బూటు కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు గుద్ది.. | High Tension In Vijayawada | Sakshi
Sakshi News home page

బూటు కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు గుద్ది..

Jul 24 2026 5:57 AM | Updated on Jul 24 2026 5:57 AM

High Tension In Vijayawada

విజయవాడ లోక్‌భవన్‌ వద్ద విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు

విజయవాడలో విద్యార్థి సంఘాల చలో లోక్‌భవన్‌ ఉద్రిక్తం

విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి

కాలర్‌ పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వైనం

విద్యార్థినులపైనా అమానుషం.. పలువురికి గాయాలు

పోలీసులు, చంద్రబాబు సర్కారు తీరుపై విద్యార్థి, యువజన సంఘాల ఆగ్రహం

నేటి రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండించడంతోపాటు నీట్‌ పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు విజయవాడలో చేపట్టిన చలో లోక్‌భవన్‌ కార్యక్రమం గురువారం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు లోక్‌భవన్‌కు వెళ్లే మార్గాలన్నింటినీ దిగ్బంధించారు. మ్యూజియం రోడ్డు, బందరు రోడ్డులో అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటుచేశారు. పోలీసులు భారీగా మోహరించారు.

శాంతియుతంగా ర్యాలీ చేస్తూ లోక్‌భవన్‌కు వెళ్తున్న విద్యార్థులను అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి విద్యార్థులు, యువకులు భారీగా మ్యూజియం రోడ్డు నుంచి బందరు రోడ్డుకు చేరుకోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు. అయినా విద్యార్థులు బారికేడ్లను నెట్టుకుంటూ లోక్‌భవన్‌కు వెళ్లేందుకు బందరు రోడ్డు వెంట పరుగులు తీశారు. దీంతో పోలీసులు వారి వెంటపడ్డారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.

సివిల్‌ దుస్తుల్లో ఉన్న కొందరు పోలీసులు విద్యార్థులను రోడ్డుపై పడేసి కాలర్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. వారిపై పిడిగుద్దులు కురి­పించారు. రోడ్డుకేసి కొడుతూ బూటుకాళ్లతో తన్నా­రు. విద్యార్థినులు, యువతులపైనా విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరిద్దరు పోలీసులు విద్యార్థి సంఘాల కండువాలు కప్పుకుని మరీ విద్యార్థులపై దాడికి పాల్పడడం గమనార్హం. ఏఎస్సై రవికుమార్‌ ఓ విద్యార్థిపై దాడి చేయడంతో మిగిలిన విద్యార్థులు ఆయనను అడ్డుకున్నారు.

రోడ్డుపై బైఠాయింపు 
అనంతరం.. విద్యార్థి సంఘాల ప్రతి­నిధులను లోక్‌భవన్‌కు తీసుకెళ్తామని, గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని పోలీసు అధికారులు నమ్మబలికారు. అయితే, అపాయింట్‌మెంట్‌ ఇప్పించే వరకు వెనక్కు వెళ్లేది లేదంటూ మ్యూజియం రోడ్డులో విద్యార్థులు భైఠాయించారు. గంట తర్వాత గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకలేదని, వెన­క్కు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. లోక్‌భవన్‌కు వెళ్లేందుకు విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు మరోసారి వారిపై దాడి చేశారు. ఈడ్చిపడేస్తూ మ్యూజియం రోడ్డులోకి నెట్టేశారు.

పోలీసుల దాడిని విద్యార్థులు ప్రతిఘటించారు. పోలీసుల తీరు, చంద్రబాబు సర్కారు వైఖరిపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్నకుమార్, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్‌ తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం జరపతలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement