సాక్షి, ముంబై : ముంబైలో విషాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని నావీ నగర్లోని తమ నివాసంలో ఒక ఇండియన్ నావీ నావికుడు (Navy sailor) తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం వచ్చి మా డెడ్బాడీలను తీసుకెళ్లండి అంటూ తల్లికి పంపిన మెసేజ్తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇండియన్ నావీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది.
పురాన్మల్ శంభులాల్ మెహ్రా (30) అనే నావికుడు, భార్య ఓమా (28), మూడేళ్ల కుమారుడు యష్, ,రెండు నెలల పసిపాప ఇంట్లోనే మృతిచెంది కనిపించారు. ప్రాథమిక వివరాల ప్రకారం, మెహ్రా మొదట కుటుంబ భార్యాబిడ్డలకు విషం ఇచ్చి ఆ తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 14 రాత్రి దాదాపు 11 గంటలకు మెహ్రా తన తల్లికి వాట్సాప్లో "వచ్చి మా మృతదేహాలను తీసుకెళ్లండి" అని సందేశం పంపారు. మరుసటి రోజు ఉదయం తల్లి ఆ సందేశం చూసి కంగారుపడి కుమారుడికి ఫోన్ చేసింది. అటు నుంచి సమాధానం రాకపోవడంతో కంగారు పడిన తండ్రి శంభులాల్ మెహ్రా నావీ కంట్రోల్ రూమ్ను అప్రమత్తం చేశారు.వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది వారి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
భార్య బిడ్డలను హత్య చేయడానికి ముందు మెహ్రా తన మరియు తన భార్య మొబైల్ ఫోన్ల డేటాను ఫార్మాట్ (డిలీట్) చేశాడు. ఈ సంచలనాత్మక ఘటనకు ముందు, మెహ్రా తన , తన భార్య మొబైల్ ఫోన్లను ఫార్మాట్ (డేటా తొలగింపు) చేశాడు. దీంతో అధికారులు అయోమయంలో పడ్డారు.తొలగించిన డేటాను రికవర్ చేయడానికి పోలీసులు సైబర్ నిపుణుల సాయం తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి విషపదార్థం ఇచ్చారో తెలుసుకోవడానికి పోలీసులు మెడికల్, ఫోరెన్సిక్ నివేదికల కోసం వేచి చూస్తున్నారు. అలాగే సహోద్యోగులు, పొరుగువారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.
కుటుంబ కలహాలే కారణమా?
రాజస్థాన్కు చెందిన మెహ్రా తీవ్రమైన కుటుంబ, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని, దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలాగే డిప్రెషన్ సమస్యతో ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని దర్యాప్తులో తేలింది. మృతుల వైద్య, ఫోరెన్సిక్ నివేదికల కోసం వేచి చూస్తున్నారు.
ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం


