రహదారి భద్రతను పటిష్టం చేయడం, నిబంధనలను తరచూ ఉల్లంఘించే వాహనదారులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వారికి తక్షణ డిజిటల్ హెచ్చరికలు పంపడంతో పాటు పదేపదే చేసే ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్తగా డిజిటల్ వార్నింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.
సాంకేతికతతో రియల్-టైమ్ పర్యవేక్షణ
ప్రస్తుతం అమలులో ఉన్న ఈ-చలాన్ వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ప్రతిపాదిత వ్యవస్థకు అనుసంధానించనున్నారు. వాహనదారులు సిగ్నల్ జంపింగ్, అతివేగం, హెల్మెట్/సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ లేదా డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడితే.. డిజిటల్ నెట్వర్క్ ద్వారా వెంటనే సదరు వాహనదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్కు అలర్ట్/వార్నింగ్ మెసేజ్ వెళ్తుంది.
డీమెరిట్ పాయింట్ల విధానం.. లైసెన్స్ రద్దు
ఈ ప్రతిపాదనలో అత్యంత కీలకమైన అంశం పాయింట్ల ఆధారిత శిక్షా విధానం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విధానంలో.. ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘనకు ఒక ప్రత్యేక డిజిటల్ రికార్డు ఉంటుంది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నిర్దేశిత పరిమితికి మించి (ఉదాహరణకు 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు) ఉల్లంఘనలు నమోదవ్వడం లేదా డీమెరిట్ పాయింట్లు పరిమితి దాటితే ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) నేరుగా జోక్యం చేసుకుంటుంది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా రద్దు చేసే అధికారం రవాణా శాఖకు ఉంటుంది. అంతేకాకుండా లైసెన్స్ పునరుద్ధరణకు ముందు వాహనదారులు విధిగా డ్రైవింగ్ రీ-టెస్ట్, భద్రతా శిక్షణ పూర్తి చేయాల్సి రావచ్చు.
మారనున్న వాహనదారుల ప్రవర్తన
సాధారణంగా జరిమానా చెల్లించి మళ్లీ పాత తప్పులే చేసే ధోరణి చాలామందిలో కనిపిస్తుంటుంది. అయితే, కొత్త డిజిటల్ హెచ్చరిక వ్యవస్థ ద్వారా కేవలం జరిమానా మాత్రమే గాక లైసెన్స్ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది వాహనదారుల్లో క్రమశిక్షణను, జవాబుదారీతనాన్ని పెంచుతుంది. అలాగే, మనుషుల ప్రమేయం తక్కువగా ఉండి సాంకేతికత ఆధారంగా నిర్ణయాలు జరగడం వల్ల అవినీతికి తావులేకుండా పారదర్శకత పెరుగుతుందని కొందరు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: పండగలు షురూ.. వంటనూనెల దిగుమతుల జోరు


