మేఘాలయా హనీమూన్ కేసు యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాంకేతికత ముసుగులో ఎటుపోతున్నాం, మానవతా విలువలు ఏమవుతున్నాయనే ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ రద్దు చేస్తూ గట్టి షాకివ్వడమే కాదు కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది. అంతేగాదు ధర్మాసనం ఈ కేసు విచారణ నేపథ్యంలో మారుతున్న కుటుంబ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పైగా యావత్తు సమాజాన్ని ఆలోచింప చేసేలా చక్కటి సందేశాన్ని ఇచ్చింది జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం. ఇంతకీ సుప్రీంకోర్టు కుటుంబ వ్యవస్థ గురించి ఏం చెప్పిందంటే..
ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, దంపతుల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు పెద్దలు వాటిని పరిష్కరించేవారు. చిన్న కుటుంబాల విషయానికొస్తే, వాళ్లు ఒంటరిగా మిగిలిపోతున్నారు, అందువల్ల విడిపోవడం పెరుగుతోందని పేర్కొంది. పైగా వారిలో డిప్రెషన్ కూడా పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల ప్రతిది ఇట్టే తెలిసిపోతున్నా..యువత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని ధర్మాసనం వెల్లడించింది.
అది కాస్తా తరుచుగా వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు జస్టిస్ ఎం ఎం సుందరేష్ మాట్లాడుతూ..మారుతున్న కుటుంబ వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరగడం సహజం. వైవాహిక వివాదాలు పెరగడంతో వ్యక్తిగత చట్టాలతో సంఘర్షణలు కూడా పెరుగుతాయని అన్నారు. ప్రస్తుత తరం మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండొచ్చు, కానీ ఒత్తిడిలో మనకంటే బలహీనంగా ఉన్నారని చెప్పారు.
ఆ వ్యాఖ్యలకు భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..యువతకు "సమాచారం ఎక్కువగా ఉంది కానీ జ్ఞానం ఎక్కువగా లేదని అన్నారు. వాట్సాప్లలో పంచుకున్న ప్రతిదాన్ని జ్ఞానంగా పరిగణిస్తున్నారని, ఈ డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వల్లే పెను ప్రమాదాలు వాటిల్లుతున్నయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేగాదు తాను ఇటీవల ఏడుస్తున్న ఒక చిన్నారిని చూశానని, ఆమెకు పేరెంట్స్ మొబైల్ ఇచ్చారని అన్నారు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల స్థానాన్ని మొబైల్ భర్తీ చేస్తోందన్నమాట. ఇది రాను రాను ఒక విపత్తుగా మారుతుందని ఆ క్షణం ఏ తల్లిదండ్రులకు దీనిగురించి అంతగా తెలియదని అన్నారు జస్టిస్ ఎం ఎం సుందరేష్.
ఇలాంటివి నిజానికి చాలా ప్రమాదకరమైనవని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతోనే ఇలాంటి ఘోరాలు జరగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అంతేగాదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే గాక, ఐక్యతకు ప్రతీకగా నిలిచేవని పేర్కొంది. ప్రస్తతం న్యూక్లియర్ (చిన్న) కుటుంబాల సంఖ్య ఎక్కువై బంధాల మధ్య మాధుర్యం లోపిస్తోందని అభిప్రాయపడింది. నవ సమాజానికి పునాది అయినా కుటుంబాలే గతితప్పడంతోనే..ఇలాంటి నేరాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయని స్పష్టం చేసింది.
కాగా, సోనమ్కు షిల్లాంగ్ ట్రయల్ కోర్టు ఏప్రిల్లో బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో నిబంధనల ప్రకారం కారణాలు సరిగ్గా తెలియజేయలేదన్న సాంకేతిక అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం మేఘాలయ హైకోర్టు కూడా ఆ బెయిల్ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, బెయిల్ మంజూరును సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్టు మెమోలోని తప్పు కేవలం టైపింగ్ లేదా క్లరికల్ పొరపాటు మాత్రమేనని, దాని ఆధారంగా బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం వాదించింది.
(చదవండి: కార్పెంటర్ కుమార్తె ఘనత..! శక్తిశాట్లో మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని..)


