టాలెంట్ ఉంటే ఎంతటి కుగ్రామంలో ఉన్నా..నింగికి ఎగిసిపోవచ్చు. అచంచలమైన పట్టుదల ఉంటే..ఎన్ని అడ్డంకులు ఉన్నా..అవకాశాల రూపంలో ఆకాశమంత లక్ష్యాని చేధించొచ్చు అని చాటి చెప్పి..అందరికీ స్ఫూర్తిగా నిలిచింది ఈ 14 ఏళ్ల విద్యార్థిని.
ఆ అమ్మాయే ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (ZPGHS)లో పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల కందుల జెస్సీ. ప్రపంచంలోనే మొట్టమొదటి బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ లూనార్ క్యూబ్శాట్ మిషన్ అయిన 'మిషన్ శక్తిశాట్' కోసం భారతదేశం నుంచి మొతం 20 మంది ఎంపికవ్వగా వారిలో ఆంధ్ర నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని ఆమె.
వడ్రంగి కుమార్తె అయిన జెస్సీ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం సుమారు 108 దేశాల నుంచి దాదాపు 12 వేల మంది బాలికలు నమోదు చేసుకోగా, వారిలో చోటు దక్కించుకున్న ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా నిలిచింది. జెస్సీకి సైన్సు ఆవిష్కరణల పట్ట చిన్నప్పటి నుంచి అమితాశక్తి. ఆ ఆసక్తిని ఆమె భౌతిక ఉపాధ్యాయురాలు అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జి మణిమాల గుర్తించింది. గతేడాది ఆమెను ఆ ప్రోగ్రామ్లో నమోదు చేయించింది. ఆ అవకాశంతో స్ఫూర్తిపొందిన జెస్సీ..తన పాఠశాలలోని మరో ఎనిమిది మంది అమ్మాయిలను కూడా దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహించింది. అయితే అప్పటికే ఆన్లైన్ కోర్సు వర్క్ ప్రారంభమైందని తెలుస్తుంది.
అయితే మణిమాల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లను సంప్రదించి తన విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించారు, తద్వారా జెస్సీ ఎంపిక ప్రక్రియలో కొనసాగడానికి వీలు కలిగింది. అయితే ఆమె పదోతరగతి పరీక్షలకు సన్నద్ధమవుతూనే పాఠశాల అనంతరం ప్రతిరోజూ ఆన్లైన్ తరగతులకు హాజరై, దాదాపు 60 శాతం ప్రోగ్రామ్ కోర్సుని పూర్తి చేసింది. మిషన్ శక్తిశాట్ ప్రోగ్రామ్లో ఉపగ్రహ వ్యవస్థలు, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్, అంతరిక్ష సాంకేతికత వంటి అంశాలను కవర్ చేస్తూ సుమారు 550 సెషన్లు, 21 మాడ్యూల్స్ ఉన్నాయి. తన పాఠశాల పాఠ్యప్రణాళిక కంటే ఈ కోర్సు చాలా అత్యున్నత స్థాయిలో ఉందని, అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చింది జెస్సీ.
అంతర్జాతీయ ఇంటర్వ్యూ కోసం మెరుగైన ఆంగ్లం..
అంతర్జాతీయ నిపుణులతో జరిగే ఇంటర్వ్యూ కావడంతో..అందుకోసం తన ఉపాధ్యాయులు, విద్యా సంబంధిత వీడియోల సాయంతో ఆంగ్లం మెరుగుపరుచుకుని మరీ హాజరైంది. అయితే అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో మాట్లాడేటప్పుడు చాలా కంగారుడపడ్డానని, తనలాంటి ప్రభ్యుత్వ పాఠశాల విద్యార్థిని ఎంపికవుతుందని ఊహించలేదని అంటోంది.
గర్వించే క్షణం..
జెస్సీ ఎల్లప్పుడూ పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్లో అత్యంత చురుకైన సభ్యులలో ఒకరిగా ఉండేదని, సైన్సు సంబందితన అన్ని కార్యకలాపాలు, పోటీల్లో నిరంతరం పాల్గొనేదని చెప్పుకొచ్చారు ఆమె గైడ్ మణిమాల. ఇక తల్లి అరుణ..ఆర్థిక ఇబ్బందులు కారణంగా కూతుర్ని ప్రైవేట్ పాఠశాలకు పంపలేకపోయామని..కానీ అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో తన కూతురు మాట్లాడటం చూసి చాలా గర్వంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేసింది.
ఇక జెస్సీ కూడా ఇస్రోలో చేరాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి కష్టపడితే సాధ్యమవుతుందనే తన నమ్మకాన్ని ఈ ఎంపిక మరింత బలపరిచిందని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. అంతేగాదు తాను తన పేరెంట్స్కి అండగా నిలబడాలని అనుకుంటున్నానని, అలాగే మా ఉపాధ్యాయులకు, పాఠశాలకు గర్వకారణంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది జెస్సీ.
ఆగస్టు 23 నుంచి ఢిల్లీలో శిక్షణ..
ఈ కార్యక్రమం తదుపరి దశ ఆగస్టు 23న న్యూఢిల్లీ ప్రారంభమవుతుంది. ఇందులో ప్రాక్టికల్ శిక్షణ, జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాల్లో హాజరుకానున్నారు కూడా. ఈ శిక్షణ సమయంలో, ఆమె శాస్త్రవేత్తలతో కలిసి ఉపగ్రహ రూపకల్పన, పేలోడ్ అభివృద్ధి, మిషన్ కార్యకలాపాలపై పనిచేస్తుంది.
కాగా, విద్యార్థులు రూపొందించిన లూనార్ క్యూబ్శాట్ను అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. ఈ స్టోరీలో జెస్సీ కేవలం చంద్రుడిని వెంబడించడం లేదు, ప్రభ్యుతం పాఠశాల అయినా..పరిస్థితులు ఎలా ఉన్నా..కష్టబడేతత్వం ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సాధ్యమే అని నిరూపించింది.
(చదవండి: నో లగ్జరీ కార్లు, నో బ్రాండెడ్ బట్టలు..! వైరల్గా ఆ జంట ఆర్థిక సూత్రాలు..)


