లండన్: కోవిడ్-19 మహమ్మారి, 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసి, హెచ్చరించిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉందంటూ మరో హెచ్చరిక చేశారు. గతంలో ఆయన చేసిన హెచ్చరికలను కొందరు ‘భయపెట్టే ధోరణి’గా కొట్టిపారేసినప్పటికీ, అవి నిజమయ్యాయి. అయితే ఇప్పుడు రాబర్ట్ పెస్టన్ చెప్పిన ఏఐ ముప్పుపై ప్రపంచమంతా ఆలోచిస్తోంది.
పెస్టన్ తన కొత్త పుస్తకం ‘ది కిల్ స్విచ్’లో ఏఐ వల్ల భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఒకటి రెండు సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ఏఐ కోసం డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల కోసం అపారమైన పెట్టుబడులు తరలివెళ్తుండటమే దీనికి కారణమని ఆయన విశ్లేషించారు. ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేకుండా పోతే, ప్రభుత్వాలు ఆదాయపు పన్ను లేకుండానే ప్రజా సేవలను నిర్వహించే మార్గాలపై ఆలోచించాలని ఆయన సూచించారు.
గతంలో బ్యాంకింగ్ రంగం తీరు వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని 2007లోనే హెచ్చరించినప్పుడు తనపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు. అలాగే, 2009-2010 సమయంలో చైనాలో పర్యటించిన అనుభవంతో, 2019 చివరిలో ఊహించని కొత్త వైరస్ (కోవిడ్-19) వెలుగుచూసినప్పుడు ప్రభుత్వ వర్గాలను అప్రమత్తం చేశానని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: నటుడు ప్రకాష్ రాజ్కు భూ ఆక్రమణల నోటీసు


