నీట్‌ను కంగాళి చేసి .. బిడ్డల్ని ఫారిన్‌లో చదివిస్తావా? | Amid NEET Controversy, Social Media Users Call For Dharmendra Pradhan Resignation Over Alleged Exam Irregularities | Sakshi
Sakshi News home page

నీట్‌ను కంగాళి చేసి .. బిడ్డల్ని ఫారిన్‌లో చదివిస్తావా?

Jul 23 2026 9:15 AM | Updated on Jul 23 2026 10:01 AM

NEET Controversy Explodes: Social Media Targets Dharmendra Pradhan, Questions Accountability

నీట్‌–యూజీ పరీక్ష నిర్వహణపై నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. పేపర్‌ లీకేజీ ఆరోపణలు, పరీక్ష పారదర్శకతపై ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన నీట్‌ వంటి కీలక పరీక్షపై మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. కాబట్టి నైతిక బాథ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.  ఈ తరుణంలో..

నీట్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. సోషల్‌ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘‘సామాన్య విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే.. పరీక్ష వ్యవస్థలో ఇలాంటి లోపాలు ఎలా వస్తాయి?’’ అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.

‘నీట్‌ను కంగాళి చేసి..’ అంటూ విమర్శలు
నీట్‌ వివాదంపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్‌ మీడియా వినియోగదారులు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్‌ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. నీట్‌ కోసం పోరాడుతున్న దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.

కుమార్తె సోషల్‌ మీడియా ఖాతాపై చర్చ
సోషల్‌ మీడియాలో విమర్శలు పెరగడంతో ధర్మేంద్ర ప్రధాన్‌ కుమార్తె నైమిషా ప్రధాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను డీయాక్టివేట్‌ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నిర్ణయానికి కారణం ఇదేనని ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొందరు నెటిజన్లు దీనిని నీట్‌ వివాదం నేపథ్యంలో వచ్చిన ఒత్తిడిగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.

విమర్శలు ఎటు వరకు?
ప్రజా విధానాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని కొందరు అంటున్నారు. అయితే రాజకీయ విమర్శలు కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల వరకు వెళ్లకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. నీట్‌ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పరీక్షా ప్రక్రియలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

రాజకీయ రంగు పులుముకున్న నీట్‌ వివాదం
నీట్‌ పరీక్ష వ్యవహారం ఇప్పుడు కేవలం విద్యార్థుల సమస్యగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు సోషల్‌ మీడియాలో విమర్శల వెల్లువ.. ఇంకోవైపు రాజకీయ ఆరోపణలు.. ఇలా నీట్‌ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పరీక్ష వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement