పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా | Parliament monsoon session 2026 day 4 live updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా

Jul 23 2026 11:15 AM | Updated on Jul 23 2026 3:09 PM

Parliament monsoon session 2026 day 4 live updates

న్యూఢిల్లీ:  సభ్యుల నినాదాలు, ఆందోళనల నడుమ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నాల్గవ రోజు కూడా తీవ్ర ఉద్రిక్తతల మధ్యే సాగాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు రేపటికి(శుక్రవారం) వాయిదా పడ్డాయి.  నీట్‌ పేపర్‌ లీక్‌ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. దాంతో ఉభయ సభల్లో తీవ్ర గందర గోళం నెలకొనడంతో రేపటికి వాయిదా వేశారు. 

కాగా, నీట్‌ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం, అన్ని రాజకీయ పక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ వెల్లడించారు. అయితే, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ చర్చకు అనేక నిబంధనలను ముడిపెట్టిందని ఆయన ఆరోపించారు. ‘ఈ సున్నితమైన అంశంపై కాంగ్రెస్ అనవసర నిబంధనలు విధిస్తూ రాజకీయం చేస్తోంది. ప్రతిపక్షాలు అసలు ఈ అంశంపై చర్చ జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నాయని స్పష్టమవుతోంది.’ అని ఆరోపించారు. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఉభయ సభల కార్యకలాపాలు తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.  ఆపై లోక్‌సభ తిరిగి 12 గంటలకు ప్రారంభంకాగానే, మళ్లీ విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభను స్పీకర్‌ మధ్యా‍హ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన సభల్లో అదే పరిస్థితి నెలకొనడంతో రేపటికి వాయిదా వేయక తప్పలేదు.  

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభల్లోనూ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. నీట్ పేపర్ లీక్ ఉదంతం, విద్యార్థులపై పోలీసుల చర్యలు, విద్యా రంగంలో సంస్కరణలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ అంశంపై ఉభయసభల్లో వాయిదా తీర్మానాల ద్వారా చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యసభలో అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేసి నీట్ పేపర్ లీక్, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్యలు, విద్యాసంస్కరణలపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా గురువారం నోటీసు సమర్పించారు.

మరోవైపు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఇదే అంశంపై డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కూడా రాజ్యసభలో రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, ప్రభుత్వ స్పందనపై చర్చించాలని ఆయన కోరారు. నీట్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజ్యసభలో రూల్ 267 కింద, లోక్‌సభలో రూల్ 56 కింద చర్చ జరగాలని పట్టుబడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement