనిశ్చితిని భరించాలి. ఒకరి తల రాతను వారి కష్టంతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తే ఇక చదువుకు అర్థం ఏముంటుంది? ప్రధానమంత్రి అమృత్ కాలం దేశానికి విష కాలంగా మారింది’’ అని విమర్శించారు.కాగా, మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను కేంద్రం రద్దు చేసింది. ప్రశ్నపత్రం లీక్, పరీక్షలో అక్రమాల ఆరోపణల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైద్య ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సీబీఐకు ఈ కేసును అప్పగించింది.ఓ ప్రకటనలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర సంస్థల నుంచి సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవస్థలో పారదర్శకతను కొనసాగించేందుకు భారత ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (యూజీ) 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని ఎన్టీఏ చెప్పింది. విచారణకు అవసరమైన పత్రాలు, రికార్డులు అందజేస్తుందని తెలిపింది.దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర అండర్గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. దీన్ని మే 3న పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించారు. భారత్లోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 5,400కు పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. -
పేపర్ లీక్.. నీట్ 2026 పరీక్ష రద్దు.
-
షాకింగ్: నీట్ యూజీ 2026 రద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన వైద్యవిద్య ప్రవేశ పరీక్ష ‘నీట్-యూజీ 2026’ రద్దయింది. మే 3న జరిగిన ఈ పరీక్షలో రాజస్థాన్లో ‘గెస్ పేపర్’ లీకైందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జాతీయ పరీక్షా వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.అసలేం జరిగింది?కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం మేరకు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలడంతో ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో ‘గెస్ పేపర్’ పరీక్షకు ముందే ఎలా సర్క్యులేట్ అయింది? దీని వెనుక ఏమైనా వ్యవస్థీకృత ముఠా ఉందా? అన్న కోణంలో సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేతికి అప్పగించింది. విచారణకు అవసరమైన అన్ని రికార్డులను సీబీఐకి అందించి పూర్తిగా సహకరిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.త్వరలోనే రీ-ఎగ్జామ్.. విద్యార్థులకు ఊరటపరీక్ష రద్దు వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలకు అసౌకర్యం కలిగినా, పరీక్షల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టేందుకే మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. లీకేజీతో దెబ్బతిన్న ఆశావాహులకు న్యాయం చేయడానికే ఈ రీ-ఎగ్జామ్ జరగనుంది. త్వరలోనే అధికారిక మార్గాల ద్వారా కొత్త తేదీలను ప్రకటించనున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా, అధికారిక సమాచారం కోసం వేచిచూస్తూ విద్యార్థులు తమ సన్నద్ధతను కొనసాగించాలని సూచించింది.కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. ఫీజు వాపసుమళ్లీ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత రిజిస్ట్రేషన్ డేటానే పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఎంచుకున్న పరీక్షా కేంద్రాలే దాదాపు చెల్లుబాటు అవుతాయి. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయరు సరికాదు, ఇప్పటికే చెల్లించిన ఫీజును విద్యార్థులకు వాపసు (రీఫండ్) చేయనున్నారు. కొత్త పరీక్ష తేదీకి ముందు ఎన్టీఏ తాజా అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. -
ఐదు పదుల వయసులో నీట్ పరీక్ష..! ఐతే..
జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష నీట్NEET)కు హాజరైన అభ్యర్థులలో ఒక అభ్యర్థి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే ఐదుపదుల వయసులో ఈ పరీక్షకు పోటీపడటమే. లక్నోలోని చందర్నగర్ నివాసి అయిన అశోక్ బహార్ మాంటిస్సోరి పాఠశాలలో గత ఆదివారం ఈ పరీక్షక రాశారు. నీట్ యూజీ 2026 పరీక్ష మే 3, 2026న దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో దిగ్విజయంగా నిర్వహించన సంగతి తెలిసిందే. ఇక బహార్ గతంలో ఒక ఎరువుల తయారీ సంస్థలో మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన వైద్య రంగంపై ఉన్న మక్కువతో ఎంతో కాలంగా ఈ పరీక్ష రాయలని అనుకున్నారట. అయితే ఇన్నేళ్లకు ఆ కల నెరవేరిందని ఆనందంగా చెబుతున్నారు. ఆయన 2000వ సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్(స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)) తీసుకున్నప్పటి నుంచి నీట్ పరీక్ష రాయాలనే ఆలోచన ఉందట. తాను సమాజానికి అర్థవంతమైన రీతీలో సేవ చేయాలంటే ఇదే సరైన రంగం అని అనిపించదట. అందుకు తనకు సరైన గుర్తింపు, అర్హత ఉండాలని భావించే నీట్ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఇందుకు ఒకరకంగా తన కుటుంబ ప్రభావం కూడా ఒక కారణమని చెప్పడం విశేషం. బహార్ భార్య డాక్టర్ మంజుల్ బహార్ ప్రస్తుతం అమెరికాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఈ వృత్తితో దశాబ్దాల పాటు అనుబంధం ఉండటం వల్ల ఔషధాల గురించి కొంత అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. కానీ వైద్యవృత్తిని చేపట్టేలా అధికారికంగా అర్హతలు లేవని చెప్పారు. నిజానికి నీట్ ప్రవేశ పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష. దీనికి ఎక్కువగా 17 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నవారే హాజరవుతారు. కానీ దాన్ని సవాలు చేసే 57 ఏళ్ల వ్యక్తి ఈ పరీక్ష రాయడం విశేషం. ఆయన ఇతర అభ్యర్థులు మాదిరిగానే ఈ పరీక్ష రాశారు. చాలాకాలం తర్వాత చదవడం వల్ల.. కాస్త కష్టమైందని, అయితే ఏకాగ్రతతో దాన్ని సాధించగలిగానని అన్నారు. గతకొంతకాలంగా కొందరు పెద్దలు లేటు వయసులో తిరిగి ఉన్నత చదువుపై అడుగుల వేస్తున్న కేసులు పెరుగుతుండటం విశేషం. ఇక బహార్ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు, కష్టపడగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు..ఏ దశలోనైనా ముందుకు సాగొచ్చని అన్నారు. ఏదీఏమైనా కఠినతరమైన ఆ నీట్ పరీక్షను రెస్ట్ తీసుకునే వయసులో పోటీపడటం అనేది అత్యంత ప్రశంసనీయమైన విషయం. కాగా, అతనికి వైద్య కళాశాలలో ప్రవేశం లభిస్తుందో లేదా అనేది నీట్ ఫలితాలే నిర్ణయిస్తాయి. మరి ఆ తాతగారికి ఆల్ ది బెస్ట్ చెబుదామా..!. -
కాసేపట్లో నీట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే ‘నీట్ యూజీ 2026’ (NEET UG) పరీక్ష నేడు(ఆదివారం మే 3) జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 నిమిషాల వరకు ఒకే షిఫ్టులో నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు సమయపాలన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం 12 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లు తెరుచుకుంటాయి. అయితే, మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టాలంటే అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) తప్పనిసరి. దానికి తోడుగా ప్రభుత్వం జారీ చేసిన పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును వెంట తీసుకువెళ్లాలి. స్మార్ట్ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, పేజర్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతించరు. ఒకవేళ పొరపాటున తీసుకువచ్చినా, వాటిని భద్రపరచడానికి కేంద్రాల వద్ద ఎలాంటి సదుపాయం ఉండదు, వాటికి విద్యార్థులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.డ్రెస్ కోడ్: బూట్లు వేసుకుంటే నో ఎంట్రీవిద్యార్థుల వస్త్రధారణపై స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అబ్బాయిలు సాధారణ ప్యాంట్లు, జీన్స్ ధరించవచ్చు కానీ, బూట్లకు బదులుగా కేవలం స్లిప్పర్స్ (చెప్పులు) మాత్రమే వేసుకోవాలి. అలాగే క్యాప్స్, మఫ్లర్లు తలకు ధరించకూడదు. ఇక అమ్మాయిలు లెగ్గింగ్స్ లేదా సాధారణ ప్యాంట్లు వేసుకోవచ్చు. వీరు కూడా సింపుల్ శాండల్స్ ధరించాలి తప్ప షూస్ వేసుకోకూడదు. ముఖ్యంగా చేతులకు మెహందీ పెట్టుకోకూడదు. అలాగే హ్యాండ్బ్యాగ్లు లేదా పర్సులు లోపలికి తీసుకువెళ్లడానికి వీల్లేదు. -
గంట ముందే సెంటర్కు..
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–యూజీ) ఆదివారం జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్–పేపర్ విధానం ద్వారా జరిగే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 23 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు.రాష్ట్రంలో 73 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లో ఎక్కువ సెంటర్లు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు నమోదు వంటి విధానాలు అమలు చేస్తున్నారు. ఎల్రక్టానిక్ పరికరాలు నిషేధం: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పరీక్ష రాసేందుకు వచ్చేటప్పుడు అడ్మిట్ కార్డ్, ఫొటో ఐడీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందే హాజరు కావాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం. ఫుల్హ్యాండ్స్ దుస్తులు, షూస్ ధరించరాదు.ట్రాన్స్పరెంట్ పెన్ మాత్రమే అనుమతిస్తారు. మెటల్ వస్తువులు, ఆభరణాలు నిషేధం. ఇక అమ్మాయిలు హెయిర్పిన్లు, క్లిప్లు, మెటల్ రబ్బర్ బ్యాండ్లు ధరించి వస్తే అనుమతించరు. పెద్ద చెవిపోగులు, గొలుసులు, బంగారు ఆభరణాలు ధరించరాదు. హైహీల్స్, అలంకరణలున్న షూస్ నిషేధం. సాధారణ చెప్పులు/శాండల్స్ మాత్రమే ధరించాలి. ముసుగు లేదా సంప్రదాయ దుస్తులు ధరించే వారు ముందుగా రిపోర్ట్ చేయాలి. అదనపు తనిఖీ జరుగుతుంది. మేకప్ పరిమితంగా ఉండాలి. అనుమానాస్పద వస్తువులు తీసుకురావొద్దు. పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు వేసవి కాలం కావడంతో పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందిస్తున్నారు. నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, విజిలెన్స్ బృందాలు పనిచేస్తున్నాయి. సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది. పరీక్షను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. -
NEET 2026: ఈ తప్పులు అస్సలు చేయకండి!
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2026) పరీక్ష మే మూడవ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా ఒకే షిఫ్టులో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల లోపు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకొని రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. అందుకే ఎలాంటి ఆలస్యం చేయకూడదు. అడ్మిట్ కార్డు లేకుండా ఎవరినీ పరీక్షకు అనుమతించరు. అడ్మిట్ కార్డుతో పాటు పాన్ లేదా ఓటర్ ఐడి లాంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును ఖచ్చితంగా వెంట తీసుకురావాలి.డ్రెస్ కోడ్ రూల్స్నీట్ అభ్యర్థులు సరైన డ్రెస్ కోడ్ పాటించడం తప్పనిసరి. అబ్బాయిలు ప్యాంట్లు, ట్రౌజర్లు లేదా జీన్స్ మాత్రమే ధరించాలి. బూట్లకు బదులుగా చెప్పులు వేసుకోవడం మంచిది. టోపీలు, మఫ్లర్లు, తలను కప్పే వస్త్రాలు ధరించకూడదు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే, వారు సింపుల్ లెగ్గింగ్స్ లేదా ట్రౌజర్లు వేసుకోవాలి. వీరు కూడా సాధారణ శాండల్స్ వేసుకోవాలి. చేతులకు మెహందీ పెట్టుకోకూడదు. పరీక్షా కేంద్రం లోపలికి హ్యాండ్బ్యాగులు, పర్సులు తీసుకురాకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే, పరీక్షకు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందిపరీక్షా కేంద్రంలోకి స్మార్ట్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, పేజర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. నిషేధిత వస్తువులను భద్రపరచడానికి పరీక్షా కేంద్రంలో ఎలాంటి లాకర్ సౌకర్యం ఉండదు. ఎవరైనా ఇటువంటివి తెస్తే, వాటిని తమ సొంత రిస్క్ మీద బయట దాచుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం విద్యార్థులు నీట్ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ను సందర్శించి, తాజా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి: షాక్ మీద షాక్: ఫలితాలను తిరగతోడిన సట్టా బజార్ -
నీట్–2026కు కౌంట్డౌన్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో ప్రవేశాలకు గేట్వేగా నిలిచే ‘నీట్–యూజీ 2026’ పరీక్షకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ పరీక్ష మే 3న దేశవ్యాప్తంగా జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒకే షిఫ్ట్లో ఆఫ్లైన్ (పెన్–పేపర్) విధానంలో పరీక్ష జరగనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇదే ప్రధాన ప్రవేశ పరీక్ష. గత ఏడాది తెలంగాణ నుంచి 70 వేల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, ఈసారి 75 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని వైద్య విద్య వర్గాలు చెబుతున్నాయి. నేడు 10 గంటల నుంచి..నీట్–2026 అడ్మిట్ కార్డులు సోమవారం (ఏప్రిల్ 27) ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రం, సమయం వంటి కీలక వివరాలు అందులో ఉంటాయి. పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్టీఏ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. నిషేధిత వస్తువులు తీసుకొస్తే డిస్క్వాలిఫికేషన్ తప్పదని హెచ్చరించింది. అలాగే కేంద్రాల్లో ఫ్రిస్కింగ్ విధానం అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.అవకతవకలకు తావులేకుండా.. నీట్–యూజీ పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవకతవ కలకు తావులేకుండా నిర్వహించేందుకు కీలక చర్యలు చేప ట్టారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను మే 3న నిర్వహించనున్నందున జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ముందు జాగ్రత్తగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మే 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెలవులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. గతంలో నీట్ పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న ఇంపర్సనేషన్, చీటింగ్, ప్రశ్నపత్రాల లీక్ వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎంసీ పేర్కొంది.ముఖ్యంగా మెడికల్ విద్యార్థుల ప్రమేయంతో జరిగే అవకతవకలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో సరైన కారణాలు ఉంటేనే సంబంధిత కాలేజీ యాజమాన్యాలు సెలవులు మంజూరు చేయొచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ రెండు రోజుల్లో విద్యార్థులను కళాశాలల్లోనే ఉంచుతూ అకడమిక్ కార్యక్రమాలు లేదా ఇతర పనుల్లో నిమగ్నం చేయాలని సూచించింది. అవసరమైతే బోధన, నాన్–టీచింగ్ సిబ్బందిని కూడా విధుల్లో ఉంచాలని పేర్కొంది. -
ఉత్కంఠకు తెర: 27న నీట్ హాల్ టికెట్లు విడుదల
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ (NEET UG 2026) అడ్మిట్ కార్డుల నిరీక్షణకు తెరపడింది. ఎన్టీఏ (NTA) చేసిన తాజా ప్రకటన అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2026) హాల్ టికెట్లు సోమవారం, (ఏప్రిల్ 27)విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అడ్మిట్ కార్డులు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. NEET Admit Cards will be available to all candidates by 10 AM on Monday, 27th April 2026.Use the last Sunday before the exam for a practice test or revising concepts.Stay Calm. Keep yourself hydrated. #NEET2026— National Testing Agency (@NTA_Exams) April 26, 2026డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే..అడ్మిట్ కార్డులను సులభంగా పొందేందుకు విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి. అక్కడ కనిపించే ‘అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్ (Admit Card PDF)’ లింక్పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ అప్లికేషన్ నంబర్ (Application Number), పాస్వర్డ్ (Password) వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. ఈ వివరాలు ఇచ్చిన వెంటనే నీట్ హాల్ టికెట్ మీ స్క్రీన్పై దర్శనమిస్తుంది. వెంటనే ఆ పీడీఎఫ్ను సేవ్ చేసుకుని, పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లేందుకు తప్పనిసరిగా ఒక ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.పరీక్షా విధానం.. 180 నిమిషాల సమరంనీట్ 2026 ప్రశ్నాపత్రం పూర్తిగా విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టేలా ఉండనుంది. మొత్తం 180 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) నుంచి 45, రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) నుంచి 45, జీవశాస్త్రం (బయాలజీ) నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి. ఈ 180 ప్రశ్నలను సాధించడానికి విద్యార్థులకు కేవలం 180 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది. కాబట్టి పరీక్షలో సమయపాలన అత్యంత కీలకం కానుంది.ఇది కూడా చదవండి: గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదో తెలుసా? -
‘కోటా’కు ఊపిరి.. మళ్లీ ‘ఆల్ ఇండియా ప్రభంజనం’?
కోటా: దేశంలోనే అత్యుత్తమ కోచింగ్ హబ్గా పేరుగాంచిన రాజస్థాన్లోని కోటా నగరం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. గత రెండేళ్లుగా కొంత మందగించిన ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) కోచింగ్ అడ్మిషన్లు.. 2026-27 విద్యా సంవత్సరంలో ఏకంగా 20 నుంచి 30 శాతం మేర పెరిగాయి. దీంతో నగరమంతా మళ్ళీ విద్యార్థులు, తల్లిదండ్రుల సందడితో కళకళలాడుతోంది.సంక్షోభం నుంచి గట్టెక్కి..2023 నుంచి 2025 మధ్య కాలంలో కోటా కోచింగ్ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. గతంలో సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులతో ఏడాదికి రూ. 6,500–7,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఈ నగరం.. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య 85 వేల నుంచి లక్షకు పడిపోవడంతో ఆదాయం రూ.3,500 కోట్లకు తగ్గిపోయింది. అయితే మార్చి 25 నుంచి ప్రారంభమైన కొత్త బ్యాచ్లకు అనూహ్య స్పందన లభించింది. ఏప్రిల్ రెండు వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది.విజయాల పరంపర.. తగ్గని క్రేజ్ఎన్ని విమర్శలు ఎదురైనా, ఫలితాల విషయంలో కోటా తన మార్కును నిలబెట్టుకుంటోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించిన 12 మందిలో ఎనిమిది మంది కోటా విద్యార్థులే కావడం విశేషం. గత రెండేళ్లుగా ఐఐటీ-జేఈఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఇక్కడి విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఈ అద్భుతమైన ట్రాక్ రికార్డే తల్లిదండ్రులను మళ్లీ కోటా వైపు నడిపిస్తోంది. మణిపూర్, బీహార్, మహారాష్ట్ర లాంటి సుదూర ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు ఇక్కడికి తరలివస్తున్నారు.అండగా స్థానికులు.. అద్దె పెంపునకు నోపెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, కోటా హాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్ పెరిగినప్పటికీ హాస్టల్ అద్దెలను పెంచవద్దని ఆపరేటర్లకు సూచించారు. నగరంలోని 4,000 హాస్టళ్ళు, 45,000 పీజీ సెంటర్లు విద్యార్థుల కోసం సిద్ధంగా ఉన్నాయి. స్థానిక ఎంపీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమానికి స్థానికులు కూడా తోడ్పడాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు ఒత్తిడి మేనేజ్మెంట్, మోటివేషన్ క్లాసులపై కూడా కోచింగ్ సెంటర్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అడ్మిషన్ల పెరుగుదలతో అటు కోచింగ్ రంగం, ఇటు స్థానిక ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుందని నగర వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘ఎయిర్ ఇండియా’లో ‘పాన్ పాన్’ కాల్... ప్రయాణికులు బెంబేలు -
‘శ్రేష్ట’ విద్యార్థులకు అన్యాయం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విద్యా పథకంలో అద్భుతమైన ప్రతిభతో రాణించిన ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్ణయాలు కష్టాల పాల్జేస్తున్నాయి. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతో పాటు ఎంసెట్ వంటి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినా ప్రభుత్వం మాత్రం సీట్లు ఇవ్వనంటోంది. చట్టం పేరుతో వారి భవిష్యత్ అవకాశాలను కాలరాస్తోంది. దీంతో నిరుపేద ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. పోటీ పరీక్షల్లో రాణించి ర్యాంకులు సాధించినా తమ పరిస్థితి ఇలా మారిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.కూటమి ప్రభుత్వంలో అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగినా సమస్యకు పరిష్కారం లభించ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం శేష్ట్ర విద్యా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు దేశంలో ఎక్కడైనా ప్రముఖ విద్యాలయాల్లో చదువుకునే అవకాశం కల్పించింది. ఈ పథకంలో సీట్లు సాధించిన రాష్ట్ర విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లోని ఉత్తమ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకుంటున్నారు. కానీ, వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ నాన్ లోకల్గా గుర్తిస్తుండడంతో వారు ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లు కోల్పోతున్నారు.ఏటా దేశ వ్యాప్తంగా 3 వేల మంది ఎంపికఎస్సీ సామాజిక వర్గంలో ప్రతిభ గల విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ 2022 జూన్లో ‘స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హైసూ్కల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్’ (శ్రేష్ట) పథకాన్ని ప్రారంభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా ప్రతిభా పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. 2022 నుంచి ఏటా ఈ పథకం కింద 9, 11వ తరగతిలో ప్రవేశానికి 3 వేల మందిని ఎంపిక చేశారు. వీరికి దేశంలోని అత్యుత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం సీట్లు కల్పించింది. ఇలా ఏపీ నుంచి 1,015 మంది విద్యార్థులు ఒడిశా, ఢిల్లీ, ఛత్తీస్గడ్ తదితర రాష్ట్రాల్లో ప్రముఖ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్నారు. అలాగే తెలంగాణ నుంచి మరో 1,100 మంది ఎస్సీ విద్యార్థులు కూడా వివిధ రాష్ట్రాల్లో చదువుతున్నారు.శ్రేష్ట విద్యార్థులు నాన్ లోకల్ అంటూ తిరస్కరణకేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న శ్రేష్ట పథకంలో ఎంపికైన విద్యార్థులు ‘స్థానికత’ అంశంతో నష్టపోతున్నారు. ఇంటర్మిడియెట్ పూర్తయ్యాక వారు రాష్ట్రానికి తిరిగి వస్తే వారికి రాష్ట్ర కోటా పొందేందుకు అనర్హులుగా పేర్కొంటుండడంతో వాస్తవానికి ‘స్థానికత’ నిబంధనలపై అధికారులకు సరైన అవగాహన లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. చట్ట ప్రకారం విద్యార్థి నిర్దిష్ట ప్రాంతంలో కనీసం నాలుగు సంవత్సరాలు వరుసగా చదువుకున్నా లేదా వారి తల్లిదండ్రులు రాష్ట్రంలో కనీసం 10 సంవత్సరాలు నివసించినా లేదా రాష్ట్రంలో ఎక్కడైనా వరుసగా ఏడు సంవత్సరాలు చదువుకున్నా స్థానికులుగా పరిగణిస్తారు.కానీ అధికారులు మాత్రం విద్యార్థులు చదువు పూర్తి చేసిన సంవత్సరం నుంచి వెనక్కి లెక్కించడంతో కేవలం రెండేళ్లు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నవారు గతేడాది నీట్లో ఉత్తమ ర్యాంకు సాధించినా నాన్ లోకల్గా గుర్తించడంతో సీట్లు పొందలేకపోయారు. తల్లిదండ్రుల నివాస కాలాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం విద్యా సంవత్సరాలనే ప్రామాణికంగా తీసుకోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న పెద్దాయన పేరు చుక్కా అప్పన్న. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన శ్రీకాకుళం పట్టణంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈయన ఇద్దరు కుమారులు చదువుల్లో చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘శ్రేష్ట’ విద్యా పథకానికి ఎంపికై ఒడిశాలోని ప్రముఖ కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు సాధించారు. పెద్ద కొడుకు ఇంటర్ పూర్తి చేసి గతేడాది నీట్, ఎంసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించాడు. అయితే ఇంటర్మీడియెట్ వేరే రాష్ట్రంలో చదివినందున ఆంధ్రప్రదేశ్లో ‘స్థానిక’ కోటా వర్తించదని ఎంబీబీఎస్ సీటు వచ్చినా దరఖాస్తును తిరస్కరించారు. సమస్యను అధికారులు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. అప్పన్న చిన్న కొడుకు ప్రస్తుతం సీబీఎస్ఈ ప్లస్ టూ పరీక్షలు రాస్తున్నాడు. ఎంసెట్, జేఈఈకి రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే నాన్ లోకల్ కిందే గుర్తిస్తుండడంతో ఆందోళన చెందుతున్నాడు. కళ్లముందే ప్రతిభ గల ఇద్దరు బిడ్డలకు ప్రభుత్వమే అన్యాయం చేస్తుంటే అప్పన్న కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప న్యాయం పొందలేకపోతున్నాడు. -
ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్, మెడికల్ వంటి కీలకమైన కోచింగ్నూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేయబోతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ కేంద్రాల నిర్వాహకులు దీనిపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ బిజినెస్ కన్సల్టెన్సీ ఇన్ఫీనియం సంస్థ ఇలాంటి అంశాలపై అధ్యయనం చేసి ఇటీవల మార్కెట్ రీసెర్చ్ నివేదికను వెల్లడించింది. మారుతున్న ట్రెండ్కు అనుకూలంగా కోచింగ్ విధానాలను ఏఐతో ఆధునీకరించాలని భావిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థల తోడ్పాటును ఆన్లైన్ కోచింగ్ కేంద్రాలు ఇప్పటికే తీసుకున్నాయి. నీట్, జేఈఈ రాసే విద్యార్థుల్లో 80 శాతం మంది కోచింగ్పైనే ఆధార పడుతున్నారు. 2022 వరకూ కోచింగ్ కేంద్రాల వ్యాపారం దేశవ్యాప్తంగా రూ. 58 వేల కోట్లు ఉంది. 2025 నాటికి ఇది రూ.70 వేల కోట్లకు చేరింది. 2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే, ఏఐ ఆధారిత మాడ్యూల్స్ను జోడించడం వల్ల ఇది 2028 నాటికి 2.5 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కోచింగ్ కేంద్రాలు మార్కెట్లో పబ్లిసిటీకి ఏటా రూ.150 కోట్లకుపైగానే ఖర్చు పెడుతున్నాయి. ఈ లాంగ్వేజ్ కీలకం పైథాన్ లాంగ్వేజ్ ఆధారంగా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. నీట్, జేఈఈ వంటి వాటిల్లో అనలైటిక్స్, స్టూడెంట్ ప్రొఫైలింగ్, అనుమానాల నివృత్తి చేసే బాట్స్ మొత్తం ఏఐతోనే పనిచేస్తాయి. ఇవి ప్రశ్నల్లో ఉన్న కఠినత్వం, వాటి పరిష్కారం, మాక్ టెస్టుల నిర్వహణ, విద్యార్థి వ్యక్తిగత స్టడీ ప్లాన్ రూపొందిస్తాయి. లైవ్ డాష్బోర్డ్, ఏఐ చాట్బాట్లను రూపొందిస్తున్నారు. ర్యాంక్ ప్రిడిక్షన్ ద్వారా సీటు ఎక్కడ వస్తుందనే కౌన్సెలింగ్ ప్లానింగ్ కూడా ఉంటుంది. న్యూరల్ నెట్వర్క్, అటెన్షన్ మాడ్యూల్స్ ప్రిపరేషన్ స్థాయిని పెంచేలా ప్రొగ్రామ్ చేస్తున్నారు. కెమికల్ ఎడ్యుకేషన్ పార్శింగ్, ఆర్గానిక్ రియాక్షన్ స్వీకెన్స్ అనాలసిస్ ఏఐ అందిస్తుంది. సింబాలిక్ రీజనింగ్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ లాజిక్, వెక్టార్ అండ్ మ్యాట్రిక్స్ ఇంటర్ప్రిటేషన్ వంటి మ్యాథ్స్ ఆధారిత ప్రోగ్రామింగ్లోనూ ఏఐ కీలక పాత్ర పోషించబోతోంది. ఒత్తిడి పెరుగుతుందా? తగ్గుతుందా? కోచింగ్ కేంద్రాలు ఏఐ మాడ్యూల్స్ను అనుసరిస్తున్నాయి. అయితే, దీనిపై ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇందుకు అవసరమైన ప్లాట్ఫాం ఏర్పాటు చేయాలి. దేశంలోని 78 శాతం కోచింగ్ కేంద్రాల్లో కనీస నాణ్యత ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఫలితంగా జేఈఈ, నీట్లో వివిధ రూపాల్లో ప్రశ్నలు వస్తే విద్యార్థులు సమాధానం ఇవ్వలేపోతున్నారు. ఈ దశలో ఏఐ మాడ్యూల్స్ కోచింగ్ తీసుకునే విద్యార్థులకు మానసిక ఒత్తిడి వస్తుందని నిపుణులు అంటున్నారు. జేఈఈ మెయిన్స్కు ఏటా 13 లక్షల మంది, నీట్కు 22 లక్షల మంది పోటీపడుతున్నారు. కోచింగ్ కేంద్రాలు ర్యాంకులు సాధించే మెరిట్ విద్యార్థులను విడగొట్టి క్లాసులు నిర్వహిస్తాయి. వీళ్లు 20 శాతమే ఉంటున్నారు. మిగతా వాళ్లను నాణ్యత లేని ఫ్యాకల్టీతో కాలం వెళ్లదీస్తున్నాయి. ర్యాంకులు రాని విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2013లో 8,423 మంది విద్యార్థులు ఆత్మహ్యలు చేసుకుంటే, 2022 నాటికి ఈ సంఖ్య 13,044కు పెరిగింది. 2025 నాటికి ఇది 13 శాతం పెరిగినట్టు అంచనా వేసింది. ఈ పరిస్థితికి వెళ్లకుండా ఆన్లైన్ కేంద్రాలపై నియంత్రణ అవసరమని ఐఐటీ–బాంబే అధ్యాపకుడు నీలం త్రివిక్రమ్ సూచించారు. కేంద్ర కమిటీ అధ్యయనం జేఈఈ, నీట్ కోచింగ్ కేంద్రాల పనితీరుపై కేంద్ర విద్యాశాఖ గత ఏడాది కమిటీ వేసింది. కేంద్ర ఉన్నత విద్య కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలు, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ను ఇందులో సభ్యులుగా చేర్చింది. కోచింగ్తో పనిలేకుండా పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే కోణంలో పరిశీలించి ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. ప్రైవేటు కోచింగ్ కేంద్రాల పబ్లిసిటీ, నాణ్యత ప్రమాణాలను ఈ కమిటీ పరిశీలించాలి. పాఠశాల విద్యలో లోపాలు, క్రిటికల్ థింకింగ్ విధానాలు, స్కూల్ విద్య నుంచే పోటీ పరీక్షల సన్నద్ధత, కాలేజీల్లో కెరీర్ గైడెన్స్, ఒత్తిడి లేని సిలబస్ తీసుకురావడంపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇప్పుడు ఏఐ పాత్ర పెరుగుతుండటంతో మరింత లోతుగా అధ్యయనం చేయాలని భావిస్తోంది. నిఘా అవసరం... రాష్ట్రానికి మండలి నివేదిక ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై సరైన నియంత్రణ ఉండాలన్నది రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయం. ఈ మేరకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి గతంలోనే ప్రభుత్వానికి ఓ నివేదిక అందించారు. ఉన్నత విద్యలో తృతీయ పక్షం జోక్యం వల్ల నాణ్యత దెబ్బతింటుందని తెలిపారు. అకడమిక్ పాఠాల వల్ల ఒత్తిడి లేకుండా పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారని, ఆన్లైన్ వేదికలు, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పాదర్శకంగా అన్పించడం లేదన్నారు. దీనివల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయని, కోచింగ్ కేంద్రాలు లాభాలే తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదని, ఫీజుల భారం పేదవాళ్లను కుంగదీస్తోందని తెలిపారు. గుర్తింపు లేని కోర్సులు, అర్హతలేని బోధకులు, పాత సిలబస్ వాడకం వల్ల విద్యా ఫలితాలు దెబ్బతింటున్నాయని గుర్తించారు. . తప్పుడు అంచనాలు, ఆర్థిక నష్టాలు, విద్యా అంతరాయాలు పెంచుతున్నాయని తెలిపారు. -
‘Need Ten Minutes’ : సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి గెలిచిన 19 ఏళ్ల అథర్వ్
ఢిల్లీ: ఫోమో, గోట్, వైబ్, బెట్..ఇవి జెన్జీలు తరచుగా వినియోగించే పదాలు. కానీ వాటికి బదులుగా ‘మై లార్డ్, విత్ డ్యూ రస్పెక్ట్, లెర్న్డ్ కౌన్సిల్, జ్యూరిస్డిక్షన్’ అనే పదాలతో ఓ 19 ఏళ్ల యువకుడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో తన కేసును తానే వాదించాడు. ‘Need ten minutes’ అంటూ కేసులో విజయం సాధించాడు. న్యాయశాస్త్రంలో అనుభవజ్ఞులైన న్యాయవాదులు సైతం కొన్నిసార్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయడానికి వెనుకాడుతారు. అలాంటి పిటిషన్ను తానే స్వయంగా దాఖలు చేసి, తన వాదనలతో న్యాయమూర్తులను ఒప్పించాడు.సుప్రీంకోర్టు హాలు న్యాయమూర్తులు, సీనియర్ అడ్వకేట్లు, అసోసియేట్ లాయర్లు, జూనియర్ లాయర్లు, వాదులు, ప్రతివాదులతో కిక్కిరిసిపోతున్న సమయంలో, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఎదుట టెన్ మినిట్స్ మోర్ అనే గొంతు వినిపించింది. ఆ గొంతు నిష్ణాతులైన న్యాయమూర్తి గొంతు అని అనుకుంటే పొరబడినట్లే.. 12వ తరగతి పూర్తి చేసి డాక్టర్ కావాలని కలలు కంటున్న 19 ఏళ్ల అథర్వ్ చతుర్వేది గొంతు. సరిగ్గా పది నిమిషాల తర్వాత అతనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ఆర్టికల్ 142 కింద తన ప్రత్యేక అధికారాలను వినియోగించి, నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అథర్వ్తో పాటు అర్హులైన Economically Weaker Section (EWS) అభ్యర్థులకు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది.వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ జబల్పూర్కి చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు అథర్వ్, నీట్ పరీక్షలో ఒకసారి కాదు రెండు సార్లు ఉత్తీర్ణత సాధించాడు. 530 మార్కులు సాధించినప్పటికీ ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందలేకపోయాడు. కారణం ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం. అదే సమయంలో ఇతర కోటాలో అర్హులైన అభ్యర్థులు అడ్మిషన్ పొందినట్లు అతను గమనించాడు.ఈ నేపథ్యంలో, జనవరి 6న సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ఎస్ఎల్పీ దాఖలు చేశాడు. విచారణలో కోర్టు, విధానపరమైన లోపాల కారణంగా అథర్వ్ లాంటి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని గుర్తించింది. వాదన సమయంలో తగిన సమయం లేదని భావించిన అథర్వ్ పది నిమిషాలు అదనంగా కావాలి’ అని చీఫ్ జస్టిస్ను కోరాడు. ఆ పది నిమిషాల తర్వాతే అతనికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో 2025-26 సెషన్లో అతనికి ఎంబీబీఎస్ సీటు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తన కేసును తానే వాదించి విజయం సాధించిన అథర్వ్, ఇప్పుడు వైద్య విద్యను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాడు.ఇదే అంశంపై జబల్పూర్ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనలు వినిపించాడు. అథర్వ్ వాదనలతో ముగ్ధులైన జబల్పూర్ హైకోర్టు న్యాయమూర్తి సైతం అతనిపై ప్రశంసలు కురిపించారు. నువ్వు డాక్టర్ కాదు, న్యాయవాదిగా రాణించాలి. నువ్వు ఎంచుకున్న రంగం తప్పేమో అంటూ ప్రోత్సహించారు’ అని పలు జాతీయా మీడియా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
నీట్–పీజీ అర్హత స్కోర్ను ఎందుకు తగ్గించారు?
న్యూఢిల్లీ: నీట్–పీజీ 2025–26కు క్వాలిఫయింగ్ కటాఫ్ పర్సంటైల్ను భారీగా తగ్గించడంపై వివరణ ఇవ్వాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరా«ధేల ధర్మాసనం ఎదుట శుక్రవారం పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. పీజీ స్థాయిలో ప్రమాణాలను నెలకొల్పేందుకు కఠినమైన నిబంధనలు అవసరమన్నారు. ప్రత్యేకమైన కారణాలుంటే తప్ప, పీజీ ప్రవేశాలకు అర్హత మార్కులను తగ్గించరాదన్నారు. స్పందించిన ధర్మాసనం..‘సీట్లను ఖాళీగా వృథా ఉంచరాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో, ప్రవేశాల కోసం ఎక్కువ మంది అభ్యర్థులు ముందుకు రావడం లేదు. అందుకే కటాఫ్ను తగ్గించాల్సి వస్తోంది. అయితే, సీట్లను ఖాళీగా ఉంచరాదనే నెపంతో ప్రమాణాల విషయంలో రాజీ పడటం తగదన్న వాదనలున్నాయి. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని మనం వెదకాలి’అని అభిప్రాయపడింది. ఈ అంశంపై సరైన పరిష్కారంతో ముందుకు రావాలని ఎన్బీఈఎంఎస్ను ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. నీట్ పీజీ–2025 ప్రవేశాల్లో 18 వేలకు పైగా పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో, బోర్డు రిజర్వుడు కేటగిరీల అభ్యర్థుల అర్హత పర్సంటైల్ను 40 నుంచి సున్నాకు తగ్గించింది. దీనర్థం 800కు గాను మైనస్ 40 స్కోరు సాధించిన అభ్యర్థులు సైతం మూడో విడత కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అవకాశమేర్పడింది. అదేవిధంగా, జనరల్ కేటగిరీ నీట్ పీజీ అభ్యర్థుల అర్హత స్కోరును 50 నుంచి 7కు తగ్గించారు. అయితే, ఈ నిర్ణయం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 21లకు భంగం కలిగించడమేనంటూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 4వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. -
11 ఏళ్లకే పెళ్లి, భార్య అండతో నెరవేరిన ఎంబీబీఎస్ కల
బాల్యంలోనే పెళ్లి, 20 ఏళ్ల వయస్సులోనే బిడ్డకు తండ్రి. అయితేనేం కష్టపడి చదివి, సవాళ్లు ఎన్ని ఎదురైనా వెనకడుగు వేయలేదు. అనుకున్నది సాధించే దాకా నిద్ర పోలేదు. రాజస్థాన్లోని మారుమూల ప్రాంతానికి చెందిన రామ్లాల్ నీట్లో విజయం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. రామ్లాల్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.రాజస్థాన్లోని ఒక చిన్న జిల్లాకు చెందిన వాడు రామ్లాల్. ఎన్నో కష్టాలకోర్చి తన కలను సాకారం చేసుకున్నాడు. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, తన వైద్య ప్రయాణానికి మార్గం సుగమం చేసుకున్నాడు. అయితే రామ్లాల్కి 6వ తరగతి చదువుతున్నప్పుడే పెళ్లి అయిపోయింది. పెళ్లి, సంసారం, బాధ్యతలు వీటిపై ఎలాంటి అవగాహన లేని సమయంలోనే కొత్త నైపుణ్యాలను నేర్చుకునే సమయంలో 11 ఏళ్లకే ఒక ఇంటి వాడైపోయాడు. తల్లిదండ్రులు నిశ్చయం.. పైగా చిన్న వయసు. ఎటూ ప్రశ్నించలేని తనం. తలొగ్గడం తప్పడం చేయ గలిగిందేమీ లేదు. అందుకే, పాత విషయాలను పక్కనపెట్టి, రామ్లాల్ తన చదువును కొనసాగిస్తూనే, తన ఫ్యూచర్ ప్లాన్ల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. తన కలను కుటుంబం ముందు ఉంచాడు. కానీ తండ్రి ఒప్పుకోలేదు. అదృష్టం ఏమిటంటే చదువు విలువు తెలిసిన రామ్లాల్ భార్య , భర్త ఆశయాలను అర్థం చేసుకుంది. అతనికి అండగా నిలబడింది. ఆమె మద్దతు ,ప్రోత్సాహం లేకపోయి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేదేమో.10వ తరగతిలో రామ్లాల్ 74 శాతం మార్కులు సాధించి, త్వరలోనే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే అంతిమ లక్ష్యంతో సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. నెలల తరబడి సన్నద్ధమైన తర్వాత, 2019లో నీట్ పరీక్షకు హాజరై, 720 మార్కులకు కేవలం 350 మార్కులు మాత్రమే సాధించాడు. అయినా నిరాశపడలేదు. తన లక్ష్యం నుండి వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో కోచింగ్ సంస్థలో చేరాడు.2022లో మరోసారి నీట్ రాశాడు.మునుపటి కంటే మెరుగ్గా 490 మార్కులు సాధించాడు,. ప్రతీ ప్రయత్నం, వైఫల్యం అతనిలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. మరింత కష్టపడాలనే సంకల్పం పెరిగింది. దాంతో అతను మంచి ర్యాంకు సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేశాడు. చివరికి ఐదు ప్రయత్నాల తర్వాత 2023లోమంచి ర్యాంకు సాధించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. 2023లోనే రామ్లాల్కు ఒక పాపపుట్టడం విశేషం.ఎవరు వ్యతిరేకించినా, ఎన్ని వైఫల్యాలు ఎదురైనా సాధించాలనే సంకల్పం, పట్టుదల ఉంటే విజేతలుగా నిలవడంలో ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు అనడానికి రామ్లాల్ ప్రయాణమే నిదర్శనం. -
