సాక్షి, విశాఖ: మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్ పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుడు కళ్యాణి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. సీదిరి అప్పలరాజు కుమారుడు ప్రమాదానికి సంబంధించిన కేసులో ఉండగా, తండ్రిని అరెస్ట్ చేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుడు కళ్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబుది నియంత పాలన. హిట్లర్, గడాఫీని చంద్రబాబు మించిపోయారు. పోలీసు వ్యవస్థను తన సొంత అనుబంధ సంస్థగా మార్చుకున్నారు. కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని అరెస్టు చేస్తారా?. ఇలాంటి దారుణమైన సంఘటనలు ఏపీలోనే చూస్తున్నాం. యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా నమోదు చేయటం సిగ్గుచేటు. జడ్జి అభ్యంతరం చెబితే మళ్ళీ సెక్షన్లు మార్చారు. బీసీ గొంతు నులిమితే మరెన్నో బీసీల గొంతులు ప్రశ్నిస్తాయి. సీదిరి అప్పల రాజు అరెస్టు అన్యాయం. బీసీ నాయకులను ఎదగనీయరా?.
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?. గుంటూరులో మహిళను వివస్త్రను చేయటం, జత్వానీ కేసులో ప్రభుత్వం ఇరుకున పడింది. అందుకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఏపీలో బీసీలపై వేధింపులు పెరిగిపోయాయి. జోగి రమేష్ ఇంటిని తగులపెట్టారు, అక్రమంగా అరెస్టు చేశారు. కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారు. రమేష్ యాదవ్ మీద దాడి చేసి ఆయన పైనే కేసు పెట్టారు. బలహీన వర్గాలన్నీ కలిసి బలమైన దెబ్బ కొడతాం.
విశాఖలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతుపై సీదిరి గట్టిగా ప్రశ్నించారు. అందుకే ఆయనపై కక్ష కట్టి అరెస్టు చేశారు. గుంటూరు, కందుకూరులో చంద్రబాబు సభలో జనం చనిపోయారు. మరి చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదు?. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యే పిల్లలు తప్పు చేస్తే వారిని ఎందుకు అరెస్టు చేయలేదు?. పోలీసుల తీరు చూసి ప్రజలే కాదు, పారిశ్రామిక వేత్తలు కూడా భయపడుతున్నారు. అందుకే పెట్టుబడులు పెట్టటానికి కూడా ఎవరూ ముందుకు రావటం లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు.


