న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్-యూజీ పేపర్ లీక్ ఆందోళనల సందర్భంగా సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు లాఠీలతో నిరసనకారులపై దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విధుల నిర్వహణకు వచ్చే సిబ్బంది తప్పనిసరిగా పోలీసు యూనిఫామ్లోనే హాజరుకావాలని పోలీసు ప్రధాన కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూలై 20న పార్లమెంట్ ముట్టడికి తలపెట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. కొక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్-యూజీ పేపర్ లీక్ అంశంపై శాంతియుతంగా నిరసన తెలపాలని తలపెట్టిన ఈ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన వారు గాయపడ్డారు.
Jantar Mantar: men in civvies walking the street with sticks. Students ask who they are. No answer. Riot police standing nearby.
Police? Another agency? Someone private? That’s not a detail you shrug off. This needs a real investigation, not silence. pic.twitter.com/GX8vEnehdt— Dilip Ray 🇮🇳 (@dilipray) July 21, 2026
సివిల్ డ్రెస్సుల్లోని వ్యక్తులపై తీవ్ర విమర్శలు
సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వీడియోలలో సాధారణ దుస్తులు ధరించి, పోలీసు లాఠీలు పట్టుకున్న కొందరు వ్యక్తులు నిరసనకారులపై హింసకు పాల్పడినట్లు స్పష్టంగా కనిపించింది. మరికొన్ని వీడియోలలో యూనిఫామ్లో ఉన్న కొందరు సిబ్బంది ఎలాంటి నేమ్ట్యాగ్లు (పేరు గుర్తులు) ధరించలేదని వెల్లడైంది. గుంపును చెదరగొట్టే చర్యల్లో పాల్గొన్న ఆ వ్యక్తులు ఎవరనే దానిపై తీవ్ర ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో ఉన్నవారు పోలీసు విధులను నిర్వర్తించడానికి చట్టపరమైన అనుమతి ఉందా అనే చర్చకు ఇది దారితీసింది. మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి అన్ని యూనిట్లకు అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. జంతర్ మంతర్ వద్ద మోహరించిన అధికారులెవరూ సాధారణ దుస్తుల్లో కాకుండా పోలీసు యూనిఫామ్లోనే విధులకు హాజరయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. అయితే సివిల్ డ్రెస్సుల్లో ఉన్న వ్యక్తులు పోలీసు లాఠీలను ఉపయోగించడంపై వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు.


