ఢిల్లీ నిరసనకారులకు ‘ఫుడ్’ డెలివరీ యాప్లతో సంఘీభావం
నగరం నుంచి జంతర్ మంతర్ సమీప రెస్టారెంట్లలో ఆర్డర్లు
సాక్షి, హైదరాబాద్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరసనకు దిగిన ఆందోళనకారులకు హైదరాబాదీలు ఫుడ్ సపోర్ట్ అందిస్తున్నారు. తమ దాతృత్వంతో సంఘీభావం చాటుతున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్కతా తదితర నగరాల యువత బాటలోనే హైదరాబాదీలు కూడా ఇక్కడినుంచే స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీప రెస్టారెంట్లకు ఆర్డర్లు ఇస్తున్నారు.
ఆ పదార్థాలు అక్కడి నిరసనకారులకు అందేలా చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక స్క్రీన్ షాట్లలో ‘ప్లీజ్ డి్రస్టిబ్యూట్ దిస్ ఫుడ్ టు ఎనీ వన్ హంగ్రీ ఎట్ జంతర్ మంతర్’ వంటి సందేశంతో ఆర్డర్లు ఇవ్వడం కనిపిస్తోంది. ఇలాంటివారిలో ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన వినియోగదారులు ఉన్నట్లు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆన్లైన్ సేవలను వేగంగా స్వీకరించే నగరంగా పేరొందిన హైదరాబాద్ నుంచి కూడా ఈ తరహా సంఘీభావం వ్యక్తమవడం చర్చనీయాంశమైంది.
మున్ముందు నగరంలోనూ...!
‘‘డిజిటల్ యుగంలో నిరసనలకు మద్దతు తెలిపే విధానం కూడా మారిపోతోంది. ఒక ఉద్యమానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కేవలం మొబైల్ ఫోన్తో కొన్ని నిమిషాల్లో భోజనం పంపగలగడం సాంకేతికత తీసుకొచి్చన సామాజిక అనుసంధానత’’ అని సామాజిక విశ్లేషకులు అభివరి్ణస్తున్నారు. డబ్బు విరాళం ఇవ్వకుండా, నేరుగా అవసరమైన సమయంలో ఆహారం అందించడం అంటే నిరసనకారులకు ప్రత్యక్ష సహకారం అందజేసినట్లేనని పేర్కొంటున్నారు. మున్ముందు... మన నగరంలో ఏదైనా భారీ ఆందోళన కొన్ని రోజుల పాటు సాగితే ఇదే విధానం (ఆన్లైన్లో ఆందోళనకారులకు ఫుడ్ డెలివరీ ఆర్డర్) అవలంబించే అవకాశం లేకపోలేదని వివరిస్తున్నారు.


