ముంబై: ముంబై విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఒకే రన్వేపై రెండు విమానాలు ఎదురెదురుగా రావడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండ్ అయి రన్వేను ఖాళీ చేయకముందే, ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అదే రన్వేపై టేకాఫ్కు సిద్ధమైంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సిలిగురి నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (AIX1547 - బోయింగ్ 737 మ్యాక్స్ 8) రన్వేపై ఉండగానే, ముంబై నుండి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (AI816 - బోయింగ్ 777-300 ER) టేకాఫ్ కోసం వేగంగా ముందుకు కదిలింది. ప్రమాదాన్ని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు తక్షణమే స్పందించి ఎయిర్ ఇండియా పైలట్ను అప్రమత్తం చేశారు. ఏటీసీ ఆదేశాలతో పైలట్ టేకాఫ్ను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
అనంతరం సురక్షితంగా విమానాన్ని బేకు తరలించారు. ప్రామాణిక నిర్వహణ విధానాల ప్రకారం విమానానికి అవసరమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రయాణికులను వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ రెండు విమానాల్లో ఉన్న మొత్తం ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఇది కూడా చదవండి: నిజ్జర్ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా?


