లో​క్‌ సభ మధ్యాహ్నం 2 వరకు వాయిదా | Parliament LIVE Opposition seeks NEET discussion today | Sakshi
Sakshi News home page

లో​క్‌ సభ మధ్యాహ్నం 2 వరకు వాయిదా

Jul 21 2026 10:00 AM | Updated on Jul 21 2026 12:49 PM

Parliament LIVE Opposition seeks NEET discussion today

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల రెండవ రోజు (మంగళవారం) లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగడంతో, స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేయక తప్పలేదు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదాపడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సభలో గందరగోళం కొనసాగుతోంది. మంగళవారం లోక్‌సభలో విపక్ష సభ్యుల ఆందోళనలు, నినాదాల హోరు మధ్య సభ రెండుసార్లు వాయిదా పడింది. సజావుగా సభను నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా, ప్రిసైడింగ్ అధికారి సంధ్యా రాయ్ చేసిన విజ్ఞప్తులను విపక్షాలు పట్టించుకోలేదు. సభ్యులు శాంతియుతంగా చర్చల్లో పాల్గొనాలని కోరినా, విపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందే ‘ఇండియా’ కూటమి నేతలు సమావేశమై వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ  సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష పత్రాల లీకేజీలు, జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనలు తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు నిరసనలు వ్యక్తంచేశాయి. 

నీట్ పేపర్ లీకేజీ అంశంపై  ప్రతిపక్షాలు సభలో నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపాయి. పార్లమెంట్ వెలుపల వేలాది మంది నిరసనకారులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మార్చ్ నిర్వహిస్తున్నారు. నిన్న (సోమవారం) సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల గరిష్ట సంఖ్యను 33 నుండి 37కి పెంచేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు, ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ప్రతినిధులు సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నినాదాలు, హంగామా కొనసాగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. నిరసనకారులపై పోలీసుల వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. పలువురు ఎంపీలు కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement