పేపర్‌ లీకులకు చెక్‌! కేంద్రం సంచలన నిర్ణయం | NEET Paper Leak Controversy, PM Modi Announces Fast Track Courts For Swift Action, Says Youth Future Comes First | Sakshi
Sakshi News home page

పేపర్‌ లీకులకు చెక్‌! కేంద్రం సంచలన నిర్ణయం

Jul 23 2026 9:25 AM | Updated on Jul 23 2026 9:56 AM

Paper Leak Crackdown: PM Modi Announces Fast Track Courts for Swift Action

పేపర్‌ లీకేజీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పవిత్రతను కాపాడేందుకు.. అక్రమాలకు పాల్పడే వారికి త్వరగతిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే తమకు ఏదీ ముఖ్యమైనది కాదని స్పష్టం చేశారు.

ఈ మేరకు గురువారం ఉదయం ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. పేపర్‌ లీకేజీలకు పాల్పడే వ్యక్తులపై కఠిన, వేగవంతమైన శిక్షలు పడేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, విభాగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

“యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదు. పేపర్‌ లీకులకు పాల్పడి యువత భవిష్యత్తును దెబ్బతీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు
పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పేపర్‌ లీకులు, పరీక్షల్లో అక్రమాలు లక్షలాది మంది విద్యార్థుల శ్రమను దెబ్బతీస్తాయని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నీట్‌ వివాదం వేళ ప్రధాని ప్రకటన
నీట్‌–యూజీ పరీక్షలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న సమయంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్షల నిర్వహణపై విశ్వసనీయతను పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్న వేళ.. కేంద్రం వేగవంతమైన న్యాయ ప్రక్రియపై దృష్టి సారించింది.

ఇటీవల పేపర్‌ లీకేజీ కేసుల్లో పలువురిపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇకపై ఇలాంటి వ్యవహారాల్లో విచారణ, శిక్షల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయ వ్యవస్థను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

“యువత భవిష్యత్తుతో ఆటలాడితే క్షమించం”
పేపర్‌ లీకుల వ్యవహారాన్ని మహా పాపంగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నాలను సహించబోమని ఇదివరకే స్పష్టం చేశారు. పరీక్షల వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వం నిరంతరం చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే పేపర్‌ లీకేజీ అంశంపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం.. నీట్‌ నిరసనకారులను శాంతింపజేస్తుందా? అనేది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement