ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఆధ్యాత్మిక ఉత్సవం. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవీలకు అంకితమైన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఏటా ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రను శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ఈ ఆధ్యాత్మిక రథ యాత్ర ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి గుండిచా దేవి మందిరం వరకు సాగుతుంది. అలాంటి పరవమ పవిత్రమైన ఈ రథయాత్ర ఎప్పుడు జరగనుందంటే..
ఆ రోజు నుంచి ప్రారంభం..
ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16, గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు జూలై 24న ముగుస్తాయి. చివరి రోజున స్వామివారు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దీనినే బహుదా యాత్ర లేదా తిరుగు రథయాత్ర అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు పూరీ క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది.
ఎందుకింత ప్రాముఖ్యత అంటే..
రథయాత్ర దర్శనానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. "రథంపై ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే సర్వపాపాలు నశించి, మరణానంతరం మోక్షం లభిస్తుంది," అని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ జగన్నాథుడి రథాన్ని లాగే వారికి అక్షయ పుణ్యం లభిస్తుందనేది భక్తుల నమ్మకం.
అలాగే ఆలయానికి రాలేని భక్తులను కలుసుకోవడానికి స్వయంగా స్వామివారే వీధుల్లోకి వస్తారనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో కుల, మత, వర్ణ భేదాలు లేకుండా లక్షలాది మంది భక్తులు పాల్గొని ఈ రథాలను లాగడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
(చదవండి: సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..)


