నిర్మలవాణి
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీగురవే నమః
...గురు మంత్రంలో చివరి మంత్రం చెప్పేటప్పుడు
‘గురుః సాక్షాత్ పరబ్రహ్మ’ అని అంటారు. అంటే పరబ్రహ్మయే. మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆ శక్తియే మీ ద్వారా ప్రవహిస్తుంది. కనుక అప్పుడు మీరు పరబ్రహ్మ సాధనంగా మారతారు. మీలో స్వయం గురుతత్వ స్థితిని పెంపొందించుకుంటారు.
ఆదిగురువు అవతరమూర్తులందరూ పంచభూతాలపై ఆధిపత్యం కలిగివుంటారు. వారి ద్వారానే బ్రహ్మ వ్యక్తీకరింపడ్డాడు. ఈ ఆదిగురువు ముగ్గురి ద్వారా అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా వ్యక్తీకరింపబడ్డాడు. ఆయన నాలుగు తలలుగల బ్రహ్మలా జన్మించాడు. మనకు పైకి కనబడే ఈ ముగ్గురు కాకుండా నాల్గవ తల శ్రీ గణేశునిది. ఈ విధంగా దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గణేశ రూపంతో, శక్తులతో ఆది గురువయ్యాడు. గురువు కు వుండాల్సిన ఉత్తమ గుణాలు చాలా వున్నాయి. ఆ గుణాలన్నీ గురువులో వ్యక్తమవ్వాలి. ఈ గుణాలకు యజమాని శివుడు. శివ తత్వం అంటే గురుతత్వమే. అలా ఈ గుణాలన్నీ మీ ద్వారా ప్రస్పుటమవ్వాలి, ప్రకాశించాలి.
అప్పుడు మీరు విరాటశక్తిలో ఒకరైపోతారు. ఇతరులకు ధర్మాన్ని బోధించగలుగుతారు. ఆత్మగా మారుతారు. ఆ విధంగా నిజమైన గురువుగా మారుతారు.
ఒక గురువుగా మీరు మీ నిత్య జీవితంలో అనేక విషయాలకు అతీతంగా వుండగలగాలి. అదే మీరు చేరుకోవలసిన ఉన్నత స్థితి.
‘‘యధా రాజా తధా ప్రజా’’ అన్నట్లుగా మీరు స్వయం గురువుగా తయారయిన్నప్పుడే ఇతరులకు గురువుగా మారి ఓ ప్రతీకగా, ఆదర్శ్ర΄ాయంగా నిలబడి నడిపించగలరు.. ఇక్కడ మన అర్థం చేసుకోవలసిన విషయమేమంటే – సమాజంలో మనం చూస్తున్న గురువులను, తమను తాము గురువులుగా చెప్పుకునే గురువులు మనకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలుగుతున్నారా అన్నది. తమలో గురు తత్వం లేని గురువు కూడా ఇతరులకు గురువు కావాలనుకుంటారు. తాను స్వయంగురువుగా వ్యక్తీకరింపబడిన వ్యక్తి ఇతరులకు గురువు కావాలని ఎన్నడూ అనుకోడు.
మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మగా రూపొందండి. ఎప్పుడు మీరు ఆత్మగా రూపొందుతారో అప్పుడు మీకు మీరు గురువు కాగలగుతారు. అదే స్వయం గురుతత్వం.
గురువు ప్రప్రధమంగా మనల్ని భగవంతుడినితో అనుసంధాన పరచడానికి ప్రయత్నిస్తాడు. అంటే దానర్థం ఆయన మీ కుండలినీ శక్తిని జాగృత పరిచి, సర్వవ్యాపిత శక్తితో మిమ్మల్ని అనుసంధానం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.
గురువుకి మించిన తత్వం లేదు
గురువును మించిన తపస్సు లేదు
గురువుని మించిన జ్ఞానం లేదు
అటువంటి గురుదేవునికి నమస్కరిస్తున్నాను అని గురుగీత స్తోత్రంలోని ఒక శ్లోకంలో గురువుకి వున్న ఉన్నత స్థాయి గురించి చెప్పారు.
– డాక్టర్ ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులు, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

శ్రీ మాతాజీ నిర్మలాదేవి
నిర్వహణ: డి.వి.ఆర్.


