వాంగ్చుక్ కొత్త షరతులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమీపంలో రణరంగంగా మారిన విద్యార్థుల ఉద్యమంలో పోలీసులతో ప్రతిఘటనకు దిగిన ఉద్యమకారులైన విద్యార్థులు, సీజేపీ మద్దతుదారులను కేసుల పేరిట వేధించకుండా వదిలేస్తే తాను ఆస్పత్రిలో నిరాహార దీక్షను విరమిస్తానని సోనమ్ వాంగ్చుక్ బుధవారం ప్రకటించారు. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ను మంగళవారం రాత్రి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు.
ఐసీయూలో ఉన్న వాంగ్చుక్ను మంత్రులు యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. గంటపాటు మంత్రులు వాంగ్చుక్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల చర్చల వివరాలు వెల్లడికాలేదు. మంత్రులు పరామర్శించాక వాంగ్చుక్ బుధవారం ఒక లేఖ రాశారు. లేఖలో వాంగ్చుక్ ప్రస్తావించిన షరతులు...
1. నీట్ పేపర్ లీకేజీ కారణంగా మనస్తాపంతో చనిపోయిన నీట్ పరీక్షార్థుల కుటుంబాలకు భారీ నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించాలి
2. పరీక్షల్లో అక్రమాలపై పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరగాలి
3. విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
4. ఉద్యమంలో పాల్గొన్న సీజేపీ మద్దతుదారులపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయకూడదు
ఉద్యమకారులను ఒప్పిస్తా
‘‘ఈ షరతులకు ప్రభుత్వం ఒప్పుకుంటే దీక్షాస్థలిని వీడాలని, ప్రభుత్వప్రతినిధులతో చర్చలకు ముందుకు రావాలని నిరసనకారులను ఒప్పిస్తా. ఆ మేరకు వాళ్లతో మాట్లాడతా. నిరాహార దీక్ష ఆపేయాలని నన్ను ఇప్పటికే 65 మంది ఎంపీలు స్వయంగా, లేఖల రూపంలో కోరారు. నేనింకా ఎంతో దేశసేవ చేయాల్సి ఉంది. అందుకోసమైనా బతుకుతా. విద్యారంగానికి సేవచేసేందుకు విద్యార్థుల కోసం తిరిగి నా వృత్తిజీవితంలోకి వెళ్తా. అయితే ఎవరి కోసమైతే ఈ ఉద్యమం, దీక్ష ఆరంభించానో వాళ్ల త్యాగాలను పణంగా పెట్టి మధ్యలోనే దీక్షను విరమించలేను’’అని వాంగ్చుక్ అన్నారు.