బీడీఎస్ వెబ్ ఆప్షన్లు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్టేట్ కోటా కింద బీడీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ మొదలైంది. కనీ్వనర్ (కాంపిటెంట్ అథారిటీ) కోటా కింద ప్రభుత్వ, ప్రైవేట్ డెంటల్ కళాశాలలు, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) శనివారం వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 22న మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యర్థులు https:/ tsbdsadm. tsche. in/ లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈనెల 15న విడుదల చేసిన స్టేట్ కోటా ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేర్లు ఉన్న అభ్యర్థులకే ఈ అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వపరంగా ఉస్మానియా డెంటల్ కాలేజీతో పాటు ఆర్మీ డెంటల్ కాలేజీ ఉండగా, మరో 10 ప్రైవేటు డెంటల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని సీట్ల కోసం ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫీజులు ఇలా... కౌన్సెలింగ్లో సీటు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు రూ. 12,000 (ఆన్లైన్ ద్వారా) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యూషన్ ఫీజుల కింద ప్రభుత్వ డెంటల్ కళాశాలలకు ఏటా రూ. 10,000, ప్రైవేట్ డెంటల్ కళాశాలలకు ఏటా రూ. 45,000 చెల్లించాల్సి ఉంటుంది. రెండో రౌండ్లో నో చాన్స్.. బీడీఎస్ కౌన్సెలింగ్కు సంబంధించి మొదటి దశలో ఆప్షన్లు వినియోగించని అభ్యర్థులకు తరువాతి రౌండ్లలో అవకాశం ఉండదు. కౌన్సెలింగ్లో సీటు కేటాయించబడిన తర్వాత చేరకపోతే, తదుపరి కౌన్సెలింగ్కు అర్హత ఉండదు. ఎన్ని కావాలంటే అన్ని కళాశాలలపై ఆప్షన్లు ఇవ్వొచ్చు. సీటు కేటాయింపుని వెబ్సైట్లో చూసుకోవచ్చు. కేటాయింపు ఎస్ఎంఎస్ ద్వారా కూడా లభిస్తుంది. సీటు వచ్చిన వారు యూనివర్సిటీ ఫీజు చెల్లించి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసి, సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ వద్ద ఒరిజినల్ సర్టీఫికెట్లు, బాండ్లు సమరి్పంచి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ, ఆంగ్లో ఇండియన్, పీఎంసీ, క్యాప్ కేటగిరీల అభ్యర్థులకూ ఇదే విధానం వర్తిస్తుంది. హెల్ప్లైన్ నంబర్లు టెక్నికల్ హెల్ప్: 9392685856, 7842136688, 9059672216, అడ్మిషన్ నిబంధనలపై క్లారిటీ కోసం: 7901098840, 9490585796, పేమెంట్ సమస్యలు: 9618240276 -
‘నీట్’ తొలి విడతలో 30,608 మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్: నీట్ యూజీ–2025లో ఆలిండియా కోటా తొలి విడత కౌన్సెలింగ్లో వివిధ కోర్సుల్లో 30,608 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ మేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) వారికి సీట్లను కేటాయించింది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఎంసీసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఎంబీబీఎస్కు సంబంధించి 26,308 మంది విద్యార్థులకు 337 కళాశాలల్లో సీట్లు కేటాయించారు. బీడీఎస్లో 2,600 మంది విద్యార్థులు 120 కళాశాలల్లో సీట్లు పొందారు. బీఎస్సీ నర్సింగ్లో 1,700 మంది విద్యార్థులు 22 కళాశాలల్లో సీట్లు పొందారు. ఈ విద్యార్థులంతా ఈనెల 18లోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈనెల మూడో వారం చివరలో రెండో రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ వాయిదా పడుతూ వస్తోంది. తెలంగాణలో ఇలా... ఆలిండియా కోటా కింద మొదటి విడతలో తెలంగాణకు చెందిన కళాశాలల్లో 306 సీట్లు భర్తీ అయ్యాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లోనే కావడం గమనార్హం. వీటిలో 161 సీట్లను తెలంగాణ విద్యార్థులు సాధించగా, మిగతా సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులు పొందారు. రాష్ట్రానికి చెందిన 156 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించగా, ఐదుగురు బీడీఎస్ కోర్సుల్లో సీట్లు పొందారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్ హైదరాబాద్లో 17 సీట్లు, ఈఎస్ఐసీలో 9 సీట్లను తెలంగాణ విద్యార్థులు సాధించారు. ఎంసీసీ జాబితా ప్రకారం, తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్లోని గాంధీలో 15, ఉస్మానియాలో 14 సీట్లు పొందారు. ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలల విషయానికొస్తే.. తెలంగాణ విద్యార్థులు నిజామాబాద్లో 12, మహæబూబ్నగర్లో 11, సిద్దిపేటలో 14, సూర్యాపేటలో 13, కరీంనగర్లో 12, సంగారెడ్డిలో 11, జగిత్యాలలో 12, ఖమ్మంలో 13, మంచిర్యాలలో 11, ఆదిలాబాద్లో 10, వరంగల్లో 8, భూపాలపల్లిలో 6, వికారాబాద్లో 5, వనపర్తిలో 5, భద్రాద్రి కొత్తగూడెంలో 5, మెదక్, నారాయణపేట్, జనగామ 4 చొప్పున, గద్వాల, ములుగు, నాగర్కర్నూల్, సిరిసిల్ల, యాదాద్రిలో 3 చొప్పున, కామారెడ్డి, నిర్మల్, పెద్దపల్లి, భద్రాద్రిలో 2 చొప్పున, ఆసిఫాబాద్లో ఒక సీటు సాధించారు. కాగా తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా ఏపీలో 12 మంది సీట్లు పొందారు. కర్ణాటకలో 9, తమిళనాడులో 7, మహారాష్ట్రలో 5, కేరళలో 4, ఢిల్లీలో 3, యూపీలో 3, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో 2 సీట్ల చొప్పున, రాజస్తాన్లో ఒకరు ఎంబీబీఎస్లో సీట్లు సాధించారు -
రెండేళ్లు బయట చదివితే స్థానికులు కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థి కేవలం రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళితే తప్పు ఏంటని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉన్నత చదువుల కోసమో.. తల్లిదండ్రుల బదిలీ కారణంగానో రెండేళ్లపాటు రాష్ట్రం బయట చదివితే వారిని స్థానికత కోటా నుంచి తప్పించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వచ్చే శుక్రవారంలోపు స్థానికత అంశంపై లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మెడికల్ సీట్ల భర్తీలో స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 11న దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం వాదనలు ముగించి, తీర్పును రిజర్వ్ చేసింది. 2028లో ఎందుకు అమలు చేయకూడదు?తెలంగాణ విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి) ప్రకారం ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఏపీ విద్యార్థులకు కల్పించిన గడువు ముగిసిపోవటంతో ఈ జీఓ తెచ్చినట్లు వివరించారు. దీని ప్రకారం సివిల్ సర్వీసెస్ (ఐఏఎస్, ఐపీఎస్), ఇతర ఉద్యోగాల్లో తల్లిదండ్రులు డిప్యుటేషన్పై వెళితే, ఇతర రాష్ట్రాల్లో చదువుకొన్న వారి పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని కొన్ని ప్రత్యేక కేసులతో ముడి పెట్డకుండా లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టితో ఆలోచించాలని కోరారు. ఈ సమయంలో కలగజేసుకున్న సీజేఐ జస్టిస్ గవాయ్.. పదేళ్లు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, 2028లో జీఓ 33ను ఎందుకు అమలు చేయకూడదు అని ప్రశ్నించారు. పదేళ్ల గడువు ముగిసినంత మాత్రాన అందరికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డీ)లోని అంశాలు తెలియవని అభిప్రాయపడ్డారు. 2028లో కొత్త నిబంధనలు తీసుకువస్తే వచ్చే నాలుగేళ్లలో స్థానికంగా చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కాళోజీ వర్సిటీ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్తోపాటు మహారాష్ట్ర, తమిళనాడులోనూ ఇలాంటి స్థానికత అమలులో ఉందని గుర్తుచేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉన్న పదేళ్ల గడువు ముగిసినందున తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించిందని తెలిపారు. దీంతో జస్టిస్ చంద్రన్ స్పందిస్తూ.. ‘తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు విద్యనభ్యసించి ఉండాలని రూల్ తెస్తున్న విషయం స్థానిక ప్రజలందరికీ తెలుసు అని భావించడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రతి విద్యార్థి ఆర్టికల్ 371 (డి) గురించి తెలుసుకోవాలని అన్నట్లుగా మీ వాదన ఉంది. 8వ తరగతిలోనే రాజ్యాంగాన్ని చదువుకోవాలన్నట్లు మాట్లడటం సరికాదు. చదువురాని తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా’ అని ప్రశ్నించారు.పదేళ్లు చదివినానాన్ లోకల్ అవుతున్నాంప్రభుత్వం తరఫున సుదీర్ఘ వాదనల అనంతరం విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెలంగాణలో పుట్టి 10వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివినా జీఓ 33 కారణంగా స్థానిక కోటా దక్కడం లేదని తెలిపారు. 11, 12వ తరగతులు చదవని కారణంగా నీట్లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నట్లు నివేదించారు. దాదాపు 2 గంటలపాటు సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఇంక ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. -
ఆగస్టు 3న నీట్ పీజీ ఎంట్రన్స్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే నెల 3న నీట్–పీజీ ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు 45 నిమిషాలకు ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాల్సి ఉంది. వాస్తవానికి జూన్ 15న రెండు షిఫ్టుల్లో జరగాల్సిన ఈ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎన్బీఈఎంఎస్ దీన్ని ఆగస్టు 3కు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ పీజీ రాయనుండగా తెలంగాణ నుంచి సుమారు 10 వేల మంది రాసే అవకాశం ఉందని అంచనా. ఇందుకోసం రాష్ట్రంలో హైదరాబాద్ సహా 10 కేంద్రాలను ఎంపిక చేశారు. విద్యార్థులకు జూలై 31 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచనున్నారు. సెప్టెంబర్ 3 నాటికి ఫలితాలను ఆన్లైన్లో పొందుపరచనున్నారు. గతేడాది కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 25,791 సీట్లను కేటాయించారు. -
నీట్ ఫెయిల్.. కట్ చేస్తే రూ.72.3 లక్షల ఉద్యోగం
అనుకున్నది సాధించాలనే తపన చాలామందికి ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితులు అందుకు సహకరించకపోవచ్చు. దాంతో కుంగిపోక ఇతర మార్గం ఎంచుకున్నా అందులోనూ ఉన్నతస్థాయికి వెళ్లొచ్చని బెంగళూరుకు చెందిన ఓ యువతి నిరూపించారు. డాక్టర్గా స్థిరపడేందుకు రాసే నీట్ పరీక్ష కోసం కేఎస్ రితుపర్ణ ఎంతో కష్టపడ్డారు. కానీ పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఆ పరీక్షలో అర్హత సాధించలేకపోయారు. దాంతో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇంజినీరింగ్లో చేరారు.మంగళూరులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీలో చేరారు. ఎప్పటికప్పుడు తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ, నైపుణ్యాలు పెంచుకున్నారు. దాంతో ఇంజినీరింగ్ ఆరో సెమిస్టర్లో ఆమె రోల్స్ రాయిస్లో ఎనిమిది నెలల ఇంటర్న్షిప్ను సాధించారు. తన ప్రతిభను గుర్తించిన కంపెనీ 2024 డిసెంబర్లో ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ను అందించింది. రోల్స్ రాయిస్ జెట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లో ఏడాదికి రూ.39.6 లక్షలతో కంపెనీలో చేరారు. చేరిన నాలుగు నెలల్లోనే అంటే ఏప్రిల్ 2025లో తన నైపుణ్యాలను గుర్తించిన కంపెనీ తన వేతనాన్ని రూ.72.3 లక్షలకు పెంచింది.ఇదీ చదవండి: ఫేస్బుక్పై రూ.68 వేలకోట్ల దావా‘నేను నీట్కు ఎంతో ప్రయత్నించాను. కానీ అర్హత సాధించలేకపోయాను. దాంతో ఇంజినీరింగ్ ఎంచుకున్నాను. రోబోటిక్స్, ఆటోమేషన్ ఇంజినీరింగ్ అంటే ఎంతో ఇష్టం. అంకితభావంతో పనిచేస్తూ, కొత్త విషయాలను నేర్చుకోవడం, నూతన ఆలోచనలను టీమ్తో పంచుకోవడం, టెక్నికల్ సమస్యలకు పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించాను’ అని రితుపర్ణ తెలిపారు. రైతులకు సహాయం చేయడానికి కాలేజీలో రోబోను తయారు చేసిన ప్రాజెక్టులో ఆమె పనిచేశారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పతకాలు సాధించారు. ఏడో సెమిస్టర్ పూర్తి చేసుకున్న తర్వాత రోల్స్ రాయిస్ టెక్సాస్ జెట్ ఇంజిన్ విభాగంలో చేరనున్నారు. 20 ఏళ్ల యువతి కంపెనీ జెట్ విభాగంలో అత్యంత పిన్న వయస్కురాలుగా రికార్డులకెక్కనుంది. -
ఎంబీబీఎస్ ప్రవేశాలకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్లో ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారైంది. నీట్ యూజీ–2025 కౌన్సెలింగ్ ఈనెల 21 నుంచి ప్రారంభమవుతుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) శనివారం ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆలిండియా కోటా మొదటి దశ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. అందులో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ నాటికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 7, 8 తేదీల్లో ఎంసీసీ డేటా పరిశీలన చేయనుంది. అలాగే ఈనెల 30 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు స్టేట్ కోటా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.సీట్లు పొందిన అభ్యర్థులు వచ్చే నెల 12లోగా ఆయా కాలేజీల్లో చేరాలి. రెండో దశ ఆలిండియా కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 12 నుంచి 20 వరకు, స్టేట్ కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 19 నుంచి 29 వరకు ఉంటుంది.సెప్టెంబర్్ 3 నుంచి 10వ తేదీ వరకు మూడో దశ ఆలిండియా కోటా, 9 నుంచి 18 వరకు స్టేట్ కోటా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. స్ట్రే వేకెన్సీ కింద సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు ఆలిండియా కోటా సీట్లను, 25 నుంచి 29 వరకు స్టేట్ కోటా సీట్లను భర్తీ చేస్తారు. ఆలిండియా కోటాలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్లు, ఎయిమ్స్, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేస్తారు.సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, పూర్తి వివరాలను ఎంసీసీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. -
21 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లోప్రవేశం కోసం నీట్ యూజీ– 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆలిండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రం పరిధిలోని సీట్లలో చేరికకు సంబంధించిన కౌన్సెలింగ్ తేదీలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆలిండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలకు మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21 నుంచి 30వతేదీ వరకు జరుగు తుంది. మూడు రౌండ్లలో జరిగే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 10వ తేదీ వరకు సాగనుంది.స్టేట్ కౌన్సెలింగ్ మొ దటి దశను ఈ నెల 30 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 వరకు మూడు రౌండ్లలో ఈ కౌన్సెలింగ్ సాగనుందని ఎంసీసీ తెలిపింది. సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. తెలంగాణ నుంచి నీట్ యూజీ –2025 పరీక్ష 70,259 మంది రాయగా, 43,400 మంది కౌన్సెలింగ్కు అర్హత సాధించినట్లు ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.రాష్ట్రంలో 9,065 ఎంబీబీఎస్ సీట్లురాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు డీమ్డ్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిపి 64 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 34 రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు కాగా , 26 ప్రైవేటు కాలేజీలు. మల్లారెడ్డి డ్రీమ్డ్ యూనివర్సిటీ పేరిట 2 కాలేజీలు ఉండగా, ఈఎస్ఐ, బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఈ కళాశాలలన్నింటిలో కలిపి 9,065 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో 34 ప్రభుత్వ కళాశాలల్లో 4,090 సీట్లు ఉండగా, వాటిలో 15 శాతం అంటే 613 సీట్లు ఆలిండియా కోటా కిందికి వెళ్తాయి. మిగతా 3,477 సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి.అలాగే 26 ప్రైవేట్ కళాశాలల్లో 4,350 సీట్లు ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన రెండు మెడికల్ కాలేజీలు (ఒకటి మహిళా కాలేజ్) డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీలో ఉన్నాయి. ఈ రెండు కళాశాలల్లో కలిపి 400 సీట్లు ఉండగా, డీమ్డ్ యూనివర్సిటీ విభాగంలో వీటికి కౌన్సెలింగ్ జరుగనుంది. కాగా ప్రైవేటు కాలేజీల్లోని 4,350 సీట్లలో 50 శాతం కనీ్వనర్ కోటా కింద తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి. మరో 35 శాతం సీట్లు బీ – కేటగిరీలో, 15 శాతం సీట్లు సీ కేటగిరీలో ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు లు చెల్లించే స్తోమత ఉన్నవారికే కేటాయిస్తారు. ఇవి కాకుండా ఈఎస్ఐ కాలేజీలో 125 సీట్లు, బీబీనగర్ ఎయిమ్స్లోని 100 సీట్లను ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. -
తెలంగాణ నీట్ అర్హుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 43,400 మంది జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. అయితే ఈ జాబితా కేవలం నీట్లో అర్హత పొందిన అభ్యర్థుల వివరాల కోసం మాత్రమేనని.. మెరిట్ జాబితా కాదని వర్సిటీ స్పష్టం చేసింది. పూర్తి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేయనుంది. ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులు (ఎన్సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో–ఇండియన్, ఎస్సీసీఎల్) మెరిట్ జాబితాను విడిగా విడుదల చేస్తామని వర్సిటీ రిజి్రస్టార్ పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు మెడికల్ బోర్డు ద్వారా పరీక్ష నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈనెల చివరి వారంలో ఎంసీసీ కౌన్సెలింగ్? నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలకు చెందిన మెరిట్ జాబితాను ప్రకటించిన తరువాత ముందుగా జాతీయ స్థాయిలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓపెన్ కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఈనెల చివరి వారంలో ప్రారంభమవుతుంది. నేషనల్ కౌన్సెలింగ్ పూర్తయ్యాక రాష్ట్రంలో అభ్యర్థులు ఇచ్చే వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఆగస్టు తొలి వారంలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని వర్సిటీకి చెందిన ఓ కీలక అధికారి తెలిపారు. -
నీట్ యూజీ అర్హుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం విడుదల చేసింది. వర్సిటీ అధికారిక వెబ్సైట్లో జాబితాను అందుబాటులో ఉంచారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర విద్యార్థులు సాధించిన ర్యాంక్లు, స్కోర్లలో భారీ వ్యత్యాసం నెలకొంది. గతేడాదితో పోలిస్తే...2024తో పోలిస్తే..మొదటి వందమంది లోపు విద్యార్థులు 681–710 స్కోర్ సాధించగా.. వందో విద్యార్థికి అప్పట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 6,488 వచ్చింది. ఈ దఫా వందలోపు విద్యార్థులు 593–669 వరకూ స్కోర్ సాధించగా, వందో విద్యార్థికి 1,946 ర్యాంక్ వచ్చింది. గతేడాది 500, ఆపైన స్కోర్ చేసిన విద్యార్థులు 7,261 మంది ఉండగా.. ఈసారి 1,813 మంది ఉన్నారు. గతంలో 400–499 స్కోర్ చేసిన వారు 4,517 మంది ఉండగా.. ఇప్పుడు 6,810 మంది ఉన్నారు.ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్రాష్ట్రస్థాయి అర్హుల జాబితా వెలువడిన దృష్ట్యా త్వరలో కన్వీనర్, యాజమాన్య కోటా ప్రవేశాలకు వేర్వేరుగా హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆధారంగా మెరిట్ జాబితాలు ఖరారు చేస్తారు. ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్ర స్థాయిలో తొలుత కన్వీనర్, అనంతరం యాజమాన్య కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతారు. 2024–25 విద్యా సంవత్సరం ప్రకారం రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో కన్వీనర్, బీ, సీ కేటగిరి ఎంబీబీఎస్ సీట్లు 6,510 ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 4,521 సీట్లుండగా.. ప్రభుత్వ కళాశాలల్లోని 475 సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 4,046 సీట్లను రాష్ట్రస్థాయిలో కన్వీనర్ కోటా కింద వర్సిటీ భర్తీ చేస్తుంది. 1,989 సీట్లు యాజమాన్య (బీ, సీ) కోటాలోకి వస్తాయి. బీడీఎస్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 1,540 సీట్లుండగా.. ఆల్ ఇండియా కోటాలో 21, రాష్ట్ర కన్వీనర్ కోటాలో 818, యాజమాన్య కోటాలో 700 సీట్లు భర్తీ చేస్తారు.దళారుల మాటలు నమ్మి మోసపోవద్దువిద్యార్థుల సమాచారం కోసం అర్హుల జాబితా విడుదల చేశామని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సోమవారం వెల్లడించారు. వర్సిటీ, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు ఇప్పిస్తామనే దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపునకు సంబంధించిన ప్రతి సమాచారం వర్సిటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. నీట్ ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లను కేటాయిస్తామన్నారు. -
ఓ తండ్రి దారుణం.. మార్కులే జీవితమా?
సాంగ్లీ: నీట్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి.. కూతురిని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాంగ్లికి చెందిన 17 ఏళ్ల సాధన వైద్య జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రాసింది. ఇటీవలే ఫలితాలు వచ్చాయి. సాధనకు తక్కువ మార్కులు రావడంతో ఆగ్రహించిన ధోండి రామ్ భోస్లే శుక్రవారం రాత్రి ఆమెను కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆమె తల్లి ప్రీతి భోస్లే.. స్థానిక ఆసుపత్రికి తరలించింది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు.అనంతరం, అక్కడ చికిత్స పొందుతూ సాధన మరణించింది. కూతురికి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ప్రీతి.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు.. ధోండి రామ్ భోస్లేను ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జూన్ 24 వరకు పోలీసు కస్టడీకి విధించారు. -
నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!
ఆర్థికంగా వెనకబడిని వారికి ఉన్నత చదువులు అందని ద్రాక్షలాంటివే. చదవగలిగే ప్రతిభ ఉన్న..అందుకు తగిన ఆర్థిక సాయం, ప్రోత్సాహం కరువైతే..వారి ప్రతిభ అడుగంటిపోతుంది. పైగా దేశం గొప్ప మేధావులను కోల్పోతుంది కూడా. ఆ ఉద్దేశ్యంతో వెనుబడిన వర్గాల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ల రూపంలో చదువుకునే అవకాశాన్ని అందిస్తోంది. అలా ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుని ఈ మూగ్గురు అమ్మాయిలు ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షల్లో సత్తా చాటారు. అంతేగాదు సర్కారు చదువు సత్తా ఏంటో తెలిసేలా చేశారు. యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ మారిహాన్ గ్రామంలోని ప్రభుత్వ సర్వోదయ విద్యాలయానికి చెందిన మొత్తం 12 మంది బాలికలు వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. హాజరైన బాలికల్లో దాదాపు సగానికి పైగా అందరు వెనుకబడిన వర్గాలకు చెందినవారే. యూపీ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఘనత ఇది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం ఏర్పాటైన సర్వోదయలో బాలికలు ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలో వారంత ఆరు నుంచి 12 తరగతులు వరకు చదువుకుంటారు. అక్కడే రెడిడెన్షియల్ స్కూల్లో ఈ ఏడాది జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు కోచింగ్ కూడా పోందారుద. వారిలో వ్యవసాయ కూలీ కూతురు ప్రిన్సీ, రైతు కూతురు పూజ రంజన్, సైకిల్ సీట్ కవర్లు అమ్మే దుకాణందారుడు కూతురు కౌశాంబి శ్వేత ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారి వచ్చిన నేపథ్యం దృష్ట్యా డాక్టర్ కావలనే కోరిక మసకబారిపోతుందనే అనుకున్నారు. అందులోనూ ప్రభుత్వ పాఠశాల చదవే తాము ఈ నీట్ ఎగ్జామ్ లాంటి వాటి కోసం కోచింగ్ తీసుకునే ఛాన్సే లేదు. కాబట్టి డాక్టర్ కావడం అనేది ఓ కలేనేమో అనుకున్నారు ఆ అమ్మాయిలు. వారి అదృష్టమో లేక వరమో గానీ నవోదయ పూర్వ విద్యార్థుల నెట్ వర్క్ అయిన టాటా AIG, మాజీ నవోదయ ఫౌండేషన్ మద్దతుతో వారు ఉంటున్న మారిహాన్ గ్రామంలోనే నీట్ కోచింగ్ 2024 చిన్నగా ప్రారంభమైంది. అది వారికి వరమైన ఆ ఎగ్జామ్కి ప్రిపేరయ్యిందుకు తోడ్పడింది. ఆ చిన్న ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఈ ఎగ్జామ్లో ఈ ముగ్గురు అమ్మాయిలు ఉత్తీర్ణులై తమ కలను సాకారం చేసుకున్నారు. ఆ స్వచ్ఛంధ సంస్థలో సుమారు 39 అడ్మిషన్ పోందగా వారిలో 25 మంది నీట్కి, మిగతా 14 మంది జేఈఈకి ప్రిపేరయ్యారు. అయితే ఆ నీట్ ఎగ్జామ్కి హాజరైన 25 మందిలో 12 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. దీన్ని మిగతా సర్వోదయ విద్యాలయాల్లో కూడా అందించి.. వెనుబడిన వర్గాల పిల్లలందరూ ఇలాంటి ఉన్నత చదవులు చదువుకుని తమ కలను సాకారం చేసుకునేలా చేయడమే తమ ధ్యేయం అని మారిహాన్ సాంఘిక సంక్షేమ డైరెక్టర్ కుమార్ ప్రశాంత్ అన్నారు. (చదవండి: అమ్మాయిలూ.. బహుపరాక్!) -
ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది
‘సమస్య నీలోనే ఉన్నప్పుడు...దానికి పరిష్కారం కూడా నీలోనే ఉంటుంది’... ఇది తత్వం కాదు. నిజం. ‘నీట్’కు ప్రిపేర్ అవుతున్న క్రమంలో అవిక ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేది. కన్నీళ్లు తుడుచుకున్నాక... ఒత్తిడిని దూరం చేసే దారి కనిపించింది. ఇక ఎప్పుడూ ఆమె ఏడవ లేదు. ఇప్పుడు ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది.‘చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలనుకునేదాన్ని’ అంటున్న పదిహేడు సంవత్సరాల అవిక అగర్వాల్ జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’లో 5వ ర్యాంక్ సాధించింది. వైద్యుల కుటుంబంలో పుట్టిన అవిక ఆ వృత్తి విలువను ప్రత్యక్షంగా చూసింది.ఫరిదాబాద్కు చెందిన అవిక పదవతరగతి వరకు ఢిల్లీలో చదివింది. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ఎప్పుడూ ప్రశాంతచిత్తంతో కనిపించే తల్లిదండ్రులను చూడడం తనకు ఇష్టం.‘వారు ఎంతోమందిని బాధ నుంచి విముక్తి చేశారు. జీవితంపై ఆశ కల్పించారు’ అంటుంది తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులను చూసి డాక్టర్ కావాలనుకున్న అవిక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఒత్తిడిని తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే ఆ ఒత్తిడికి పరిష్కారాన్ని కూడా కనిపెట్టింది. తనకు ఇష్టమైన టేబుల్ టెన్నిస్ ఆడడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడేది.యుద్ధంలోనే కాదు పరీక్షల యుద్ధంలోనూ వ్యూహం(స్ట్రాటజీ) అనేది ముఖ్యం. ‘మేజర్, మైనర్ గోల్స్గా నా స్ట్రాటజీని విభజించుకున్నాను. నీట్ అనేది నా మేజర్ గోల్. మైనర్ గోల్...ప్రతిరోజూ ఇంటికి వెళ్లిన తరువాత విన్న పాఠాలను మననం చేసుకోవడం. డౌట్స్ లేకుండా చూసుకోవడం. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం’ అంటుంది అవిక. (చదవండి: మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!) -
ఫోన్ పౌచులు అమ్మి.. నీట్ విజేతగా..
కష్టే ఫలి. శ్రమయేవ జయతే.. అని అన్నారు పెద్దలు. ఇక్కడో కుర్రాడి సక్సెస్ను చూస్తే ఆ మాట ఒప్పుకుని తీరాల్సిందే. కరోనా టైంలో తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న యువకుడు.. రేయింబవలు కష్టపడ్డాడు. తాను అనుకున్నది సాధించి.. ఇప్పుడు నీట్ విజేతగా నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నాడు.జార్ఖండ్కు చెందిన రోహిత్ కుమార్(Jharkhand Rohit Kumar).. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలో 549 మార్కులతో ఆల్ ఇండియాలో 12,484 ర్యాంక్ సాధించాడు(కేటగిరీ వైజ్గా 1,312 ర్యాంక్). ఫిజిక్స్ వాలాగా పేరుకున్న అలఖ్ పాండే.. తాజాగా ఈ యువకుడిని పలకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోహిత్ కుమార్ తండ్రి స్థానికంగా కూరగాయలు అమ్మేవాడు. 12 తరగతి పూర్తయ్యాక పూర్తిగా నీట్ మీద దృష్టి పెట్టేందుకు పైచదువులు మానేశాడు రోహిత్. ఆపై కరోనా టైంలో ఓ మెడికల్ షాపులో పని చేసే సమయంలో ఎలాగైనా వైద్య వృత్తిలో స్థిరపడాలనే కసి మొదలైంది. ఆపై సెల్ ఫోన్ పౌచులు అమ్మకునే దుకాణం తెరిచి.. రెండు పడవలపై ప్రయాణం చేస్తూ వచ్చాడు.ఉదయం 7గం. నిద్రలేచే రోహిత్ కుమార్.. పగలంతా తన బండి మీద సెల్ ఫోన్ పౌచులు అమ్ముకున్నాడు. ఆపై రాత్రి వేళలో ఇంటికి చేరి పుస్తకాలతో కుస్తీ పడుతూ వచ్చాడు. అలా అలా.. అర్ధరాత్రి 3గం. చదివేవాడు. ఇదే అతని రోజూవారీ చర్యగా మారింది. నీట్లో ర్యాంకుతో రోహిత్ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు వచ్చిన ర్యాంకుకు.. సొంత రాష్ట్రంలోనే సీటు రావాలని ఆశలు పెట్టుకున్నాడతను. చివరగా.. వెళ్తూ వెళ్తూ ఫిజిక్స్ వాలా అలఖ్ పాండే ఆ కుర్రాడికి డాక్టర్ కోటును బహుకరించాడు. కాబోయే డాక్టర్గా ఆ వైట్ కోట్ను ధరించి మురిసిపోయిన ఫొటో, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah)ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 22.09 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. గతేడాదితో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. ఫలితాల్లో.. ఈ ఏడాది రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ 99.09999547 శాతంతో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ ఫిమేల్ టాపర్గా నిలిచింది. ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా లక్షా 70 వేల మంది అర్హత సాధించగా.. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
నీట్ యూజీ-2025 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన నీట్ యూజీ-2025 ఫలితాలు ఈ రోజు (జూన్ 14)విడుదలయ్యాయి. తుది సమాధానపు కీని కూడా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా నీట్ యూజీ- 2025 ఫలితాలను తెలుసుకోవచ్చు.ఇందుకోసం అభ్యర్థులకు వారి అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ అవసరమవుతుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశానికి కటాఫ్ మార్కులను కూడా ఈ ఫలితాలతో పాటు విడుదల చేశారు. గత సంవత్సరం నీట్ పరీక్ష కటాఫ్ గణనీయంగా ఎక్కువగా ఉంది. 2024లో జనరల్, ఆర్థికంగా వర్గాలవారికి కటాఫ్ 162 మార్కులుగా ప్రకటించారు. గత సంవత్సరాల ట్రెండ్లు, ఈ ఏడాది పరీక్ష స్థాయిని పరిగణనలోకి తీసుకున్న దరిమిలా కటాఫ్ కొద్దిగా తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ సంవత్సరం 20 లక్షలకు పైగా అభ్యర్థులు ‘నీట్’కు హాజరుకాగా, ఈ పరీక్ష 2025, మే 4న జరిగింది. -
నీట్కు ప్రిపేర్ అవుతూ.. నెలలో రెండో ‘ఉదంతం’
కోటా: రాజస్థాన్లోని కోటాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీట్కు సిద్ధమవుతున్న ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. జమ్ముకశ్మీర్కు చెందిన విద్యార్థిని వైద్య విద్య ప్రవేశపరీక్ష ‘నీట్’కు ప్రిపేర్ అయ్యేందుకు కోటాకు వచ్చింది. ప్రతాప్ చౌరాహాలోని పేయింగ్ గెస్ట్ రూమ్లో ఉంటూ, సొంతంగా నీట్(NEET)కు ప్రిపేర్ అవుతోంది.వివరాల్లోకి వెళితే ప్రతాప్ చౌరాహాలో ఉంటున్న జీషాన్(18) తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహావీర్ నగర్ పోలీస్ స్టేషన్(Police station) సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ కవియా తెలిపిన వివరాల ప్రకారం జీషాన్ ఆత్మహత్య చేసుకునే ముందు తన బంధువులతో మాట్లాడుతూ, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపింది. వెంటనే అప్రమత్తమైన వారు జీషాన్ ఉంటున్న భవనంలోనే ఉంటున్న మరో విద్యార్థిని మమతకు ఈ విషయం తెలియజేశారు.వెంటనే మమత.. జీషాన్ గది వద్దకు చేరుకుంది. గది తలుపు లోపలి నుండి లాక్ చేసివుండటాన్ని గమనించిన ఆమె సహాయం కోసం స్థానికులను పిలిచింది. వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, జీషాన్ ఫ్యాన్కు ఉరి వేసుకున్న స్థితిలో వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా జీషాన్ ఇక్కడ కోచింగ్ కోసం నెల రోజుల క్రితమే వచ్చిందని, ఏ ఇన్స్టిట్యూట్లోనూ చేరకుండా స్వయంగా నీట్కు సిద్ధమవుతున్నదని పోలీసులు తెలిపారు. ఈ ఏడాదిలో కోటాలో ఇప్పటి వరకూ 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెలలో ఇది రెండవ ఘటన.‘కోటా’ మరణాలపై సుప్రీంకోర్టు సీరియస్రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్, ఐఐటీ కోచింగ్ సెంటర్లకు అడ్డాగా ఉన్న రాజస్థాన్లోని కోటాలో ఈ ఏడాది 14 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఏం చేస్తోంది?.. కోటాలో ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలను తేలికగా తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చి చెప్పింది. ఆత్మహత్యలపై సిట్ ఏర్పాటు చేశామని రాజస్థాన్ సర్కార్ తెలిపింది. తదుపరి విచారణ జులై 14కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, రాజస్థాన్లో కోచింగ్ సెంటర్ హబ్గా పేరు పొందిన కోటాలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది చాలా ఆందోళకరమైన విషయం అంటూ రాజస్థాన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటూ నిలదీసింది.ఇది కూడా చదవండి: Paper Airplane Day: నూతన ఆవిష్కరణలకు నాంది -
నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే
చెన్నై: నీట్ ఫలితాల విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలను విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది.తమ ఎగ్జామ్ సెంటర్లో విద్యుత్ అంతరాయం కారణంగా.. పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని కొంతమంది విద్యార్థులు ఫిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు, ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫలితాలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. కాగా రిజల్ట్స్ విడుదలకు సంబంధించిన తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.2024 - 25 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో ప్రవేశాలకై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షలమంది అప్లై చేసుకోగా.. 20.8 లక్షలమంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. -
నీట్ పరీక్ష రాసింది.. ఇంటికొచ్చి ప్రాణం తీసుకుంది!
జగిత్యాల జిల్లా : జిల్లాలోని చల్ గల్ గ్రామానికి చెందిన జంగా పూజ(18) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నీట్ పరీక్ష రాసిన ఆమె.. పేపర్ ను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల క్రితం రాసిన నీట్ పరీక్షలో ర్యాంకు రాకపోవడంతో రెండోసారి తాజాగా నీట్ పరీక్ష రాసింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ ను క్రాస్ చెక్ చేసుకుని ర్యాంకు రాదనే ఆందోళనలో పడింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుంది.కాగా, జగిత్యాల జిల్లాలోని రెండు కేంద్రాల్లో నిర్వహించిన నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నాచుపల్లి జేఎన్టీయూ కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. అక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఒక సెంటర్లో 480, రెండో సెంటర్లో 278 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఒక కేంద్రంలో 13 మంది, మరో కేంద్రంలో ఐదుగురు గైర్హాజరైనట్లు వివరించారుమూడు నిమిషాల ఆలస్యం.. పరీక్షకు దూరంమల్యాల: జేఎన్టీయూ పరీక్ష కేంద్రం తెలియక మూడు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న ఓ విద్యార్థిని పరీక్ష దూరమైంది. మల్లాపూర్ మండలం వీవీ.రావుపేటకు చెందిన సీహెచ్.నవ్యకు జేఎన్టీయూ కేంద్రం పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరింది. ఇంజినీరింగ్ కళాశాల అడ్రస్పై అవగాహన లేక దిగువ కొండగట్టు వరకు వెళ్లారు. పూర్తి అడ్రస్ తెలుసుకుని వెళ్లే సరికి మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో అక్కడున్న సిబ్బంది లోపలికి అనుమతించలేదు. గతంలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా.. ఆశించిన ఫలితం రాలేదని, మరోసారి పరీక్షకు సన్నద్ధమైన రాయలేకపోయాయని ఆవేదనతో తిరిగి వెళ్లిపోయింది.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
నీట్ కఠినం
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2025 ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఫిజిక్స్ విభాగంలో అత్యంత సంక్లిష్టంగా, బయాలజీలో సులువుగా, కెమిస్ట్రీలో మధ్యస్తంగా ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించారు. 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ పరీక్షను ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించింది. జాతీయ స్థాయిలో 22.7 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, దేశంలో 552, దేశం వెలుపల 14 నగరాలు, పట్టణాల్లో పరీక్ష రాశారు.రాష్ట్రంలో నీట్ ప్రశాంతంగా ముగిసింది. గతేడాది పేపర్ లీక్, అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే కేంద్రాల్లోకి అనుమతించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. గతేడాది జాతీయ స్థాయిలో 17 మంది విద్యార్థులు 720కు 720 స్కోర్ చేశారు. ఈ దఫా 720కు 720 స్కోర్ చేసే అవకాశం ఏ మాత్రం లేదంటున్నారు. మొత్తంగా ప్రశ్నాపత్రం సరళి గతానికి పూర్తి భిన్నంగా ఉందని మెజారిటీ అభిప్రాయం వ్యక్తమైంది. 2016, 2017ల్లో ఈ తరహాలో ప్రశ్నాపత్రం సరళి ఉందని కొందరు చెప్పారు. విద్యార్థులను నిరుత్సాహపరిచిన ఫిజిక్స్ ఈ దఫా ఫిజిక్స్ విభాగం విద్యార్థులను పూర్తిగా నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. జేఈఈ మెయిన్స్ స్థాయిలో ఈ విభాగంలో ప్రశ్నలు ఉన్నాయి. సాధారణంగా కోచింగ్ సెంటర్లలో కూడా ఈ తరహా ప్రశ్నలు బోధించరని, మాక్ టెస్ట్లలోనూ ఉండవని తెలిసింది. గతేడాది ఫిజిక్స్ విభాగంలో ఏడు ప్రశ్నలు థియరీ విధానంలో జవాబులు గుర్తించేలా ఉన్నాయి. ఈ సారి థియరీ ఆధారంగా జవాబులిచ్చే ప్రశ్నలు ఒక్కటి కూడా లేవని సబ్జెక్ట్ నిపుణులు వెల్లడించారు. సుదీర్ఘమైన ప్రశ్నలు, ప్రతి దానికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.దీంతో ఫిజిక్స్ ప్రశ్నలకు సమాధానాల కోసమే విద్యార్థులు ఎక్కువ సమయం తీసుకున్నారని వివరించారు. ముఖ్యంగా 10 ప్రశ్నలు ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులూ జవాబు ఇవ్వడానికి వీల్లేకుండా ఉన్నాయన్నారు. దీంతో మెజార్టీ విద్యార్థులు ఈ 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉండటం/తప్పు సమాధానం ఇవ్వడం చేసి ఉంటారని పేర్కొన్నారు. కెమిస్ట్రీలో ఎన్సీఈఆర్టీ స్థాయిని దాటి ప్రశ్నలు ఉన్నాయని చెబుతున్నారు.ఒక ప్రశ్నకు సమాధానంగా రెండు ఆప్షన్లు ఉంటాయని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. బయాలజీలో ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పరిధిలోనే వచ్చాయని, దీంతో ఎన్సీఈఆర్టీ సిలబస్లో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులు సులువుగా సమాధానాలిచ్చారని పేర్కొంటున్నారు. పేపర్ కఠినంగా ఉన్న క్రమంలో గతేడాదితో పోలిస్తే కటాఫ్లు బాగా తగ్గే అవకాశ ఉందని కోచింగ్ సెంటర్ల నిపుణులు అభిప్రాయపడ్డారు. -
ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష
న్యూఢిల్లీ, సాక్షి: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(NEET) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిబంధన మేరకు.. పలు కేంద్రాల వద్ద నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. దీంతో కంటితడి పెడుతూ పలువురు సెంటర్లను వీడారు.దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాల్లో 5 వేలకు పైగా సెంటర్లలో.. అలాగే దేశం వెలుపల 14 నగరాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. గతేడాది నీట్(National Eligibility cum Entrance Test) యూజీ ప్రశ్నపత్రం లీక్తో పాటు ఇతర అవకతవకలు చోటు చేసుకోవడంతో.. ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో కలిపి 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ రాసే అవకాశముందని అంచనా. నీట్లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. -
నేడే నీట్ యూజీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ–2025ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెన్, పేపర్(ఆఫ్లైన్) విధానంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో కలిపి 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తోంది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. గతేడాది నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్తో పాటు ఇతర అవకతవకలు చోటు చేసుకోవడంతో.. ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని అన్ని జిల్లాల యంత్రాంగాలను ఎన్టీఏ ఆదేశించింది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు.. ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ రాసే అవకాశముందని అంచనా. గతేడాది 24.06 లక్షల మంది దరఖాస్తు చేయగా 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి గతేడాది 66 వేల మంది దరఖాస్తు చేయగా.. 64 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే రాష్ట్రం నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాలు, పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 6,500 మేర సీట్లు ఉన్నాయి. -
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ–2025 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి కేంద్ర విద్యా శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. మే 4న దేశవ్యాప్తంగా 550 నగరాలు, పట్టణాల్లో 5,000 సెంటర్ల్లో ఈ పరీక్ష నిర్వహించనుంది. గతేడాది నీట్ ప్రశ్నాపత్రం లీక్, అవకతవకలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నీట్ నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పోలీస్ ఎస్కార్ట్తో ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ఇతర కీలక సామాగ్రిని తరలించనున్నారు.పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ భద్రతతో బహుళ అంచెల్లో తనిఖీలు చేపట్టనున్నారు. వ్యవస్థీకృత మోసాలను అరికట్టడంపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కోచింగ్ సెంటర్లు, డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో కార్యకలాపాలపైనా నిఘా పెట్టారు. నీట్ అభ్యర్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా పరీక్ష పత్రాలు లీక్, అవకతవకలు, ఇతర ఆరోపణలతో పుకార్లు పుట్టుకువస్తున్నాయి. ఈ సందర్భాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎనీ్టఏ) వివరణలు ఇస్తూ వస్తోంది.నీట్ 2025పై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తలెత్తే అనుమానాస్పద అంశాలు, సందేహాలను తెలియజేయడానికి ప్రత్యేక వెబ్సైట్లను ఎన్టీఏ అందుబాటులోకి తెచ్చింది. https:// neet. nta. ac. in, https:// nta. ac. in వెబ్సైట్ల్లో అభ్యర్థులు తమ దృష్టికి వచ్చిన అనుమానాలను తెలియజేసేందుకు వీలు కలి్పంచారు. ఈ వెబ్సైట్లు మే 4న సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. -
నీట్ రూల్స్ వెరీ టఫ్
గుంటూరు ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 4న జరగనున్న జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2025) నిబంధనలు ఎంతో కఠినంగా ఉన్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్తోపాటు వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్లైన్లో జరుగుతుండగా, వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికై దేశ వ్యాప్తంగా రాత పరీక్ష (ఆఫ్లైన్) ద్వారా నిర్వహిస్తున్న ఒకే ఒక్క పరీక్ష నీట్ కావడం విశేషం. మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పరీక్ష రాసేందుకు వచ్చే ప్రతి ఒక్క విద్యార్థినీ మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం విద్యార్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కాగా మధ్యాహ్నం 1.30 తరువాత విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు నీట్ దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్తో పాటు అడ్మిట్కార్డులో పొందుపరచిన నియమావళిని విధిగా పాటించాల్సి ఉంది. 65 వేలమందికి పైగా దరఖాస్తు నీట్ యూజీకి గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 64,929 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుత ఏడాది 65 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. ఈనెల 26న సిటీ ఇంటిమేషన్ వివరాలు నీట్కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏ జిల్లాలో ఎక్కడ పరీక్షా కేంద్రాన్ని కేటాయించారనే సమాచారంతో ఈనెల 26న సిటీ ఇంటిమేషన్ వివరాలను ఎన్టీఏ అధికారిక సైట్లో పొందుపరచనుంది. విద్యార్థులు దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాలకు సంబంధించి నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా పరీక్షకు హాజరు కానున్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు.విద్యార్థులకు తమ సొంత ఊరు, జిల్లాలో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేని పక్షంలో ఇతర జిల్లాల్లోనూ పరీక్షా కేంద్రాలను కేటాయించే అవకాశాలున్నాయి. మే ఒకటిన ఎన్టీఏ సైట్లో అడ్మిట్కార్డులు విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఎన్టీఏ సైట్ నుంచి అడ్మిట్కార్డును డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో పొందుపర్చిన మార్గదర్శకాల ప్రకారం పరీక్షకు హాజరు కావాలి.వస్త్రధారణపై ఆంక్షలు⇒ విద్యార్థులు జీన్స్ ఫ్యాంట్లు వంటి వ్రస్తాలను ధరించకుండా, సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్లకు బ్లాక్ సన్గ్లాసెస్ ధరించకూడదు. విద్యార్థినులు ముక్కుపుడక, చెవులకు దుద్దులు, చేతులకు గాజులతో సహా ఎటువంటి ఆభరణాలను ధరించరాదు. ⇒ చేతికి స్మార్ట్వాచీతో పాటు సాధారణ వాచీలను సైతం ధరించకూడదు. సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల్లోని రూమ్లలో గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు. ⇒ బ్లూటూత్ వాచీలు, సెల్ఫోన్లు, స్మార్ట్బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎటువంటి వస్తువులను విద్యార్థులు తమ వెంట తీసుకురాకూడదు. ఎన్టీఏ నిబంధనలను తూచా తప్పకుండా పాటించిన విద్యార్థులనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.నీట్ జరిగేది ఇలా..⇒ పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత ఒక్కొక్కరిగా లోపలికి పంపుతారు. మధ్యాహ్నం 1.30 వరకు అనుమతించిన తరువాత పరీక్షా కేంద్రాల ప్రధాన గేట్లను మూసివేస్తారు. ⇒పరీక్షా కేంద్రాల్లోకి వచ్చిన విద్యార్థులను మధ్యాహ్నం 1.15 గంటల నుంచి కేటాయించిన సీట్లలో కూర్చోబెడతారు. ⇒ మధ్యాహ్నం 1.30 నుంచి ఇన్విజిలేటర్లు విద్యార్థుల అడ్మిట్కార్డులను తనిఖీ చేసి, పరీక్ష రాసేందుకు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలను తెలియజేస్తారు. తదుపరి మధ్యాహ్నం 2.00 గంటలకు కచ్చితంగా పరీక్షను ప్రారంభిస్తారు. విద్యార్థులను పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపించరు.విద్యార్థులు వీటిని వెంట తెచ్చుకోవాలి విద్యార్థులు అడ్మిట్ కార్డ్ ప్రింటవుట్తో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరొక పాస్పోర్ట్ సైజు ఫొటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది. దీంతో పాటు పోస్ట్కార్డ్ సైజు వైట్ బ్యాక్ గ్రౌండ్తో కూడిన కలర్ ఫొటోను అడ్మిట్కార్డుతో పాటు డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్విజిలేటర్కు అందజేయాలని నియమావళిలో పొందుపరిచారు.ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను పరీక్షా కేంద్రాల్లోనే ఇస్తారు. -
నీట్ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న
‘‘మా గుండె బండరాయేం కాదు. ఈ నిర్ణయాన్ని మేం అంగీకరిస్తున్నామని మీరు భావించొద్దు. ఇలా మాట్లాడుతున్నందుకు నేను జైలుకు వెళ్లాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ అదేం పట్టించుకోను. కొందరు చేసిన తప్పులకు మీ జీవితాలను బలికానివ్వం. నాలో ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని రోడ్డున పడనివ్వను’’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావోద్వేగంగా ప్రసంగించారు.కోల్కతా: సుప్రీం కోర్టు తీర్పుతో ఉద్యోగాలు పోగొట్టుకున్న ఉపాధ్యాయులతో సోమవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీట్ ప్రవేశ పరీక్ష మీద సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పుపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘విద్యా వ్యవస్థను ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అలా ఉంటే ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? అనే విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వాలి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో వ్యాపం కేసులో పలువురి ప్రాణం పోయింది. వాళ్లకు ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. .. నీట్ ప్రవేశ పరీక్షపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ పరీక్షను సుప్రీం కోర్టు రద్దు చేయలేదు. అలాంటప్పుడు బెంగాల్నే లక్క్ష్యంగా చేసుకోవడం ఎందుకు?. ఇక్కడి మేధస్సును భయపెట్టాలనుకుంటున్నారా? దీనికి సమాధానం కావాలి’’ అని మమత అన్నారు.ఈ విషయాలపై సుప్రీం కోర్టు ఒక స్పష్టత ఇస్తే.. మేం రుణపడి ఉంటాం. ఒకవేళ ఇవ్వకుంటే.. మీకు అండగా ఎలా నిలబడాలో మేం దారి కనిపెడతాం. రెండు నెలలుగా మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు. అలాగని మిమ్మల్ని 20 ఏళ్లు బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు. ఈ రెండు నెలలకు కూడా మీకు పరిహారం చెల్లిస్తాం.మూడు నెలల్లో నియామక ప్రక్రియ తిరిగి చేపట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలకు మేం కట్టుబడి ఉన్నాం. కానీ, ఈ వ్యవహారంపై స్పష్టత కోరాం. ఆ స్పష్టత రాగానే తీర్పుపై రివ్యూ పిటిషన్ కూడా వేస్తాం. మీకింకా ఉద్యోగాల నుంచి తొలగించినట్లు లేఖలు రాలేదు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. మీ ఉద్యోగాలకు మాది భరోసా. నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు రోడ్డున పడే దుస్థితి మీకు రానివ్వను అని అన్నారామె. అంతకు ముందు.. సుప్రీం కోర్టు తీర్పుకు ప్రభుత్వ పరంగా కట్టుబడి ఉంటామన్న ఆమె, వ్యక్తిగతంగా మాత్రం అంగీకరించబోనంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో.. విపక్ష బీజేపీ, సీపీఎంలపైనా ఆమె విరుచుకుపడ్డారు. ఇది తమ ప్రభుత్వంపై దాడేనని అంటున్నారామె. నన్ను టార్గెట్ చేసి.. ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీచర్ల ఉద్యోగాలను లాక్కోవాలని చూడకండి. గాయపడిన పులి మరింత ప్రమాదకరమైంది. గుర్తుంచుకోండి అని విపక్షాలకు హెచ్చరిక జారీ చేశారు.అంతకు ముందు కోర్టు తీర్పులతో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు మాట్లాడుతూ.. తాము రివ్యూ పిటిషన్ వేయబోతున్నామని, ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వం.. స్కూల్ సర్వీస్ కమిషన్ తమతో కలిసి రావాలని కోరారు.2016లో జరిగిన 25 వేల టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. కలకత్తా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఏప్రిల్ 3వ తేదీన మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఈ నియామకాల ప్రక్రియ మొత్తం మోసపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. తిరిగి సరిదిద్దుకోలేని కళంకం ఇది. ఎలాంటి మోసానికి పాల్పడకుండా ఎంపికైన అభ్యర్థులు కూడా బాధపడాల్సి వస్తోంది. ఈ విషయంలో హైకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోం’’ :::చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ తీర్పు అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘‘కొందరి కారణంగా.. అంతమందిని శిక్షించడం ఏంటి? అని మమతా బెనర్జీ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
Neet Row: డీఎంకే సర్కార్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ/చెన్నై, సాక్షి: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష విషయంలో డీఎంకే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. నీట్ పరీక్ష(NEET Exam) నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నీట్ను ఉప సంహరించుకోలేదన్న ఆయన.. ఈ వ్యవహారంలో తమిళనాడు చేస్తున్న పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఈ నెల 9వ తేదీన పార్టీలకతీతంగా ఎమ్మెల్యేందరితోనూ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.నీట్కు వ్యతిరేకంగా తమిళనాడు ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ, పరీక్షను క్లియర్ చేయలేని స్థితిలో పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడడంతో ఇదొక తీవ్ర అంశంగా మారిందక్కడ. కోచింగ్లకు వెళ్లే స్తోమత లేని విద్యార్థుల పాలిట ఇదొక శాపంగా మారిందనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. సామాజిక న్యాయం దక్కాలంటే నీట్ వద్దనే నినాదంతో పోరాడుతూ వస్తోంది. అందుకే నీట్ బదులు 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి తమిళనాడును అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వం ఒక బిల్లును రూపొందించింది. అయితే.. 2021-22 నుంచే అది పెండింగ్లో ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో.. కిందటి ఏడాది జూన్లో తమిళనాడు ప్రభుత్వం ఏకగ్రీవంగా నీట్ను రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూడా. అయినప్పటికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. తాజా ఎదురు దెబ్బపై స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. దక్షిణ రాష్ట్రం మరోసారి అవమానానికి గురైందని అన్నారు. ‘‘కేంద్రం తమిళనాడు అభ్యర్థనను తిరస్కరించవచ్చు. కానీ, మన పోరాటం మాత్రం ఆగదు. న్యాయ నిపుణులపై చర్చించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేసే అంశం పరిశీలిస్తాం అని స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా నీట్కు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంకోవైపు.. కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా నీట్ను మొదటి నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. -
కోచింగ్ లేకుండానే నీట్లో 720కి 720 మార్కులు..!
చాలామంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో కోచింగ్లు తీసుకుని చదువుతుంటారు. అయినా కూడా అనుకున్న ర్యాంకు సాధించలేక చతికిల పడుతుంటారు. తల్లిందండ్రులకు ఆర్థిక భారాన్ని కలిగిస్తున్నామనే బాధ ఓ పక్క, చదవలేక మరోవైపు నానాఇబ్బందులు పడుతుంటారు కొందరు విద్యార్థులు. అలాంటి వాళ్లకు ఈ కుర్రాడే స్ఫూర్తి. ఎలాంటి కోచింగ్ లేకుండానే నూటికి నూరు శాతం మార్చులు తెచ్చుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సక్సెస్ అంటే ఇది అని చూపించాడు.ఆ కుర్రాడే బీహార్లోని మధుబనిలోని ఆంధ్రాతర్హి గ్రామానికి చెందిన తథాగత్ అవతార్. అతడు నీట్ పరీక్షలో 720/720 మార్కుల స్కోరు సాధించాడు. అతడి విజయ ప్రస్థానం అంత ఈజీగా సాగలేదు. అతడు కూడా అందరిలానే తొలి ప్రయత్నంలో కాస్త ఇబ్బంది పడ్డాడు కానీ 611 మార్కులు సాధించాడు. అయితే మంచి కాలేజ్లో ఎంబీబీఎస్ చేయాలన్న కోరికతో మరోసారి ప్రయత్నించాడు. ఈసారి మరింత కష్టపడి చదివాడు. అతడి కృషి ఫలించి నీట్ 2024లో మంచి మార్కులు సాధించి టాప్ ర్యాంకు తెచ్చుకున్న ఇతర అభ్యర్థుల సరసన నిలిచాడు. అయితే నీట్ యూజీ తాత్కాలికి సమాధాన కీ ఆధారంగా తొలుత 715 మార్కులు స్కోర్ చేయగా, జూన్ 4న విడుదల చేసిన సవరించిన కీ ఆధారంగా అతని స్కోరు 720 రావడం జరిగింది. ఆల్ ఇండియా ప్రథమ ర్యాంకులో నిలచాడు. అతను ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు.కుటుంబ నేపథ్యం..తథాగత్ విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తల్లి కవితా నారాయణ్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు, తండ్రి మిడిల్ స్కూల్లో టీచర్. తల్లి తరుఫు తాత అశోక్ చౌదరి మధుబనిలోని జూనియర్ కళాశాల లైబ్రేరియన్. అతని తాత ఇప్పటికీ తన పూర్వీకుల గ్రామమైన గెహుమాబెరియాలో నివశిస్తున్నారు. కానీ తథాగత్, అతని కుటుంబం ప్రస్తుతం అతని తాత గ్రామమైన ఆంధ్రతార్హిలో నివసిస్తున్నారు.గ్రామంలోనే ఉండి నీట్కి ప్రిపేరయ్యాడు..తథాగత్ తన గ్రామంలోనే ప్రిపరేషన్ కొనసాగించాడు. ఆన్లైన్ తరగతులకు హాజరవ్వుతూ ప్రిపేరయ్యాడు. అతడు చిన్ననాటి నుంచే స్వతహాగా తెలివైన విద్యార్థి అని తల్లిదండ్రులు, బంధువులు చెబుతున్నారు. అతడు ఇంతలా మంచి మార్కుల తెచ్చుకున్నందుకు తమకెంతో గర్వంగా ఉందని అతడి కుటుంబం చెబుతోంది. ఎయిమ్స్లో చదవాలనేది తన జీవితకాల కల అని అందుకే ఇంతలా కష్టపడ్డానని, తన కృషి ఫలించిందని ఆనందంగా చెబుతున్నాడు తథాగత్. అయితే భారతదేశంలో ఉన్న వైద్యుల కొరత, ఆర్థిక పరిమితులు దృష్ట్యా ఎంతమంది విద్యార్థులు డాక్టర్ చదువు అభ్యసించలేక ఇబ్బందులు పడుతున్నారో చూస్తే బాధనిపించిందని, అదే తనకు డాక్టర్ అయ్యేందుకు ప్రేరణనిచ్చిందని అన్నాడు. ముందుకు ఖర్చు గురించి విద్యార్థులు చింతించకుండా మంచి ర్యాంకు తెచ్చుకోవడంపై దృష్టిపెడితే తక్కువ ఖర్చుతోనే మంచి ప్రభుత్వ కళాశాలల్లో చదువుకోగలుగుతారని తథాగత్ చెబుతున్నాడు. ఈ విధంగా మరింతమంది అర్హులైన విద్యార్థులు నైపుణ్యం కలిగిన వైద్యులుగా మారి దేశానికి సేవ చేస్తారని చెబుతున్నాడు తథాగత్.(చదవండి: కొడుకు అనారోగ్యం ఆ అమ్మను వ్యాపారవేత్తగా మార్చింది..! ఏడాదికి రూ. 9 లక్షలు) -
నీట్లో 720/720.. ధోనీతో లింక్.. ‘మానవ్’ సక్సెస్ స్టోరీ
నీట్ సక్సెస్ స్టోరీస్ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. మానవ్ ప్రియదర్శి నీట్లో సాధించిన విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది. జార్ఖండ్కు చెందిన మానవ్ ప్రియదర్శి(Manav Priyadarshi) కుటుంబాన్ని డాక్టర్ల ఫ్యామిలీ అని అంటారు. ఇప్పటికే ముగ్గురు డాక్టర్లున్న ఈ ఫ్యామిలీలో ఇప్పుడు మానవ్ ప్రియదర్శి తన ఎంబీబీఎస్ పూర్తిచేశాక నాల్గవ డాక్టర్ కానున్నాడు.చిన్నప్పటి చదువులో ఎంతో చురుకైన మానవ్ ప్రియదర్శి నీట్(NEET) యూజీలో మొదటి ప్రయత్నంలోనే 720 మార్కులకు 720 మార్కులు తెచ్చుకోవడం విశేషం. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంటున్న మానవ్ 2024లో జరిగిన నీట్ యూజీ పరీక్షలో జార్ఖండ్లో టాపర్గా నిలిచాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 57 తెచ్చుకుని, టాప్ 100 నీట్ టాపర్స్లో ఒకనిగా నిలిచాడు. నాడు మీడియాతో మానవ్ ప్రియదర్శి మాట్లాడుతూ తనకు టాపర్గా నిలుస్తాననే నమ్మకం ఉందని, కానీ స్టేట్ నంబర్ వన్గా నిలుస్తానని అనుకోలేదన్నారు.మానవ్ ప్రియదర్శికి ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి(Dhoni) మధ్య ఒక సంబంధం ఉంది. రాంచీలో జేవీఎం శ్యామలీ స్కూలుకు మంచి పేరు ఉంది. ఇదే స్కూలులో ఎంఎస్ ధోనీ చదువుకున్నాడు. ఇప్పుడు ఇదే స్కూలు నుంచి మానవ్ 12వ తరగతి పూర్తి చేశాడు. తాను సాధించిన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని మానవ్ చెప్పుకొచ్చాడు. మానవ్ ప్రియదర్శి నీట్ యూజీ పరీక్షలో 99.9946856 పర్సంటేజీ తెచ్చుకున్నాడు.మానవ్ ప్రియదర్శి తండ్రి సుధీర్ కుమార్ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్(Physics professor). మానవ్ పెద్దక్క డాక్టర్ నిమిషా ప్రియ భాగల్పూర్ మెడికల్ కాలేజీలో డాక్టర్. మానవ్ చిన్నాన్న డాక్టర్ ప్రిన్స్ చంద్రశేఖర్ సహరసాలో మెడికల్ ఆఫీసర్. మానస్ మామ డాక్టర్ రాజీవ్ రంజన్ రాంచీ ప్రభుత ఆస్పత్రి వైద్యులు. మానవ్ మీడియాతో మాట్లాడుతూ విజయానికి దగ్గరి దారులుండవని, లక్ష్యాన్ని నిర్థారించుకుని, పట్టుదలతో చదివితే ఓటమి ఎదురు కాదన్నాడు. ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. -
నీట్ ఎగ్జామ్ పాసైన 62 ఏళ్ల డాక్టర్.. స్టూడెంట్గా కాలేజ్లో..!
గతంలో చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాలామంది నిరూపించారు. అలా కాకుండా ఉన్నతమైన వృత్తిలో స్థిరపడి పదవీవిరమణ చేసే సమయంలో మరిన్ని విద్యా అర్హతలు సంపాదించాలనుకోవడం మాములు విషయం కాదు !. పైగా ఆ వయసులో కఠినతరమైన ఎంట్రెన్స్ ఎగ్జామ్ చదివి పాసవ్వడం అంటే ఆషామాషి కాదు. కానీ ఈ పెద్దాయన చాలా అలవోకగా సక్సస్ అయ్యి.. చదవాలంటేనే భారంగా భావించే విద్యార్థలందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ అతడెవరో వింటే మాత్రం కంగుతినడం గ్యారంటీ. అంతటి బిజీ వృత్తి చేపట్టి కూడా ఆ వయసులో చదువుకోవాలనుకుంటున్నాడా..? అని నోరెళ్లబెడతారు. ఎవరంటే..62 ఏళ్ల వయసులో పీడియాట్రిక్ వైద్యుడు డాక్టర్ నీలి రాంచందర్ నీట్ పీజీ 2024 పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడాయన ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకోనున్నారు. ఆయనకు సుదీర్ఘ కెరీర్ ఉన్నప్పటికీ..అత్యంత కఠినతరమైన పరీక్షలలో ఒకటైన నీట్ పీజీ 2024 ఎగ్జామ్ ప్రిపేరై పాసవ్వడం చాలామంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ఈ వయసులో కూడా నేర్చుకునేందుకు మక్కువ చూపించడం అనేది విశేషం. సుదీర్ఘ కల సాకారం కోసం..నిజామాబాద్కు చెందిన నీలి రాంచందర్ ప్రముఖ శిశు వైద్యుడుగా 30 ఏళ్లకు పైగా సేవలందించారు. తన కెరీర్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త వైద్య అర్హతలను పొందడానికి నీట్ పీజీ 2024 పరీక్షకు హాజరయ్యారు. ఇప్పుడు ఆయన నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఎండీ(ఫార్మకాలజీ) కోర్సులో చేరి విద్యార్థిగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన 2014లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ పీడియాట్రిక్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడితో సహా ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారు. అతను నేషనల్ రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ (2017-2018)తో సహా అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ఎండీ కోర్సును అభ్యసించాలనే అతని దీర్ఘకాల కోరిక అతన్ని NEET PG 2024కి హాజరు కావడానికి ప్రేరేపించింది.వైద్యుడిగా ప్రస్థానం..డాక్టర్ రాంచందర్ ప్రారంభంలో 1982లో బీ. ఫార్మా కోర్సును వదిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్లో చేరారు. అతను 1991, 1993ల మధ్య పీడియాట్రిక్స్లో సేవ చేయడానికి డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ (DCH) పూర్తి చేశారు. ఆ తర్వాత వెంటనే ప్రాక్టీస్ చేపట్టి వైద్యుడిగా బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఎండీ పూర్తి చేయలేకపోయారు. సరిగ్గా 62 ఏళ్లకు తన చివరి కలను సాకారం చేసుకునే అవకాశం చిక్కింది. ఆయన ఏమాత్రం సంశయించకుండా ఈ వయసులో ఉన్నత చదువు చదవాలనుకోవడం ప్రశంసించనదగ్గ విషయం. సాకులు చెప్పే ఎందరో విద్యార్థులకు స్ఫూర్తి ఈ శిశు వైద్యుడు.(చదవండి: దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్గా మార్చి..) -
నీట్ యూజీ–2025 పెన్,పేపర్తోనే..
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: పేపర్ లీకేజీలు, ఇతర వివాదాల నేపథ్యంలో నీట్ యూజీ–2025పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ –2025 పరీక్షను ఆఫ్లైన్ మోడ్లో అంటే పెన్, పేపర్ (ఓఎంఆర్ విధానం) పద్ధతిలో నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. పేపర్ లీక్, ఇతర అక్రమాలను నిరోధించేందుకు ఈసారి దేశవ్యాప్తంగా ‘ఒకే రోజు– ఒకే షిఫ్టు’లో ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఖరా రు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎంబీబీఎస్తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులకు యూనిఫామ్ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీట్ యూజీ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో అడ్మి షన్లు నిర్వహిస్తారు. దీంతోపాటు సాయుధ దళాలకు వైద్య సేవలందించే ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అభ్యర్థులు కూడా నీట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకూ నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. ఆన్లైన్ పరీక్షపై మల్లగుల్లాలు గత సంవత్సరం నీట్–2024లో చోటు చేసుకున్న లీక్ వ్యవహారాల నేపథ్యంలో నీట్ యూజీ– 2025ని జేఈఈ మెయిన్ తరహాలో ఆన్లైన్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వచ్చాయి. దీంతో ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో పారదర్శకతను పెంచే సూచనలు చేసేందుకు ఇస్రో మాజీ చైర్మన్ ఆర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విస్తృత సమాలోచనలు జరిపి ‘మల్టీ సెషన్ టెస్టింగ్, మల్టీ స్టేజ్ టెస్టింగ్ ’విధానంలో నీట్ను.. ‘మల్టిట్యూడ్ సబ్జెక్ట్ స్టీమ్స్’విధానంలో ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్షలను నిర్వ హించాలంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి ల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన చర్చల్లో పాత ఓఎంఆర్ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అవకతవకలకు ఆస్కారం లేకుండా ఒకే రోజు– ఒకే షిఫ్టు విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు. ‘నీట్ యూజీ–2025ని ఆన్లైన్లో నిర్వహించాలా? పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహించాలా? అనే అంశంపై కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు చర్చించాయి. ఆ తర్వాతే ఈ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం, నీట్–యూజీ–2025ని పెన్, పేపర్ పద్ధతిలోనే నిర్వహిస్తాం. ఒకే రోజు, ఒకే షిఫ్టులో పరీక్ష ఉంటుంది’అని ఎన్టీఏ వర్గాలు చెప్పాయి.దేశంలోనే అతిపెద్ద పరీక్ష దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్కు పేరుంది. 2024లో ఏకంగా 24 లక్షల మందికిపైగా ఈ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని దాదాపు 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం ఏటా నీట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 56 వేల సీట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్నాయి. నీట్లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్తోపాటు ఆధార్ను లింక్ చేయాలని ఎన్టీఏ గతంలో కోరింది. అభ్య ర్థులు తమ పదోతరగతి సర్టిఫికెట్ ప్రకారం ఆధార్ క్రెడెన్షియల్స్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరళమైన దరఖాస్తు ప్రక్రియ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఆధార్లోని ఫేస్ అథెంటికేషన్ పద్ధతి వల్ల అభ్యర్థుల గుర్తింపు వేగవంతం, సులభతరమవుతుందని వెల్లడించింది. దీనివల్ల ప్రవేశ పరీక్షలోని అన్ని ప్రక్రియలు సునాయాసంగా పూర్తవుతాయని తెలిపింది. నీట్ యూజీ–2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. సిలబస్ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో ఉంచారు. -
దటీజ్ మధురిమ బైద్య..! మైండ్బ్లాక్ అయ్యే గెలుపు..
బాల్యమంతా ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతూ ఉంది. స్నేహితులను కోల్పోయింది. ఓ పేషెంట్లా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నా.. వెరవక చదువుని కొనసాగించింది. అంతటి స్థితిలోనూ మంచి మార్కులతోనే పాసయ్యింది. ఓ పక్కన ఆ మహమ్మారి నుంచి కోలుకుంటూనే నీట్కి ప్రిపర్ అవ్వడమేగాక తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. కేన్సర్ అనంగానే సర్వం కోల్పోయినట్లు కూర్చొనవసరం లేదు. సక్సెస్తో చావు దెబ్బతీస్తూ బలంగా బతకాలని చాటి చెప్పింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే మధురిమ బైద్య. ఆరవ తరగతిలో ఉండగా అంటే.. 12 ఏళ్ల ప్రాయంలో అరుదైన నాన్-హాడ్కిన్స్ లింఫోమా కేన్సర్ బారిన పడింది. అది కూడా స్టేజ్ 4లో ఉండగా వైద్యులు ఈ వ్యాధిని గుర్తించారు. దీంతో ఆమె చికిత్స నిమిత్తం ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్(Tata Memorial Hospital) చుట్టూ తిరుగడంతోనే బాల్యం అంతా గడిచిపోయింది. కనీసం స్నేహితులు కూడా లేరు మధురిమకు. అయినా సరే చదువుని వదల్లేదు. ఆ ఆస్పత్రి ఓపీడీల్లో చదువుకునేది. ఆఖరికి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యినప్పుడూ పుస్తకాలను వదలేది కాదు. అలా చదువుతోనే మమేకమయ్యేలా తన బ్రెయిన్ని సెట్ చేసుకుంది. నిజానికి ఆ దశలో ఉండే కీమోథెరపీలు మోతాదు అంతా ఇంత కాదు. చదివినా బుర్ర ఎక్కదు కూడా. కానీ మధురిమ ఆ బాధని కూడా లెక్కచేయకుండా చదువు మీద ధ్యాసపెట్టి దొరికిన కొద్ది సమయంలోనే చదువుకుంటుండేది. ఆమె కష్టానికి తగ్గట్టు పదోతరగతిలో 96% మార్కులతో పాసై అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఇంటర్ కూడా 91% మార్కులతో ఉత్తీర్ణురాలైంది. తను ఇంతలా కష్టపడి చదవడటానికి కారణం.. తనలాంటి కేన్సర్ బాధతులందరికీ ఓ ప్రేరణగా ఉండాలనేది ఆమె కోరకట. అందుకోసమే తనను తాను వ్యాధిగ్రస్తురాలిగా లేదా బాధితురాలిగా అస్సలు బావించేదాన్ని కాదని అంటోంది. తన ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు జీవితంపై పోరాడుతున్న యోధురాలిగా అనుకుని ముందుకు సాగానని సగర్వంగా చెబుతోంది మధురిమ. తన కెరీర్ అంతా ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లతోనే పోరాడింది. సంవత్సరాల తరబడి సాగిన కీమోథెరపీ(chemotherapy), రేడియేషన్(Radiation), ఎముక మజ్జ మార్పిడి(Bone marrow transplant) వంటి కఠినతరమైన శస్త చికిత్సలతో కేన్సర్ని విజయవంతంగా జయించింది. కానీ వాటి కారణగా శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనమైంది. అందువల్ల తరుచుగా జలుబు, దగ్గు వంటి అంటువ్యాధుల బారినపడుతుండేది. అయినా సరే చదువుని ఆపలేదు. ఎంబీబీఎస్ చేయాలన్న కోరికతో ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG 2024)కి కూడా ప్రిపేర్ అవ్వడమేగాక తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. ఇక్కడ మధురిమ కేన్సర్ చివరిదశలో పోరాడుతున్న నైరాశ్యాన్ని దరిచేరనివ్వలేదు. పైగా తన కలను సాకారం చేసుకునే సమయంలో ఎదురవ్వుతున్న కఠినమైన ఆరోగ్య సవాళ్లన్నింటిని తట్టుకుంటూనే మంచి మార్కులతో పాసయ్యింది. అదీగాక అత్యంత కఠినతరమైన నీట్ ఎగ్జామ్ని అలవోకగా జయించింది. మధురిమ సక్సస్ జర్నీ చూస్తే..దృఢ సంకల్పం, మొక్కవోని పట్టుదల ముందు..కఠినతరమైన కేన్సర్ కనుమరుగవుతుందని తేలింది. అంతేగాదు ఇక్కడ తన ఆరోగ్య పరిస్థితులన్నింటిని అంగీకరించిందే తప్ప 'నాకే ఎందుకు ఇలా' అనే ఆలోచన రానీయలేదు. అందుకు తగ్గట్టుగా తన సామార్థ్యాన్నిపెంపొందించటంపై దృష్టిపెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మధురిమ గెలుపు మాములుది కాదని ప్రూవ్ చేసింది. (చదవండి: గర్భధారణ సమయంలో ఎటాక్ చేసే వ్యాధి..! హాలీవుడ్ నటి సైతం..) -
ఏపీలోనూ ‘కోటా ఫ్యాక్టరీ’లు
సాక్షి, అమరావతి: ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల శిక్షణకు రాజస్థాన్లోని కోటా నగరం ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రతి ఇల్లూ ఓ శిక్షణ సంస్థే. కోటా ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ తీసుకుంటే ర్యాంక్ గ్యారంటీ అనే ప్రచారం బలంగా ఉండడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు వస్తుంటారు. అయితే అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఇతరులకు తెలియదు. శిక్షణ కోసం కోటా వచ్చిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక గతేడాది 26 మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు వదిలారు. వీరంతా 17–19 ఏళ్ల వయసువారే. ఇక సివిల్స్ శిక్షణకు బ్రాండ్ సిటీ లాంటి ఢిల్లీలో ఇటీవల ఓ పేరొందిన స్టడీ సర్కిల్ను వరద ముంచెత్తడంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు. మన వద్ద కూడా అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇంటర్, పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఇదే తరహా ఒత్తిడి నెలకొంది.పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థకోచింగ్ సెంటర్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తేనుంది. శిక్షణ సంస్థలపై పర్యవేక్షణకు 12 మంది అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతత్వంలో పాఠశాల, వైద్య, సాంకేతిక విద్య కార్యదర్శులు, డీజీపీ సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండుసార్లు వరకు జరిమానా, ఆ తరువాత సంస్థ రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తారు. విద్యార్థి శిక్షణ మధ్యలో మానేస్తే దామాషా ప్రకారం ఫీజు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కోటాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం అనంతరం ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడం, సాధారణ పాఠశాలల్లో చేరిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.బలవన్మరణాలు..విశాఖ పీఎం పాలెంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఈ ఏడాది జనవరిలో 9వ తరగతి చదివే ఓ విద్యార్థికి టెన్త్ పాఠ్యాంశాలు బోధిస్తూ టెస్టుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీల సందర్భంగా రికార్డులు సమర్పించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో 21 ఏళ్ల విద్యార్థి హాస్టల్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు 2021లో ఏపీలో 523 మంది విద్యార్థులు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014 తరువాత 57 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై మార్కులు, ర్యాంకుల ఒత్తిడి పెరగడంతో అంచనాలను అందుకోలేక సగటున వారానికి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల వేధింపులను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజస్థాన్లో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ‘‘కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు–2024’’ పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
బంధించి, 6 నెలలకుపైగా రేప్
కాన్పూర్(యూపీ): విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామపిశాచులుగా మారి టీనేజ్ విద్యార్థినితో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. 2022 డిసెంబర్ చివర్లో జరిగిన ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యవిద్యా కోర్సులో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల బాలికను ఇద్దరు టీచర్లు బంధించి ఆరునెలలకుపైగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు యూపీలో చర్చనీయాంశమైంది. కేసు వివరాలను కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ అభిõÙక్ పాండే శనివారం మీడియాకు వెల్లడించారు. ఫతేపూర్ పట్టణానికి చెందిన ఈ టీనేజీ అమ్మాయి నీట్ కోచింగ్ కోసం కాన్పూర్కు వచ్చి హాస్టల్లో ఉంటోంది. ఆమె నీట్ కోచింగ్ తీసుకుంటున్న చోటే సాహిల్ సిద్ధిఖీ జీవశాస్త్రం, వికాస్ పూర్వాల్ రసాయనశాస్త్రం బోధించేవారు. 2023 ఏడాది కొత్త ఏడాది వేడుకలు జరుగుతున్నాయి, విద్యార్థులంతా వస్తున్నారని చెప్పి ఈ టీనేజర్ను ఆమె ఫ్రెండ్ ఫ్లాట్కు టీచర్లు సాహిల్, వికాస్ రప్పించారు. మక్డీఖేరాలోని ప్లాట్కు వచ్చిన అమ్మాయికి టీచర్లుతప్ప విద్యార్థులెవరూ కనిపించలేదు. మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగడంతో స్పృహకోల్పోయిన టీనేజర్ను సాహిల్ తన ఫ్లాట్కు తీసుకెళ్లి ఆరునెలలకుపైగా బంధించాడు. పలుమార్లు రేప్చేశాడు. తర్వాత వికాస్ సైతం అదే దారుణానికి పాల్పడ్డాడు. ఆరునెలల తర్వాత కాన్పూర్కు వచ్చిన తల్లి ఆ టీనేజర్ను తీసుకెళ్లింది. అయితే అత్యాచారాన్ని వీడియోలు తీసి బెదిరించడంతో కుటుంబపరువు పోతుందన్న భయంతో టీనేజర్ తనకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పలేదు. అయితే రెండు నెలల క్రితం మరో విద్యారి్థని పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో టీచర్ సాహిల్ను పోలీసులు అరెస్ట్చేశారు. ఇటీవల అతను బెయిల్పై బయటికొచ్చాడు. అయితే ఆ మరో విద్యారి్థనిని సాహిల్ లైంగికంగా వేధించిన వీడియో తాజాగా బయటకురావడంతో ధైర్యం తెచ్చుకున్న టీనేజర్ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోక్సోసహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి సాహిల్, వికాస్లను అరెస్ట్చేశారు. -
డాక్టర్ చదువుకు డబ్బుల్లేక..కూలి పనులకు..
హుస్నాబాద్ రూరల్: వైద్యురాలు కావాలన్నది ఆ అడవి బిడ్డ తపన.. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది. చిన్న కూతురు దేవిని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేరి్పంచి చదివించారు.పదో తరగతి, ఇంటర్మిడియెట్లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్కు సిద్ధమైంది. నీట్లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు వచి్చంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది. ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
కూతురంటే ఎంత ప్రేమో.. 70ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్ : ఉద్యోగ విరమణకాగానే ‘కృష్ణా రామా’ అనుకుంటూ కాలం గడపాలనుకునేవాళ్లనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈయన అలా కాదు. కన్నబిడ్డ దూరమై మిగిల్చిన విషాదం ముందు.. వయసు మీదపడి ఓపిక తగ్గే తరుణంలో ఉరకలేసే ఉత్సాహంతో నీట్ యూజీ 2020 ఫలితాల్లో ర్యాంక్ను సాధించారు. ఎంబీబీఎస్ విద్యార్థిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. త్వరలో డాక్టర్గా విధులు నిర్వహించనున్నారు.ఒడిశాకు చెందిన 64ఏళ్ల జే కిషోర్ ప్రధాన్ ఎస్బీఐ బ్యాంక్లో ఉన్నత ఉద్యోగం. ఇద్దరు కవలలు. అందమైన కుటుంబం. ఏచీకూ చింతాలేదు. ఎందుకో ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.మలిదశలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న కుమార్తెను దూరం చేసింది. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. ఇంటి వెలుగులను ఒకేసారి ఆర్పేసి చీకట్లు మిగిల్చింది.అదుగో అప్పుడే తనలాగే మరో ఆడబిడ్డ తండ్రికి గుండె కోత మిగిల్చకూడదనుకున్నారు. డాక్టర్గా సేవలందించాలని దీక్షబూనారు. ఎస్బీఐ అసిస్టెంబ్ బ్యాంక్ మేనేజర్గా పదవీ విరమణ చేసినా డాక్టర్గా సేవలందించాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. దృఢ సంకల్పంతో ఓ వైపు విద్యార్థి, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే పెద్దగా ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కలల ప్రయాణాన్ని ప్రారంభించారు.కుటుంబ వ్యవహారాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత కఠినమైన నీట్ పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించాలనే లక్ష్యం ముందు అవి చిన్నవిగా కనిపించాయి. ముందుగా నీట్ యూజీ 2020 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు పోటీ పడ్డారు. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యారు. మొక్కవోని దీక్షతో అనేక సవాళ్లను అధిగమించారు. చివరికి అనుకున్నది సాధించారు.నీట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లో ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వచ్చే ఏడాది డాక్టర్గా ప్రజా సేవ చేయనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు డబ్బు మీద ఆశలేదు. దూరమైన నా కుమార్తె కోసం నేను బతికి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. ‘దేశ వైద్య విద్యా చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. ఇంత వయస్సులో వైద్య విద్యార్థిగా అర్హత సాధించి ప్రధాన్ ఆదర్శంగా నిలిచారు’ అని విమ్స్ఆర్ డైరెక్టర్ లలిత్ మెహెర్ ప్రధాన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.👉చదవండి : ‘మేం ఏపీకి వెళ్లలేం’ -
64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ
ఒక్కసారి ఉద్యోగంలో చేరి సంసార బాధ్యతల్లో చిక్కుకున్న తరువాత తమ కిష్టమైంది చదువుకోవడం అనేది కలే, దాదాపు అసాధ్యం అనుకుంటాం కదా. కానీ ఈ మాటలన్నీ ఉత్తమాటలే తేల్చి పారేశాడు ఒక రిటైర్డ్ ఉద్యోగి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? అయితే ఒడిశాకు చెందిన జైకిశోర్ ప్రధాన్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈయన సక్సెస్ స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైర్డ్ ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. 2020లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG)లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్గా ఉద్యోగ విధులు నిర్వర్తించిన ఆయన రిటైర్మెంట్ తరువాత అందరిలాగా రిలాక్స్ అయిపోలేదు. డాక్టరవ్వాలనే తన చిరకాల వాంఛను తీర్చుకొనేందుకు రంగంలోకి దిగారు. వైద్య విద్య ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి నిబంధన లేకపోవడంతో దృఢ సంకల్పంతో నడుం బిగించారు. అందుకోసం పెద్ద వయసులోనూ కూడా కష్టపడి చదివి జాతీయ స్థాయిలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో అర్హత సాధించారు.ఎవరీ జై కిశోర్ ప్రధాన్జై కిశోర్ ప్రధాన్ స్వస్థలం ఒడిశాలోని బార్ గఢ్ ప్రాంతం. బాల్యం నుంచే డాక్టర్ అవ్వాలని కలలు కనేవారు. 1974లో మెడికల్ ఎంట్రన్స్ ర్యాంకు రాకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. బీఎస్సీడిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించారు. ఈ సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో తండ్రి అనుభవించిన బాధ, కళ్లారా చూసిన జై కిశోర్ ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.జై కిశోర్ జీవితంలో మరో విషాదం వైద్య వృత్తిపై ఉన్న ప్రేమతో తన పెద్దకుమార్తెను డాక్టర్న చేయాలని ఎంతగానో ఆశపడ్డారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా, అనారోగ్యంతో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. అయితే తన రెండో కుమార్తెను కూడా మెడిసిన్ చదివిస్తుండటం విశేషం. సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ అనుకున్న లక్ష్యం చేరేందుకు వయసుతో సంబంధం లేదని జై కిశోర్ చాటి చెప్పారు. -
3.16 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నీట్లో ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీటు లభించింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మొదటి విడత జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న కన్వీనర్ సీట్లలో దాదాపు 4,760 సీట్లను విద్యార్థులకు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఎవరికి సీట్లు వచ్చాయో విద్యార్థులకు సమాచారం పంపించింది. గతేడాది అత్యధికంగా నీట్లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఒక ఎస్సీ విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు లభించగా.. ఈసారి బీసీ ఏ కేటగిరీలోనే 3,16,657 ర్యాంకర్కు సీటు లభించడం విశేషం. గత ఏడాది మొదటి విడతలో 1.31 లక్షల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది. ఈసారి మొదటి విడతలో 1.65 లక్షల ర్యాంకర్కు సీటు లభించింది. బీసీ బీ కేటగిరీలో గతేడాది మొదటి విడతలో 1.40 లక్షల ర్యాంకర్కు సీటు రాగా, ఈసారి 1.94 లక్షల ర్యాంకర్కు సీటు లభించింది. అలాగే గతేడాది బీసీ డీ కేటగిరీలో 1.35 లక్షల ర్యాంకర్కు సీటు రాగా, ఈసారి 1.80 లక్షల ర్యాంకర్కు వచ్చింది. కన్వీనర్ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సెలింగ్ జరగనుంది. బీసీ ఈ కేటగిరీలో ప్రస్తుతం 2.03 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కేటగిరీలో 2.90 లక్షల ర్యాంకుకు, ఎస్సీ కేటగిరీలో 2.87 లక్షల ర్యాంకుకు సీటు లభించడం గమనార్హం. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో దివ్యాంగ రిజర్వేషన్ కింద 13.41 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఇలావుండగా జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి కూడా మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు.పెరిగిన సీట్లతో విస్త్రృత అవకాశాలురాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలు పెరిగాయి. అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరిగాయి. దీంతో అధిక ర్యాంకర్లకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు లభిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 64 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మల్లారెడ్డికి చెందిన రెండు, నీలిమ మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలయ్యాయి. వీటితో పాటు ఎయిమ్స్ మెడికల్ కాలేజీని మినహాయించి 60 మెడికల్ కాలేజీల్లోని సీట్లకు ఇప్పుడు కన్వీనర్ కోటా కింద సీట్ల కేటాయింపు జరిపారు. 2024–25 వైద్య విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఎంపిక చేసిన కళాశాలల్లో ఐఐటీ శిక్షణను ఆదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లు ఇచ్చేవారు. ఈసారి నారాయణ కళాశాలలకు చెందిన ఐఐటీ, నీట్ సిలబస్ బోధించే సిబ్బందితో శిక్షణ ఇప్పించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది.తొలుత కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు లేదా పది కి.మీ. పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, ప్రతిభ చూపిన వారిని ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సెంటర్లో ఇంటర్ రెగ్యులర్ తరగతులతో పాటు అంతర్భాగంగా ఐఐటీ, నీట్ శిక్షణను కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందే ఇవ్వనున్నారు.విద్యార్థుల కాలేజీలు వేరైనప్పటికీ ఈ ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో వారి హాజరు ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీనివల్ల వారి అటెండెన్స్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇదే తరహా శిక్షణను ఇంటర్ బోర్డు చేపట్టింది. ఈ ప్రత్యేక శిక్షణపై ఆసక్తి గల ప్రభుత్వ లెక్చరర్లతో వారు పనిచేస్తున్న కాలేజీల్లోనే శిక్షణ ఏర్పాట్లు చేశారు. అయితే, అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో ఈ ఏడాది శిక్షణ విధానం మార్చినట్టు తెలుస్తోంది. విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ, ఐఐటీ, నీట్ నమూనా పరీక్షల నిర్వహణ వంటి అన్ని అంశాలను నారాయణ విద్యాసంస్థలే చూసుకోనున్నాయి. -
మా కలలు చిదిమేసిన ప్రభుత్వం
మా కలలను ప్రభుత్వం చిదిమేసింది. మా ఆశలను అడియాశలు చేసింది. గత ఏడాది కటాఫ్ కన్నా ఎక్కువగా మార్కులు వచ్చాయన్న ఆనందాన్ని ఆవిరి చేసింది. రిజర్వేషన్ కోటాలో అయినా సీటు వస్తుందని ఎదురు చూసినా నిరాశనే మిగిల్చింది. మా భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం మాకు పెనుశాపంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లు పెంచుకుంటూ వెళుతుంటే... ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే మంజూరు చేసిన కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లను సైతం వద్దని ప్రభుత్వమే అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి... అని పలువురు నీట్ ర్యాంకర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకున్న నిర్ణయాలతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయి తమ పిల్లల భవిష్యత్ తలకిందులైందని పలువురు తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని చంద్రబాబు, లోకేశ్ హామీ ఇస్తే నమ్మామని... అధికారంలోకి వచ్చాక ఆ జీవోలు రద్దు చేయకపోగా... ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ... అంటూ అసలు రూపం బయటపెట్టారు. నమ్మించిగొంతు కోశారు... అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, అమరావతి/నెట్వర్క్ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది గత ఏడాది రెండు మార్కుల తేడాతో కన్వినర్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోల్పోయాను. మేనేజ్మెంట్ కోటాలో చదవాలంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. దీంతో ఏడాదిపాటు లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. కష్టపడి చదివి నీట్ యూజీ–2024లో 610 స్కోర్ చేశా. ఈ ర్యాంక్కు గత ఏడాది గుంటూరు మెడికల్ కాలేజీలో ఓసీకి చివరి సీట్ వచ్చింది. గత ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. ఈసారి కూడా మరో 750 సీట్లు పెరుగుతాయన్నారు. వాటికితోడు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని టీడీపీ చెప్పింది. ఇలా కూడా మరికొన్ని సీట్లు కలిసి వస్తాయని అనుకున్నా. మంచి స్కోర్ చేశాను. సీట్లు కూడా పెరిగితే తొలి దశ కౌన్సెలింగ్లోనే సీట్ వచ్చేస్తుందని కుటుంబం అంతా ఆశపెట్టుకున్నాం. కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి కొత్త కళాశాలలు ప్రారంభం కాలేదు. సెల్ఫ్ఫైనాన్స్ విధానం రద్దు చేయలేదు. దీంతో సీట్లు పెరగలేదు. ఏయూ రీజియన్లో ఓసీ విభాగంలో 615 స్కోర్కు ఆఖరి సీట్ దక్కింది. రెండు, మూడు కౌన్సెలింగ్లలో సీట్ వస్తుందన్న నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయంతో నా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. – యశ్వంత్రెడ్డి, నీట్ ర్యాంకర్, విశాఖపట్నం కొత్త కాలేజీలో సీటు వస్తుందని ఆశపడ్డా బీసీ–డీ సామాజికవర్గానికి చెందిన నేను నీట్లో 541 మార్కులు తెచ్చుకున్నాను. కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు కావడంతో ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఆశపడ్డాను. కొత్త కళాశాలలు అందుబాటులోకి వచ్చి ఉంటే మాలాంటి పేద విద్యార్థులకు అవకాశం లభించేది. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరు కాగా, రద్దు చేయాలని ప్రభుత్వం కోరడం వల్ల మాలాంటి బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇక డబ్బులు కట్టి పేద విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించడం కష్టమే. – దేవేశ్, నీట్ విద్యార్థి, రాజంపేట, అన్నమయ్య జిల్లా లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకున్నా.. నేను మూడేళ్లగా నీట్ కోసం లాంగ్టర్మ్ శిక్షణ తీసుకుంటున్నా. ఈ ఏడాది నీట్లో 500 మార్కులు సాధించాను. ఈ ఏడాది కొత్త కాలేజీలు వస్తాయనే ఆశతో బీసీ–ఈ కోటాలో ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు వస్తుందనే ఆశతో ఉన్నా. కానీ కొత్త మెడికల్ కాలేజీలు రాకపోవటం, పులివెందులకు కేటాయించిన సీట్లను ప్రభుత్వం వద్దనడంతో ఈ ఏడాది కూడా సీటు వస్తోందో.. రాదో అని భయంగా ఉంది. మా తల్లిదండ్రులు పేదలు అయినా నన్ను డాక్టర్గా చూడాలని లాంగ్టర్మ్లో చేర్పించారు. ఇప్పుడు సీటు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. – షేక్ తజి్మన్, దువ్వూరు, వైఎస్సార్ జిల్లా రిజర్వేషన్ ఉన్నా మా అబ్బాయికి సీటు రాలేదు గత ఏడాది బీసీ–డీలో 497 స్కోర్ వరకు కన్వినర్ కోటాలో సీటు వచ్చింది. ఈసారి మా అబ్బాయి 541 స్కోర్ చేశాడు. 83 మార్కుల మేర స్కోర్ పెరిగింది. ఈ క్రమంలో తొలి రౌండ్లో కన్వినర్ కోటా సీటు వస్తుందని ఆశపడ్డాం. కానీ, తొలి రౌండ్లో ఎస్వీయూ రీజియన్లో బీసీ–డీలో 560 వరకు సీటు వచ్చింది. మా అబ్బాయికి సీటు రాలేదు. గత ఏడాది నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 519 స్కోర్కు సీట్ వచ్చింది. ఆ ఏడాది పోటీకి తగ్గట్టుగా ప్రభుత్వ కళాశాలలు పెరిగి సీట్లు పెరగడంతో 519 ర్యాంక్కు ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చింది. పులివెందుల కాలేజీకి అనుమతులు వచ్చినా వద్దని లేఖ రాశారు. సీట్లు పెంచకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడి మాలాంటి వాళ్లకు ద్రోహం తలపెట్టింది. వేరే దేశానికి వెళ్లి అక్కడ ప్రైవేట్ కంపెనీల్లో పని చేసి వచ్చిన జీతంలో తిని తినక దాచిపెట్టి నా కొడుక్కు లాంగ్టర్మ్ కోచింగ్ ఇప్పించా. మంచి స్కోరు, రిజర్వేషన్ ఉన్నా ప్రభుత్వ కోటాలో సీటు రాలేదు. ఇక మాలాంటి వాళ్లు ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు ఎలా చదువుతారు. – పెంచలయ్య, నీట్ ర్యాంకర్ తండ్రి, అన్నమయ్య జిల్లా నా కల చెదిరింది వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలనుకునే నా కల చెదిరింది. కటాఫ్ పెంచి నా భవితను చిదిమేశారు. ఓసీ వర్గానికి చెందిన నేను 540 మార్కులు సాధించినా సీటు రాలేదు. గత ప్రభుత్వంలో వైద్య విద్యకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాధాన్యత కొరవడటంతో నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం వైద్య విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. – గరికిన సత్య సంతోష్, గొడారిగుంట,కాకినాడ ఇక మెడిసిన్ కలగానే... విజయవాడలోని ఓ కోచింగ్ సెంటర్లో సంవత్సరం నుంచి నీట్ శిక్షణ తీసుకుంటున్నా. ఇంటర్లో గురుకుల పాఠశాలలో చదువుకున్నా. గత ఏడాది మొదటి సారి నీట్ రాస్తే 388 మార్కులు వచ్చాయి. ఈ సారైనా మెడికల్ సీటు సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివా. 720 మార్కులకు 524 మార్కులు వచ్చాయి. ప్రభుత్వం నూతనంగా ఐదు మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి ఉంటే 750 సీట్లు అదనంగా వచ్చేవి. దీంతో నాకు సీటు వచ్చే అవకాశం ఉండేది. అలా జరగకపోవడంతో నా లాంటి ఎంతో మంది పేద విద్యార్థుల డాక్టర్ కల కలగానే మిగిలిపోనుంది. బీసీ–బీ కురుబ అయినా నాకు సీటు రాలేదు. – ముత్తుకూరు సరిత, సంతేకుడ్లూరు గ్రామం, ఆదోని మండలం తీవ్ర నిరాశకు గురయ్యా నాన్న డాక్టర్ బి.సురేష్, రేడియాలజిస్టు. అమ్మ డాక్టర్ ఉమాదేవి గైనకాలజిస్టు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో నన్ను కూడా డాక్టర్ను చేయాలని వారు ఎంతో ఆశగా చదివించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా నేను కూడా ఎంతో కష్టపడి చదువుతున్నాను. మాది బీసీ–బీ కేటగిరీ. నీట్లో 527 మార్కులు తెచ్చుకున్నా సీటు రాలేదు. కటాఫ్ 556 దగ్గర ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. మన రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చి ఉంటే నాకు సీటు వచ్చి ఉండేదని లెక్చరర్లు చెబుతున్నారు. నాకు సీటు రాకపోవడంతో మా అమ్మానాన్న కూడా ఎంతో బాధపడ్డారు. – బి.ప్రణవ్, కర్నూలు సీట్లు పెరిగితే ఈ పరిస్థితి ఉండేది కాదు మాది వ్యవసాయ కుటుంబం. మాది బీసీ–ఏ కేటగిరీ. నన్ను ఎలాగైనా డాక్టర్ను చేయాలని మా అమ్మ వరలక్ష్మి , నాన్న వెంకటేశ్వర్లు చాలా కష్టపడి చదివిస్తున్నారు. నేను కూడా కష్టపడి చదివి మా అమ్మానాన్నల కలలను సాకారం చేయాలని ప్రయతి్నస్తున్నాను. నీట్లో 528 మార్కులు సాధించినా సీటు రాలేదు. కటాఫ్ 561 వద్దే ఆగిపోయింది. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరిగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. గత సంవత్సరం ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా మరికొన్ని కాలేజీలు వస్తాయని, మరో 500 నుంచి 700 వరకు సీట్లు పెరుగుతాయని భావించాను. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మాలాంటి విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగిలింది. – బి.జాహ్నవి, కర్నూలు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు ఎంబీబీఎస్లో కన్వినర్ కోటా కింద మొదటి కౌన్సిలింగ్లో సీట్లు కేటాయింపు పూర్తయింది. నాకు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు. పులివెందులలో మెడికల్ కళాశాల ఉండి ఉంటే ఈజీగా నాకు సీటు వచ్చి ఉండేది. నాకు సీటు రాకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. నీట్ రాసి 597 మార్కులు సాధించినప్పటికీ సీటు రాకపోవడం కలచివేస్తోంది. ప్రభుత్వ తీరు వల్లే నాకు అన్యాయం జరిగింది. – సాయి విఘ్నేశ్వరరెడ్డి, పులివెందుల, వైఎస్సార్ జిల్లా సీట్లు వదులుకోవడం సరికాదు బీసీ–ఈ కేటగిరీకి చెందిన నేను నీట్లో 545 మార్కులు సాధించాను. అయినా సీటు రాలేదు. బీసీ–ఈ కటాఫ్ 553 వద్ద ఆగిపోయింది. గత సంవత్సరం బీసీ–ఈ కేటగిరీ కటాఫ్ 496 మార్కులు. అందువల్ల ఈ ఏడాది నాకు 545 మార్కులు రావడంతో తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశపడ్డాను. దీనికి తోడు రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరుగుతాయన్న ఆశ కూడా ఉండేది. కానీ మా ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. సీట్లు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలను కొనసాగించలేదు. ఎన్ఎంసీ ఇచ్చిన సీట్లు కూడా వదులుకుంది. ఫలితంగా మాలాంటి వారికి తీవ్ర అన్యాయం జరిగింది. విలువైన మెడికల్ సీట్లు వదులుకోవడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్సీట్లు సాధించాలి. – హెచ్ఎం ఫర్హా అన్జుమ్, కర్నూలు 570 వచ్చినా సీటు లేదు... నాకు నీట్ యూజీలో 570 మార్కులు వచ్చాయి. నేను ఓసీ కేటగిరీ. గత ఏడాది మా రీజియన్లో ఓసీ కేటగిరీ కటాఫ్ 542 వద్ద ఆగిపోయింది. ఓసీ కేటగిరీలో పోటీ తీవ్రంగా ఉంటుందని తెలుసు. అందుకే మొదటి నుంచి ఎంతో కష్టపడి చదువుతున్నాను. నీట్లో 570 మార్కులు సాధించినా ఫలితం లేకపోయింది. కటాఫ్ 601 వద్దే ఆగిపోయింది. గత సంవత్సరం కటాఫ్ 542 వద్ద ఆగిపోవడంతో ఈ సంవత్సరం నాకు వచ్చిన మార్కులకు తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశతో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి, ఎన్ఎంసీ ద్వారా సీట్లు సాధించి ఉంటే మాలాంటి వారికి తప్పకుండా సీట్లు వచ్చేవి. ప్రభుత్వ చర్యల వల్ల ఈ ఏడాది మాలాంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. – వి.సాయిసృజన, కర్నూలు ఆంధ్రాలో పుట్టడమే నేరమా? నా కుమార్తెకు బీసీ–ఏ కేటగిరీలో 565 మార్కులు వచ్చినా మెడికల్ సీటు రాలేదు. పేదవాళ్లం అయినప్పటికీ మా కుమార్తెను డాక్టర్గా చూడాలని సుమారు రూ.4లక్షలు ఖర్చు చేసి లాంగ్టర్మ్ కోచింగ్ ఇప్పించాం. ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఆశపడ్డాం. చివరకు కన్నీరే మిగిలింది. గత ఏడాది 501 మార్కులకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ, ఈ ఏడాది 565 మార్కులు వచ్చినా నా బిడ్డకు సీటు రాలేదు. మాలాంటి వాళ్లని ఎంతోమందిని ఈ ప్రభుత్వం మోసం చేసింది. కొత్త కాలేజీలు వస్తే మాలాంటి వారి జీవితాలు బాగుపడతాయని ఎదురు చూశాం. తీరా ఇప్పుడు సీట్లు తగ్గించారు. ఆంధ్రాలో పుట్టడమే నేరమా.. అన్నట్లు ఉంది. – కె.నవీన్, విద్యార్థిని తండ్రి, టెక్కలిపేద పిల్లలకు శరాఘాతం ప్రభుత్వం కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకపోవడంతో సీట్లు తగ్గాయి. నా లాంటి విద్యార్థులకు నష్టం కలిగింది. ఎంబీబీఎస్ పూర్తిచేయాలన్న ఆశతో కష్టపడి చదివాను. సీటు వచ్చే అవకాశం లేదు. మళ్లీ లాంగ్టెర్మ్ కోచింగ్లో చేరాను. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతం వంటిది. మెడికల్ కాలేజీలకు ప్రైవేట్కు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులకు శాపం. – కె.మానస, కిండం అగ్రహారం గ్రామం, బొండపల్లి మండలం మా భవిత ప్రశ్నార్థకం నేను బీసీ వర్గానికి చెందిన విద్యార్థిని. కటాఫ్ మార్కులు పెరగడంతో నీట్ సీటు చేజారింది. మాది పేద కుటుంబం. డాక్టర్ కావాలన్నది నా ఆశయం. వైద్య కళాశాలలు పెరగడంతో కచ్చితంగా సీటు వస్తుందని భావించాను. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉంటుందని ఊహించాను. అయితే ప్రభుత్వం కొత్త కాలేజీలు తీసుకురాకపోవడంతో మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. ప్రభుత్వమే ఇలా చేయడమే సరికాదు. – ఎండీ ఖాసీం, జె.రామారావుపేట, కాకినాడప్రభుత్వం వల్ల ఎంతో నష్టం నాకు నీట్లో 568 మార్కులు వచ్చాయి. గతేడాది ఎస్వీయూ రీజియన్లో ఓసీ కేటగిరీకి 542 మార్కులకు కూడా సీటొచ్చింది. ఈ ఏడాది కొత్తగా 5 కాలేజీలు వస్తున్నాయని.. 550కి ఓసీ కేటగిరిలో సీటు వస్తుందని మా కాలేజీ అధ్యాపకులు చెప్పారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు. కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో నేను ఎంతో నష్టపోతున్నా. ఏం చేయాలో అర్థమవ్వట్లేదు. ధైర్యం చేసి లాంగ్టర్మ్కు వెళదామన్నా.. వచ్చే ఏడాది సీట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదు. – లతిక, నీట్ విద్యార్థి, ఎస్వీయూ రీజియన్ -
'టాప్లో కటాఫ్'
సాక్షి, అమరావతి: గతేడాది ఏయూ పరిధిలో ఓసీ విద్యార్థికి ఎంబీబీఎస్లో ప్రవేశాలకు నీట్ కటాఫ్ మార్కులు 563.. ఈ ఏడాది ఏకంగా 615..! ఇదే కేటగిరీకి ఎస్వీయూ పరిధిలో గతేడాది కటాఫ్ 550.. ఈ ఏడాది 601..!! ఆదివారం కన్వీనర్ కోటా తొలిదశ కౌన్సెలింగ్లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పరిస్థితి ఇదీ!! అప్పుడు సీటు దొరకటానికి.. ఇప్పుడు గగనంగా మారటానికి కారణం.. కొత్త మెడికల్ కాలేజీలే!గతేడాది 5 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంతో సీట్లు పెరిగి మన విద్యార్థులు ఎంతో మంది డాక్టర్లు కాగలిగారు! ఇప్పుడు నాలుగు కొత్త కాలేజీలకు కూటమి సర్కారు నిర్వాకంతో అనుమతులు రాకపోగా పాడేరులో వచ్చింది 50 సీట్లే! ఎంబీబీఎస్ సీట్లు పెరగకపోవడంతో మనకు ఎంత నష్టం జరిగిందో తొలి దశ కౌన్సెలింగ్లోనే స్పష్టంగా కనిపించింది!!గతేడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావడంతో అదనంగా 750 సీట్లు సమకూరి మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలు నెరవేరాయి. ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా దూరదృష్టితో వ్యవహరించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కశాశాలలకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో ఐదు కొత్త కాలేజీలు గతేడాది అందుబాటులోకి రాగా ఈ సంవత్సరం కూడా మరో ఐదు నూతన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైతే తమ కలలు ఫలిస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు! కూటమి సర్కారు ప్రైవేట్ జపం, కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఆ ఆశల సౌథాలు కుప్పకూలాయి. ఏడాదంతా లాంగ్ టర్మ్ శిక్షణతో రూ.లక్షలు వెచ్చించి సిద్ధమైన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తొలి దశ కౌన్సెలింగ్లోనే సీట్ దొరక్కపోవడంతో ఇక మిగిలిన దశల్లో సీటు లభించే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అప్పు చేసిన మధ్యతరగతి కుటుంబాలు మేనేజ్మెంట్ కోటా సీట్ కొనే పరిస్థితి లేదు. మరోసారి ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్కి పంపుదామంటే కూటమి సర్కారు ప్రైవేట్ మోజుతో వచ్చే ఏడాదైనా సీట్లు పెరుగుతాయనే నమ్మకం పోయింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో నీట్ యూజీ విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. ప్రైవేట్కు కట్టబెట్టే ఉద్దేశంతో నాలుగు కొత్త కాలేజీలకు అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. కేవలం పాడేరు కళాశాలలో 50 సీట్లకే అనుమతులు లభించాయి. పిల్లల గొంతు కోశారు!ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని.. అది కూడా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే చేసి చూపిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి సర్కారు దాన్ని గాలికి వదిలేసి బేరాలకు తెర తీసింది. వైఎస్సార్ సీపీ హయాంలో తీసుకున్న చర్యల ఫలితంగా గిరిజన ప్రాంతంలోని పాడేరు మెడికల్ కాలేజీకి ఈ ఏడాది అరకొరగానైనా 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా వాటిలో 21 సీట్లను సెల్ఫ్ఫైనాన్స్ కోటా కింద తాజాగా అమ్మకానికి పెట్టింది. ఈమేరకు 2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిలో ప్రారంభించాల్సిన ఐదు నూతన వైద్య కళాశాలలను కుట్రపూరితంగా అడ్డుకుని ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి పిల్లల భవిష్యత్తును అంధకారంగా మార్చారని మండిపడుతున్నారు. పులివెందుల వైద్య కళాశాలకు అనుమతులు వచ్చినా.. మేం నిర్వహించలేమంటూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్ఎంసీకి కూటమి ప్రభుత్వమే లేఖ రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో సెల్ఫ్ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ పలు సందర్భాల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్కు హామీ గుర్తు లేదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. పేదల పక్షపాత ప్రభుత్వమంటూ తరచూ చెప్పే సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు పీ 4 ప్రణాళిక పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు అప్పగించి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ప్రజా సంఘాలు మండిపతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.రెండేళ్లలో కోల్పోతున్న సీట్లు 1,750టీడీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ వైద్య విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కాకపోవడం దీనికి నిదర్శనం. 2004–09 మధ్య దివంగత వైఎస్సార్ సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో రిమ్స్లను నెలకొల్పారు. రాష్ట్ర విభజన అనంతరం వైఎస్సార్ సీపీ హయాంలో జగన్ ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కొత్త వైద్య కళాశాలలు గత ఏడాది ప్రారంభం అయ్యాయి. 750 ఎంబీబీఎస్ సీట్లు ఒక్కసారిగా అదనంగా పెరగడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. ఈ విద్యా సంవత్సరంలో కూడా మరో ఐదు కళాశాలలు ప్రారంభించేలా గత ప్రభుత్వం చర్యలు చేపట్టినా కూటమి సర్కారు దాన్ని కొనసాగించలేదు. దీంతో కేవలం 50 సీట్లు సమకూరగా అదనంగా రావాల్సిన 700 సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఇక వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన మరో ఏడు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల అదనంగా మరో 1,050 మెడికల్ సీట్లను విద్యార్థులు నష్టపోతున్నారు. వెరసి మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవడం ద్వారా జరుగుతున్న నష్టం ఊహించలేనిది!!.ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ఆప్షన్ల నమోదు ప్రారంభం2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం తొలి దశ కౌన్సెలింగ్కు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 19వ తేదీ రాత్రి తొమ్మిది గంటలను ఆప్షన్ల నమోదు చివరి గడువుగా విధించారు. https://drntr.uhsap.in వెబ్సైట్లో విద్యార్థులు ఆప్షన్ నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. గతేడాది ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఈ ఏడాది ప్రారంభించనున్న పాడేరు వైద్య కళాశాలలో 240 సెల్ఫ్ఫైనాన్స్, 101 ఎన్ఆర్ఐ కోటా (సీ కేటగిరి) సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రైవేట్, మైనార్టీ, స్విమ్స్ కళాశాలల్లో బీ కేటగిరి 1078, సీ కేటగిరి 495 సీట్లున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలుంటే 9000780707, 8008250842 నంబర్లలో విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు.ప్రైవేటీకరణ దుర్మార్గంపులివెందుల కళాశాలకు సీట్లను నిరాకరించడమేంటి? సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల రద్దు హామీ ఏమైంది? సీఎం చంద్రబాబుకు ఎస్ఎఫ్ఐ లేఖ విద్యార్ధుల వైద్య విద్య ఆశలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తోందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) మండిపడింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్లు సోమవారం మీడియాకు విడుదల చేశారు. విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యతను విస్మరించి ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టడం దారుణమన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కొత్త కళాశాలలకు అనుమతులు తేవాల్సిన కూటమి ప్రభుత్వం పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూడా వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకు 50 సీట్లు వచ్చాయని, మిగిలిన నాలుగు కొత్త కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోపీ ఇచ్చి ఉంటే అనుమతులు లభించేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు 700 సీట్లు కోల్పోయారన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి విద్యార్ధులు వైద్య విద్యకు దూరం కావడం ఖాయమన్నారు. రిజర్వేషన్ల ఊసే ఉండదని, తద్వారా వెనకబడిన తరగతుల విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పేదలకు ఉచిత వైద్య సేవలు కూడా అందవని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రద్దు చేస్తామన్న హామీపై ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే వైద్య విద్య ప్రైవేటీకరణను విరమించుకుని ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.రాయలసీమకు బాబు ద్రోహం మెడికల్ సీట్లు వద్దనడం దారుణం పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు వైఎస్సార్ సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్ సీపీ పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈమేరకు సోమవారం ఆరు అంశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్కి లేఖ రాశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల ఈ ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకపోగా ఎన్ఎంసీ పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 సీట్లు కూడా పోయాయని మండిపడ్డారు. ఇది రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయడం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్ పులివెందుల మెడికల్ కళాశాలను ఎప్పుడైనా సందర్శించారా? అని నిలదీశారు. ప్రశ్నించారు. రాయల సీమ నుంచి గెలిచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉంటూ ఇలా చేయటం దుర్మార్గం అనిపించటం లేదా? అని దుయ్యబట్టారు. 2023 డిసెంబర్ 15వ తేదీన పులివెందుల మెడికల్ కళాశాల స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీచేసి పోస్టులు భర్తీ చేసి 2023లో మార్చిలో కాలేజీని ప్రారంభించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చిన్న చిన్న ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అండర్ టేకింగ్ లెటర్ ఇస్తే అడ్మిషన్లు నిర్వహించుకోవటానికి ఎంఎన్సీ అనుమతిస్తుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కేవలం మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మాణం, ప్రారంభం అయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక అడ్మిషన్లకు కూటమి ప్రభుత్వం అడ్డుపడిందని విమర్శించారు. -
తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదం
‘ఏడాదిపాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ యూజీ–2024లో 595 స్కోర్ చేశా. గతేడాదితో పోలిస్తే మెరుగైన స్కోర్ చేసినా కన్వీనర్ కోటాలో సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది మరో 5 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తే మనకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరేవి. దీనికి తోడు టీడీపీ తన హామీ మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తే మరో 319 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగేవి. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ అండర్ టేకింగ్ కోరినా ప్రైవేట్కు కట్టబెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేస్తే మేం నిర్వహించలేమంటూ ప్రభుత్వమే లేఖ రాసి నాలాంటి విద్యార్థులకు తీవ్ర నష్టం తలపెట్టింది. ఇప్పటికే లాంగ్టర్మ్ కోచింగ్ రూపంలో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి కూడా సీటు రాకుంటే నా భవిష్యత్ అంధకారమే. తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు ఈసారి సీట్లు వస్తున్నాయి. అక్కడ 8 వైద్య కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగడమే దీనికి కారణం. ఏపీలో మాత్రం వచ్చిన సీట్లు సైతం వద్దంటూ ప్రభుత్వమే లేఖ రాసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై చిత్తశుద్ధి లేని జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది...!’ విశాఖకు చెందిన నీట్ ర్యాంకర్ సాయి ఆక్రోశం ఇదీ!సాక్షి, అమరావతి: వైద్య విద్యపై ఎంతో ఆశ పెట్టుకుని లాంగ్ టర్మ్ శిక్షణతో ఏడాదంతా సన్నద్ధమై మంచి స్కోర్ సాధించిన పలువురు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కాలేజీలు అందుబాటులోకి రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది 700, వచ్చే ఏడాది 1,050 చొప్పున మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో తమ ఆశలు గల్లంతవుతున్నాయని నీట్ ర్యాంకర్లు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? అని ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే ఇక ‘కోట్లు’న్న వారికే తెల్లకోటు భాగ్యం దక్కుతుందని పేర్కొంటున్నారు.మంచి స్కోరైనా..సీట్ కష్టంనీట్ యూజీలో అర్హత సాధించిన 13,849 మంది ఈసారి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నీట్లో 500–550 స్కోర్ చేసినా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓసీ విద్యార్థులైతే దాదాపు 600 స్కోర్ చేసినప్పటికీ అసలు సీటు వస్తుందో? లేదో? అనే ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు దక్కుతున్నాయని, ఏపీలో మాత్రం ప్రతిభ ఉన్నప్పటికీ వైద్య విద్య చదివే అదృష్టం లేదని వాపోతున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు గణనీయంగా పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో 8 కళాశాలలకు ఏకంగా 400 సీట్లు అదనంగా మంజూరవడం అక్కడి విద్యార్థులకు కలిసి వస్తోంది.సీట్లు పెరిగింది గత ఐదేళ్లలోనే⇒ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్లను నెలకొల్పడంతో పాటు నెల్లూరు ఎసీఎస్ఆర్ కళాశాల ఏర్పాటుకు బీజం వేశారు. ⇒ 2004కు ముందు, 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య విద్యపై తీవ్ర ప్రభావం పడింది. ⇒ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ⇒ వీటిలో ఐదు కొత్త కళాశాలలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరడంతో వైద్య విద్యపై ఆశలు చిగురించాయి. ⇒ ఈ క్రమంలో ఈ ఏడాది మరో ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా వాటిని ప్రైవేట్పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.⇒ దీంతో ఈ ఏడాది 750 సీట్లు సమకూరాల్సి ఉండగా కేవలం పాడేరు వైద్య కళాశాలలో కేవలం 50 సీట్లు అది కూడా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టేందుకు వాటికి అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. ⇒ ఇదే విషయం ఎంఎన్సీ (జాతీయ వైద్య కమిషన్) రాసిన లేఖ ద్వారా ఇప్పటికే బహిర్గతమైన సంగతి తెలిసిందే. ⇒ ఈ ఏడాది మెడికల్ కాలేజీలు పెరిగితే తమ పిల్లలకు కచ్చితంగా సీటు వస్తుందనే అంచనాతో సగటున రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి నీట్ శిక్షణ ఇప్పించామని, అయితే స్కోర్ 500 దాటినా దక్కని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ⇒ పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేయడం విస్మయం కలిగించిందంటూ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వమే వ్యాఖ్యానించడంపై నివ్వెరపోతున్నారు.మా ఆశలను కాలరాశారుగతేడాది నీట్లో 515 స్కోర్ చేశా. ఓసీ కేటగిరీలో 543 స్కోర్కు కన్వీనర్ కోటాలో చివరి సీట్ వచ్చింది. దీంతో లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నా. ఈసారి 555 స్కోర్ సాధించినా పోటీ తీవ్రంగా ఉంది. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే నాకు సీటు దక్కేది. కనీసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసినా మాకు న్యాయం జరిగేది. ప్రభుత్వమే మా ఆశలను కాలరాసింది. మేనేజ్మెంట్ కోటాలో చేరాలంటే మా తల్లిదండ్రులకు తలకు మించిన భారం. ఇప్పటికే నాతోపాటు మా సోదరుడి లాంగ్టర్మ్ కోచింగ్ కోసం రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు. – ఎన్. సుచేతన, రాజంపేట, అన్నమయ్య జిల్లాఅప్పుడు అదృష్టం.. ఇప్పుడు!నాకు ఇద్దరు కుమార్తెలు. 2023లో పెద్దమ్మాయి నీట్లో 530 మార్కులు సాధించి ఏలూరు కాలేజీలో సీట్ దక్కించుకుంది. ఆ విద్యా సంవత్సరంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడం, అదనంగా 750 సీట్లు పెరగడం మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు రెండో అమ్మాయి 543 మార్కులు సాధించినా ప్రభుత్వ సీట్ రావటం లేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఐదు కొత్త కళాశాలలు ప్రారంభం అయితే అదృష్టం కలసి వస్తుందని ఆశపడ్డాం. ప్రభుత్వమే వసతులు కల్పించలేమని చేతులెత్తేస్తే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? అదే మా అమ్మాయి పక్క రాష్ట్రంలో ఉంటే మొదటి రౌండ్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చేది. – సీహెచ్.ఉమామహేశ్వరరావు, పోలాకి మండలం, శ్రీకాకుళంప్రభుత్వమే వ్యాపారం చేస్తానంటే ఎలా?సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ దాన్ని నెరవేర్చకపోగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఉచితంగా వైద్య విద్య అందించడానికి కృషి చేయాలి. అంతేగానీ వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? గతేడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమై అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ఎంతో సంతోషించాం. ఈ ఏడాది మరో ఐదు కొత్త కాలేజీల ద్వారా అదనంగా 750 సీట్లు వస్తాయని భావిస్తే పీపీపీ విధానం పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురి చేశారు. – జి.ఈశ్వరయ్య, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి -
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. కాగా, నీట్ యూజీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఆగస్ట్ 14 నుంచి రాష్ట్రాల వారీగా ప్రారంభమైంది. ఎంసీసీ సమాచారం మేరకు.. నీట్ యూజీ-2024 కౌన్సెలింగ్ నాలుగుసార్లు జరగనుంది. తాజాగా తొలిరౌండ్ కౌన్సెలింగ్ పూర్తయింది. అందులో ర్యాంక్, ప్రాధాన్యతలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అభ్యర్ధులకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయించినట్లు ఎంసీసీ వెల్లడించింది. ఈ కౌన్సెలింగ్లో మొత్తం 26,109 మంది విద్యార్ధులకు సీట్లను కేటాయించింది.మొత్తం టాప్ 17 ర్యాంకులు సాధించిన విద్యార్ధులు ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ సీట్లను సంపాదించారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్ధులు ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్స్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎంసీసీ వెల్లడించింది.ఎంసీసీ ప్రకారం, రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం అవసరమయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రాలు(పీడబ్ల్యూడీ) అవసరమయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 9, 2024 సాయంత్రం 5 గంటల లోపు సంబందిత కేంద్రాల నుంచి పొందాలని తెలిపింది. ఇతర వివరాల కోసం ఎంసీసీ కాల్ సెంటర్కు కాల్ చేసి తెలుసుకోవాలని, జన్మాష్టమి కారణంగా, ఎంసీసీ కాల్ సెంటర్ (సోమవారం)ఆగస్టు 26, 2024న ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని ఎంసీసీ ప్రతినిధులు వెల్లడించారు.అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి గడువు ఆగస్ట్ 29 వరకు ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు ఈ అభ్యర్థుల అడ్మిషన్ డేటాను వెరిఫై చేస్తాయి. ఇవి ఆగస్టు 30,31 మధ్య ఎంసీసీకి సమర్పిస్తాయి. -
నీట్-పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ
వైద్యవిద్యా పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్-పీజీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు నీట్-పీజీని వాయిదా వేయాలని కోరుతూ పలువురు విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టలేమని వ్యాఖ్యానించింది.నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే ‘నీట్-పీజీ పరీక్ష ఆగస్టు 11న (ఆదివారం) జరగనుంది. అయితే దీనిని వాయిదా వేయాలని కోరుతూ విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, జేబీ పార్దివాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.రెండు రోజుల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా... ఈ సమయంలో వాయిదా వేయాలని ఆదేశించలేమని పేర్కొంది. ‘ఇలాంటి పరీక్షలను మనం ఎలా వాయిదా వేయగలం? ఈ మధ్యకాలంలో పరీక్షను వాయిదా వేయమని అడుగుతూ పిటిషన్లు వేస్తున్నారు. ఇది పరిపూర్ణ ప్రపంచమేమి కాదు. మేము విద్యా నిపుణులం కాదు.రెండు లక్షల మంద విద్యార్థులు హాజరవుతారు. కొంతమంది అభ్యర్థులు వాయిదా వేయాలని కోరినందుకు దీనిని రీ షెడ్యూల్ చేయాలని అనుకోవడం లేదు. పరీక్షను వాయిదా వేయడం ద్వారా రెండు లక్షల విద్యార్ధులు, 4 లక్షల మంది తల్లిదండ్రులు ప్రభావితమవుతారు. ఈ పిటిషన్ల కారణంగా మేము విద్యార్ధుల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టివేయలేం’ అని కోర్టు అభిప్రాయపడింది.కాగా నీట్ పీజీ పరీక్షలో ఇప్పటివరకు పేపర్ లీకేజీ ఆరోపణలు రాలేదు. కానీ నీట్-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీజీ పరీక్షను సైతం కేంద్రం వాయిదా వేసింది. తొలుత జూన్ 23న నిర్వహించాల్స ఉండగా తాజాగా ఆగస్టు 11న జరగనుంది. -
మార్కులు పెరిగినా.. ర్యాంకులు ఢమాల్!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య కోర్సులు ఎంబీబీఎస్, బీడీఎస్లలో ప్రవేశాలకు ఈసారి విపరీతమైన పోటీ నెలకొంది. గత రెండేళ్లతో పోలిస్తే ఎక్కువ మార్కులు సాధించినవారికి సైతం ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు వేలల్లోకి చేరడంతో ఎక్కడ సీటు దక్కుతుందన్నదీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. 2024–25 విద్యా సంవత్సరానికిగాను యూజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ కోసం వెబ్సైట్లో రిజి్రస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఆలిండియా కోటా (ఏఐక్యూ)కు సంబంధించిన కౌన్సెలింగ్ ఈనెల 14వ తేదీ నుంచి మొదలవనుంది. తొలుత ఆలిండియా కోటా సీట్ల కౌన్సెలింగ్ పూర్తిచేసి.. తర్వాత రాష్ట్ర స్థాయి సీట్లను భర్తీ చేస్తారు.లీకేజీ గందరగోళం మధ్య.. ⇒ ఈ ఏడాది యూజీ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం విద్యార్థుల ను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. ఫలితాలు వెలువడ్డాక సుప్రీంలో కేసులు, వాదప్రతివాదనల అనంతరం కౌన్సెలింగ్కు మార్గం సుగమమైంది. దీనితో కాస్త ఆలస్యంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడ్డాయి. వాటిని చూసుకున్న అభ్యర్థు లు సీటు వస్తుందా? రాదా? వస్తే ఎక్కడ రావొచ్చన్న ఆందోళనలో పడ్డారు.మార్కులు ఘనం.. ర్యాంకు పతనం.. ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంకు సాధించిన విద్యార్థికి వచి్చన మార్కులు 711, ఆలిండియా స్థాయిలో వచి్చన ర్యాంకు 137. అదే 2022 యూజీ నీట్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి 711 మార్కులేరాగా.. జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు వచి్చంది. మంచి మార్కులు వచి్చనా.. ఆలిండియా ర్యాంకు బాగా తగ్గిపోయింది. పోటీ విపరీతంగా పెరగడం, చాలా మంది విద్యార్థులకు మార్కులు పెరగడమే దీనికి కారణం. మెరుగైన మార్కులు సాధించామనుకున్న విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం తగ్గిపోవడంతో ఆందోళనలో పడ్డారు. దీంతో ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రధానంగా ఆలిండియా కోటా సీట్ల విషయంలో సీటు ఎక్కడ వస్తుందనేది అంచనా వేసే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్లోనూ అయోమయంప్రస్తుతం రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదలవడంతో విద్యార్థులు రిజి్రస్టేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ కాలేజీలో సీటు వస్తుందనేది అంచనా వేసుకుంటున్నారు. కానీ ఏపీకి 15% కోటా సీట్లు రద్దు, స్థానికతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మార్కులు, ర్యాంకుల తీరు మారడం వంటివి విద్యార్థుల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. కాలేజీల వారీగా సీట్లు, రిజర్వేషన్ కోటా ప్రకా రం విభజించి పరిశీలిస్తేనే ఏదైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని సీని యర్లు అభిప్రాయపడుతున్నారు. ఆలిండియా కోటాను మినహాయించి రాష్ట్ర స్థాయిలో సీట్ మ్యాట్రిక్స్ విడుదలైతేనే స్పష్టత వస్తుందని అంటున్నారు.


