ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన ఆయన, విద్యార్థుల సమస్యలను చట్టం, వ్యవస్థ అంశంగా కాకుండా సామాజిక సమస్యగా చూడాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు.
జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సీజేపీ నిర్వహించిన ‘చలో సంసద్’ ర్యాలీ.. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకులు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి డిమాండ్లతో జరిగింది. అనంతరం ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ద్వారా నిరసనకారులను చెదరగొట్టారు.
ఈ నేపథ్యంలో స్పందించిన అన్నా హజారే తన లేఖలో ప్రజాస్వామ్యంలో హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అవసరం లేని బలప్రయోగానికి స్థానం లేదని పేర్కొన్నారు. పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగం వంటి అంశాలపై యువత వ్యక్తం చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించాలని కోరారు. నీట్ (NEET) పరీక్ష వివాదాన్ని ప్రస్తావించిన హజారే, ప్రభుత్వ వ్యవస్థలో లోపాలు బయటపడినప్పుడు కేవలం కింది స్థాయి ఉద్యోగులపైనే బాధ్యత మోపడం సరికాదన్నారు. సంబంధిత శాఖకు రాజకీయ బాధ్యత వహించే మంత్రులు కూడా జవాబుదారీతనం చూపాలని సూచించారు. అవసరమైతే శాఖా వైఫల్యాలపై మంత్రిని తప్పించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినదని, బాధ్యతాయుత పాలనకు అది సంకేతంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
‘ప్రజాస్వామ్యంలో ఘర్షణ కంటే సంభాషణే ఉత్తమ మార్గం. ప్రజల గొంతును ప్రతిపక్ష స్వరంగా మాత్రమే చూడకూడదు. విభేదాలు సహజం. వాటిని చర్చలు, పరస్పర గౌరవంతో పరిష్కరించాలి’ అని హజారే లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సీజేపీ ఆందోళనల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. మరోవైపు లడఖ్కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ నిరాహార దీక్ష విషయంలో కూడా ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలని అన్నా హజారే మరోసారి విజ్ఞప్తి చేశారు.


