నీట్పై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా వెనక్కి తగ్గని విపక్షాలు
విద్యా శాఖమంత్రి రాజీనామా చేశాకే చర్చించాలంటూ ఆందోళన
నల్ల దుస్తులతో సభకు హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్ సమావేశాల మూడో రోజూ ప్రతిష్టంభన నెలకొంది. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై పోలీసుల దాష్టీకం, ప్రధాన్ రాజీనామా డిమాండ్ అంశాలపై అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలతో సభా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రభుత్వం నీట్ అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, ముందుగా ప్రధాన్ రాజీనామా చేయా లని ప్రతిపక్షం పట్టుబట్టడంతో లోక్సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.
ఉభయ సభల ఆరంభానికి ముందే నీట్పై చర్చ కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, హిబి ఈడెన్ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. నల్ల దుస్తులు ధరించి లోక్సభకు హాజరైన విపక్షాల ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగడంతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి మొదలయ్యాక కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు.
నీట్పై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ‘విద్యార్థుల భవిష్యత్తు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. నీట్ పేపర్ లీక్, పరీక్షల పారదర్శకత, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్రంగా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’అని తెలిపారు.
చర్చ ఏ తేదీన నిర్వహించాలనేది స్పీకర్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సంప్రదించి నిర్ణయిస్తామని చెప్పారు. దీనిపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ జోక్యం చేసుకున్నారు. విద్యార్థుల లాఠీచార్జ్ ఉదంతంపై ప్రధాని సభలో ఎందుకు ప్రకటన చేయలేదు? అని నిలదీశారు. ‘‘ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తీరా చర్చిద్దామంటే ముందుగా ధర్మేంద్ర మంత్రి పదవికి రాజీనామాచేయాలనే కొత్త షరతు పెడుతున్నారు. అమలుసాధ్యంకాని షరతులు పెట్టి చర్చకు కాంగ్రెస్ మోకాలడ్డుతోంది’’అని రిజిజు విమర్శించారు.


