పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు.. పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చంద్రబాబు హామీ
గద్దెనెక్కగానే కొత్తగా ఇవ్వకపోగా.. సీఆర్డీఏలో 50 వేల మంది పేదల ఇళ్ల పట్టాలు రద్దు
గత ప్రభుత్వంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంపైనా తీవ్ర నిర్లక్ష్యం
రెండేళ్లలో పేదలకు ఇళ్ల పట్టాలు.. ఇళ్ల నిర్మాణం గురించి ఏ మాత్రం పట్టించుకోని వైనం
ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్ల స్థలాలు క్రమబద్ధికరించి మంగళగిరిలో లోకేశ్ పబ్లిసిటీ స్టంట్
గత వైఎస్ జగన్ సర్కారులో ఏకంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు
21 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు.. పేదల సొంతింటి కల సాకారం దిశగా నాడు వేగంగా అడుగులు
సాక్షి, అమరావతి: ‘పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం మంజూరు చేస్తాం. ఇప్పటికే పట్టాలు మంజూరైన వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం’ అని సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చి లబ్ధి పొందిన చంద్రబాబు.. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలో పేదలకు గజం స్థలం కూడా పంపిణీ చేయలేదు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా, గత వైఎస్ జగన్ ప్రభుత్వం సీఆర్డీఏలో 50 వేల మంది పేదింటి మహిళలకు మంజూరు చేసిన ఇంటి పట్టాలను రద్దు చేసి పేదల సొంతింటి కలను ఛిద్రం చేశారు.
మరోవైపు గత ప్రభుత్వంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మంజూరు చేసి, నిర్మాణంలో ఉన్న ఇళ్లను సైతం గాలికొదిలేశారు. ఇలా రెండేళ్ల పాలనలో పేదల గూడు కూల్చేసిన చంద్రబాబు సర్కారు.. మంగళగిరిలో కొందరు పేదల ఇళ్ల స్థలాలను క్రమబద్ధికరించి పెద్ద పబ్లిసిటీ స్టంట్ చేస్తోంది. రెండు రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ పేరిట విద్యా శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే లోకేశ్ షో చేశారు.
వాస్తవానికి మంగళగిరిలో లోకేశ్ పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులంతా ఒకటి, రెండు దశాబ్ధాలుగా అదే స్థలంలో ఇళ్లు నిరి్మంచుకుని నివసిస్తున్న వారే. చంద్రబాబు సర్కారు కొత్తగా స్థలం సేకరించి, ఇళ్ల పట్టాలు జారీ చేయలేదు. ఈ క్రమంలో ఇళ్ల స్థలాల క్రమబద్ధికరణ ఎంతో కష్టంతో కూడుకున్న ప్రక్రియ అని, దాన్ని తమ ప్రభుత్వం సాధించిందని లోకేశ్ సొంత డబ్బా కొట్టుకున్నారు. మరోవైపు లోకేశ్ గొప్ప చరిత్రకు నాంది పలికారంటూ టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో హైప్ ఇస్తుండటంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు లేని పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
50 వేల మంది పట్టాలు రద్దు చేసి..
వైఎస్ జగన్ హయాంలో ఏపీలో ఇళ్లు లేని పేదలందరికీ పక్కా గృహాల కల్పనే లక్ష్యంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50,793 మంది పేదింటి మహిళలకు సీఆర్డీఏ పరిధిలో 1,402 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దీనిని జీరి్ణంచుకోలేని టీడీపీ అప్పట్లో కోర్టు కేసులు వేసి అడ్డంకులు సృష్టించింది.
రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని ప్రభుత్వ పెద్దలు పేదలను అవమానించారు. నాడు కోర్టుల్లో కేసులు వేసి పేదల ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగకుండా కుటిల యత్నాలు చేసిన టీడీపీ.. 2024లో అధికారంలోకి వచ్చాక సీఆర్డీఏలో ఇచ్చిన స్థలాలు అన్నింటినీ రద్దు చేసేసింది. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ స్థలాలనూ కేటాయించలేదు. దీంతో 50 వేల మంది పేదల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
అండగా నిలిచిన వైఎస్ జగన్
పేదల సొంతింటి కల సాకారం చేయడం కోసం దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ హయాంలో సంస్కరణలు చేపట్టారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 31 లక్షల మందికిపైగా పేద మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు. ఆ కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు.
వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. 2020, 2021లో కోవిడ్ వ్యాప్తి, లాక్డౌన్ వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉచితంగా ఇంటి పట్టాలు మంజూరు చేసి, ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. 2024 ఎన్నికల నాటికి వైఎస్ జగన్ ప్రభుత్వం 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, లబ్ధిదారులకు పక్కా ఇళ్లను అందజేసింది. అదే సమయానికి మరో 8 లక్షలకు పైగా ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు స్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇలా దాదాపు నిర్మాణం పూర్తయిన ఇళ్లకు రంగులు వేయించి బాబు సర్కార్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసి ఇప్పటికే అభాసుపాలైంది.
లక్షాధికారులుగా తీర్చిదిద్ది
వైఎస్ జగన్ హయాంలో 31 లక్షల మందికిపైగా పేద అక్కచెల్లెమ్మల పేరిట రూ.76 వేల కోట్లకుపైగా మార్కెట్ విలువ చేసే స్థలాలు పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేసి, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణం అందించారు. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేసి మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చారు. మహిళల పేరిట పంపిణీ చేసిన స్థలం మార్కెట్ విలువే రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. వైఎస్ జగన్.. ఉచితంగా ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం రూపంలో రూ.లక్షల విలువ చేసే స్థిరాస్తిని పేదలకు సమకూర్చారు.


