జర్మనీ తర్వాత భారత్‌.. ప్రపంచం చూసేలా కొత్త తరం రైలు.. | India first hydrogen train route technology, Here's The Details | Sakshi
Sakshi News home page

జర్మనీ తర్వాత భారత్‌.. ప్రపంచం చూసేలా కొత్త తరం రైలు..

Jul 9 2026 11:07 AM | Updated on Jul 9 2026 11:13 AM

India first hydrogen train route technology, Here's The Details

భారత రైల్వేలో ఇక కొత్త శకం మొదలుకానుంది. ఇన్నాళ్లు నల్లటి పొగలు కక్కుతూ పరుగులు పెట్టిన డీజిల్ ఇంజిన్ల స్థానంలో.. పర్యావరణానికి మిత్రంగా నిలిచే ఓ కొత్త తరం రైలు భారత్‌లో అడుగుపెట్టబోతోంది. అదే హైడ్రోజన్ రైలు. కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ పరుగులు పెట్టే ఈ రైలు భారత రైల్వే రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలకనుంది.

భారతీయ రైల్వేలు గ్రీన్ ఎనర్జీ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును సిద్ధం చేస్తున్నాయి. హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలును తొలిదశలో పరీక్షించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ రైలు పనిచేసే విధానం కూడా ఆసక్తికరమే. సాధారణ రైళ్లలా డీజిల్ దహనం కాదు.. హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా ఫ్యూయల్ సెల్‌లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తితో రైలు కదులుతుంది. ఈ ప్రక్రియలో వెలువడేది ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే. అంటే పొగ లేదు.. కాలుష్యం తక్కువ.

భారత్ రూపొందిస్తున్న ఈ హైడ్రోజన్ రైలు సాధారణ రైలు కాదు. ఇది 10 కోచ్‌లతో, రెండు డ్రైవింగ్ పవర్ కార్లతో రూపొందుతోంది. సుమారు 2,400 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో భారత బ్రాడ్‌గేజ్ మార్గాల్లో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలవనుంది. ఈ రైలు వెనుక భారత రైల్వే పరిశోధన సంస్థ RDSO కీలక పాత్ర పోషిస్తోంది. హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కోసం హర్యానాలోని జింద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో ఈ రైలు గంటకు సుమారు 75 కిలోమీటర్ల వేగంతో నడిపేలా ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఈ సాంకేతికత భారత్‌కు కొత్త కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణం ప్రారంభించాయి. హైడ్రోజన్ రైలును వాణిజ్య ప్రయాణికుల సేవల్లో తొలిసారిగా ఉపయోగించిన దేశం జర్మనీ.

 

2022లో జర్మనీ Alstom Coradia iLint పేరుతో ప్రపంచంలోని తొలి వాణిజ్య హైడ్రోజన్ ప్యాసింజర్ రైలును ప్రారంభించింది. డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా ఈ రైలును ఉపయోగించారు. పొగకు బదులుగా నీటి ఆవిరితో ప్రయాణం సాగించడం దీని ప్రత్యేకత. జపాన్, చైనా, అమెరికా కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికతపై ప్రయోగాలు చేస్తున్నాయి. జపాన్‌లో East Japan Railway Company హైడ్రోజన్ ఆధారిత రైళ్లను పరీక్షించింది. చైనా పట్టణ రవాణా, తక్కువ దూర మార్గాల కోసం ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. అమెరికాలో కూడా డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ రవాణాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

హైడ్రోజన్ రైళ్ల వల్ల ముఖ్యంగా విద్యుదీకరణ చేయడం కష్టమైన మార్గాల్లో భారీ ప్రయోజనం ఉంటుంది. పర్వత ప్రాంతాలు, తక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో డీజిల్ స్థానాన్ని ఇవి భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రైళ్ల ప్రయాణం అంత సులభం కాదు. హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు, నిల్వ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక స్టేషన్ల నిర్మాణం వంటి సవాళ్లు ఉన్నాయి. కానీ ఒకసారి ఈ వ్యవస్థ విస్తృతంగా అందుబాటులోకి వస్తే రైల్వే రంగంలో కాలుష్యాన్ని తగ్గించే అతిపెద్ద మార్పుగా నిలిచే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో భారత రైల్వే పట్టాలపై కనిపించబోయేది కేవలం మరో రైలు కాదు.. పర్యావరణాన్ని కాపాడుతూ పరుగులు పెట్టే కొత్త భారతానికి ప్రతీకగా నిలిచే హైడ్రోజన్ రైలు.

అసలు లక్ష్యం ఏంటి?
భారత రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇప్పటివరకు డీజిల్ లోకోమోటివ్‌లు నడిచే మార్గాల్లో ఇంధన ఖర్చు, కాలుష్యం రెండూ పెద్ద సవాళ్లుగా ఉన్నాయి. వీటిని తగ్గించేందుకు “Hydrogen for Heritage” వంటి ప్రాజెక్టుల కింద హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

హైడ్రోజన్ రైళ్లు ముఖ్యంగా..

  • విద్యుదీకరణ లేని రైల్వే మార్గాల

  • పర్వత ప్రాంతాలు

  • పర్యాటక ప్రాధాన్యత ఉన్న మార్గాలు

  • తక్కువ రద్దీ ఉన్న రూట్లు.. వంటి ప్రాంతాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది.

హెరిటేజ్ రూట్లకు ప్రాధాన్యం ఎందుకు?
భారత రైల్వేలు కొన్ని చారిత్రక రూట్లలో డీజిల్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నాయి. ఈ మార్గాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ రైళ్లను ఉపయోగించే ఆలోచన ఉంది. ఉదాహరణకు కొండ ప్రాంత రైల్వే మార్గాల్లో పర్యావరణ పరిరక్షణకు ఇది ఉపయోగపడుతుంది. ఈ రైలులో ఒకేసారి సుమారు 2,500 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఒకసారి హైడ్రోజన్ నింపితే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 27 హైడ్రోజన్ సిలిండర్లు, హైడ్రోజన్ లీకేజ్ డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటిని నిరంతరం తనిఖీ చేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement