కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, బిధానగర్ మున్సిపల్ కౌన్సిలర్ దేవరాజ్ చక్రవర్తి అరెస్టుతో ఆయన భార్య, ప్రముఖ గాయని, మాజీ ఎమ్మెల్యే అదితి మున్షీ మరోసారి చర్చల్లోకి వచ్చారు. ఆర్థిక అవకతవకలు, ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన కేసులో దేవరాజ్ చక్రవర్తిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పురూలియాలో అరెస్టు చేసింది. ఈ పరిణామంతో భక్తిగీతాల గాయనిగా ప్రస్థానం ప్రారంభించి, ఎమ్మెల్యేగా ఎదిగిన అదితి మున్షీ జీవిత విశేషాలు తెరపైకి వచ్చాయి.
2015లో ప్రముఖ రియాలిటీ షో ‘సరిగమప’ ద్వారా అదితి మున్షీ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కీర్తనలు, భక్తిగీతాల ఆలపన దేవరాజ్ చక్రవర్తిని ఆకట్టుకుంది. తొలుత ఆమె నిరాకరించినప్పటికీ, కుటుంబ సభ్యుల సహకారంతో దేవరాజ్ 2018లో ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా అదితి తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు. రాజకీయాల్లో దేవరాజ్ చక్రవర్తి ప్రభావం పెరగడంతో అదితికి 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజర్హట్-గోపాల్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం లభించింది. ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ఆమె ఎమ్మెల్యేగా చట్టసభలో అడుగుపెట్టారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం భర్త దేవరాజ్ అరెస్టు కావడంతో, రియాలిటీ షో కంటెస్టెంట్ నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన అదితి మున్షీ రాజకీయ ప్రయాణంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.


