నీట్ రీటెస్ట్ :‘లాక్‌డౌన్’లో ప్రశ్నపత్రాల రూపకర్తలు | Question paper setters placed under lockdown | Sakshi
Sakshi News home page

నీట్ రీటెస్ట్ :‘లాక్‌డౌన్’లో ప్రశ్నపత్రాల రూపకర్తలు

Jun 8 2026 12:53 PM | Updated on Jun 8 2026 12:57 PM

Question paper setters placed under lockdown

న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ రీటెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో, ఈసారి ఎలాంటి లీకులకు తావులేకుండా ఉండేందుకు పరీక్షల నిర్వహణ యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా ఒక అసాధారణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. జూన్ 21న జరగబోయే ఈ రీటెస్ట్ పూర్తి పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు సర్వసన్నద్ధమయ్యారు.

రహస్య ప్రాంతాల్లో కఠిన నిర్బంధం
నీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రాలను రూపొందించే ఎగ్జామినర్లతో పాటు, వాటిని వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ట్రాన్స్‌లేటర్లను కేంద్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన ‘లాక్‌డౌన్’ తరహా నిర్బంధంలో ఉంచింది. వీరందరినీ ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు తరలించారు. జూన్ 21న పరీక్ష ముగిసేంత వరకు వీరు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి వీల్లేదు. బయటి వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు.

గ్యాడ్జెట్లపై నిషేధం.. డేగ కన్ను
ఈ భద్రతా కేంద్రాల్లో ఉన్నవారెవరూ మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఉపయోగించడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నెట్ సదుపాయాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ వాడాల్సి వచ్చినా, అది పూర్తి నిఘా నీడలోనే సాగుతుంది. ప్రత్యేక అనుమతులు ఉన్న సిబ్బందిని మాత్రమే ఈ రహస్య ప్రాంతాల్లోకి అనుమతిస్తున్నారు.

రంగంలోకి భారత వాయుసేన
ప్రశ్నపత్రాల రూపకల్పనలోనే కాకుండా, వాటి రవాణా విషయంలోనూ ప్రభుత్వం అత్యంత కఠినమైన భద్రతా చర్యలను చేపడుతోంది. ఎలాంటి లీకేజీలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఈసారి భారత వాయుసేన యుద్ధ విమానాల ద్వారా ప్రశ్నపత్రాలను వివిధ రాష్ట్రాలకు సురక్షితంగా తరలించి, పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ  భద్రతా వ్యూహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement