టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ మరోసారి భారీ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఖర్గ్ ద్వీపం ఆక్రమించడానికి వాషింగ్టన్ యత్నిస్తే అక్కడికి వచ్చిన సైనికులు ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ట్రంప్ ఖర్గ్ ద్వీపంపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పర్షియన్ గల్ఫ్లోని, బుషెహర్ ప్రావిన్స్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ద్వీపం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం ఆ దేశంలోని అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇంధన ఆస్తులలో ఇది ప్రధానమైనది. ఇరాన్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ ఒక్క ద్వీపం నుంచే సరఫరా అవుతుంది.
దీంతో దీనిని ఎలాగైనా ఆక్రమించాలని ట్రంప్ తొలినుంచి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అవసరమైతే ఖర్గ్ ద్వీపాన్ని తమ నియంత్రణలోకి తీసుకునేలా పరిమిత భూతల దాడి చేసే ఆలోచన ఉందని మాట్లాడారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది.
విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ "ఖర్గ్ ద్వీపంపై భూతల దాడి చేయడానికి అమెరికా సైనికులు వస్తే... వారిని 'స్వాగతించడానికి' మా సైన్యం, మా ప్రజలు నిమిషాలు లెక్కిస్తూ, సిద్ధంగా ఎదురుచూస్తున్నారు." అని అన్నారు.
మళ్లీ ఉద్రిక్తత
ప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా, యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమై, మళ్లీ భారీ ఎత్తున దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి.


